<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; కడిమిచెట్టు</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?cat=375&#038;feed=rss2" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>మంచు కొండలో మొలిచిన చల్లని బంగారు తీవె</title>
		<link>http://vaakili.com/patrika/?p=7778</link>
		<comments>http://vaakili.com/patrika/?p=7778#comments</comments>
		<pubDate>Sun, 01 Mar 2015 15:51:57 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కడిమిచెట్టు]]></category>
		<category><![CDATA[మైథిలి అబ్బరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=7778</guid>
		<description><![CDATA[<p></p> <p>&#8220;అమ్మా, మీ పెళ్ళి లో నాన్న అలిగాడా?&#8221; అడిగాడు కొడుకు, కొంత వయసూ వ్యక్తతా వచ్చినవాడు&#8230; ఆ నాన్నకి కోపదారి అన్న పేరు ఉండిపోయిఉంది కనుక.</p> <p>&#8221; పెళ్ళి లో అయితే పెద్దలేదు గానీ, ఆ ముందర ఆయన అల్లరి అంతా ఇంతానా తండ్రీ &#8221; ఉత్తి పుణ్యానికి తన మేనల్లుడి మీద మండి పడిన తీరు గుర్తుకొచ్చి నొచ్చుకుంది ఆ ఇల్లాలు.</p> <p>&#8221; అయితే నిన్ను ఇష్టం లేకుండా కట్టుకున్నాడంటావా ? &#8221; చనువుగల కొడుకు అడిగేసి వెంటనే నాలుక కరుచుకున్నాడు.</p> <p>అమ్మ ఏమీ అనుకున్నట్లు లేదు, &#8221; ఏమోరా &#8221; అని ఊరుకుంది &#8230;నిష్టూరపు బిగువు లోంచి తరుముకొచ్చే మురిపెం తో.</p> <p>నాన్నా సగం నవ్వాడు, నెలవంక నాగరం మెరిసినట్లు.</p> <p>&#8221; చెప్పమ్మా , అసలేమైందో &#8221; ధైర్యం వచ్చిన అబ్బాయి రెట్టించాడు- ఆ నోటా ఆ నోటా పురాణం గా విని ఉన్నా , అచ్చమైన కథ ఏదో కావాలని, ఆత్రం తో.</p> <p>&#8221; అయినా నా తప్పూ ఉందిలే, ఎవరి మీదనో కోపం తో ఒళ్ళు మండించుకుని ఈయనకి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాను&#8230;.పాపం , పిచ్చి మా రాజు, దేశాలు పట్టాడు అలాగ. మా అన్న చక్రం అడ్డు వేశాడు గాని, ఏమయిపోవలసినవాడో అసలు &#8230;&#8221; పాతవన్నీ తవ్వుకుని కంటతడి పెట్టుకుంది.</p> <p>తిరిగి ఎక్కడ వదిలిపోతుందోనని సగం శరీరం ఇచ్చుకున్న స్వామి , ఎడమ కంటి నీటి ని కొనగోట తుడిచి అప్పటికి పెదవి విప్పాడు &#8211; &#8221; అదంతా ఎందుకు గిరిజా, ఇప్పటి సంగతులు చెప్పు &#8221;</p> <p>తల్లీకొడుకుల నడుమన మర్మం ఏనాడూ లేదు&#8230;అమ్మ చెబుతోంది- ఒకే ఒక్క క్షణం లో వాగర్థాల సంగమం ఆసాంతం సుషుమ్న వెంట ప్రవహించింది.</p> <p>సుషుప్తి తేరింది, కాని అంతా జ్ఞాపకముంది. వినాయకుని వలె ఆదిలో ఆయన అమ్మ కొడుకు, మహాకాళేశ్వర దాస్యం ఆ తర్వాతి సంగతి. ఉజ్జయని లో [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg"><img class="aligncenter size-full wp-image-4744" title="kadimi" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg" alt="" width="810" height="284" /></a></p>
<p><span style="font-size: 30px;">&#8220;అ</span>మ్మా, మీ పెళ్ళి లో నాన్న అలిగాడా?&#8221; అడిగాడు కొడుకు, కొంత వయసూ వ్యక్తతా వచ్చినవాడు&#8230; ఆ నాన్నకి కోపదారి అన్న పేరు ఉండిపోయిఉంది కనుక.</p>
<p>&#8221; పెళ్ళి లో అయితే పెద్దలేదు గానీ, ఆ ముందర ఆయన అల్లరి అంతా ఇంతానా తండ్రీ &#8221; ఉత్తి పుణ్యానికి తన మేనల్లుడి మీద మండి పడిన తీరు గుర్తుకొచ్చి నొచ్చుకుంది ఆ ఇల్లాలు.</p>
<p>&#8221; అయితే నిన్ను ఇష్టం లేకుండా కట్టుకున్నాడంటావా ? &#8221; చనువుగల కొడుకు అడిగేసి వెంటనే నాలుక కరుచుకున్నాడు.</p>
<p>అమ్మ ఏమీ అనుకున్నట్లు లేదు, &#8221; ఏమోరా &#8221; అని ఊరుకుంది &#8230;నిష్టూరపు బిగువు లోంచి తరుముకొచ్చే మురిపెం తో.</p>
<p>నాన్నా సగం నవ్వాడు, నెలవంక నాగరం మెరిసినట్లు.</p>
<p>&#8221; చెప్పమ్మా , అసలేమైందో &#8221; ధైర్యం వచ్చిన అబ్బాయి రెట్టించాడు- ఆ నోటా ఆ నోటా పురాణం గా విని ఉన్నా , అచ్చమైన కథ ఏదో కావాలని, ఆత్రం తో.</p>
<p>&#8221; అయినా నా తప్పూ ఉందిలే, ఎవరి మీదనో కోపం తో ఒళ్ళు మండించుకుని ఈయనకి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాను&#8230;.పాపం , పిచ్చి మా రాజు, దేశాలు పట్టాడు అలాగ. మా అన్న చక్రం అడ్డు వేశాడు గాని, ఏమయిపోవలసినవాడో అసలు &#8230;&#8221; పాతవన్నీ తవ్వుకుని కంటతడి పెట్టుకుంది.</p>
<p>తిరిగి ఎక్కడ వదిలిపోతుందోనని సగం శరీరం ఇచ్చుకున్న స్వామి , ఎడమ కంటి నీటి ని కొనగోట తుడిచి అప్పటికి పెదవి విప్పాడు &#8211; &#8221; అదంతా ఎందుకు గిరిజా, ఇప్పటి సంగతులు చెప్పు &#8221;</p>
<p>తల్లీకొడుకుల నడుమన మర్మం ఏనాడూ లేదు&#8230;అమ్మ చెబుతోంది- ఒకే ఒక్క క్షణం లో వాగర్థాల సంగమం ఆసాంతం సుషుమ్న వెంట ప్రవహించింది.</p>
<p>సుషుప్తి తేరింది, కాని అంతా జ్ఞాపకముంది. వినాయకుని వలె ఆదిలో ఆయన అమ్మ కొడుకు, మహాకాళేశ్వర దాస్యం ఆ తర్వాతి సంగతి. ఉజ్జయని లో బ్రాహ్మీ ముహూర్తం. ఆలయం లో ఉదయపు సేవకు గంట మ్రోగుతోంది. వెళ్ళి వచ్చారు కాళిదాసు, ఆ పూట రాజు కొలువు కు కాలు సాగలేదు. మహాసౌందర్యసృష్టికోసం నియమించబడిన ఆ పొడుగాటి దృఢమైన అంగుళులు, లోకోత్తర ప్రణయాన్ని ఆవిష్కరించబోతున్నాయి.</p>
<p>ధర్మపత్ని విద్యోత్తమ వీణా నాదం చెవులపడుతోంది, రాగం శుద్ధ ధన్యాసి ఏమో. . .అమ్మ పుట్టినింటి ప్రశంస తో కావ్య రచన ఆరంభమైంది.</p>
<p style="text-align: center;">* * *</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/02/parvati4.jpg"><img class="aligncenter size-large wp-image-7781" title="parvati4" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/02/parvati4-1024x664.jpg" alt="" width="745" height="483" /></a></p>
<p>పదిహేడు సర్గల మహాకావ్యం కుమారసంభవం. వాటిలో ఎనిమిది మటుకే కాళిదాసు రచన అని మహా వ్యాఖ్యాత మల్లినాథసూరి తో సహా చాలా మంది పండితుల విశ్వాసం. కుమారుడి జననం ఎనిమిది సర్గలూ ముగిసేసరికి ఒక సూచనగానే ఉంటుంది, ఆ బిడ్డ పరాక్రమమూ విజయమూ తర్వాతి సర్గల కథ. ఒక విధంగా చూస్తే, పార్వతీ పరమేశ్వరులు గాఢాశ్లేషం తోనే కావ్యం అంతమవటం ఉచితమని అనిపిస్తుంది- వారి దీర్ఘ ప్రణయానికి దేవతల ఆటంకమూ శివతేజం శరవణ సరస్సు రెల్లు పొదలలో శిశువై ఉద్భవించటమూ మరొక కథ గా వినటమే న్యాయం.</p>
<p>రఘువంశం లో మానవోత్తములైన మహీపతుల గురించీ, మేఘసందేశం లో అర్థదివ్యులైన యక్షుల విరహాతిశయం గురించీ చెప్పిన కవి, ఇక్కడ పూర్తిగా దేవకథ రచించారు. కానీ మనుషుల విధులను వారికి ఆపాదించి ఒప్పించారు&#8230; సగం గా ఉండిపోవటం శాశ్వతం కాదని, అతడూ ఆమే ఒక్కటి అవటం తప్పనిసరి అని &#8211; బిడ్డను కనటం అతి పవిత్రమైన అవసరమని. &#8221; ప్రజాయై గృహమేధినాం &#8221; [ రఘువంశం ] ..ఈ శ్లోకపు చివరి మాటలు ఆదిదంపతులకు కూడా, ఆ &#8216; ప్రజ &#8216; (సంతానం ) ప్రజకోసం కూడా. వేరే పేర్లు ఉన్నా, ఒట్టిగా &#8216; కుమారస్వామి &#8216; అని ప్రస్తావించటం లోనే దాంపత్యప్రశస్తి అంతా ఉందేమో.</p>
<p>వారి వారి మాతృభాషలు ఏవైనాగానీ, వందల సంవత్సరాలనుంచీ ఆసేతుశీతాచలమూ రసజ్ఞులైనవారంతా నెత్తి మీద పెట్టుకున్న మహాకవి గురించి నావంటి అత్యల్పులు కొత్తగా ఏమైనా చెప్పాలనుకోవటం అజ్ఞానం. పదలాలిత్యానికి నిధి అనిపించుకున్న కాంచీపురపు మధురకవి దండి మాటలను స్మరించుకోవచ్చు . &#8221; ఆయన రచన ఏచోటా వదులు గా ఉండదు, ఎక్కడా పటుత్వం తగ్గదు. అక్కరలేని మాటను ఒక్కదాన్ని కూడా వాడరు. ఆ వాక్కు లో కృత్రిమత్వం వెతికినా కనిపించదు. విలువ లేని ఆడంబరాన్నీ, తాత్కాలికపు ఆభరణాలనూ ఆ రచన ధరించదు. కావాలని మెరిపించే మాటల గారడీ లేదు. ఆయన శక్తి ఆ పదాల సంగీతధ్వనిలో, స్ఫుటంగా చేరవచ్చే రమ్యమైన భావాలలో. ప్రత్యేకించి ప్రయత్నించకుండానే &#8230;అద్భుతమైన పరిశీలన లోంచి, ప్రకృతిని అపారంగా ప్రేమించటం లోంచి &#8211; ఆ స్వభావోక్తులు , ఆ ఉపమలు ‘’</p>
<p>మొదటి సర్గకు &#8216; ఉమోత్పత్తి [పార్వతి ఆవిర్భావం ] &#8216; అని పేరు. ఇందులో అరవై శ్లోకాలు. నమస్కృతి తోనో, ఆశీర్వచనం తోనో, కథాంశపు ప్రస్తావన తోనో &#8211; కావ్యం ఆరంభమవాలని నియమం. ఈ కావ్యం హిమవంతుడి ప్రశంస తో మొదలవుతుంది. [ దీన్ని ఎలాగ అన్వయించాలనే విషయం లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ] &#8216; అమ్మల[ఆ+ మల అని విడదీయవచ్చు ] గన్న యమ్మ &#8216; అనబడే తల్లిని కన్న మంచుమల దేవర ఘనత అది.</p>
<p style="text-align: center;">* * *</p>
<p>దేవతా దిశ అయిన ఉత్తరాన ఆ నగాధిరాజు హిమాలయుడు నిలిచి ఉన్నాడు, తూర్పు పడమర సముద్రాలలోకి వ్యాపించి , పృథ్వికి కొలబద్దలాగా. ఆయన ‘ దేవతాత్ముడు ‘ &#8211; దివ్యమైన ఆత్మ గలవాడు, దైవిక ఘటనలు సంభవించిన ఆ ప్రదేశం రూపమైనవాడు&#8230;.అన్నిటికీ మించి పరదేవతను ఆత్మజ గా పొందగలిగినవాడు.</p>
<p>అదివరలో విష్ణుస్వరూపుడైన పృథు చక్రవర్తి , గోరూపిణి అయిన భూమిని పితికినట్లుగా, మేరువు ఈ హిమాలయుడిని వత్సం గా చేసి పృథ్విని పితికినప్పుడు- భాస్వంతమైన రత్నాలూ , మహౌషధులూ లభించి ఉన్నాయి. హిమాలయుడు &#8216; అనంత రత్న ప్రభావుడు &#8216;- వాటిలో వజ్రవైఢూర్యాది మణి రత్నాలూ, దేవదారు వంటి వంటి వృక్షరత్నాలూ, మృతసంజీవని వంటి ఓషధీరత్నాలూ, గంగ వంటి నదీరత్నాలూ, సోమలత వంటి యజ్ఞద్రవ్య రత్నాలూ ఉన్నాయి- పార్వతీ కన్యా రత్నం అక్కడ ఉద్భవించబోతూ ఉంది. ఇన్ని గుణాల నడుమన ఆ మంచుకప్పినతనం ఒక్కటీ లోపాన్ని తీసుకురాలేదు&#8230;వెలిగే కిరణాల జాలులో చంద్రుడిఆ ఒక్క మచ్చా మరుగున పడిపోదా !</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/02/parvati1.jpg"><img class="alignleft  wp-image-7783" title="parvati1" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/02/parvati1.jpg" alt="" width="384" height="254" /></a>ఆ శిఖరాలలో సూర్యాస్తామయాన్ని పోలి ప్రకాశించే ధాతునిక్షేపాలు&#8230;వాటి కాంతులు అక్కడి మేఘాల పైన ప్రతిఫలించి- అప్సరలకు అకాలసంధ్యాభ్రాంతిని కలిగిస్తాయి. వాళ్ళు విభ్రమంతో ఒక చోట పెట్టుకోవలసిన నగలను మరొకచోట పెట్టుకోబోతారు&#8230;ప్రియులను కలుసుకునే సమయం వచ్చేసిందని అనుకుని. ఆ పర్వత శిఖరాలకు వడ్డాణాలు గా అమరిన మేఘాల ఛాయలలో సిద్ధులు ఎండ నుంచి సేదదీరుతారు, ఆ మేఘాలే కురవబోతూ ఉంటే శిఖరాల మీదికి , ఎండ లో చలి కాచుకునేందుకు, &#8211; ఎక్కి వెళ్ళుతారు&#8230; మేఘాల కన్న అంత ఎత్తున ఆ పర్వతశ్రేణులు ఉన్నాయని అర్థం. ..ఇంకా, శీత ఆతపాలు రెంటినుంచీ ఆశ్రితులకు ఉపశమనాన్ని ఇవ్వగలవి హిమాలయాలు అని కూడా.</p>
<p>వయసు మీరిన ఏనుగుల చర్మం పైన లేత ఎరుపు రంగులో మచ్చలు వ్యాపిస్తాయి, అదే రంగులోని భూర్జవృక్షాల బెరడు మీద విద్యాధర భామినులు మరికాస్త ఎర్రని ధాతువులను సిరాగావాడి ప్రేమలేఖలు రాసుకుంటారట. [ విక్రమోర్వశీయం లో ఊర్వశి ఇలాగే రాస్తుంది. ]ఆ పర్వత గుహలలోంచి వెలువడే సమీరాలు వెదురుపొదల రంధ్రాలలో నిండి ఉచ్ఛస్థాయిలో గానం చేస్తున్నాయి [ ఉద్గాస్యతాం అన్నారు కవి. ఈ ఉచ్ఛస్థాయి ని చెప్పటం అమానుషుల కంఠం లో గాని పలకని గాంధార గ్రామాన్ని సూచిస్తుంది , ఇంకా , యజ్ఞసమయంలో సామవేద మంత్రాలను ఉచ్ఛస్వరం లో గానం చేసేవారిని ఉద్గాత అని పిలుస్తారు ] &#8230;చూడబోతే కిన్నరుల సంగీతానికి వేణునాదం తో వాద్యసహకారం అందించేందుకు హిమాలయుడు సిద్ధమైనట్లుంది.</p>
<p>మదించిన ఏనుగులు తమ కపోలాలను సరల వృక్షాలకేసి రాపిడి పెట్టినప్పుడు స్రవించే ద్రవం తో పర్వతమంతా పరిమళభరితమవుతూ ఉంది. రాత్రివేళలలో , ఇళ్ళంత భద్రంగా ఉండే కొండ గుహలలో- తమంతట తామే వెలిగే ఓషధులు , అరణ్యవాసుల ఏకాంతానికి నూనె లేని దీపాలై తోడవుతున్నాయి. సూర్యుడికి భయపడే చీకటికి తన గుహలలో ఆశ్రయమిస్తున్నాడు హిమాలయుడు. ఉదాత్తులు, తమను శరణు జొచ్చినవారిని, వారెటువంటివారైనా- తమవారివలె కాపాడుతారు కదా .</p>
<p>కదిలే తెల్లని వెన్నెల కిరణాల లాగా చమరీమృగాలు తమ తోకలను ఊపుతున్నాయి, గిరి రాజు అన్న పేరును నిలిపేందుకు చామరాలై వీస్తున్నాయి. భాగీరథీ శీకరాలతో [నీటి తుంపరలతో ]తడిసిన గాలి తెరలు దేవదారు వృక్షాలమీదినుంచి వీస్తుంటే నెమళ్ళు అది వర్షమనుకుని పింఛాలు విప్పుతున్నాయి&#8230;వేటాడుతూ అలిసిపోయిన కిరాతులకు హాయినిస్తున్నాయి.</p>
<p>ఆ శిఖరాలమీది సరస్సులలో విచ్చుకునే పద్మాల పైనా, పూజార్థమై సప్తర్షులు సేకరించిన పద్మాల పైనా, సూర్యకిరణాలు కిందినుంచి పైకి ప్రసరిస్తున్నాయి.[ ఇది కేవలం అధిభౌతికమైన వర్ణన. హిమాలయుడు అంత ఉన్నతుడని చెప్పేందుకు...పార్వతి జన్మించబోయే ప్రదేశం ఖచ్చితంగా సూర్యబింబానికి పైనే ఉంటుందని. తపస్సుకు పరమశివుడే దిగిపోయాడు , సూర్యుడు ఎంతవాడు.. ] అక్కడి యజ్ఞద్రవ్యాల సమృద్ధినీ భూమిని పోషించగల[ హిమాలయుడి ] సామర్థ్యాన్నీ గమనించిన బ్రహ్మ దేవుడు యజ్ఞ హవిస్సులలో హిమాలయుడికి భాగాన్ని ఏర్పాటు చేశాడు. తన అర్హత వలన పొందగలిగిన దేవతాత్వంగా దీనిని అర్థం చేసుకోవచ్చు .</p>
<p>మేరువుకు సఖుడైన ఆ స్థితిమంతుడు హిమాలయుడు- పితృదేవతల మానస పుత్రికను, మేన అన్న కన్యను , మహనీయులతో కొనియాడబడినదానిని, గృహస్థాశ్రమ నిర్వహణ కోసం- శాస్త్రోక్తంగా వివాహమాడాడు. [ మేన కు తోబుట్టువైన ధారిణిని మేరువు పెళ్ళాడాడు ] ఆ దంపతులు తమ యౌవనానికీ సౌందర్యానికీ తగిన రీతిలో ఆనందంగా ఉన్నారు. వారికి తల్లి పేరిట మైనాకుడనే పుత్రుడు జన్మించి, నాగకన్యను పరిణమయమాడాడు. ఆదిలో తమకు ఉండిన రెక్కలతో ఇచ్ఛావిహారం చేస్తూ మనుషులను ఇబ్బంది పెట్టిన పర్వతాల రెక్కలను ఇంద్రుడు వజ్రాయుధం తో ఖండించినప్పుడు, మైనాకుడికి ఏ నొప్పీ కలగలేదు, ఏ గాటూ పడలేదు&#8230;అంత శక్తిమంతుడు [ సనాతనధర్మం లో సోదరుడు ఉన్న కన్య వివాహ యోగ్యురాలు, బహుశా అందుకు ఈ అన్నగారి విషయం ] .సముద్రం అడుగున నివసించేవాడు, హనుమంతుడు లంక వైపుకు లంఘిస్తున్నప్పుడు ఆతిథ్యం ఇవ్వబోయినవాడు- ఈ మైనాకుడే.</p>
<blockquote><p>&#8221; అథవమేన పితుః ప్రయుక్తా దక్షస్య కన్యా భవపూర్వపత్నీ<br />
సతీ సతీ యోగ విసృష్టదేహా తం జన్మనే శైలవధూం ప్రపేదే &#8221;</p></blockquote>
<p>తండ్రి చేత అవమానితయై యోగంతో దేహాన్ని విసర్జించిన దాక్షాయణి- సతీదేవి, పతివ్రత, భవుని పూర్వభార్య-తన ద్వారా జన్మించగల స్థితిని- అప్పుడు- శైలవధువైన మేన చేరుకున్నది.ఆవిడ పుణ్యం అప్పటికి పండిందన్నమాట.</p>
<blockquote><p>&#8221; సా భూధరాణమధిపేన తస్యాం సమాధిమత్యాముదపాది భవ్యా<br />
సమ్యక్ప్రయోగ పరిక్షతాయాం నీతావివోత్సాహ గుణేన సంపత్ &#8221;</p></blockquote>
<p>నియమనిష్ఠాగరిష్ఠ యైన మేన యందు, సత్సంతానాన్ని పొందేందుకు ప్రతిజ్ఞ చేసిఉన్నాడు హిమాలయుడు. సక్రమంగా సంపూర్ణంగా చేసిన ప్రయత్నం సంపదను ప్రసాదించినట్లుగా ఆయన భవ్యను పుత్రికగా పొందగలిగినవాడైనాడు.</p>
<p>మొదటి శ్లోకం లో శివుడిని భవుడనీ ఇక్కడ అమ్మవారిని భవ్య అనీ అంటున్నారు కవి- ఆ పదాలకు శుభం కలిగించేవారని అర్థం. వారి దాంపత్యం లోకాలకు శుభం కూర్చబోతూ ఉంది.మొదటి శ్లోకం లో తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని ప్రస్తావించటం యాదృచ్ఛికం కాదు- ఈ హిమాలయుడు అటువంటివాడు కాదు, అమ్మవారికి తగిన తండ్రి అని.</p>
<p>[ ప్రభుశక్తి, మంత్రశక్తి, ఉత్సాహ శక్తి అని చెప్పబడిన మువ్విధాల శక్తులలో ఉత్సాహ గుణాన్ని ప్రత్యేకించి పేర్కొన్నారు. ఉత్సాహశక్తిని విక్రమబలమనీ అంటారట. హిమాలయుడి సత్కామననూ సత్ప్రయత్నాన్నీ నొక్కి చెప్పదలచారు కవి. ]</p>
<p>ఆ చిట్టి పాప పుట్టిన దినాన &#8211; దిక్కులు ప్రసన్నంగా ఉన్నాయి, దుమ్మూ ధూళీ రేపని చల్లటి గాలి వీచింది, శంఖనాదాలు వినబడి ఆ తర్వాత పూలవర్షం కురిసింది. కదిలే వాటికీ కదలని వాటికీ [ జంగమస్థావర శరీరాలకు ] ప్రాణానికి సుఖమైంది. ఇక్కడ నాలుగు జ్ఞానేంద్రియాలకు ఆహ్లాదాన్ని చెబుతున్నారు- నిర్మలమైన దిజ్మండలం నేత్రపర్వం, శీతలవాయువులు త్వగింద్రియానికి సౌఖ్యం. శంఖనాదం శ్రవణానందం, పుష్పవృష్టి ఘ్రాణతర్పణం.</p>
<p>ఆ శిశువు శిరస్సు చుట్టూ ప్రభామండలం స్పష్టంగా కనిపించింది. సావిత్రి అయిన [ జన్మను ఇచ్చిన ] మేన ఆ బిడ్డతో కలిసి వెలిగిపోయింది&#8230;క్రొక్కారు మబ్బులు ఉరిమినప్పుడు బయటపడే రత్నశలాకలతో విదూర పర్వత భూములు వెలిగినట్లుగా. [ వై[ ?దూ] ఢూర్యాలు విదూర పర్వతాలలో అలా ఉత్పన్నమవుతాయని అంటారట]<br />
నెలపొడుపు [ చంద్రమాసీవ లేఖ ] వలె ఉదయించిన ఆమె ఒక్కొక్కకళా ఇముడ్చుకొనే వెన్నెల లాగా రోజు రోజుకూ కాంతి మంతమవుతూ వికసించింది. ఆ తండ్రి కూతురిగా దగ్గరివారు పార్వతీ అని పిలిచేవారు. ఆమె ఎదిగి తపస్సు చేయబూనినప్పుడు తల్లి &#8221; అమ్మా, వద్దు [ఉ , మా] అని వారించినప్పటినుంచీ ఉమ ఆమె కు అసలు పేరయింది&#8230;తన మరొక సగం కోసం తపించినప్పటినుంచీ తాను పూర్తిగా తానయింది. తక్కిన కొడుకులూ కూతుళ్ళూ ఉన్నా, ఆ తండ్రికి ఆమెను ఎంత సేపు చూసినా తనివి తీరేది కాదు&#8230;. ఎన్నిపూవుల మధువు ఉన్నా మావిపూత లోని మకరందం వైపుకే తుమ్మెద మరలినట్లుగా. [ బిడ్డలను చూడటం వేరు, బిడ్డగా దిగివచ్చిన దేవిని చూసుకోవటం వేరు...బహుశా ఇటువంటి పక్షపాతమే దశరథుడికి శ్రీరామచంద్రుడి పట్ల ఉండినది- అది సహజానురాగాన్ని మోక్షాభిముఖత్వం తో హెచ్చవేస్తే వచ్చిన ఫలితం. ]</p>
