<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; ప్రత్యేకం</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?cat=306&#038;feed=rss2" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>&#8220;చిత్ర&#8221;మైన మనిషి &#8211; హంపి</title>
		<link>http://vaakili.com/patrika/?p=16078</link>
		<comments>http://vaakili.com/patrika/?p=16078#comments</comments>
		<pubDate>Sat, 24 Feb 2018 17:41:24 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[అన్వర్]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=16078</guid>
		<description><![CDATA[<p></p> <p>బొమ్మలదేవుందిలే? నాకు తెలీని బొమ్మలా! పేరు ప్రఖ్యాతులదేవుందిలే? ఏ చరిత్రలో నువ్వు మిగిలేవుగనక! డబ్బుదేవుందిలే? కలిమిగలవాని బానిస కొడుకుగా జీవితాంతం సంపాదించుకుందేగా! దాన్నంతా ఇక్కడ ఎవడు లెక్క చేయవచ్చాడు గనక!</p> <p>కానీ ఓ చిత్రకారుడా, నీలోనా నీబయటా నువ్వుగా కనపడే ఒక సౌకుమారత వున్నదే నీలో! నీ రేఖలో, నీ కుంచె చివరి నీలిమలో, దాన్ని మించి నీ బుద్దిలో నీకంటూ ఒక అరుదైన ఆలోచన వున్నదే, దాన్ని వ్యక్తిత్వం అంటాం. అది అందరికీ అబ్బేది కాదు. ఉన్నదందరిదీనూ వ్యక్తిత్వం కాదు. ఈ వ్యక్తిత్వపు అభివ్యక్తి పేరు పేరు హంపి. నేను ఈ తెలుగు జీవితంలో నా తరం చిత్రకారుల్లో చూసిన అరుదయిన ఒక ముగ్ధమూర్తి. రేఖలోనూ, రంగుల్లోనూ, పలుకులోనూ పొందికైన సుకుమారత్వముగల మనిషి.</p> <p>హంపి అపుడపుడు హైద్రాబాద్ మహానగరానికి వచ్చేవాడు- చిత్రకారులు చంద్ర గారిని చూడ్డానికో, మోహాన్ గారిని కలవడానికో, గోపి గారిని పలకరించడానికో. అంతే అదొక్కట్టే పని. మానవుడు ఎలా వచ్చేవాడనుకున్నారు? మెల్లగా హాయిగా పసి పైరు పైని పసి గాలిలా నువ్వుతూ వచ్చేవాడు. ఎలా నడిచేవాడనుకున్నారు? &#8220;విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే” అని పదే పదే లెంపలేసుకుంటూ మెత్తగా నడిచేవాడు. కలవబోయే చిత్రకారులు ఉండేది ఒకటో లేదా నాలుగో ఫ్లోరో కానీ తను మాత్రం బిల్డింగ్ అడుగున చెప్పులు వదిలేవాడు. అందుబాటులో కుళాయి ఉంటే కాళ్ళు కడుక్కునేవాడు. ఏనాడు నేను చూడగా చెప్పుల కాళ్ళతో గురువులని కలిసింది లేదు. శిఖరం ముందు గులకరాయిలా ఒబ్బిడిగా కూచునేవాడు. నవ్విందే తప్పా నోరు విప్పగా చూసిన వారు లేరు, “ఒన్స్ ఏ వైస్ మాన్ సెడ్ నథింగ్” లా. ఎలా వచ్చాడో అలానే మెల్లిగా మర్లేవాడు. చీనియమయిన రేఖ చివరగా గీసే శిరోజపు చివరి అదృశ్యంలా. ఈతను ముగ్ద , సిగ్గరి, మనోహరుడు, మొండి, జ్ఞాని, చదువరి, సంభూతి. మౌనమే ఇతగాడి వ్యాఖ్యానము, ఇతను హంపి, చిత్రకారుడు.</p> <p>నిజమైన కళాకారుడికి తన [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2018/02/hampi.jpg"><img class="alignleft size-medium wp-image-16090" title="hampi" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2018/02/hampi-279x300.jpg" alt="" width="279" height="300" /></a></p>
<p>బొమ్మలదేవుందిలే? నాకు తెలీని బొమ్మలా! పేరు ప్రఖ్యాతులదేవుందిలే? ఏ చరిత్రలో నువ్వు మిగిలేవుగనక! డబ్బుదేవుందిలే? కలిమిగలవాని బానిస కొడుకుగా జీవితాంతం సంపాదించుకుందేగా! దాన్నంతా ఇక్కడ ఎవడు లెక్క చేయవచ్చాడు గనక!</p>
<p>కానీ ఓ చిత్రకారుడా, నీలోనా నీబయటా నువ్వుగా కనపడే ఒక సౌకుమారత వున్నదే నీలో! నీ రేఖలో, నీ కుంచె చివరి నీలిమలో, దాన్ని మించి నీ బుద్దిలో నీకంటూ ఒక అరుదైన ఆలోచన వున్నదే, దాన్ని వ్యక్తిత్వం అంటాం. అది అందరికీ అబ్బేది కాదు. ఉన్నదందరిదీనూ వ్యక్తిత్వం కాదు. ఈ వ్యక్తిత్వపు అభివ్యక్తి పేరు పేరు హంపి. నేను ఈ తెలుగు జీవితంలో నా తరం చిత్రకారుల్లో చూసిన అరుదయిన ఒక ముగ్ధమూర్తి. రేఖలోనూ, రంగుల్లోనూ, పలుకులోనూ పొందికైన సుకుమారత్వముగల మనిషి.</p>
<p>హంపి అపుడపుడు హైద్రాబాద్ మహానగరానికి వచ్చేవాడు- చిత్రకారులు చంద్ర గారిని చూడ్డానికో, మోహాన్ గారిని కలవడానికో, గోపి గారిని పలకరించడానికో. అంతే అదొక్కట్టే పని. మానవుడు ఎలా వచ్చేవాడనుకున్నారు? మెల్లగా హాయిగా పసి పైరు పైని పసి గాలిలా నువ్వుతూ వచ్చేవాడు. ఎలా నడిచేవాడనుకున్నారు? &#8220;విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే” అని పదే పదే లెంపలేసుకుంటూ మెత్తగా నడిచేవాడు. కలవబోయే చిత్రకారులు ఉండేది ఒకటో లేదా నాలుగో ఫ్లోరో కానీ తను మాత్రం బిల్డింగ్ అడుగున చెప్పులు వదిలేవాడు. అందుబాటులో కుళాయి ఉంటే కాళ్ళు కడుక్కునేవాడు. ఏనాడు నేను చూడగా చెప్పుల కాళ్ళతో గురువులని కలిసింది లేదు. శిఖరం ముందు గులకరాయిలా ఒబ్బిడిగా కూచునేవాడు. నవ్విందే తప్పా నోరు విప్పగా చూసిన వారు లేరు, “ఒన్స్ ఏ వైస్ మాన్ సెడ్ నథింగ్” లా. ఎలా వచ్చాడో అలానే మెల్లిగా మర్లేవాడు. చీనియమయిన రేఖ చివరగా గీసే శిరోజపు చివరి అదృశ్యంలా. ఈతను ముగ్ద , సిగ్గరి, మనోహరుడు, మొండి, జ్ఞాని, చదువరి, సంభూతి. మౌనమే ఇతగాడి వ్యాఖ్యానము, ఇతను హంపి, చిత్రకారుడు.</p>
<p>నిజమైన కళాకారుడికి తన కళయొక్క ఔన్నత్యం సదా తెలిసియుంటుంది, చాలా తక్కువసార్లు మాత్రమే కళకు తన చిత్రకారుడి తపన ఎరుక కలుగుతుంది. ఈ పరస్పర స్పృహ కల్గిన కళ మరియు కళాకారుడు తామిరువురు ఒకరికొకరు ఎదురయ్యే అపురూప కాలం అనేది ఒకటి తగులుతుంది. అది ఆ మనుజుడికి ఎదురు వచ్చిన క్షణాన తన దివ్యాత్మను కళకు అంకితమిస్తాడు. (కళా, కళాకారుడు ఏకం అయ్యే సంఘటన ఒకటి చెబుతా. మొక్కపాటి కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడుకుంటున్నాం నేను బాపు గారూనూ. బాపుగారు తెలుసా మీకు? మనిషి ఎవరెస్ట్ శిఖరమే కానీ మనిషి అయిదూ నాలుగో, అయిదు అయిదో ఎత్తు. పురాణ పాత్రలగురించి వచ్చింది ప్రస్తావన. తెలుసా! మీ జన్మలో ఊహించగలరా ఈ అపురూపాన్ని, భీష్ముడిని వర్ణిస్తున్నారు బాపుగారు &#8220;వారు యోధులండి! నిత్యం సాము గరిడలు చేసే వీరులండి! వారి చేతులు, భుజాలు చాతీ ఎట్లా వుంటాయో తెలుసా? కత్తి పట్టే ఆ పిడికిలి, నారి సారించే ఆ బాహువులు, కాయలు కాసిన ఆ చేతివేళ్ళు&#8230; ప్రతీది చేసి చూపిస్తున్నారు. మనిషి ఎలా వున్నాడో తెలుసా? మళ్ళీ మళ్ళీ తెలుసా? ఏడడుగుల పొడవైన వీరుడి రూపంలోకి ప్రవేశం అయిపోయాడు. ఒక చేత విల్లు ధరించి మరో చేతిని నేలపై ఆనించి నిస్సహాయ చూపులు చూసే వృద్ధభేరి భీష్ముడిలా మారిపోయి చూపారు. ఆ సమయంలో ఆయన భీష్ముడే అయిపోయాడు! అది కళా, కళకారుడు ఏకం కావడం అంటే! యదృశస్ చిత్రకరస్ తదృషే చిత్ర కర్మ రూప రేఖ.) అటువంటి శిల్పి ఆ చిత్రకారుడు. కళ తనకు ఇచ్చినదానిని కళకే అంకితం చేసే క్రమంలో తను దగ్ధం అయిపోతూ అజ్ఞాతంగా ఉండిపోతాడు, దానికి ఫలితం భారతదేశంలోని చాలమంది మాహా శిల్పుల, చిత్రకారుల విస్మృతిలో విలీనం అయిపోవడమే. ఇదే మహా స్తితి. బికారి మహా మహా బికారి అవడానికి నాంది. అపుడు నువ్వూ నేనూ లేదా రసికుడు కాదా వీక్షకుడు ఏం చెయాలి. ఆ తాపసిని ఆ కళాభిజ్ఞుఁడిని మనం సదా జాగ్రత్తగా కాపాడుకోవాలి.</p>
<p>హంపి బొమ్మలు వేయగా ప్రత్యక్షంగా నేను చూసినవాణ్ణి. ఆ సమయలో ఈ కళాకారుడు, తన కుంచె, ఆ చిత్ర రచనకు ఒదిగిన కాగితం- మూడు ఒకటయ్యేవి. ఆ సమయంలో ఇవికాకుండా ఏదీ ఈ మనిషి దరిచేరేది కాదు, మునుపు పలికినట్లు యదృశస్ చిత్రకరస్ తదృషే చిత్ర కర్మ రూప రేఖ (విష్ణు ధర్మోత్తరం). ఆ సమయంలో ఇతనూ ఒక మహర్షే.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2018/02/hampi_pic1.jpeg"><img class="aligncenter size-large wp-image-16093" title="hampi_pic1" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2018/02/hampi_pic1-684x1024.jpeg" alt="" width="684" height="1024" /></a></p>
<p>హంపి రేఖలు, రంగులు పూర్తి ప్రాచ్య రీతి. ఆ మనుషులు వారి చుట్టూ కట్టిన గీతలు, నిండిన రంగులు, కొప్పులో పూలు, కొమ్మ మీది నెమలి, దాని కంఠపు ధగధగల పచ్చదనం, కొకిలమ్మ వంటిన మెరిసే నలుపుదనపు నీలంపు సొగసు, బరంట్ యెల్లో గడ్డివామి అంచులపై కుప్పించి యెగసిన తపన మండలం కాంతి, గీసుకున్న తన చెల్లెలు నిలువెత్తు బొమ్మ పాదాల క్రింద మెత్తగా నలిగిన పచ్చిక పచ్చందనం అంతా తెలుగుందనం. బాపు, బాలి, చంద్ర&#8230; లు మనకు పరిచయం చేసిన కొన్ని మొహాలు, కొన్ని శరీరాలు, కళ్ళు, ఆ నడక, ఆ గుంపులు, వేపచెట్టు నీడ&#8230; వీటినుంచి ఎడంగా తన చిత్ర రచనా శాస్త్రాన్ని తను వేరుగా వ్రాసుకున్నాడు. హంపి బొమ్మల్లో కనపడే మూలాంశాలు అన్నీ తనవే, ఆ రంగు తను కలుపుకుందే, ఆ గీత తను తెలుసుకుందే, ఆ పర్స్పెక్టివ్ తను చూసిందే. రేఖ దాటని రంగు, రంగుని పొదువుకున్న రేఖ&#8230; నిజానికి హంపి ప్రతీ బొమ్మబొమ్మకు ప్రక్కన ఒక వ్యాఖ్యానం వ్రాయొచ్చు. కాని అది పాఠకుడికి అవమానం కదాని ఇక్కడ అటువంటి బోధించు పనులేం చెయబోవట్లేదు. హంపీ బొమ్మల్లో అంతా ఒక పద్దతి, డిసిప్లిన్ ఉంటుంది. ఎక్కడా కనికట్టు, ఇంద్రజాలం, టెక్నిక్, ఆక్సిడెంట్ కనపడదు. పూర్తిగా డ్రాయింగ్, పెన్సిల్ పై అదుపు ఉంటుంది. ఈ భాషంతా చిత్రకారులది. హంపీ సాధించిన ఈ ఎత్తు చూసి మాలో మేం ఎంత గింజుకుంటామో నాకే తెలుసు. ఆ విధంగా మిగతా గ్రుడ్డి లోకం ధన్యం.</p>
<p>ఎనిమిదవ తరగతి ప్రాయం నుంచి హంపి బొమ్మలు వేస్తూనే వున్నాడు. మా దగాకోరు బొమ్మల దునియాలో ఒక్క పెద్ద నోరు తనకోసం మాట చేసుకోలేదు. &#8220;మా పూలే, మా మహత్మా&#8230;&#8221; అని పూనకం ఊగే మనుషులెవరి చీకటి హృదయాలకు హంపి గీసిన పూలే చరిత్ర రంగుబొమ్మలు తాకలేదు. పూలే బొమ్మలు చూశారా? హంపి గీసినవి ఇదిగో ఇక్కడ వున్నాయి.</p>
<div style="margin: auto; width: 50%;">
<table border="0">
<tbody>
<tr>
<td><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2018/02/poole6.jpg"><img class="size-thumbnail wp-image-16087" title="poole6" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2018/02/poole6-150x150.jpg" alt="" width="150" height="150" /></a></td>
<td><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2018/02/poole5.jpg"><img class="size-thumbnail wp-image-16086" title="poole5" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2018/02/poole5-150x150.jpg" alt="" width="150" height="150" /></a></td>
<td><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2018/02/poole4.jpg"><img class="size-thumbnail wp-image-16085" title="poole4" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2018/02/poole4-150x150.jpg" alt="" width="150" height="150" /></a></td>
</tr>
<tr>
<td><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2018/02/poole3.jpg"><img class="size-thumbnail wp-image-16084" title="poole3" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2018/02/poole3-150x150.jpg" alt="" width="150" height="150" /></a></td>
<td><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2018/02/poole2.jpg"><img class="size-thumbnail wp-image-16083" title="poole2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2018/02/poole2-150x150.jpg" alt="" width="150" height="150" /></a></td>
<td><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2018/02/poole1.jpg"><img class="size-thumbnail wp-image-16082" title="poole1" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2018/02/poole1-150x150.jpg" alt="" width="150" height="150" /></a></td>
</tr>
</tbody>
</table>
</div>
<p>నాకు తెలిసిన చిత్రకార ప్రపంచంలో ఇంతకన్నా ఈ మహత్ముడి జీవితాన్ని ఏ ఇతర రేఖలరంగుకారుడు ఈ కూర్పు రూపొందించలేదు. ఇవి హంపి కొరకు తనకు తాను బొమ్మగా నడిచి వచ్చిన ఘట్టాలు. ఊరూరా కమ్యూనిటి కేంద్రాలలో ఈ బొమ్మలు పటాలకెక్కవలసినవి. ఈ బొమ్మలతో పుస్తకాలు చేతులు ధరించవలసినవి. ఈ మైనార్టీ వాడి వెర్రి కన్నీటి నవ్వు నీటి రంగులో కలిసిపోయింది.</p>
<p>అయినా బొమ్మని వెదుక్కుంటూ, బొమ్మలు గీసేవాళ్ళని శ్వాసించాలనుకుంటూ తను హైద్రాబాద్ నగరానికి పలుసార్లు మళ్ళీ మళ్ళీ వచ్చేవాడు. హంపిని, తన బొమ్మని నెత్తిన పెట్టుకున్న వాళ్ళు మనసున నింపుకున్న వాళ్ళు ఎవరూ నాకు తెలిసి ఎవరూ తగల్లా. (పాపము శమించు గాకా పాండు ఒకడుండేవాడు, కానీ వాడు బికారి, ఇతగాడు నిర్వికారి, ఇక రాలింది బూడిదే) ఈ మనిషి నవ్వే తీపి నవ్వులు ఎవడిక్కావాలి? అయినా పెదాలు నవ్వే ఎందుకు పూయాలి? కాపర్స్ మాట్లాడే చోట, సీసాల గల గలల చప్పుడులో ఈ పావురాయి కువ కువలు వినిపించుకునే చెవులు లేకపోయే. నడిసముద్రపు నావ రీతిగ సంచలిస్తూ ఉండేవాడు, పైకి పెదాలు నవ్వేవి, లోపల గుబులు కమ్మి దిగులు పడుతూ, దీనుడౌతూ మబ్బుపట్టీ , గాలికొట్టీ ,వాన కొట్టి, వరద కొట్టి మనిషి దూరం వెళ్ళిపోయాడు. ఏ మనసూ నొచ్చుకుంది లేదు. నగరం నవ్వుతూనే వుంది.</p>
<p>మనిషి ఒంటరి. సాక్షి పత్రికలో ఉన్నప్పుడు హైద్రాబాద్ బంజారా హిల్స్ లో డబల్ బెడ్రూం ఫ్లాట్ అద్దెకు తీసుకుంది ఎందుకని? ప్రపంచం మూల మూలలా హంపి ఎరుగని చిత్రకారుడు లేడు. స్టడీ చేయని చిత్రకళారీతి లేదు. తడిమి చూడని డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పుస్తకం లేదు. ఫ్లాట్ నిండా పుస్తకాలే. స్టడీ స్టడీ ఏక్దం స్టడి. పుస్తకాలు కాకుండా ఇంకేమన్నా ఆస్తా? అని చూస్తే అలసినపుడు వళ్ళు వాల్చడానికి ఒక చాప, దుప్పటి. ఒకటో రెండో జతల బట్టలు, కాసింత అందమైన గడ్డం ఆపైని బాదాము కళ్ళు అంతే. మూడుపూట్లా ఏం తినేవాడో తెలీదు. ప్రతి రోజూ పుస్తకాలు కొనేవాడు. హైద్రాబాద్ కాదనుకుని మళ్ళీ అమ్మ ఒడి రాజమండ్రికి మరలేటప్పుడు పుస్తకాలు తరలించడానికి లారీ కావాల్సి వచ్చింది. ముప్ఫైల్లో వయసు, పుస్తకాలు లారీడు, జేబులో డబ్బు నిల్లు, జ్ఞానం ఫుల్లు.</p>
<p>ఇక్కడే వుంటే ఎమయ్యేవాడో తెలీదు! అక్కడ వుండి ఏమవుతున్నాడో కూడా కూడా తెలీదు. రాజమండ్రిలో కూచుని ఏం గీస్తున్నాడో, ఏం చెరుపుతున్నాడో కూడా తెలీదు. హంపి బొమ్మతో తిలకం దిద్దించుకునే అదృష్టం కథా కవిత్వ పుస్తకాలకు కలగట్లేదని అచ్చైన ఏ పుస్తకం చూసినా తెలిసిపోతుంది. ఏ పత్రికా పేజీల్లోనూ తన రంగు రెపరెపలాడ్డం లేదని వెలసి పొయిన పత్రికల ఏ బోసి పేజీ చూసినా అర్థమైపోతుంది. దినపత్రికల ఆర్ట్ ఎక్జిబిషన్ కాలమ్స్ లలో హంపి పేరు ఎప్పుడూ చూళ్ళేదు.</p>
<p>ఏ తత్వం బోధపడిందో, లేదా పుట్టుకతోనే కూడి ఉన్నదో, హాంపి మన మధ్య దూరంగా మౌనంగా వున్నాడు. నేను అలా ఉండలేక ఇదంతా వ్రాస్తున్నా. ఇంత వ్రాసినా హంపి చదువుతాడనే నమ్మకం నాకు లేదు. చదివేవాడు ఎవడో ఒకడు చదువుతాడు. దామెర్ల రామారావు ఏ నది నీరు తాగాడో గానీ ఆ ఒడ్డున దప్పికతొ ఉన్న హంపిని కలవడానికి వెడతాడు. హంపి బొమ్మలని చూసి కనీసం చదువరి తన దాహం అయినా తీర్చుకుంటాడని నాదో ఊహ, ఆశ.</p>
<p><em>వ్యాస రచయిత బ్లాగు: <a href="http://thisisanwar.blogspot.in/" target="_blank">http://thisisanwar.blogspot.in/</a></em></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=16078</wfw:commentRss>
		<slash:comments>13</slash:comments>
		</item>
		<item>
		<title>హంపివిరూపాక్షుడు &#8211; దక్షిణ భారతదేశ సాంస్కృతిక ప్రస్థానం</title>
		<link>http://vaakili.com/patrika/?p=15585</link>
		<comments>http://vaakili.com/patrika/?p=15585#comments</comments>
		<pubDate>Thu, 30 Nov 2017 22:09:21 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[రవి E.N.V]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=15585</guid>
		<description><![CDATA[చాలా ప్రాచీన కాలంలో ప్రకృతి యొక్క శక్తులను దేవుళ్ళుగా, దేవతలుగా భావించి ఆరాధించేవారని చెప్పటానికి మన వాఙ్మయంలో కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. వేదకాలంలో ’రుద్రుడు’ ఒక దైవం. ఈ ’రుద్ర’ శబ్దానికి నిరుక్తంలో ’రోరూయమాణః ద్రవతి ఇతి రుద్రః’ అని ఒక వ్యుత్పత్తి చెప్పారు. అంటే "హుర్రు...అన్న తీవ్రమైన శబ్దం చేస్తూ ప్రవహించే వాయువు" రుద్రుడు. వాయుదేవుడే రుద్రుడు అని చెప్పటానికి ఋగ్వేదంలోనూ కొన్ని సూక్తములు ఉన్నవి. తదనంతరకాలంలో రుద్రుడు - ’శివుడు’ గా పరిణమించటం, ఏకాదశ రుద్రులుగా వ్యాప్తి చెందటం జరిగాయి. హిందూ దేవతల వెనుక మార్మికమైన కథలు, కారణాలు ఉన్నాయి. అలాంటి కారణాలే విరూపాక్షుడికీ ఉన్నాయి.]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">వా</span>ల్మీకి రామాయణంలో కిష్కింధకాండ: సీతను రావణుడు అపహరించిన తర్వాత రాముడు, లక్ష్మణుడితో సహా సీతను వెతుకుతూ బయలుదేరాడు. కిష్కింధకు చేరుకున్నాడు. అక్కడ పంపాసరస్సును చూచాడు.</p>
<blockquote><p>సౌమిత్రే! శోభతే పంపా వైడూర్యవిమలోదకా,<br />
ఫుల్లపద్మోత్పలవతీ శోభితా వివిధైర్ద్రుమైః || (రామాయణం, కిష్కింధాకాండ &#8211; ౧.౩)</p></blockquote>
<p>తా: లక్ష్మణుడా! పంపాసరస్సు వైడూర్యము వంటి స్వచ్ఛమైన నీటితో, వికసించిన తామరలతో, కలువలతో, తీరాన ఉన్న ఫలవృక్షాలతో ప్రకాశిస్తోంది చూడు!</p>
<p>ఆపై వాల్మీకి పంపాసరస్సును, కిష్కింధపరిసరాలను సుదీర్ఘంగా వర్ణించాడు. ఆ ప్రకృతి వర్ణనకు పరాకాష్ఠగా, రామునిచేత కంఠోక్తిగా ఒక్కమాట అనిపిస్తాడు.</p>
<blockquote><p>యది దృశ్యేత సా సాధ్వీ యది చేహ వసేమహి, |<br />
స్పృహయేయం న శక్రాయ నాయోధ్యాయై రఘూత్తమ || (౧. ౯౫)</p></blockquote>
<p>తా: లక్ష్మణుడా! ఆ సాధ్వి సీత కనిపించి, మనం ఇక్కడ నివసించే అవకాశం వస్తే, అయోధ్యను, ఇంద్రపదవిని కూడా ఆశించను.</p>
<p>వాల్మీకి వర్ణనలో ఎక్కడా ’తుంగభద్ర’ అన్న నది ప్రస్తావన లేదు. ఆయన కిష్కింధలోని పంపను ’సరోవరం’ అని అంటున్నాడు. అయితే వాల్మీకి ప్రస్తావించిన మాతంగ, మాల్యవంత, ఋష్యమూక, గంధమాదనాది పర్వతాలను, ఇతర పోలికలను గుర్తెరిగి అది కర్ణాటకలోని &#8220;హంపి&#8221; ప్రాంతంగా చారిత్రకులు, ప్రాజ్ఞులు భావించారు. ఈ ప్రాంతంలో తుంగభద్రనది ’పంప’ అన్న పేరుతో ప్రసిద్ధం. ఈ పంపానది దక్షిణ దిశగా, ఋష్యమూక, మాతంగ పర్వతాలకు కనుచూపు మేరలో నేడు &#8211; ఠీవిగా ఒక రాజగోపురం, ప్రసిద్ధమైన దేవాలయం కనిపిస్తాయి. అది ’పంపావిరూపాక్ష’ స్వామి ఆలయం.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Virupaksha_Temple_in_Hampi.jpg"><img class="aligncenter size-full wp-image-15587" title="Virupaksha_Temple_in_Hampi" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Virupaksha_Temple_in_Hampi.jpg" alt="" width="700" height="394" /></a></p>
<p>క్రీ.శ. పదమూడవ శతాబ్దంలో ఆ విరూపాక్షస్వామి ఆశీస్సులతో, విద్యారణ్యముని నేతృత్వంతో, హక్క, బుక్కలనబడే సోదరుల కర్తవ్యదీక్షతో ఒక సువిశాల సామ్రాజ్యం దక్షిణభారతదేశంలో ఏర్పడింది. అదే విజయనగరసామ్రాజ్యం. ఆ విశాల సామ్రాజ్యానికి మూలశక్తి విరూపాక్షస్వామి అనే ఈశ్వరరూపంలోని దైవం. ఎవరా విరూపాక్షుడు?</p>
<p style="text-align: center;">***</p>
<p>చాలా ప్రాచీన కాలంలో ప్రకృతి యొక్క శక్తులను దేవుళ్ళుగా, దేవతలుగా భావించి ఆరాధించేవారని చెప్పటానికి మన వాఙ్మయంలో కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. వేదకాలంలో ’రుద్రుడు’ ఒక దైవం. ఈ ’రుద్ర’ శబ్దానికి నిరుక్తంలో ’రోరూయమాణః ద్రవతి ఇతి రుద్రః’ అని ఒక వ్యుత్పత్తి చెప్పారు. అంటే &#8220;హుర్రు&#8230;అన్న తీవ్రమైన శబ్దం చేస్తూ ప్రవహించే వాయువు&#8221; రుద్రుడు. వాయుదేవుడే రుద్రుడు అని చెప్పటానికి ఋగ్వేదంలోనూ కొన్ని సూక్తములు ఉన్నవి. తదనంతరకాలంలో రుద్రుడు &#8211; ’శివుడు’ గా పరిణమించటం, ఏకాదశ రుద్రులుగా వ్యాప్తి చెందటం జరిగాయి. హిందూ దేవతల వెనుక మార్మికమైన కథలు, కారణాలు ఉన్నాయి. అలాంటి కారణాలే విరూపాక్షుడికీ ఉన్నాయి.</p>
<p>విరూపాక్షుడు &#8211; అంటే విరూపమైన నేత్రము కలిగిన వాడు. అంటే సాధారణంగా అడ్డంగా ఉన్న కనుదోయికి భిన్నంగా నిలువుగా ఉన్న మూడవకన్నును నొసటన కలిగిన పరమేశ్వరుడు అని రూఢ్యర్థం. &#8220;వామదేవో మహాదేవో విరూపాక్షస్త్రిలోచనః&#8221; &#8211; అని అమరకోశం. ఇంకా లింగపురాణం, శివసహస్రనామాలలో ఈ శబ్దం ఉంది. నారాయణ సూక్తంలో విష్ణువు పేరు ’విరూపాక్షుడు’.</p>
<blockquote><p>ఋతగుం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం |<br />
ఊర్థ్వరేతం ’విరూపాక్షం’ విశ్వరూపాయ వై నమో నమః || &#8211; నారాయణసూక్తం.</p></blockquote>
<p>సంస్కృత పురాణ వాఙ్మయంలో కొన్నిచోట్ల సహస్రాక్షుడైన ఇంద్రుణ్ణి విరూపాక్షుడని ఉద్యోతించడం ఉన్నది. అంతే కాదు. కైలాసం &#8211; పరమేశ్వరుడికే కాక కుబేరునికి కూడా స్థానం. అక్కడి అలకాపురి &#8211; కుబేరుని ముఖ్యపట్టణం. అందుచేత విరూపాక్షుడు (ఈశ్వరుడు) అంటే పరోక్షంగా కుబేరుడు కూడానూ.గంగాదేవి అనే కవయిత్రి రచించిన మధురావిజయమనే కావ్యంలో, విజయనగరాన్ని వర్ణిస్తున్న ఈ శ్లోకం చూడండి.</p>
<blockquote><p>యచ్ఛాఖానగరీం పంపామనేకధనదాశ్రితామ్ |<br />
అధితిష్టన్ విరూపాక్షో న స్మరన్త్యలకాపురీమ్ || &#8211; ౧. ౬౬.</p></blockquote>
<p>- అనేక వీధులుగల ఈ నగరిని, వివిధసంపదలున్న ఈ పంపా నగరాన్ని ఆశ్రయించిన విరూపాక్షుడు తనఊరైన అలకాపురిని స్మరించడమే లేదు. ఇక్కడ విరూపాక్షుడు అంటే కుబేరుడు అన్నది స్పష్టం. అనేక అర్థాలున్నప్పటికీ రూఢ్యర్థంలో విరూపాక్షుడు అంటే విశ్వేశ్వరుడే. ఈ విరూపాక్షుడిని దక్షిణ భారతంలో చాళుక్యులు తొలుతగా అర్చించినట్టు కనిపిస్తుంది.</p>
<p style="text-align: center;">***</p>
<p><span style="text-decoration: underline;"><strong>చాళుక్యుల పట్టదకల్లు విరూపాక్షుడు</strong></span></p>
<p>చరిత్రలో చాళుక్యులది ఆరవశతాబ్దము. వారి మొదటి రాజధాని వాతాపి/బాదామి. నేటి బాదామి కర్ణాటక రాష్ట్రంలోని బాగల్ కోట జిల్లాలో ఉంది. చాళుక్యుల సంస్కృతికి బాదామి మాత్రమే కాక చుట్టుపక్కల మలప్రభ నదీ తీర ప్రాంతాలయిన పట్టదకల్లు, ఐహోళె, మహాకూట వంటివి కూడా ప్రసిద్ధి. ఇందులో పట్టదకల్లు &#8211; చాలా ప్రాచీనమైన పట్టణం. గ్రీకు తత్వవేత్త టాలెమీ (PTolemy) వ్రాసిన ప్రపంచ భౌగోళికశాస్త్రంలో పట్టదకల్లు ప్రస్తావన ఉన్నదట. ఐదవ శతాబ్దానికి మునుపు అనేక స్థానిక సంస్థానాధీశులు ’పట్టదకల్లు’ కు వచ్చి పట్టాభిషేకం జరుపుకోవడం ఆనవాయితీగా ఉండేదట. పట్టదకల్లు &#8211; అంటే సంస్థానాధీశులు పట్టం కట్టుకోవడానికి ఏర్పరుచుకున్న స్థలం. ఆ ’పట్టదకల్లు’ లో నేడు మనకొక విరూపాక్ష దేవాలయం కనిపిస్తుంది. క్రీ.శ. 8 వ శతాబ్దంలో &#8211; చాళుక్యులలో రెండవ విక్రమాదిత్యుడు పల్లవులను జయించిన సందర్భంలో ఆతని భార్యలయిన త్రైలోక్యమహాదేవి, లోకమహాదేవి దక్షిణాదిన పల్లవుల రాజ్యం నుంచి శిల్పులను రప్పించి వరుసగా విరూపాక్ష, మల్లికార్జున దేవాలయాలను కట్టించారు. ఆపై విజయధ్వజాన్ని ప్రతిష్ఠించి దానిపై శాసనం వేయించారు.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Pattadakallu_Victory_Inscription.jpg"><img class="aligncenter size-full wp-image-15588" title="Pattadakallu_Victory_Inscription" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Pattadakallu_Victory_Inscription.jpg" alt="" width="480" height="640" /></a></p>