<p>మహత్వపూర్ణమైన ప్రభాశిఖ వలన ఒక దీపం లాగా, త్రిపథగామిని అయిన గంగాప్రవాహం వలన స్వర్గపు రహదారిలాగా , సంస్కృతమైన వాక్కు వలన ఒక పండితునిలాగా &#8211; పార్వతి వలన తండ్రి పవిత్రుడైనాడు, విభూషితుడైనాడు. అమ్మవారు వాగర్థాలలో వాక్కు , విభూతి అన్నమాట ధ్వనించటమూ ఉద్దేశపూర్వకమే కాబోలు.</p>
<p>ఆమె బాల్యక్రీడలలో బంతి ఆటఆడేది, ఇసుక గూళ్ళు కట్టేది, వాటిపైన కొడుకులతో కూతుళ్ళతో [ కృత్రిమపుత్రకులు- ఆటబొమ్మలు ] ఆడి వినోదించేది . దేవీలీలావిలాసాన్ని చెప్పే ఈ మాటలు శివపురాణం లో ఇంచుమించు ఇలాగే ఉంటాయి&#8230;అయితే ఇక్కడిలాగా కాక అక్కడ ఆమె తాను త్రిమూర్త్యాత్మకమైనదానినని ఆటలో భాగం గా చెలులతో అంటుంది . కాళిదాసు గ్రహించిన ఆధారాలలో శివపురాణం ముఖ్యమైనది.</p>
<p>శరత్కాలం వస్తూనే మానససరోవరం నుంచి గంగానది వైపుకు ఎగిరే హంసల బారు వలె ఆమె పూర్వజన్మలో నేర్చిన విద్యలు ఉపదేశించబడుతూనే ఆమెను వచ్చి చేరాయి&#8230;రాత్రి అవుతూనే మహోషధులు వాటి స్వయందీప్తితో ప్రకాశించినట్లుగా. బాల్యం గడిచిన ఆ వయస్సులో &#8230; అలంకరించే అవసరం లేని పలుచనైన దేహంతో, చూసేవారి కనులకి మధువు తాగనప్పటి మత్తత అయింది, అయిదు పుష్పబాణాలు గల మన్మథుడికి పుష్పం కాని అస్త్రం అయింది. [ అనాసవాఖ్యం కరణం మదస్య, కామాస్యపుష్పవ్యతిరిక్తమస్త్రం ... మన్మథుడి బాణాలకు అందని వాడు ఆమెను నిలవరించలేదు, అమ్మవారి వేయి పేర్లలో మధుమతి ఒకటి. ]</p>
<p>[ చిత్రకారుడి] తూలికతో ఉన్మీలితమవుతూ ఉన్న చిత్తరువులాగా, సూర్యకిరణాలకు క్రమక్రమంగా విచ్చుకునే అరవిందంలాగా..యౌవనం తెస్తూ ఉన్న సౌష్ఠవం తో సమవిభక్తమైన ఆమె శరీరం శోభించింది. [ కాళిదాసుకు చిత్రకళ మీద గౌరవం- శకుంతలను ' చిత్రే నివేశయ పరికల్పిత సర్వయోగా అనిపిస్తారు ] ఆమె పాదాలను నేలపైన మోపినప్పుడు ఆ కాలివేళ్ళ కాంతి చుట్టూ చిందిపోయింది, ఆ ఎర్రని చరణాలు కదిలితే భూమిమీద విరబూసిన అరవిందాలు మెదిలిపోయాయి.<br />
ఆమె అందెల సవ్వడిని అనుకరించి కూసే విద్యను నేర్చేందుకు ప్రతిగా హంసలు తమ నడకల బెడగును ఆమెకు అర్పించాయా ? ఆ ఘనజఘనానికి ప్రస్తుతి ఒకటే- అనంతరకాలం లో అనితరవనితా సాధ్యమైన శివుని అంకపీ ఠాన్ని ఆమె అధిష్టించింది . ఆ యజ్ఞ రూప సన్నని నడుము యజ్ఞ వేదిక [వేదీ విలగ్న మధ్య ] . మన్మథుడి అస్త్రాలు సున్నితమైన పూవులు, అంతకన్న మృదువై నవి అవునా ఆ బాహువులు.. అతనిని గెలిచిన శివునికి కంఠపాశం [ మెడకు తాడు ] కాగలిగాయి?</p>
<p>ఆ కంఠసీమ కు ముత్యాలసరాలు అందం తెచ్చాయా, వాటికే ఆ వక్షం అందాన్ని ఇచ్చిందా&#8230;భూషణాభూష్య భావం అక్కడ<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/02/parvati3.jpg"><img class="alignright size-full wp-image-7785" title="parvati3" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/02/parvati3.jpg" alt="" width="319" height="482" /></a> సాధారణమైపోయింది. చంద్రబింబం లో ఉంటే పద్మాలగుగుణాలనూ, పద్మాలలో నివసిస్తే చంద్రుడి గుణాలనూ ఆస్వాదించటం వీలు కాక చంచల అయిన సౌందర్యలక్ష్మి ఆమె ముఖం లో ప్రవేశించాక మరి అటూ ఇటూ కదలనక్కరలేక పోయింది&#8230;ఆ సొగసూ సోయగమూ రెండూ అక్కడే ఉన్నాయని. . ఎర్రని చివురాకుల నడుమ తెల్లని పూవు పూసినట్లు, గుప్పెడు పగడాల మధ్యన ఒక ముత్యం మిలమిలమన్నట్లు- సాటిలేని ఆ పాటలాధరాల పైన చిరునగవు విరుస్తుంది.ఆమె గొంతు పలికినప్పుడు వడకట్టిన అమృతం కురుస్తుంది, ఆమీదట కోయిల పాట చెవులబడినా అది శృతితప్పిన తంత్రి మ్రోగినట్లే ఉంటుంది. సూర్య చంద్రులు ధగధగమనే చెవి కమ్మలై [ తాటంకాలై ] ఆమెను సేవించారు .[తాటంక యుగళీభూత తపనోడువ మండలా అని ఈ వర్ణన లలితాసహస్రం లో యథాతథంగా ఉంది ] గాలి తెరలలో ఊగే నీలోత్పలాలు ఆ చూపులు&#8230;లేడి కనులను ఆమె తెచ్చుకుందో, ఆమె కనులనే లేడి అరువు తెచ్చుకుందో –ఏమో ! సృష్టికర్త నల్లని అంజనం లో ముంచిన కుంచెతో దిద్దినట్లున్నాయి వంగిఉన్న కనుబొమ్మలు, ఇక మన్మథుడు తన పూలవింటి ని స్మరించి గర్వపడనే లేడు ! చమరీమృగాలకు ఏ మాత్రం లజ్జ ఉన్నా ఆ పృథుశిరోజరాశిముందు తలలు వంచవలసిందే !</p>
<p>ఇన్ని మాటలు అక్కర లేదు, [ అందాన్ని] వివరించగల పోలికలను[ సర్వోపమద్రవ్యసముచ్చయం ] అన్నిటినీ ఒకే చోట పొందికగా అమర్చుకుని చూసే కోరిక బ్రహ్మకు కలిగిన ఫలితం ఆమె, ఆ మహా లావణ్య శేవధి.</p>
<p>కామచారియైన నారదముని హిమాలయుడి సమక్షానికి వచ్చినప్పుడు- పక్కనే ఉన్న ఈమెను చూసి- శివుడి పత్ని[హరస్యశరీరార్థహర- హరుని అర్థశరీరాన్ని హరించగలది అని ] కాగలదని ప్రేమగా జోస్యం చెప్పాడు. అందుకని మరి వేరే వరుడిని వెతికే పనిని తండ్రి పెట్టుకోలేదు, ఆమెకు యుక్తమైన వయసు వచ్చినా. మంత్రపూతమైన హవిస్సును అగ్నికి అర్పించాలి, అన్యమైన తేజస్సుకు కాదు. కానీ శివుడు తన సుతకొరకై యాచించలేదు, ఆ దేవదేవుడిని అడిగే చొరవ ఈ తండ్రికి లేదు &#8211; నారదముని నోటిమాట వృధా అయేందుకూ లేదు&#8230;మధ్యేమార్గం పూని మౌని అయినాడు పర్వతరాజు.</p>
<p>ఆ సుదతి దాక్షాయణి గా యోగదగ్ధ అయినప్పటినుంచీ , ఆయన, ఆ పశూనాంపతి- విముక్తసంగుడూ అపరిగ్రహుడూ [వివాహబంధం వీడినవాడూ దాన్ని తిరిగి కోరనివాడూ ] అయిఉండిపోయాడు. చర్మధారియై తపస్సుకోసం ఒక హిమపర్వతశృంగానికే వచ్చాడు- గంగాప్రవాహం తడిపే దేవదారు వనానికి&#8230;అక్కడంతా వ్యాపించిన కస్తూరి సౌరభం , తీయని ఉపశమనం ఇస్తూ కిన్నరుల సంగీతం. ప్రమథగణాలు &#8211; సురపున్నాగ హారాలు మెడలలో వేసుకొని, భూర్జవృక్షాల బెరళ్ళను వస్త్రాలుగా ధరించి, ఆ కొండల లోని మురా ద్రవ్యాన్ని శరీరాలకు అలదుకొని- అక్కడే , పశుపతి పిలిస్తే పలికేందుకని- విడిది చేశారు. అప్పుడు ఆ అరణ్యాలలో సిం హాలగర్జనకు దర్పంగా ఎదురు పలికాయి నందీశ్వరుడి రంకెలు..తక్కిన జంతువులు అన్నీ భయభక్తులతో చూస్తున్నాయి.</p>
<p>అందరి తపస్సులకూ ఫలమయిన ఆ శివుడి మనస్సులో ఏముందో , ఆ తపమది దేనికోసం అనో ఏమో- ఎనిమిది రూపాలుగల ఆయన ఆ పర్వతశిఖరం పైన, తన వేరొక రూపాన్ని తానే అగ్నిహోత్రియై ఉపాసిస్తున్నాడు.</p>
<p>అనంతరం అమ్మ చేయబోయే తపస్సు ఆయన కోసమని తెలుసు, ఆయన చేసే తపసూ ఆవిడకేనేమో.</p>
<p>ఆ అనర్ఘ్యుడికి అర్ఘ్యాన్ని ఇచ్చేందుకు హిమాలయుడు కుమార్తెను , ప్రయతను[ పరిశుద్ధురాలిని ] , సఖీసమేతంగా నియమించాడు. అర్ఘ్యం అన్న మాట అన్ని పూజాద్రవ్యాలనూ సూచించినా, ప్రధానంగా నీటి ని అర్పించటాన్నే సూచిస్తుంది- ఆ రగిలే బైరాగికి కావలసినదెపుడూ నీరే. స్త్రీసామీప్యం సమాధి నిష్ఠను భగ్నం చేయగలది అయినా, శివుడు ఆమె ను పరిచారికగా అంగీకరించాడు- వికారం కలిగించగలవి చెంతనే ఉన్నా వికృతి పొందనివారే ధీరులు ! ! !</p>
<p>సుందరమైన కేశాలు గల ఆ పార్వతి దక్షతతో ఆయనకు పరిచర్య సాగించింది- అర్పించవలసిన పుష్పాలను కోసి పెడుతూ, యజ్ఞవేదిని సిద్ధం చేస్తూ, దర్భలను సేకరించి ఇస్తూ, నీటికడవలు మోసి తెస్తూ&#8230;అలిసిపోయేది, ఆయన జటలలోంచి తొంగిచూసే నెలవంక వెన్నెలలకు సేదదీరేది.</p>
<p><em><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/mithili2.gif"><img class="alignleft  wp-image-4547" title="mithili2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/mithili2.gif" alt="" width="115" height="119" /></a>[ References-</em><br />
<em> 1. Mahakavi kalidasa virachita kumarasambhavam [ The Advent of Kumara ] by Desiraju Hanumanta Rao</em><br />
<em> 2. Kumarasambhava [ cantos1-5 ] with commentary by S. D. Gaiendragadkar</em><br />
<em> 3. Kumarasambhava of Kalidasa by M.R.Kale ]</em></p>
<p style="text-align: center;">**** (*) ****</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=7778</wfw:commentRss>
		<slash:comments>18</slash:comments>
		</item>
		<item>
		<title>ఉత్తరసీతాచరితం- హృదయాహ్లాదిని కుందమాల</title>
		<link>http://vaakili.com/patrika/?p=7364</link>
		<comments>http://vaakili.com/patrika/?p=7364#comments</comments>
		<pubDate>Wed, 31 Dec 2014 23:06:05 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కడిమిచెట్టు]]></category>
		<category><![CDATA[మైథిలి అబ్బరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=7364</guid>
		<description><![CDATA[<p></p> <p>ఈ మల్లెపూలదండ చల్లటి ఉపశమనాన్ని ఇస్తుంది- ఆ ప్రేమికులతోబాటు, వారి విరహం దహించే మన మనసులకి కూడా&#8230; తాత్కాలికంగా కాదు, ఎప్పటికీ. దయలేని మనుషుల వలన పడిన అన్ని ఇడుములూ ఈ ముగింపులో విచ్చిపోతాయి. అమ్మా నాన్నా కలుసుకోవటమే &#8211; కుశలవులకి లాగే మనకీ , రాజ్యాభిషేకం.</p> <p>ఉత్తరకాండ చివరలో సీత విరక్త అయి తల్లి దగ్గరికి వెళ్ళిపోవటం, ఎంత కాదనుకున్నా , విషాదాంతమే- మనుష్యలోకపు కథగా చదువుతున్నప్పుడు . మానవాతీతమైన భాష్యాలు ఎన్ని వెతకబోయినా, ఆ మర్యాదా పురుషోత్తముడి చరిత్ర పురుషార్థాని కి కూడా సంబంధించినది కాదా?</p> <p>అసలు వాల్మీకి రచన యుద్ధకాండ వరకేననీ, తర్వాతి కథ చాలా కాలం తర్వా త చేర్చబడిందనీ బలమైన వాదనలు ఉన్నాయి. అవి ఎంత తీవ్రమైనవంటే- సీతారాముల ఆ యాతన &#8211; ఆత్మ హింస ను సమర్థించే జైనానికీ సంసార విసర్జనను బోధించే బౌద్ధానికీ అనుగుణంగా, ఆ మతాలు ప్రారంభమైన అనంతరం సీతారాములని అలాగ యాతన పెడుతూ ఉత్తరకాండను చేర్చారని అనే వారున్నారు. జీసస్ క్రైస్ట్ మానవుల కోసం శిలువ మీద మరణించినట్లు శ్రీరాముడు ప్రజల కోసం భార్యను వదిలి జీవన్మృతుడవటాన్ని &#8211; క్రైస్తవం ప్రవేశించిన తర్వాత రామాయణం లో ప్రక్షిప్తం చేశారనీ ఉంది. కొందరు శ్రీ వైష్ణవుల ఇళ్ళలో రామాయణ పారాయణమంటే కేవలం బాలకాండను పఠించటం.ఆనంద స్వరూపుడైన పరమాత్ముని అవతారాన్ని కల్యాణాంతంగా మాత్రమే వారు గ్రహిస్తారు. భారతీయ కావ్యశాస్త్రాల దృష్టితో చూస్తే శోకం తో ఏ కృతీ ముగియదు. ఇతిహాసమైన మహాభారతం శాంత రసం లో పర్యవసిస్తుంది. శ్రీరామ పట్టాభిషేకం తో కాక మరొకలాగా రామాయణం అంతమవటం, [ కేవలం ] కావ్యగతబుద్ధులైనవారికి , కనీసం &#8211; కొంగున కట్టుకున్న నిప్పు. ఆ నిష్కారుణ్యాన్ని భరించలేక రాముడిని దూరం పెట్టుకున్నవారున్నారు.</p> <p>ఏది సత్యం, ఏది అవాల్మీకం అన్న విచికిత్సను పక్కన ఉంచితే- ఆ కథ అలాగ సౌఖ్యంగా పరిణమించటాన్ని తమ హృదయం లో [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg"><img class="aligncenter size-full wp-image-4744" title="kadimi" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg" alt="" width="810" height="284" /></a></p>
<p><span style="font-size: 30px;">ఈ</span> మల్లెపూలదండ చల్లటి ఉపశమనాన్ని ఇస్తుంది- ఆ ప్రేమికులతోబాటు, వారి విరహం దహించే మన మనసులకి కూడా&#8230; తాత్కాలికంగా కాదు, ఎప్పటికీ. దయలేని మనుషుల వలన పడిన అన్ని ఇడుములూ ఈ ముగింపులో విచ్చిపోతాయి. అమ్మా నాన్నా కలుసుకోవటమే &#8211; కుశలవులకి లాగే మనకీ , రాజ్యాభిషేకం.</p>
<p>ఉత్తరకాండ చివరలో సీత విరక్త అయి తల్లి దగ్గరికి వెళ్ళిపోవటం, ఎంత కాదనుకున్నా , విషాదాంతమే- మనుష్యలోకపు కథగా చదువుతున్నప్పుడు . మానవాతీతమైన భాష్యాలు ఎన్ని వెతకబోయినా, ఆ మర్యాదా పురుషోత్తముడి చరిత్ర పురుషార్థాని కి కూడా సంబంధించినది కాదా?</p>
<p>అసలు వాల్మీకి రచన యుద్ధకాండ వరకేననీ, తర్వాతి కథ చాలా కాలం తర్వా త చేర్చబడిందనీ బలమైన వాదనలు ఉన్నాయి. అవి ఎంత తీవ్రమైనవంటే- సీతారాముల ఆ యాతన &#8211; ఆత్మ హింస ను సమర్థించే జైనానికీ సంసార విసర్జనను బోధించే బౌద్ధానికీ అనుగుణంగా, ఆ మతాలు ప్రారంభమైన అనంతరం సీతారాములని అలాగ యాతన పెడుతూ ఉత్తరకాండను చేర్చారని అనే వారున్నారు. జీసస్ క్రైస్ట్ మానవుల కోసం శిలువ మీద మరణించినట్లు శ్రీరాముడు ప్రజల కోసం భార్యను వదిలి జీవన్మృతుడవటాన్ని &#8211; క్రైస్తవం ప్రవేశించిన తర్వాత రామాయణం లో ప్రక్షిప్తం చేశారనీ ఉంది. కొందరు శ్రీ వైష్ణవుల ఇళ్ళలో రామాయణ పారాయణమంటే కేవలం బాలకాండను పఠించటం.ఆనంద స్వరూపుడైన పరమాత్ముని అవతారాన్ని కల్యాణాంతంగా మాత్రమే వారు గ్రహిస్తారు. భారతీయ కావ్యశాస్త్రాల దృష్టితో చూస్తే శోకం తో ఏ కృతీ ముగియదు. ఇతిహాసమైన మహాభారతం శాంత రసం లో పర్యవసిస్తుంది. శ్రీరామ పట్టాభిషేకం తో కాక మరొకలాగా రామాయణం అంతమవటం, [ కేవలం ] కావ్యగతబుద్ధులైనవారికి , కనీసం &#8211; కొంగున కట్టుకున్న నిప్పు. ఆ నిష్కారుణ్యాన్ని భరించలేక రాముడిని దూరం పెట్టుకున్నవారున్నారు.</p>
<p>ఏది సత్యం, ఏది అవాల్మీకం అన్న విచికిత్సను పక్కన ఉంచితే- ఆ కథ అలాగ సౌఖ్యంగా పరిణమించటాన్ని తమ హృదయం లో దర్శించి నాటకాన్ని సృజించిన కవులు ఇద్దరు. ఒకరు ప్రసిడ్ఢులైన భవభూతి. ఆ ఉత్తరరామచరితం కరుణరసప్రధానమయి కూడా సుఖాంతమైన నాటకం. అక్కడ రాముడు భగవంతుడు, ఆయన చర్య అనివార్యం .అందులోని సీతారాముల అనురాగాన్నీ అవిభాజ్యతనూ భారతీయులంతా ఎప్పటికీ స్మరించుకుంటారు.</p>
<p>అయితే అటువంటి ముగింపును మొదట ఊహించినది భవభూతి కారు. ప్రసిద్ధిలో రెండవవారైనా ఆ కల్పనను తొలుత అక్షరాలలో పెట్టినది దిజ్ఞాగుడు. ఆయన కురిపించిన కరుణ అందరిమీదా&#8230;తుడిచిన కన్నీరు మనందరిదీ. ఆయన సృజించిన సీత &#8211; భర్త పైన ఆరాధన తోబాటు అనురక్తి కలిగిన ఇల్లాలు.’ సీత &#8211; [కుందమాల ] ‘ అన్న అపురూపమైనవ్యాసం రాసిన విశ్వనాథ -&#8221;…. ఆమె రామచంద్రుని యందు శృంగార ప్రవృత్తి తప్ప మఱొకండెఱుగదు &#8221; అంటారు. ఆమె బెంబేలు పడనిది, తన మీద తనకు ప్రత్యయం చెడనిది. వేదన పడదని కాదు, దానిని భరించుకోగలిగినది. అన్నింటి కన్నా మించి- తామిద్దరూ తప్పక కలుసుకుంటారనే ఆశా విశ్వాసమూ అంతరాంతరాలలో ఉన్నది. ఆ ఎడబాటు ఎంత మాత్రమూ సహజంగా ఉండదు, కనుక అంతరించవలసినదే- ఆమెకి. తన పాతివ్రత్యాన్ని తిరిగి ప్రకటించుకొమ్మంటే అలిగి భూమిలోకి వెళ్ళిపోదు, ఆమెకు రాముడితో కలిసి ఉండటం పరమావధి.</p>
<p>కుశలవులు ఎంతమాత్రమూ ఉద్ధతులు కారు, తండ్రి అని తెలియకపోయినా, మహారాజుతో యుద్ధమాడరు , వారు సీత పుత్రులు.</p>
<p>రాముడు అవతారపురుషుడని నాందీ శ్లోకాలలో చెప్పి ఉన్నా, నాటకంలో ఆయనను మానవాతీతుడుగా చిత్రించరు. తన ప్రాధాన్యాలను నిర్వచించుకోలేని మహారాజు ఆయన ఇక్కడ. తన కాఠిన్యానికి తానే నలిగిపోయే జీవుడు.<br />
ఉత్తరరామచరితం లో రాముడు ప్రధానం. కుందమాలలో సీత ప్రధానం .</p>
<p>ఈ దిజ్ఞాగుడు కాళిదాసుకు సమకాలికుడనే ఆధారం మేఘసందేశం [పూర్వ మేఘం- పధ్నాలుగవ శ్లోకం ] లో ఉందని పండితులు చెబుతారు. ఆ శ్లోకం ఇది -</p>
<p style="text-align: center;"><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/slokam.jpg"><img class="aligncenter  wp-image-7365" title="slokam" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/slokam-1024x128.jpg" alt="" width="477" height="59" /></a></p>
<p>&#8220;ఓ మేఘమా, నువు ఈ పర్వతం మీదినుంచి కదులుతుంటే &#8211; పవనుడు పర్వతశిఖరాన్ని పెకలించి తీసుకుపోతున్నాడా అని సిద్ధ స్త్రీలు చకితలై, ముఖాలు పైకెత్తి అమాయకంగా చూస్తారు. దానితో ఉత్సాహంవస్తుంది నీకు . సరస నిచుళాలున్న (తడిసిన నేల ప్రబ్బలి చెట్లున్న) ఈ చోటినుంచి నువు ఉత్తరం వైపుకి వెళ్ళే దారిలో &#8211; దిగ్గజాల లావుపాటి తొండాల విదిలింపులను తప్పించుకొని ఎగిరిపో&#8221;</p>
<p>దీనిలో దాగి ఉన్న అర్థం- &#8220;సరస నిచుళుడి (రసికుడైననిచుళుడు, కాళిదాసుకు సఖుడు) నివాసం నువు వెళ్ళేదారిలో ఉంది. అతన్ని దర్శించు. అక్కడ దిజ్ఞా గుడనే మహాపండితుడు, కాళిదాసుకు ప్రత్యర్థి, ఉన్నాడు- అతని లావుపాటి చేతి [హస్తం అన్న మాటకు తొండం, చేయి అని రెండు అర్థాలూ ఉన్నాయి ] విదిలింపులను [ నువు కాళిదాసుకు దగ్గర కనుక నిన్నూ ఆక్షేపిస్తాడు ] తప్పించుకు వెళ్ళు&#8221; ఈ విషయాన్ని కాళిదాస వ్యాఖ్యాత మల్లినాథసూరి ధృవపరిచారట.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/kundamala2.jpg"><img class="alignleft  wp-image-7371" title="kundamala2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/kundamala2.jpg" alt="" width="419" height="600" /></a>కాళిదాస శాకుంతలం లో బాలుడైన భరతుని చేతి నుంచి కిందపడిన రక్షను తల్లిదండ్రులు కాక మరెవరు తాకినా అది పామయి కాటువేస్తుందని అన్నట్లే , కుందమాలలో అయోధ్యాసిం హాసనం మీద రఘువంశీయులు కానివారెవరు కూర్చున్నా వారి తల వ్రక్కలవుతుందని చెప్పబడుతుంది . ఇది ఒక పోలిక, కాళిదాసు రచన తో . అధవా దిజ్ఞాగుని పద్ధతి ఎక్కువ సూటిగా ఉంటుంది. భవభూతి లాగా దీర్ఘమైన వర్ణనలు కూడా ఆయన చేయరు, కథానుగుణమైనవి , అదీ క్లుప్తంగానే తప్ప. అన్వయం సులువుగా ఉంటుంది. ఇలాగ సరళంగా రచించినంత మాత్రాన తక్కిన ప్రసిద్ధ నాటక కర్తల ముందు తేలిపోరు. ఆ పాత్రలు ఎంతో సజీవంగా ఉంటాయి , ఆ ఉదాత్తత అతి సహజంగా ఉంటుంది. కథనం ఎత్తు మీదే నడిచినా, పాఠకులకు చాలా దగ్గరగా వస్తుంది . దిజ్ఞాగుని వాక్కు ఎంత స్పష్టంగా, నిండుగా- ఉంటుందంటే, ఈ నాటకం లోని కొన్ని శ్లోకాలు, కొన్ని శ్లోకాల పాదాలు- సుభాషితాలుగా నిలిచి ఉన్నాయి. ఆయన శైలి ప్రసన్నమూ గంభీరమూ అని అనువదించిన బులుసు వెంకటేశ్వర్లు గారు అంటారు. గొప్ప మాట అది.</p>
<p>తాను కాంచీపురం సమీపం లోని సిం హ వక్త్రపురానికి [అరారాలపురం ] చెందినవాడినని చెప్పుకున్నారు. భదంత ధీరనాగుడన్న నామాంతరం గల దిజ్ఞాగుడు బౌద్ధ పండితుడనే ధృఢమైన నమ్మకం ఉంది. ఎన్నో బౌద్ధ గ్రంథాల కర్త కూడా. తార్కిక చక్రవర్తి . బౌద్ధుడయి రామకథను ఎందుకు రచించారు ? ప్రారంభం లో గణేశ, జటాజూట- స్తుతులు ఎందుకు చేశారు ? ఈ ప్రశ్నలకు పెద్దలు చెప్పే సమాధానాలు ఇలా ఉన్నాయి &#8211; ఈయన కొంతకాలం పిమ్మట బౌద్ధం వదిలి వేదధర్మం లోకి వచ్చిఉంటారు. లేదా, మొదట హీనయాన బౌద్ధుడు, ఆ తర్వాత మహాయానం లోకి వచ్చారు. [ రెండవ సంప్రదాయం శ్రీరాముడిని బుద్ధుని అవతారంగా స్వీకరించింది ] కుమారదాసు అనే బౌద్ధపండితుడు జానకీహరణం అనే కావ్యాన్ని రచించి ఉండటాన్ని దృష్టాంతంగా చూపుతారు. ఇక్కడ విశ్వనాథ తన వ్యాసం లో అన్న మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు.</p>
<p>&#8220;దిజ్ఞాగుని గురించి యొక్కమాట. బౌద్ధులు పూర్వము మన దేశమునందు విజృంభించిరి. నేటి సర్వసమత్వమతమువలె నాడు బౌద్ధమతము కూడ మన ధర్మములను కుళ్ళగించినది. కాని బౌద్ధులు మన వేదాంతములు తలక్రిందులు చేయుటకు బ్రయత్నించిరిగాని సారస్వతము జోలికి రాలేదు. దీనికి మహాతార్కికుడై సనాతనధర్మమునకు గొప్ప ప్రత్యర్థియైన దిజ్ఞాగుని &#8216; కుందమాల &#8216; సాక్షి. ఎన్ని బౌద్ధమతసూత్రములున్నను, తేజోవంతములైన నాటకములను- రసపర్యవసాయులై ,,మనవారు గూడ దిరస్కరించలేదు. ఇందుకు &#8216; నాగానందము &#8216; నిదర్శనము. మతమేదియైనను జాతికి రసబుద్ధి పోలేదు. నేటికి దేశమున రసబుద్ధి యొత్తిగిలినది&#8221;</p>
<p>ఏ కారణం చేతనో, చాలాకాలం మరుగున పడిన ఈ రసవంతమైన నాటకాన్ని మానవల్లి రామకృష్ణకవి గారు పరిష్కరించి ప్రచురించారు. తెలుగు లోకి నాలుగు అనువాదాలు వచ్చాయి. ఆ నలుగురు అనువాదకులు- కాలక్రమంలో వడ్డాది సుబ్బరాయకవి గారు, గట్టి లక్ష్మీనరసిం హ శాస్త్రి గారు, బులుసు వెంకటేశ్వర్లు గారు , వేదం వెంకటకృష్ణశర్మగారు.</p>
<p>నాటకపు నాందిలో లో చేసిన జటాజూట స్తుతి లో శివజటాజూటాన్ని- పరిపక్వమై, జ్వాలలాగా పైగి ఎగసి ఉపశమించిన తపోధనుని తపస్సు గానూ , గంగానది మీదినుంచి వీచే గాలితెరలతోనూ పన్నగాలతోనూ విలసిల్లే వల్మీకంగానూ , చల్లని చక్కని చంద్రుడి నిత్యమైన ఉదయంగానూ, బాలసూర్యుడి ని పోలిన అరుణకాంతి నివాసంగానూ, పోల్చి చెబుతారు. కథ అంతా ఈ వర్ణనలో ధ్వనిస్తుంది. తీవ్రమైన ధర్మాచరణా తపస్సు, భగ్గున ఎగసే వియోగ జ్వాల- దాని ఉపశమనం- గంగాతీరంలో , వాల్మీకాశ్రమం లో. ఆపైన సూర్యచద్రుల లాగా వెలిగే బాలకుల ఆగమనం &#8211; అంతా స్ఫురిస్తుంది. ఈ నాటకమంతా శివేచ్ఛకు నమస్కరిస్తుంది.</p>
<p>ప్రారంభం లో, లక్ష్మణుడు సీతను అడవిలో దిగవిడిచే ఘట్టం లో- గంగాతరంగ శీకర వాయువుల స్పర్శను సీత కన్నతల్లి చేయి తాకినట్లుందని అనుకుంటుంది. నాటకం అంతా ఇంచుమించుగా , వీలైనప్పుడల్లా , ఉపశాంతి మీదే నడుస్తుంది &#8211; కష్టాన్ని మాత్రమేనొక్కి చెప్పకుండా.</p>
<p>రాముడు సీతను పరిత్యజించిన మాట చెప్పలేని లక్ష్మణుడు &#8220;సరస్వతీదేవి నా నోరు కట్టి వేసింది&#8221; అంటాడు. ఆ వార్త అంత అపశబ్ద భూయిష్టం అన్నమాట. తెలుసుకున్న సీత అంటుంది, స్పృహ కోల్పోతూ &#8211; &#8220;దశరథ మహారాజా ! నువ్వు ఇప్పుడు మరణించినట్లయింది&#8221; అంటుంది &#8211; [ఆయనే ఉంటే పెద్దవాడుగా రాముడిని వారించి ఉండేవాడు కదా, ఈ అధర్మకృత్యం ఆయన స్మృతికి అపచారం కదా ! దశరథుడు తీసుకోలేని ఆ బాధ్యతను ఆయన స్నేహితుడైన వాల్మీకి తీసుకున్నట్లు చివరలో వస్తుంది.]</p>
<p>ఆయనకేమైనా చెబుతావా అని లక్ష్మణుడు మళ్ళీ మళ్ళీ అడిగితే, ముందు అంటుంది-</p>
<p>&#8220;ఆ నిష్ఠురుడికి నా సందేశం , లక్ష్మణుడి బలవంతం చేత ఇస్తున్నాను అంతే- దురదృష్టవంతురాలిని, నా గురించి వ్యధపడుతూ శరీరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ధర్మాన్ని అతిక్రమించవద్దు, పరిపాలనను ఆటంకపరచుకోవద్దు&#8221;&#8230;అంటూనే, తనకు తెలియని నిష్ఠూరమేమైనా తన మాటలలో ధ్వనించిందా అన్న అనుమానం తో &#8211; &#8220;నేను జనపాలుడినేమైనా [రాముడు అనదు, ఆర్యపుత్రుడనదు, రాజు అంటోంది ] నిందించానా?&#8221; అని లక్ష్మణుడిని అడుగుతుంది.</p>
<p>&#8220;అమ్మా, నీకు ఆమాత్రం అధికారం ఉంది&#8221; అని మాత్రం అంటాడు లక్ష్మణుడు.[ కి మేతావత్యపిన ప్రభవతి దేవీ]</p>
<p>అప్పటి సీత మాటలు దిజ్ఞాగుడు కాక మరి ఎవరూ రాయలేదు.</p>
<p>&#8220;ఏవమపి మమ వచనా ద్విజ్ఞాపయితవ్యః సా తపోవనవాసినీ సర్వధా సీమంత నిహితే నాంజలినా యద్యహం నిర్గుణా చిరపరిచితేపివా అనాథేతి వా సీతేతి వా స్మరణ మాత్రకేణానుగృహీత వ్యేతి&#8221;</p>
<p>[ ఇవి నా మాటలుగా విన్నవించు. ఆ తపోవనవాసిని పాపిటలో దోసిలి ఉంచి నమస్కరిస్తూ చెప్పుకుంటోంది. తాను నిర్గుణ అయినప్పటికీ [ గుణం లేనిదని, గుణాతీత అని కూడా ] , చిరపరిచితను అని అయినా, అనాథను అని అయినా&#8230;కనీసం సీతని అని అయినా తలచుకొమ్మను. ఆ మాత్రపు అనుగ్రహం నా పైన చూపవచ్చును ]</p>
<p>సీతారాముల మధ్యన ఉన్న బంధానికి గుణాలతో సంబంధం లేదు. ఇదే భావాన్ని రాముడితో అయిదో అంకం లో కవి పలికిస్తారు</p>
<p>&#8220;ఇక నేను ఉండనుగా, ఆయన బాగోగులు నువ్వొక్కడివే చూసుకోవాలి&#8221; &#8211; సీతాలక్ష్మణులిద్దరికీ రాముడి క్షేమం గురించే ఆలోచన.</p>
<p>దిక్పాలకులకూ అరణ్యానికీ పర్వతాలకూ గంగానదికీ ఆమెను అప్పగించి- &#8220;ఈ ఘోరం చేసేందుకేనా, ఆంజనేయుడు నన్ను ఆ మూర్ఛనుంచి తేర్చి బ్రతికించినది?&#8221; అని వాపోతూ నిష్క్రమిస్తాడు లక్ష్మణుడు.</p>
<p>వాల్మీకి సీతను రక్షించి తీసుకువెళుతూ &#8220;ఉత్తములైన పుత్రులను కంటావు, భర్తను మళ్ళీ కలుసుకుంటావు&#8221; అని వాల్మీకి దీవిస్తాడు. మొదటి దీవెన వాల్మీకమే, రెండవది దిజ్ఞాగం.</p>
<p>&#8220;నేను సుఖంగా ప్రసవిస్తే నీకు రోజూ ఒక కుందమాలను అల్లి సమర్పించుకుంటాను&#8221; అని గంగకు మొక్కుకుంటుంది సీత. ఇటువంటి మొక్కునే వాల్మీకి రామాయణం లో వనవాసానికి రామలక్ష్మణులతో గంగ దాటి వెళ్ళే సీత మొక్కుతుంది. తాము క్షేమంగా తిరిగివస్తే నైవేద్యం పెడతానని.</p>
<p>ఆ తర్వాత వచ్చే ప్రవేశికలో కుశలవుల జననం చెప్పబడుతుంది. వారిద్దరూ &#8216;రామశ్యాములు&#8217; [ రామునివలె నల్లనివారు ]. లేడిపిల్లతో పరుగులుపెడుతూ, సిం హపు పిల్లలతో ఉట్టుట్టి యుద్ధాలు చేస్తూ, మునిపత్నుల ముద్దులు కుడుస్తూ పెద్దవారవుతున్నారు. వాల్మీకి వారికి రామాయణ గానం నేర్పుతున్నాడు. నైమిశారణ్యంలో శ్రీ రామచద్రుడు యజ్ఞం చేయ తలపెట్టాడు. ఋషులందరినీ భార్యలతో కలిసి రమ్మని ఆహ్వానం.[ ఇలా ' సపత్నీకులై ' ఋషులను రమ్మన్నారనటం లో ఆయనా ఆ యజ్ఞ సంకల్పఫలంగా సపత్నీకుడు కాబోయే సూచన ఉంది ] వాల్మీకి మహర్షికీ పిలుపు వచ్చింది.</p>
<p>రెండవ అంకం లో సీత సాలవృక్షం కింద ఒంటరిగా కూర్చొని ఆలోచనామగ్న అయిఉంటుంది.</p>
<p>ఆమె అనుకుంటూ ఉంది &#8220;పార్వతీపరమేశ్వరుల పక్కనే సీతారాములనూ శాశ్వత ప్రేమాసక్తులుగా చెప్పి ఉన్నారే..ఇదేమిటి, ఇలా అయింది ! ఏ తప్పూ చేయకుండానే ఆయనకు ఇంత దూరంగా ఉన్నాను&#8230;.ఎన్నాళ్ళు ఇలాగ ? ఒకరికి ఇద్దరుయోగ్యులైన కుమారులు జన్మించారు, వాల్మీకి మహర్షి కన్నబిడ్డ లాగా ఆదరిస్తున్నారు, చాలదా ? ఈ తపోవనంలో నేను ఇలా [విరహిణినై ]నిట్టూరుస్తూ కూర్చోకూడదు.కాని నావల్ల అవటం లేదు. అయోధ్యాప్రజల నుంచి అమితమైన గౌరవాన్ని పొందీ అపనిందనూ భరించవలసి వచ్చింది. పోనీ ప్రాణత్యాగం చేస్తే&#8230;అది మంచిదేనా ? నా అవమానం నిలిచిపోదా ? ప్రియసఖి వేదవతి తో మాట్లాడనేలేదు&#8221;</p>
<p>కొంతకాలం పాటు ఎక్కడికో వెళ్ళి ఉన్న వేదవతి వస్తుంది.</p>
<p>&#8220;సీత..ఎంత చిక్కిపోయింది..ఎలా పాలిపోయింది&#8230;&#8221; అని బాధ పడుతూ సమీపించి<br />
&#8220;కుశలవులకు కుశలమే కదా ?&#8221; అని అడుగుతుంది.</p>
<p>&#8220;వనవాసోచితంగా&#8221; అని అర్థోక్తిలో ఆగుతుంది సీత. అడవుల పాలైన రాజకుమారులు ఎలా ఉంటారో అలాగే ఉన్నారని.[ కుశలం అంటే దర్భలను సేకరించే సామర్థ్యం అని ప్రత్యేకమైన అర్థం కూడా ఉంది ]</p>
<p>&#8220;మరి నువ్వు ? ఎలా ఉన్నావు ?&#8221;</p>
<p>సీత తన జడ చూపుతుంది. &#8220;ఇది ఎలా ఉంది?&#8221; అని అడుగుతుంది. మారీచాశ్రమం లో శకుంతల లాగా ఆమె ఘృతైకవేణి. ఆ ఒంటిజడ దీర్ఘవిరహానికి చిహ్నం.<br />
వేదవతి నొచ్చుకుని , &#8220;నీ మీద అపేక్ష లేని ఆ నిరనుక్రోశుడికోసం అమావాస్య ముందరి చంద్రలేఖలాగా క్షీణించిపోతావెందుకు?&#8221; అని అడుగుతుంది.</p>
<p>సీత- &#8220;ఆయన నిరనుక్రోశుడా?&#8221;<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/kundamala3.jpg"><img class="alignright size-full wp-image-7372" title="kundamala3" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/kundamala3.jpg" alt="" width="345" height="550" /></a></p>
<p>&#8220;నిన్ను పరిత్యజించలేదా మరి ?&#8221;</p>
<p>&#8221; నేను పరిత్యక్తనా ? &#8221;</p>
<p>&#8221; కాదా ? &#8221;</p>
<p>&#8221; శరీరంతో అవునేమో, హృదయం తో కాదు &#8221;</p>
<p>&#8221; అతని పరకీయమైన హృదయం నీకెలా తెలుసు ?&#8221;</p>
<p>&#8221; ఆయన హృదయం నాకు పరాయిదేమిటి ? &#8221;</p>
<p>&#8221; ఏమి విడని అనురాగం ! &#8221;</p>
<p>&#8221; ఆయనది మాత్రం వీడిన అనురాగమా ? నాకోసమే కదా, సముద్రం మీద సేతువు నిర్మించాడు ?&#8221;</p>
<p>&#8221; పిచ్చిదానా, అది క్షత్రియధర్మంగా చేసిన పని &#8221;</p>
<p>&#8221; ఇంకొక విషయం ఉంది చూడు &#8221;</p>
<p>&#8221; ఏమిటి ? &#8221;</p>
<p>&#8221; నన్ను గాక వేరెవరినీ ఎప్పటికి వక్షానికి హత్తుకోడు కదా …</p>
<p>ఎప్పటికైనా కుశలవుల తండ్రి నాకు కనిపిస్తారా ? &#8221;</p>
<p style="text-align: center;">***</p>
<p>యజ్ఞనిమిత్తమై వాల్మీకాశ్రమం ఉన్న నైమిశారణ్యానికి రాముడు రానేవస్తాడు. ఆ అడవిలో అడుగుపెడుతూనే సీతను త్యజించిన శోకం హెచ్చవుతుంది. వెళ్ళవలసిన దారి వదిలి వికలుడయి సంచరిస్తుంటాడు. సీతకు చెప్పినట్లే లక్ష్మణుడు ఇప్పుడు అన్నగారికీ గంగాతరంగ శీతల స్పర్శను అనుభవించమని చెబుతాడు. నది మీదినుంచి వీచే గాలి ఆయనకీ అదే సాంత్వన ఇస్తుంది. మల్లెపూలమాల ఒకటి అలలమీద తేలుతూ వచ్చి రాముడి పాదాలకు చుట్టుకుంటుంది. ఒక్కసారిగా ఒళ్ళు జలదరిస్తుంది. ఆ అల్లిక పరిచయమైనదిలాగా ఉందని లక్ష్మణుడితో అంటాడు. లక్ష్మణుడికి మాత్రం సీత ధ్యాస లేకుండా ఉందా ? అయినా, &#8221; ఎవరిది ? &#8221; అని అడుగుతాడు.</p>
<p>&#8221; ఇంకెవరిది ? &#8221; అని మాత్రం అనగలుగుతాడు రాముడు.</p>
<p>&#8221; అయితే ఈ నది నడకను అనుసరించి వెనక్కువెళదామా ? &#8221;</p>
<p>&#8221; ఈ సృష్టిలో పోలికలు ఉంటూనే ఉంటాయి&#8230;మనకంత అదృష్టమెక్కడిది ? ఇక్కడెక్కడుంటుంది సీత ? అయినా అలాగే&#8230;ఈ మాల చాలా ప్రీతికరంగా ఉన్నా, గంగాదేవికి అర్పించినది కదా, వదిలివేస్తాను &#8221;[ దేవతాప్రసాదంగా స్వీకరించకూడదా ? వదిలివేయటం ఎంత సులువో, ఎంతగా ధర్మభ్రాంతిని ఇస్తుందో- ఆయనకి…]</p>
<p>నడుస్తూ ఉండగా నది ఒడ్డున ఇసుకలో స్త్రీ పాద చిహ్నాలు. లక్ష్మణుడికి అనుమానం వస్తుంది. సీతాదేవి పాదాలు కదా, బాగా తెలిసినవి. రాముడూ గుర్తు పడతాడు.</p>
<p>అటువైపునుంచి సీత పూలు కోసేందుకు వస్తుంది. రామలక్ష్మణులు వెంబడించిన అడుగుజాడలు ఆగిపోతాయి. రాముడికి దుఃఖం వస్తుంది. బాధగా &#8221; వత్సా ! &#8221; అంటాడు లక్ష్మణుడిని. సీతకి వినిపిస్తుంది. ఉలిక్కిపడుతుంది. శరీరం పులకరిస్తుంది. మరొకరి కంఠధ్వని తనను వివశను చేయదు &#8230;అటువైపు చూడకుండా ఉండగలిగేందుకు ప్రయత్నిస్తుంది- ఓడిపోతుంది. పొదమాటునుంచి చూసి &#8221; కనులపండుగయినందుకు గాఢమైన సంతోషం&#8230;ఇంతకాలపు ఎడబాటుకి గొప్ప దుఃఖం&#8230;ఆయన చిక్కిపోయాడని ఉద్వేగం&#8230;.నిర్దయుడు కదా , నాకెందుకు అని గట్టి పట్టుదల&#8230;చిరపరిచితుడని అంతులేని అనురాగం&#8230; చూడగగినవాడని, సౌందర్యవంతుడని ఉత్కంఠ&#8230;భర్త అని గౌరవం&#8230;కుశలవుల తండ్రి అని , నా కుటుంబపు యజమాని అని మన్నన&#8230;..నా మీద పడ్డ అపవాదుకు లజ్జ&#8230;.ఈయనను చూసి నాకేమి అనిపిస్తోందో నాకే తెలియటం లేదు కదా &#8221; అనుకుంటుంది. ఇన్నిటిలో పట్టుదల, లజ్జ మాత్రమే అస్వాదుభావనలు&#8230;తక్కినవన్నీ కలిపి ఆమె ప్రేమ తీవ్రత. .. ఆమె దిజ్ఞాగుని సీత.</p>
<p>రాముడికి దండకారణ్యం లోని వనవాసం జ్ఞాపకం వస్తుంది. అందులో తలచుకోవలసినది ఏమున్నదని లక్ష్మణుడు అంటాడు. &#8221; ఏముందని అంటావేమిటి ? ఎన్ని లేవు !! సుకుమారమైన ఆమె చేయిపట్టుకొని , ఇష్టంగా మాట్లాడుకుంటూ, సాయంకాలాలు నది ఒడ్డున తిరిగినది గుర్తొస్తోంది. మా పాదాల ఒత్తిడికి ఇసుకలోంచి నీరు ఊరుతుండేది అప్పుడు &#8221;&#8230;ఆశ పడుతున్నాడు రాముడు, ఈ విరహం లోనుంచీ రాగం రారాదా అని.‘’ నన్ను చేపట్టి ఆమె ఏమి సుఖపడింది ? ముందు వనవాసం, ఆపైన అశోకవనవాసం, ఇప్పుడు ఈ ప్రవాసం &#8230;జానకీ, ఎక్కడున్నావు ? &#8221; &#8211; అక్రోశిస్తాడు రాముడు. ఆయన బాధ చూడలేక &#8221; ఇక్కడే ఉన్నాను &#8221; అంటుంది సీత, అగుపడదామనుకుంటుంది, ఊహూ, వద్దని నిష్క్రమిస్తుంది. వాల్మీకి మహర్షి తపోప్రభావం తో ఆ నదీతీరంలో [స్నానం కోసం రాగల ] స్త్రీలెవరూ పురుషులకి కనిపించకుండా , మాటలు వినిపించకుండా ఉండేట్లు చేసిఉంటాడు. అందువలన- సీత , పరిసరాలలోనే ఉన్నా, కనిపించని రామలక్ష్మణులు ఆశ్రమానికి చేరుతారు.</p>
<p>రామాయణ గానాన్ని వినేందుకు వచ్చిన అప్సర, తిలోత్తమ- సీతను రాముడు గుర్తుంచుకున్నాడో లేదో పరీక్షించుదామని సీత రూపాన్ని ధరించాలనుకుంటుంది. ఒక మునికన్యతో ఆమాటలు అంటూ ఉండగారాముడి విదూషకుడు వింటాడు .విన్నాడని తెలిసి తిలోత్తమ ఆ ప్రయత్నాన్ని విరమిస్తుంది</p>
<p>చలిగా అనిపించి- సీత , వనవాసకాలం లో వనదేవత మాయావతి ఇచ్చి ఉన్న ఉత్తరీయాన్ని ధరిస్తుంది. అది వెన్నెలలాగా తెల్లనైన, సుగంధభరితమైన దివ్యోత్తరీయం . సీతారాములిద్దరికీ దానితో అనుబంధం ఉంది. అక్కడే ఉన్న ఆయనను కలుసుకోలేక వేదన పడు తూ రాజహంసల జంటను తిలకించి తృప్తి పడుతూ ఉంటుంది . ఆ హంసమిథునం ఎడబాటు ఎరగదు .రాముడూ ఆ కొలను దగ్గరకే వస్తాడు. సీత నీడ ను గుర్తిస్తాడు. నీడ కు వాల్మీకి కల్పించిన మాయ వర్తించదు. &#8221; ఇదేమిటి, నన్ను పలకరించదు, బింబం లేని ప్రతిబింబం ఎలా సాధ్యం ? &#8221; అని ఆశ్చర్యం తో ఆ నీడనే పట్టుకోబోతాడు రాముడు. తను ఆయనకు కనిపించటం లేదని అప్పటికి అర్థమవుతుంది ఆమెకి. నీడ కనబడకుండా దూరంగా వెళుతుంది. నీడ కూడా మాయమయిన అఘాతం తో రాముడు మూర్ఛ పోతాడు. సీత ప్రాణం కొట్టుకుపోతుంది. ఎవరేమైనా అనుకోనిమ్మని , ఆయనే తెప్పరిల్లి ఆజ్ఞమీరినందుకు నిందిస్తే నిందించనిమ్మని&#8230;వెళ్ళి కౌగలించుకుంటుంది. వెంటనే ఆయనకు స్పృహ వస్తుంది. దేహమంతా గగుర్పొడుస్తుంది. విడివడిన ఆమెను వెళ్ళిపోకు, ప్రసన్నవు కమ్మని వేడుకుంటాడు.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/kundamala1.png"><img class="alignleft size-full wp-image-7404" title="kundamala1" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/kundamala1.png" alt="" width="210" height="282" /></a>ఆమె అంటుంది &#8221; నేనెప్పుడూ ప్రసన్ననే, నీ ప్రసన్నతే నాకు కావలసినది &#8221; అని. ఆమె కనిపించనట్లే మాటలూ వినిపించవు. గుండె అవిసి మళ్ళీ ఆయన మూర్ఛ పోతాడు. ఆమె ఉత్తరీయం తో విసురుతుంది, తిరిగి లేస్తూ, ఆ చెంగు ఆయన పట్టుకుంటాడు. సందేహం లేదు, ఆమెదే. ఎక్కడ ఆమె ? కనబడదు. కళ్ళలో నీటి వల్ల చూపు మసకబారిందేమోనని ఉత్తరీయం తో ఆయన కళ్ళు తుడుచుకుంటాడు. &#8221; పరకీయను, నా ఉత్తరీయం తో నువ్వు అలా చేయరాదు కద &#8221; అని ఆమె ఉత్తరీయాన్ని వదిలివేస్తుంది. పూర్తిగా దాన్ని ధరించి, ఆమెను దగ్గరగా తీసుకున్నట్లే తృప్తి పడి , రెండు ఉత్తరీయాలు ధరించి ఉంటే చూసినవారేమనుకుంటారోనని, గాలిలోకి ఎగరవేస్తాడు. ఆమె మహాప్రసాదంగా అందుకుంటుంది.</p>
<p>జనం ఏమనుకుంటారోననే నిరంతరమైన అనుమానం రాముడిలో ఇక్కడా పనిచేస్తున్నట్లే. ఎందుకో తెలియకపోయినా సీత ను గుర్తు చే స్తూ ఉన్న ఆ ఉత్తరీయాన్ని ఆయన దాచుకోవచ్చు కదా. సీత ప్రేమావేశానికి మాత్రం ఏదీ అడ్డురాదు. గాలిలోకి ఎగిరిన ఉత్తరీయం మాయమవటాన్ని రాముడు చూసి అది ఏదో సిద్ధుల మాయ అనీ ఆమెను ఎవరో దాస్తున్నారనీ అనుకుంటాడు.</p>