<p style="text-align: center;">***</p>
<p><span style="text-decoration: underline;"><strong>పంపావిరూపాక్షుడు</strong></span></p>
<p>క్రీ.శ. 1336 &#8211; ధాతృనామసంవత్సరం, వైశాఖశుద్ధసప్తమి నాడు శృంగేరి పరమాచార్యులు మాధవవిద్యారణ్యస్వామి విజయనగరసామ్రాజ్యాన్ని స్థాపించి హరిహరరాయలకు పట్టాభిషేకం చేసినట్టు ఐతిహ్యం. ఆ సమయంలోనే ఆయన విద్యానగరంలో హేమకూటాద్రిపై ఉన్న మూలవిరూపాక్షుని విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న చోటుకు మార్చి, పునఃప్రతిష్ఠించారు. ఆపై విజయనగరాన్ని తొలుతగా పాలించిన సంగమ ప్రభువులు విరూపాక్షస్వామికే కాక, పంపాదేవికి, భువనేశ్వరీదేవికీ ఆలయాలు కట్టించారు. ఆ దేవాలయానికే తదనంతరకాలం ఇమ్మడి ప్రౌఢదేవరాయల వారి కాలంలో గోపురం ఏర్పడింది.</p>
<p>విద్యానగరాన్ని &#8211; స్వామి విద్యారణ్యులు నిర్మించతలపెట్టటానికి పూర్వం ఈ రాజ్యం ఇతర రాజుల పరిపాలనలో ఉండేది. చాళుక్యులు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు. వారే హేమకూటంపై మూలవిరూపాక్షుణ్ణి ప్రతిష్ఠించారు. హేమకూటంపై ఇతరత్రా దేవాలయాలనూ కట్టించారు. ఇవి చాళుక్యుల రేఖానగర శైలిలో నేటికీ శిథిలరూపంలో కనిపిస్తాయి. హేమకూటం అంటే ప్రస్తుతం విరూపాక్షదేవాలయానికి దక్షిణంలో ఉన్న చిన్న గుట్ట.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Mula_Virupaksha_Temple.jpg"><img class="aligncenter size-full wp-image-15589" title="Mula_Virupaksha_Temple" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Mula_Virupaksha_Temple.jpg" alt="" width="640" height="480" /></a></p>
<p>చాళుక్యుల కాలంలో విజయనగర ప్రాంతానికి పంపాక్షేత్రమని పేరు. క్రీ.శ. 1012 నాటి బాదామి చాళుక్యరాజు ఐదవ విక్రమాదిత్యుని కాలపు ఒక శాసనంలో పంపాపతి అయిన మహాకాలునికి చేసిన దానం గురించిన వివరణ ఉంది. అలాగే క్రీ.శ. 1199 నాటి కలిదేవుని శాసనంలో &#8211; విరూపాక్షుడు, పంపాదేవి అన్న పేర్లు ఉన్నాయి. (యిది నేటి దేవాలయంలో ఉత్తరద్వారం వద్ద ఉంది) అంతకంటే ప్రాచీనమైన చాళుక్యవినయాదిత్యుని (క్రీ.శ. 680-696) తామ్రశాసనంలో విరూపాక్ష, పంపాపతిల ప్రస్తావన ఉంది. ఆ శాసనపు ఛాయాచిత్రం యిది.</p>
<p>పంపయే కన్నడభాషలో ’హంపి’ గా పరిణమించింది. హంపి లోని హేమకూట, విరూపాక్ష నామధేయాల వెనుక- ఇదివరకు మనం చెప్పుకున్న మార్మికత, విచిత్రమైన కథలూ దాక్కుని ఉన్నాయి.</p>
<p><span style="text-decoration: underline;"><strong>మౌఖికసాహిత్యంలో పంపాదేవి</strong></span></p>
<p>తుంగభద్ర నదికి ’పంప’ అనే పేరు పురాణాల్లో కనిపిస్తుంది. ఇదివరకే చెప్పుకున్నట్టు &#8211; రామాయణంలో వాల్మీకి కూడా కిష్కింధలో ’పంపాసరస్సు’ అనే ప్రస్తావించాడు. విరూపాక్షునికి పంపాపతి అని పేరు. పంపాదేవి- విరూపాక్షుని మొదటి భార్య. ఈమె ఎవరు? అన్న విషయంపై చాలాకాలం మునుపు స్థానికంగా ఒక కథ వ్యాప్తిలో ఉండేది. మౌఖిక సాహిత్యంలో భాగమైన ఈ కథను ఆంగ్లేయులు బళ్ళారి &#8211; మదరాసు కైఫీయత్తులలో నమోదు చేశారు.</p>
<p>పంప &#8211; అనే ఓ అమ్మాయి బ్రహ్మపుత్రిక. ఈ యువతి ఈ హంపి పరిసర ప్రాంతాలలోని మాల్యవంతపర్వతం పై నివాసం ఉండేది. మాతంగ, ఋష్యమూక పర్వత ప్రాంతాలలో సంచరిస్తూ, మునులకు పూలూ పళ్ళూ  సమర్పిస్తుండేది. అక్కడి మునులు ఈమె భక్తికి సంతోషించి, ఏదైనా వరం కోరుకొమ్మన్నారు. ఆమె ఎంతో సంతోషించి &#8211; విరూపాక్షుడిని భర్తగా అనుగ్రహించమని కోరింది. అందుకు మునులు అంగీకరించి ఆమెకు మంత్రోపదేశం చేశారు. అలా మంత్రోపదేశం పొందిన ఆ యువతి స్థానిక హేమకూటంపై మహాదేవుని గురించి తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి విరూపాక్షుడు ఆమెను అనుగ్రహించి పత్నిగా స్వీకరించాడు.సాధారణంగా పురాణాలలో ఈశ్వరుని భార్య పార్వతి/ఉమ. ఈమె హిమవంతుని పుత్రిక అని మనకు తెలుసు. అలాగే &#8211; భగీరథుడు ఆకాశగంగను నేలకు దింపినపుడు, ఆమె ఉద్ధృతిని ఆపడానికి ఈశ్వరుడు గంగను తన జటాజూటంలో బంధించాడు. ఆ విధంగా గంగ ఈశ్వరుని రెండవభార్య అయింది. అయితే హంపిలో విరూపాక్షుని మొదటి భార్య (నదికి చిహ్నమైన) ’పంప’. రెండవభార్య భువనేశ్వరీదేవి. (భువనేశ్వరి &#8211; చాళుక్యుల కాలపు గ్రామదేవత. ఈ దేవి రూపమే నేటి కర్ణాటక రాజ్యమాత అయింది). కాస్త సూక్ష్మంగా ఊహిస్తే &#8211; ఈ విరూపాక్షుడనే ఆయన స్థానికంగా గొప్ప రాజు కానీ, గొప్ప వీరుడు కానీ అయి ఉండాలి. ఈ మహాసత్వుని భార్య కావాలని పంప అనే యువతి తపన పడి ఉండాలి. తద్వారానే పైని కథ పుట్టి ఉంటుంది. ఇది ఊహే అయినా అసంభావ్యం కాదు. హంపిలో విరూపాక్షుని మూలవిగ్రహం పైన కూడా ఓ ముఖం కనిపిస్తుంది. డోమింగో పేస్ అన్న యాత్రికుడు కూడా తను వ్రాసిన చరిత్ర వృత్తాంతములో ఈ విషయం గురించి చెప్పాడు.</p>
<p>చాళుక్యుల బాదామి వద్ద మహాకూటం అనే ప్రదేశం ఉంది. విద్యానగరాన చాళుక్యులకు చెందినది హేమ కూటం. పరమేశ్వరుడు ముకుటేశ్వరుడుగా కల్యాణం అయిన తర్వాత గౌరితో కలిసి మహాకూటంలో స్థిరపడ్డాడు. ఆయనే విరూపాక్షుడుగా &#8211; పంచముఖుడుగా హేమకూటాద్రిపైన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అలా తపస్సు చేసుకుంటున్న సమయంలో మన్మథుడు ఆయనపై బాణాలను సంధించాడు. ఈయన మూడవ కన్ను తెరిచాడు. మన్మథుడే కాక, ఆ వెనకనున్న హేమకూటంపై ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా కరిగి నీరైపోయాయి. ఆ నీళ్ళు అన్నీ ఒక పల్లపు ప్రదేశానికి చేరినై. తదనంతరకాలంలో అక్కడ విజయనగరప్రభువులు ఓ పుష్కరిణిని కట్టించారు. విరూపాక్షదేవాలయం పక్కన, తుంగభద్రానదికి వెళ్ళేదారిలో మన్మథపుష్కరిణి వెనుక కథ యిది. ఇది స్పష్టంగా, విరూపాక్షుని కథకు తదనంతర కాలంలో, బహుశా, పుష్కరిణి కట్టిన తర్వాత ఏర్పడిన కథగా ఊహించవచ్చు.</p>
<p>భారతదేశంలో క్రీ.శ నాలుగు నుంచి ఏడవ శతాబ్దం &#8211; అనేక మార్మిక సంప్రదాయాలు/కథలు ఏర్పడిన కాలం. గజముఖుడైన గణపతి ఆరాధన ఆ కాలంలోనే అనూహ్యంగా వ్యాప్తిలోకి వచ్చింది. ఎన్నెన్నో పురాణగాథలు ఆ కాలంలోనే సంభవించాయి. ముకుటేశ్వరుడూ, లజ్జాగౌరి, బనశంకరి, రేణుకాయెల్లమ్మ,కోటర తదితర రూపాలను అర్చించటం ఆ కాలంలో ప్రబలింది. బౌద్ధంలో వజ్రయాన మత ప్రభావంతో తాంత్రిక విద్యల ప్రాబల్యమూ హెచ్చింది.</p>
<p>చాళుక్యుల నాటి కుమారరాముని కథలో కూడా చారిత్రక నేపథ్యం కలిగిన మౌఖికసాహిత్యం కనిపిస్తుంది. కాంపిల్య నగరాధీశుడైన కుమారరాముడు &#8211; ముష్కరులను ఎదుర్కొని ’గండుగలి’ (మగధీరుడు) అనే బిరుదు సంపాదించాడు. ఈయన కథ ’సారంగధర చరిత్ర’ ను పోలి ఉంటుంది. బళ్ళారి జిల్లాలో సండూరు కొండలనడుమ చాళుక్యుల రేఖానగరనిర్మాణ పద్ధతిలో కుమారరామునికి ఒక దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో ’స్త్రీలు’ ప్రవేశించరు. ఈ ఆచారానికి, ఆయన కథకూ మధ్య లంకె కుదురుతుంది.</p>
<p>భారతదేశచారిత్రకయవనికలో మార్మికసంప్రదాయపు ప్రాధాన్యం ప్రాధాన్యత హెచ్చుగా ఉన్న కాలం అది. మార్మికసంప్రదాయంలోని విశిష్టత ఏమంటే &#8211; కథలకూ, అవి సంధించే ప్రశ్నలకూ జవాబు మెదడులో మెదులుతూ ఉంటుంది కానీ దొరకదు. అసంబద్ధమని వదిలి వేయడమూ పూర్తిగా కుదరదు. స్పష్టాస్పష్టతల మధ్య ఉన్న సత్యమేదో తొంగిచూస్తూ, ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటుంది. హంపి చుట్టూ కొండలూ, కొండలంతటా అనేకానేక శిలలూ ఉంటాయి. అయితే హేమకూటం మాత్రం &#8211; కాస్త చదునుగా ఉంటుంది. అక్కడ కట్టడాలు, చిన్న చిన్న దేవాలయాలు నిర్మించే సందర్భంలో ఇలా జరిగిందా? లేక నిజంగానే శివుడనే నిజమైన (స్థానిక దైవస్వరూపమైన) వ్యక్తి అక్కడి శిలలను కాల్చి దగ్ధం చేశాడా? లేదా ఏదో చిన్న ప్రకృతి ఉత్పాతమో ఏదో జరిగితే దానికి చిలువలుపలవలుగా కల్పించుకుని ఈ కథ ఏర్పడిందా? హేమకూటం (పైడిరాశి) అనే ఆ చిన్నగుట్ట సాయంసంధ్యలో బంగారాన్ని పుటం పెట్టి కాల్చినట్టు బంగరు రంగులో కనిపిస్తూ ఉంటుంది. అలా బంగరు రంగులో ప్రకాశించే గుట్టలా (హేమకూటం) కనిపిస్తున్నది కాబట్టి దానికి కారణాలను వెతుక్కుని పురాణకథలకు అన్వయించుకుని, ఈ పేరును తగిలించారా? అంతు పట్టని ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఇలా ప్రశ్నలను సంధించి &#8211; విద్యార్థులకు విద్యగరపడం ఉపనిషత్తుల కాలంలో కనిపిస్తుంది. (జెన్ బౌద్ధపద్ధతిలోనూ ఇది ఉండేది) చాళుక్యుల కాలానికి ఆ పద్ధతి యొక్క ఆనవాళ్ళు మిగిలాయి. (చాళుక్యుల రెండవపులకేశి &#8211; హర్షవర్ధనుణ్ణి జయించాడు. హర్షవర్ధనుని ఆస్థానకవి రచించిన హర్షచరిత్రలో కొంతవరకు ఉపనిషత్తుల ఆనవాళ్ళుగా మిగిలిన ఋష్యాశ్రమాల వర్ణన ఉన్నది.). ఆ విద్యా రీతులే ఈ కథలకు మూలాధారం కావచ్చు.</p>
<p style="text-align: center;">***</p>
<p><span style="text-decoration: underline;"><strong>చాళుక్యశిల్ప వస్తువు</strong></span></p>
<p>సాధారణంగా చాళుక్యుల దేవాలయాలన్నీ రేఖానగరనిర్మాణాలయితే పట్టదకల్లులోని ఈ రెండు దేవాలయాలు మాత్రం ద్రవిడవిమానపద్ధతిలో నిర్మితమై ఉండటం గమనించవచ్చు. పట్టదకల్లులోని విరూపాక్షునికి, హంపిలోని విరూపాక్షునికి మధ్య కొన్ని విచిత్రమైన సామ్యాలు కనబడతాయి. ఎందుచేతనో ఈ రెండు దేవాలయాలపైన ముష్కరుల దాడి జరుగలేదు. (చుట్టుపక్క ప్రాంతాలన్నిటా తీవ్ర దాడి, దారుణవిధ్వంసం జరిగినప్పటికీ). ఈ రెండు దేవాలయాలలోనూ, నేటికీ నిత్యపూజలు జరుగుతున్నాయి. ఈ రెండు దేవాలయాలనూ, వాటి వెనుక దాగిన సంస్కృతినీ అనుశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.</p>
<p>జాగ్రత్తగా గమనిస్తే బాదామి చాళుక్య శిల్పాలలోనూ, ఆ శిల్పాలు చెప్పే కథలలోనూ, శిల్పనిర్మాణంలోనూ నాటి దేవతా మూర్తులలోనూ, దేవాలయ నిర్మాణంలోనూ, అప్పటి కాలానికి చెందిన కథలలోనూ పురాణకథలనేపథ్యమూ, మౌఖికసాహిత్యస్పర్శ, ఒక విధమైన మార్మికత (Mysticism) కనిపిస్తాయి.</p>
<p>&#8220;ఆషాఢమాసంలో మగనెమలి &#8211; తనివితీరా నృత్యం చేసింది. ఆపై అలసిపోయి, నృత్యాన్ని ఆపి ఆనందబాష్పం రాల్చింది. ఆ కన్నీటి చుక్కని ఆడునెమలి మింగి గుడ్డు పెట్టింది.&#8221;</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Peacock_Peahen1.jpg"><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Peacock_Peahen1.jpg" alt="" title="Peacock_Peahen" width="640" height="284" class="aligncenter size-full wp-image-15602" /></a></p>
<p>&#8220;సూర్య భగవానుడు చీకట్లను చీల్చుకుని సముద్రం నుండి ఉబికి వచ్చాడు. అతని భార్యలిద్దరూ తిమిరాలపై అస్త్రాలను సంధించారు. దేవతలు సూర్యుణ్ణి పొగుడుతున్నారు. అసురులు వెనక్కు మరలుతున్నారు. మనుషులు అబ్బురపాటుతో చూస్తున్నారు, లోకం ఆరంభమవుతూ ఉంది.&#8221;</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Soorya.jpg"><img class="aligncenter size-full wp-image-15591" title="Soorya" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Soorya.jpg" alt="" width="480" height="640" /></a></p>
<p>&#8220;వరాహమూర్తి భూదేవిని సముద్రగర్భం నుంచి పైకి తీసుకుని వచ్చాడు. దేవతలు ఆనందించారు. తెలిసిన పురాణ కథ అయినా ఈ వరాహమూర్తి నిలువెత్తు ఆకారాన్ని చెక్కిన తీరు చూస్తే &#8211; ఆ మూర్తిని చిహ్నంగా కాక, నిజంగా అలాంటి మూర్తి ఉండి ఉండేవాడన్నట్టుగా, చెబుతుందా శిల్పం&#8221;.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/VarahaMurthy.jpg"><img class="aligncenter size-full wp-image-15592" title="VarahaMurthy" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/VarahaMurthy.jpg" alt="" width="480" height="640" /></a></p>
<p>కథలే కాక, శిల్పనిర్మాణం లోనూ, ఆ శిల్పాల ఆకారంలోనూ, కళ్ళల్లోనూ ఏదో తీక్ష్ణత, ఆ శిల్పి ఇతమిత్థమని ఏమి చెప్పదలుచుకున్నాడో అంతుబట్టని భావాలూ కనిపిస్తాయి. చాళుక్యుల శిల్పానికి పరాకాష్ట అనదగిన బాదామి మొదటి గుహాలయపు ఆనందతాండవపరమేశ్వరుని శిల్పంలోనూ చాలా అద్భుతం కనిపిస్తుంది. చూడండి. ఆ శిల్పంలో నృత్యం తాలూకు 92 ముద్రలు ఉన్నాయని అంటారు.</p>
<p>జీవి పుట్టుక ఓ విస్మయకరమైన విషయం. ఈ జన్మ కు ఆధారభూతమైన స్త్రీ నాటి దేవత. స్త్రీ &#8211; సృజనకు మూలరూపం. చాళుక్యుల కాలం నాటి ముఖ్యమైన పరమేశ్వర రూపం మహాకూటేశ్వరుడు. ప్రముఖ దేవత లజ్జాగౌరి. ఇతర దేవతారూపాలయిన భువనేశ్వరి, బనశంకరి, ఎల్లమ్మ, రేణుక తదితరాలు కూడా భూదేవి రూపాలే. ఈ స్త్రీదేవతా రూపాలూ, నవబ్రహ్మలూ ఇత్యాదులకు సంబంధించిన మౌఖిక కథలలోనూ అంతు తెలియని మార్మికత తొంగి చూస్తూ ఉంటుంది. (ఈ వ్యాసం చూడండి.) ఇక్కడ ఓ ప్రశ్న కూడా ఉదయిస్తుంది. చాళుక్యుల కాలం నాటి ఐహోళె శాసనంలో కాళిదాసూ, భారవి కవుల పేర్లు పేర్కొనబడి ఉన్నాయి. కాళిదాసాదుల కావ్యాలకు, అంతకు ముందు ఏర్పడిన వేద, పురాణాది కథలలోని అంతుబట్టని విషయాలను భగవంతుని లీలలకు నిదర్శనంగా భావించి చాళుక్యులు కళలనూ, శిల్ప, దేవాలయనిర్మాణాదులనూ, వారి సాంప్రదాయాన్ని నిర్మించుకున్నారా? లేక ఇతర కారణాలతో ఏర్పడిన మార్మిక సంప్రదాయాలను ప్రాచీన కావ్య పురాణాదులకు అన్వయించుకున్నారా? &#8211; అన్న విషయం అంతుపట్టదు. చాళుక్యరాజుల ప్రస్థానమే బహువిచిత్రంగా ఉంటుంది. ఎవరో ముని ’చుళుకం’ లో జలాల నుంచి వచ్చారని ఓ కథ. చుళుకానికి సంబంధించినది చౌళుక అవాలి కానీ, చాళుక్య అవదు. ఆంధ్రులే చాళుక్యుల పూర్వీకులని కొందరు చారిత్రకులంటారు. వీరు నిజంగా ఎక్కడి వారో, వారి పూర్వచరిత్ర ఏమిటో స్పష్టంగా చెప్పగలిగే ఆనవాళ్ళు తెలియలేదు. ఏదేమైనా, చాళుక్యులు, వారి కాలం ప్రధానంగా పురాణకథలతోనూ, వాటి వెనుక మార్మికమైన లక్షణాలతోనూ కూడి ఉంది.</p>
<p style="text-align: center;">***</p>
<p><span style="text-decoration: underline;"><strong>విజయనగరశిల్పం</strong></span></p>
<p>ఇక విజయనగర సామ్రాజ్య కాలపు తీరుని గమనిస్తే &#8211; శిల్పాలలోనూ, సాహిత్యంలోనూ, నాటి కథలలోనూ, ప్రజల జీవనంలోనూ, లలితకళలలోనూ స్పష్టంగా గొప్ప వైభోగం, రసికత కనిపిస్తాయి. అదృష్టవశాత్తూ ఈ కాలానికి చెందిన విషయాలు నేటికి స్పష్టంగా రికార్డు అయి ఉన్నాయి.</p>
<p>సంగీతం పలికించే రాతి స్థంభాలు, శిల్పప్రాభవం తో అలరారే అనేకదేవాలయాలు, విశాలమైన నగర వీథులు, అంగళ్ళ రతనాలు, వేలాది గుర్రాలు, ఏనుగులు, ఇతరత్రా వ్యాపారవస్తువులూ, కేవలం కర్పూరాది వాసన ద్రవ్యాలకోసం ఏర్పడిన బజారు &#8211; విపరీతమైన భోగం. డోమింగో పెరెస్ మాటల్లో విజయనగర ప్రాభవం తాలూకు చిన్న నమూనా యిది.</p>
<p>&#8220;He who wears such jewels can understand the sort of things so great a lord would wear. Then to see tha grandeur of the nobles and men of rank, I cannot possibly describe it all, nor should I be believed if I tried to do so;&#8230;I have no words to express what I saw and to try and tell of all I saw is hopeless. &#8221;</p>
<p>విజయనగరప్రాభవం, సాహిత్యం, జీవనవిధానాల గురించి ఈ చిన్ని వ్యాసంలో చర్చించటం చూపించటం వృథా. ఈ వ్యాసలక్ష్యమూ అది కాదు. ఇక్కడ చెప్పదల్చుకున్నదేమంటే &#8211; విజయనగరప్రాభవం అత్యున్నత ప్రమాణాలను అందుకొంది. ఇది ’రసికుల’ కాలం. మహాభోగుల కాలం. చాళుక్యుల కాలం నాటి సమాజ మార్మిక వ్యక్తీకరణకూ, విజయనగర కాలపు వైభోగానికి మధ్య చాలా ఆసక్తికరమైన వారధులు ఈ నాడు హంపిలో మిగిలి ఉండటం విశేషం. అవి &#8211; హేమకూటం, విరూపాక్షస్వామి దేవాలయం.</p>
<p style="text-align: center;">***</p>
<p><span style="text-decoration: underline;"><strong>బిష్టప్పయ్య గోపురం</strong></span></p>
<p>హంపిలో విరూపాక్షస్వామి గోపురాన్ని రెండవ దేవరాయల (ఇమ్మడి ప్రౌఢదేవరాయలు) దండనాథుడైన ప్రోలుగంటి తిప్పయ క్రీ.శ. 1426-1448 మధ్యకాలంలో కట్టించినాడు. దేవాలయంలోపలి ఇతర నిర్మాణాలు తదనంతర కాలంలో ఏర్పడినవి. ఈ గోపురంపైన శిల్పాన్ని చూడండి.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Virupaksha_Gopuram.jpg"><img class="aligncenter size-full wp-image-15593" title="Virupaksha_Gopuram" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Virupaksha_Gopuram.jpg" alt="" width="600" height="435" /></a></p>
<p>ఇది ప్రస్ఫుటంగా విజయనగరకాలపు దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశంలో ఆలయాలపైన ఈ బూతు శిల్పాలు ఖచ్చితంగా ఎప్పటి నుంచి ఏర్పడ్డాయో తెలీదు. (బహుశా గుప్తుల కాలం నుంచి కావచ్చు) ముఖ్యంగా గోపురంపైన. చాళుక్యుల గోపురాలు ఇదివరకు చెప్పుకున్నట్టు రేఖానగర నిర్మాణాలు. వాటిపై ఈ విధమైన శిల్పాలను చిత్రించే అవకాశం లేదు. స్త్రీలను, పురుషులను విలాసంగా చిత్రీకరించిన శిల్పాలు నాడు లేకపోలేదు.కానీ ఉద్దేశ్యం వేరు. పట్టదకల్లులో ముఖమంటపముఖద్వారాన్ని చూడండి. ఇక్కడ ఈ రెండు శిల్పాలలో ఆకర్షణీయమైన స్త్రీ విగ్రహాలు ఉన్నప్పటికీ, ఆ శిల్పాల వెనుక ఉద్దేశ్యం &#8211; రాచజంటనూ, పల్లెజంటనూ పోల్చి చూపటమే అని తెలుస్తుంది. ఇవి శృంగారాన్ని ఉద్దేశించినవి కాదు అని అనుకోవాలి.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Dampathi_Pattadakal.jpg"><img class="aligncenter size-full wp-image-15594" title="Dampathi_Pattadakal" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Dampathi_Pattadakal.jpg" alt="" width="480" height="640" /></a></p>
<p>సమాజపు తీరు తెన్నులే ఆయా సమాజాలలో మనుషుల ఆలోచనలను ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తే &#8211; శృంగారం ఒక భోగం అనే విజయనగర కాలం నాటి ఆలోచన తీరు విరూపాక్ష శిల్పంలో కనిపిస్తుందని ఊహించవలసి వస్తుంది. సృజన అన్నది సృష్టి అనే విస్మయానికి మూలమైన కార్యమని చాళుక్యుల కాలపు లజ్జాగౌరి కథ గురించి ఇదివరకే చెప్పుకున్నాం. విస్మయకరమైన సృజన, విలాసమైన జీవితపు భోగంగా విజయనగర కాలానికి పరిణమించింది.</p>
<p>అంటే చాళుక్యుల నాటి మార్మిక సాంప్రదాయం విజయనగరకాలానికి రసికత సాంప్రదాయంగా మార్పు చెందింది. ఈ రెంటికి సూచనాప్రాయమైన వారధిలా హంపి విరూపాక్షస్వామి దేవాలయం నెలకొంది. ఈ దేవాలయానికి సంబంధించి ’పంప’ కథ మార్మికమైనది. (ఈశ్వరునికి ’పంప’ అనబడే పేరు గల భార్య పురాణాలలో లేదు. గంగ స్వరూపమే పంప అనుకున్నా, ఆవిడ ఈశ్వరుని మొదటి భార్య కాదు.). హేమకూట, మన్మథన హొండె ఉదంతాలు కూడానూ. అయితే దేవాలయంలో రంగమంటపం, బిష్టప్పన గోపురంపై దక్షిణ, పశ్చిమ దిశలలో నగ్న శిల్పాలు, మంటపాలలో యాళి స్థంభాలు, ప్రధాన స్థంభాలపై బంగారు పూత ఇవన్నీ వైభోగకరమైన విషయాలు. (ఇక్కడ మరో విషయం ప్రస్తావించక తప్పదు. విజయనగరంలో భోగకరమైన జీవితానికి సమాంతరంగా తార్కిక, ఆముష్మిక సాంప్రదాయమూ సాగింది. బుక్కరాయల కాలంలో మాధవవిద్యారణ్యులు భారతీయ దర్శనాలకు, వేదాలకు వ్యాఖ్యానాన్ని సంతరించారు. సాళువ నరసింహరాయలకు అన్నమయ్య, పురందరదాసు, అక్షోభ్యతీర్థులు, వంటి మునిపుంగవులకూ సముచిత స్థానం నాడు నెలకొంది. భక్తిఉద్యమ ప్రభావమూ నాడు ఉన్నది. అది సంగీతసాహిత్యాలకు బాసటగానే నిలిచింది.)</p>
<p>పంపా విరూపాక్షదేవుని వైభోగానికి మరో రూపు చైత్రమాసపు పంప-తేరు. చైత్రమాసంలో &#8211; వసంతోత్సవం జరుగుతుంది. ఈ వసంతోత్సవ వైభవాన్ని కన్నడకవి విరూపాక్ష-వసంతోత్సవ అన్న పేరుతో గ్రంథస్థం చేశాడు. కృష్ణరాయల ’జాంబవతీకల్యాణ’ సంస్కృత నాటకం ఆ వసంతోత్సవ రోజులలో ప్రదర్శింపబడుతుండేదని ఐతిహ్యం.</p>
<p>ఇలా పురాణ సంబంధమైన మార్మికత చాళుక్యుల కాలం నుంచి విజయనగరకాలానికి వచ్చేసరికి రసికతాసాంప్రదాయంగా పరిణామం పొందింది. ఇదే రీతి సాహిత్యంలోనూ ప్రవేశించింది. పురాణకావ్యాలు ప్రబంధకావ్యాలయ్యాయి. ప్రబంధాలలోనూ వైవిధ్యం. భక్తి, రసనిర్భరత, కథాసంవిధానం, సామాజికపరిశీలనం, శ్లేష, ఇలా ప్రబంధకావ్యాలు పలుపోకడలు పోయినాయి.శిల్ప, చిత్రకళల ప్రస్థానాలు చెప్పనవసరమే లేదు.</p>
<p>మౌఖిక, మార్మిక సాంప్రదాయాలతో పట్టదకల్లు, పంప విరూపాక్ష దేవాలయాలకు ఒనగూడిన సామాజిక ప్రయోజనం ఏమంటే &#8211; ఈ దేవాలయాలను ముష్కరులు విధ్వంసం చేయలేదు. హంపిని మొత్తం కొల్లగొట్టిన సుల్తానులు ఈ ఒక్క దేవాలయం జోలికి రాకపోవడం విశేషం. ఇటువంటివి కొన్ని కొన్ని ప్రముఖ ’మహిమాన్విత’మైన ప్రదేశాల విషయాలలో జరుగుతుంటాయి. (ప్రముఖ ఉదా: తిరుపతి)ఇందుకు స్థానికుల భక్తిప్రపత్తులూ, చుట్టూ అల్లుకుని ఉన్న కథలూ కూడా కారణంగా చెప్పుకోవచ్చు. విరూపాక్ష దేవాలయాల విషయంలోనూ ఇదే జరిగి ఉండాలి.</p>
<p>ఈ చారిత్రకపరిణామానికి మధ్య కేంద్రబిందువై నేడు &#8211; హంపి విరూపాక్షదేవాలయం దర్పంగా ఎన్నో కథలను చెలియ పంపకు చెబుతున్నట్టుగా బిష్టప్పన గోపురం నిలబడి ఉంది. ఈ గోపురాన్ని పదిహేడవ శతాబ్దంలో పునరుద్ధరించారని, బిష్టప్పయ్య అనే శిల్పి ఈ గోపురాన్ని పునః నిర్మాణంలో పర్యవేక్షించాడని, ఆ బిష్టప్ప శిల్పం దేవాలయ గోపురం లోపలి వైపున ఉన్నదని పరిశోధకులు చెబుతారు. ఏది ఏమైనా ఆ హంపి విరూపాక్ష దేవాలయం, ఆ గుడి తాలూకు 165 అడుగుల (49.6 metres) తొమ్మిదంతస్తుల సమున్నతమైన గాలి గోపురం- దక్షిణభారతదేశపు దేవాలయ వాస్తుకళకు, పౌరాణిక, మార్మిక సాంప్రదాయాలకు, ఉజ్జ్వలమైన చరిత్రకు, దక్షిణరాజ్యరమారమణుడైన శ్రీకృష్ణరాయల వారి జ్ఞాపకాలకు, విద్యారణ్యస్వామి వారి సన్నిధికి, అపూర్వ దేవాలయ శిల్పప్రాభవానికి, పైకప్పులో చిత్రించిన అపూర్వ చిత్రకళానైపుణ్యానికి, అద్భుతమైన మంటపాలకు, వసంతోత్సవాది పండుగలకు, తదితర సాంప్రదాయాలకు, ప్రబంధ సాహిత్యానికి, వైదికమత దర్శన వాఙ్మయ రచన ప్రేరణకు, భోగపరాయణతకూ వేదికగా నిలిచి ఉంది.</p>
<p style="text-align: center;">***</p>
<blockquote><p>సీ||<br />
పంపావిరూపాక్ష బహుజటా జాటికా | రగ్వధ ప్రసర సౌరభ్యములకు<br />
తుంగభద్రాసముత్తుంగ వీచీఘటా | గంభీర ఘుమఘుమారంభములకు<br />
కళసాపురప్రాంత కదళీ వనాంతర | ద్రాక్షాలతాఫల స్తబకములకు<br />
కర్ణాటి కామినీ కర్ణహాటకరత్న | తాటంకయుగ ధాళదళ్యములకు</p>
<p>గీ ||<br />
నిర్నిబంధ నిబంధమై నెనయు కవిత<br />
తెలుగునను సంస్కృతంబున బలుకనేర్తు<br />
ప్రౌఢదేవేంద్రరాయ భూపాలవరుని<br />
సమ్ముఖమ్మున దయజూడు ముమ్మ సుకవి !</p></blockquote>
<p>తాత్పర్యం:</p>
<p>ఓ ముమ్మ కవి! పంపావిరూపాక్షస్వామి (ఈశ్వరుని రూపం) యొక్క విశాలమైన జడలలో ధరించిన కొండగోగు పూల పరిమళాల వలే, తుంగభద్రానది ఎత్తైన అలల తాకిడి యొక్క గంభీరమైన నినాదాల లాగా, కళసాపురపు అరటితోటల నడుమ తీవెలకు వ్రేలాడుచున్న ద్రాక్షగుత్తులకు సరిపోలు విధంగా, కర్ణాట యువతులు చెవులలో అలంకరించుకున్న ముత్యాల చెవిపోగుల తళతళల మాదిరి చిక్కగా అల్లిన కవితను, తెలుగు సంస్కృతాలలో చెప్పగలవాడను. నన్ను మీ మహారాజైన ప్రౌఢదేవేంద్రరాయని ఎదుటకు కొనిపోవయ్యా!</p>
<p>శ్రీనాథ కవిసార్వభౌముడు, హంపి లో ప్రౌఢదేవరాయల వారి సముఖానికి అవకాశం కల్పించమని మమ్మ కవిని ప్రార్థించిన సందర్భంలో చాటువు ఇది. తెనుగు కవి శ్రీనాథకవిసార్వభౌముడు దక్షిణాధీశుని ముత్యాలశాలలో &#8211; దీనారటంకాల తీర్థమాడించటానికి కూడా ఆ విరూపాక్షుని దీవెనలే తోడ్పడి ఉంటాయి.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=15585</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>క్రాస్ వర్డ్ పజిళ్లు &#8211; నా ప్రస్థానం</title>
		<link>http://vaakili.com/patrika/?p=15169</link>
		<comments>http://vaakili.com/patrika/?p=15169#comments</comments>
		<pubDate>Sat, 30 Sep 2017 18:20:33 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[ఎలనాగ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=15169</guid>
		<description><![CDATA[క్రాస్ వర్డ్ పజిళ్లను గురించిన నా అభిప్రాయమేమంటే, మూసిన నా పిడికిలిలో ఏముందో చెప్పుకో అన్నట్టుగా ఆధారాలు జటిలంగా ఉండటం కాక, పజిల్ను పూరించింతర్వాత పాఠకులకు తృప్తి, త్రిల్ కలిగించే విధంగా ఉండాలి, అని. అక్షరక్రీడకు/పదక్రీడకు (word play కు) అవకాశం ఉన్నప్పుడే తృప్తి, త్రిల్ కలిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని అనిపిస్తుంది నాకు. ఆధారంలోనే జవాబు దాగి వుండి, బాగా ఆలోచిస్తే అది మెదడుకు తట్టాలి. అట్లాంటి ఆధారాలను వర్ణించడానికి మన తెలుగు భాషలో అంతర్లాపి అనే ఒక పదమున్నదని నా అన్నయ్య (నాగరాజు రామస్వామి) చెప్తే తెలిసింది నాకు. ‘ద హిందు’ ఆంగ్లపత్రికలో వచ్చే క్రాస్ వర్డ్ పజిళ్లలో అటువంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">“ఆ</span>లేస్తు కంది”</p>
<p>“ఏం కూర వండమంటారు?”</p>
<p>“టటమా రకూ”</p>
<p>“ఈరోజేం వారం?”</p>
<p>“శురవా ముక్ర” (లేదా బువాధరం)</p>
<p>“ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడింది ఎవరితో?”</p>
<p>“లక్ష్మీ జరాం”</p>
<p>“ఆయనెక్కడుంటున్నాడిప్పుడు?”</p>
<p>“రామం జడ్రి”</p>
<p>ఇట్లాంటి సంభాషణ నాకూ నా శ్రీమతికీ మధ్య అప్పుడప్పుడు జరుగుతుందంటే మీరు నమ్ముతారో లేదో కానీ, తారుమారు మాటల వ్యవహారం మొదట్నుంచీ నాకెంతగానో నచ్చే విషయం! పై సంభాషణలోని 1, 3, 5, 7, 9 వాక్యాలకు సరైన రూపాలు ఆకలేస్తుంది, టమాట కూర, శుక్రవారము (బుధ వారం), లక్ష్మిరాజం, రాజమండ్రి అని మీరిప్పటికే గుర్తు పట్టి వుంటారు.</p>
<p>1965 ప్రాంతంలో &#8211; అంటే నేను ఆరవ తరగతిలోనో, ఏడవ తరగతిలోనో ఉన్నప్పుడు &#8211; పుస్తక ప్రపంచం అనే పత్రిక వచ్చేది. అందులోని చిన్న క్రాస్ వర్డ్ పజిల్ ను ఎంతో ఇష్టంగా పూరించే వాడిని. అది జటిలంగా ఉండేది కాదు. వేరు తెగిన వేరుశనగ, తల తారుమారైతే వచ్చే తీగ &#8211; ఇట్లా ఉండేవి ఆధారాలు. ఆ విధంగా నాకు తెలియకుండానే పజిళ్ల మీద Love at first sight ఏర్పడింది.</p>
<p>చాలా కాలం తర్వాత &#8211; అంటే నేను ఎం.బి.బి.ఎస్. లో ఉన్నప్పుడు &#8211; ఇంగ్లిష్ క్రాస్ వర్డ్ పజిళ్ల మీద నాకు మమకారం మరింతగా మొగ్గ తొడగటం మొదలైంది. ఎట్లా అంటే, నా సహాధ్యాయులైన రఘు, రాజేందర్ రెడ్డి, జయంతి నాయుడు క్లాస్ రూములో హిందు పత్రికలోని క్రాస్ వర్డ్ ను నింపుతుండేవారు. రఘు ఇప్పుడు కార్డియాలజిస్ట్. రాజేందర్ రెడ్డి పీడియాట్రిషన్. జయంతి నాయుడు కూడా ఏదో స్పెషలిస్ట్ అనుకుంటా. రఘు తప్ప మిగిలిన ఇద్దరు ఇప్పుడు USA లో ఉంటున్నారని నా ఊహ. అయితే, వాళ్లద్వారా నేను మరీ అంతగా నేర్చుకున్నదేం లేదు. వాళ్లు గడులను నింపుతుంటే కేవలం గమనిచేవాడిని &#8211; అంతే. కాని, తర్వాతి కాలంలో రఘు, నేను పక్కపక్క గదుల్లో ఉంటున్నప్పుడు, వాడు నాకు ఇంగ్లిష్ క్రాస్ వర్డ్ లను గురించిన ప్రాథమిక అవగాహనను కలిగించాడు. తర్వాత చాలా సంవత్సరాల అనంతరం నేను కాకతీయ మెడికల్ కాలేజ్ లో పీడియాట్రిక్స్ పి.జి. కోర్సు చేస్తున్నప్పుడు డాక్టర్ విఠల్ జనరల్ మెడిసిన్ పి.జి. విద్యార్థి. ఇప్పుడు కార్డియాలజిస్ట్ అయ్యాడు. అతను కూడా హిందు క్రాస్ వర్డ్ లను నింపుతుండేవాడు. మేం హాస్టల్లో ఉండేవాళ్లం కనుక ఉదయం, మధ్యాహ్నం తిండి కోసం డైనింగ్ హాల్లోకి వచ్చినప్పుడు కలిసి ఆ పజిల్ ను నింపటం మొదలు పెట్టాము. డాక్టర్ శ్రీరామ్ అనే ఒక తమిళుడు అప్పుడే రేడియాలజీలో పి.జి. కోర్సు చేస్తూ మా హాస్టల్లోనే ఉండేవాడు. అతనికి ఆంగ్లభాష మీద మంచి పట్టు ఉన్నా కూడా హిందు పజిల్ ను అసలే నింపలేక పోయేవాడు. ఒకసారి నా దగ్గరికి వచ్చి “సార్, ఎట్లా నింపుతారు మీరు అవన్నీ? నాక్కొంచెం వివరించరా ప్లీజ్” అని అడిగాడు. నేను అతనికి అవగాహన కలిగే విధంగా సాధ్యమైనంత వరకు తెలియజెప్పాను. తర్వాత అతను పుంజుకున్న తీరు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వారం రోజుల్లోనే ఎంతో నేర్చుకున్నాడు. ఉదయం కొంత మధ్యాహ్నం కొంత నింపి, సాయంత్రం టీ కోసం డైనింగ్ హాలుకు వచ్చినప్పుడు పజిల్ ను పూర్తి చేసేవాళ్లం. కొన్నిసార్లు నాకు రాని ఒకటి రెండు సమాధానాలను శ్రీరామ్ సాధించేవాడు. ఇక అప్పుడతని ఆనందానికి అవధులుండేవి కావు. నన్ను గట్టిగా కౌగిలించుకుని “కమాన్, లెటజ్ సెలెబ్రేట్ సర్” అంటూ బలవంతంగా రెస్టరాంట్ కు తీసుకుపోయి, బిస్కెట్లూ కేకులూ తినిపించి, టీ తాగించేవాడు. ఇప్పుడతను బెంగళూరులో స్థిరపడ్డాడని విన్నాను.</p>
<p>ఈ లోగా నేను ‘రచన’ మాసపత్రికలో రెండు దఫాలుగా పజిలింగ్ పజిల్ అనే శీర్షికన నిగూఢ ఆధారాలు గల పజిళ్లను దాదాపు నాలుగైదేళ్ల పాటు కూర్చాను. అయితే అవి మరీ అంత జటిలంగా ఉండేవి కావు. కాని, పాఠకాదరణను బాగానే చూరగొన్నాయి. క్రాస్ వర్డ్ పజిళ్లను గురించిన నా అభిప్రాయమేమంటే, మూసిన నా పిడికిలిలో ఏముందో చెప్పుకో అన్నట్టుగా ఆధారాలు జటిలంగా ఉండటం కాక, పజిల్ను పూరించింతర్వాత పాఠకులకు తృప్తి, త్రిల్ కలిగించే విధంగా ఉండాలి, అని. అక్షరక్రీడకు/పదక్రీడకు (word play కు) అవకాశం ఉన్నప్పుడే తృప్తి, త్రిల్ కలిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని అనిపిస్తుంది నాకు. ఆధారంలోనే జవాబు దాగి వుండి, బాగా ఆలోచిస్తే అది మెదడుకు తట్టాలి. అట్లాంటి ఆధారాలను వర్ణించడానికి మన తెలుగు భాషలో అంతర్లాపి అనే ఒక పదమున్నదని నా అన్నయ్య (నాగరాజు రామస్వామి) చెప్తే తెలిసింది నాకు. ‘ద హిందు’ ఆంగ్లపత్రికలో వచ్చే క్రాస్ వర్డ్ పజిళ్లలో అటువంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వాటిని ఛేదించాలంటే ఆంగ్లభాష బాగా రావటమే కాకుండా పదునైన ఊహాశక్తి, చురుకైన మేధ అవసరం. హిందు పత్రికలోని క్రాస్ వర్డ్ పజిళ్లను నేను కొన్ని దశాబ్దాలుగా దాదాపు ప్రతిరోజూ నింపుతూ వస్తున్నాను. అయినా ఇప్పుడు కూడా ఒక్కో పజిల్ను నింపటంకోసం గంటల తరబడి శ్రమించాల్సి వుంటుంది. సాధారణంగా 60 నుండి 99 శాతం వరకు కరెక్టుగా వస్తుంది. చాలా అరుదుగా &#8211; అంటే సరాసరిన నెలకొకసారి మాత్రమే &#8211; వంద శాతం కరెక్ట్ గా పూరించ గలుగుతాను. దీన్ని బట్టి ఆ పజిళ్లు ఎంత జటిలంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయినా ప్రతిరోజూ పూరించడానికి ప్రయత్నించటం మానను.</p>
<p>సుడోకు లాగానే ఈ క్రాస్ వర్డ్ పజిళ్ల పట్ల ఆసక్తి కూడా వ్యసనంగా మారే అవకాశముంది. అయితే అది లాభాన్నే చేకూరుస్తుంది తప్ప హానిని కలిగించదు కదా. పజిల్ను పూరించేటప్పుడు పర్యాయ పదాలకోసం బాగా ఆలోచించాల్సి వస్తుంది, నిఘంటువుల్లో వెతకాల్సి వస్తుంది. తద్వారా కొత్తకొత్త పర్యాయ పదాలనెన్నింటినో నేర్చుకుంటాం. ఇక మరుసటి రోజు జవాబుల్ని చూసుకున్నప్పుడు కూడా కొత్త వాటిని నేర్చుకుంటాం. ఇదంతా మెదడుకు వ్యాయామం లాంటిది కనుక, దీనివల్ల జ్ఞాపకశక్తి తప్పక పెరుగుతుంది.</p>
<p>నిగూఢ ఆధారాలతో కూడుకున్న పజిల్ ప్రక్రియను నేను సాహిత్య ప్రక్రియతో సమానంగా భావిస్తాను.</p>
<p style="text-align: center;">***</p>
<p style="text-align: left;">ఈ నెలతో &#8216;వాకిలి నుడి’ శీర్షిక రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ శీర్షికను నేను నిర్వహించ బోవటం లేదు. వేరొకరి చేత నిర్వహింపజేయాలా వద్దా అనే విషయాన్ని ప్రధాన సంపాదకులు నిర్ణయిస్తారు. ద్వైపార్శ్వ సౌష్ఠవం కలిగిన గ్రిడ్లు, నవ్యత చమత్కారం వైవిధ్యం కలిగిన ఆధారాలు &#8211; వీటిని సంతృప్తికరంగా తయారు చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని. అయినా, దీన్ని నడిపినంత కాలం నేను మాత్రం బాగా ఆనందించాను.</p>
<p>చాలా ఎక్కువ మంది పోటీలో పాల్గొనేలా పజిళ్లను రూపొందించక పోవడానికి కారణం ప్రమాణికతను నిలుపుకోవాలనే నా తపన మాత్రమే. మామూలు రకం పజిళ్లను చాలా పత్రికలు నిర్వహిస్తూనే ఉన్నాయి. వాటికి భిన్నంగా శీర్షికను ఉన్నత స్థాయిలో నడపాలని నాకొక బలమైన కోరిక ఉండింది. ఆధారాలు జటిలంగా ఉండాలా లేక సులభంగా ఉండాలా అన్నది ముఖ్యం కాదు. వాటిలో తెలుగు నుడికారం తాలూకు చమత్కారాన్ని మేళవిస్తున్నామా లేదా, వాటిని సరిగ్గా పూరించిన తర్వాత పాఠకుడు ఒక త్రిల్ ను పొందుతున్నాడా లేదా అన్నదే ముఖ్యమని నా అభిప్రాయం. ఇక ఆధారాలను రూపొందించడంలో నవ్యతను, వైవిధ్యాన్ని చూపాలన్నదే నాతపన.</p>
<p>నా ఈ ఆధారాలలోని కిటుకులను మొదట్లో చాలా మంది పట్టుకోలేక పోయినా, పజిల్ ప్రియులైన కొందరు పాఠకులు మెల్లమెల్లగా మెళకువలను నేర్చుకుని, సరిగ్గా పూరించే నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. అట్లా సంపాదించుకోలేని వారు ఈ పజిళ్లలో పస లేదని పెదవి విరిచారు. ఇప్పటిదాకా వచ్చిన, ఇప్పుడు వస్తున్న తెలుగు పజిళ్లలో ఉన్న నవ్యత కంటె, వైవిధ్యం కంటె నా పజిళ్లలో ఆ లక్షణాలు కొంచెమైనా ఎక్కువ పాళ్లలో ఉన్నాయని పాఠకులెవరైనా భావిస్తే, నేను నా లక్ష్యసాధనలో కృతకృత్యుడినయ్యానని అనుకుని ఆనందిస్తాను.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=15169</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>అమృత వర్షిణి</title>
		<link>http://vaakili.com/patrika/?p=14747</link>
		<comments>http://vaakili.com/patrika/?p=14747#comments</comments>
		<pubDate>Tue, 01 Aug 2017 18:42:22 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[శ్రీరంగవల్లి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=14747</guid>
		<description><![CDATA[<p>ఒక వేసవి సాయంకాలం కురిసిన ఎదురుచూడని వర్షం- అమృత!</p> <p>అమృతా ప్రీతమ్- ఎప్పుడు ఎలా పరిచయమైందో గాని చదివిన మొదటి సారే మనసుకి చాలా దగ్గరగా అనిపించిన రచయిత్రి. ఆలోచిస్తే గుర్తొచ్చింది, నా యునివర్సిటీ రోజులనుకుంటాను, ఒక వెన్నెల రాత్రి హాస్టల్లో చాలా మంది నిద్రపోతున్న వేళ, కొబ్బరాకు గలగలల మధ్య ఏదో పుస్తకం తిరగేస్తూ నడుస్తున్నాను-తడుస్తుంది, వెన్నెల్లో అనుకున్నాను కానీ&#8230; కాదు తన కవిత్వంలో! ఆ తడి నన్ను చాలా రోజులు వెంటాడింది.</p> <p>కొందరు మన జీవితంలో ఎందుకు తారసపడతారో తెలీదు- వదల్లేం. వ్యక్తిగతంగా పరిచయం లేకపొయినా కొందరు కవులూ, రచయితలు కూడా అంతే.</p> <p>అమృతప్రీతమ్ బాధని ఆస్వాదించారు. అదే విలువైనదని, తనమటుకు తనకు వాస్తవం ఏదైనా ఉందంటే అది ఒక రచయితగా తన అస్తిత్వమనీ అన్నారు. చాలా తేలికగా బాధని దిగమింగే తన వ్యక్తిత్వం, దాన్ని స్వీకరించిన తీరు, అందులోని ఒక రకమైన తెగింపు, నాకు తనని దగ్గర చేసాయనుకుంటాను.</p> <p>తన గురించి చెప్తూ, తన ఒంటరితనం లోనించే కవిత్వం మొదలైంది అంటారామె. అమృత ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండేది –ఆమె తండ్రి రచనావ్యాసంగమంతా రాత్రుళ్ళు సాగేది. అందువలన పగలంతా నిద్రపోయేవారాయన. ధనం, వైరాగ్యం సమపాళ్ళలో కలిసిన జీవితం తన తండ్రిది. &#8220;ఆయనకి బాహ్యప్రపంచం లో మిగిలిన ఒకేఒక బంధం నేను, అందులో బందీ అయినట్లు ఫీల్ అయ్యేవారేమో&#8221; అంటారు అమృత. కూతురి మీద ప్రేమ, దైనందిక విషయాలమీద వైరాగ్యం– ఈ రెండింటికీ మధ్య నలిగిపోయినట్లనిపించేవారట తన తండ్రి.</p> <p>చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన తనకు సమయమంతా పుస్తకాలమధ్య గడిచేది. అంత చిన్న వయసులో Acceptance మరియు Rejection ల మధ్య కొట్టుమిట్టాడేవారామె. యాభై సంవత్సరాల తరువాత అదే పరిస్థితి లో తనున్నానని చెప్పుకున్నారు. చిన్నప్పుడు తన తండ్రి ఇష్టానికి విరుద్దంగా ఏదీ చేయని అమృత, జీపితంలో ముందుకెళ్ళే కొద్దీ తన ఇష్టానికి మనస్సాక్షికి నచ్చనిదేదీ చేయలేదు. తనకి నచ్చినట్లు తన జీవితాన్ని [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">ఒ</span>క వేసవి సాయంకాలం కురిసిన ఎదురుచూడని వర్షం- అమృత!</p>
<p>అమృతా ప్రీతమ్- ఎప్పుడు ఎలా పరిచయమైందో గాని చదివిన మొదటి సారే మనసుకి చాలా దగ్గరగా అనిపించిన రచయిత్రి. ఆలోచిస్తే గుర్తొచ్చింది, నా యునివర్సిటీ రోజులనుకుంటాను, ఒక వెన్నెల రాత్రి హాస్టల్లో చాలా మంది నిద్రపోతున్న వేళ, కొబ్బరాకు గలగలల మధ్య ఏదో పుస్తకం తిరగేస్తూ నడుస్తున్నాను-తడుస్తుంది, వెన్నెల్లో అనుకున్నాను కానీ&#8230; కాదు తన కవిత్వంలో! ఆ తడి నన్ను చాలా రోజులు వెంటాడింది.</p>
<p>కొందరు మన జీవితంలో ఎందుకు తారసపడతారో తెలీదు- వదల్లేం. వ్యక్తిగతంగా పరిచయం లేకపొయినా కొందరు కవులూ, రచయితలు కూడా అంతే.</p>
<p>అమృతప్రీతమ్ బాధని ఆస్వాదించారు. అదే విలువైనదని, తనమటుకు తనకు వాస్తవం ఏదైనా ఉందంటే అది ఒక రచయితగా తన అస్తిత్వమనీ అన్నారు. చాలా తేలికగా బాధని దిగమింగే తన వ్యక్తిత్వం, దాన్ని స్వీకరించిన తీరు, అందులోని ఒక రకమైన తెగింపు, నాకు తనని దగ్గర చేసాయనుకుంటాను.</p>
<p>తన గురించి చెప్తూ, తన ఒంటరితనం లోనించే కవిత్వం మొదలైంది అంటారామె. అమృత ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండేది –ఆమె తండ్రి రచనావ్యాసంగమంతా రాత్రుళ్ళు సాగేది. అందువలన పగలంతా నిద్రపోయేవారాయన. ధనం, వైరాగ్యం సమపాళ్ళలో కలిసిన జీవితం తన తండ్రిది. &#8220;ఆయనకి బాహ్యప్రపంచం లో మిగిలిన ఒకేఒక బంధం నేను, అందులో బందీ అయినట్లు ఫీల్ అయ్యేవారేమో&#8221; అంటారు అమృత. కూతురి మీద ప్రేమ, దైనందిక విషయాలమీద వైరాగ్యం– ఈ రెండింటికీ మధ్య నలిగిపోయినట్లనిపించేవారట తన తండ్రి.</p>
<p>చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన తనకు సమయమంతా పుస్తకాలమధ్య గడిచేది. అంత చిన్న వయసులో Acceptance మరియు Rejection ల మధ్య కొట్టుమిట్టాడేవారామె. యాభై సంవత్సరాల తరువాత అదే పరిస్థితి లో తనున్నానని చెప్పుకున్నారు. చిన్నప్పుడు తన తండ్రి ఇష్టానికి విరుద్దంగా ఏదీ చేయని అమృత, జీపితంలో ముందుకెళ్ళే కొద్దీ తన ఇష్టానికి మనస్సాక్షికి నచ్చనిదేదీ చేయలేదు. తనకి నచ్చినట్లు తన జీవితాన్ని గడిపారు. ఇటువంటి పరిస్థితి ఎదురయ్యే మనుషులని, జీవితాల్ని బహుశా మనంకూడా దగ్గరగా చూస్తూనే ఉంటాం.</p>
<p>పంజాబీలో అధ్భుతంగా రచనలు చేసిన స్త్రీలల్లో అమృతది మొదటి స్థానం. ప్రస్తుతం పాకిస్తాన్ లోని భాగమైన పంజాబులో 1919 ఆగష్టు 31న జన్మించారు అమృత. పదకొండేళ్ళ వయసులో తల్లిని కోల్పోయి, పెద్దరికం వహించాల్సివచ్చిన సందర్భంలోనే వ్రాయడం మొదలు పెట్టారు. తన మొదటి కవితా సంకలనం ప్రచురించినప్పుడు తన వయసు కేవలం పదహారు. ప్రీతమ్ సింగ్ తో తన వివాహం జరిగిన సంవత్సరం కూడా అదే!</p>
<blockquote><p>“Like a thief came my sixteenth year, stealthily like a prowler in the<br />
night, stealing in through the open window of the head of my bed&#8230;”</p></blockquote>
<p>అమృత దృష్టిలో నైరూప్యత(Abstraction)కి అర్థం లేదు. ప్రతిదానికి రూపం, భావం ఉండాలంటారు. అనుభూతి తన దృష్టిలో చాలా ముఖ్యం. తన నమ్మకాలని ప్రశ్నించుకునే విచక్షణ, మార్పుని మనస్ఫూర్తిగా అంగీకరించే వ్యక్తిత్వం- అమృత ఎదుగుదలకి ఒక పునాది. దేశ విభజన ఆమెలో కలిగించిన బాధ ‘పింజర్’ గా రూపు దిద్దుకుంది.</p>
<p style="text-align: center;">***</p>
<p>ఒక మనిషి జీవితంలో, అందునా ఒక అమ్మాయి జీవితంలో, ప్రేమని మించిన యుద్దం ఏముంటుంది? మనసులో, మనసు బయటా కూడా యుద్దం! పదహారేళ్ళకే పెళ్ళైపోయిన సున్నితమనస్కురాలైన యువతికి, ప్రేమ ఆనవాలే లేని వివాహ సంబంధంలో కట్టుబడి పోయాక, అనునిత్యం సంఘర్షణే! కానీ ఇదే సంఘర్షణ, మనసుని నింపేసే అలజడి ఒక రచయితకి ఎంతో అవసరమైన లక్షణాలు. ఈ రెండూ కొంతైనా లేకుండా ఎటువంటి రచనా ప్రాణం పోసుకోగలదని నేననుకోను.</p>
<p>ఎవరికోసమైతే నాలుగక్షరాలు రాస్తామో, వాళ్ళ కంట్లో అవి పడనప్పుడూ- ఎన్ని అవార్డులు వచ్చినా ఎందరు ప్రశంసించినా ఏమీ అనిపించదు. 1957 లో ‘సునెహ్రె’ కి సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చినపుడు, అమృత అంతరంగమిదే.</p>
<p>మనసంతా శూన్యం నిండి, మళ్ళీ దాన్నిండా ఒక్క మనిషిని నింపేస్తే- అన్యమనస్కంగా చేసే ప్రతిపని లోనూ ఆపేరే జపమై పోదూ! అవార్డు తీసుకున్న సందర్భంగా ఇంటర్వ్యూ తీసుకునేందుకు వచ్చిన ఒక రిపోర్టర్ ఏదో వ్రాస్తున్నట్లు ఫోజ్ ఇమ్మంటే, ఎదురుగానున్న పేపర్ లో ఆగకుండా, అలోచించకుండా ఏదో లోకంలో ఉన్నట్లు, అమృత నింపిన పేరు – సాహిర్. ఆయన అన్యమనస్కంగా అమృత నింపిన కాగితంలోనే కాదు, ఆవిడ కలంలో కూడా నిండిపోయారు.</p>
<p>ఇంకాచెప్పాలంటే తన కొన్ని రచనలలో, పాత్రల్లోనూ ఇమిడిపోయారు- మచ్చుకు Ashoo, Ik Si Anita, Dilli Diyan Gallian లాంటివి కొన్ని.</p>
<p>బల్గేరియాలో ఒక సముద్రం ఒకవైపు, పర్వతాలు మరో వైపు ఉన్న రమణీయమైన ప్రశాంతతలో కూడా తన ఆలోచనల్లో అల్లుకున్న కవిత్వంలోని మొదటి లైన్లు&#8230; &#8220;Long have thoughts of you lain in exile..&#8221;</p>
<p>నిజానికి మనస్ఫూర్తిగా, నిశ్శబ్దంలో కూడా తను ప్రేమించిన వ్యక్తి సాహిర్ లూధియన్వి! చాలా సంవత్సరాలు గాఢంగా సాగిన ప్రేమ వాళ్ళది.అమృతకి సంబంధించినంతవరకూ, ఎవరినీ మధ్యకి రానివ్వనంతగా సాగిన ప్రేమ, సర్వం తానే అయిన ప్రేమ. అమృత జీవితంనిండా ఊహలు నిండిపోయిన కాలంలో- సాహిర్ గురించి చెప్తూ అమృత అంటుంది-</p>
<blockquote><p>Like divinity aiming at the creation of a wonderful one…<br />
Free from the claims of the flesh…<br />
Free from all that flesh and blood has been heir to<br />
From the dawn of creation…</p></blockquote>
<p>సాహిర్ ఊహల్లో నిండిపోయిన ఆమెకి, అప్పుడే పుట్టిన తన కొడుకులోను సాహిర్ ముఖమే కనిపించిందట. అతనితో ఉన్న సమయంలో ఆమెకేదీ గుర్తుకురాదు. ఒక్కమాట కూడా లేకుండా ఎన్నో గంటలు నిశ్శబ్దంలో, సాహిర్ కాల్చే సిగరెట్ పొగ మధ్యలో అతనితో గడిపేవారామె.</p>
<blockquote><p>There was a grief I smoked<br />
In silence, like a cigarette<br />
Only a few poems fell<br />
Out of the ash I flicked from it</p></blockquote>
<p>అమృత రాసిన ప్రతీ పదం కూడా సాహిర్ తన లోకమవడాన్నీ, తనకి సొంతమవడాన్ని ఇష్టపడ్తుందనుకుంటా. అలాంటిది ఒకసారి, పేపర్ లో సాహిర్ పక్కన ఒకమ్మాయి ఫోటో చూసి పిచ్చెక్కిపోయి చనిపోయినంత పని చేసింది. ప్రేమ ఇవ్వగలిగే ప్రశాంతత ఏ స్థాయిలో ఉంటుందో, అది దూరమవుతూ మిగిల్చే అశాంతి , రగిల్చే తుఫాను రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఇది జరిగిన సంవత్సరం 1960 ని తన జీవితంలో అత్యంత విషాదకరమైనది అంటారామె. అటువంటి తనని మళ్ళీ మామూలు మనిషిని చేసింది తన కవిత్వమే. అంతటి దిగులుని కాసింత తేలిక చేసింది కవిత్వమే.</p>
<blockquote><p>“When you cannot fill the goblet of night with the nectar of life:<br />
When you cannot taste the honey life offers you,<br />
You cannot call it tragedy&#8230;<br />
Tragedy is, when you write your life’s letter to your love and you<br />
Yourself go and lose his address&#8230;”</p></blockquote>
<p style="text-align: center;">***</p>
<p>అమృత జీవితాన్ని నాలుగు భాగాలుగా చూడాలనిపిస్తుంది నాకు- తన బాల్యం, పెళ్ళి, సాహిర్ ఇంకా ఇమ్రోజ్. నిశ్శబ్దాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా పంచుకోగల బంధం ఇమ్రోజ్ తో ఆమెకు ఉండింది. తను రాసుకున్న ఆటోబయోగ్రఫీలో మాత్రం ఆవిడ విభజించుకున్న నాలుగు భాగాలు వేరు-</p>
<p>మొదట్లో బోధిసత్వలా జీవితంలో ప్రతి క్షణాన్ని ఒక అద్భుతంలా చూశానంటారు అమృత. రెండో భాగంలో కాస్త తెలివి తెచ్చుకుని సమాజానికి ఎదురు తిరిగే ధైర్యాన్ని దిక్సూచిగా తలచి ముందుకెళ్ళానంటారు. మూడో భాగం వర్తమానాన్ని మర్చిపోయి, అవసరమైతే అంతం చేసుకుని, నచ్చిన భవిష్యత్తుని నిర్మించుకునే తెగింపు, కలల్ని అతి తేలిగ్గ కల్లలు చేసుకున్నా కూడా మళ్ళీ పేకాటలా<br />
కార్డులు పరిచి ఆట మొదలుపెట్టే ధైర్యం, ఓడిపొయిన ప్రతిసారీ సరికొత్త ఆశ, అదృష్టం మీద అమితమైన నమ్మకం. చివరగా మిగిలిన భాగమంతా సెన్సాఫ్ ఐసొలేషన్!</p>
<p>1960 చివరలో సాహిర్ వల్ల కలిగిన బాధకు అమృత కు సైకియాట్రిక్ ట్రీట్ మెంట్ అవసరమైంది. అదే సమయంలో తన మానసిక స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నంలో సైకాలజీకి సంబంధించిన చాలా పుస్తకాలు చదివారామె!అలాంటి స్థితి లోకూడా ఒక కవితా పురస్కారం అందుకోడానికి నేపాల్ వెళ్ళింది. అక్కడి నుండీ, ఇమ్రోజ్ కి రాసిన ఒక కవితలో…</p>
<blockquote><p>“Way farer! Why did you the first time meet me at an evening hour!<br />
I am approaching the turning point of my life.<br />
If you had to meet me at all why did you not meet me at high noon when<br />
You would have felt its heat”</p></blockquote>
<p>తరువాతి దశాబ్దం సాహితీపరంగా అమృతకు చాలా ఆక్టివ్ గా నడిచిన రోజులు- వివిధ దేశాలకి చెందిన రచయితలు, కవులతో తన పరిచయాన్ని, తను పాల్గొన్న కవి సమ్మేళనాల్ని ఎంతో ఇష్టంగా వివరిస్తారామె. ఉజ్బెకిస్తాన్ లోని ‘వెర్జాబ్’ అనే నదీతీరంలో తను పాల్గొన్న ఒక కార్యక్రమం గురించి వివరిస్తూ అందులో చదివిన కొన్ని కవితల్ని ప్రస్తావిస్తారు.</p>
<blockquote><p>Because a drop of your love got mixed in my cup<br />
I could drink the bitters of life…..<br />
But now a great many more drops are mixed….<br />
And life’s cup is a lot sweeter.</p></blockquote>
<p>తన స్నేహితురాలైన జుల్ఫియా ఖానుమ్ గురించి చెప్తూ&#8230;</p>
<blockquote><p>“When the tears are understood, the relationship deepens, does it not?”<br />
When pen embraces paper, earlier silences are forgotten<br />
Love reveals its secrets;<br />