<p>&#8221; కనిపించు, సీతా ! గడిచిన రోజులు గుర్తు లేవా నీకు ? అప్పుడు అరణ్యంలో పుష్పాలు కోసి ఉత్తరీయపు చెంగులో నింపుకుంటున్నావు. నేను ఇలాగే దాన్ని లాగాను, పూలు నేలరాలాయి, జ్ఞాపకం లేదూ ? &#8221;<br />
ఇక్కడ సీత స్పందించిన తీరులో ఆమె ప్రణయినీత్వం పూర్తిగా ఉట్టిపడుతుంది. ఆ ఉత్తరీయం ద్వారా మళ్ళీ దగ్గరైన ఆయన స్పర్శ అందుకు ప్రేరేపించిందనుకోవచ్చు. ఏమైనా- ఆ దుర్భర వియోగం లేనట్లే, ఆయన చేసినదేదో అల్పపు దోషమైనట్లే, ఆ దూరం అదొక నెయ్యపుకినుక గానే ఆమెకి అనిపిస్తుంది.<br />
నవ్వుతూ అంటుంది -&#8221; సాహసికుడా, అందుకే కదా నాకు దూరమైనావు &#8221;</p>
<p>ఈమె దిజ్ఞాగుని సీత.</p>
<p>అప్పుడు అక్కడికి రాముడి చెలికాడు, విదూషకుడు కౌశికుడు వస్తాడు. తిలోత్తమ సీత రూపం లో రాముడికి కనిపించాలనుకుంటోందని విన్నానని చెబుతాడు. తిలోత్తమ నిజానికి , ఇతను విన్నాడనే అందుకు పూనుకోదు. జరిగినదంతా ఆ మాయ అవునా అని అనుమానం వస్తుంది రాముడికి.</p>
<p>&#8221; హృదయానికి ఆహ్లాదం ఇచ్చే మల్లె దండను సీత అల్లినట్లే తిలోత్తమ అల్లిఉండవచ్చు. ఇసుకలో సీత పాద చిహ్నాలనూ కల్పించి ఉండవచ్చు. నీటిలో నీడనూ చూపించి ఉండవచ్చు. కాని, తృప్తాత్మ అయిన సీతలాగా అలా నాకు వీచగలదా ? ‘’ . లేదనే ఆయన తలపు. తెగని ఆయన ఆలోచనను గమనించి , కౌశికుడు అడుగుతాడు &#8211; &#8221; సీతను తలచుకుంటున్నావా ? &#8221;</p>
<p>&#8221; అవును &#8221;</p>
<p>&#8221; ఆమె సుగుణాలనా, దోషాలనా ? &#8221;</p>
<p>‘’ వేటినీ కాదు’’</p>
<p>&#8221; రెండూ కాక మరేమి ఉంటాయి ?&#8221;</p>
<p>&#8221; సామాన్యుల ప్రేమకు గుణదోషాల విచారణ , సీతారాముల ప్రేమ కు ఉండదు.</p>
<blockquote><p>దుఃఖే సుఖేష్వ ప్యపరిచ్ఛదత్వా<br />
దసూచ్య మాసీ చ్చిర మాత్మనీవ<br />
తస్యాం స్థితో దోషగుణానపేక్షో<br />
నిర్వ్యాజసిద్ధో మమ భావబంధః</p></blockquote>
<p>[సుఖమునందు దుఃఖమునందు సువ్యక్తమై చెప్పనక్కరలేనిదై (ఆమె ) ఆత్మయందున్నది. దోషమునకు గాని గుణమునకు గాని సంబంధములేని కారణరహితమైన యొక భావబంధము నాకామె యందున్నది ]</p>
<p>&#8221; నన్ను మోసగించకు నీ మాటలతో. ఆమె లేకుండా నీకు కాలక్షేపం అవటం లేదూ ? అవుతోందిగా ? &#8221; విదూషకుడు పదునుగా ఎత్తిపొడుస్తాడు.<br />
ఎప్పుడూ విప్పని మనసును ఇప్పుడు మిత్రుడి దగ్గర బయటపెడుతున్నాడు రాముడు. చెప్పలేక చెప్పుకుంటున్నాడు.</p>
<p>&#8221; అనురాగం మానసస్థం. వెలుపలి కర్కశత్వం కనిపించి పోతుంది&#8230;లోపల ఆర్ద్రత ఉన్నదయ్యా, ఉన్నది. నా ప్రేమభావనలు తామరతూడులోని దారాలంత సూక్ష్మమైనవి, సుకుమారమైనవి. పూజ్యమైనవి &#8221;<br />
విదూషకుడు , బడబానలం దాచుకున్నసముద్రం వంటి మిత్రుడిని చూసి, ఆ అగ్ని సోకిన మంచుబిందువు లాగా ఆవిరవుతున్నానని , సీత ను తలచుకుని ఏడుస్తాడు….పేదగుండెవాడు ,అతనికి ఆమె మీద అంత అభిమానం.</p>
<p>అక్కడికి లవకుశులు వస్తారు. కుశుడు కొంత దుడుకువాడు. అందుకని, వాళ్ళు బయలుదేరేప్పుడు లవుడిని సీత ఎడంగా పిలిచి, కౌగలించుకుని ముద్దాడి, రాజుకు నమస్కరించి కుశలమడగమని చెప్పి పంపుతుంది. రఘువంశీయులు ఎవరికీ నమస్కరించరని ఆమె ఇదివరలో పిల్లలకు చెప్పిఉంది. ఆ మాటే పట్టుకుని కుశుడు రాముడితో అగౌరవంగా ప్రవర్తిస్తాడేమోనని ఆమె భయం. వారిద్దరినీ చూస్తూ ఉన్నవారికి, రాముడితో సహా, రాముడి బాల్యరూపం స్ఫురిస్తుంది. నమస్కరిస్తారు, బ్రాహ్మణ నమస్కారమని క్షత్రియుడైన రాముడు స్వీకరించడు. కౌగలించుకుని ఆసనం మీద తనపక్కన కూర్చోబెట్టుకుంటాడు. వాళ్ళు సిగ్గుపడిపోతారు. విదూషకుడు రఘువంశానికి చెందనివారు ఆ సిం హాసనం అధిష్టించరాదని, ప్రమాదం కలుగుతుందని జ్ఞాపకం చేస్తాడు. పిల్లలకి ఏమీ కాలేదు, అయినా ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు, నేల పైన కూర్చోనీయక.</p>
<p>తండ్రి పేరు &#8216; నిరనుక్రోశుడు &#8216;[నిర్దయుడు ] అని చెబుతారు. వాళ్ళు అల్లరి చేసినప్పుడు అమ్మ, &#8216; నిరనుక్రోశుని బిడ్డలారా, చాపల్యం వదలండి &#8221; అని మందలిస్తుంది కనుక ఆయన పేరు అదే అని.<br />
రావలసినవారంతా వస్తారు. రామాయణగానం మొదలవుతుంది. కైకేయి దశరథుడిని వరమడిగే సందర్భాన్ని దాటించి చెప్పమంటాడు రాముడు, ఆమె నొచ్చుకుంటుందని. ఆప్తుల వేదన పట్ల ఆయనకు అంత అక్కర. సీతాపరిత్యాగం తో కుశలవుల గానం ముగుస్తుంది. తర్వాతి కథ ఏమైందో వారికి తెలియదు, రాముడికి అవేదన.పుత్రులతో సహారామపత్నికి భద్రమని వాల్మీకి కబురు పెడతాడు. ఒకదానితో ఒకటి పొసగించుకోగా సత్యం అర్థమై ఒకరినొకరు కౌగలించుకుని మూర్ఛ పోతారు.ఆ మూర్ఛ ఎంతకూ విడదు. శ్వాస మాత్రం ఆడుతూ ఉంటుంది. వార్త తెలిసి సీతతో వాల్మీకి వస్తాడు.<br />
సీత అడుగుతుంది, &#8221; రాఘవులు సజీవులేనా ? &#8221;</p>
<p>వాల్మీకి &#8211; &#8221; అవును, సమీపించమ్మా &#8221;</p>
<p>&#8221; ఆయన నాకు ఆ ఆజ్ఞ ఇవ్వలేదు కదా &#8221;</p>
<p>&#8221; నేను అనుమతి ఇస్తున్నాను &#8221; వాల్మీకి నొక్కి చెబుతాడు. [ నాటకమంతా, ముఖ్యంగా చివరి అంకం లో- వాల్మీకి సర్వాధికారిగా కనిపిస్తాడు.తపోధనుడుగా, పెద్దవాడుగా, బుద్ధిగరపవలసినవాడుగా వాల్మీకి కథను ఒక కొలిక్కి తీసుకువస్తాడు. అసలు కథ లో ఎవరైనా ఇలా న్యాయం చేసిఉండకూడదా అని కవి భావించి ఉండవచ్చు]<br />
ఆమె వింటుంది, కాని విలపిస్తుంది.</p>
<p>ఆమె లాలించగా కుశలవులు లేస్తారు. వాల్మీకి ఉపచరిస్తే రాముడూ కళ్ళు తెరుస్తాడు.</p>
<p>కుశలవులు ప్రణామం చేసి ,రాముడినే చూస్తూ ఉంటారు.</p>
<p>సీత అడుగుతుంది &#8211; &#8221; ఏషయో యువాభ్యా మేవం ప్రేక్షితః ‘’ [ఎవరురా ఆయన ? అలా చూస్తున్నారు ? ]</p>
<p>తమ కు చాలా ప్రియమైనవారిని బిడ్డలు చూస్తూ ఉంటే, అది ఎవరో వారి నోటనే చెప్పించే ముచ్చట ఇళ్ళలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అదే పద్ధతిలో, ఎవరో చెప్పించుకుని వినేందుకు , విని ఆనందించేందుకు- సీత వాళ్ళను అడుగుతోంది. విశ్వనాథ ఇక్కడ సీత గృహిణీత్వం ప్రకాశిస్తోందని అంటారు. రాముడు అది ఆమె ఉదాసీనత అనుకుంటాడు, ఖిన్నుడవుతాడు</p>
<p>&#8221; రావణవధ అనంతరం ఈ మహాదేవి పవిత్రతను అగ్నిదేవుడు నిరూపించి ఉండలేదా ? నీకు సరిపోలేదా ? మళ్ళీ అనుమానం ఏమిటి ? &#8221; అని వాల్మీకి రాముడిని కోపంగా అడుగుతాడు. రాముడు ఆయన పాదాల మీద పడతాడు. వాల్మీకి శాంతించడు. ఆయనకు కావలసింది సీతా పరిగ్రహణం కాని తనను గౌరవించటం కాదు.</p>
<p>వాల్మీకి పరమప్రాకృతుడు ఒకనాడు&#8230;అందుకే అంటాడు &#8221; జానపదుల మనసులకి అనురాగం వికాసాన్నీ, సుఖాన్నీ, సంతోషాన్ని ఇస్తుంది. రాజుల హృదయాలలో అదే అనురాగం మలినమైపోతుంది. ఇసక నేలలో పంటలు పండవు. కుశలవులను స్వీకరించు, నేను వెళతాను &#8221; &#8211; వెనుదిరగబోతాడు. రాముడు వారిస్తాడు. వాల్మీకి, ఇక తప్పక, సీతను తన పవిత్రతను తిరిగి నిరూపించి చెప్పు కొమ్మ ని అడుగుతాడు.సీత లోకాలనూ లోకేశులనూ దిక్పాలులనూ మహర్షులనూ సంబోధిస్తుంది.</p>
<p>సృష్టి అంతా ఒక్కసారి నిశ్చలమూ నిశ్శబ్దమూ అయిపోతుంది.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/Mythili.jpg"><img class="alignright  wp-image-7376" title="Mythili" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/Mythili.jpg" alt="" width="182" height="242" /></a></p>
<p>సీత భూదేవిని సాక్ష్యం కోరుతుంది. గొప్ప సం రంభం తో ఆవిడ వస్తుంది, సీత అడిగినట్లే ఆమె పునీత అని అందరికీ ఉద్ఘాటిస్తుంది.</p>
<div>
<p>&#8221; చాలా ? నమ్మారా &#8221; అని అడుగుతుంది, భూదేవి, అందరినీ, స్వయంగా.</p>
<p>&#8221; సీతను గ్రహించు &#8221;- వాల్మీకి ఆదేశిస్తాడు.</p>
<p>రాముడు- &#8221; లక్ష్మణుడా, నమస్కరించు &#8221;</p>
<p>&#8221; అమ్మా, పాపిని, చంపదగినవాడిని, ప్రణమిల్లుతున్నాను &#8221;</p>
<p>సీత అతన్ని సమాదరించి దీవిస్తుంది. వాల్మీకి రాముడిని తిరిగి ఆజ్ఞాపిస్తాడు.<br />
ఆయన తడబాటుతో, సంకోచం తో &#8211; ఇంటికి వెళదాం రమ్మని అడుగుతాడు. ఆమె మన్నిస్తుంది.</p>
<p>రాజ్యాధికారం మీద రాముడికి విరక్తి పుట్టిందా అనిపిస్తుంది. అక్కడికక్కడ కుశుడికి రాజ్యాభిషేకమూ లవుడికి యౌవరాజ్యాభిషేకమూ వాల్మీకితో జరిపిస్తాడు.. తనూ లక్ష్మణుడూ వారికి సహాయకులుగా మాత్రమే ఉంటామని ప్రకటిస్తాడు.</p>
<p>కుందమాల రాగరంజితమై ముకుందమాల అయింది.</p>
<p>&nbsp;</p>
<p><em><strong>(చి.డాక్టర్ కౌటిల్య చౌదరి కి కృతజ్ఞతలు)</strong></em></p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=7364</wfw:commentRss>
		<slash:comments>32</slash:comments>
		</item>
		<item>
		<title>రక్షణను రచించిన భద్రమహిళ అగాథా క్రిస్టీ</title>
		<link>http://vaakili.com/patrika/?p=6972</link>
		<comments>http://vaakili.com/patrika/?p=6972#comments</comments>
		<pubDate>Sun, 30 Nov 2014 20:01:35 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కడిమిచెట్టు]]></category>
		<category><![CDATA[మైథిలి అబ్బరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=6972</guid>
		<description><![CDATA[<p></p> <p>&#8216;జనముద్దు&#8217; సాహిత్యాన్నీ తతిమా కళారూపాలనీ   మొహం చిట్లించి చూడటం మేధావులకు ఉండవలసిన లక్షణాలలో ముఖ్యమైనది. అందరికన్నా తాము ఎక్కువ అనే భావన వారి ఉనికికి అత్యవసరమైన సంగతి. జ్ఞానం ఉన్నవారి జనాభా తక్కువ కనుక ఎక్కువమందికి నచ్చేదానిలో ఖచ్చితంగా గొప్ప ఉండదనే ఆ నమ్మకానికి ఎదురు వాదన- నిజం చెప్పాలంటే , ఏమీ లేదు.</p> <p>ప్రేమలూ కన్నీళ్ళూ రాసినవారికే అంతంతమాత్రం గౌరవం ఉంటుంటే నేరపరిశోధన రాసినవారి సంగతి చెప్పాలా ?  కాని , కనీసం కొందరి గురించి మాట్లాడేటప్పుడు- ఇదంతా అప్రస్తుతం. ఏ భేషజమూ లేకుండా తనను తానొక వినోదకారిణిగా మాత్రమే చెప్పుకున్నవారు అగాథా క్రిస్టీ. అయితే,  ఆమె రాసినదాన్ని ఇష్టంగా చదివేవారిలో ’ తెలివిగలవారు ‘ చాలా మందే ఉన్నారు. సాధారణ ప్రమాణాల ప్రకారం చూసినా  కూడా  ఆమె ప్రతిపాదించి పోషించిన విలువలేవీ ’  ప్రధాన స్రవంతి  ‘ లో వాటికి తీసిపోవని వారు వాదిస్తారు .  అందులో ఇమడకపోవటం వల్ల ఆమెకి వచ్చిన లోటేమీ లేదు . అయినా కూడా ,  &#8216; కాదు &#8216; అని ముందే పెదవి విరవకుండా   ఉండగలిగితే &#8211; పట్టించుకోవలసిన  విషయాలు కొన్ని ఉన్నాయనే   అనుకుంటున్నాను .</p> <p>లిటరరీ ఫిక్షన్, genre ఫిక్షన్ ల మధ్య గీత 19 వ శతాబ్దం చివరలో స్పష్టమైంది. 1918 తర్వాత ఆ వర్గీకరణ బాగా బిగిసిపోయింది. &#8221; కొంతమంది కోసం, కొన్ని విషయాలు మాత్రమే  చెప్పే &#8221; సాహిత్యంగా genre fiction  కి నిర్వచనం వచ్చేసింది. ఆ కొందరూ ఎందరో అయినా కూడా అది ‘ అంత మాత్రమే ‘  అయింది. అయినంతమాత్రాన  ఆగక లిటరరీ ఫిక్షన్ కన్న అది ఎన్నో రెట్లు తక్కువ అన్న రూఢి కూడా అయిపోయింది. అయోమయాన్నో కల్లోలాన్నో కరువుతీరా వివరించటం ఘనమైన సంగతి అయింది .  &#8221; అరే, పాతవాళ్ళు అలా చెప్పలేదు కదా &#8221; అంటే &#8221; ఆ పాతవాటిని [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg"><img class="aligncenter size-full wp-image-4744" title="kadimi" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg" alt="" width="810" height="284" /></a></p>
<p><span style="font-size: 30px;"><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/mithili2.gif"><img class="alignleft  wp-image-4547" title="mithili2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/mithili2.gif" alt="" width="154" height="159" /></a>&#8216;జ</span>నముద్దు&#8217; సాహిత్యాన్నీ తతిమా కళారూపాలనీ   మొహం చిట్లించి చూడటం మేధావులకు ఉండవలసిన లక్షణాలలో ముఖ్యమైనది. అందరికన్నా తాము ఎక్కువ అనే భావన వారి ఉనికికి అత్యవసరమైన సంగతి. జ్ఞానం ఉన్నవారి జనాభా తక్కువ కనుక ఎక్కువమందికి నచ్చేదానిలో ఖచ్చితంగా గొప్ప ఉండదనే ఆ నమ్మకానికి ఎదురు వాదన- నిజం చెప్పాలంటే , ఏమీ లేదు.</p>
<p>ప్రేమలూ కన్నీళ్ళూ రాసినవారికే అంతంతమాత్రం గౌరవం ఉంటుంటే నేరపరిశోధన రాసినవారి సంగతి చెప్పాలా ?  కాని , కనీసం కొందరి గురించి మాట్లాడేటప్పుడు- ఇదంతా అప్రస్తుతం. ఏ భేషజమూ లేకుండా తనను తానొక వినోదకారిణిగా మాత్రమే చెప్పుకున్నవారు అగాథా క్రిస్టీ. అయితే,  ఆమె రాసినదాన్ని ఇష్టంగా చదివేవారిలో ’ తెలివిగలవారు ‘ చాలా మందే ఉన్నారు. సాధారణ ప్రమాణాల ప్రకారం చూసినా  కూడా  ఆమె ప్రతిపాదించి పోషించిన విలువలేవీ ’  ప్రధాన స్రవంతి  ‘ లో వాటికి తీసిపోవని వారు వాదిస్తారు .  అందులో ఇమడకపోవటం వల్ల ఆమెకి వచ్చిన లోటేమీ లేదు . అయినా కూడా ,  &#8216; కాదు &#8216; అని ముందే పెదవి విరవకుండా   ఉండగలిగితే &#8211; పట్టించుకోవలసిన  విషయాలు కొన్ని ఉన్నాయనే   అనుకుంటున్నాను .</p>
<p>లిటరరీ ఫిక్షన్, genre ఫిక్షన్ ల మధ్య గీత 19 వ శతాబ్దం చివరలో స్పష్టమైంది. 1918 తర్వాత ఆ వర్గీకరణ బాగా బిగిసిపోయింది. &#8221; కొంతమంది కోసం, కొన్ని విషయాలు మాత్రమే  చెప్పే &#8221; సాహిత్యంగా genre fiction  కి నిర్వచనం వచ్చేసింది. ఆ కొందరూ ఎందరో అయినా కూడా అది ‘ అంత మాత్రమే ‘  అయింది. అయినంతమాత్రాన  ఆగక లిటరరీ ఫిక్షన్ కన్న అది ఎన్నో రెట్లు తక్కువ అన్న రూఢి కూడా అయిపోయింది. అయోమయాన్నో కల్లోలాన్నో కరువుతీరా వివరించటం ఘనమైన సంగతి అయింది .  &#8221; అరే, పాతవాళ్ళు అలా చెప్పలేదు కదా &#8221; అంటే &#8221; ఆ పాతవాటిని క్లాసిక్ లు అంటున్నాము కదా , చాలదూ  ? &#8221; అని జవాబు వచ్చింది. [ కొత్తగా క్లాసిక్ లు వచ్చే దారి మూయబడింది, కనీసం అలా అనిపించింది. ఒక రచన క్లాసిక్ అయేందుకు అతి ముఖ్యమైన అంశం- కాలపరీక్ష - జరిగే తీరుతుంది, ఫలితాలు రానే వస్తాయి ]</p>
<p>ఏతావతా చదువరి మనసుకి ఏమాత్రం స్థిమితాన్ని కలిగించే నేరాన్ని రచయిత చేసి ఉన్నా ఆ రచనకు తక్కువ విలువ కట్టబడింది.</p>
<p><img class="alignright size-full wp-image-6974" title="christie1" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/christie1.jpg" alt="" width="262" height="192" /></p>
<p>రచయిత సంస్కారం, అధ్యయనం,  వ్యక్తీకరించే శక్తి మాత్రమే  రచనని నిర్ణయిస్తాయి&#8230;ఎవరికోసం, ఎందరికోసం రాశారనేది కాదు. మీడియోకర్ మనుషులు ఉన్నట్లుగానే  మీడియోకర్ సాహిత్యమూ  ఎప్పుడూ ఉంటుంది .  అయితే, ఎంత మీడియోకర్ ఆశావాద , పలాయనవాద సాహిత్యం అయినా -ఎంతో గొప్పదనిపించుకున్న నిరాశావాదపు ‘ సీరియస్ ‘  సాహిత్యం కన్న న్యాయమైనదని నేను నమ్ముతాను.  Holoquist  అన్న విమర్శకులు ఇలా అన్నారని తెలిసి ఆశ్చర్యం వేసింది &#8211; &#8221; డిటెక్టివ్ సాహిత్యం లోది కృతక హింస -  ఆధునికానంతర నవలలోది నిజమైన హింస. ఎందుకంటే అక్కడ చదువరి విశ్వాసాలు ధ్వంసం చేయబడతాయి &#8221; .  ప్రేమ, శాంతి, అమాయకత్వం శాశ్వతమైన విలువలని అంగీకరిస్తే- మనుషుల మధ్యన హింస, సంఘర్షణ మాత్రమే ఉన్నాయని చెప్పదలచిన ఏ రచనలోనైనా వైరుధ్యం ఉన్నట్లే  .  కాగా, కాలంతో రాగల [ మంచి ] మార్పుని   సాహిత్యం తిరస్కరించ రాదు . ఆశ కి కాలం గడవటం అవసరం, నిరాశకి stagnation  అవసరం.</p>
<p>రెండు ప్రపంచయుద్ధాల నడిమి కాలం &#8216; నేరపరిశోధనా సాహిత్యపు స్వర్ణయుగం &#8216; అని చెబుతారు. అంతకన్న చాలా ముందరే Edgar Allen Poe  [1841] , Wilkie Collins  [1868]  ల కథలు, నవలలు వచ్చాయి. ఆ విభాగం లో మొట్టమొదట వినబడే పేరు – Sherlock Holmes సృష్టి 1886 నాటికే జరిగింది.  అయినా ,  ఆ కాలపు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు  అటువంటి కథలు విరివిగా  రావటం వెనుక ఉన్నాయి.    అదొక పలాయనవాదమని అనే విమర్శకులు ఉన్నారు  . ఆ మాట  పూర్తిగా సత్యం కాదు. ఉత్పాతం నుంచి కోలుకుంటున్నవారికి ధైర్యం చెప్పటం అవసరం. మొదటిప్రపంచయుద్ధం తర్వాత చాలా పోయింది, కాని  మొత్తం  పోలేదనే భద్రతని ఆ డిటెక్టివ్ నవలలు ఇచ్చాయి.  ఒక తీవ్రమైన నేరాన్ని సృష్టించి దాన్ని పరిష్కరించటం &#8211; నేరస్థుడిని పట్టుకుని శిక్షించటం &#8211; అది సాధ్యమేననే విశ్వాసాన్ని చదువరికి కలిగిస్తాయి. &#8216; ప్రపంచం లో చెడు ఉంది, కాని దాన్ని అంతం చేయగలగటమూ ఉంది &#8216; అని తీర్మానించటం అవుతుంది. ఆ న్యాయపరిరక్షణ  లో చుట్టుపక్కలవారంతా ఒకరికొకరు సాయం చేసుకోవటం ద్వారా దగ్గరవుతారు.  మొత్తం చెడునంతా ఒక ముద్ద చేసి నాశనం చేయటం రావణాసురుడి దిష్టి బొమ్మ తగలబెట్టటం వంటిది, దయ్యాన్ని వదిలించటం వంటిది. కథ ముగిసేసరికి మునుపటి వాతావరణం నెలకొంటుంది. [Reversion to pristine innocence ]</p>
<p>వాస్తవ జీవితం లో సాధ్యం కావనిపించే సంఘటనలను, పరిష్కారాలను చిత్రించటం పలాయనవాదం అనుకొనే ముందర JRR Tolkien అన్న మాటలు ఒకసారి వినవలసి ఉంది.  ‘’ “Fantasy is escapist, and that is its glory. If a soldier is imprisioned by the enemy, don&#8217;t we consider it his duty to escape?. . .If we value the freedom of mind and soul, if we&#8217;re partisans of liberty, then it&#8217;s our plain duty to escape, and to take as many people with us as we can!”</p>
<p>&nbsp;</p>
<p style="text-align: center;"><strong>పలాయనం అన్నమాటని విడుదల గా మార్చవలసిఉంది.</strong></p>
<p>స్థూలంగా చూస్తే ఆమె, ఇంకొందరు బ్రిటిష్ సాహిత్యకారులు సాంప్రదాయికమైన మిస్టరీలు రాశారు. వాటిని &#8216; సౌకర్యవంతమైన &#8216; [cozy  ] మిస్టరీలు అనటమూ ఉంది. ఆ రచనకి కొన్ని నియమాలు[ retrospective  గా ] ఏర్పడినాయి కూడా. అపరాధి పాత్ర నవల మొదటిలోనే రావాలి, డిటెక్టివ్ కనుగొనటం కాకతాళీయంగా గాని, వివరించలేని intuition వల్లగానీ జరగకూడదు, డిటెక్టివ్ ఎట్టి పరిస్థితిలోనూ నేరం చేయకూడదు- ఇటువంటివి. డిటెక్టివ్ సహాయకుడు సగటు పాఠకుడి కంటె కొంచెం [కొంచేమే ]  తెలివితక్కువగా ఉండాలి అన్న నియమం కూడా ఉండటం నవ్వు తెప్పిస్తుంది. అవును, వినోదింపజేయటం ఆ  genre ప్రధాన కర్తవ్యం కనుక, నవ్వు కూడా రావచ్చు- తప్పు లేదు. పాఠకుల ఏ నమ్మకాలనూ బద్దలుకొట్టటం ఈ సాహిత్యం చేసే పని కాదు. సాంప్రదాయికమైన మిస్టరీ ల పైన విమర్శలు ఇవి- అవి యథాతథ వాదసాహిత్యం  &#8211; ఉన్న స్థితిని మార్చాలని చెప్పవు. నేరం పూర్తిగా వ్యక్తిగతమైనదని అంటాయి. వాటిలో  ఒక వ్యక్తి దుష్టుడై నేరం చేస్తాడు, అస్తవ్యస్తమైన సాంఘికస్థితివల్ల కాదు.  అవి కలిగించే భద్రతాభావన ఒక అభాస. ఒక నిర్ధిష్టమైన కాలపరిమితిలోపల నేరం జరగటం, శిక్ష పడటం- అంతా అయిపోతుంది-  ఇది నిజజీవితం లో అయేపని కాదు. ఒకవేళ అయినా శాశ్వతమైన  ఉపకారమేమీ జరగదు.</p>
<p>వీటన్నిటిగురించీఅవుననీ కాదనీ ఎంతైనా వాదించవచ్చు. ఇంతమాత్రం అంటున్నాను -బృహత్ప్రయోజనాలను సాధించగల సాహిత్యం   కావాలని అనుకోవటం మెచ్చదగినదే, కాని అటువంటిది మాత్రమే  రావాలని, మరింకేదీ వద్దని  అనుకోవటం మాత్రం కాదు.  మానవ హృదయం లో లాగే సమాజమస్తిష్కం లోనూ వంద పొరలు, వేయి మెలికలు- అన్నిటికీ  appeal చేయటం ఒకేరకపు సాహిత్యం వల్ల  కాదు.</p>
<p>వాస్తవజీవితం లో నిబంధనలను అతిక్రమించటం మనం తరచుగా చేస్తామా ? చేసిన సంఘటనలను సమర్థిస్తామా ? అసలు ఆ నిబంధనలు &#8216; అంత  &#8216; చెడ్డవా ? !” నిజజీవితం లో జవాబు లేనితనాన్ని ఎంతవరకు భరించగలమో ఆలోచిస్తే , సాహిత్యం లో జవాబులు ఇవ్వటం ఎంతవరకూ తప్పుపట్టదగినదో తెలుస్తుంది.</p>
<p>అమెరికన్స్ ఎక్కువగా రాసిన Hard boliled మిస్టరీలు వీటికి భిన్నమైనవి. Raymond Chandler  ఆమె సమకాలికులు ఆ విభాగం లో. పశుత్వం, క్రూరత్వం &#8211; వీటికి  అక్కడ  పూర్తిగా అనుమతి ఉంది. శాశ్వతమైన నష్టం, విషాదం, సంభవిస్తూ ఉంటాయి  . ఆయన ఒకచోట ఇలా అంటారు &#8211;  &#8221; సాంప్రదాయికమైన మిస్టరీ లో నేరం ఎవరు చేశారు అని తేలటమే ముఖ్యం, తక్కిన విషయాలేవీ లెక్కలోకి రావు. [నేను రాసే ] బ్లాక్ మాస్క్ పద్ధతిలో సన్నివేశాలు ప్లాట్ ని అధిగమిస్తాయి. చివర ఏమిటో తెలియకపోయినా ఆనందించగలిగేదే మంచి మిస్టరీ. హంతకుడెవరో తెలిసిపోయాక సినిమాని తర్వాతివారు ఇంకెందుకు చూస్తారని ఒక హాలీవుడ్ నిర్మాత నాతో అన్నారు. కావచ్చు, అతను సరైన మిస్టరీ గురించి మాట్లాడటం లేదు &#8221;</p>
<p>విడ్డూరం ఏమిటంటే అగాథా క్రిస్టీ కి అవతలి శిబిరం నుంచి వచ్చిన ఈ మాటలు ఆమెకి పూర్తిగా వర్తిస్తాయి. ముగింపు కోసమా ఆమె నవలలూ నాటకాలూ మళ్ళీ మళ్ళీ చదవటం, చూడటం ?</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/christie2.jpg"><img class="alignleft size-full wp-image-6975" title="christie2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/christie2.jpg" alt="" width="226" height="282" /></a>అప్పుడు  అపరాధపరిశోధనా రచనలు చేసిన చాలామందికి ఇవాళ చారిత్రక ప్రాధాన్యం మాత్రమే ఉంది. అగాథా క్రిస్టీ అలా కాదు.  బైబిల్, షేక్ స్పియర్ సాహిత్యం తర్వాతి స్థానంలో  , పుస్తకప్రతుల పరంగా ఆమె సాహిత్యం ఉంటుంది.  103 భాషలలోకి అనువాదం అయింది [ ఇది బైబిల్ కన్న 14 భాషలు ఎక్కువ. వాటిలో నాకు తెలిసి   మలయాళం, తమిళం, హిందీ, మరాఠీ, పంజాబీ ఉన్నాయి.] 1948 లో పెంగ్విన్ ప్రచురణలనుంచి ఒకేరోజు ఆమె రాసిన పది పుస్తకాలు- పదిలక్షల ప్రతులు ముద్రించబడినాయి [ పెంగ్విన్ మిలియన్ ] . &#8216;Peril at the end house  &#8217; అమెరికన్ కాపీలను ఒకదానిపైన ఒకటి పేర్చితే చంద్ర  మండలం వరకూ వెళతాయి. ఆమె డిటెక్టివ్  Hercule Poirot చివరి నవల ‘ Curtain ‘లో మరణించినప్పుడు Newyork Times మొదటి పేజీలో  శ్రద్ధాంజలి ప్రకటించింది. ఒక కాల్పనిక పాత్రకి అటువంటిది జరగటం అదే మొదలు. నవలాకారిణిగానూ నాటకకర్త గానూ ఇంచుమించుగా సమానమైన విజయం సాధించినవారు ఆమె. 1952 లో మొదలైన ‘ Mouse Trap ‘ ప్రదర్శన ఇంకా కొనసాగుతూనే ఉంది [ మధ్యలో నాటకశాలను మార్చినా ]  , ఆ నాటకానికి ఒక ప్రత్యేకమైన వెబ్ సైట్ ఉంది.  ఇవన్నీ ఆమె కి ఉన్న విపరీతమైన ప్రజాదరణను చెబుతాయి. అవును, ప్రజాదరణ పొందినది అంతా మంచిదీ గొప్పదీకానక్కరలేదు -ప్రజాదరణ ఉన్నంత మాత్రాన ఒక విషయం విలువ లేనిదీ అవనక్కరలేదు.</p>
<p>&nbsp;</p>
<p>విద్యావంతమైన మధ్యతరగతి కుటుంబం లో పుట్టి పెరగటం ఆమె అభిప్రాయాలను నిర్దేశించింది. E.Nesbit రాసిన అద్భుత కథలు, తర్వాత Lewis Caroll రచనలు ఇష్టంగా చదివేవారు.Gaston Leroux  రాసినThe mystery of yellow room  డిటెక్టివ్ నవల పట్ల ఆసక్తిని పెంచింది. చాలా మంచి బాల్యాన్ని గడిపానని ఆమె చెప్పుకునేవారు. ఆ భద్రత ఆమెను జీవితాంతమూ కాపాడిందనిపిస్తుంది.  అర్థగణితం ఆమెకి ఇష్టమైన పాఠ్యాంశం. నవలలన్నిట్లోనూ ఆ ‘ లెక్క ‘ కనిపిస్తుంది. మొదటిప్రపంచయుద్ధపు కాలంలో ఔషధశాస్త్రం లో శిక్షణ తీసుకున్నారు. ఆ పరిజ్ఞానమూ ఆమె రాసినదానిలో ఉంటుంది- ముఖ్యంగా రకరకాలైన విషాల గురించి. మరొకరిలాగా వ్యవహరించటం, తనలోనే ఉన్నదాన్ని మరొకలాగా ప్రదర్శించటం -  ఇవి ఆమె సాహిత్యం లో ప్రముఖంగా ఉంటాయి. తన కంటే పదేళ్ళు పెద్దదైన అక్క మాడ్జ్ ,&#8221;  తనలా నటిస్తున్న మనిషిలాగా నటించటం &#8221; చిన్నతనం లో ఒకవిధమైన సమ్మోహాన్ని కలిగించేది  . తర్వాతి రోజులలో  తన సమకాలీనురాలైన రచయిత్రి Elizabeth Bowens  రచనని ఇష్టపడేవారు. Ms Bowens నేరపరిశోధన గురించి రాయకపోయినా, ఆమె సాహిత్యలక్షణం ఇది -  జీవితానికి అమర్చిన మూత తీస్తే  ఏమవుతుందో చెప్పటం. ఆ కుతూహలం ఒకవిధంగా నిజనిర్ధారణ, అగాథా క్రిస్టీ రాసినది దానిగురించే. ఏది నిజం అన్న విషయం లో ఆమెకి అయోమయం లేదు. ఇక్కడే ఆమె conservative అనిపిస్తారు. నిజమే, ఆమె పూర్తిగా &#8216; కుడివైపే &#8216; ఉన్నారు. కానిఒకటి కన్న ఎక్కువ నిజాలని అంగీకరించటమూ కనిపిస్తుంది. ఆమె దృష్టిలో అవి దృక్కోణాలు, వేటికవి సత్యం. కొన్ని  నవలలలో అపరాధి  కి శిక్షపడకపోవటమూ ఉంటుంది . సాంఘికనియమాల ను అతిక్రమించటాన్ని సమర్థించరు, అయితే వాటి కంటె విడిగా కూడా  తన వైయక్తిక న్యాయం [ భారతీయంగా చెప్పాలంటే దాన్ని ' ధర్మం ' అనవచ్చు ] ఉంటుంది, అక్కడ. ఆమె మాస్టర్ పీస్ గా చెప్పుకునే ‘And there were none ‘  దీనికి మంచి ఉదాహరణ.</p>
<p>తప్పకుండా అది నేరమని నమ్మినప్పుడు  మాత్రం,  నేరస్థుల పట్ల ఆమె అభిప్రాయాలు కటువైనవి. వారి  మనస్తత్వాన్ని చికిత్సతో సరిచేయవచ్చుననే అప్పటి వైద్యుల వాదనను మొదలంటా విమర్శించారు. తీవ్రమైన నేరాలు చేసినవారిని ఔషధాల పరీక్షలో వాడుకోవాలని తన ఆత్మకథ  లో ఆమె   సూచించటం shocking  గా ఉంటుంది.  ఆవిధంగానైనా వారివల్ల సమాజానికి ఉపయోగం జరుగుతుందని. పశ్చాత్తాపం, పాపప్రక్షాళన వంటి క్రైస్తవ సూత్రాలకి విరుద్ధంగా ఆమె సమర్ధించే శిక్ష తూర్పుదేశాల న్యాయాన్ని పోలిఉంటుంది.</p>
<p>అగాథా క్రిస్టీ- Power and illusion అనే విస్తృతమైన పరిశీలన చేసిన R.A.York ఇలా అంటారు- &#8221; సాహిత్యం,సర్వత్రా కాదుపోనీ, ప్రధానంగా &#8211; సంఘటనలకీ సందర్భాలకీ ఎక్కువ చేసిన అర్థాన్ని [exaggerated significance ] ఇస్తుంది. చాలాసార్లు చదువరికి తెలియనివీ అంతుబట్టనివీ కూడా సాహిత్యం లోకి వస్తాయి.  చదువరి అటువంటప్పుడు ఏం చేయగల రో అన్నదానితో కూడా అక్కడ నిమిత్తం లేకపోవచ్చు . ఎటువంటి తీక్షణమైన సందర్భాలనైనా అర్థం చేసుకోగలిగే జ్ఞానం ఒకటి ఉంది. &#8221; ఇది ఇలాగే జరుగుతుంది , ఇదివరలో జరిగింది &#8221; అని తెలుసుకోవటం అది. మానవసంబంధాలు, స్పందనలు -  ఆ నేపథ్యంలో  ఇంకొంచెం మెరుగుగా ఉంటాయి.   జీవితపు అనంతత్వం లోంచి, వైపరీత్యం లోంచి- ఒక  అంతస్సూత్రాన్ని రాబట్టటం  డిటెక్టివ్ నవల చేయగలదు. సాధారణత్వం నుంచి ప్రత్యేకతకీ,  నైతికత నుంచి కళాత్మకత కీ ప్రయాణించటం మామూలు నవలలో ఎంత సాధ్యమో   డిటెక్టివ్ నవల లో కూడా అంతే సాధ్యం &#8221; . కాస్త ఎక్కువగా, ఇంకాస్త గజిబిజి గా అనిపించినా  ఆయన అన్నదానిలో నిజం ఉందని నాకు అనిపిస్తుంది.</p>
<p>York ఇంకా అంటారు &#8211; &#8221; ఒప్పుదల సాహిత్యానికీ ప్రశ్నించే సాహిత్యానికీ విభజనరేఖ అంత స్పష్టమైనది కాదు ‘’</p>
<p>క్రిస్టీ పాత్రలు అహంకారం తో ఉండవు గానీ,   శక్తివంతంగా ఉంటాయి . Larger than life  పాత్రల మీద ఆమెకి గౌరవం. ఆమె మనలాగా లేని, మనకు అర్థం కాని- మనుషుల గురించి ఎక్కువే రాశారు.  ఇంకొంచెం చురుకుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగితే జీవితం ఎలా ఉండగలదో కూడా  చెబుతారు.</p>
<p>ఆమె నవల ఒక మానసికక్రీడ. ఇందులో రచయిత్రి,  చదువరి ఇద్దరూ గెలుస్తారు. చదివేందుకు సిద్ధపడినప్పుడే  మోసపోయే అంగీకారం ఉంటుంది. ఆ మోసం చేయబడటమే చదువరి గెలుపు.  ఆమె రాసినవి నూటికి తొంభైతొమ్మిది శాతం rewarding mysteries.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/christie3.jpg"><img class="aligncenter size-large wp-image-6976" title="christie3" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/christie3-1024x1024.jpg" alt="" width="745" height="745" /></a></p>
<p>అగాథా క్రిస్టీ రచన ప్రారంభించేనాటికి Sherlock Holmes  కి చాలా ప్రసిద్ధి ఉంది.  [ Sir Arthur Connan Doyle  ఆ తర్వాత పదిహేనేళ్ళు జీవించారు ] Watson వంటి సహాయకుడిగా  Hastings ని సృష్టించినా, Holmes ఏది అవునో అది కానివాడిగా తన డిటెక్టివ్ ని రూపొందించారు ఆమె. ఆ వైరుధ్యం కొంత తమాషాగా ఉంటుంది కూడా. Holmes  యువకుడు, సన్నగా పొడుగ్గా ఉంటాడు. క్రిస్టీ సృష్టించిన Poirot  మధ్యవయసు దాటినవాడు, పొట్టిగా బట్టతలతో కాస్త బొద్దుగా ఉంటాడు. Holmes  భౌతికమైన ఆధారాలను వెతుకుతాడు. Poirot వాలుకుర్చీలో కూర్చుని &#8216;  మెదడు లోని బూడిదరంగు కణాలకి &#8216; పనిపెడతాడు.  వేరు  వేరు విషయాలలో  అపారమైన పరిజ్ఞానం,అనంతమైన మేధాశక్తి  , వీటితోబాటు కాస్త అతిశయం, పద్ధతిగా కనిపించటం పట్ల ఎక్కువ పట్టింపు- కూడా ఉంటాయి  అతనిలో. అయితే   పూర్తిగా &#8216; సత్పురుషుడు &#8216; &#8211; చివరి నవల లో న్యాయాన్ని కాపాడేందుకు ఎందాకా వెళ్ళగలడో రాస్తారు .</p>
<p>నేరపరిశోధన రెండు విధాలు. ఒకటి చెదురుగా ఉన్న జిగ్-సా పజిల్ ముక్కలని ఒక పద్ధతిలో అమర్చి పూర్తి రూపాన్ని తీసుకురావటం. రెండోది పురావస్తుపరిశోధన వంటిది. ఒక చిన్న ఆధారం తో మొత్తం పరిస్థితిని అంచనాకట్టి కూర్చటం. నేరం జరిగిపోయి చాలాకాలం అయిపోయాక ఈ పద్ధతి మాత్రమే పాటించవలసి ఉంటుంది. రెండు రకాలుగానూ Poirot  నెగ్గుకువస్తుంటాడు.Poirot  కనిపించే మొదటినవల ‘ Mysterious affair at Styles ‘  1916 లో, తన ఇరవై ఆరవ ఏట రాశారు.  అతను 1975 లో పుస్తకం లో చనిపోతే క్రిస్టీ 1976 లో మరణించారు.</p>
<p>మానవస్వభావం, ప్రవర్తన &#8211; ఇవి అన్నిచోట్లా ఇంచుమించు ఒకేలాగా ఉంటాయని క్రిస్టీ నమ్ముతారు. ఒకప్పుడు అలా జరిగింది కనుక మళ్ళీ అలా జరిగే అవకాశం ఉంది అన్నది ఆమె theme . ఆ రెండు సందర్భాలలో పోలిక పట్టటం తో సగం పని అయిపోతూ ఉంటుంది. ఇలా చే యగల వ్యక్తి Miss Marple .[  ఇద్దరు ప్రసిద్ధులైన డిటెక్టివ్ లని సృష్టించిన ఘనత కూడా క్రిస్టీ దే ]. Miss Marple  మొదటి నవలలోనే వృద్ధురాలుగా దర్శనమిస్తుంది. రచయిత్రి అమ్మమ్మ ఈ పాత్రకి నమూనా అంటారు .  చిన్న పల్లెటూరు St. Mary Mead  లో జరిగేవే కొద్ది మార్పులతో అన్నిచోట్లా జరుగుతాయని ఆమె నమ్మకం. Poirot  కంటే ఈమె కి అపనమ్మకం ఎక్కువ , తానొక సినిక్ నని  ఒప్పుకుంటుంది. అయితే ఆ అనుమానంలో అనారోగ్యం లేదు, అనారోగ్యాన్ని గుర్తించటం ఉంది.</p>
<p>Tomy and Tuppence అనే డిటెక్టివ్ దంపతులనీ Parker Pyne అనే మరొక పరిశోధకుడినీ కూడా ఆమె సృష్టించారు. తనకి తనే పారడీ గా Ariadine Oliver ని తయారు చేశారు. Mrs Oliver  వేషభాషలు, రూపురేఖలు క్రిస్టీవి లాగానే ఉంటాయి. ఇద్దరూ తీరికవేళల్లో ఆపిల్ పళ్ళు తింటూ ఉంటారు.  డిటెక్టివ్ పుస్తకాలు రాయటమే తెలుసుగానీ నిజమైన పరిశోధన అంటే తెలియదని తనని తనే వెక్కిరించుకుంటారు క్రిస్టీ.  Poirot దయ వల్ల Mrs Oliver  చిక్కుల్లోంచి గ ట్టెక్కుతూ ఉంటుంది.</p>
<p>ఆమె పూర్తిగా భద్రమహిళ [ lady ]. తన విశ్వాసాలనీ ఆలోచనాధోరణినీ రాసినదానిలోకి తెచ్చారు. తెలియనిదానిపట్ల, ఇష్టంలేనిదాని పట్ల -  అనాసక్తి కొన్నిచోట్ల  కనిపిస్తుంది, కొన్నిచోట్ల  అసహనమూ కనిపిస్తుంది. సాంఘికంగా ఆమె సంప్రదాయవాది. విడి విడిగా మనుషుల గురించి చెప్పేటప్పుడు మటుకు లోచూపు, వైశాల్యం ఉంటాయి [ముఖ్యంగా Mary Westmaacott పేరుతో రాసిన   నవలలలో ] . ఇదొక వైరుధ్యం గా తోస్తుంది… ఆమె పెరిగిన, జీవించిన కాలం అటువంటిది. అయితే మర్యాదస్తులకీ గౌరవనీయులకీ మధ్య తేడా ఆమెకి స్పష్టంగా తెలుసు.</p>
<p>తనకు పూర్తిగా  అర్థమైన వాటి గురించే రాశారు. నలభై యేళ్ళు దాటాక మధ్యప్రాచ్యదేశాలలోనూ ఈజిప్ట్ లోనూ కొంతకాలం గడిపారు- అక్కడి నేపథ్యం అప్పటి నవలలో ఉంటుంది. అయితే ఏ మనిషినీ యథాతథంగా పుస్తకం లోకి దించటం తన వల్ల అవదని ఆమె చెబుతారు. మొదటి భర్త ఆర్చిబాల్డ్ క్రిస్టీ పట్టు పట్టటం వల్ల The man in brown suit లో ఆయన వంటి పాత్రను సృష్టించాననీ కానీ అది అట్టే దూరం సాగలేదనీ అంటారు.</p>
<p>సంభాషణలు క్లుప్తంగా సహజంగా ఉంటాయి.  పాత్రలు మాట్లాడిన చాలా మాటలకి ఒక ప్రాముఖ్యం ఉంటుంది, ఆ తర్వాత జరిగేదానిలో.  చిన్న చిన్న వివరాలను గమనిస్తూ రాయటం ఆమె ప్రత్యేకత. రాసేది అపరాధశోధన కనుక అది అవసరం కూడా.  కాని అంతకుమించిన వాతావరణ కల్పన చాలా సాధికారంగా ఆమె రచనలో ఉంటుంది. ఆ దృశ్యం లోకి చదువరి వెళ్ళి తీరతారు,  పాతకాలపు ఇంగ్లీష్ పల్లెటూళ్ళలో -  ఆ ఇళ్ళలో జీవిస్తారు. ఇంగ్లీష్ పల్లెటూరి వాతావరణం లో నిశ్చింతని ఆమె అమూల్యంగా, అత్యవసరం గా చూశారు. ఆ కాలం గడిచిపోయి మరి తిరిగిరాదని తెలిశాక కూడా ఆమె రచనలు చదవటం అదే సురక్షితత్వాన్ని ఇస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఆమె సాహిత్యం ఆకర్షణీయంగా ఉండటానికి ఇదొక ముఖ్యకారణంగా చెబుతారు. ఆ వాతావరణం అలా ఎప్పుడూ లేదని   [అంతా ప్రశాంతంగా ఉంటే హత్య ఎందుకు జరుగుతుంది ?] వాదించేవారూ ఉన్నారు. కావచ్చు, కాకపోవచ్చు. ఇప్పటి ఫాంటసీ నవలలో alternate reality, alternate worlds- ఆనందింపచేసే పద్ధతిలోనైనా తీసుకోవచ్చు. ఆమె రియలిస్ట్ రచయిత్రి కాదుకద, దోషం లేదు..</p>
<p>ఆమె వచనం చాలా స్పష్టంగా, సూటిగా ఉంటుంది. అన్ని భాషలలో అనువాదం వీలవటానికి ఆ సరళత్వం కారణం. శైలి ప్రవహిస్తుంది. మధ్య మధ్యలో అర్థవంతమైన మంచి పదాలు, కాస్త పెద్దవే వాడతారు. పదసంపద పెరిగేందుకు ఆమె రాసినవి చదవమని కొందరు పిల్లలకి సూచించాను, ఫలితం వచ్చింది కూడా. ఆమె రచనలలో చాలాభాగం పన్నెండు నుంచి పద్దెనిమిదేళ్ళ పిల్లలు కూడా నిక్షేపంగా చదవదగినవి .  నావరకు నాకు ఇంగ్లీష్ కాస్తయినా పద్ధతిగా రాయగలిగేందుకు ఆమె తోడ్పడ్డారు.</p>
<p>పాత్ర చిత్రణ చాలా ప్రతిభావంతంగా ఉంటుంది. ఒక పాత్ర ప్రవేశించాక దాదాపుగా ఎటువంటి అసంగతాలూ కనిపించవు. దేని ప్రాముఖ్యం ఎంత ఉండాలో కొలిచినట్లు అంతే ఉంటుంది. సన్నివేశాల అల్లికలో ఆమె శిల్పి. కథ జరిగే పరిసరాలు చాలాసార్లు ఆ మూడ్ కి తగినట్లే ఉంటాయి. అవును, stylization.  నాటకీయత [దాని సరైన అర్థంలో ] ఉట్టిపడుతూఉంటుంది కనుకే చాలా నవలలను ఆమే స్వయంగా నాటకాలుగా మలచారు. విడిగా నాటకాలు కూడా రాశారు, అటువంటి కొన్నిటిని Charles Osborne వంటి వారు మళ్ళీ నవలలుగా  తీసుకొచ్చారు.</p>
<p>సరైన పదచిత్రాలను సరైన ఎడం తో వాడారనీ అవి చదువరిని ఒక విధమైన హిప్నోసిస్ లోకి తీసుకుపోతాయనీ ప్రయోగాలు చేసి తేల్చారు. వినేందుకు వింతగా తోచినా- శబ్దానికి, మాటకి ఉన్న శక్తి ఈ దేశం లో పుట్టినవారికి కొత్త విషయం కాదు. నవల ప్రారంభం లో ఒకలాగా, ఉత్సుకత పెరుగుతూ ఉన్నప్పుడు మరొకలాగా, ముగింపులో ఇంకొకలాగా -ఒక అధ్యాయం లో పదాల సంఖ్య మారుతుంద నీ,   అందువల్ల చదువరి ఆసక్తి తగ్గకుండా ఉంటుందనీ NLP కి సంబంధించిన పరిశోధనలో తెలి సింది .చాలా తెలివైనవారూ నూటికి నూటయాభై పాళ్ళు ఇంగితజ్ఞానం ఉన్నవారూ కనుక అలా కుదిరి ఉండవచ్చు.</p>