In Uzbek or in Punjabi, the rhyme is the same.”</p></blockquote>
<p>తాష్కెంట్ లో అమృత అశువుగా చదివిన కొన్ని లైన్లు.</p>
<p>కొందరు బల్గేరియన్ కవుల కవితల్ని అనువదించారామె అలాంటి ఒక ‘ఇరాన్ వజోవ్’ కవిత-</p>
<blockquote><p>My faith<br />
That tomorrow<br />
Life will be finer<br />
Life will be wiser</p>
<p>My faith has strong armour<br />
In my sturdy breast<br />
And bullets that could shatter<br />
My faith<br />
Do not exist<br />
Do not exist!</p></blockquote>
<p>తన ‘రషీదీ టికెట్’ (Revenue Stamp) లో Ho Chi Minh వ్యక్తిత్వం ప్రభావం తన మీద ఎంత ఉందీ అనేదానికి ఉదాహరణ గా- ఆయనన్న మాటలు “మనిద్దరం పోరాడుతున్నాం, చెడ్డ విలువలతో- నువ్వు నీ కలంతో, నేను నా కత్తితో..” ఆయనకోసం Aashma రాశారావిడ.</p>
<p>క్వీన్ ఎలిజబెత్ సినిమానుండీ తను నేర్చుకున్న పాఠం “Your Majesty! Look a bit higher” అనే డైలాగ్ నుండీ అని చదివినప్పుడు, అరె నాక్కూడా ఇలానే అనిపించింది కదా అనుకున్నపుడు.. ఆమృత లాంటి రచయితలు ఇంకా దగ్గరవుతారు-<br />
మనసుకు! ఎంత యాధృచ్ఛికమయినా కూడా!</p>
<p>In Silence Passion Smote అనే భాగంలో అంటారు- ఒక రచయిత జీవితంలోని చిన్న చిన్నముక్కలన్నీ కధల్లో కవితల్లో చేరిపోతాయని. ఆమె జీవితం అంతే. ఎన్నో మానవ సంబంధాల సమ్మేళనం. స్నేహానికి ప్రాణమిచ్చే మనిషి ఆమె.</p>
<p>సజ్జాద్ హైదర్ ఒక పాకిస్తాన్ రచయిత. అమృత సాహిర్ కోసమ్ వ్రాసిన ‘Seven Years’ చదివి, సజ్జాద్ ఆమెను కలవాలనుకుంటున్నట్లు తన ఉత్తరంలో రాసాడు.. అలా వారి స్నేహం మొదలైంది. దేశవిభజన సమయంలో, ఆయన అమృత కోసం కర్ఫ్యూ ఎత్తివేసినపుడల్లా ఢిల్లీ వచ్చెళ్ళేవారు.</p>
<p>ఒక రోజు అమృత కొడుకుకి జ్వరంగా ఉన్నపుడు, సజ్జాద్ తనకోసం ప్రార్థించి, ఒక ఉత్తరంలో రాస్తాడు- “రాత్రంతా నీ కొడుక్కి నయమైపోవాలని ప్రార్థిస్తూనే ఉన్నాను, అరబిక్ వాళ్ళ నమ్మకంలా, మనకోసం మన శత్రువు ప్రార్థిస్తే, ఆ ప్రార్థనను దేవుడు వెంటనే వింటాడట.”  అంతటి సామీప్యత ఉండేది వారిద్దరి స్నేహంలో.</p>
<blockquote><p>“Buy me a pair of wings, stranger or come and live with me”</p></blockquote>
<p>ప్రేమ మాత్రమే కాదు ఒక మంచి స్నేహం కూడా కవిత్వాన్ని సృష్టించగలదని అమృత రాసిన కొన్ని లైన్లు చదివితే అనిపిస్తుంది.</p>
<blockquote><p>“When pen embraces page, earlier silence are forgotten<br />
Love reveals its secrets”</p></blockquote>
<p>ప్రేమ ఒక వాస్తవమా?వాస్తవమైన కల్పనా? లేక కల్పన అయిన వాస్తవమా? ఒక జీవిత కాలం సరిపోదేమో ఈ అన్వేషణకి! వెతికినంత మాత్రాన దొరకనిదీ, దొరికిన తరువాత మళ్ళీ వెతికే ప్రయత్నం చేయకుండా నిలిపేదీ ప్రేమ.</p>
<p>&#8220;Yeh mein hoon yeh tu hai, aur beech mein hai sapana” (This is me and that’s you and in the chasm is the dream)</p>
<p>ఒక జీవిత కాలమంత సాగిన తన ప్రేమాన్వేషణకి….ఇమ్రోజ్ ముగింపు. ఒక నిజమైన స్నేహితుడు, ఒక మనసుకి చేరువైన బంధం, స్వఛ్ఛమైన ప్రేమకి ప్రతిరూపం. ప్రతి మనిషి కోరుకునేది ఈ ప్రపంచంలో కనీసం ఒక్కరి దగ్గరైనా నేను నేనుగా ఎటువంటి ముసుగులు వేసుకోకుండా ఉండాలని, ఒక్కరైనా నన్ను నన్నుగా అంగీకరించాలని, నాకోసం ఒక అద్దంలా మిగలాలనీ.. ప్రతి మనిషికీ ఏదో ఒక సందర్భంలో ఇలా అనిపించినా చాలా కొద్దిమందికే ఆ అదృష్టం దక్కుతుంది. అమృతా ప్రీతమ్ కి ఇవన్నీ లభించింది ఇమ్రోజ్ వల్ల! అతను నీడలా ఆమెని అంటి పెట్టుకున్న వ్యక్తి. ఆమెని సంపూర్తిగా అంగీకరించి ప్రక్కన నిలబడిన వ్యక్తి.</p>
<p>ఒక ఇద్దరు పిల్లల తల్లి అయిన అమృతను, తనకంటే వయసులో చాలా పెద్దదైనా కూడా- మనస్పూర్తిగా ప్రేమించి జీవితమంతా తోడై నిలిచిన ప్రేమ అతడిది.ఇమ్రోజ్ ఒక ఆర్టిస్టు. అక్షరాలకి రంగులకీ మధ్య అల్లుకున్న అపురూపమైన బంధం అది.వారిమధ్య సాగిన ఉత్తరాలన్నీ సున్నితమైన భావాల బరువుతో నిండిపోయేవి. అంతే కాదు చాలా భిన్నమైన విషయాలమీద చర్చలు అభిప్రాయాలు కూడా మధ్యమధ్య చొరబడేవి.</p>
<p>ఇమ్రోజ్ కి సంబంధించినంత వరకూ అమృత చనిపోలేదు. ఒక ఇంటర్వ్యూ లో అతనంటాడు- “నేను బ్రతికి ఉండగా అమృత ఎలా చనిపోతుంది? ఎన్నో అందమైన క్షణాల్ని పంచుకున్నాం మేమిద్దరమూ, ఇంకా పంచుకుంటూనే ఉంటాం! నా ఉనికిలోనే అమృత జీవించి ఉంది&#8221;</p>
<p style="text-align: center;">***</p>
<p>అమృత- సాహిర్<br />
కొంతమంది ఒక్క స్పర్శతో స్త్రీలోని పరిపూర్ణత్వానికి కారణమవుతారు.<br />
అమృత- ఇమ్రోజ్<br />
ఇంకొంతమంది స్పర్శించకనే, స్త్రీ తనలోని నిజమైన స్త్రీత్వాన్ని పునరావిష్కరించుకునేందుకు పునాది అవుతారు.<br />
అమృత-<br />
తన మరణం తరువాత- మిగిలిపోయిన యే అక్షరాల్లోనో, గుల్జార్ గొంతులోనో, స్పందించిన హృదయాల్లోనో మిగిలిపోయిన అమృత! అవును. మరికొంతమంది ఆమెని గుండెలో దాచుకుంటారు. తన పేరుకి అర్ధం తెలుసుకుంటారు.</p>
<p>ఈ మధ్య గుల్జార్ రిలీజ్ చేసిన ఒక ఆల్బమ్ లో, తన గొంతుతో అమృత కవితల్ని చదివారు. ఆయన మాటల్లో- &#8220;అమృతాజీ ఇరవయ్యో శతాబ్దమంతా, పంజాబీ కవిత్వపు పేజీలపైన ప్రయాణించారు, శతాబ్దాంతంలో మాత్రం, శరీరం క్షీణించిపోయినా, ఆత్మఒకప్పటికంటే ఉల్లాసంగా నడక ఆరంభించింది. జీవిత ప్రయాణం లో తన సహచరుడైన ఇమ్రొజ్ చేయి పట్టుకుని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, నడుస్తున్న ఆమె వెనక్కి తిరిగి “మళ్ళీ నిన్ను కలుస్తానన్నారట&#8221; (I will meet you again).</p>
<blockquote><p><a href=" https://youtu.be/hL9eaEDKSBQ" target="_blank">Mein tainu pher Milan gi (I will meet you yet again)</a></p>
<p>&#8220;ఎక్కడో ఎలాగో తెలీదు<br />
నిన్నుమాత్రం కలుస్తాను</p>
<p>ఊహలోనో<br />
కాన్వాసుమీదనుండి<br />
నిన్నే చూసే<br />
వివర్ణరేఖలోనో</p>
<p>నిల్చునో<br />
విస్తరిస్తూనో</p>
<p>ఎలాగో తెలీదు<br />
పొడ ఎండలా నీ వేళ్ళని తాకి<br />
రంగుల్తో నన్ను నేను చిత్రించుకుంటూనో<br />
స్నానమాడిన తుంపర ఒంటిని<br />
చల్లటి వసంతమై తుడుచుకుంటూనో<br />
వెచ్చటి నీ ఛాతిపై వాలిపోతూనో</p>
<p>ఈ దేహం ఉన్నంతసేపే<br />
జీవితం నాతో నడుస్తుందని తెలుసు<br />
ఉన్నంతలో జ్ఞాపకాల్ని<br />
అల్లుతూపోవడమూ తెల్సు</p>
<p>గుర్తుల్ని యేరుకుంటూ,కుదురుగా అల్లుకుంటూ<br />
ఎక్కడో ఎలాగో తెలీదు<br />
నిన్నుమాత్రం కలుస్తాను<br />
మళ్ళీ తప్పకుండా నిన్ను కలుసుకుంటాను</p></blockquote>
<p>&#8230;. నదీవనంలో, సువిశాల మైదానంలో కురిసే పున్నమి వెన్నెల్ని, దోసిట్లో పట్టి చూపెట్టామంటే ఎలా సాధ్యం? అమృత గురించి ఎంత వ్రాయాలన్నా నా మటుకు నాకు అదే పరిస్థితి!.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
<hr />
<p>అమృతా ప్రీతమ్ Imroz కి రాసిన ఉత్తరాలు:</p>
<hr />
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/08/Amritas-letters_.jpg"><img class="alignright size-full wp-image-14851" title="Amrita's letters_" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/08/Amritas-letters_.jpg" alt="" width="324" height="499" /></a><br />
1.</p>
<p>ఇప్పుడెందుకు కలిసావు నన్ను?<br />
ఇంత ఆలస్యంగా, ఈ సుర్యాస్తమయ వేళ<br />
ఈ ప్రయాణం ముగిసిపోయే తరుణంలో!<br />
నేను పయనమై వెళ్ళే సమయం దగ్గర పడినప్పుడు!<br />
ఒకవేళ మన కలయిక విధి నిర్ణయమైతే,<br />
అపరాహ్ణపు వేళలో నువ్వు తారసపడి ఉండాల్సింది.<br />
వెచ్చని కిరణాల కింద జీవితాన్ని పరిచేందుకు…<br />
(ఖాట్మండులో ఎవరో ఈ కవితని హిందీలో చదివారు).</p>
<p>మనసుకి కలిగే బాధని, దుఃఖాన్నీ మనుషులంతా ఒకేరకంగా అనుభవిస్తారుగా.భూమ్మీద ఎక్కడైనా ఎడబాటు రేపేబాధ ఒకటేగా! చల్లదనం నిండిపోయిన నా ఈ జీవనసంధ్యలో ఇక పెద్దగా ఎదురుచూడాల్సినవి ఏవీ లేవు- సూర్యకిరణాల్లాంటి నీ అక్షరాలు..నన్ను వెచ్చబెట్టుకునే ఆ పదాలు తప్ప!</p>
<p>ఎంతో క్రూరమైనవి కదూ బాంబే సిటీ కైవారాలు? నా సున్నితమైన భావాలన్నీ వాటికి తగిలి గాయపడినట్లు ఏదో భావన.<br />
ఇప్పటికే పధ్నాలుగు సంవత్సరాలు ప్రవాసంలో గడిపాను, నా ప్రేమకి.. ప్రాణానికి… దూరంగా! వనవాసం అయిపోయినట్టు లేదు.మిగిలిన యేళ్ళు కూడా ఇలానే, ఇదే విరహంతోనే గడుస్తాయంటావా?</p>
<p>ఇన్నాళ్ళలో నీనుండి ఒకే ఒక్క ఉత్తరం వచ్చింది. నా ఖాట్మండు అడ్రెస్ మర్చిపోయావా? ప్రతిరోజూ నీ నుండి కనీసం ఒక్క పదమైనా వస్తుందేమో అని ఎదురుచూపులు! ఇక్కడి జనమంతా ఏవేవో చాలా చెప్తారు నా గురించి,నా రచనల గురించి, మనసుని తాకేలా&#8230;కానీ అదేంటో ఆ పొగడ్తలన్నీ నీ మీద నా విరహాన్నిఎక్కువచేసాయేగానీ తగ్గించలేదు.</p>
<p>నాకు నేను మిగుల్తానా? ఈ భావోద్వేగంలో, మోహంలో కాలిపోతూ , ఎంత కాలమని ఉండగలను? గత మూడు రోజుల్నించీ ఆత్రంగాఎదురు చూపులు….ఈ రోజేమో నిండా జ్వరం.నిన్నే ఖాట్మండు నుండి వచ్చాను, రాత్రి తొమ్మిది తరువాత! డైరెక్టు ఫ్లైటు దొరక్క, మధ్యలో ఇంకో విమానం మారాల్సి వచ్చింది. విపరీతమైన దాహంతో ఉన్నపుడు, ఒక్క నీటి చుక్కకోసం ఎలానో ఎదురుచూస్తాం కదా? చెప్పాలంటే నా పరిస్థితీ అదే! ఒకేఒక్క పదమైనా నీ నుండి వస్తుందని! ఇంత పొదుపు ఎప్పటినుండమ్మా…..నీ అక్షరాల్లో కూడా!<br />
&#8211;<br />
అదిగో…పోష్టుమాన్ వచ్చినట్టుంది. అడుగులు దగ్గరవుతున్నాయి..ఊహు! వెళ్ళిపోయాడు. నా తలుపు దగ్గర ఆగిన దాఖలాలేం లేవు. .ఒకసారి నాతో అన్నావు గుర్తుందా? నా ప్రశ్నలన్నింటికీ ‘నువ్వే’ జవాబు అని; మరి అలాంటి నాకు ‘జవాబు’గా మౌనం….?</p>
<p>01.02.1960</p>
<p style="text-align: center;">***</p>
<p>2.</p>
<p>ఏం చేస్తావ్ నువ్వు? నా పాటల్లో ప్రాణాన్ని నింపుతావు.</p>
<p>ఈరోజే నీ నుండి ఉత్తరం వచ్చింది. నా ఉత్తరాలకి జవాబులు వచ్చినందుకు, ఈ జీవితం అంటే<br />
చాలా కృతజ్ణతగా ఉంది. కానీ ఇన్నాళ్ళు నా ఉత్తరాలన్నీ నీకు ఎందుకు చేరలేదు?<br />
మనసంతా విషాదాన్ని నింపుకుని రాసిన అక్షరాలవన్నీ..</p>
<p>“నా జీవితపు<br />
ఉత్తరం గాలికి కొట్టుకు పోతున్నప్పుడు, అది చేరాల్సిన మనిషి పేరుని, నా ప్రాణాధికమైన<br />
పేరుని, నా రక్తంతో రాసి ఉన్న నీ పేరుని చదవడం విధికి చేతకాలేదు,</p>
<p>ఇప్పుడు ఆ పేరేదో తెలిసిపోయింది కానీ, పరిస్థితులన్నీ<br />
విధితోనే చేతులు కలిపాయేమో, ఆ పేరుని వేరెవరూ చదవలేకపోతున్నారు.&#8221;</p>
<p>నేపాల్ లో టాగూర్ వ్రాసిన ఒక పాటని చదివానుః</p>
<p>&#8220;నువ్వే నా సాగరానివి , నా నావికుడవు కూడా నువ్వే.<br />
నేనో పడవనైతే తీరం వైపు చూడటమెందుకట?<br />
మునిగినా, అది నీలోనే !<br />
నా సాగరంలోనే కదా!&#8221;</p>
<p>5.02.1960</p>
<p style="text-align: center;">***</p>
<p>These two letters are from the book &#8216; In the times of Love and Longing – Amrita and Imroz&#8217;<br />
A collection of letters exchanged between the most prominent Punjabi poet, essayist and novelist, Amrita<br />
Pritam and Imroz – painter and artist.</p>
<p style="text-align: center;">**** (*) ***</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=14747</wfw:commentRss>
		<slash:comments>4</slash:comments>
		</item>
		<item>
		<title>మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్ నవలలు &#8211; ది ప్రెసిడెంట్ , మెన్ ఆఫ్ మైజ్</title>
		<link>http://vaakili.com/patrika/?p=14720</link>
		<comments>http://vaakili.com/patrika/?p=14720#comments</comments>
		<pubDate>Tue, 01 Aug 2017 18:42:08 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[సురేష్]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=14720</guid>
		<description><![CDATA[తన తల్లిని అవమానించటంతో ఒక యాచకుడు ఓ సైనికాధికారిని పొరపాటున చంపటంతో కథ మొదలవుతుంది. నియంత ఆ హత్యను స్వప్రయోజనానికి వాడుకోవాలని ఆ నేరాన్ని తన అసమ్మతి వర్గానికి చెందిన మరొక సైనికాధికారి మీద మోపుతాడు. ]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">ఎ</span>స్ట్రాడా కాబ్రెరా అంటే తెలీదు. జార్జ్ ఉబికో అంతకంటే తెలీదు.</p>
<p>రోజాస్ పినిల్లా, మాన్యుఎల్ ఓడ్రియా అనే పేర్లే విని ఉండం.</p>
<p>అనస్టస్లో సోమోజా?</p>
<p>రాఫెల్ ట్రుజ్జిలో?</p>
<p>పెరెజ్ జిమినెజ్?</p>
<p>పెడ్రో యుగెన్లో అరంబురు?</p>
<p>కానీ మాజికల్ రియలిజం అంటే విని ఉంటాం. అది లాటిన్ అమెరికాలో పుట్టిందని ఎవరో అనే ఉంటారు. ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’ అర్ధం అయిన మత్తులో కొందరూ, అర్ధం కాని భయంతో ఇంకొందరూ చెప్తే అలాటి నవల ఉందని తెలుసుకొనే ఉంటాం.</p>
<p>అయితే తెలీనిదల్లా చరిత్రలో సమస్త ప్రపంచం పైన చెప్పిన నియంతలకు పాదాక్రాంతమైనట్టు కనిపించిన సమయాల్లో కూడా అక్కడి ఒంటరి నిస్సహాయ రచయితలు కొందరు ఏటికి ఎదురీది తమ కలం బలంతో ఆ నియంతల్ని ఢీకొట్టారన్న విషయం. తమ సృజనాత్మక శక్తినే సైన్యంగా మలిచి వాళ్ళు తిరుగుబాటు ప్రకటించారు. అణచివేతలకు, క్రూరశిక్షలకు సిద్దపడి తమ గుండె ధైర్యాన్ని చాటారు.</p>
<p>కాల ప్రవాహంలో కత్తి కన్నా కలం గొప్పదని చరిత్ర నిరూపించింది. ఇతరేతర శక్తులు లేస్తే ఆయా నియంతలు మాత్రం మట్టి కరిచారు. చరిత్ర తన చీకటి కోణాల్లో వాళ్ళని పూడ్చిపెట్టింది, కానీ వాళ్ళు తమ కాళ్ళకింద తొక్కి పెట్టాలనుకున్న ఆ రచయితల్నీ సృజనకారుల్నీ మాత్రం అదే చరిత్ర మనకోసం సాహిత్య రూపంలో పదిలంగా నిలబెట్టి ఉంచింది.</p>
<p>లాటిన్ అమెరికన్ దేశాలకు చెందిన అలాంటి రచయిత మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్.<br />
<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/08/Austrias-1.jpg"><img class="alignright size-full wp-image-14726" title="Austrias 1" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/08/Austrias-1.jpg" alt="" width="275" height="183" /></a><br />
తన దేశపు పాలక వర్గాలకెదురొడ్డి దేశబహిష్కరణకి గురయ్యి దశాబ్దాల పాటు పరాయినేలమీద తలదాచుకొంటూనే నిషేధాలకు బలవుతూనే తన దేశంకోసం, ప్రజల కోసం, అక్కడి భూమిపుత్రుల కోసం కలం పట్టిన నిలిచి గెలిచిన ప్రజా రచయిత ఆస్ట్రియాస్.</p>
<p>మాజికల్ రియలిజం అన్న పేరే తెలియని కాలంలో ఆస్ట్రియాస్ సృష్టించిన మార్మిక కథన శైలి ‘అలెజో కార్పెంటియర్’, ‘జువాన్ రుల్ఫో’, ‘కోర్తజార్’, ‘మార్క్వెజ్’ , ‘ఇసబెల్ అలెండీ’, ‘పాజ్’ వంటి ప్రపంచ స్థాయి రచయితలకు ప్రేరణగా నిలిచింది.</p>
<p>ఆయన రచించిన &#8216;ది ప్రెసిడెంట్ &#8216;, &#8216; మెన్ ఆఫ్ మైజ్ &#8216; నవలలు రెండూ ప్రపంచ సాహిత్య గమనంలో రెండు మైలురాళ్ళు.</p>
<p><span style="text-decoration: underline;"><strong>ది ప్రెసిడెంట్ :</strong></span><br />
<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/08/The-President-coverpage.jpg"><img class="alignleft size-full wp-image-14727" title="The President coverpage" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/08/The-President-coverpage.jpg" alt="" height="400" /></a><br />
ప్రపంచ సాహిత్యంలో నియంతల గురించీ, వారి ఆవిర్భావం, ఎదుగుదల, అణచివేత, నిరంకుశ ప్రవృత్తి, వారి ఉత్థానపతనాల ప్రస్థానాన్ని చిత్రిస్తూ ప్రతిభావంతమైన నవలలు కొన్ని వచ్చాయి. పాశ్చాత్య సాహిత్యంలో ఆ రచనా ధోరణిని &#8216;డిక్టేటర్ నావెల్&#8217; అని పిలుస్తారు. అలాంటి &#8216;డిక్టేటర్ నావెల్&#8217; రచనా ధోరణికి లాటిన్ అమెరికన్ సాహిత్యంలో అద్యుడు మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్.</p>
<p>&#8216;ది ప్రెసిడెంట్&#8217; మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్ పౌరాణిక జానపద శైలిలో రచించాడు. స్వప్నలిపి వంటి భాషతో కళ్ళకు కట్టే మార్మిక దృశ్య సమాహారంతో లాటిన్ అమెరికన్ సాహిత్య చరిత్రలోనే ఓ కొత్త ధోరణికి నాంది పలికాడు.</p>
<p>తన తల్లిని అవమానించటంతో ఒక యాచకుడు ఓ సైనికాధికారిని పొరపాటున చంపటంతో కథ మొదలవుతుంది. నియంత ఆ హత్యను స్వప్రయోజనానికి వాడుకోవాలని ఆ నేరాన్ని తన అసమ్మతి వర్గానికి చెందిన మరొక సైనికాధికారి మీద మోపుతాడు. అంతే కాక అతడు దేశం విడిచి పారిపోయేందుకు అవకాశం ఇస్తాడు. అలా పారిపోయేందుకు సహాయం చెయ్యమని తనకు నమ్మకస్తుడయిన మరొక అధికారిని నియమిస్తాడు. అయితే ఆ నమ్మకస్తుడయిన అధికారి ఆ సైనికాధికారి కూతురి ప్రేమలో పడటంతో కథ అనూహ్యమయిన మలుపు తిరుగుతుంది.</p>
<p>నియంత స్వభావాన్ని చిత్రించటంలో లోతైన చూపును రచయిత ఇక్కడ ప్రదర్శిస్తాడు. ఒక దేశానికో ఒక వ్యక్తికో సంబంధించిన కథగా కాకుండా అనేక మంది నియంతల స్వభావాల్ని వడకట్టి ఒక నియంత పాత్రను సృష్టించాడు. ఒక ప్రత్యేక అంశాన్ని సాధారణీకరించటంలో ఒక స్థానికతను ప్రపంచ పరివ్యాప్తం చేయటంలోనే ప్రతిభా వంతులయిన రచయతల రచనా నైపుణ్యం దాగి ఉంటుంది. అలాంటి ప్రపంచ స్థాయి రచయిత మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్.</p>
<p>ఈ నవలను 1920లో మొదలుపెట్టి 1933లో పూర్తిచేసినప్పటికీ మరొక పదమూడేళ్ళకు పైగా నిషేదించబడి 1946లో ప్రచురణకు నోచుకొంది. ఈ నవల ప్రేరణతోనే మార్క్వెజ్ ‘ఆటమ్ ఆఫ్ పేట్రియార్క్’, ల్లోసా ‘ఫీస్ట్ ఆఫ్ గోట్’, కార్పెంటియర్ ‘రీజన్స్ ఒఫ్ స్టేట్’ నవలలను రాశారు.</p>
<p><span style="text-decoration: underline;"><strong>మెన్ ఆఫ్ మైజ్:</strong></span><br />
<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/08/Men-of-Maize-1.jpg"><img class="alignleft size-full wp-image-14728" title="Men of Maize 1" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/08/Men-of-Maize-1.jpg" alt="" height="400" /></a><br />
అది కలా నిజమా? పౌరాణికమా చరిత్రకమా? వచనమా కవిత్వమా? గతమా వర్తమానమా? కల్పనా వాస్తవమా? జానపదమా సర్రియలిజమా? మౌఖిక కథనమా ఏదీకాని దిగంతాల స్వప్న సంభాషణా?</p>
<p>ఇవన్నీ కల గలిసిన ఓ సరికొత్త శైలిలో లాటిన్ అమెరికన్ సాహిత్యంలోనే అత్యంత క్లిష్టమయిన ఆధునిక మహా కావ్య రచనకు పూనుకొన్నాడు మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్. అదే మెన్ ఆఫ్ మైజ్ నవల.</p>
<p>వేల సంవత్సరాల మాయన్ నాగరికతా ప్రస్థానంలో ఆ మూలవాసుల మార్మిక సంస్కృతి మొక్కజొన్న పంటతో పెనవేసుకుపోయింది. వారి జీవన విధానం 16వ శతాబ్దంలో బయటనుంచీ వచ్చిన లాటిన్ వలసవాదుల దాడితో కకావికలయ్యింది. వారికి మొక్కజొన్న ఒక వ్యాపార వస్తువు తప్ప మరేమీ కాదు. లాభాలు పండించే స్థలాలుగా తప్ప అక్కడి మట్టికి మరే విలువా లేదు. ఆ ఆధునిక వర్తక విలువలతో తలపడిన మూలవాసులకి నాయకత్వం వహిస్తాడు గాస్పర్ లోమ్ అనే నాయకుడు. ఆ క్రమంలో హత్యకు గురయ్యి ఒక జానపద కథా నాయకుడై మరల జీవిస్తాడు. ఆ ఘర్హణల్లో తప్పిపోయిన భార్య కోసం అన్వేషించే క్రమంలో తోడేలుగా మారిపోతాడు నికో అనే మరో కథా నాయకుడు. మూలవాసుల ఆదిమ సౌందర్య ప్రపంచం పెట్టుబడిదారీ పదఘట్టనలకింద ధ్వంసమై వారు పరాజితులై మిగిలిపోతారు.</p>
<p>1949లో అచ్చయిన ఈ నవల ఆ శతాబ్దానికే ప్రశ్నార్ధకమై నిలిచి సమస్త పాశ్చాత్య సాహితీ ప్రపంచాన్నీ కలవరపెట్టింది. మాజికల్ రియలిజం అన్న పేరే తెలియని కాలంలో ఆస్ట్రియాస్ సృష్టించిన ఈ కళాఖండం మరెందరో రచయితలకు ప్రేరణగా నిలిచి లాటిన్ అమెరికన్ సాహిత్యాన్ని పెను మలుపు తిప్పింది.</p>
<p><span style="text-decoration: underline;"><strong>ఆస్ట్రియాస్ నేపధ్యం:</strong></span></p>
<p>మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్ లాటిన్ అమెరికాలోని గాటిమాలా దేశంలో 1899లో జన్మించాడు. కవిత్వం, నవలలు, నాటక రచనలో ప్రసిద్దుడు. జర్నలిస్టుగా, లాయర్‌గా, డిప్లొమాట్‌గా పనిచేశాడు.</p>
<p>క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితమే గాటిమాలాలో మాయన్‌ల నాగరికత ఆవిర్భవించి గణిత శాస్త్రం, ఖగోళశాస్త్రం, వ్యవసాయం, ఇతర వైజ్ఞానిక రంగాల్లో ఎంతో వికసించింది. గ్రిగోరియన్ కాలెండర్‌కన్నా ఎంతో ముందే మాయన్లు కాలెండర్‌ను కనిపెట్టారన్నది సమస్త ప్రమంచం గుర్తించింది. 15వ శతాబ్దంలో స్పానిష్ వలసవాదుల దండయాత్రలతో మాయన్ నాగరికతా పతనం ప్రారంభమయి 18 వ శతాబ్దంలో అమెరికాకు చెందిన వ్యాపారుల వలసలతో ఆ భూమి పుత్రులు చివరకు తమ నేలకూ తమ సంస్కృతికీ పరాయివారుగా మిగిలారు.<br />
<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/08/220px-Leyendas_de_Guatemala.jpg"><img class="alignright size-full wp-image-14729" title="220px-Leyendas_de_Guatemala" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/08/220px-Leyendas_de_Guatemala.jpg" alt="" width="220" height="320" /></a><br />
ఆస్ట్రియాస్ పూర్వీకులు స్పానిష్ నేపధ్యంలోంచి వచ్చినవారే అయినా గాటిమాలా భూమిపుత్రులైన మాయన్ తెగలకు మద్దతుగా నిలిచి అక్కడి పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. ఆస్ట్రియాస్ జన్మించిన నాటికి గాటిమాలా దేశం ఎస్ట్రాడా కాబ్రెరా అనే నియంత పాలనలో మగ్గుతోంది. ఆస్ట్రియాస్‌కు ఐదేళ్ళవయసులో ఒక విద్యార్థి తిరుగుబాటు ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు ఆస్ట్రియాస్ తండ్రి తన జడ్జి పదవిని పోగొట్టుకొని దేశంలోని ఒక మారుమూల ప్రాంతానికి వలస పోవాల్సి వచ్చింది.</p>
<p>అక్కడి ఆదివాసులతో ఆస్ట్రియాస్‌కు ఏర్పడిన అనుబంధం వారు చెప్పిన తమ కథలు గాధలూ అతడి తరువాతి రచనా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. స్కూలు వయసులోనే ఆస్ట్రియాస్ కథలు రాయటం ప్రారంబించాడు. అలాంటి ఒక కథే తరువాత కాలంలో &#8216;ది ప్రెసిడెంట్&#8217; నవలగా రూపుదిద్దుకుంది.</p>
<p>ఇరవై యేళ్ళ వయసులో అతడు మెడిసిన్, న్యాయవాద విద్యలను అభ్యసించాడు. దేశంలోనే మొదటిసారిగా నేటివ్ ఇండియన్స్ సమస్యల మీద అతడు రాసిన పరిశోధనా పత్రానికి అప్పుడే ప్రతిష్ఠాత్మకమయిన అవార్డ్ లభించింది. యూనివర్సిటీలోనే అతడు అత్యుత్తమ విద్యార్ధిగా నిలిచాడు.</p>
<p>అదే సమయంలో ప్రజల పక్షాన నిలిచిన అక్కడి యూనియనిస్ట్ పార్టీ రాజకీయల్లోనూ చురుకైన పాత్ర పోషించాడు. విద్యార్ధి ఉద్యమాలకు నాయకుడయ్యాడు. అతడు స్థాపించిన యూనివర్సిటీ విద్యార్ధి సంఘం ఆ తర్వాతి కాలంలో నియంతపాలనను తుదముట్టించటంలో ముఖ్య పాత్ర పోషించింది. అప్పటి ఆ రాజకీయ సంఘటనలు కూడా &#8216;ది ప్రెసిడెంట్&#8217; నవలలో చోటుచేసుకొన్నాయి.</p>
<p>1923లో న్యాయవాద విద్యని ముగించి పై చదువులకోసం అతడు ఫ్రాన్స్ వెళ్ళి పారిస్ యూనివర్సిటీలో ప్రాచీన జాతుల కు సంబంధిన &#8216;ఎథ్నాలజీ&#8217; శాస్త్రం అభ్యసించాడు. అక్కడి స్వేచ్చా భావనలు , ఉదారవాద సాహిత్యం కళలు, సర్రియలిస్ట్ సాహితీ ధోరణులు అతడిని ఎంతో ప్రభావితం చేశాయి.</p>
<p>ఆ సుదూర దేశంలొ ఉన్నప్పుడే అతడికి తమ ప్రాంతపు మాయన్ల సంస్కృతిపైకి మనసు మళ్ళింది. మాయన్ల ప్రాచీన గ్రంధం &#8216;పొపోల్ వు&#8217; ని స్పానిష్ లోకి అనువదించాడు. పారిస్‌లో ఉండగానే 1930లో ప్రాచీన జానపద కథన శైలికి అధివాస్తవిక కవితాత్మక ధోరణిని జోడించి &#8216;లెజెండ్స్ ఆఫ్ గాటిమాలా&#8217; అనే కథలను మొదటిసారిగా రచించి ప్రచురించాడు. అతడి ఈ నూతన శైలికే తర్వాత దశాబ్దాలలో &#8216;మాజికల్ రియలిజం&#8217; పేరు స్థిరపడింది.</p>
<p>పదేళ్ళ తర్వాత 1933లో పారిస్ నుంచీ స్వదేశం తిరిగివచ్చి జర్నలిస్ట్‌గా స్థిరపడ్డాడు. నియంతల గురించిన &#8216;ది ప్రెసిడెంట్&#8217; నవలను కూడా అప్పటికే అతడు పూర్తిచేశాడు.</p>
<p>అయితే అప్పటికి అక్కడ జార్జ్ ఉబికో అనే ఇంకో కొత్త నియంత పీఠమెక్కాడు. అంతకు ముందున్న నియంత పాలనలో లాగే ఆస్ట్రియాస్ ఈ నియంత ఆగ్రహానికీ గురయ్యాడు. అలా అతడి ప్రపంచ ప్రఖ్యాత నవల 13 యేళ్ళ పాటు అంటే 1946 వరకూ చీకటిలోనే ఉండిపోయింది. ఆ చీకటి కాలంలో అతడు విస్తారంగా కవిత్వం కూడా రాశాడు.</p>
<p>ఈ లోగా ఆస్ట్రియాస్ 1942లో కాంగ్రేస్‌కి ఎన్నికయ్యి దేశానికి డిప్లొమాట్‌గా నియమించబడ్డాడు. ఆ పదవిలో లాటిన్ అమెరికాలతో పాటు పారిస్ వరకూ పర్యటించాడు.</p>
<p>1946లో ప్రజా ప్రతిఘటనకు జార్జ్ ఉబికో పాలన అంతమయాక అతడి &#8216;ది ప్రెసిడెంట్&#8217; నవల ప్రచురించబడి సాహిత్య ప్రపంచాన్ని ఆకర్షించింది. మరి కొద్దికాలానికే స్థానిక నేలవాసుల ఆదిమ సంస్కృతికీ వలసవచ్చిన ఆధునికతకీ మధ్య జరిగిన రక్తసిక్త సంఘర్షణా చరిత్రని &#8216;మెన్ ఆఫ్ మైజ్&#8217; నవలగా మలిచి 1949లో ప్రచురించాడు. ఈ రెండు నవలలలూ అతడికి సాహిత్య ప్రపంచంలో శిఖరాగ్ర స్థాయి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.</p>
<p>అక్కడి కొత్త ప్రభుత్వం మళ్ళీ పతనమవటంతో అతడు గాటిమాలా నుంచీ బహిష్కరింపబడి దాదాపు దశాబ్దం పాటు అర్జెంటీనా, చిలీ, స్విట్జర్లండ్ వంటి దేశాల్లో తల దాచుకొన్నాడు.</p>
<p>అనేక నిర్బంధాలూ బహిష్కరణలూ అతడి సృజనాత్మక ప్రతిభను చంపలేకపోయాయి. 1950 నుంచీ 1960 వరకూ ‘స్ట్రాంగ్ విండ్’, ’ గ్రీన్ పోప్’, ‘ఐస్ ఆఫ్ ఇంటర్డ్’ అనే మూడు నవలలను ‘బనానా ట్రయాలజీ’ పేరుతో రచించాడు. ఇంకా వీకెండ్ ఇన్ గాటిమాలా కథలూ, మరొక నవల కూడా. 1963లో గాటిమాలా చరిత్రకు కార్టూన్ల రూపమిస్తూ అతడు ప్రచురించిన &#8216;ములాటా&#8217; అనే నవల మరొక పెద్ద సంచలనం.</p>
<p>అతడి ప్రగతిశీల భావజాలాన్నీ , నియంతలపై రాజీలేని పోరాటాన్నీ గౌరవిస్తూ 1966లో సోవియట్ యూనియన్ ఆస్ట్రియాస్‌కు లెనిన్ శాంతి బహుమతిని ప్రకటించింది. 1967లో అతడికి నోబెల్ బహుమతి వచ్చింది.</p>
<p>లాటిన్ అమెరికన్ దేశాలనుంచీ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నోబెల్ బహుమతి అందుకున్న రచయిత మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్ ఒక్కడే. అతడి సాహిత్య కృషి వల్ల ప్రపంచం దృష్టి లాటిన్ అమెరికావైపు మళ్ళటంతో ఆ తర్వాత పాబ్లో నెరూడా, మార్క్వెజ్, ఆక్టోవియా పాజ్, డెరిక్ వాల్కాట్, ల్లోసాల వంటివారిని కూడా నోబెల్ వరించింది.</p>
<p>అనేక వలసల తరువాత తన జీవిత చరమాంకాన్ని స్పెయిన్ దేశంలో గడిపి 1974లో ఆయన మరణించాడు.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=14720</wfw:commentRss>
		<slash:comments>7</slash:comments>
		</item>
		<item>
		<title>హెమింగ్వే మ్యూజియం</title>
		<link>http://vaakili.com/patrika/?p=13747</link>
		<comments>http://vaakili.com/patrika/?p=13747#comments</comments>
		<pubDate>Fri, 31 Mar 2017 21:49:36 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[సుజాత]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=13747</guid>
		<description><![CDATA[<p></p> <p>రచయితలు మనుషులుగా నిష్క్రమించినా, రచనలుగా ఎప్పటికీ మిగిలే ఉంటారు. కొన్ని పుస్తకాలు చదువుతుంటే, అయ్యో వీళ్ళు బతికుండగా కలుసుకోలేక పోయినా కనీసం సమకాలికులుగా అయినా లేమే? అనిపిస్తుంది. అలాటి వాళ్లలో జాక్ లండన్, హెమింగ్వే తప్పకుండా ఉంటారు నా లిస్టులో. స్వేచ్ఛా ప్రవృత్తితో ఇష్టమైన జీవితాన్ని బతికినన్నాళ్ళూ గడిపిన వాళ్ళే ఇద్దరూ! జాక్ లండన్ కి రిగ్రెట్స్ ఏమీ లేవేమో గానీ హెమింగ్వే జీవితాన్ని, తనకు తానే రాసుకున్న మరణ శాసనాన్ని చూస్తే ఉన్నాయేమో అనిపిస్తుంది. సొసైటీ లో ఉన్న పేరు ప్రఖ్యాతుల్ని, తమ నిష్క్రమణ వెనుక సాగబోయే ఊహాగానాల్ని లెక్క చేయక మరణాన్ని కౌగిలించుకునే సెలెబ్రిటీల మనసుల్లో దాగున్న అగాథాలేమిటో, ఎంత లోతైనవో, ఎన్ని అగ్ని పర్వాతలను దాచుకున్నవో!</p> <p>ఒకప్పుడు ఇతర భాషల గొప్ప సాహిత్యం ఏ నాండిటెయిల్ పుస్తకాల ద్వారానో పరిచయం కావడం, ఆ సమయానికి ఆయా రచయితలంతా మన గత జన్మలోని వాళ్ళు కావడం, తర్వాతెప్పుడో వాళ్ల పుస్తకాలను తీరిగ్గా చదువుకునేటప్పుడు &#8220;అబ్బబ్బా, ఇన్నాళ్ళూ వదిలి చాలా పొరపాటు చేశాను&#8221; అనుకోడం మామూలు ! పదో క్లాస్ లో అనుకుంటా &#8220;అతడు అడవిని జయించాడు&#8221; చదవడం ఫలితంగా హెమింగ్వే పరిచయం అయ్యాడు. అయితే ఆయన పుస్తకాలేవీ ఆ వెంటనే చదవలేదు. తర్వాత యూనివర్సిటీ రోజుల్లో ఎలాగో దొరికించుకుని చదివామనుకోండి.</p> <p>గొప్ప రచయితల జీవన శైలి, వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడం పట్ల సగటు పాఠకుడికి ఎప్పుడూ ఆసక్తే ఉంటుంది! మన దేశంలో రచయితల జీవిత విశేషాలను భద్రపరిచిన లోకల్ ప్రభుత్వాలు కనపడవు. గురజాడ ఇల్లో, చలం ఇల్లో, మ్యూజియాలుగా మార్చినా వాటిని ఎంత శ్రద్ధగా చూస్తున్నారు, వాటిని టూరిస్ట్ లకు ఇంటరెస్టింగ్ పాయింట్ గా ఎంతవరకూ అభివృద్ధి చేసి వాటిని టూరిజం బ్రోచర్స్ లో చేరుస్తున్నారో, అసలు ఎంతమంది పాఠకులు వాటి కోసం చూస్తారు?&#8230;ఇవన్నీ అంతుపట్టే విషయాలు కావు. అమెరికాలో భౌతికంగా కనుమరుగైన దాదాపు అందరు రచయితల ఇళ్ళను మ్యూజియాలుగా [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/04/image6.jpg"><img class="aligncenter size-full wp-image-13985" title="image6" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/04/image6.jpg" alt="" width="640" height="480" /></a></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">ర</span>చయితలు మనుషులుగా నిష్క్రమించినా, రచనలుగా ఎప్పటికీ మిగిలే ఉంటారు. కొన్ని పుస్తకాలు చదువుతుంటే, అయ్యో వీళ్ళు బతికుండగా కలుసుకోలేక పోయినా కనీసం సమకాలికులుగా అయినా లేమే? అనిపిస్తుంది. అలాటి వాళ్లలో జాక్ లండన్, హెమింగ్వే తప్పకుండా ఉంటారు నా లిస్టులో. స్వేచ్ఛా ప్రవృత్తితో ఇష్టమైన జీవితాన్ని బతికినన్నాళ్ళూ గడిపిన వాళ్ళే ఇద్దరూ! జాక్ లండన్ కి రిగ్రెట్స్ ఏమీ లేవేమో గానీ హెమింగ్వే జీవితాన్ని, తనకు తానే రాసుకున్న మరణ శాసనాన్ని చూస్తే ఉన్నాయేమో అనిపిస్తుంది. సొసైటీ లో ఉన్న పేరు ప్రఖ్యాతుల్ని, తమ నిష్క్రమణ వెనుక సాగబోయే ఊహాగానాల్ని లెక్క చేయక మరణాన్ని కౌగిలించుకునే సెలెబ్రిటీల మనసుల్లో దాగున్న అగాథాలేమిటో, ఎంత లోతైనవో, ఎన్ని అగ్ని పర్వాతలను దాచుకున్నవో!</p>
<p>ఒకప్పుడు ఇతర భాషల గొప్ప సాహిత్యం ఏ నాండిటెయిల్ పుస్తకాల ద్వారానో పరిచయం కావడం, ఆ సమయానికి ఆయా రచయితలంతా మన గత జన్మలోని వాళ్ళు కావడం, తర్వాతెప్పుడో వాళ్ల పుస్తకాలను తీరిగ్గా చదువుకునేటప్పుడు &#8220;అబ్బబ్బా, ఇన్నాళ్ళూ వదిలి చాలా పొరపాటు చేశాను&#8221; అనుకోడం మామూలు ! పదో క్లాస్ లో అనుకుంటా &#8220;అతడు అడవిని జయించాడు&#8221; చదవడం ఫలితంగా హెమింగ్వే పరిచయం అయ్యాడు. అయితే ఆయన పుస్తకాలేవీ ఆ వెంటనే చదవలేదు. తర్వాత యూనివర్సిటీ రోజుల్లో ఎలాగో దొరికించుకుని చదివామనుకోండి.</p>
<p>గొప్ప రచయితల జీవన శైలి, వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడం పట్ల సగటు పాఠకుడికి ఎప్పుడూ ఆసక్తే ఉంటుంది! మన దేశంలో రచయితల జీవిత విశేషాలను భద్రపరిచిన లోకల్ ప్రభుత్వాలు కనపడవు. గురజాడ ఇల్లో, చలం ఇల్లో, మ్యూజియాలుగా మార్చినా వాటిని ఎంత శ్రద్ధగా చూస్తున్నారు, వాటిని టూరిస్ట్ లకు ఇంటరెస్టింగ్ పాయింట్ గా ఎంతవరకూ అభివృద్ధి చేసి వాటిని టూరిజం బ్రోచర్స్ లో చేరుస్తున్నారో, అసలు ఎంతమంది పాఠకులు వాటి కోసం చూస్తారు?&#8230;ఇవన్నీ అంతుపట్టే విషయాలు కావు. అమెరికాలో భౌతికంగా కనుమరుగైన దాదాపు అందరు రచయితల ఇళ్ళను మ్యూజియాలుగా మార్చి , వారికి సంబంధించిన వస్తువులను జ్ఞాపకాలుగా పదిలపరిచి మిగిలిఉన్న వాళ్ళకు చూపించడం ఒక అతిమంచి సంప్రదాయం.<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/03/h6.jpg"><img class="alignright size-medium wp-image-13759" title="h6" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/03/h6-225x300.jpg" alt="" width="225" height="300" /></a></p>
<p>ఓ హెన్రీ ఆస్టిన్లోనూ, శాన్ ఆంటోనియో లోనూ నివసించాడనీ, హెమింగ్వే క్యూబాలోనూ, కీ వెస్ట్ లోనూ నివసించాడని బహుశా చదవడం జరిగే ఉంటుంది గానీ, ఆస్టిన్లో నేనూ నివసిస్తాననీ, కీ వెస్ట్ పోయి చూస్తానని అప్పుడు ఊహించలేదు కాబట్టి గుర్తు పెట్టుకోలేదు. ఆస్టిన్లో మా ఇంటికి సరిగా ఐదు మైళ్ళ దూరంలోనే ఓ హెన్రీ ఇల్లు ఉందని తెలిసినపుడు ఆశ్చర్యం! తర్వాత ఆ ఇల్లు చూసినపుడు &#8220;గిఫ్ట్ ఆఫ్ మెజై&#8221; నేను ముట్టుకుని చూసిన ఆ రైటింగ్ టేబుల్ మీద రాశాడని తల్చుకుంటే గొప్ప సంతోషం కలిగింది.</p>
<p>జ్ఞాపకాలెప్పుడూ బావుంటాయి. అవి మన ఇంట్లో వదులై పోయిన మడత కుర్చీ అయినా, ఫ్రేములూడి పోయి చెమ్మ చేరిన బ్లాక్ అండ్ వైట్ ఫోటొలైనా, మహా రచయితల ఫైర్ ప్లేసూ, పేము కుర్చీలైనా సరే..</p>
<p>ఆ క్రమంలోనే ఫ్లోరిడా అంచున, హెమింగ్వే కి ఎంతో ఇష్టమైన క్యూబా కి 90 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న కీ వెస్ట్ చూసేందుకు వెళ్ళడానికి కొద్ది రోజుల ముందు అక్కడ హెమింగ్వే ఇల్లు ఉందని తెల్సింది. మయామి నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి వూరి మొదట్లో ఒక చిన్న రోడ్ హౌస్ లాంటి దగ్గర ఆగితే, అక్కడ పని చేస్తున్న అమ్మాయి, మొదటి సారి అక్కడికొచ్చామని తెలుసుకుని &#8220;ఏది మిస్ అయినా, హెమింగ్వే ఇల్లు మిస్ కాకండి&#8221; అని సలహా ఇచ్చింది. ఆయన రాసిన పుస్తకాల్లో తనకేవి నచ్చాయో ఎందుకు నచ్చాయో కూడా లంచ్ పూర్తయ్యే లోపు చక్కగా పంచుకుంది. &#8220;Fifth column and the first 49 stories చదివుండక పోతే కొనుక్కోమని రికమండ్ చేసింది. కథలు రాయాలనుకున్న వాళ్లెవరైనా సరే, అది చదివితే మంచి ఫలితం ఉంటుందని చెప్పింది.</p>
<p>బాగా డబ్బులు సంపాదించడం మూలానా, ఇష్టమైన రీతిలో స్వేచ్ఛా జీవనాన్ని గడిపిన మూలానా హెమింగ్వే లైఫ్ స్టైల్ ఎంతైనా వేరనిపిస్తుంది ! కానీ ఒకరి తర్వాత ఒకరుగా నలుగురు స్త్రీలను వివాహమాడినా, ఆయనకు కావలసిందేదో దొరక్కుండా ఉండి పోయిందని, మనసులో ఎన్నటికీ పూడని ఒక ఖాళీ తనమేదో ఉందనీ అనిపిస్తుంది. యుద్ధ వాతావరణంలో ఆంబులెన్స్ డ్రైవర్ గా పని చేసినపుడు ఒక నర్స్ తో దాదాపుగా పండిన ప్రేమ ఒక్క సారిగా ఆమె తిరస్కారంతో రాలి పోవడంతో హెమింగ్వే చాలా కుంగి పోయి ఆ బాధను చాలా రోజులు మోసుకు తిరిగాడు. అందుకేనేమో ఆయన ఆ తర్వాత తన జీవితంలో ప్రవేశించిన భార్యలకు తనను తిరస్కరించే అవకాశం ఇవ్వలేదని అంటారు.ఈయనే ముందు విడాకులు ఇచ్చేశాడు.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/03/h7.jpg"><img class="aligncenter size-full wp-image-13754" title="h7" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/03/h7.jpg" alt="" width="492" height="369" /></a></p>
<p>కీ వెస్ట్ లో హెమింగ్వే నివసించిన అందమైన ఈ ఇల్లు ని 1851 లో మెరైన్ ఆర్కిటెక్ట్ తిఫ్ట్ అనే ఆయన కట్టుకున్నాడు. స్పానిష్ నిర్మాణ పద్ధతుల్లో పునాదులు తీసి, పటిష్ఠంగా సున్నపు రాతితో కట్టడం వల్ల ఇవాల్టికీ చెక్కు చెదరకుండా నిలిచి ఉన్న ఈ ఇల్లుని 1931 లో హెమింగ్వే కొనుక్కున్నాడు. అయితే ఆయన 1940 వరకు మాత్రమే ఆ ఇంట్లో నివసించాడు. పారిస్ లో పెళ్ళాడిన రెండో భార్య పాలిన్ మారీ ఫైఫర్ ని, ఆమె పిల్లలని అక్కడే విడిచి పెట్టి క్యూబా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాక, పాలిన్ కి విడాకులిచ్చి నాలుగో భార్యగా తన పాత స్నేహితురాలు మేరీ వెల్ష్ ని పెళ్ళి చేసుకున్నాడు. చివరి వరకూ ఈమే అతని భార్యగా ఉంది.</p>
<p>పాలిన్ మాత్రం మరణించే వరకూ కీ వెస్ట్ ఇంట్లోనే నివసించింది. ఆ తర్వాత ఆ ఇల్లు అదే వూర్లో దువాల్ స్ట్రీట్ కి (ఈ వీధి ఇక్కడ చాలా ప్రసిద్ధి. వ్యాపారమంతా ఇక్కడే జరుగుతూ, టూరిస్టులతో సందడిగా ఉండే బజారు ఇది ) చెందిన బెర్నిస్ డిక్సన్ కొని కొన్నాళ్ళు నివసించాక, (స్వతహాగా వ్యాపారస్తురాలు) ఈ ఇల్లుని హెమింగ్వే మ్యూజియంగా మార్చాలనే ఆలోచనతో (ప్రవేశం ఉచితం కాదు) ఇంటికి వెనుక ఉన్న చిన్న గదిలో తను ఉండటానికి నిర్ణయించుకుని ఇంటిని మ్యూజియంగా మార్చి ప్రదర్శనకు ఉంచింది. ఆమె నివసించిన చిన్న గది ఇప్పుడు బుక్ స్టోర్ గా చెలామణిలో ఉంది. ఇప్పటికీ ఆమె వారసుల నిర్వహణ క్రిందే ఉన్నది మ్యూజియం.</p>
<p>విశాలమైన ప్రాంగణంలో, అతి చక్కని తోట లో నిలిచి ఉండే ఈ ఇల్లు వెనుక కూడా రెండంతస్తుల నిర్మాణం మరొకటి ఉంది. దాన్లో పై భాగంలో హెమింగ్వే స్టడీ రూం ఉంది. ముందువైపు ఉన్న ప్రధాన భాగంలో ఆయన జీవితాన్ని, జీవన శైలిని ఆవిష్కరించే ఫొటోలూ, వాడిన వస్తువులూ,ఆయన రచనల తాలూకు సినిమాల పోస్టర్లూ, ఆయన, పాలిన్ సేకరించిన కళా ఖండాలూ, పెయింటింగ్సూ.. వగైరాలు.</p>
<p>హెమింగ్వే గురించి చెపుతూ మన కూడా తిరిగే గైడ్ &#8220;హెమింగ్వే జీవితాన్ని ఆత్మ హత్యతో ముగించాడు&#8221; అని చెప్పే వాక్యం ఆ ఇంటిని చూడ్డం తాలూకు ఆనందానికి బ్రేక్ లా అడ్డు పడుతుంది. ఎన్నో సార్లు ఆత్మ హత్యా ప్రయత్నాలు చేశాక చివరికి ఐడహో లోని తన ఇంట్లో తన ప్రయత్నాన్ని స్వయంగా విజయవంతంగా ముగించాడు హెమింగ్వే.<br />
<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/04/IMG_1999.jpg"><img class="alignleft size-medium wp-image-13987" title="IMG_1999" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/04/IMG_1999-300x225.jpg" alt="" width="300" height="225" /></a><br />
ఆయన తండ్రి, సోదరి, వీళ్లంతా ఆత్మ హత్యలు చేసుకున్న చరిత్ర ఉంది కాబట్టి, సూయిసైడల్ టెండెన్సీ వాళ్ళ జీన్స్ లో ఉండొచ్చని కొందరు తీర్మానించడం కరెక్టో కాదో కానీ, హెమింగ్వే జీవితంలో చాలా పోగొట్టుకునే ఉంటాడని ఆయన గురించి చదువుతుంటే అనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన , ఎంతో ప్రేమించి వివాహం చేసుకున్న మొదటి భార్య హాడ్లీకి విడాకులివ్వాల్సి రావడం హెమింగ్వే పైకి దర్పంగా కనిపించినా ఆయన్ని బాగా బాధ పెట్టిన సంఘటన. పారిస్ లో పరిచయమైన పాలిన్ తో ప్రేమలో పడి, ఆ విషయం హాడ్లీకి తెలియడం తో ఆమెకు విడాకులివ్వాల్సి వచ్చింది.</p>
<p>ఆ తర్వాత ఆయన వివాహ బంధానికి పెద్దగా విలువ ఇచ్చినట్టు కనిపించదు.</p>
<p>కీ వెస్ట్ లో హెమింగ్వే జీవితం చాలా ఉల్లాసంగానే గడిచింది.సహజంగానే ప్రకృతి సౌందర్యంతో, నాలుగు వైపులా పర్చుకున్న నీలి రంగు కల్సిన ఆకుపచ్చని అనంత జలరాశితో కీ వెస్ట్ ఎంతో అందమైన ప్రాంతం. అక్కడే ఆయనకు ఒక స్నేహితుల గుంపు తయారైంది. అందరూ కల్సి విశాలమైన సముద్ర జలాల్లో విహారాలకు వెళ్ళడం, చేపలు పట్టడం, అప్పుడప్పుడు బాతుల వేట, ఉదయాన్నే నవలలో కథలో రాసుకోవడం.. ఇలా హాయిగా గడిచి పోయింది. ఆ స్నేహితులందరితో ఉన్నప్పుడే ఆయనకు &#8220;పాపా&#8221; (స్పానిష్ లో &#8220;డాడీ&#8221; అని అర్థం) అనే నిక్ నేమ్ వచ్చిందట. ఆ పేరు ఆయనకు క్యూబా వెళ్ళాక కూడా కొనసాగింది.</p>
<p>క్యూబాలో హెమింగ్వే ఇల్లు కూడా చాలా పెద్దది.ఎకరాల కొద్దీ స్థలంలో పెద్ద తోటలో బోలెడంత మంది స్నేహితులతో హెమింగ్వే చక్కని జీవితమే గడిపాడిక్కడ. &#8220;ఓల్డ్ మాన్ అండ్ ది సీ&#8221; ఇక్కడే రాశాడు కూడా! అంతే కాదు, క్యూబా పోరాటవాదుల పట్ల సానుభూతితో కూడా ఉండేవాడు. “చెగెవారా, కాస్ట్రోల తర్వాత క్యూబా ప్రజల్లో అంతటి గొప్ప ఆరాధనని సొంతం చేసుకుంది హెమింగ్వేనే&#8221; అంటాడు జాకొబో టైమర్ మాన్ అనే జర్నలిస్ట్.</p>
<p>మయామి గ్లోబ్ పత్రిక లో పని చేసే Denne Bart Petitclerc అనే రిపోర్టర్ హెమింగ్వే పుస్తకాల ద్వారా ప్రభావితుడై, చక్కని వాక్యం కూడా రాయడం నేర్చుకుని, ఆయన కి ఉత్తరాలు రాస్తుండేవాడు. తర్వాత కలుసుకున్నాడు కూడా! క్యూబా లో హవానా లో హెమింగ్వే తో గడిపిన రోజుల్ని ఆయన అక్షరీకరించడమే కాక అది &#8220;పాపా&#8221; అనే సినిమాగా కూడా (స్క్రీన్ ప్లే రాశాడు) రూపొందించడం లో పాలు పంచుకున్నాడు. అయితే ఈ సినిమా విడుదలయ్యే నాటికి జీవించి లేడు. ఈ సినిమాలో మనం హెమింగ్వే, ఫైఫర్ పాత్రలను చూడొచ్చు. ఇందులో ఆయన మీద కోస్టల్ సెక్యూరిటీ ఒక కన్నేసి ఉంచినట్టూ, క్యూబన్ పోరాట యోధుల కి ఆయన ఆయుధాలు కూడా సరఫరా చేసినట్టూ దృశ్యాలు చోటు చేసుకున్నాయి కూడా (కోస్టల్ సెక్యూరిటీ బోటు వెంటాడుతుంటే తన ఫిషింగ్ బోటు లో దాచిన తుపాకులన్నీ సముద్రంలో పారేస్తాడు హెమింగ్వే)</p>
<p>ఈ సినిమాలోనే హెమింగ్వే మనసు స్థిరంగా లేదనీ, ఆయన ఆలోచనలు ఆత్మహత్య వైపు మళ్ళుతున్నాయనీ సూచించే దృశ్యాలున్నాయి. అందుకు చాలా కారణాలే ఉన్నాయి నిజానికి. వాటిలో ఏ ఒక్కటో కారణం అనడం స్పెక్యులేషనే! వెంటాడుతున్న అనారోగ్యం, వివిధ సందర్భాల్లో దెబ్బలు తగిలి ఎంతకీ మానని గాయాలు, పాత స్నేహితులంతా ఒక్కొక్కరుగా మరణించడం, ఇవన్నీ కారణాలే. వీటన్నిటివల్లా 55 ఏళ్లకే ఇంకా ఎక్కువ వయసు పైబడిన వాడిలా హెమింగ్వే కనిపించే వాడని టైమర్ మాన్ కూడా అంటాడు. అయితే మేరీ తో ఆయన వైవాహిక జీవితం కూడా కనిపిస్తున్నంత అందంగా లేదని ఈ సినిమాలో స్పష్టం అవుతుంది. ఇద్దరికీ తరచూ మాటా మాటా పెరగడం, దెబ్బలాడుకోవడం సాధారణంగా మారుతుంది. పెతిత్ క్లెర్క్, హెమింగ్వే చిరకాల స్నేహితుడు ఇవాన్ షిప్ మన్ ని అడుగుతాడు &#8220;ఎందుకిలా ఉన్నారు వీళ్ళు?&#8221; అని.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/03/h5.jpg"><img class="aligncenter size-full wp-image-13753" title="h5" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/03/h5.jpg" alt="" width="640" height="480" /></a><br />
అతడంటాడు &#8220;చాలా జంటల లాగే పెళ్ళి బంధం అయితే ఉంది గానీ, వారిద్దరి మధ్య సరైన సాహచర్యం, స్నేహం లేవు. ఏ పెళ్ళి లో అయినా కొన్నాళ్ళకి ఇలాగే జరుతుంది. నిజానికి నా పెళ్ళి కూడా అలాటిదే. అసలు ఎవరిది మాత్రం కాదనీ?&#8221; అంటాడు.</p>
<p>హెమింగ్వే తన మిత్రుడితో మాట్లాడుతూ ఫైఫర్ కోసం హాడ్లీని వదిలి పెట్టానని బాధ పడతాడు. మేరీ కూడా గొడవలైనపుడు &#8220;వెళ్ళు, ఆ హాడ్లీ దగ్గరికే పో&#8221; అంటుంది.</p>
<p>ఎన్నో గొప్ప రచనలు చేసి, ఎంతో ఆర్జించి, స్వేచ్ఛాజీవి అయి తనకు ఇష్టమైనట్లు జీవించిన (ఖాకీ షార్ట్స్ ధరించి, ఒక్కోసారి చెప్పులు కూడా లేకుండా నడుస్తూ, రెండో ప్రపంచ యుద్ధానికి సాక్ష్యంగా తన జ్ఞాపకాలను కథలు గా రాసుకుంటూ, చేపలు పడుతూ, తాగుతూ, స్నేహితులతో కలుస్తూ, కొత్త వాళ్లతో ఇట్టే స్నేహాలు చేస్తూ రెగ్రెట్స్ లేకుండా బతికాడు) హెమింగ్వే. తట్టుకోలేని సంఘర్షణల వల్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు.</p>
<p>ఆ సంఘర్షణ ఏమిటన్నది ఆయనకే తెలిసి ఉండాలి తప్ప ఇంకెవరికీ కాదు.</p>
<p>హెమింగ్వే హౌస్ (మ్యూజియం) లో పని చేసే స్టాఫ్ అన్ని చోట్ల లాగే చాలా స్నేహ పూర్వకంగా స్వాగతించి అన్ని విశేషాలూ వివరిస్తారు. వాళ్ళలో ఒకతను చెప్పాడు &#8220;హెమింగ్వే వల్ల కీ వెస్ట్ మరింత ప్రాచుర్యం పొందింది. అంతకు ముందు ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే. కానీ హెమింగ్వే ఇక్కడ నివసించాడని తెలిశాక, అనేక మంది ఈ ఇల్లు చూడ్డం కోసం, ఆయన సమక్షంలో ఉన్నట్టు కాసేపు అనుభూతిని కల్పించుకోవడం కోసం కూడా ఇక్కడికి రావడం మొదలైంది. ఇక్కడికి వచ్చిన ఏ టూరిస్టూ ఈ ఇల్లు చూడకుండా వెళ్ళడు&#8221;</p>
<p><strong>మార్జాల సంపద:</strong><br />
<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/04/hemingway_cats.jpg"><img class="alignleft  wp-image-14003" title="hemingway_cats" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/04/hemingway_cats.jpg" alt="" width="330" height="329" /></a><br />
హెమింగ్వే గురించి గూగుల్ లో ఏదైనా వెదుకుతున్నపుడు, Hemingway&#8217;s cats అన్న సజెషన్ తప్పకుండా వచ్చి తీరుతుంది. పిల్లులంటే హెమింగ్వేకి ప్రాణం. ఆయన భార్య పాలిన్ కి కూడా! వాళ్లు పెంచుకున్న పిల్లుల తాలూకు సంతతి,వాటి సంతతి, ఇలా వృద్ధి చెందుతూ ఇప్పుడు ప్రస్తుతం ఆ ఇంట్లో అరవై కి పైగా పిల్లులు ఉన్నాయి. వీటిలో చాలా వరకూ ఆరేసి కాలి వేళ్ళు ఉన్న పిల్లులే!ప్రతి పిల్లికీ ఒక ప్రత్యేకమైన పేరు. ఆ అరవై+ పేర్లను స్టాఫ్ గుర్తు పెట్టుకోడమే కాక, ఒకేలా కనిపిస్తున్న రెండు పిల్లులలో ఏ పేరు దేనిదో కూడా గుర్తించి పిలవడం ఒక ఆశ్చర్యమైతే, అవి చక్కగా పేర్లకు స్పందిస్తూ దరి చేరడం మరొక ఆశ్చర్యం. ఆ పిల్లులన్నిటికీ ఆయన స్నేహితుల పేర్లు, వాళ్ళ ఇంటిపేర్లు (లస్త్ నమెస్) కొనసాగుతున్నాయి. హెమింగ్వే కీ వెస్ట్ ఇంట్లో ఈ పిల్లులు ఒక పెద్ద విశేషం. ఈ ఇంటి బయట నిత్యం సందర్శకులు బారులు తీరి నిల్చుని కనిపిస్తారు. సెలవు రోజుల్లో చెప్పనే అక్కర్లేదు.</p>
<p>ఇంటి ఆవరణలోనే సాహిత్య ప్రియులైన వధూ వరులు పెళ్ళి చేసుకునే వెడ్డింగ్ ప్లాన్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి.</p>
<p>హెమింగ్వే తమ రాష్ట్రంలో ఉండటం ఫ్లోరిడా కే గర్వకారణమని ఫ్లోరిడా జనం, తమ దేశంలో ఉండటం వల్ల ఆయన తమ వాడేనని క్యూబా ప్రజలూ భావిస్తుంటారట. ఆయన్ని ఒక ఒక జనం మనిషిగా, ఒక ఫ్రీ స్పిరిట్ గా, ఒక అద్భుతమైన వ్యక్తిగా అందరూ గుర్తించాలని క్యూబా ప్రజలు డిమాండ్ చేస్తారట కూడా.</p>
<p>హెమింగ్వే జీవితం అసలు ఎన్నడూ తీరిక లేని, విరామమే ఎరగని ఒక విలాసవంతమైన, వికాసవంతమైన గొప్ప జీవ కావ్యం.(ఈ విలాసాల్లో స్నేహితులూ, హాబీలూ, ప్రయాణాలూ, పుస్తకాలూ, ప్రణయాలూ భాగాలు. డబ్బు కంటే ఇతరవాటికి ప్రాముఖ్యం ఎక్కువ, వాటిలో డబ్బుతో దొరికేవి ఉన్నప్పటికీ)<br />
<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/03/h4.jpg"><img class="alignright size-full wp-image-13752" title="h4" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/03/h4.jpg" alt="" width="483" height="337" /></a><br />