<p>తను స్వయంగా మంచి చదువరి కనుక ఇటువైపునుంచి ఊహించి రాసిఉండవచ్చు. ఇటువంటిది ఒకటి 4.50 from Paddington అనే నవలలో ఉంటుంది. ఒక మృతదేహం ఎక్కడ ఉండి  ఉంటుందో కనుక్కోవటం లో తను హంతకుడినైతే  ఎక్కడ దాస్తానో ఊహించానని Miss Marple చెప్పుకుంటుంది. అసలు మెరుపు ఆ తర్వాత ఉంటుంది &#8211; &#8221; ఈ సంగతి కొత్తదేమీ కాదు. మార్క్ ట్వేన్ ఒక పుస్తకం లో రాశారు, తప్పిపోయిన గుర్రాన్ని వెతకటం లో నేనే గుర్రాన్నైతే ఎక్కడికి వెళతానూ అని ఆలోచిస్తారు ఆయన &#8221;  అని  ఆమె అంటుంది.</p>
<p>Dorothy L Sayers వంటి తక్కినవారి రచనలలోలాగా &#8216; హత్య &#8216; నవల ప్రారంభం లోనే జరిగిపోయి, హంతకుడిని వెతకటమే కథ అన్నట్లుగా ఉండదు. పాత్రల ప్రవర్తన వల్ల,  వారి మధ్య సంఘర్షణ వల్ల -  దురాశో, ద్వేషమో మరొకటో మొదలవటం, పరిసరాలలో, వాతావరణం లో ఆ &#8216; కీడు &#8216; ధ్వనించటం &#8211; ఇదంతా జరుగుతుంది. హంతకులు అనుమానించదగిన పాత్రలలోనూ అసలు సంబంధం లేదనిపించేవారిలోనూ- రెండు రకాలుగానూ ఉంటారు. ముగింపు ముందు రాసుకుని వెనక్కి వచ్చి కథ అల్లేవారని అంటారు . ఇవ్వవలసిన ఆధారాలని ఆమె తప్పకుండా ఇస్తారు. చదువరి సరిగ్గా ఊహిస్తారో లేదో వారి  అంచనాలనుబట్టి ఉంటుంది. నావంటివారికి ఊహించటమే ఇష్టం ఉండదు, ఆమె కి లోబడిపోవటమే హాయిగా  అనిపిస్తుంది. Dylan Thomas వంటి కవి , సగం ఆక్షేపణ గానే అయినా అన్నారు- “Poetry is not the most important thing in life&#8230; I&#8217;d much rather lie in a hot bath reading Agatha Christie and sucking sweets.”</p>
<p><img class="alignleft size-full wp-image-6977" title="christie4" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/christie4.jpg" alt="" width="300" height="224" /></p>
<p>హత్య-  చావు తోనూ దానిని అంటిఉండే శోకం తోనూ ముడిపడినది అయినా కూడా, ఆమె నవలలలో చావు భయాన్ని కలిగించదు. &#8216; అంతే కదా &#8216; అనిపిస్తుంది. అది అగౌరవం కాదు, అంగీకారం. హింస చాలా తక్కువ మోతాదులోనే ఉంటుంది. రచయిత్రి, చదువరి కూడా కొంత దూరం నుంచే గమనిస్తున్నట్లు ఉంటుంది.  ఆమె రాసిన ఏదీ &#8216; దుర్భరంగా &#8216; ఉండదు.</p>
<p>సుఖంగా గడిచిన వ్యక్తిగత జీవితం లో &#8211; ఇష్టపడి పెళ్ళాడిన మొదటి భర్త మరొక స్త్రీ ప్రేమలో పడి విడాకులు అడగటం ఆమెకి పెద్ద అఘాతం. స్వభావరీత్యా సిగ్గరి అయిన ఆమె పక్కవారి సానుభూతికి దూరంగా పదిరోజులపాటు అదృశ్యమయారు.  ’’Dogs are wise. They crawl away into a quiet corner and do not rejoin the world until they are whole once more ‘’  అని ఒక నవలలో అంటారు. అయితే గొప్ప జీవనలాలస ఉంది ఆమెలో. &#8221; నాకు జీవించటం ఇష్టం. ఘోరమైన, దుర్భరమైన దిగులుతో కుమిలిపోయిన రోజులు ఉన్నాయి, కాని వాటన్నిటిలోనుంచీ- జీవించి ఉండటం అన్నదే గొప్పసంగతి అని తెలుసుకున్నాను &#8221; అనీ అంటారు. త్వరలోనే తేరుకుని విదేశాలు పర్యటించి మరొకరిని పెళ్ళాడి జీవితాంతం అతనితోనే సంతోషంగా ఉన్నారు. అయితే అంతకు ముందు, ఆ తర్వాత &#8211; రచనలో భేదం- సూక్ష్మంగా చూస్తే, కనిపిస్తుంది. సహజంగానే తర్వాతి రచనలో అవిశ్వాసం పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఆ రెండో వివాహం జరిగిన 1930 నుంచే Mary Westmacott పేరుతో డిటెక్టివ్ కాని నవలలు ఆరు రాశారు. మొదటిదైనAbsent in the spring  చేదుగా ఉంటుంది. Kate Chopin నవల The Awakening  ని గుర్తు చేస్తుంది . మామూలుగా రాసే పద్ధతిలో తన క్రుంగుదల ని, అయోమయాన్ని  చెప్పే అవకాశం లేక కొంత- అప్పటి ధోరణిలో  సీరియస్ సాహిత్యాన్ని రచించటం తనవల్లా అవుతుందని తనకి తాను చెప్పుకోవటం కోసం కొంత- ఆ నవలలు రాసిఉంటారనిపిస్తుంది. వాటిలో అస్తిత్వపు వెతుకులాట, పరాయి కావటం &#8211; ఇవన్నీ ఉంటాయి. Edith Wharton ,  Somerset Maugham  ల  ఛాయలు కనిపిస్తాయి.  ఆ నవలలేవీ ఎక్కువ విజయం సాధించలేదు, ఆమె పేరుతో నిలిచి ఉన్నాయి అంతే . కాని చక్కని పనితనంతో ఉంటాయి, చదవదగినవి.</p>
<p>66 మిస్టరీ నవలలు,153  కథలు, పదిహేడు నాటకాలు , నాలుగు రేడియో నాటకాలు, ఒక టెలివిజన్ నాటకం రాశారు . విపులంగా రాసుకున్న ఆత్మకథ, పురావస్తుశాస్త్రజ్ఞుడైన రెండవ భర్తతో చేసిన పర్యటన  అనుభవాలతో రాసిన’ Come, tell me how you live ‘ &#8211; ఆపకుండా చదివిస్తాయి.</p>
<p>ఆమె రచనలలో జాతివివక్ష ఉంటుందనే అభియోగం ఉంది.  సగటు బ్రిటిష్ పౌరులకి ఉండేటంతగా  ఆ లక్షణం ఆమెలో ఉన్నమాట నిజమే. అయితే ప్రాథమికంగా ఆమెలో తగినంత మానవత్వం ఉంది. ఇతరజాతుల ప్రసక్తి వచ్చినప్పుడు ఆ విషయమూ కనిపిస్తుంది.  స్త్రీవాది కారు.  స్త్రీలకి ఉపాధి ఉండితీరాలని ఆమె నమ్మలేదు.   కాని చదువుకున్న, సమర్థులైన స్త్రీపాత్రలను సృష్టించారు. పురుషపాత్రలకన్న స్త్రీపాత్రలే ఎక్కువ క్రియాశీలత్వం తో ఉంటాయి. బ్రిటిష్ సమాజం లోని వర్గ వ్యవస్థను ఆమె గౌరవించినమాటా నిజమే. అయితే ఇక్కడ తలచుకోవలసినదేమిటంటే- పాతది అంతా చెడ్డదే కాదు. బ్రిటిష్ సభ్యత క్షీణించటం తో ఒక &#8216; విలక్షణమైన సంస్కృతి &#8216; నశించింది. కొన్ని మర్యాదలు, కొన్ని గోప్యతలు, కొంత సౌజన్యం &#8211; ఇవన్నీ పోయాయి. దానికి చింతించినవారిలో ఆమె ఉన్నారు.</p>
<p>కొన్ని నవలలలో నర్సరీ rhymes  నీ, చాలా చోట్ల బైబిల్ నీ షేక్ స్పియర్, డికెన్స్ , టెనిసన్,టి.ఎస్.ఇలియట్, స్టీవెన్ సన్  లనీ కోట్ చేస్తారు.[ మరొకరి వాక్యాలను ఉదహరించటం ఆ స్థితిని సాధారణీకరించటం లో పనికివస్తుంది, తద్వారా పాఠకుడికి వేదన తగ్గుతుంది.  ] ఆమె రచనలో Botticelli, AlmaTadema, Leighton, Waterhouse  వంటి చిత్రకారుల ప్రసక్తి వస్తూ ఉంటుంది. Wagener ఓపెరాలు ఉంటాయి. Chippendale, Heppelwhite వంటి ఫర్నీచర్ కళాకారులు కనిపిస్తారు. అప్పటి ఇంగ్లండ్ మధ్యతరగతి జీవితచిహ్నాలు అవన్నీ.  తెలియవలసిన విషయాలు కొన్ని ఒక వ్యక్తికి తెలియకపోతే అతను నిజంగా అతను కాదనీ అదొక  impersonation అనీ తేల్చేందుకు ఇటువంటివి వాడుతుంటారు కూడా.ఆమె  మంచి అధిక్షేప హాస్యం రాయగలరు. ప్రసిద్ధ హాస్య రచయిత పి.జి ఓడ్ హౌస్ తో సత్సంబంధాలు ఉండేవి. ఒకరి నవలలలో మరొకరి ప్రస్తావన ఉండటం సరదాగా ఉంటుంది. ఆమె తన నవలల పేర్లనీ పాత్రలనీ వేరే నవలలలో చెప్పుకోవటం ఉంది.[  పాత సినిమా లలో ' ఇతనెవరో అచ్చం హీరో నాగేశ్వరరావులా ఉన్నాడే '' అన్నట్లు అన్నమాట ] సరిపడా ఆత్మవిశ్వాసానికి అది గుర్తు.</p>
<p>&#8220;Who cares who killed Roger Acroyd  ?&#8221; [ Murder of Roger Acroyd , క్రిస్టీ నవలలలో ఒకదాని పేరు ] అని డిటెక్టివ్ సాహిత్యం ఏ మాత్రమూ నచ్చని Edmund Wilson  అనే  విమర్శకులు గొంతు చించుకున్నారు. ‘’ So many, so many ‘’ అని పాఠకులు సమాధానం చెబుతూనే ఉన్నారు . పుస్తకాలు తిరిగి తిరిగి ముద్రించబడుతూనే ఉన్నాయి . నాటకాలుగా, సినిమాలుగా, టివి సీరీస్ లుగా ఆ రచనలకి వైభవం ఆమె గతించిన ఈ నలభైయేళ్ళలో తగ్గలేదు.</p>
<p>అగాథా  అవార్డ్ 1989 లో నెలకొల్పబడింది. ఆమె పద్ధతిలో రాసే మిస్టరీ నవలలకి- సాధారణ, తరుణవయస్కుల, చారిత్రక విభాగాలలో బహుమతులు ఇస్తారు. నియమాలు ఇవి- బట్టబయలు శృంగారం ,  బీభత్స  మైన హింస ఉండకూడదు, హింస చేసి ఒకరు సంతోషించినట్లు రాయకూడదు. [ఇటువంటివి ఉంటే మాకు వద్దనే స్పష్టమైన జ్ఞానం వారికి ఉన్నట్లుంది. ] 2010 లో జపాన్ లోకూడా  తమ దేశానికి అగాథా క్రిస్టీ అవార్డ్ పెట్టుకున్నారట.</p>
<p>ఇంతకూ ఆమె పనిచేసింది  క్లిష్టమైన విభాగం లో, సంక్షుభిత కాలం లో . యుద్ధాలతో తల్లకిందులవుతున్న ప్రపంచం లో &#8211; హత్య, దానికిముందూ వెనకా ఉండే అరిషడ్వర్గాలు- వీటి మధ్య చదువరికి ఒక పజిల్ ని కల్పించాలి,  పట్టి లాగుతూ కథ చెప్పాలి, నిజం తెలిసినప్పుడు తనే తెలుసుకున్నంత ఆనందాన్ని కలిగించాలి.  ఆఖర్న ‘  పర్వాలేదు, బతకచ్చు  ‘ అనే ధీమాని ఇవ్వాలి . అక్కడితో అంతా అయిపోయిందా ? అయిపోదని అందరికీ తెలుసు. ప్రపంచం అనిశ్చితమనీ  ఆ తర్వాతా ఆ మనుషులకి కష్టాలు రావచ్చనీ ఎవరికి తెలియదు ? ఆ చదివిన రెండు వందల పేజీలు మనకేమి ఇస్తాయో మనకి నిజంగా తెలియదా ?</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/christie5.jpg"><img class="aligncenter size-full wp-image-6978" title="christie5" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/christie5.jpg" alt="" width="645" height="400" /></a></p>
<p style="text-align: center;">**** (*) ****</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=6972</wfw:commentRss>
		<slash:comments>10</slash:comments>
		</item>
		<item>
		<title>స్వప్నప్రపంచాల సౌందర్య దీపం- రవీంద్రుల &#8216;చిత్ర&#8217;</title>
		<link>http://vaakili.com/patrika/?p=6359</link>
		<comments>http://vaakili.com/patrika/?p=6359#comments</comments>
		<pubDate>Tue, 30 Sep 2014 20:37:33 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కడిమిచెట్టు]]></category>
		<category><![CDATA[మైథిలి అబ్బరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=6359</guid>
		<description><![CDATA[పూర్ణా నదీ తీరంలో ఆ  సాంద్రమైన అరణ్యం. పరుగెత్తే జింక కోసం-  లోలోపలికి , మెలికలు తిరిగే కాలి బాట వెంట నేను . నా మృగయా వినోదం మృగం  ఆ పొద కిందన  ముగిసింది.  ఎండుటాకుల పైన శయనించి అతను అక్కడ. అడ్డు తప్పుకొమ్మన్నాను,  లక్ష్యపెడితేనా !  నా వింటి అంచుతో పొడిచాను చిరాకుగా. నివురు నుంచి భగ్గుమన్న జ్వాల లాగా అతను దిగ్గున లేచాడు...నా పురుష వేషాన్ని చూసో ఏమో, వచ్చే నవ్వుని ఆపుకున్నాడు. అప్పుడు, ఆ ముహూర్తం లో- నేను స్త్రీనని నాకు తెలిసింది. ]]></description>
			<content:encoded><![CDATA[<p><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/09/chitra1.jpg" alt="" width="0" /><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg"><img class="aligncenter size-full wp-image-4744" title="kadimi" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg" alt="" width="810" height="284" /></a></p>
<p>&nbsp;</p>
<blockquote><p>&#8221; పూర్ణా నదీ తీరంలో ఆ  సాంద్రమైన అరణ్యం. పరుగెత్తే జింక కోసం-  లోలోపలికి , మెలికలు తిరిగే కాలి బాట వెంట నేను . నా మృగయా వినోదం మృగం  ఆ పొద కిందన  ముగిసింది.  ఎండుటాకుల పైన శయనించి అతను అక్కడ. అడ్డు తప్పుకొమ్మన్నాను,  లక్ష్యపెడితేనా !  నా వింటి అంచుతో పొడిచాను చిరాకుగా. నివురు నుంచి భగ్గుమన్న జ్వాల లాగా అతను దిగ్గున లేచాడు&#8230;నా పురుష వేషాన్ని చూసో ఏమో, వచ్చే నవ్వుని ఆపుకున్నాడు. అప్పుడు, ఆ ముహూర్తం లో- నేను స్త్రీనని నాకు తెలిసింది. &#8221; -</p></blockquote>
<p>ఆమె మణిపుర రాజకుమారి. అతను అర్జునుడు. మహాభారతంలో నలుపు తెలుపు రేఖాచిత్రం వలె కనబడే చిత్రాంగదకు రవీంద్రులు అద్దిన వర్ణవైచిత్రి &#8211;  &#8217; చిత్ర &#8216;   లో వాక్యాలు అవి.</p>
<p>రవీంద్రులు స్వయంగా గొప్ప సుకృతసౌందర్యం తో జన్మించారు. సౌందర్యాన్ని వెతికి, సాధించి, సృష్టి చేసి ,  అమర్చి -  రచించి, చిత్రించి, వినిపించి, ప్రదర్శించి లీనమైన  హేల- ఆ జీవనం.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/09/Tagore3.jpg"><img class="alignleft  wp-image-6376" title="Tagore3" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/09/Tagore3.jpg" alt="" width="277" height="372" /></a>తమ ముప్ఫై ఒక్కేళ్ళ వయసులో రవీంద్రులు రచించిన చిన్న నాటిక చిత్ర.   ఆ మహాకవి యౌవనపు ప్రౌఢిమ &#8211; అందులోని పిపాసా తీవ్రత  , త్రిదశులైన  అమరుల వలె  అక్కడే నిలిచి ఉండాలనిపించే ఆశ  , వీలు కాదని తెలిసిపోయే  అభద్రత , ఏది ఎప్పటికీ నిలవగలదో దాన్ని అన్వేషించే  ప్రయత్నం-ఇవన్నీ అయాక తేరిన జ్ఞానం,  కాంతి   &#8230;వీటన్నింటినీ ఆ కొద్ది పుటలలో శాశ్వతం చేసిన రచన. మరొక వైపునుంచి స్త్రీ లో పురుషుడు కోరుకోవలసినవి ఏవో, జీవితాంతం కలిసి నడిచే శక్తి ఉన్న స్త్రీ ఏ విధంగా అద్భుతమో అర్థం చేయిస్తుంది. ఆ విధంగా అది  సాధికార అయిన స్త్రీని రంగస్థలం మీదికి తెచ్చిన రచన. ఈ నాటికను  1892 లో రాశారు. ఈ రోజుకీ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట  ప్రదర్శించబడుతూనే ఉంది .</p>
<p>ఈ నాటిక  పరమ రమణీయమైన దీర్ఘ కవిత. ఉపమానాలు కవికులగురువును జ్ఞాపకం చేస్తాయి.</p>
<p>ఈ నాటిక తార్కికమైన తిరుగుబాటు. ఆ శతాబ్దం లో స్త్రీ వైపునుంచి అంత వాదన, అన్ని ప్రశ్నలు ఊహించటం చాలా కొత్త  సంగతి. అనూచానం గా వస్తున్న ఆడవారి బాధ్యతలను , ప్రవర్తనను , నియమాలను &#8211; అన్నిటినీ ఆయన తరచి చూశారు  .</p>
<p>ఈ నాటిక  విచిత్రమైన ప్రణయగాథ.  అతిగాఢమైన  అనురాగం, అనురక్తి &#8211; చిత్ర.  ఆమె ప్రేమ తీవ్రతకి ప్రేమికుడిలోని ఔన్నత్యమూ స్పందించి ఎదుగుతుంది. ఆ అపురూపమైన అందం కోస మే మొదట  చేరువ అయినా,  ఆవరించిన దేనినో కాక అచ్చంగా ఆమెనే అతను గుండెకి అద్దుకుటాడు- ఆఖరికి.</p>
<p>పూర్తి సమానత్వాన్ని రవీంద్రులు ప్రతిపాదించారని చెప్పలేము. చిత్ర లో భర్త ను దైవంగా పూజించే నారీత్వం ఉంది, అయితే  ఆ వెనక ఉచితమైన ఆత్మప్రత్యయమూ ఉంది.</p>
<p>తన తక్కిన  నాటికల , నాటకాల లాగే దీనినీ భారతీయ నాట్యశాస్త్రం ఆధారంగానే రవీంద్రులు నిర్మించారు. పాత్రధారులనూ ప్రేక్షకులనూ ఒకటి చేసి ప్రవహించగలిగేది రసం అని ఆయన పాశ్చాత్యులకి చెప్పారు. &#8221; రచన ముందు, నటన ఆ తర్వాత &#8221; అని కూడా.</p>
<p>కొడుకులు లేని తండ్రి ఆమెను యుద్ధవిద్యలు నేర్పుతూ పెంచాడు . వాటిలో పారం ముట్టిన ఆమె మహావీరుడని  చెప్పుకునే అర్జునుడిని ఒకసారైనా సాయుధురాలై ఎదిరించాలని కలలు కనేది. తీరా అతన్ని చూశాక అవేవీ గుర్తు రాలేదు- అతనని తెలిశాక ఒక్క మాటైనా ఆమె నోటి వెంట రాలేదు. మర్యాద చేయాలనీ  , క్షమాపణ అడగాలనీ తట్టలేదు. నాగరికత ఎరగని దాని వలె స్థాణువై ఉండిపోయింది. అతను నిష్క్రమించాడు.</p>
<p>ఆ మరుసటి రోజు తన పాత వేషాన్ని వదిలింది. కుంకుమ రంగు పట్టు వస్త్రాలలో, అందెలతో, గాజులతో, వడ్డాణంతో &#8211; తనని బంధించుకుని అలంకృతయై &#8211; లజ్జను వెనకకు నెట్టి అతని కోసం వెళ్ళింది. తానేమని అడిగిందో తనకే తెలియదు- అతను అన్నది మాత్రం వీలు పడదనే. అప్పుడు పిడుగు లాగా మీద పడింది లజ్జ, అవమానం తోడుగా. ఆమె బలిష్ఠ , పగలలేదు. కాని తన ధనుస్సును కచ్చగా  విరిచి తగలబెట్టింది. బాణాలు వేసి కాయలు కాసిన తన దృఢమైన చేతులను ద్వేషించుకుంది. అతన్ని ఆకర్షించగలిగే ఒక్క లక్షణం కోసం తపించింది. ఎందుకంటే ఆమె సౌందర్యవతి కాదు.</p>
<p>మన్మథుని కరుణ కోసం ఆమె వ్రతం పూని ప్రార్థిస్తుంది. నిత్య యౌవనానికి ఆకృతి అయిన వసంతుడి తో కలిసి మన్మథుడు దర్శనమిస్తాడు.</p>
<p>&#8221; మనసులను గెలిచే వగలూ హొయలూ నాకు తెలియవు. అస్త్రవిద్య లో నా హస్తాలకి నైపుణ్యం ఉందే కాని పూలబాణాలు కంటి తుదలనుంచి వేయటమెలాగో నేర్వలేదు &#8221; &#8211; ఆమె ఆక్రోశిస్తుంది</p>
<p>&#8221; ఆ విద్య నేర్చుకోవాలా..మనసులో ఉన్నవాడు[ మనసిజుడు , తనే ]  చూసుకోడూ &#8221; అంటాడు మన్మథుడు. &#8221; ఆ సమయం వస్తే అన్నీ తెలుస్తాయి &#8221;</p>
<p>ఆమె అలా సరిపోదని అంటుంది.  &#8221; సమయం లేదు. ఉంటే కనుక, నిదానంగా ఒక్కొక్క మెట్టుగా అతన్ని నేను గెలుచుకోగలిగి ఉందును, దేవతల సాయం అవసరం లేకపోయేది. . చీకటిలో ఏడుస్తూ పగలు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ , మౌనం గా ఒంటరిగా నిర్వే దాన్ని భరించే అబల ను  కాను . నా కాంక్షాపుష్పాలు  ఫలించకుండా రాలిపోవు.</p>
<p>అతనికి తోడుగా గుర్రాల మీద స్వారీ చేస్తూ &#8211; వేట లో, యుద్ధం లో సహకరించి ఉండేదాన్ని. రాత్రులు అతని గుడారానికి కాపలా కాసి ఉండేదాన్ని. బలహీనులను రక్షించటం లో, న్యాయాన్ని నెలకొల్పటం లో అతనితోబాటు క్షత్రియధర్మాన్ని నెరవేర్చేదాన్ని. నన్ను అతను తప్పనిసరిగా గమనించి ప్రేమించేలా చేసిఉండేదాన్ని.</p>
<p>అయితే అదొక జీవితకాలపు శ్రమ- తమ నిజమైన స్వభావానికీ ప్రవర్తనకీ గుర్తించబడటం, గౌరవించబడటం .</p>
<p>అందుకు, కే వలం అందుకు &#8211; సమయం లేక, అడుగుతున్నాను. ఒక్క రోజు, ఒకే  ఒక్క రోజు నాకు  అపూర్వ లావణ్యాన్ని  ప్రసాదించండి. నా హృదయం లో వికసించిన ప్రేమ అంత పరిపూర్ణతను నా రూపానికి ఇవ్వండి&#8230;చాలు &#8221;</p>
<p>ఒక రోజు మాత్రం కాక ఒక సంవత్సరమంతా ఆమె వసంతపుష్పాలంత అందంగా అయే వరం దొరుకుతుంది.</p>