హెమింగ్వే ఉత్తుంగ తరంగమై ఎగసి పడిన ఒక అల! అది ఎలా నేల కూలిందన్న దానికంటే ఎంత ఎత్తుకి ఎదిగి, ఎంత మందిని ప్రభావితం చేసిందన్నదే ముఖ్యం! ఆ ఎత్తులకు, ఆయన జీవన శైలికి, జీవితానికి సాక్ష్యాలుగా, ఆయన యుద్ధంలో ఆంబులెన్స్ డ్రైవర్ గా పని చేసిన నాటి నుంచీ, పారిస్ జీవితం, పెళ్ళిళ్ళు, చేపల వేట, బాతుల వేట, సముద్రంలో సాహసాలూ, వీటన్నిటి ఫొటోలూ ఆ ఇంట్లో కనిపిస్తాయి. రాసుకోడానికి ఆయన వాడిన పోర్టబుల్ టైప్ రైటరూ ,పెన్నులూ, ఆయన పుస్తకాల కలెక్షనూ, కాఫీ తాగిన కప్పూ,కూచున్న కుర్చీ, కాళ్ళు పెట్టుకున్న ఓటోమన్..ఇవన్నీ ఆ కాసేపైనా హెమింగ్వే సమక్షాన్ని కల్పించక మానవు.</p>
<p>చరిత్రలో గొప్ప గొప్ప కవులూ రచయితలూ చాలా మందే స్వచ్ఛందంగా జీవితాన్ని ముగించుకున్నారని చదివినపుడు వాళ్లలో ఫ్రీ స్పిరిట్ హెమింగ్వే కాకుండా, సముద్ర సాహసాలతో, జర్నలిస్ట్ గా, రచయితగా , స్వేచ్ఛను ప్రేమిస్తూ జీవించిన జాక్ లండన్ కూడా ఉన్నాడనీ, ఆయన కూడా ఆత్మహత్యకే &#8220;పాల్పడి ఉండొచ్చనీ&#8221; తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=13747</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>మెటాకవితలు మూడు</title>
		<link>http://vaakili.com/patrika/?p=13329</link>
		<comments>http://vaakili.com/patrika/?p=13329#comments</comments>
		<pubDate>Wed, 01 Feb 2017 00:45:42 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[పప్పు నాగరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=13329</guid>
		<description><![CDATA[కవిత్వం గురించీ, కవిత్వ తత్వం గురించీ, తమకి కవిత్వంతో ఉన్న సంబంధం గురించీ సుమారుగా ప్రతీ కవీ కవితాత్మకంగానే చెప్తాడు. స్పానిష్, హిబ్రూ, ఇంగ్లీషు భాషల్లోంచి అటువంటి మెటాకవితలు మూడు.<br /> <br />
హోర్హె లూయిస్ బోర్హెస్ ఆలోచనలూ, వ్యక్తీకరణా, అతని ఊహలూ, అతని ఇమోషన్లూ వీటన్నిటిలో అంతర్లీనంగా ఏదో దగ్గరితనం ఉంది – ఎంతగా అంటే, అతను ఇక్కడే నడయాడి, మనదైన దాన్నెంతో తనలో ఇంకించుకున్నాడేమో అనే అంతగా. <br /><br />
ఇస్రాయెల్ కి చెందిన ప్రసిద్ఢ కవయిత్రి Leah Goldberg. హీబ్రూలో ప్రథమ శ్రేణి కవయిత్రి. రెండో ప్రపంచ యుద్ధం, ఇస్రాయెల్ స్వాతంత్రం, యూదుల వలసలు, హోలోకాస్టు ఇవన్నీGoldberg వస్తువులు. <br /><br />
అమెరికాలో స్థిరపడి, అక్కడే చదువుకున్న TarfiaFaizullah బంగ్లాదేశ్ కి చెందిన కవయిత్రి. ఆమె తన కవిత్వంలో బంగ్లా స్త్రీల సమస్యలను, 1971 యుద్ధంలో బంగ్లా స్త్రీలపై పాకిస్తాన్ సైనికుల అత్యాచారాల చరిత్రను చిత్రించారు.]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">క</span>విత్వం గురించీ, కవిత్వ తత్వం గురించీ, తమకి కవిత్వంతో ఉన్న సంబంధం గురించీ సుమారుగా ప్రతీ కవీ కవితాత్మకంగానే చెప్తాడు. స్పానిష్, హిబ్రూ, ఇంగ్లీషు భాషల్లోంచి అటువంటి మెటాకవితలు మూడు.</p>
</div>
<div style="width: 50%; float: left; padding-left: 1em; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">కవిత్వారాధన</span></p>
<p><span style="font-size: 30px;">పా</span>రే నీటిలో, కరిగే క్షణాలతో<br />
ఉరికే నదిని వీక్షిస్తూ<br />
కాలమొక నదేనని గుర్తిస్తూ<br />
నదిలానే మనమూ పక్కదార్లు పడతామనీ<br />
నీటిలానే మన మోములూ మాయమయేననీ!</p>
<p>మెలకువ కూడా మరొక కలేననీ<br />
ఇది కల కాకూడదనే స్వప్నమైనా<br />
మరణం తప్పదంటూ నాడులన్నీ ఇంకిన భయమైనా<br />
ప్రతిరాత్రి మరణించే ఒక కలే కదా!</p>
<p>ప్రతీ రోజూ ప్రతీ వత్సరమూ<br />
మనిషిగా గతించిపోయిన కాలమంతటికీ ప్రతీకగా<br />
అతన్ని ఆక్రమించుకునే వయసుని<br />
సంగీతంగా, శబ్దంగా, సంకేతంగా మారుస్తూ</p>
<p>మరణంలోనూ ఒక కలనీ<br />
సాయం సంధ్యలో మెరిసే విషాదాన్నీ<br />
దర్శించేదే కవిత్వం<br />
వినయమై, అమృతమయమై<br />
కవిత్వం</p>
<p>ఉదయాస్తమయాలుగా పునరావృతమవుతూ<br />
ఒక్కోపరి ఏ సాయంత్రపు వేళలోనో మూర్తిమంతమై<br />
అకాశపు అద్దపులోతుల్లోంచి మనకేసి పరికించి చూస్తుందే<br />
ఆ అద్దమే కవిత్వం</p>
<p>తనకి దాసుడై,<br />
తొలిప్రేమలోతుల్లో విలపిస్తూ<br />
మాయలన్నీ వదులుకున్న యులిసిస్<br />
మోము మనకి చూపించిన ఇతికా వంటిదే<br />
కవిత్వం</p>
<p>మైమరపించే జీవనది<br />
అంతులేని ప్రవాహమది<br />
తన కదలికని తనే ప్రతిబింబిస్తూ<br />
కుదురులేని హిరాక్లిటస్ తనకు తానై<br />
వేరైనట్టుగా, కదిలే నదిలా<br />
కవిత్వం</p>
<p>Art of Poetry, by Jorge Luis Borges<br />
English Translation: Anthony Kerrigan<br />
Telugu Translation: Nagaraju Pappu</p>
</div>
<div style="width: 40%; float: left; padding: 70px 8px;"><img class="aligncenter size-full wp-image-13376" title="220px-Jorge_Luis_Borges_1951,_by_Grete_Stern" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/02/220px-Jorge_Luis_Borges_1951_by_Grete_Stern.jpg" alt="" width="220" height="289" /><br />
హోర్హె లూయిస్ బోర్హెస్ కవిత్వం చదివిన ప్రతిసారీ, అతని ప్రతి కవితలోనూ ఏదో తెలుగుతనం ఉన్నట్టు తోస్తుంది నాకెందుకో.<br />
అతని ఆలోచనలూ, వ్యక్తీకరణా, అతని ఊహలూ, అతని ఇమోషన్లూ వీటన్నిటిలో అంతర్లీనంగా ఏదో దగ్గరితనం ఉంది &#8211; ఎంతగా అంటే, అతను ఇక్కడే నడయాడి, మనదైన దేన్నో తనలో ఇంకించుకున్నాడేమో అనే అంతగా.</div>
<div style="clear: both;"></div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=13329</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>ఒకటీ రెండూ ఐదూ పదీ ఇరవై</title>
		<link>http://vaakili.com/patrika/?p=12736</link>
		<comments>http://vaakili.com/patrika/?p=12736#comments</comments>
		<pubDate>Wed, 30 Nov 2016 22:54:34 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[పూడూరి రాజిరెడ్డి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=12736</guid>
		<description><![CDATA[<p></p> <p></p> <p>ఒక రోడ్డు, పార్కు, గుడి, హాస్పిటల్, ఆఫీస్, బాంక్, పబ్, చివరికి స్మశానం&#8230;</p> <p>ఒక రచయితకి ముడిసరుకు దొరకని చోటేదైనా ఉంటుందా? అలాంటి చాలా చోట్లకి తిరిగారు రాజిరెడ్డి. రచయితగా కాదు, జనంలో ఒకడిగా. ముడిసరుకుని పోగుచేసుకుని వాటిని కథలుగా మలుచుకునేందుకు కాదు. రచయిత తాలూకూ లోలోపలి వ్యాఖ్యానాన్ని అదిమిపెట్టి ఒక కెమెరాలాగా, ఒక టేప్ రికార్డర్ లాగా తనకి ఎదురైన అనుభవాల్ని నమోదు చేసుకునేందుకు. ఆయా చోట్లలో తారసపడ్డ విషయాల్ని ఉన్నదివున్నట్టు పాఠకుల ముందు ఉంచేందుకు. ఇదొక సెల్ఫ్ చెక్, సోషల్ చెక్, రియాలిటీ చెక్. మనకి సీదా సాదాగా ఒకే డైమెన్షన్ లో కనిపించేదే రాజిరెడ్డికళ్ళతో చూసినపుడు బహుమితీయంగా, ఫిలాసాఫికల్ లోతులు తొడుక్కుని కనిపిస్తుంది. మనం రోజూ చూసే అవకాశమున్నా దారిపక్కనుంచీ తప్పిపోతున్న ప్రదేశాల్ని, మనుషుల్నీ, జీవితాల్ని కాస్త దగ్గరగా చూపించిన పుస్తకం పూడూరి రాజిరెడ్డి &#8216;రియాలిటీ చెక్&#8216;. &#8216;రియాలిటీ చెక్&#8217; పుస్తకానికి తెలుగు యూనివర్సిటీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా అందులోంచి గుప్పెడు రియాలిటీ&#8230; మీకోసం.</p> <p>త్వరగా ఇల్లు చేరాలన్న తొందరలేని ఒక ఒంటరి ఆదివారం పూట–<br /> అసెంబ్లీ నుంచి రవీంద్రభారతి మీదుగా ట్యాంక్‌బండ్‌ వైపు సోమరి నడక సాగిస్తుండగా–<br /> రిజర్వ్‌బ్యాంకు ప్రహారీకి కొట్టిన ఈ నోటీస్‌ బోర్డు కనిపించింది.</p> <p>‘బ్యాంకు ఆవరణలో మరియు పరిసరములలో నోట్లు అమ్మడం, కొనడం నిషిద్ధం’.</p> <p>ఒకటి చేయకూడదు, అని ఎవరైనా ఎక్కడైనా హెచ్చరిక పెట్టారంటే, అదేదో జరుగుతోందని అర్థం!<br /> మరేం జరుగుతోందిక్కడ? నోట్లు అమ్మడమేంటి? కొనడమేంటి?<br /> అది తెలుసుకోవడానికి బ్యాంకు పనిదినాల్లో ఒకరోజైన శుక్రవారం వెళ్లాను.</p> <p style="text-align: center;">***</p> <p>ఉదయం పదిన్నర అయింది. బయట జనం ఎవ్వరూ కనబడలేదు. బ్యాంకు గేట్లు తెరిచివున్నాయి. కాపలాగా పోలీసులున్నారు. లోపలికి వెళ్లొచ్చా? వెళ్లకూడదా? రిజర్వ్‌ బ్యాంకంటే ఏవో గంభీరమైన కార్యకలాపాలు చేస్తూవుంటుందన్న ఊహ ఒకటి ఉంటుంది కదా!<br /> పావు క్షణం తటపటాయించి గేటు దగ్గరకు వెళ్లాను. [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/12/realitycheck_vaakili.jpg" alt="" width="0" height="0" /></p>
<p><img class="alignleft  wp-image-12740" title="RealityCheck" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/12/RealityCheck.jpg" alt="" width="233" height="360" /></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="color: #993366;"><em>ఒక రోడ్డు, పార్కు, గుడి, హాస్పిటల్, ఆఫీస్, బాంక్, పబ్, చివరికి స్మశానం&#8230;</em></span></p>
<p><span style="color: #993366;"><em>ఒక రచయితకి ముడిసరుకు దొరకని చోటేదైనా ఉంటుందా? అలాంటి చాలా చోట్లకి తిరిగారు రాజిరెడ్డి. రచయితగా కాదు, జనంలో ఒకడిగా. ముడిసరుకుని పోగుచేసుకుని వాటిని కథలుగా మలుచుకునేందుకు కాదు. రచయిత తాలూకూ లోలోపలి వ్యాఖ్యానాన్ని అదిమిపెట్టి ఒక కెమెరాలాగా, ఒక టేప్ రికార్డర్ లాగా తనకి ఎదురైన అనుభవాల్ని నమోదు చేసుకునేందుకు. ఆయా చోట్లలో తారసపడ్డ విషయాల్ని ఉన్నదివున్నట్టు పాఠకుల ముందు ఉంచేందుకు. ఇదొక సెల్ఫ్ చెక్, సోషల్ చెక్, రియాలిటీ చెక్. మనకి సీదా సాదాగా ఒకే డైమెన్షన్ లో కనిపించేదే రాజిరెడ్డికళ్ళతో చూసినపుడు బహుమితీయంగా, ఫిలాసాఫికల్ లోతులు తొడుక్కుని కనిపిస్తుంది. మనం రోజూ చూసే అవకాశమున్నా దారిపక్కనుంచీ తప్పిపోతున్న ప్రదేశాల్ని, మనుషుల్నీ, జీవితాల్ని కాస్త దగ్గరగా చూపించిన పుస్తకం పూడూరి రాజిరెడ్డి &#8216;<a href="http://kinige.com/kbook.php?name=Reality+Check" target="_blank">రియాలిటీ చెక్</a>&#8216;. &#8216;రియాలిటీ చెక్&#8217; పుస్తకానికి తెలుగు యూనివర్సిటీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా అందులోంచి గుప్పెడు రియాలిటీ&#8230; మీకోసం.</em></span></p>
<hr width="100" />
<hr width="200" />
<hr width="100" />
<p><span style="font-size: 30px;">త్వ</span>రగా ఇల్లు చేరాలన్న తొందరలేని ఒక ఒంటరి ఆదివారం పూట–<br />
అసెంబ్లీ నుంచి రవీంద్రభారతి మీదుగా ట్యాంక్‌బండ్‌ వైపు సోమరి నడక సాగిస్తుండగా–<br />
రిజర్వ్‌బ్యాంకు ప్రహారీకి కొట్టిన ఈ నోటీస్‌ బోర్డు కనిపించింది.</p>
<p>‘బ్యాంకు ఆవరణలో మరియు పరిసరములలో నోట్లు అమ్మడం, కొనడం నిషిద్ధం’.</p>
<p>ఒకటి చేయకూడదు, అని ఎవరైనా ఎక్కడైనా హెచ్చరిక పెట్టారంటే, అదేదో జరుగుతోందని అర్థం!<br />
మరేం జరుగుతోందిక్కడ? నోట్లు అమ్మడమేంటి? కొనడమేంటి?<br />
అది తెలుసుకోవడానికి బ్యాంకు పనిదినాల్లో ఒకరోజైన శుక్రవారం వెళ్లాను.</p>
<p style="text-align: center;">***</p>
<p>ఉదయం పదిన్నర అయింది. బయట జనం ఎవ్వరూ కనబడలేదు. బ్యాంకు గేట్లు తెరిచివున్నాయి. కాపలాగా పోలీసులున్నారు. లోపలికి వెళ్లొచ్చా? వెళ్లకూడదా? రిజర్వ్‌ బ్యాంకంటే ఏవో గంభీరమైన కార్యకలాపాలు చేస్తూవుంటుందన్న ఊహ ఒకటి ఉంటుంది కదా!<br />
పావు క్షణం తటపటాయించి గేటు దగ్గరకు వెళ్లాను. ఏ కారణం కోసమని అడక్కుండానే, డిటెక్టర్‌తో చెక్‌ చేసి పోలీసు లోనికి పంపాడు. నేను నాకు ఒక్కణ్ని. నాలాంటివాళ్లు ఆయనకు చాలామంది అని అర్థమవడానికి అరనిమిషం పట్టలేదు. పాము మెలికల ఇనుప బ్యారికేడ్లలో ఇరుక్కుంటూ, తోసుకుంటూ, కొత్త సినిమా మార్నింగ్‌ షో టికెట్‌ కోసం నిలబడ్డట్టు&#8230; మనుషులే మనుషులు!</p>
<p>‘నేను వారానికి ఒక్కసారే వస్త సార్, లోపలికి పంపించు సార్‌’ ఒక యువకుడు ఒక పోలీసును బతిమాలుతున్నాడు.</p>
<p>‘లోపల్కి జరుగు, బొక్కలు ఇరుగుతయ్‌’ మరోచోట మరో పోలీసు ఇంకొకతణ్ని అదుపు చేస్తున్నాడు.</p>
<p>ఏం జరుగుతోందబ్బా?</p>
<p>నేను బిత్తరపోయి చూస్తుండగా, తొక్కిడిలో నిల్చున్న ఒకాయన, వయసులో కాస్త పెద్దాయనే, ‘కొత్తగొచ్చినట్టుంది కదా, మధ్య లైన్లోంచి వెళ్లిపో’ అని సూచించాడు. ఊహించని ఆత్మీయత!</p>
<p>ఈ మధ్య లైనేమిటి? ఫిజికల్లీ ఛాలెంజ్‌డ్‌ మనుషుల్ని పంపే వరుస. చేతుల్లేనివాళ్లు, ఊతకర్రల సాయంతో నడుస్తున్నవాళ్లు, గుడ్డివాళ్లు ఇందులో నిలబడివున్నారు. వాళ్ల చేతుల మీద వాళ్లు వచ్చిన క్రమాన్ని బట్టి పోలీసు 1, 2, 3 అని అంకెలు వేశాడు. చివరగా ఉన్న వ్యక్తి చేతిమీద 26 అని ఉంది. ఇది కొంత ఫ్రీగా ఉంది. మిగిలిన రెండు వరుసలు ఒకటి మగవాళ్లకోసం, మరొకటి ఆడవాళ్ల కోసం. అవి క్రిక్కిరిసి వున్నాయి. కొందరి చేతుల్లో కరెన్సీ నోట్లు&#8230; వందలు, ఐదు వందలు, వెయ్యి రూపాయలు! చాలామంది చేతిలో సంచీలు&#8230; అందులోనూ నోట్లే ఉన్నాయని ఇట్టే గ్రహించేట్టుగా!</p>
<p>ఆ పెద్దాయన పక్కనున్న గడ్డపు వ్యక్తి అంతకుముందటి వాక్యాన్ని ఓన్‌ చేసుకుని, దానికి కొనసాగింపుగా అంటున్నాడు: ‘‘నువ్వు ఉట్టిగ టైమ్‌ ఎందుకు వేస్ట్‌ చేసుకుంటవని చెప్పినం. మేమంతా రోజూ ఇక్కడ పడి చచ్చెటోళ్లమే’’</p>
<p>పాపం వాళ్లు నాకోసమని చెప్పారుగానీ, అసలు నేను లోపలికి దేనికోసమని వెళ్లాలి?</p>
<p>నాలో ఏ ఇమడనితనాన్ని గుర్తించిందో ఒక పెద్దశిఖావిడ అడిగింది: ‘‘ఏం పనికచ్చినవ్‌ నాయినా?’’</p>
<p>నేను పేపర్ల పనిచేస్తనమ్మా, రియాలిటీ చెక్‌ అని ఒక ఫీచర్‌ రాయాలమ్మా, అనే చెత్తంతా ఆమెకెలా చెబుతాను? పైగా ఒక రిపోర్టర్‌ అనే ట్యాగ్‌తోకన్నా, వాళ్లలో కలిసిపోయి చూసినప్పుడే జీవితచిత్రం తన సహజ స్వరూపంలో కనబడుతుందని నాకో భ్రమ కూడా ఉంది. కాబట్టి ఓసారి ఎత్తైన ఎంట్రెన్సులో కనీకనపడకుండా ఉన్న బోర్డులు చదివాను.</p>
<p>‘పబ్లిక్‌ కౌంటర్లు పనిచేయు వేళలు ఉదయం 10.15 నుంచి మధ్యాహ్నం 2.45.</p>
<p>చలామణీలో లేని నాణేల కోసం ఫలానా నంబరు కౌంటరు, చిరిగిన నాణేల మార్పిడి కోసం ఫలానా కౌంటరు, నోట్ల మార్పిడి కోసం ఫలానా కౌంటరు’&#8230;</p>
<p>అయితే నేను కూడా ఒక ఐదు వందల రూపాయలకు చిల్లర తీసుకుందామనుకున్నాను. ఐదు వందల నోటుకు ఐదు వందల రూపాయి బిళ్లలు!<br />
అబ్బా, ప్రవాహంలో కలిసిపోవడానికి అనువైన హేతువు దొరికాక నేను మరింత మామూలుగా ఉండగలిగాను. అయితే అప్పటికి మరింత రద్దీ పెరిగింది. ఇందాకటి మధ్యలైను కూడా పూర్తిగా నిండిపోయింది. రణగొణధ్వని. కాకిరి బీకిరి మాటలు. ఎప్పుడైనా ఒకసారి ‘ఎందుకువయా తోస్తరు?’, ‘ఉండవమ్మా, ఓ&#8230; మీదవడుతున్నవ్‌’, ‘తేరీ మాకీ&#8230;’లాంటి మాటలు మాత్రం వినబడుతున్నాయి. ఒకదాంట్లో బాగా రాటుతేలాక వచ్చే గాయితనం ఆడవాళ్లలో, మొరటుతనం మగవాళ్లలో.</p>
<p>ఆ మాటల్ని వినుకుంటూ, పాతిక మంది చొప్పున ‘మరింత లోనికి’(అసలైన బ్యాంకులోకి) పంపుతున్న పోలీసుల్ని చూసుకుంటూ, పని జరిగిపోవాలన్న తొందర లేనప్పుడు ఉండే నిశ్చింతతో నేను వరుసలో నిల్చున్నాను.</p>
<p>అయినా పక్క వరుసలోని ఒకావిడ అంటూనే ఉంది: ‘‘ఏడ పనిజేస్తవ్‌ నాయినా, ఐడీ కార్డు చూపించి డైరెక్టు లోపల్కి వో’’<br />
ఇంతమంది నేను ఈ సమూహంలోకి కొత్తగా వచ్చానని గుర్తించగలిగారంటే, వీళ్లంతా ఎంత పాతవాళ్లు!</p>
<p>అక్కడే తచ్చాడుతున్న మరొకామె ఇదే అదనుగా ‘‘నువ్వు డైరెక్టు లోపల్కి వోతవు గదా! నాయో పదివేలిస్తా అవ్విటిగ్గూడా చిల్లర తీస్కరా’’ అంది.</p>
<p>సినిమా క్యూలో మనం నిల్చున్నప్పుడు, లైన్లో లేని వ్యక్తి వచ్చి కొంచెం టికెట్‌ తీసివ్వమని అడగటం లాంటిదిది.</p>
<p>ఏం చెప్పాలో అర్థంకాక ‘‘నేనెట్లా తేనమ్మా&#8230;’’ అన్నాను.</p>
<p>‘‘నీకు ఐదు వందలకు చిల్లర్నేగదా గావాలె, పదివేలది వాళ్లమీద ఎందుకు వోగొడుతవ్‌?’’</p>
<p>‘‘వద్దమ్మా అట్ల నేను తేగూడదు’’</p>
<p>కాసేపాగాక నామీద తుది బాణం వేసింది: ‘‘నీకో యాభై రూపాయలిస్తతియ్యి’’</p>
<p>తప్పొప్పుల మీమాంసలోకి దిగలేదుగానీ, నేను వెళ్లిన సందర్భంలో అమె పని మానసికంగా నా పనికి ఆటంకంగా తోచింది. అందుకే నిరాకరించాను.</p>
<p>‘‘హుషార్‌ లెవ్‌ నువ్వు, పిల్లగాండ్లు ఎట్లుండాలె, చెడుగులోలుండాలె’’ అంది. నిందకన్నా నేను ఎలా బతుకుతానో అన్న బాధే ఎక్కువ ధ్వనించిందందులో.</p>
<p>లైను నెమ్మదిగా కదులుతోంది.</p>
<p>కాసేపటి తర్వాత, వరుసల్ని పర్యవేక్షిస్తున్న పోలీసొకామె నన్నూ, నాలాంటి మరొకతణ్ని(‘‘మా ఫ్యామిలీ మొత్తం షిరిడీ పోతున్నం, పదుల నోట్లు చేతులుంటే మంచిదిగదాని వొస్తే ఇక్కడ ఇంత రష్షుంది’’) కొత్తవాళ్లుగా గుర్తుపట్టి, వరుసలో అందరికంటే ముందు నిలబడే అవకాశం కలిగించింది.</p>
<p>కాసేపటికి లోపలికి వెళ్లాను. వివిధ కౌంటర్లతో విశాలంగా ఉన్నా, మామూలుగా చూసే బ్యాంకులాగే ఉంది.</p>
<p>అయినా ఇది బ్యాంకులాగా ఉండటమేంటి? ఇదే బ్యాంకులకు అమ్మయితే!</p>
<p>చిల్లరని చెప్పి టోకెన్‌ తీసుకుని, నాలుగో నంబర్‌ కౌంటర్‌ కెళ్తే, రూపాయి బిళ్లల్ని మూటగట్టిన ప్లాస్టిక్‌ కవర్‌ చేతిలో పెట్టారు.</p>
<p style="text-align: center;">***</p>
<p>కవర్ని ప్యాంటు జేబులో కష్టంగా కూరుకుంటూ బయటకు వచ్చాక–<br />
లైన్లలో ఇందాక కనిపించినవాళ్లు, నన్ను మధ్యలోంచి వెళ్లమని సూచించినవాళ్లు సహా చిల్లర్లు తీసుకున్న చాలామంది బ్యాంకును ఆనుకొనివున్న ఆ ఫుట్‌పాత్‌ మీద ఒంటరిగా, జంటగా, నలుగురైదురుగా, పదిమందిగా నిలుచుని, కూర్చుని, కాలు ప్రహారీకి ఆనించి ఉన్నారు. చేతుల్లో, చేతిసంచీల్లో కొత్త పది, ఇరవై రూపాయల నోట్ల కట్టలు! ఒకటి, రెండు, ఐదు రూపాయల బిళ్లల మూటలు!</p>
<p>కొందరు అట్లో, గుంటపొంగనాలో టిఫిన్లుగా తెచ్చుకుని తింటున్నారు. ఒకామె కట్టలు ముందర పెట్టుకుని బ్లౌజుకు చేతికుట్టు వేస్తోంది.<br />
స్కూటర్ల మీద, లూనాల మీద వచ్చినవాళ్లు వీళ్లతో బేరాలు చేస్తున్నారు.</p>
<p>‘పదివేలిట్లుస్తున్నవ్‌?’</p>
<p>‘నూటిరువై’</p>
<p>‘నూరు జేస్కో’</p>
<p>‘ఇగ పది జూడు’</p>
<p>సెటిల్‌. పదుల నోట్ల కట్టలు అటు, పది వెయ్యి రూపాయల నోట్లు ఇటు. లాభం 110.</p>
<p>రిజర్వ్‌బ్యాంకు జన సౌకర్యం కోసం కల్పించిన ఒక వీలులోంచి ఒక చిత్రమైన వ్యాపారం ఇక్కడ రూపుదిద్దుకుంది. బ్యాంకులో పదివేల రూపాయలిచ్చి బదులుగా అంతేమొత్తాన్ని పదులు, ఇరవై నోట్లుగా పొందవచ్చు. అలాగే ఐదు వందలిచ్చి అంతే విలువైన సొమ్మును ఒకటి, రెండు, ఐదు రూపాయల బిళ్లలుగా తీసుకోవచ్చు. ఒక మనిషి ఒక పర్యాయం రెండు టోకెన్లలో గరిష్ఠంగా 10,500 రూపాయల విలువైన నోట్లకు చిల్లర విడిపించుకోవచ్చు. దీనికోసమే ఈ జనమంతా ఎగబడుతున్నారు. ఈ చిల్లరను ఏం చేస్తారు వీళ్లు?<br />
అమ్ముతారు.</p>
<p>ఎవరు కొంటారు?</p>
<p>షాపులవాళ్లు. ముఖ్యంగా రోజూ రూపాయి, రెండ్రూపాయలు, పదులనోట్లు వ్యాపారపరంగా అవసరమైనవాళ్లు.</p>
<p>మరి వాళ్లే వరుసలో నిల్చోవచ్చుకదా?</p>
<p>ఈ క్యూలో నిల్చుని ఆర్జించేదానికన్నా, షాపును వదిలేసి వాళ్లు పోగొట్టుకునేది ఎక్కువ. అదిగో, ఆ అవసరాన్ని వీళ్లు తీర్చుతున్నారు. ధాన్యమార్పిడి, వస్తుమార్పిడిలాగా, ఇది చిల్లర మార్పిడి. గృహిణులు, చిరుద్యోగాల్లోంచి రిటైర్‌ అయినవాళ్లు, సాయంత్రాలు ఏ పల్లీబండో నడుపుకునే యువకులు, వేరే పనుల్లో చేరలేని వికలాంగులకు ఇది పార్ట్‌టైమ్‌ జాబ్‌ అయిపోయింది. (పది, ఇరవై నోట్ల) వెయ్యికి పది, (1, 2, 5 బిళ్లల) వందకు పది–పన్నెండు చొప్పున ఒక దఫాలో అటూఇటూగా ఓ నూటాయాభై దాకా సంపాదించుకోవచ్చు. నిర్దేశిత సమయంలో రెండుసార్లు లైన్లో నిలబడి నెగ్గుకురాగలిగితే ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆదివారాలు, సెలవురోజులు పోను రోజూ రాగలిగితే ‘ఒక జీతం సొమ్ము’కు అవకాశం ఉంది.</p>
<p>‘‘వొంట జేసి పిల్లల్ని స్కూలుకు పంపించినంక ఇక్కడికొస్త, ఉట్టిగ ఇంట్ల ఉండి ఏం జెయ్యాలె’’</p>
<p>‘‘మూడునెళ్ల కిందట దీని రూటు దొరికింది. మంచిగనేవుందిగదాని వొస్తున్న’’</p>
<p>‘‘రోజుకు రెండొందల దాకా మా పడుతున్నయ్, అన్నిరోజులు ఒక్కతీరుగుంటయా, ఓసారి రెండ్రూపాయలు తక్వకే ఇయ్యాల్సొస్తది’’<br />
మళ్లీ వీళ్ల దగ్గర కొని, షాపులకు తిరిగి అమ్మేవాళ్లున్నారు. మారు బేరం.</p>
<p>ఇక్కడ గుమికూడిన రద్దీకి అనుగుణంగా ఒక పుచ్చకాయల ముక్కల బండి వచ్చి చేరింది. ఉపాధిలోంచి ఉపాధి.</p>
<p>అప్పుడే పరిచయమైన ఒకతను అన్నాడు: ‘‘ఐదు వందలకే తెచ్చినవా? పదివేలది గూడా తేవద్దా? వేస్టుగ వంద రూపాయలు పోగొట్టుకున్నవ్‌’’</p>
<p>ఇక, ఒక కుడిచేయి లేని వ్యక్తయితే, ‘‘ఇవి అమ్ముకొని మళ్ల లైన్లకు వో. భయపడకుండ జేసుకో’’.</p>
<p>కొత్తవ్యక్తిగా ప్రవేశించిన నన్ను వీళ్లు పోటీగా భావించకపోవడం ఆనందం కలిగించింది. పైగా వాళ్ల ఆత్మీయత కదిలించింది.</p>
<p>నిబంధనల సంగతి పక్కన పెడితే, ఏటీఎంలు ఎక్కువైపోయి వందలు, ఐదువందలు, వెయ్యినోట్లే చలామణీలోకి వస్తున్న ఈ రోజుల్లో అన్నిరకాల వ్యాపారాలు జరగడానికి అనువైన చిల్లరను బ్యాంకునుంచి జనంలోకి తేవడంలో వీళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారనుకోవచ్చు.</p>
<p style="text-align: center;">***</p>
<p>తిరిగి బస్సులో వస్తుంటే, కండక్టర్‌ విసుక్కుంటున్నాడు: ‘‘అందరు నోట్లే ఇస్తే, నేనెక్కడికేలి తేవాలి చిల్లర?’’</p>
<p>కొన్ని రోజుల్దాకా నాకు నిశ్చింత. ‘‘థాంక్యూ అన్నా, నువ్వొక్కనివి కరెక్టుగా ఇచ్చినవ్‌’’ అన్నాడు.</p>
<p>నాల్రూపాయలు అవసరమైనప్పుడు, మీ దగ్గర ఐదొందలుంటే మాత్రం ఏంలాభం?</p>
<p>అదీ చిల్లర ఘనత.</p>
<p style="text-align: right;"><em>(రచనాకాలం: ఫిబ్రవరి 2012 )</em></p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
<p>పుస్తకం: రియాలిటీ చెక్<br />
రచయిత: పూడూరి రాజిరెడ్డి<br />
పబ్లిషర్: తెనాలి ప్రచురణలు<br />
వెల: రూ. 250 (హార్డ్‌బౌండ్ ఎడిషన్)<br />
ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు<br />
వివరాలకు: 9705553567</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=12736</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
		</item>
		<item>
		<title>కృష్ణశాస్త్రి సాహిత్యం – సౌందర్యతత్వం</title>
		<link>http://vaakili.com/patrika/?p=12212</link>
		<comments>http://vaakili.com/patrika/?p=12212#comments</comments>
		<pubDate>Fri, 30 Sep 2016 22:19:39 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[డా. సీతారామయ్య (రామసూరి)]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=12212</guid>