<p>సరోవరం ఒడ్డున , అడవి మధ్యన సాయంకాలం . నీడలు పొడుగవుతూ ఉన్నాయి. ఆకులు ముడుచుకుంటూ కమ్మిన మసక లోంచి పాలరాతి అరుగు మీద ఆమె అతనికి సౌందర్యాధిదేవత లాగా ప్రత్యక్షమవుతుంది. ఆ  అడుగుల  అడుగున  నేల ఆనందంగా వణికింది.. తూర్పు కొండను కప్పిన మంచు సూర్యకాంతికి కరిగేటట్లు ఆమెని కప్పిన వస్త్రాలు గాలిలోకి కరిగిపోతాయా అనిపించింది.  విచ్చుకుంటూ ఉన్న తెల్ల తామర మొగ్గ  లాగా ఒంగి సరస్సులో తన ప్రతిబిబంబం చూసుకుని తానే మైమరచింది. గొప్ప సంతోషం, ఆ వెంటనే ఏదో తెలియని బాధ ఆ ముఖం లో. ముడి వీడిన జుట్టునూ  పల్చని మేలిముసుగునూ  సవరించుకుంటూ నిట్టూర్చి ఆమె నడిచి వెళ్ళింది- అందమైన సంధ్య  రాత్రిలోకి మాయమైంది .</p>
<p>కాసేపు గడిచాక అతని తలుపు తడుతుంది. ఆ నిర్జనమైన చోట శివాలయం లో తన మనోరథం తీరేందుకు దీక్షలో ఉన్నానని చెబుతుంది.</p>
<p>&#8221; విశ్వమంతా కాంక్షించదగినదానివి నువ్వు, నీకు తీరని కాంక్ష ఏమిటది ? తూర్పు నుంచీ పడమర వరకూ ఎంతో తిరిగాను, ప్రశస్తమైన వాటన్నిటినీ చూశాను. ఏమిటి ఆ కోర్కె, నేను దారి చూపగలనేమో ..&#8221;</p>
<p>&#8221; నేను కోరే వారు అందరికీ తెలిసినవారే. అత్యుత్తమవంశం లో పుట్టిన అసమానశూరుడు ఆయన &#8221; అని సూచించి, మళ్ళీ మళ్ళీ అడిగించుకుని అతని పేరే చెబుతుంది ఆమె.</p>
<p>&#8221; అది నేనే.  నీ ముంగిట , నీకోసం  &#8221;</p>
<p>&#8221; పన్నెండు సం వత్సరాలు బ్రహ్మచర్యవ్రతం పూనారు కాదా ? &#8221;</p>
<p>&#8221; చంద్రోదయం తో రాత్రి అంధకారం మాయమైనట్లు నువ్వు ఆ వ్రతాన్ని మాయం  చే స్తున్నావు &#8221;</p>
<p>చిత్ర -  &#8221; ఏమిటి చూసి నిన్ను నువ్వు మీరుతున్నావు ! ఈ నల్లటి కళ్ళలోనూ తెల్లటి శరీరం లోనూ ఏం కనిపిస్తోంది నీకు ? ఇది అసలైన నేను కాదు. ఒక పురుషుడు స్త్రీకి ఇవ్వగల అత్యున్నతమైన బహూకృతి  ఏదో-  ఆ ప్రేమ- నీ భావన అది కాదు. అయ్యో ! ఈ దుర్బలమైన మారువేషం, ఈ దేహం &#8211; ఆ లోపలి అంత కాంతినీ దాచిపెడుతుంది కాబోలు. ఏమి వీరుడివి అర్జునా&#8230;అంతా ఒట్టిది &#8221;</p>
<p>అతను-   &#8221; అవును, అంతా ఒట్టిదే, నువ్వు కానిది అంతా స్వప్నమే  &#8221;</p>
<p>అతని సమ్మోహానికి కారణం తను కాదు అన్నది ఆమె భరించలేకఅప్పటికి అతన్ని వదలి వెళ్ళిపోతుంది  -</p>
<p>కాని అతని మీదనే లగ్నమైన మనసు మాట వినదు.  కొద్ది గంటల  తన వైభవం లో   తుమ్మెదల పొగడికలూ   చివురాకుల  గుసగుసలూ విని ,  ఆ పైన ఆకాశం నుంచి  చూపు కిందికి వాల్చి తలవంచి ధూళిలో రాలిపోయే పూవు లాగా-  ఆమె ఆ క్షణం లో జీవించింది. గడిచిన దాన్నంతా గత జన్మలాగా విస్మరించింది. తన సౌందర్యాన్ని అర్జునుడు చేసిన ప్రశంసను ఒక్కొక్క మాటగా,  దాచుకున్న ఒక్కొక్క తేనె చుక్క లాగా , తలచుకుంటూ భూత భవిష్యత్తులు అంటని వర్తమానం గా ఉండిపోయింది&#8230;బహుశా  ఇరుకైన పాటలో అంతులేని  లేని అర్థం లాగా కూడా.</p>
<p>ఆమె జుట్టు మీద, వక్షం మీద, పాదాల మీద రాలిన మాలతి పుష్పాలు. సువాసనలతో  మత్తెక్కి భారమైన దక్షిణపుగాలి.  పడమటికి వాలిన చంద్రుడు కొమ్మల మధ్యనుంచి తొంగిచూస్తూ. సరస్సులో చెట్ల నీడలు కదలిక లేకుండా. ఆమె ఎదురుగా అతను , పొడుగ్గా నిటారుగా, తనూ ఒక అరణ్యవృక్షం లాగా . వాస్తవ జీవిత సత్యాలన్నీ అదృశ్యమైన ఆ స్వప్నం లో , ఏదో మరొక లోకం లో ఆమె తిరిగి జన్మించింది . అతనికి చేతులు చాచింది. చంద్రుడు అస్తమించాడు, ఆవరించిన ఒక చీకటి తెర. మనుష్య దివ్య  లోకాలూ , స్థలమూ కాలమూ , ఆనందమూ ఆవేదనా &#8211; జీవన్మరణాలు ఏకమైన పారవశ్యం . తర్వాత గులాబి రంగు ఉదయం.  ఆమె మేల్కొంది, జ్ఞాపకం వచ్చింది తనేమిటో. నీడను చూసి జడుసుకున్న లేడిలాగా పరుగు తీసింది- శేఫాలికా పుష్పాలు రాలిపడిన దారివెంట&#8230;ఒక ఒంటరి పొదరింట్లో ఆగి ఏడవబోయింది. కన్నీరు రాలేదు.</p>
<p>మన్మథుడు అడుగుతాడు, ఇంకా బాధెందుకని&#8230;దేవలోకం నుంచి తెచ్చి నింపిన మధువుతో పొంగిపొరలలేదా ఆ గడిచిన రాత్రి, భూమి మీద ?</p>
<p>ఆమె &#8211; &#8221; అరువు తెచ్చుకున్న రూపం అడ్డుపడిపోతూ ఉంది. వర్షించిన లాలస ఏదీ నా వరకూ రానేలేదు …</p>
<p>సంతోషపు ఓడ అలా కనబడుతూనే ఉంది, అందకుండా అలలేవో  ఆపివేస్తూ ఉన్నాయి.</p>
<p>స్వర్గం ఎంత దగ్గరగా వచ్చిందంటే , ఒక్క క్షణం అందిందనే అనుకున్నాను. లేదు, నా ఈ శరీరమే నా ప్రత్యర్థి. దీన్ని నేను నా ప్రియతముడి కోసం సిద్ధం చేసి ఉంచాలా, ఒద్దు. మీ వరాన్ని వెనక్కి తీసేసుకోండి &#8221;</p>
<p>అలా అయితే అతని ముందు ఎలా నిలబడగలవని ప్రశ్న.<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/09/chitra1.jpg"><img class="alignright size-full wp-image-6366" title="chitra1" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/09/chitra1.jpg" alt="" width="345" height="400" /></a></p>
<p>&#8221; అదే నయం, చాలా. ఈ సొగసైన వేషం  కన్నా ఖచ్చితంగా నేను మెరుగే.  అతను తిరిగి తిరస్కరిస్తే , భరిస్తాను &#8221;</p>
<p>వసంతుడు వారిస్తాడు.&#8221;  వసంతం గడిచి శరత్తు వస్తే, పూవు పండు కాబోతూ ఉంటే- అప్పుడు అతను నిజాన్ని భరించగలడు. అందాకా వేచి ఉండు. అమ్మా ! నీ ఉన్మత్తపు ఉత్సవానికి మరలి వెళ్ళు &#8221;</p>
<p>కాలం సాగుతోంది. ఆమె ఎంతో ప్రత్యేకమైనదని అర్జునుడు గుర్తిస్తూ ఉంటాడు.  . సోయగమూ నేర్పూ ఆమె చేసే ప్రతి పనిలోనూ అల్లుకుపోవటాన్ని అతను మెచ్చుకుంటాడు. తనతోబాటు నగరానికి, తన ఇంటికి తీసుకువెళ్ళాలని కలలు కంటాడు. ఆమె కాదంటుంది. అడవి పూవుని ఆ నేల పైనే రాలనివ్వమంటుంది , రాజప్రాసాదపు రాతి గచ్చు కి ఆ కరుణ ఉండదని .</p>
<p>&#8221; ఆనందాన్ని తెరచి ఉంచిన తలుపులోంచి తప్పుకోనివ్వు. లేదంటే అది వేదనగా మారిపోతుంది. ఎన్నాళ్ళు ఉంటే అన్ని నాళ్ళు ఆస్వాదించు. ఈ సాయంత్రపు తృప్తిని రేపు పొద్దున వరకూ లాగకు, అది నిలవదు. అలసిపోయాను, ఇదంతా వదిలేయి &#8221;</p>
<p>అతను ఔననడు, కాదనడు. ఆ నిశ్శబ్దం లో దూరం నుంచీ గుడిగంటలు వినిపిస్తాయి.</p>
<p>వారిద్దరి మధ్యదైహికమైన  ఆకర్షణ చల్లబడుతూ ఉండటాన్ని ప్రతీకాత్మకంగా చెబుతారు కవి&#8230;వసంతుడు మన్మథుడితో ఫిర్యాదు గా అనే మాటలలో. &#8221; నువ్వు రగిలించిన జ్వాలని నిలిపి వెలిగించే పనిలో ఓపిక పోతోంది నాకు. నిద్ర కి తూగుతున్నాను, మంట ను బూడిద మూస్తే చలికి ఉలికిపడి లేచి  విసనకర్ర తో విసురుతున్నాను, మళ్ళీ భగ్గుమంటోంది. కాని ఇలా ఎంత కాలమని ? &#8221;</p>
<p>ఏకమైన ఏ జంట మధ్యన అయినా తప్పనిసరిగా వచ్చే ఈ దశను కావాలని వివరించి చెప్పారనిపిస్తుంది… ఆ జ్వాల ఎప్పటికీ మండుతూనే ఉండటం అసాధ్యమని  . నిలిచి ఉండగల  చల్లదనం వేరు .</p>
<p>మన్మథుడు వసంతుడిని మందలిస్తాడు &#8221; నువ్వు పసిబిడ్డ లాగా చంచలమైనవాడివి. ఏ చిన్న వివరమూ బీరుపోకుండా రోజుల తరబడి కట్టుకొచ్చినదంతా ఒక్కసారిగా కూల్చేస్తావు, పశ్చాత్తాపమైనా లేకుండా. అయినా మన పని అయిపోవచ్చిందిలే.</p>
<p>సౌఖ్యపు రెక్కల దినాలు త్వర త్వర గా ఎగిరిపోతాయి. సం వత్సరం ముగుస్తోంది, పరిపక్వత లోకి, ప్రశాంతి  లోకి. &#8221;</p>
<p>ఒకనాడు అర్జునుడు అనుకుంటాడు &#8221; కలల్లోంచి ఒక ఉదయం ఈ రత్నం దొర్లిపడింది. దీన్ని ఏం చేసుకోవాలో ఎక్కడ దాచుకోవాలో అర్థం అవటం లేదు. విసిరివేసేందుకు మనసు ఒప్పటం లేదు. దీన్నే సోమరిగా  పట్టుకు కూర్చున్న  నా దక్షిణహస్తం క్షత్రియోచితమైన దేన్నీ చేయలేకుండా ఉంది &#8221;  ప్రేమా శృంగారమూ తప్ప మరేమీ లేని  ఈ జీవితం అతనికి  చాలటం లేదు.</p>
<p>అతని అన్యమనస్కత ను ప్రశ్నించిన చిత్రతో  తనకి వేట మీద బుద్ధి పుడుతోందని అంటాడు. పాత రోజులలో తమ అన్నదమ్ములు అయిదుగురూ ఒక వర్షాకాలాన్ని  చిత్రకారణ్యం లో గడిపిన రోజులను  ,  అప్పటి మేఘ నిస్వనాలనూ నెమళ్ళ క్రీంకారాలనూ పారి పోయే లేళ్ళనూ తప్పించుకున్న చిరుత పులులనూ &#8230;వేట అయిపోయాక పరవళ్ళు తొక్కే కొండవాగులలో ఈదటాన్నీ &#8230;గుర్తు చేసుకుంటాడు.</p>
<p>చిత్ర &#8221; ఆ మాయా మృగాన్ని నువ్వు పట్టుకోగలవా ? &#8221; అని నర్మగర్భంగా అంటుంది.</p>
<p>ఇక్కడ నిజానికి కవి మాట్లాడారు. హృదయం లో గంతులు వేసే వాంఛ లన్నింటినీ- తీర్చుకోవటమూ నియమించటమూ రెండూ కష్టసాధ్యాలే.</p>
<p>వీలైనంత కాలం అతనితో అలా ఉండిపోవాలనే ఆమెకి. ఆ ఏడు గడిచిపోతే మరి తనకి మిగులతాడనే నమ్మిక ఉండదు.</p>
<p>&#8221; నీకోసం ఎదురు చూసేవారెవరూ ఇంట్లో లేరా ? &#8221; అని మృదువుగా అడుగుతాడు .</p>
<p>&#8221; ఎందుకు ఈ ప్రశ్నలన్నీ ? ఆలోచన అవసరం లేని కాలం గడిచిపోయిందా ? నీకు కనబడుతున్నదాని కంటే నేను వేరే ఏమీ లేనని నీకు తెలియదా ? కింశుక పత్రం మీద కదిలే మంచుబిందువు కి పేరుంటుందా ? గమ్యం ఉంటుందా ? అది ఏ ప్రశ్నకైనా బదులు ఇస్తుందా ? నీ ప్రేయసీఅంతే  &#8221;</p>
<p>అతను &#8211; &#8221; అవునా? ఆమెకి ఈ ప్రపంచం తో ఏ ముడులూ లేవా ? ఏ దేవత నిర్లక్ష్యం వలనో జారిపడిన స్వర్గ ఖండమా ఆమె ? &#8221;</p>
<p>&#8221; అవును &#8221;</p>
<p>&#8221; అందుకే- ఎప్పుడూ నిన్నెక్కడ కోల్పోతానో అనిపిస్తుంటుంది. నా మనసుకి తృప్తి లేదు, బుద్ధికి శాంతి లేదు. ఊరూ పేరూ అమ్మా నాన్నా- ఈ బంధాలకి కట్టుబడరాదా కొంచెం ? నీ అన్ని పార్శ్వాలనూ నన్ను దర్శించనీ ! భద్రతలో, శాంతమైన గృహవాతావరణం లో నీతో కలిసి జీవించనీ &#8221; &#8211; అతను.</p>
<p>&#8221; ఎందుకు ఈ వృధా ప్రయాస ? మబ్బుల రంగులనీ అలల చిందులనీ పూవుల తావినీ ఒడిసి పట్టగలవా ? దాచేసుకోగలవా ? &#8221; &#8211; ఆమె</p>
<p>&#8221; కాదు. చేతికి అందేదీ గట్టిగా పట్టుకోగలిగేదీ ఇవ్వు  నాకు. సుఖం కన్న శాశ్వతమైనది, దుఃఖాన్ని తట్టుకోగలిగేదీ &#8211; కావాలి నాకు &#8221;  -అతను</p>
<p>&#8221; స్వామీ, ఈ ఏడు పూర్తి కానే లేదు ..అప్పుడే మార్పు నీలో ! ఇప్పుడు తెలుస్తోంది నాకు- పూవుల ఆయువు కొద్ది కావటం దేవుడిచ్చిన వరం అని. ఆ వసంతం లోనే ఈ శరీరం రాలిపోయి ఉంటే ఎంత బావుండేది  ! ఇంకెంతో సమయం లేదులే&#8230;పూర్తిగా తీసేసుకో. ఆ తర్వాత నువ్వు యాచించినా ఇక్కడ ఏమీ దొరకదు &#8221;</p>
<p>మొండి బాకుతో కుమ్మినట్లు , గుండె నిలువునా చీలినట్లు ఉంటుంది ఈ మాటలు చదువుతుంటే, రాస్తుంటే. మృత్యువు , దాని ముందు వెనుకలు  టాగూర్ రచన లో నిరంతరంగా, నిర్దాక్షిణ్యంగా వెంటాడుతూనే ఉంటాయి.  జీవించటాన్నీ కోల్పోవటాన్నీ ఒకే లయలో ధ్వనింపజేసే ప్రయత్నం ఆయన సాహిత్యం, ఒక విధం గా.  ‘Crossing ‘ పద్యసంపుటి మొత్తం &#8216; దాటిపోవటం &#8216; గురించే.</p>
<p>ఆమె అందానికి  ఆఖరి రాత్రి అది. &#8221; నీ దేహపు స్నిగ్ధత్వమంతా , రేపు &#8211; తరిగిపోని వాసంతలావణ్య నిధులలో జమ అవుతుంది. నీ పెదవి మీది ఎరుపు  అశోకాల చివురాకులకు వెళుతుంది. నీ చర్మపు మెత్తదనం, తెల్లదనం తీసుకుని వంద మల్లెపూలు పుట్టి  పరిమళిస్తాయి. &#8221; అని చెబుతాడు వసంతుడు.</p>
<p>ఆమె &#8221; అయితే, ఆ చివరి ఘడియలో , ఆరిపోబోయే దీపపు వెలుగు లాగా &#8211; నా సౌందర్యం ప్రకాశించనీయండి   &#8221; అని అడిగి అవుననిపించుకుంటుంది.</p>
<p>అక్కడికి దగ్గరగా ఉన్న పల్లెటూరు నుంచి కొందరు గ్రామస్థులు అర్జునుడికి ఎదురవుతారు. దోపిడీ దొంగల బెడద ముంచెత్తబోతోందని వాళ్ళు భయపడుతూ ఉంటారు.</p>
<p>&#8221; మా రాజకుమారి చిత్ర ఉంటే అంతా ఆవిడే చూసుకునేది,  దుష్టులకి సిం హస్వప్నం. ఆవిడ ఉన్నప్పుడు ఈ రాజ్యమంతా సంతోషమయం. సహజం గా వచ్చే చావు తప్ప మరి ఇంకే భయమూ లేదు.  తీర్థయాత్రకు వెళ్ళింది, ఎప్పుడొస్తుందో తెలియదు  &#8221; అని వాళ్ళు చెబుతారు.</p>
<p>అర్జునుడు ఆశ్చర్యంగా అడుగుతాడు &#8221; మీ రక్షణ ఒక స్త్రీ చేతిలోనా ? &#8221;</p>
<p>&#8221; అవును. ఆమె మాకు మొదట తండ్రి, తర్వాత తల్లి కూడా &#8221;</p>
<p>అంత శక్తివంతురాలైన రాజకుమారి  చిత్ర ఎటువంటిదో, ఎలా ఉంటుందో అని అర్జునుడు ఆలోచిస్తూ ఉంటాడు.</p>
<p>దగ్గరికి వచ్చిన చిత్రతో అదే అంటాడు.</p>
<p>చిత్ర &#8211; &#8221; ఆమె అందమైనది కాదు. నా కన్నులంత  చక్కనివి కావు ఆమెవి . ఏ లక్ష్యాన్నయినా భేదించగలదు, అయితేనేం? ఈ నాయకుడి హృదయాన్ని తాకలేదు &#8221;</p>
<p>&#8221; పరాక్రమం పురుషుడి వంతు, మార్దవం స్త్రీ వంతు కదా ? &#8221;</p>
<p>&#8221; అదే గొప్ప దురదృష్టం ఆమెకి. స్త్రీ కేవలం స్త్రీ గా ఉంటే- తన నవ్వులతో అలకలతో సేవలతో లాలనతో, పురుషుల హృదయాలను లతలాగా అల్లుకుంటే- ఆమె సంతోషంగా ఉండగలదు. ఏం నేర్చితేనేం, ఏం సాధిస్తేనేం ? అంతెందుకు- ఈ శివాలయం దగ్గరి అడవిదారిలో నిన్న నువ్వు ఆమె నీకు తారసపడి ఉంటే , ఆ వైపైనా చూడకుండా వెళ్ళిపోయిఉందువు. కాదా ? స్త్రీ సౌందర్యం కొంత విసుగు పుట్టినట్లుంది కనుక ఆమెలో పౌరుషాన్నీ వీరత్వాన్నీ చూడగలవా ? &#8221; నిలదీస్తుంది చిత్ర.</p>
<p>&#8221;  సరే, దానికేమి&#8230;ఈ జలపాతం పక్కన , ఆ తుంపరలతో తడిసిన ఆకులతో, రాత్రి లాగా చీకటైన కొండ గుహలో &#8211; చల్లని శయ్య&#8230;&#8221; &#8211; ఆహ్వానిస్తుంది.</p>
<p>&#8221; ఊహూ. ఇవాళ కాదు &#8221;</p>
<p>&#8216; ఎందుకు ?&#8221;</p>
<p>&#8221; బందిపోటులెవరో మీదపడబోతున్నారట. ఆ ప్రజలని వెళ్ళి రక్షిస్తాను &#8221;</p>
<p>&#8221; ఏమీ భయం లేదు. చిత్ర తీర్థయాత్రకు వెళ్ళే ముందు సరిహద్దులన్నీ పటిష్ఠం  చేసి ఉంచింది &#8221;</p>
<p>&#8221; క్షత్రియునికి తగినదానికి నువ్వు నన్ను అనుమతించవా ? ఏ పనీ లేకుండా పడి ఉంది&#8230;నా కుడిచేయి ఆ పనిని సాధిస్తే నీకు ఇంకా మంచి తలగడ అవుతుంది కదా ! &#8221;</p>
<p>&#8221; సరే, వెళ్ళు.  నా చేతులలో బంధించినా దురుసుగా విడిపించుకుంటావో ఏమో ! గుర్తుంచుకో&#8230;తెగిన లత మరి అతకదు. సౌఖ్యానికి అధిదేవత ఎవరికోసమూ ఆగదు. చెప్పు, ఎవరు నీ మనసులో ఉన్నది ? చిత్ర ? &#8221;</p>
<p>&#8221; అవును. ఆమెకి ఏమి లోటని తీర్థయాత్రకు వెళ్ళిందో ?&#8221;</p>
<p>&#8221; ఏమి  లోటా ? ఆమెకి ఏముందని ? ఆమె యోగ్యతలే తనకి చెరసాలలు. ఆమెకి ఆకర్షణ లేదు, ఆశలు తీరవు. ఏ దుస్తులు వేసుకున్నా ఒకటే, అందం ఆమెకి శత్రువు. రాళ్ళూ రప్పలూ నిండిన, చెట్టూచేమా లేని కొండ కొమ్ము మీద &#8211; వెలుగు లేని పగలు ఆ బ్రతుకు  . ఆమె గురించి అడగకు, నీ చెవికి ఇంపుగా  ఉండదు &#8221;</p>
<p>&#8221;  తెలుసుకోవాలని ఉంది. అర్థరాత్రి వేళ అపరిచితమైన నగరానికి చేరిన యాత్రికుడిలా ఉంది నాకు. గోపురాలూ భవంతులూ తోటలలో వృక్షాలూ&#8230;అన్నీ మసక మసకగా ఉన్నాయి. సగం నిద్ర లో ఉన్న సముద్రపు హోరు లీలగా వినిపిస్తోంది. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఈ వింతలన్నీ స్పష్టమవుతాయా అని ఎదురు చూస్తున్నాను. చెప్పు, ఆమె గురించి &#8221;</p>
<p>&#8221; ఏముంది చెప్పేందుకు ?&#8221;</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/09/chitra2.jpg"><img class="alignleft size-full wp-image-6367" title="Excelsior Rakesh" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/09/chitra2.jpg" alt="" width="346" height="242" /></a>&#8221; నా మనసులో ఆమె తెల్ల గుర్రం మీద స్వారీ చేస్తూ, ధనుర్బాణాలు ధరించి,  ధైర్యం పుట్టించగల విజయలక్ష్మి లాగా కనిపిస్తోంది. తన కూనలను కంటికి రెప్పలా కాచుకునే తల్లి సిం హంలా కనిపిస్తోంది. ఆభరణాలు ధరించినా,  స్త్రీ బాహువుల కు సంకెళ్ళు అవసరం లేదు, ఆ చేతుల శౌర్యమూ  సౌందర్యమే.</p>
<p>సుదీర్ఘమైన శీతాకాలపు నిద్ర నుంచి లేచిన సర్పానికి  లాగా నాకు కుదురు లేకుండా ఉంది . పద, ఇద్దరమూ గుర్రాలెక్కి వెళదాము&#8230; జంట కాంతి కిరణాల మై !   ఈ అనురాగపు మగత నుంచి, ఈ ఆకుపచ్చని దిగులు నుంచి, ఈ  సుగంధపు మాదకత నుంచి, వెళదాం రా, ఊపిరి ఆడటం లేదు ! &#8221;</p>
<p>&#8221; అర్జునా, నిజం చెప్పు. నువ్వు మోహించే ఈ లావణ్యాన్ని  ఏదో ఇంద్రజాలం వల్ల  వదిలాననుకో &#8230;.  బయటి ప్రపంచపు  మొరటైన స్పర్శ నుంచి , అది ఇవ్వగల ఆరోగ్యం నుంచి &#8211; దాక్కునే ఈ పిరికితనాన్నీ  నాజూకునీ దూరంగా పొమ్మన్నాననుకో , భరించగలవా ? ఈ స్త్రీ సహజమనే బలహీనతలను వీడి నిటారైన వెన్నెముకతో ఉన్నాననుకో  &#8230;నీడలో పాకే లతలాగా కాక సూర్యరశ్మికి తలేత్తి నిలుచునే దేవదారు వృక్షంలా అయాననుకో, నేను అప్పుడు నీ కళ్ళకి నచ్చుతానా ? లేదు, సాధ్యం కాదు. నా చుట్టూ ఆటబొమ్మలవంటి వస్తువులని పరచుకుని నీ కోసం ఓర్పుగా ఎదురు చూడాలి,  నీకిష్టమై వచ్చినప్పుడు నా సుందరశరీరంతో నీకు  ఆహ్లాదాన్ని ఇవ్వాలి, అంతే కదా ? నీకు చాలు అనిపించినప్పుడు నువ్వు వినోదానికో వ్యాసంగానికో వెళతావు. నాకు ఇచ్చిన కొద్ది చోటు లో నేను మురిసిపోతూ సర్దుకుని వృద్ధా ప్యాన్ని ఆహ్వానించాలి. నీ సఖి &#8211; రాత్రి వేళ క్రీడతో తృప్తి పడక పగలూ నీ పక్కనే ఉంటానంటే నీకు రుచిస్తుందా ? బలిష్టమైన కుడి చేయి చేయగల పనిని ఎడమచేయి చేస్తానంటే ఒప్పుకోగలవా ?&#8221;</p>
<p>అర్జునుడు &#8221; నువ్వు నాకెప్పుడూ పూర్తిగా అర్థం కాలేదు. స్వర్ణ విగ్రహం లో దాగి ఉన్న దేవీ మూర్తి లాగా స్ఫురిస్తావు. నిన్ను నిజంగా నేను స్పృశించలేదు, నువ్వు ఇచ్చినదానికి బదులు తీర్చానని చెప్పలేను&#8230;నా ప్రేమ అసంపూర్ణం. ఒక్కొక్కసారి నీ చూపులో, తీరులో ఏదో అంతుపట్టని లోతు , నీ మాటలను నువ్వే వెక్కిరిస్తున్నావా అనిపిస్తుంది. ఈ ఆవిరయే నవ్వులలోంచి, ఈ బద్ధకపు కదలికలలోంచి&#8230;ఇవేవీ కాని ఒక తీక్షణమైన  అస్తిత్వం  అప్పుడప్పుడూ మెరుస్తూ ఉంటుంది.</p>