		<description><![CDATA[<p></p> <p>రాయప్రోలు సుబ్బారావుగారి ప్రభావంతో ఆధునిక కావ్యాలలో వియోగ శృంగారానికి ప్రాధాన్యం వచ్చింది. నవరసాలలో ప్రప్రథమంగా చెప్పదగినది శృంగారం. ఇది సంభోగం, విప్రలంభం అని రెండు విధాలు. విప్రలంభ శృంగారం ఐదు విధాలని మమ్మటాదుల అభిప్రాయం. అవి 1. అభిలాష 2. విరహం 3. ఈర్ష్య 4. ప్రవాసం 5. శాపం. ఇందులో ప్రవాసం కృష్ణశాస్త్రి కావ్య పరిశీలనకి అవసరం. &#8216;అనురక్తులైన నాయికా నాయకులు కార్యాంతర వశమున దేశాంతరగతులగుట ప్రవాసము&#8217;.</p> <p>కాళిదాసు మేఘసందేశం ప్రవాస విప్రలంభానికి చెందిన కావ్యం.</p> <p>&#8216;త్వా మాలిఖ్య ప్రణయ కుపితాం ధాతురాగైః శిలయా<br /> మాత్మానంతే చరణపతితం యావదిచ్చామి కర్తుమ్<br /> అస్త్రైస్తావమమ్హరు ప చితై ర్దృష్టి రాలుప్యతే మే<br /> క్రూరస్త స్మిన్నపి న సహతీ సంగమం నౌకృతాంతః&#8217;</p> <p>కుబేరుని శాపానికి గురైన యక్షుడొకడు రామగిర్యాశ్రమంలో నివసిస్తూ మేఘుని చేత తన ప్రియురాలికి పంపిన సందేశమిది. ప్రియురాలా!</p> <p>ప్రణయ కుపితవై యున్న నీ రూపాన్ని, ధాతురాగాలచే శిలపై రాసి, నేను నీ పాదాలపై పడాలనుకునేంతలో మరల మరల ఉబికే కన్నీటిచే నా చూపు లోపిస్తుంది. క్రూరమైన దైవం చిత్రంలో కూడా మన సంబంధాన్ని సహింపలేకున్నది.</p> <p>హృదయాన్ని కరిగించేలా కాళిదాసు చిత్రించిన ప్రవాస విప్రలంభమిది.</p> <p>సీతారాముల శృంగారం ధర్మశృంగారం. బాహ్య సౌందర్యము చేతనే కాక ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం, క్షణిక సౌఖ్యాన్ని కాక భవిష్యత్ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొనుట ఈ ధర్మశృంగార లక్షణాలు.</p> <p>శృంగార రసాన్ని రసరాజమన్నవాడు భోజుడు. శృంగారానికి అహంకారం, అభిమానం, రసం పర్యాయ వాచకాలు.</p> <p>ఆధునిక యుగంలో అమలిన శృంగార చర్చ చేసినవారు రాయప్రోలువారు. తృణకంకణం, లలిత, స్నేహలతాదేవి లేఖ వంటి ప్రణయ కావ్యాలలో భావకవిత్వానికి రూపురేఖలు దిద్దినవారు. కరుణ, శృంగారరసాలు రెండే రసావిష్కరణకి సమర్థాలని అభిప్రాయపడినవారు వీరు. పూర్ణానందాస్వాదానికి శృంగారం, మనో దోష శుద్ధికి కరుణ ఉపయుక్తాలని వీరి భావం. శృంగార రసానికి సంభోగమవధి అన్న పూర్వుల సిద్ధాంతాన్ని వీరు తిరస్కరించారు. ఉపాధి మాత్రమైనది కాబట్టి [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/10/ks.jpg"><img class="alignleft  wp-image-12439" title="ks" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/10/ks.jpg" alt="" width="386" height="430" /></a></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">రా</span>యప్రోలు సుబ్బారావుగారి ప్రభావంతో ఆధునిక కావ్యాలలో వియోగ శృంగారానికి ప్రాధాన్యం వచ్చింది. నవరసాలలో ప్రప్రథమంగా చెప్పదగినది శృంగారం. ఇది సంభోగం, విప్రలంభం అని రెండు విధాలు. విప్రలంభ శృంగారం ఐదు విధాలని మమ్మటాదుల అభిప్రాయం. అవి 1. అభిలాష 2. విరహం 3. ఈర్ష్య 4. ప్రవాసం 5. శాపం. ఇందులో ప్రవాసం కృష్ణశాస్త్రి కావ్య పరిశీలనకి అవసరం. &#8216;అనురక్తులైన నాయికా నాయకులు కార్యాంతర వశమున దేశాంతరగతులగుట ప్రవాసము&#8217;.</p>
<p>కాళిదాసు మేఘసందేశం ప్రవాస విప్రలంభానికి చెందిన కావ్యం.</p>
<blockquote><p>&#8216;త్వా మాలిఖ్య ప్రణయ కుపితాం ధాతురాగైః శిలయా<br />
మాత్మానంతే చరణపతితం యావదిచ్చామి కర్తుమ్<br />
అస్త్రైస్తావమమ్హరు ప చితై ర్దృష్టి రాలుప్యతే మే<br />
క్రూరస్త స్మిన్నపి న సహతీ సంగమం నౌకృతాంతః&#8217;</p></blockquote>
<p>కుబేరుని శాపానికి గురైన యక్షుడొకడు రామగిర్యాశ్రమంలో నివసిస్తూ మేఘుని చేత తన ప్రియురాలికి పంపిన సందేశమిది. ప్రియురాలా!</p>
<p>ప్రణయ కుపితవై యున్న నీ రూపాన్ని, ధాతురాగాలచే శిలపై రాసి, నేను నీ పాదాలపై పడాలనుకునేంతలో మరల మరల ఉబికే కన్నీటిచే నా చూపు లోపిస్తుంది. క్రూరమైన దైవం చిత్రంలో కూడా మన సంబంధాన్ని సహింపలేకున్నది.</p>
<p>హృదయాన్ని కరిగించేలా కాళిదాసు చిత్రించిన ప్రవాస విప్రలంభమిది.</p>
<p>సీతారాముల శృంగారం ధర్మశృంగారం. బాహ్య సౌందర్యము చేతనే కాక ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం, క్షణిక సౌఖ్యాన్ని కాక భవిష్యత్ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొనుట ఈ ధర్మశృంగార లక్షణాలు.</p>
<p>శృంగార రసాన్ని రసరాజమన్నవాడు భోజుడు. శృంగారానికి అహంకారం, అభిమానం, రసం పర్యాయ వాచకాలు.</p>
<p>ఆధునిక యుగంలో అమలిన శృంగార చర్చ చేసినవారు రాయప్రోలువారు. తృణకంకణం, లలిత, స్నేహలతాదేవి లేఖ వంటి ప్రణయ కావ్యాలలో భావకవిత్వానికి రూపురేఖలు దిద్దినవారు. కరుణ, శృంగారరసాలు రెండే రసావిష్కరణకి సమర్థాలని అభిప్రాయపడినవారు వీరు. పూర్ణానందాస్వాదానికి శృంగారం, మనో దోష శుద్ధికి కరుణ ఉపయుక్తాలని వీరి భావం. శృంగార రసానికి సంభోగమవధి అన్న పూర్వుల సిద్ధాంతాన్ని వీరు తిరస్కరించారు. ఉపాధి మాత్రమైనది కాబట్టి ఇది పనికిరాదన్నారు. వియోగ శృంగారం అనుపాధికం కాబట్టి స్వీకరించాలన్నారు. వియోగంలో ఆలంబన విభావం ప్రత్యక్షం కాదు. ఇక్కడ హృదయానికి ప్రాధాన్యం. నిర్మలమైన శృంగారం వియోగంలోనే అనుభూతికి వస్తుందని రాయప్రోలు వారి అభిప్రాయం. &#8216;స్థూలంగా చూచినచో సౌందర్య శృంగారములొక్కటే&#8217; అని సి.నారాయణరెడ్డిగారు అభిప్రాయపడ్డారు.</p>
<blockquote><p>&#8216;కానవచ్చు సౌందర్య శృంగారములకు<br />
అంతరంబనభివ్యక్తమయి; ఉపాధి<br />
గతము సౌందర్య &#8211; మను పాధికము రసాధి<br />
కారి శృంగార &#8211; మఖిల మాంగల్య పరము&#8217;</p></blockquote>
<p>అని రాయప్రోలు వారు చెప్పారు. నిర్మలమైన సౌందర్య ధ్యానంతో ఆనందాన్ని అనుభవించవచ్చునని వియోగంలోనే ప్రేమ ఔన్నత్యం పరిఢవిల్లుతుందని రాయప్రోలు వారి సిద్ధాంతం.</p>
<p>కృష్ణశాస్త్రిగారి ప్రవాసం ఖండికలలో కవి కోరిన శృంగార జీవితం, ప్రేయసి లభ్యం కాకపోవడం, ఆదర్శ సౌందర్యం కోసం నిరీక్షించడం మొదలైన అంశాలు ప్రాముఖ్యాన్ని వహించాయి. ప్రవాసం ఖండికలు కృష్ణశాస్త్రిగారు మొక్కపాటి రామమూర్తికి అంకితం ఇచ్చారు. అంకిత గీతం &#8216; ఓ మానవోత్తమా! అని సంబోధిస్తూ</p>
<blockquote><p>&#8216;ఈ యశ్రుఝరులతో, ఇరులతో, రొదలతో<br />
సొదలతో, ఈ హాస మృదుల వాసనలతో<br />
విసముతో, సిగ్గుతో, కొసరు తేనియలతో<br />
ఈ పాట బ్రతుకు నీ కేపాటిదోయీ, నా<br />
నెచ్చెలీ!&#8217;</p></blockquote>
<p>అంటారు.</p>
<p>బ్రహ్మసమాజానికి సన్నిహితులైన వారిలో రామమూర్తి నిజాయితీ అంటే అందరికీ అమితమైన గౌరవం. కృష్ణశాస్త్రిగారు రామమూర్తిని ఆధ్యాత్మిక గురువుగా భావించేవారని చలం రాశారు. రామమూర్తిని గురించి తెలుసుకోవాలంటే చలం మ్యూజింగ్సు ఆధారం. వ్యక్తిగత కారణాలచేత ఆత్మహత్య చేసుకొన్న రామమూర్తిని గురించి చలం ఇలా అంటారు.</p>
<p>&#8216;నీ మరణం అపజయం కాదని &#8211; సంఘం మీదనే కాదు, మనుష్య స్వభావం మీద, మరణం మీద జయధ్వానమని చెప్పడానికి మిగిలాను నేను.&#8217;</p>
<p>రామమూర్తి ధైర్యం, ఉత్సాహం, అశాంతి, తిరుగుబాటు &#8211; ఆ కాలం నాటి సాంఘిక దురాచారాల మీద విరుచుకపడేలా చేశాయి. ప్రేమకోసం, సత్యం కోసం, సమత కోసం, సమాజంలో ఆయన లేవనెత్తిన ఆలోచనలు చలం, ముద్దుకృష్ణ, కృష్ణశాస్త్రి వంటి రచయితల కలాలలో బలంగా ప్రతిధ్వనించినాయి. రామమూర్తి చలానికి రాసిన లేఖలో ఇలా అంటారు.</p>
<p>&#8220;And you are not alone in this suffering for want of sympathy and communion. For the first time I heard similar cry from D.K. (Krishna Sastri). With almost a broken heart he has been telling how people merely say his verses are good and fashionably read them rapidly through and skip over the surface while he has taken such pains to paint picture after picture in some of them.&#8217;</p>
<p>భగ్నహృదయంతో కృష్ణశాస్త్రి రాసిన గీతాలు రామమూర్తిని ఆకర్షించాయి. చలం రచనలలో ఏ భావాలు సంచలనాన్ని కలిగించాయో, ఏ స్థాయిలో సాహిత్యలోకాన్ని ఆలోచింపజేశాయో, అలాంటి స్పందనే కృష్ణశాస్త్రి గీతాలూ కలిగించాయి.</p>
<p>My sin is the desire to be loved&#8217; అన్నాడు రామమూర్తి. &#8216;బ్రతుకు&#8217;, &#8216;ప్రేమించు&#8217; &#8211; ఇదీ రామమూర్తి సిద్ధాంతం. నిజమైన ధీరులనీ, నిజంగా ప్రజలని ప్రేమించేవారినీ లోకం దగ్గరకు రానివ్వదు. ప్రేమ నటించి, మోసం చేసేవారిని లోకం ఆదరిస్తుంది. ఇది లోకస్వభావం. రామ్మూర్తి చచ్చిపోగానే ముద్దుకృష్ణ రామమూర్తి జీవిత చరిత్ర రాద్దామా అన్నారు చలం గారితో. &#8216;మీరూ నేనూ చదువుకోవాలి. రామ్మూర్తి ఎవరికి గొప్ప&#8217; అన్నారు చలంగారు.</p>
<p>ప్రేమకోసం, మనుషులకోసం, సత్యం కోసం జీవితాన్ని త్యాగం చేసిన రామమూర్తి మరణించడం కృష్ణశాస్త్రిని అమితంగా కదిలించింది. &#8216;హృదయ భేదకమైనవీ, అర్థం కానివీ, అయిన రెండూ మూడు మరణాలూ, అంతకన్నా దారుణంగా కలతపెట్టిన రెండు మూడు వియోగాలు అవసరమైనాయి&#8217; అని చలంగారు అన్నారు. (దేనికి అవసరమైనవి?)</p>
<p>భావకవిత్వంలో వియోగానికీ, సౌందర్య ధ్యానానికీ విలువైన స్థానం ఉంది. ప్రేమ సామ్రాజ్యైక చక్రవర్తిగా, స్నేహశీలిగా, అభివర్ణింపబడిన రామమూర్తి కృష్ణశాస్త్రి కవితా ప్రస్థానంలో ప్రేరణ కలిగించిన వ్యక్తిగా మనకి కనిపిస్తాడు.</p>
<p>భావకవిత్వం అంటే పాట. కృష్ణశాస్త్రి భావకృతులన్నీ గానయోగ్యమైనవే. కవిత్వాన్ని సంగీత స్థాయికి తెచ్చినవారు కృష్ణశాస్త్రిగారు. ఆంగ్ల కవిత్వ విమర్శకులు &#8216;లిరిసిజం&#8217; అంటారు. అశ్రుఝరులూ, చీకట్లూ, మృదుహృదయం, కొసరుతేనియలూ మొదలైన పదాలు రామమూర్తి వ్యక్తిత్వంలోని విశాల దృక్పథాన్ని తెలియజేస్తున్నాయి.</p>
<p>సంకుచితంగా వ్యవహరించే లోకం చూపిన దుర్మార్గానికి బలైపోయిన రామమూర్తితో, &#8216;ఈ పాట బ్రతుకు నీకేపాటిదోయీ&#8217; అనడంలో పాటకంటే ఉదాత్తమైన వ్యక్తిత్వం కలవాడని కృష్ణశాస్త్రి అభిప్రాయం.</p>
<p>&#8216;ప్రేయసీ, ప్రేయసీ, వెడలిపోయితివేల, ఆ యగమ్య తమస్వినీ గర్భకుహరాల&#8217; అంటూ ప్రారంభమౌతుంది ప్రవాసము. కృష్ణపక్షములోని &#8216;ప్రతీక్ష&#8217; ఖండికలో వ్యక్తమైన &#8216; ఆ యగమ్య తమస్సాంద్ర యవనికాంతరంపుటేకాంతమున బడి, యా క్రమ క్రమాస్తమిత నూపురారవాహ్వానములను వెంటనంటి,నా హృదయము వెడలిపోయె&#8217; నన్నదానికి ప్రతిధ్వని ప్రవాసంలో కనిపిస్తుంది. ‘ప్రవాసం’ కవి వేదన యొక్క విశ్వరూపాన్ని, కవి హృదయ పరిణామాన్ని స్పష్టం చేస్తుంది. &#8216;కవి రసాత్మకుడు. తాను ఆనందిస్తూ మనల్ని ఆనందింపజేస్తాడు. కవి ఋషియట. అతని ఆత్మోన్నతి మనకి వివృతమౌతోంది. మరి భావకవి అంటే లోకానికి ఎంత ఆశో! ఆ ఆశ ఎంత న్యాయమైనదో&#8217; అని కొంపెల్ల జనార్దనరావు అన్నారు.</p>
<p>కృష్ణపక్షంలో &#8216;నేను&#8217;గా అహంభావం ప్రకటించిన కవి తనని తాను సంస్కరించుకొని, విశ్వవ్యాపితమయ్యే ప్రయత్నం ప్రవాసంలో కనిపిస్తుంది. ప్రియురాలి ఎడబాటు భరించలేక, అపుడు గొంతెత్తి యేడిస్తే, తారకలు ఆర్చుకుపోయినాయి. మొగిళ్లు మరింత నల్లబడి నిట్టూర్పు దొంతరలైనాయి. చీకట్లు తలలు వాల్చుకున్నాయి. ఇలా అమూర్తమైన వాటికి ఆకారాన్ని కల్పిస్తూ గాలి చలించిపోవడాన్ని కృష్ణశాస్త్రి</p>
<blockquote><p>&#8216;అపుడు బ్రతుకొక్కటె యేడుపైన గాలి<br />
రిచ్చవడి వట్టి పసిపాప లీల మౌన<br />
యానమున బరి సుప్త పత్రాళి నొదిగి<br />
పొంచి చూచుచు చలియించి పోయినాడు&#8217;</p></blockquote>
<p>ఏకాంతంలో మానవుని మానసిక స్థితిని ప్రకృతిలో సమన్వయించి ప్రవాసిని చిత్రించారు.</p>
<p>వేసటేలేని వెర్రి అన్వేషణం కవిలో అశాంతిని కలిగించింది. అసలు సౌందర్యంలో ఈ అశాంతిని కలిగించే శక్తి ఎక్కువగా ఉంది. సౌందర్యాన్ని ఆకర్షకంగా చేసే సూత్రం ఇదే. సౌందర్య సృజన చేయగల కళాకారులు లోకంలోని సౌందర్యంతో తృప్తిపడరు. దీన్ని ప్రపంచం చంచలత్వం అంటుంది. సౌందర్యం ఎవరిని కదిలించలేదో, ఎవరికి సౌందర్యం చాలా అల్ప విషయమో వాళ్లకి కవి బాధ అర్థం కాదు. అందుకే చలంగారు &#8216;కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ&#8217; అని అన్నారు.</p>
<p>కళాకారుల మనసులోని విలువలు ప్రత్యేకమైనవి. ఆశలూ, స్వప్నాలూ అనంతమైనవి. ఈ గుణం వాళ్లు ఆరాధించే సౌందర్య దేవతలోనే ఉంది. సౌందర్యమూ, ఆనందమూ మాయ కావు. అందవికారమూ, అసహ్యమూ మాయ. నిర్మలత్వమూ, ఏదో అర్థం కాని నూతనత్వమూ సౌందర్యం. అందుకే కృష్ణశాస్త్రిగారు,</p>
<blockquote><p>&#8216;అంతమే లేని నా యాత్రా పథాన నా<br />
పదచిహ్నములు వోలె పడియున్న వెన్నెన్నో<br />
అడుగుజాడలు మదీయార్ద్ర హృదయమ్ములో<br />
నిశికడుపులో తారలై, నిశ్శబ్ద<br />
వాటిలో చిరుపాటలై,&#8217;</p></blockquote>
<p>అన్నారు. కవి ఇక్కడ అనంత ప్రయాణీకుడు అవుతున్నాడు. అంటే సౌందర్య ధ్యానంలో ఈ ప్రపంచం వెనకాల అసలు సత్యం ఏమిటో తెలుసుకోవాలనే ఆకలి ఎక్కువైంది. తాను ఎంత దూరం నడిచినా, తన పాద చిహ్నాలు కరుణతో నిండిన తన హృదయంలో కనిపిస్తున్నాయి. అవి కవికి ఆశాజనకంగా ఉన్నాయి &#8211; చీకటి కడుపులో నక్షత్రాల్లా, నిశ్శబ్దంలో చిరుగీతుల్లా. తన ప్రయాణానికి రెండు పక్కలా నిలబడ్డ చెట్లూ, పక్షులూ ఇవన్నీ &#8216;సంజియ కావి వింతలై&#8217; నశించి పోతాయని కవికి బాధ కలిగిస్తున్నప్పటికీ, ఏదో తెలియని ఆశ ముందుకే నడిపిస్తుంది.</p>
<p>1925 &#8216; ప్రవాసం&#8217;లోని ఏ ఖండికకీ శీర్షిక లేదు. తనని అర్థం చేసుకోని లోకాన్ని గురించి కృష్ణశాస్త్రి ఇలా అంటారు.<br />
&#8216;కొందరు స్వేచ్చా విహంగం అన్నారు. కొందరు కుటిల పన్నాగం అన్నారు. కొందరు మూఢ దివాంధం అన్నారు. నేను మాత్రం నా యథార్థ స్వరూపం అజ్ఞాత దుఃఖంలో పదిలపరచాను&#8217;</p>
<p>ఎవరికోసమైతే ఆరాటపడతారో, ఎవరి భవిష్యత్తుని గురించి ఆందోళన పడతారో, ఎవరి మంచి కోరి కష్టాలని వరిస్తారో వారినుంచే విరోధం పొంగుతుంది. ప్రపంచంలో ప్రతి కళాకారుడికీ, తత్వవేత్తకీ, ప్రవక్తకీ ఎదురైన పరిస్థితి ఇదే. అయినా కళాకారులు హాలాహలాన్ని దిగమింగి, అమృతాన్ని ప్రపంచానికి అందించాలనే దృఢ సంకల్పంతో ఉంటారు. తాత్కాలికమైన ప్రయోజనాలు ఆశించే వారికీ శాశ్వతమైన సత్యాన్ని ప్రకటించాలని తపించేవారికీ మధ్య యుగయుగాలుగా సంఘర్షణ ఉండనే ఉంది. వెలుగుకోసం చీకటితో సంఘర్షించడమే ధీరులు చేసే పని. అదే ప్రవాసంలో కృష్ణశాస్త్రి ప్రదర్శించారు.</p>
<p>కవి సముద్ర తీరాన నిలబడి సముద్రునితో అంటాడు. &#8216;ఎంత బాధ నీది! లోకంలో దుఃఖమంతా నిజంగా నీదే . ఈ విశాల విశ్వంలో ఉన్న ఆర్తి అంతా నీదే కదా! నీవు ప్రవాసులలో ఓ చక్రవర్తివి&#8217; అని అంటాడు.</p>
<p>అనంతమైన వేదన కవికి ప్రేమ కిటికీలు తెరచి ప్రియురాలిని సృష్టించుకొనే శక్తినిస్తుంది.</p>
<p>కావ్య కల్పనలో, కావ్య సృజనలో కరుణకి తగిన స్థానం ఉంది. &#8216;ఏకోరసః కరుణ ఏవ&#8217; కనుక విశ్వప్రేమనూ, కరుణనూ ఇతరుల హృదయాలలో కలిగించటమే కావ్యానికి ముఖ్యమైన ఉద్దేశ్యమని కృష్ణశాస్త్రిగారి అభిప్రాయం. చలంగారు కృష్ణశాస్త్రిగారి ఈ పరిస్థితిని &#8216;శృంగార బాధ&#8217; అని అన్నారు. అంతేకాదు. శృంగారాన్ని కళగా భావించినవారని అన్నారు. శృంగార బాధే కరుణకి దారితీసింది. ఏ రసమైనా కరుణతో ప్రపంచాన్ని ప్రేమించగలిగినప్పుడే కళగా వన్నెకెక్కుతుంది.</p>
<p>&#8216;చక్కని శరీరానికి సుఖమూ, చక్కని ఆత్మకు దుఃఖమూ కావాలి. అన్నాడొక తత్వవేత్త. కనుక అశ్రువులలోనే ఆనంద సందేశం ఉంది, ఆశాజ్యోతి ఉంది’ అని అంటారు కృష్ణశాస్త్రి.</p>
<p>మనసు ఎంత బాధకి గురైతే అంత పక్వానికి వస్తుంది. తిక్కన నిర్వచనోత్తర రామాయణం రాసేనాటికి, మహాభారతానువాదం చేసేనాటికీ ఎంత పరిణామానికి లోనయ్యాడో అందరికీ తెలిసినదే. ఆ కాలం నాటి ఆంధ్రదేశంలోని పరిస్థితులు ఆయన హృదయాన్ని ఎంత కలతకి గురిచేశాయో గ్రహించగలం. అంటే కళలోని రసం అమృతస్థితికి చేరాలంటే కళాకారుని మనసు ఎంత మధనానికి గురైతే అంతమంచిది. కీట్స్, షెల్లీ వంటి కవులు ఆదర్శ సౌందర్య లక్ష్య సాధనలో దుఃఖాన్ని అనుభవించినవారే.</p>
<blockquote><p>&#8216;వెదకి వేసారి నా వెర్రిబ్రతుకెపుడేని<br />
తుది రేయి కనుమూయనా<br />
బేలయై<br />
నిదుర బరువుల క్రుంగునా<br />
మరపు మసకల దారి తెరచికొని కలయేదో<br />
విరిసికొని పరతించును,<br />
కారురా<br />
తిరి కొనల మెరపించును&#8217;</p></blockquote>
<p>అంటారు కృష్ణశాస్త్రి. ఈ ప్రపంచంలో తన ఆదర్శానికి సరిపోయే ప్రేమనీ, సౌందర్యాన్ని వెదకి వెదకి చివరికి బ్రతుకు ముగిసిపోతుందేమోననీ, మనసు కుంగిపోతుందేమోననీ అనుకుంటున్నాడు కవి. కానీ, మరపు మసకల దారిలో &#8216;కల&#8217; లా పలకరిస్తుందన్న విశ్వాసం, కారు రాతిరి కొనలని మెరిపిస్తుందన్న ఆశ కవిని నిలబెడుతున్నాయి.</p>
<blockquote><p>&#8216;వనరు చేడ్వగలేను, చచ్చి చావగలేను<br />
కనలేని వెలుగుకొరకై<br />
ఎన్నడును<br />
కనరాని దానికొరకై&#8217;</p></blockquote>
<p>కృష్ణశాస్త్రి అన్వేషించే వెలుగు సౌందర్యం. అదే విశ్వప్రేమ. అసలు కవులందరూ అన్వేషించేది వెలుగే. &#8216;పెంజీకటి కవ్వలి వెలుగుల&#8217; కోసం ఆర్తితో భాగవతం రాసిన పోతన వెలుగు &#8216;మోక్షం&#8217;. &#8216;మతములన్నీ మాసిపోవును. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును&#8217; అన్న గురజాడ ఆశించిన వెలుగు &#8216;జ్ఞానం&#8217;. అలాగే కృష్ణశాస్త్రి ఆకాంక్షించేది ప్రేమ. సుందరమైన జీవితం. &#8216;కవులకి బాధలో ఆనందం, వేదాంతులకి ఆనందంలో బాధ&#8217; ఉంటుందంటారు చలం. కవులు తమ అనుభవాలని సృజనకి తొలిమెట్లుగా భావిస్తారు. కనుక బాధ ఆనందాన్నే కలిగిస్తుంది. బాధించే సత్యాలు విచ్చుకుంటున్న కొద్దీ ఆనందం అధిక మౌతూ ఉంటుంది.</p>
<p>మానవుడి వెతుకులాట కృష్ణశాస్త్రి పాట అని చెప్పవచ్చు. &#8221; ఆయన కవిత్వమంతా గొప్ప అన్వేషణ. అందుకే అంత దిగులూ, అంత నిరాశ. వెలుగు ఇంత అందరానిది కావడం చేతనే, All great art is tragic. కానీ ఈ అశాంతి, ఈ వెలుగు కొరకు ఏడుపు &#8211; దీనికంతా గొప్ప అర్థం, సంతోషం ఉంటూంది&#8217; అంటారు చలం.</p>
<p>కృష్ణశాస్త్రి స్వతహాగా సౌందర్యరసైకజీవి. అనుభవించిన దానిని లోపలికి తీసుకొని దాని అందాన్ని రసంగా తీసి పలికేవాడే కళాకారుడు. ఇక్కడ కవి ప్రియురాలిని మనసునిండా నింపుకొని, కన్నీళ్లతో కడిగి స్వచ్ఛమైన సౌందర్యంగా సృష్టించే తపనలో శరీరాన్ని దహింప చేసుకుంటున్నాడు.</p>
<blockquote><p>&#8216;నాకుగాదులు లేవు<br />
నాకుషస్సులు లేవు<br />
నేను హేమంత కృష్ణానంత శర్వరిని<br />
నాకు కాలమ్మొక్కటే<br />
కారురూపు,నా శోకమ్ము వలెనె, నా బ్రతుకు వలెనె<br />
నా వలెనె&#8217;</p></blockquote>
<p>కృష్ణశాస్త్రి కవిత్వ కళ విషాదాన్ని చిత్రించే సన్నివేశాలలో బహుముఖాలుగా విస్తరిస్తుంది. ప్రపంచమంతా ప్రణయోత్సవాలతో ఆనందంగా ఉంటే కవికి తన పరిస్థితి &#8216;హేమంత కృష్ణానంత శర్వరి&#8217; గా అనిపించింది. చీకటిలో తడిసిన నది గడ్డకట్టినప్పటి స్థితి ఇది. కవి తన పరిస్థితిని పాఠకుని మనస్సులో పునస్సృష్టి చేయగలగటం భావకవితా ధోరణి.</p>
<p>కృష్ణ పక్షంలో కవి శోధన కనిపించింది. ప్రవాసంలో కవి సాధన కనిపిస్తుంది. ప్రియురాలిని సృష్టించుకోవాలనే దీక్షతో కనిపించిన ప్రతి సౌందర్యాన్నీ పదిలపరచుకుంటున్నాడు.</p>
<p>విశ్వమంతా వ్యాపించిన కవి నిర్వేద తమస్సు ఒక స్త్రీమూర్తిగా రూపు దిద్దుకుంటుంది.</p>
<p>సూఫీ తత్వంలో ప్రేమ గురించి ఇలా అంటారు. &#8216;Love is the complete consecration of the desires of the heart to the purpose of god&#8217; &#8211; అంతే కాదు. Rumi మాటల్లో చెప్పాలంటే, This is Love to fly heaven wards. Union గురించి ఇలా అంటారు. ‘With two figures but with one soul, thou and I; Individuals no more, but mingled in ecstasy, joyous and serene, thou and I&#8217; హృదయంలోని కోరికలన్నిటినీ కాల్చేసి, తనని తాను అర్పించుకొని అద్వైతసిద్ధిని సాధించటం సూఫీ తత్వం. ఈ భావాన్ని కృష్ణశాస్త్రి,</p>
<blockquote><p>&#8216;కంట కురిసిన కార్చిచ్చు మంట యేళ్ల<br />
కాలినుసియై నశించే వాంఛా లవాలె;<br />
ఏరెరుంగుదురని ఏ యెడారి దార్ల<br />
నింకెనో చుక్కతడి జాడయేని లేక&#8217;</p></blockquote>
<p>కవికి ఇప్పుడు ఏ కోరికలు లేవు. ప్రేయసీ సాక్షాత్కారం కోసం శరీరాన్ని దుఃఖంలో కాలుస్తున్నాడు కవి. &#8216;మంటయేళ్లు&#8217; అన్న పదం ద్వారా ఈ భావాన్ని సూచిస్తున్నారు కృష్ణశాస్త్రి. మనస్సు చేసే తపస్సు సౌందర్య దేవతకోసమే.</p>
<blockquote><p>&#8216;వలపు టాకలి స్రుక్కు నా బ్రతుకు మీద<br />
ఇనుప పాదాలనిడి లోకమిపుడు నడుచు&#8217;</p></blockquote>
<p>ప్రేమకోసం పరితపించిన ప్రవాసి బ్రతుకుని లోకం ఎంత కర్కశంగా బాధించిందో తెలుస్తుంది. తనని తాను దుఃఖ కుటీరంలో దాచుకున్న ఏకాంత స్థితిని కవి</p>
<blockquote><p>&#8216;రేయి కడుపున చీకటి చాయవోలె<br />
తమసుటెడద దివాంధగీతము విధాన<br />
ఘూకరావాన వలవంత రేకరీతి<br />
నా విషాదమ్ములో దాగినాడ నేనె&#8217;</p></blockquote>
<p>తనని ప్రేమించేవారూ, తన బాధని అర్థం చేసుకునేవారూ లేరనే పరిస్థితిలోంచి పుట్టిన నిర్వేదమిది. &#8216;నా విషాదమ్ములో దాగినాడ నేనె&#8217; అనే వాక్యం కృష్ణశాస్త్రి కవితా తత్వాన్ని ఆవిష్కరిస్తూ కరుణ రసం నిండుగా పండిన సన్నివేశమిది.</p>
<p>కవి ప్రేయసితో అంటాడు, &#8216;నీ దీర్ఘ ధమ్మిల్ల నీల వల్లీ చాయ పొడిచికొని, నిదుర చెర విడిచి, పూవులు నేడు&#8217; కనిపిస్తున్నాయి. &#8216;తళతళపాట&#8217; పాడుతున్నాయి. ఈ ఆహ్వానం కవి భరించలేకపోతున్నాడు. ఇది సురభిళాహ్వానం. చీకటికి అలవాటు పడినవాడు వెలుగుని భరించలేనట్లుగా, అనుకోని ఈ ఆహ్వానం కవి భరించలేకపోతున్నాడు. &#8216;నటియించు ఆపూవులెటు నవ్వుచున్నవో! తురిమి విసరుమువాని ఎరుగ నేరని దూరదూరాలకో, రహస్తీరాలకో, చెలీ&#8217; అంటాడు. విభ్రాంతికి లోనైన కవి &#8216;నా సఖీ! నీ ప్రేమ శాపమీ అపూర్వ నరకయాతనాఖర్వతాపము&#8217; అంటున్నాడు.</p>
<p>&#8216;ప్రవాసంలో కవి జీవితానుభవ యవ్వనోదయము మాత్రము ఇప్పుడు కొంత చిక్కబడింది. నాటి కోవెల కొలనుతనము నేడు హేమంత శృంఖలోచితమైన కొత్త వెలుగులకు తావలమైనది. ఈ ఐక్యనిధి ఈ కావ్యాల ఆనుషంగిక పరిశీలనంలో ఫలించినట్టిది&#8217; అని కొంపెల్ల జనార్దనరావు అన్నారు.</p>
<p>కృష్ణశాస్త్రిగారు కృష్ణపక్షం ఖండికలు చాలా వరకు వసంతఋతు నేపథ్యంలో రచించారు. మానవ జీవితంలోని రకరకాల అనుభవాలకి ప్రతిబింబాలు ఋతువులు. ప్రకృతిలోని పరిణామం కవి హృదయ పరిణామంలో కనిపిస్తుంది. కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి క్రమపరిణామంగా భావించి పరిశీలిస్తుంటే కవి హృదయవికాసము బోధపడుతుంది.</p>
<p>కృష్ణపక్షంలో ఉన్నంత అందుబాటులో ఉండవు ప్రవాసంలో రచనలు. దానికి కారణం కృష్ణశాస్త్రిగారు నా గొప్ప రచన అనే వ్యాసంలో ఇలా అంటారు. &#8216;అన్వేషణ ఆగిపోలేదు. ఇదివరకు ఎక్కడికీ చూడలేనివాడు ఇంక లోపలికి చూడటం ప్రారంభించాడు. చూపులు పగలు పైకి పరుగెత్తుతాయి. రాత్రి తలతిప్పుకొని లోపలికి వెళ్ళగించుకొని చూస్తాయి.&#8217;</p>
<p>ఏ కళాకారుడైనా సృజనాత్మక భావనని అంతర్దృష్టితో మేళవించినప్పుడే సౌందర్యాన్ని సృష్టించగలుగుతాడు.</p>
<p>&#8216;ప్రేమకంటే గొప్ప అనుభవం మానవుడికి లేదు. ఇది వరకు అసమగ్రంగా ఉన్న నా ప్రకృతి నీవు నాలోకి వచ్చాక సమగ్రంగా అయింది.&#8217; అంటాడు ప్రెమికుడైన కవి&#8217; అని అంటారు కృష్ణశాస్త్రి.</p>
<p>మనిషి ప్రేమలోనే ఆనందాన్ని పొందగలుగుతాడు. అదే శాశ్వత సత్యం. అదే కడపల. అనంతము అద్వైతము అయినది ప్రేమ. ప్రేమలో ఉన్న కవికి దుఃఖం సౌందర్యంగా పర్యవసిస్తుంది.</p>
<blockquote><p>&#8216;వినరావీ విభావరీ<br />
వేలాశాలల నీమృదు<br />
వసనాంచలముల గుసగుసలో</p>
<p>మసలు చరణ మంజీరము<br />
కొసరు జాలి పలుకరింతలో!</p>
<p>ఈ కుటీర ముఖద్వార<br />
మిందే వ్రేలాడి సగము<br />
వాడి, విరహతోరణమ్మునై</p>
<p>వలవంత సడలి నేలజీ<br />
రాడి యెన్నినాళ్లు మనుదునో!<br />
&#8230;.<br />
నీ మనోజ్ఞ కాంచన కాం<br />
చీమణి ఘంటా గళములు<br />
ఏకాంతము కరగ మ్రోయగా</p>
<p>విన నరచే బ్రదుకు దాల్చి<br />
యెడద మోత కెంత యేడ్తునో&#8217;</p></blockquote>
<p>కృష్ణశాస్త్రిగారి సహజకళా వికాసం, శిల్పం అనన్య సామాన్యమనిపించే పాట యిది.</p>
<p>&#8216;ఆకసమాలోకనముగా లోకమెల్ల వీనుగ కాలాంతమునకు కాచియుందునా&#8217; శాశ్వతమైన సత్యాన్ని ఆవిష్కరించేటప్పుడు కృష్ణశాస్త్రి కవిత ఉన్నత శిఖరాలని అందుకుంటుంది.</p>
<p>ప్రియురాలి మృదువసనాంచలముల గుసగుసలు వినటానికి కవి చెవులని దిశాంతాలదాకా లాగి వింటాడు. దరిద్ర హేమంతంలో చైత్ర శుభోత్సవ విభాత కళ్యాణం కోసం చూస్తాడు. &#8216;అన్వేషణలో ఎంత అలసట ఉందో అంత రుచి ఉంది&#8217; అంటారు కృష్ణశాస్త్రి.</p>
<blockquote><p>&#8216;ఇది ముగియబోని ఏ అర్థమెరుగరాని<br />
వేసటేలేని వెర్రి అన్వేషణమ్ము&#8217;</p></blockquote>
<p>సౌందర్యం అతిలోకమైనది. తన ఆదర్శానికి సరిపోయేది. అందుకే తనని తాను ఇలా ప్రకటించుకుంటాడు.</p>
<blockquote><p>&#8216;నా నివాసమ్ము తొలుత గంధర్వలోక<br />
మధుర సుషమా సుధాగాన మంజువాటి<br />
ఏనొక వియోగ గీతిక.&#8217;</p></blockquote>
<p>గంధర్వలోక సౌందర్యానికీ, మానవప్రేమకీ ముడిపెట్టి మానవలోకాన్ని అందంగా తీర్చి దిద్దాలనే తపన కవిలో కనిపిస్తుంది.</p>
<p>కవికి ఎంత ఏకాకితనం ఉందో అంత ఆత్రత, అంత ఆర్ద్రత ఉన్నాయి. అగ్నిపరీక్ష పూర్తయింది. తాను పరుచుకున్న మరణశయ్యపై తానే వాలి, తన చితిని తానే పేర్చుకొని ప్రవాసియైన కవి మరణిస్తాడు.</p>
<blockquote><p>&#8216;ఏను మరణించుచున్నాను &#8211; ఇటు నశించు<br />
నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు&#8217;</p></blockquote>
<p>నిండు యౌవనంలో మరణించాలన్న ఆలోచన కవికి ఎందుకు రావాలి? అని ప్రశ్నించుకొని ప్రసిద్ధ నవలారచయిత బుచ్చిబాబు ఇలా అంటున్నారు. &#8216;ఈ పద్య కావ్య సంపుటంలో &#8216;నేను&#8217; అన్నది ఒక వ్యక్తిగా కవి కాడనే అనుకుంటున్నాను. &#8216;ఏను మరణించుచున్నాను&#8217; అంటే &#8216;తను&#8217; అని కాదు. తనలాంటి వాళ్లెందరోనని. ప్రత్యేకమైన అంతరంగ జగత్తులో &#8211; శరీరానికి బంధింపబడ్డ వ్యక్తి &#8211; విముక్తుడై తన వ్యక్తిత్వాన్ని బాధతో కుంగదీసి, నలిపి, ముక్కలు చేసి ఇతరుల అంతరంగ జగత్తులో వెదజల్లి, వ్యక్తిగా తను మాయమై &#8211; ఒక శక్తిగా ఇతరులలో తన్ను చూసుకొని దాగిలి మూతలాడటం లాంటిది&#8217;</p>
<p>బుచ్చిబాబుగారు &#8216;నాకొరకు చెమ్మగిల్ల నయనమ్ము లేదు&#8217; అన్న కృష్ణశాస్త్రిగారి వాక్యం ప్రేరణగా &#8216;చివరకు మిగిలేది&#8217; నవల రాశానని చెప్పారు. &#8216;ఇంతకంటే విషాదకర గీతం ఏదుంది&#8217; అన్నారు. ఈ సమస్య బుచ్చిబాబుని బాధించింది. వ్యక్తిగతమైన విముక్తి తన నవలకి ప్రేరణ అని చెప్పుకున్నారు.</p>
<p>జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడం కూడా కాదు. ప్రేమించలేకపోవడమని బుచ్చిబాబు అభిప్రాయపడ్డారు.</p>
<blockquote><p>&#8216;నా కాష్టాల రేగుమంట<br />
మును బ్రతుకునట్ల నాదేహమును దహింపు<br />
పడదులే ఆర్పగా నొక బాష్పమేని&#8217;</p></blockquote>
<p>కృష్ణశాస్త్రి కృష్ణపక్షములోని కవికుమారుని తన బ్రతుకులాగే తన దేహాన్ని దహిస్తున్న కాష్ఠజ్వాలలలో ఎవరినీ కన్నీరు కార్చొద్దంటున్నాడు. సూఫీ తత్వంలో సత్యాన్వేషణం ఇలా ఉంది. &#8216;Probe through the surface self and discover the transcendent self to rend the veils in Sufi language perceive the truth.&#8217;</p>
<p>ఆనందాన్వేషణలో పడ్డ కవి ప్రేమని పొందలేక, ప్రేమించలేక దుఃఖంతో శరీరాన్ని బాధించి, కాల్చి హృదయాన్ని ప్రేమతో నింపుకున్నాడు. ప్రేమే సత్యం. ఇక్కడ కవి చనిపోవడమన్నది ప్రతీక. వాస్తవమేమిటంటే వేదన నుండి విముక్తిని పొందటం.</p>
<p>&#8216;టాగూర్ కలలు&#8217;, సౌందర్యాన్వేషణ, సమన్వయ ప్రయత్నం యీనాటి యువకవీరులకి ఉత్త పనికిరాని మూలుగు అయిపోయింది. కృష్ణశాస్త్రి బాధ ఉత్త ఉన్మాదంలాగు కనబడుతోంది.&#8217; అని అంటారు చలం.</p>
<p>ఈ సృష్టిలోని ఏ అణువు మన హృదయాన్ని స్పందింప జేసినా అది అనంతత్వాన్ని అన్వేషించేలా చేస్తుంది. చలం గారు ఇంకా ఇలా అంటారు.</p>
<p>&#8216;ఈ నాటికి కాకపోయినా, మీ మనోనేత్రం తెరుచుకునేనాటికైనా, ఎప్పటికో జన్మలుంటే, ఎన్ని జన్మలకో, కృష్ణశాస్త్రి ఈనాడు పడుతున్న శృంగార బాధ, సంకుచితత్వాన్ని దాటి వ్యాపించాలని పడే వేదన &#8211; మీరు మాత్రం తప్పించుకోగలరా? ఈనాటి మీ చీకటి అన్వేషణకి తోవలో వెలుగు వెయ్యాలని శాస్త్రిగారి ప్రవాసానికి అర్థం&#8217;</p>
<p>కృష్ణశాస్త్రి భావకవి. భావకవులకి భావన ప్రాణం. మానవులని బాధించే జీవిత సత్యాలని అన్వేషించడానికి కవులు భావనకి అగ్రతాంబూలం ఇచ్చారు. మెదడుకి అందని సత్యం హృదయానికి లభిస్తుందని వీరి విశ్వాసం. శాశ్వత సత్యమైన ప్రేమని, కవి తన శరీరాన్ని నలగ గొట్టడం ద్వారా తెలుసుకోగలిగాడు. &#8216;కృష్ణపక్షం&#8217; చీకటిలో ప్రయాణం ప్రారంభించి, ప్రవాసంలో సంకుచితత్వాన్ని దాటి, విశ్వవ్యాపితమైన ప్రేమని రక్షించగలిగాడు. సాధన పూర్తయింది. అదే సౌందర్యం, భావకవులు అన్వేషించే సత్యం. అది శాస్త్రానికి, తర్కానికి, వేదాంతానికి లొంగేదికాదు. అందుకే భావకవులు అంతర్దృష్టితో భావనకి పదును పెట్టుకుని సృజన సాగించారు. ఈ పరంపరలోనే కృష్ణశాస్త్రి సౌందర్య ఆరాధనలో పడ్డారు.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=12212</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>కృష్ణశాస్త్రి సాహిత్యం &#8211; సౌందర్యతత్వం</title>
		<link>http://vaakili.com/patrika/?p=11960</link>
		<comments>http://vaakili.com/patrika/?p=11960#comments</comments>
		<pubDate>Wed, 31 Aug 2016 21:32:20 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[డా. సీతారామయ్య (రామసూరి)]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=11960</guid>
		<description><![CDATA[<p>కృష్ణశాస్త్రి కవిత్వంలో దుఃఖం కొత్త తరహాలో రూపుదిద్దుకుంది. భావకవులు బాధని వరంగా భావించారు. రొమాంటిక్ కవులూ, ఫ్రెంచి కవులూ తమ తమ కవితాప్రస్థానంలో దుఃఖానికి తగిన స్థానాన్నిచ్చారు. ఆంగ్ల సాహిత్యంలో ఈ రకమైన దుఃఖాన్ని రొమాంటిక్ మెలంకలీ అంటారు. దీని తత్వం ఇలా ఉంటుంది.</p> <p>‘Longing for the unattainable ideal; and the feeling that the sensitive artistic genius is bound to be destroyed by the material crowd&#8217;</p> <p>ప్రపంచం నిర్జీవంగా కనిపించి, కృష్ణశాస్త్రి సంధ్యా సమీరాన్ని ఉద్దేశించి ఇలా అంటారు.</p> <p>‘ఓయి సంధ్యా సమీరణా, రేయి తోడ<br /> కారు చీకటి తోడ దుఃఖమ్ము కూడ<br /> పరువు పరువున నాకొరకరుగు దెంచు<br /> నీదు నునులేత రెక్కలమీద వడిగ<br /> నెత్తికొన పోవరాదె నన్నెచటి కేని<br /> నిత్య తేజోమయానంద నిలయమునకు&#8217;</p> <p>ఆదర్శ సౌందర్యం కోసం అన్వేషించే కవి దుఃఖాన్ని ఆహ్వానిస్తున్నాడు. అసలు ఈ దుఃఖం స్వభావమేమిటో పరిశీలిస్తే కాని, కవి దుఃఖించటానికి కారణం తెలీదు.</p> <p>కవి భార్య విషయంలో పాపం చేశాననే బాధతో, బాధని అనుభవించి తీరాలనే దృఢ నిశ్చయంతో జీవించి ఉన్నాడు. ఫ్రెంచి కవి బోదెలైర్ బాధ గురించి ఇలా అంటాడు. &#8216;Suffering was a new lyric theme in 19th century French Poetry&#8217;. మనిషి తను చేసిన పాపాన్ని గుర్తించి, బాధతో, కన్నీళ్లతో హృదయాన్ని పరిశుభ్రపరచుకోవాలని అంటాడు.</p> <p>బాధ కవికి అంతర్దృష్టిని ఇస్తుంది. అంతర్దృష్టి భావనని మేల్కొలుపుతుంది. అంతే కాదు, సృజనకి పదును పెడుతుంది. సత్య దర్శనానికి మార్గాలు విచ్చుకునేలా చేస్తుంది. బాధపడేవాడు లోపలికి కూడా చూసుకుంటాడు. అక్కడి అసమగ్రతనీ, అజ్ఞానాన్నీ అంధకారాన్నీ చూసి, ఇతరులతో తనకుగల సామ్యాన్ని గ్రహిస్తాడు. అణకువతో కుంగిపోతాడు. దీనివలన ప్రేమ వికసిస్తుందన్నది కృష్ణశాస్త్రి తాత్వికత. ఆయన దార్శనికత ఏమిటంటే, ప్రేమ, వేదన రెండూ లోకానికి రెండు కళ్లు. ప్రేమార్హులైన ప్రేయసీప్రియులకు దుఃఖమే [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">కృ</span>ష్ణశాస్త్రి కవిత్వంలో దుఃఖం కొత్త తరహాలో రూపుదిద్దుకుంది. భావకవులు బాధని వరంగా భావించారు. రొమాంటిక్ కవులూ, ఫ్రెంచి కవులూ తమ తమ కవితాప్రస్థానంలో దుఃఖానికి తగిన స్థానాన్నిచ్చారు. ఆంగ్ల సాహిత్యంలో ఈ రకమైన దుఃఖాన్ని రొమాంటిక్ మెలంకలీ అంటారు. దీని తత్వం ఇలా ఉంటుంది.</p>
<p>‘Longing for the unattainable ideal; and the feeling that the sensitive artistic genius is bound to be destroyed by the material crowd&#8217;</p>
<p>ప్రపంచం నిర్జీవంగా కనిపించి, కృష్ణశాస్త్రి సంధ్యా సమీరాన్ని ఉద్దేశించి ఇలా అంటారు.</p>
<blockquote><p>‘ఓయి సంధ్యా సమీరణా, రేయి తోడ<br />
కారు చీకటి తోడ దుఃఖమ్ము కూడ<br />
పరువు పరువున నాకొరకరుగు దెంచు<br />
నీదు నునులేత రెక్కలమీద వడిగ<br />
నెత్తికొన పోవరాదె నన్నెచటి కేని<br />
నిత్య తేజోమయానంద నిలయమునకు&#8217;</p></blockquote>
<p>ఆదర్శ సౌందర్యం కోసం అన్వేషించే కవి దుఃఖాన్ని ఆహ్వానిస్తున్నాడు. అసలు ఈ దుఃఖం స్వభావమేమిటో పరిశీలిస్తే కాని, కవి దుఃఖించటానికి కారణం తెలీదు.</p>
<p>కవి భార్య విషయంలో పాపం చేశాననే బాధతో, బాధని అనుభవించి తీరాలనే దృఢ నిశ్చయంతో జీవించి ఉన్నాడు. ఫ్రెంచి కవి బోదెలైర్ బాధ గురించి ఇలా అంటాడు. &#8216;Suffering was a new lyric theme in 19th century French Poetry&#8217;. మనిషి తను చేసిన పాపాన్ని గుర్తించి, బాధతో, కన్నీళ్లతో హృదయాన్ని పరిశుభ్రపరచుకోవాలని అంటాడు.</p>
<p>బాధ కవికి అంతర్దృష్టిని ఇస్తుంది. అంతర్దృష్టి భావనని మేల్కొలుపుతుంది. అంతే కాదు, సృజనకి పదును పెడుతుంది. సత్య దర్శనానికి మార్గాలు విచ్చుకునేలా చేస్తుంది. బాధపడేవాడు లోపలికి కూడా చూసుకుంటాడు. అక్కడి అసమగ్రతనీ, అజ్ఞానాన్నీ అంధకారాన్నీ చూసి, ఇతరులతో తనకుగల సామ్యాన్ని గ్రహిస్తాడు. అణకువతో కుంగిపోతాడు. దీనివలన ప్రేమ వికసిస్తుందన్నది కృష్ణశాస్త్రి తాత్వికత. ఆయన దార్శనికత ఏమిటంటే, ప్రేమ, వేదన రెండూ లోకానికి రెండు కళ్లు. ప్రేమార్హులైన ప్రేయసీప్రియులకు దుఃఖమే కిరీటమంటాడు.</p>
<p>కృష్ణశాస్త్రి విరహానిదో ప్రత్యేక తరహా. అది ప్రబంధాల విరహం లాంటిది కాదు. అక్కడ విరహానికి ఉపశమనం ఉంది. ఇక్కడ విరహాగ్నిని వృద్ధి చేయడం ఉంది. దీనివలన దుఃఖం పెరుగుతుంది. దుఃఖం ఆనందస్థాయికి చేరుకుంటుంది. &#8216;ప్రాణకాంత&#8217; ఖండికలో మలయ పవనాలనీ, హిమకణాలనీ, తేనేచినుకులనీ, తుమ్మెదలనీ, కోయిలనీ పిలిచి మరీ విరహాన్ని వృద్ధి చేసుకుంటున్నాడు కవి.</p>
<blockquote><p>&#8216;ప్రాణమునకును ప్రాణమౌ ప్రాణకాంత<br />
యెడద శోధించి యశ్రులై పడిరె యిచట&#8217;</p></blockquote>
<p>అని అనడంలో దుఃఖం పట్ల కవికి ఎంత ఆసక్తి ఉందో తెలుస్తుంది.</p>
<p>ఆంగ్లకవులలో కీట్స్ &#8216;Ode on Melancholy&#8217; అనే ఖండికలో</p>
<blockquote><p>&#8216;But when the Melancholy fit shall fall<br />
Sudden from heaven like a weeping cloud&#8217;</p></blockquote>
<p>అని రచిస్తే, కృష్ణశాస్త్రి</p>
<blockquote><p>&#8216;ఎంత బరువయ్యెనో గాని యెడద వెలికి<br />
తొలగి పారని దుఃఖాశ్రు జలమువలన<br />
ప్రావృడంభోధరస్వామి! నీవు కూడ<br />
నావలెనె జాలి వొడమ వాపోవుచుంటి&#8217;</p></blockquote>
<p>అని అంటూ, &#8216; జీవనంపు భారము తొలంగి పోవ నెవ్వారికేని కోరి నీ సొదలను చెప్పికొందువేమొ -&#8217; అని అంటారు.</p>
<p>దుఃఖం కళాకారుని మనస్సుని నిశితం చేస్తుంది. ప్రకృతితో తాదాత్మ్యం చెంది, మానవ దుఃఖాలకి శాశ్వతమైన అనుకంప కోసం వెతికే తపన కలిగిస్తుంది.</p>
<p>Keats రచించిన &#8216;Ode on Melancholy&#8217; గురించి William H. Marshall ఇలా అంటాడు.</p>
<blockquote><p>&#8216;Here the speaker, by contemplating the paradox that for man melancholy is at the heart of his brief vision of Beauty, creates the self absorbing poem, a work of art and thus a form of beauty, that will defy time, from the joylessness of his first recognition he derives joy in art and a moment of truth, at the heart of which perception he again finds his melancholy recognition of his own human impermanence.&#8217;</p></blockquote>
<p>ఆనందంలేని స్థితిలోంచి సత్య దర్శనం కోసం కళలో పొందే ఆనందం . ఇదే విషాద సుఖం.</p>
<p>కృష్ణశాస్త్రి &#8216;దుఃఖము&#8217; అనే ఖండికలో రోజంతా సూర్యుని వేడి కిరణాలకి వేగి, చీకటి పడగానే చల్లగా కనుమోడ్చిన నా హృదయకుసుమం నీకు జాలి కలిగించడం లేదా?</p>
<p>&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;..నీవేల స్వప్న<br />
మటుల లోలోన కలచి, చీకటి ముసుంగు<br />
నొత్తిగిలద్రోసి, వదలని పొత్తు గోరి<br />
తొంగి తొంగి చూచెదవయ్యో! దుఃఖమా! యొ<br />
కించుకైనను జాలి వహించవేమి? అంటారు.</p>
<p>ఆయన హృదయసుమము ఆయన ప్రియురాలు.</p>
<blockquote><p>&#8216;ఎవ్వరని యెంతురో నన్ను? ఏననంత<br />
శోకభీకర తిమిర లోకైక పతిని!<br />
నాకు నిశ్వాస తాళవృంతాలు కలవు<br />
నాకు కన్నీటి సరుల దొంతరలు కలవు<br />
నాకమూల్య మపూర్వ మానంద మొసగు<br />
నిరుపమ నితాంత దుఃఖంపు నిధులు కలవు&#8217;</p></blockquote>
<p>కవి సమాజం నుంచి వేరుపడి, దుఃఖ సామ్రాజ్యానికి తనని తాను అధిపతిగా ప్రకటించుకుంటున్నాడు. ఈ పద్యంలో paradox ఏమిటంటే , ఆనందాన్ని కలిగించే దుఃఖ నిధులు తనకి కలవని కవి చెప్పటం. ఇదే రొమాంటిక్ మెలంకలి. తనని చూసి ఎవరూ జాలిపడనవసరం లేదనీ, తనకి నిట్టూర్పుల విసనకర్రలున్నాయనీ, కన్నీటి ముత్యాల హారాలున్నాయనీ, గొప్ప విలువైన అపూర్వమైన ఆనందాన్ని కలిగించే సాటిలేని దుఃఖంపు నిధులు తనకి ఉన్నాయని కవి అంటాడు.</p>
<p>ఈ రకమైన భావంతో పద్యరచన తెలుగు సారస్వతంలో పూర్వమెపుడూ లేదు. కృష్ణశాస్త్రి మాటల్లోనే చెప్పాలంటే, &#8216; బాధంతా ఘనీభవించి దుఃఖమైపోయి బ్రతుకంతా నిండిపోయింది.&#8217; ఇది ప్రాయశ్చిత్తమని కవి గ్రహించాడు. &#8216;కంటక కిరీటధారినై&#8217;, &#8216;ఏకాంత గోష్ఠి&#8217; జరుపుతానంటాడు. &#8216;దుఃఖమే తోడునీడగా&#8217; రాత్రులు గడుపుతానంటాడు. లేకపోతే ఎడతెగని యాత్రనిట్లు సాగింపలేక యేడ్వగాలేక కృశియింతు నేనొకండ!&#8217; అని అంటాడు. మానవ హృదయం ఉన్నతమైన స్థితికి చేరుకొనే ప్రయత్నమిది.</p>
<p>ఒంటరి తనాన్ని కోరుకోవడం కూడా భావకవిత్వంలో ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. అమితమైన దుఃఖాన్ని భరించలేని కవి</p>
<blockquote><p>&#8216;మీరు మనసారగా నేడ్వనీరు నన్ను -<br />
నన్ను విడువుడు! ఒకసారి నన్ను విడిచి<br />
నంత నేకాంత యవనికాభ్యంతరమున<br />
వెక్కి వెక్కి రోదింతును &#8211; &#8216;</p></blockquote>
<p>అంటాడు. కళాకారుడు స్వతహాగా ప్రేమికుడు. అంతేకాదు, భావుకుడు కూడా. యౌవనంలో విఫల ప్రేమికుడయ్యాడు. దానికి స్వయంకృతాపరాధమే కారణమని గుర్తించాడు. అందుకే కన్నీళ్లతో హృదయాన్ని శుభ్రం చేసి, కొత్త చూపుకోసం ఆరాటపడుతున్నాడు. ఇది గుర్తించని లోకం ఆయనని హింసించింది. అందుకే చలంగారు ఇలా అంటారు.</p>
<p>&#8216;ఎవరో రాస్తున్నారు. కృష్ణశాస్త్రి కవిత్వం వెనుక చూపని. నీకూ, నీ చీమలపుట్టకీ, గింజలకోసం వెతికీ, రాసే నీ రెండంగుళాల దృష్టికీ శాస్త్రిగారి కవిత్వం వెనకచూపు. కాదు. అసలు చూపే లేదు. శాస్త్రి ఎందుకు &#8216;యేడ్వగనీరు&#8217; అంటున్నాడో చెప్పాలిట. ఎందుకు ఏడుస్తున్నాడు? నీకోసం,నాకోసం, లోకంకోసం, ఇట్లా ఇంత బాగా తనని అర్ధం చేసుకొనే విమర్శకుల కోసం.&#8217;</p>
<p>వ్యక్తిగతమైన ప్రేమానుభవం నుండి విశ్వజనీనమైన ప్రేమ కోసం పరితపించే కృష్ణశాస్త్రి హృదయాన్ని అర్థం చేసుకున్నవారిలో చలం ముఖ్యులు. బాధ అనంతమైన ప్రేమకి దారి తీస్తుంది.</p>
<p>&#8216; Pain on that scale has its harmony in great love; for by hurting love it reveals the infinity of love in all its truth and beauty&#8217; అని టాగూర్ అంటారు.</p>
<p>ఎప్పుడైతే ప్రేమ ఆఘాతానికి గురవుతుందో, ఆ బాధ ప్రేమ యొక్క అనంతత్వాన్ని విశదీకరిస్తుందని టాగూర్ అభిప్రాయపడుతున్నారు. ఆ సందర్భంలో ప్రేమలో ఉండే సత్యమూ, సౌందర్యమూ విశ్వవ్యాపితమౌతాయి.</p>
<p>విశ్వనాథ సత్యనారాయణగారిని ఎంతగానో కదిలించిన పద్యం కృష్ణశాస్త్రి రచించిన &#8216;అబ్బ&#8217;! అనేది. కవితా ప్రసంగాలు చేస్తూ బందరులో విశ్వనాథవారికి వినిపించిన పద్యమిది.</p>
<blockquote><p>&#8216;హృదయ వనజాత సుమ<br />
మృదు మనోహర దళము<br />
లదయతను ద్రుంచినారే<br />
పెంధూళి<br />
చిదిమి వెదజల్లినారే!<br />
హృదయ శోణిత ధార<br />
నెదుగు జీవిత వల్లి<br />
మొదలంట దూల్చినారే<br />
భయదాన్ని<br />
కీలలను వ్రేల్చినారే!&#8217;</p></blockquote>
<p>భావకవిత్వ జీవలక్షణం ఈ ఖండికలో ఉంది. కవి హృదయం చాలా సున్నితం. సృజనలో ఉన్నతం. ప్రేమ వంటి మృదువైన భావాలకి కాణాచి. ప్రకృతినీ, మానవ ప్రపంచాన్నీ సమన్వయం చేసే దార్శనికతకి కేంద్రం. అటువంటి హృదయం లోకనిందలకి గురయింది. దయలేని వారి క్రూరత్వానికీ, దుర్మార్గానికీ హృదయం ఛిన్నాభిన్నమైన తీరుని కృష్ణశాస్త్రి చిత్రించారు. అనుభూతికీ, భావనకీ నెలవైన హృదయ ప్రాధాన్యాన్ని వివరించిన పద్ధతి కృష్ణశాస్త్రి కవితా శిల్పానికి మచ్చుతునక.</p>
<p>దుఃఖంతో కవి హృదయం &#8216;అంతు లేని దారిలేని శోకంపు టెడారి&#8217; గా మారిపోయింది. కవికి పాడాలని ఉంది. బాధతో ఘనీభవించిన గొంతులో మాట పెగలడంలేదు. ఆ స్థితిని కృష్ణశాస్త్రి</p>
<blockquote><p>&#8216;మూగవోయిన నాగళమ్మునను గూడ<br />
నిదురవోయిన సెలయేటి రొదలు కలవు -<br />
ఐన నేమాయె &#8216;-</p></blockquote>
<p>&#8216;ఐననేమాయె&#8217; అనడంలో మించిపోయింది లేదు అనే అర్థం స్పురిస్తుంది. ఎప్పటికైనా ఆయన గళంలోని పాట, నిదరోయే సెలయేరు లోకం దాహం తీరుస్తాయన్న ఆశ కలిగిస్తున్నాయి. కృష్ణపక్షం రాస్తున్న రోజుల్లో గళం మూగవోతుందని అనడం , ఆయన జీవితంలో గొంతు మూగవోవడం చిత్రమైన పరిస్థితి. &#8216;ఐననేమాయె&#8217; అని ఆయనే అన్నట్లుగా గొంతు మూగవోయినా, ఆయన ఎన్నో మంచి పాటలు రాసి, తెలుగు కవితాప్రియుల హృదయాలని రంజింపజేశారు.</p>
<p>కృష్ణశాస్త్రి యౌవనదశలో రాసిన ఈ కావ్యాలలో ఇంత దుఃఖం ఉండటానికి కారణం ఏమిటి? యౌవనంలో ఉత్సాహం, ఉద్వేగం, ఆశ, ఆనందం, జీవితం పట్ల పరిపూర్ణ విశ్వాసం, మనోధైర్యం వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుతాయి. అయినా కృష్ణశాస్త్రి కవిత్వం బాధ, దుఃఖం, నిరాశలలో నిండి ఉంది. దీనికి కారణాలు చెబుతూ నవలా రచయిత బుచ్చిబాబు (శివరాజు వెంకటసుబ్బారావు) ఇలా అంటారు.</p>
<p>&#8216;ఆనాడు దేశానికింకా స్వరాజ్యం రాలేదు. తనకి స్వేచ్ఛ లేదు. భావ స్వాతంత్ర్యం లేదు . అనువైన ఉద్యోగం లేదు. తను ప్రేమించిన స్త్రీకి తను అక్కరలేదు; ఆదర్శమూర్తిని తనదిగా చెసుకొనే పరిస్థితి లేదు. పరిసరాలలో సౌందర్యం లేదు. సమాజంలో వైజ్ఞానిక తృష్ణ, దానితో వచ్చే నిజాయితీ లేవు. ఇవి ఆతని బాధకి కారణాలు కావచ్చు.&#8217;</p>
<p>బుచ్చిబాబు చెప్పిన కారణాలన్నీ భౌతికమైనవి. కృష్ణశాస్త్రి ప్రధానంగా రొమాంటిసిస్టు.</p>
<p>తన ప్రియురాలు లేకుండా కవి ఉండలేకపోతున్నాడు. &#8216;ఇదె వచ్చుచున్నాను&#8217; ఖండికలో కృష్ణశాస్త్రి</p>
<blockquote><p>&#8216;శూన్యలోకము దాటి శుష్కదేహము దాటి<br />
యన్యోన్య నిబిడ నిత్యాశ్లేష కాంక్షతో<br />
ఇదె&#8230;&#8217; అంటారు.</p></blockquote>
<p>లోకం కంటే, దేహం కంటే శాశ్వతమైన సత్యాన్వేషణలో అలమటిస్తున్న కవి హృదయం ప్రియురాలి హృదయంతో ఐక్యాన్ని కోరుకుంటోంది. దుఃఖంతో శరీరాన్ని నాశనం చేసి హృదయాన్ని స్ఫురింపజేయడమే కవి ఉద్దేశ్యం. అందుకే భగవంతుని ధ్యానంలో పడతాడు కవి. యౌవనంలో అహంకారంతో దైవాన్ని నిరాకరించిన కవి &#8216;ఎట్లు నిన్నూహ సేయుటో యెరుగలేక వంగి వంగి శిరము వొంచి కుంగిపోతు&#8217; నంటాడు. &#8216;మనసారా, వలపూర, కలత తీర కాన్కగా ఏమొసంగగా గలను&#8217; &#8216;గాఢ లజ్జానుతాప సంకలిత హృదయ నీరజదళాల రాలు కన్నీటిచుక్క తప్ప’ అని అంటాడు. భక్తి రవళించిన ఆత్మానుభవం దుఃఖం లక్ష్యం నెరవేర్చింది. &#8216;కన్నీరు&#8217; ఖండికలో ఇంకా ఇలా అంటాడు.</p>
<blockquote><p>&#8216;కలుష దుర్దాంత పంక సంకలిత కుహర<br />
ముల జనించు మదీయాశ్రు మలిన ధార<br />
స్వామి భవదీయ పాద దేశమున పారి<br />
పరమ పావన జాహ్నవీ ప్రతిభ గాంచు&#8217;</p></blockquote>
<p>పశ్చాత్తాపం కవిని భగవంతుని సాన్నిధ్యాన్ని కోరేలా చేస్తోంది. క్షణికమైన ఆనందాన్ని కోరి, ఎండమావుల వెంట పరుగెత్తిన కవి బ్రహ్మసమాజ భావాలలో హృదయ పరివర్తనం తెచ్చుకొని, పాత అనుభవాలకి వీడ్కోలు పలుకుతూ &#8211; &#8216;నిర్యాణము&#8217; ఖండికలో,</p>
<blockquote><p>&#8216;చల్లగా నున్నదీ సుప్రశాంత వేళ<br />
చల్లగా సాగునీ సుప్రశాంత పథము<br />
బయలు దేరుము దూరంపు బయనమునకు<br />
వలదు తడయగు, దవ్వేగ వలయునేడు&#8217;</p></blockquote>
<p>&#8216;పరమపద శాంతి పూర్ణ నిర్వాణగీతి&#8217; ఆలపిస్తున్నాడు.</p>
<p>కృష్ణశాస్త్రి దుఃఖ గీతాలలో అలౌకికమైన ప్రేమ, భావ ఔన్నత్యం ఉన్నాయి. అసలు ఈ గీతాలు కవి తన హృదయభారాన్ని దింపుకోవడానికేననిపిస్తుంది. కవికి ప్రాణమిత్రుని వంటి ప్రకృతి, సర్వాధికారి ఈశ్వరుడు ఉన్నాడు.<br />
కృష్ణశాస్త్రిగారు ఇలా అంటారు.</p>
<p>&#8216;నా ప్రేమగీతాలలో, నా శోకగీతాలలో నాకు ఈ సామాన్య లోకం లేదు. వాటిని నాకో, నాలాగే స్వచ్ఛందమైన మూర్తి యైన ప్రకృతికో ఆలపించేవాణ్ణి. పరమేశ్వరుని పాదరేణువునో ప్రార్థించేవాణ్ణి, అనుకంప కొరకు&#8217;</p>
<p>ప్రేమకు బదులు రాకపోతే హృదయం ఎంత దహించుకు పోతుందో కవి గ్రహించాడు.</p>
<p>&#8216;కృష్ణపక్షం&#8217; అని పేరు పెట్టడంలోనే ఔచిత్యం ఉంది. ఇందులో కవే కథానాయకుడు. స్వేచ్ఛకీ, ప్రేమకీ సంబంధించిన అనుభవాలతో, ఆత్మీయుల మరణంతో కవి కృష్ణపక్షంలో పడిపోయాడు. &#8216;కృష్ణ భక్తి తత్వం&#8217; ఆసరా దొరికింది. అన్వేషణకి మార్గం సుగమమైంది. రొమాంటిక్ కవితలో దుఃఖం హృదయాన్ని ఎలా క్షాళన చేస్తుందో గ్రహించాం. అదే దుఃఖం కవిని ప్రవాసిని చేసింది.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=11960</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
		</item>
	</channel>
</rss>