<p>సత్యానికి తొలి రూపం భ్రాంతి.</p>
<p>ఆమె తన ప్రేమికుడిని మారు వేషం లో చేరింది. ఎప్పటికో ఒక నాటికి ఆ అలంకారాలూ ఆచ్ఛాదనలూ తొలగించుకుని తన సహజ గాంభీర్యం తో కనిపిస్తుందని చూస్తున్నాను&#8230; ఆ అసలైన నీ కోసం, సరళమైన నిజం కోసం ! ఎందుకుఏడుస్తున్నావు ? ముఖాన్ని కప్పుకుంటావెందుకు? నేను అన్నదాన్ని మరచిపో, పర్వాలేదు. ఈ నువ్వే నాకు చాలు.</p>
<p>ప్రతి సౌందర్య భరితమైన క్షణాన్నీ ఒక  సంగీతపు రహస్యాన్ని ఎక్కడనుంచో మోసుకు వచ్చే పక్షి లాగా&#8230;.కదలనీ . నిజం వద్దులే, దాని ఒడ్డున గడిపేస్తాను జీవితమంతా ! &#8221;</p>
<p>చిత్ర &#8211; &#8221; నా మధుపాత్ర ఖాళీ అయిందా ? ఇదే అంతమా ? లేదు, అంతా జరిగాక కూడా ఏదో మిగిలే ఉంటుంది , దాన్ని నీ పాదాల దగ్గర అర్పిస్తాను.</p>
<p>స్వర్గ లోకపు ఉద్యానం నుంచి , నిన్ను పూజించేందుకని, సాటిలేని సౌందర్యపుష్పాలను తెచ్చాను. అర్చన ముగిస్తే, పూవులు వాడితే- వాటిని  అవతల పారవేస్తాను &#8221;</p>
<p>తన నిజమైన రూపం లో కనబడి-  &#8221; ఇదిగో, చూడు, నీ పూజారిణిని. దయ ఉందా ? ? ?</p>
<p>నేను ఏరితెచ్చిన పూవులంత అందం లేదు నాకు , లోపాలున్నాయి, మచ్చలున్నాయి. ప్రపంచం లో ప్రయాణించేదాన్ని నేను-ఊరికే కూర్చోగలదాన్ని కాను.  నా దుస్తులు మాస్తాయి, నా పాదాలు ముళ్ళు గుచ్చుకుని రక్తం చిమ్ముతాయి. క్షణభంగురమైన పుష్పాల లాగా నేనెలా ఉంటాను ? నా స్త్రీ హృదయాన్ని సగర్వంగా నీకు సమర్పిస్తున్నాను. ఇందులో బాధా సంతోషమూ , ఆశలూ భయాలూ అవమానాలూ- అన్నీ, అన్నీ  ఉన్నాయి. మట్టిలో పుట్టినదాని ప్రేమ ఇది, కాని మట్టిలో కలిసిపోయేది కాదు .  ఇక్కడ సంపూర్ణ సౌష్ఠవం లేదు, కానీ ఉదాత్తత ఉంది, ఘనత ఉంది. పూలతో పూజ  అయిపోతే, పూజ చేసిన నన్నే తీసుకో !</p>
<p><img class="alignright  wp-image-4547" title="mithili2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/mithili2.gif" alt="" width="220" height="227" /></p>
<p>నేనే చిత్రని, రాజకుమారిని. ఒకనాడు ఒక స్త్రీ , అలంకరించుకుని వచ్చి -నీ దగ్గర సిగ్గు విడిచి ప్రేమభిక్ష అడిగింది. నువ్వు నిరాకరించావు. ఆమె నేనే&#8230;అదొక మారు వేషం.  దేవతల వరం తో ఒక ఏడాది పాటు నిన్ను మెప్పించగల సౌందర్యాన్ని తెచ్చుకున్నాను. నా మోసం తో నీ మనసుని బరువు చేశాను.  ఇప్పుడు నేను ఆమెను కాను, ఖచ్చితంగా.</p>
<p>నేను చిత్రని. పూజించవలసిన దేవతను కాను, నిర్లక్ష్యంగా తోసేయవలసినదాన్నీ కాను. నువ్వు నడిచే దారిలో నీ సాహసం లో ప్రమాదాలలో నన్ను పక్కన ఉండనిస్తే, నీ బాధ్యతలను పంచి ఇస్తే- అప్పుడు నిజంగా నేనెవరో నీకు అర్థమవుతుంది. మన బిడ్డ ను పెంచి మరొక అర్జునుడుగా పెద్ద చేసి తరుణం వచ్చినప్పుడు నీ దగ్గరికి పంపుతాను&#8230;అప్పుడు, చివరిగా నేనేమిటో నీకు పూర్తిగా తెలుస్తుంది.</p>
<p>ఇప్పటికి మాత్రం నేను చిత్రని, ఒక రాజకుమారిని, అంతే.&#8221;</p>
<p>అర్జునుడు &#8211; &#8220;ప్రియా ! నా జీవితం నిండిపోయింది&#8221;</p>
<blockquote><p>Let thy eyes rest upon my eyes for</p>
<p>a while.<br />
Let me take to my work the assurance</p>
<p>of thy comradeship, my friend.<br />
Fill my mind with thy music to last</p>
<p>through the desert of noise !<br />
Let thy Love&#8217;s sunshine kiss the peaks</p>
<p>of my thoughts and linger in</p>
<p>my life&#8217;s valley where the harvest</p>
<p>ripens. [Crossing ]</p></blockquote>
<p>&nbsp;</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=6359</wfw:commentRss>
		<slash:comments>22</slash:comments>
		</item>
		<item>
		<title>మూడవ భాగం- సహృదయ ప్రమాణం, సంస్మరణీయశోభ</title>
		<link>http://vaakili.com/patrika/?p=6136</link>
		<comments>http://vaakili.com/patrika/?p=6136#comments</comments>
		<pubDate>Sun, 31 Aug 2014 17:29:49 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కడిమిచెట్టు]]></category>
		<category><![CDATA[మైథిలి అబ్బరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=6136</guid>
		<description><![CDATA[<p></p> <p>&#8216; నాటకాంతహి సాహిత్యం &#8216; &#8211; ఈ మాట ఈ విధంగా కూడా  అవును &#8211; సాహిత్యపు పరమప్రయోజనం ఏదో దాన్ని సాధారణ స్థాయి వ్యక్తులకి కూడా  నేరుగా  చేరవేయటం నాటకం యొక్క శక్తి.  ఆ ప్రయోజనం స్థూలంగా  ఇలాగ-  కదలిక, లోపలికి తీసుకోవటం, విచ్చుకుని విశాలమవటం. అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు సాహిత్యం లో  చివరి రచన అని చెబుతారు.  అంతకు ముందు ఆయన మహాకావ్యాలు రాశారు, కొన్ని మంచి  నాటకాలనూ తీర్చారు. ఇది కావ్యమైన నాటకం. తన రచనలన్నింటి వెనకా ఉండిన  ఉపజ్ఞ, ప్రజ్ఞ అంతా ఒక్కటై వెలిగిన శాంతదీధితి  శాకుంతలం</p> <p>కాళిదాసు కు పరమభక్తులైన పాతతరం సాహితీవేత్త జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు తన విస్తృతమైన భావనా ప్రపంచం లో అన్వేషించి కాళిదాసు కు తన నాయికలలో ఎవరు ఎక్కువ ఇష్టమైనవారూ అని తేల్చుకుంటారు.[ అదొక చాపల్యం వంటిదే కాని  కాళిదాసు పట్ల ఎక్కువైన పిచ్చికి నిదర్శనం ]  ఆయననే ముఖాముఖి అడిగినట్లు ఆ వ్యాసం ఉంటుంది.  తన నోటితో కాళిదాసు చెప్పినట్లు రాయరు కానీ  ఆమె శకుంతలే అని చివరికి. కవి చెప్పిన ఏయే మాటలు ఆ నిర్ధారణను ఇస్తాయో ఆయన వరకు ఆయన చెప్పుకొస్తారు. శాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం, కాళిదాసు రఘువంశంలో సృజించిన అమ్మవారు సీతాదేవి లోనూ   [బహుశా అమ్మవారు కనుకే] లేని  ఆ కొంచెపు కొంచెం ఏదో శకుంతలలో ఉంది. అది కాళిదాసుతో సహా మనుషులమైన మనకు దగ్గర.</p> <p>కాళిదాసు నాటకపు ఒక పొరలో ఇలా చెప్పదలచుకున్నారేమోనని నా బుద్ధికి తోస్తుంది. ఏది ఒకరి ఉనికికి అత్యవసరమో తెలుసుకుని తీరాలి. ఆ అమూల్యమైన దానికి సాక్ష్యమూ నిరూపణా అక్కర్లేదు  .  దాన్ని కాపాడుకోవటం లో ఏ మాత్రం ఏమరపాటు ఉన్నా ,  పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ తెచ్చుకుందుకు ఎన్నెన్ని కన్నీళ్ళో ఖర్చు అవుతాయి. కేవలం తపించటం ఒక్కటే  చాలకపోవచ్చు.   కొన్ని సార్లు వేరే వ్యక్తిగతమైన [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg"><img class="aligncenter size-full wp-image-4744" title="kadimi" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg" alt="" width="810" height="284" /></a></p>
<p>&#8216; నాటకాంతహి సాహిత్యం &#8216; &#8211; ఈ మాట ఈ విధంగా కూడా  అవును &#8211; సాహిత్యపు పరమప్రయోజనం ఏదో దాన్ని సాధారణ స్థాయి వ్యక్తులకి కూడా  నేరుగా  చేరవేయటం నాటకం యొక్క శక్తి.  ఆ ప్రయోజనం స్థూలంగా  ఇలాగ-  కదలిక, లోపలికి తీసుకోవటం, విచ్చుకుని విశాలమవటం. అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు సాహిత్యం లో  చివరి రచన అని చెబుతారు.  అంతకు ముందు ఆయన మహాకావ్యాలు రాశారు, కొన్ని మంచి  నాటకాలనూ తీర్చారు. ఇది కావ్యమైన నాటకం. తన రచనలన్నింటి వెనకా ఉండిన  ఉపజ్ఞ, ప్రజ్ఞ అంతా ఒక్కటై వెలిగిన శాంతదీధితి  శాకుంతలం</p>
<p>కాళిదాసు కు పరమభక్తులైన పాతతరం సాహితీవేత్త జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు తన విస్తృతమైన భావనా ప్రపంచం లో అన్వేషించి కాళిదాసు కు తన నాయికలలో ఎవరు ఎక్కువ ఇష్టమైనవారూ అని తేల్చుకుంటారు.[ అదొక చాపల్యం వంటిదే కాని  కాళిదాసు పట్ల ఎక్కువైన పిచ్చికి నిదర్శనం ]  ఆయననే ముఖాముఖి అడిగినట్లు ఆ వ్యాసం ఉంటుంది.  తన నోటితో కాళిదాసు చెప్పినట్లు రాయరు కానీ  ఆమె శకుంతలే అని చివరికి. కవి చెప్పిన ఏయే మాటలు ఆ నిర్ధారణను ఇస్తాయో ఆయన వరకు ఆయన చెప్పుకొస్తారు. శాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం, కాళిదాసు రఘువంశంలో సృజించిన అమ్మవారు సీతాదేవి లోనూ   [బహుశా అమ్మవారు కనుకే] లేని  ఆ కొంచెపు కొంచెం ఏదో శకుంతలలో ఉంది. అది కాళిదాసుతో సహా మనుషులమైన మనకు దగ్గర.</p>
<p>కాళిదాసు నాటకపు ఒక పొరలో ఇలా చెప్పదలచుకున్నారేమోనని నా బుద్ధికి తోస్తుంది. ఏది ఒకరి ఉనికికి అత్యవసరమో తెలుసుకుని తీరాలి. ఆ అమూల్యమైన దానికి సాక్ష్యమూ నిరూపణా అక్కర్లేదు  .  దాన్ని కాపాడుకోవటం లో ఏ మాత్రం ఏమరపాటు ఉన్నా ,  పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ తెచ్చుకుందుకు ఎన్నెన్ని కన్నీళ్ళో ఖర్చు అవుతాయి. కేవలం తపించటం ఒక్కటే  చాలకపోవచ్చు.   కొన్ని సార్లు వేరే వ్యక్తిగతమైన ఔన్నత్యాలూ ఘనతలూ కూడా అవసరమవుతాయి. తిరిగి పొందినప్పుడు అందులో తొలినాటి పసరుదనపు సౌకుమార్యం ఉండదు, మిగిలేవి పండిన సువర్ణ ఛాయలే &#8211; ఎప్పటికీ నిలవగలిగేవీ  అవే.<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/08/dushyant_shakuntala_600x450.jpg"><img class="alignright size-full wp-image-6142" title="dushyant_shakuntala_600x450" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/08/dushyant_shakuntala_600x450.jpg" alt="" width="337" height="450" /></a></p>
<p>తాను చేసిన అపరాధాన్నంతా అశ్రుధారలతో   కడిగివేసుకుంటున్నాడు దుష్యంతుడు. &#8221; నన్ను నేను తనలో నిక్షేపించుకొని ఉండీ నా ధర్మపత్నిని, నా వంశధారకు ఆలంబనను- వదిలిపెట్టాను&#8230;బంగారం  పండబోతుంటే  పంటచేనును వదిలేసినట్లు.  పూజ్యులైన నా పూర్వులకు నా తర్వాత పుణ్యోదకాలు ఇంకెవరు వదులుతారు ? &#8221;</p>
<p>తీరని దుర్భర వేదన, దహించే పశ్చాత్తాపం దుష్యంతుడిని కృంగదీస్తున్నాయి. ఉన్మాదం కొన్నిసార్లు, అపస్మారం కొన్ని సార్లు. జీవితం లో,  ప్రపంచం లో పట్టిలాగగల ఏ విషయమూ ఆయనకి లేదు. అదే స్థితి కొనసాగి ఉంటే ఏమయినా కావచ్చు.</p>
<p>ప్రియమైన వారు దూరమైనప్పుడు అనుభవించే విరహం లో పది దశ లను చెబుతారు .వాటిలో తీవ్రమైన ఒకటి ఉన్మాదం.  చివరిది మృత్యువు.   అజ మహారాజు తన భార్య ఇందుమతి మరణాన్ని భరించలేక, ఆయన కొడుకు దశరథుడు పుత్రవియోగాన్ని ఎదుర్కోలేక- ఆ చివరివరకూ  వెళ్ళిపోయారు. ఇప్పుడు, ఇక్కడ దుష్యంతుడిని ఆ ఉన్మత్త స్థితి నుంచి తప్పించి తీరాలి. ఆయన స్వస్థుడై , పత్ని తో దక్షుడై పాలించి , యజ్ఞాలూ యాగాలూ చేయవలసి ఉంది. హవిస్సుల కోసం దేవతలు రావలసి ఉంది, యజ్ఞఫలాలతో,  రాజ్యం  తిరిగి  సుభిక్షం కావలసి ఉంది , రాగల కాలం లో  దేశానికొక కొత్త పేరు చేరవలసి ఉంది  .   అందుకు దేవతలు వేసిన పథకం మొదలవుతుంది.</p>
<p>మేఘపరిచ్ఛంద  భవనం పై భాగం లో ఉన్న మాఢవ్యుడిని ఇంద్రసారథి మాతలి అదృశ్యంగా హింసించటం మొదలుపెడతాడు.[ ఆ భవనం పేరుని-  దాని ఉపరిభాగం ఆకాశం నుంచి కిందికి  అందుతుందన్నట్లు పెట్టారు కాళిదాసు. శాకుంతలం పూర్తి stylized  రచన అని గుర్తు చేసుకోవాలి.]  మాఢవ్యుడు   రక్షించమని కేకలు పెడుతూ ఉంటే దుఃఖాన్ని పక్కనపెట్టి పరుగుపెడతాడు రాజు. మాతలి నిజరూపం తో కనబడి ఇంద్రుని సందేశాన్ని  అందజేస్తాడు. &#8221; కాలనేమి అన్న రాక్షసుడి సంతతి-దుర్జయులనే రక్కసిగుంపు చెలరేగుతున్నారు. వారించేందుకు ఇంద్రుడికి శక్యం కావటం లేదు. నీవలన కాగలదు అది. రాత్రి చీకటిని చెదరగొట్టటం సూర్యుడి వల్ల అవుతుందా, అందుకు చంద్రుడు కదాకావాలి &#8221;</p>
<p>రాజు &#8221; మరి ఎందుకు ఈ అమాయకుడైన బ్రాహ్మణుడిని హింసించావు ?&#8221;</p>
<p>&#8221; ఆయుష్మంతుడా ! నీ మనస్సు అతివికలంగా ఉంది.  ఆ నీ అశక్తతను తొలగించాలంటే నీకు కోపం తెప్పించాలి . హోమద్రవ్యం పోస్తే అగ్ని భగ్గుమంటుంది, శిరసు మీద కొడితే సర్పం బుస కొడుతుంది&#8230;అందుకు. &#8221;</p>
<p>రాజ్యభారాన్ని పిశునుడనే మంత్రికి అప్పగించి స్వర్గానికి ప్రయాణమవుతాడు రాజు.</p>
<p>చివరిదైన ఏడవ అంకం ప్రారంభం లో స్వర్గలోకం లో ఇంద్రుడు కోరిన సాయాన్ని చేసి తిరిగి మాతలి రథం మీదే వెనక్కి వస్తున్నాడు .</p>
<p>&#8221; ఇంద్రుడికి నేను చేసిన మేలుకంటే ఆయన నా పైన చూపిన గౌరవం ఎక్కువ ఘనంగా ఉంది మాతలీ ! తన సిం హాసనం మీద నన్నొక కుమారుడి లాగా  పక్కనే కూర్చోబెట్టుకున్నాడు కదా. హరిచందనం అంటిన మందారమాల  ఆయన గళసీమలో.    పక్కనే ఆయన పుత్రుడు జయంతుడు ఉండనే ఉన్నాడు , ఆ మాలవంక కాంక్షతో  చూస్తూనే ఉన్నాడు . అయినా ఇంద్రుడు కొడుకుని చూసి ఒకసారి నవ్వి ఆ మాల నా మెడలోనే  వేశాడు కదా, ఎంత భాగ్యం నాది ! &#8221; అన్నాడు రాజు.  తనమీద తనకే ఆదరం లేని మనస్స్థితిలో ,  అధికుడైన ఇంద్రుడి ఆప్యాయత దుష్యంతుడిని నిలబెడుతూ ఉంది.</p>
<p>మాతలి జవాబు ఇచ్చాడు &#8221; స్వర్గాన్ని ఆవరించిన ముళ్ళకంపలు నువ్వు తొలగించావు మహారాజా ! ఇదివరకు నరసిం హస్వామి గోళ్ళు చేసినపనిని ఇప్పుడు నీ బాణాలు చేసిపెట్టాయి  &#8221; సాక్షాత్తు విష్ణుమూర్తితో దుష్యంతుడిని పోల్చాడు.</p>
<p>ఆ అతిశయోక్తికి రాజు మురిసిపోలేదు. &#8221; యజమాని చూపించే నమ్మకం బట్టీ , మర్యాదను అనుసరించీ సేవకుల కార్యనిర్వహణ ఉంటుంది. సహస్రమయూఖుడైన సూర్యుడు తన ముందు అరుణుడిని [ సారథిగా ] కూర్చోబెట్టుకున్నాడు కనుకే అరుణుడు చీకటిని పారద్రోలగలుగుతున్నాడు  &#8221; [ ఈ  పోలిక కేవలం రాజు వినయం. అరుణుడు [అనూరుడు ] కాళ్ళు లేనివాడు , వేరే విధంగా పూర్తి అశక్తుడు. ]</p>
<p>మాతలి &#8211; &#8221; నీ విజయగాథలను పాడుకునే పాటలుగా -కల్పవృక్షపు పత్రాల పైన అప్సరలు ఉపయోగించే లాక్షారసం తో లిఖిస్తున్నారు, నీ కీర్తి శాశ్వతం ! &#8221;</p>
<p>రాజు &#8211; &#8221; వచ్చేప్పుడు గమనించలేదు నేను, ఏ ఆకాశమార్గం లో ప్రయాణిస్తున్నాము మనం ? &#8221;</p>
<p>[  ఈ మార్గాలు ఏడు. మొదటిది మేఘమార్గం.  ఇది భూమినుంచి సూర్యుడి దాకా వ్యాపించి ఉంటుంది. ఇక్కడి వాయువును '  ఆవాహ ' అంటారు. మేఘాలూ  ఉల్కలూ ఉరుములూ మెరుపులూ - వీటిని ఆవరించి ఉంటుంది. రెండవది సూర్యమార్గం. ఇక్కడి వాయువు ' ప్రవాహ ' . ఇది సూర్యభ్రమణానికి కారణం. మూడవది చంద్రమార్గం. ఇక్కడి వాయువు ' సంవాహ ' .  నాలుగవది నక్షత్రమార్గం . ' ఉద్వాహ ' అన్న వాయువు వాటిని చలింపజేస్తుంది. అయిదవది గ్రహాల మార్గం. అవి చరించేది ' వివాహ ' అనే వాయువుతో. ఆరవది సప్తర్షి మండల మార్గం. ఇక్కడి వాయువు ' పరివాహ ' . ఆకాశగంగ ఉనికి ఇక్కడే. ఏడవది ధ్రువనక్షత్రమార్గం. ' పరవాహ ' అన్న వాయువు అన్ని గ్రహాల, నక్షత్రాల గతులని సమతుల్యస్థితిలో నిలుపుతుంది . ]</p>
<p>మాతలి -  &#8221; ఆరవదైన పరివాహ మార్గం లో ఉన్నాము రాజా ! ఈ చోట చీకటి ఉండదు , పాపాలు నశిస్తాయి .</p>
<p>ఎందుకంటే వామనుడి రెండవ అడుగు ఆనినది ఇక్కడే. ఆ పాదోదకం సురగంగగా  ప్రవహించి పావనమైన ప్రదేశం  &#8221;</p>
<p>రాజు- &#8221; అందుకే కాబోలు , నా ఇంద్రియాలన్నీ శాంతంగా ఉన్నాయి. మనసుకి హాయిగా ఉంది . అదిగో, మేఘమార్గం లో ప్రవేశించాము చూడు. జలం  నిండిన మేఘాలలోంచి రథచక్రాలు కదులుతూ ఉంటే నీటితుంపరలు చిందిపోతున్నాయి. వాటికోసం చాతకపక్షులు ఎగిరి వస్తున్నాయి . మెరిసే మెరుపులలో అశ్వాలు తళతళమంటున్నాయి  ‘’</p>
<p>కాళిదాసుకి ఉండిన  ఖగోళ శాస్త్ర జ్ఞానం ఇక్కడ చక్కగా  ప్రతిఫలిస్తుంది , దానికి తోడు మబ్బుల్లో రథం పరుగెత్తినప్పటి రమ్యమైన  ఊహ.</p>
<p>మాతలి &#8211; &#8221; త్వరలో మీ లోకానికి చేరుకుంటాము &#8221;</p>
<p>ఇక్కడ కాళిదాసు రాజు తో పలికించినమాటలు చదివి విస్తుపోతాము. ఆధునికయుగం లో విమానం కిందికి దిగుతూ ఉంటే ఏయే దృశ్యాలు ఏయే క్రమంలో కనిపిస్తాయో ఆ సమాచారం అంతా చెప్పిస్తారు.</p>
<p>&#8221; వేగంగా క్రిందికి దిగుతున్నాము, ఇది అద్భుతంగా ఉంది. పర్వతశిఖరాలు కనిపిస్తున్నాయి, అంతలోనే వాటికింద నేల  స్పష్టం అవుతోంది. వృక్షాల ఆకులన్నీ కలిపి అల్లుకుని  ముందుగా , ఆ తర్వాత కిందని కాండాలు- కనబడుతున్నాయి. నదుల సన్నదనం మాయమై అవి విశాలమవుతున్నాయి. ఎవరో భూమిని పైకి నెట్టినట్లు , బంతిలా కొట్టినట్లు- అది నా దగ్గరికి వచ్చేస్తోంది &#8221;</p>
<p>విని , మాతలి  ముచ్చటపడి &#8221; సాధు దృష్టం &#8221; అంటాడు . [ బాగా గమనించారు అని ]</p>
<p>రాజు &#8211; &#8221; ఈ పర్వతం పేరేమిటి ? సంధ్యామేఘాల  కుడ్యం లా తూర్పుపడమర సముద్రాలలో చొచ్చుకుపోతోంది. అటూ ఇటూ బంగారపు నీరు చిందిపోతోంది &#8221;</p>
<p>&#8221; మహారాజా ! కింపురుషులకు ఆలవాలమైన హేమకూట పర్వతం అది.  . మరీచి ప్రజాపతి  పుత్రుడు, సురాసురులకు తండ్రి అయిన  మారీచ [ కశ్యప ] ప్రజాపతి అక్కడే తపస్సులో మునిగి ఉన్నారు. &#8221;- మాతలి</p>
<p>&#8221; తప్పక వారి దర్శనం చేసుకోవాలి &#8221; అని దుష్యంతుడు అనగానే మాతలి రథాన్ని నిలుపుతాడు&#8230; దేవరథం కనుక, ఆగినది కింపురుషలోకంలో కనుక &#8211; చక్రాలు  ‘ నేల ’ పైన ఆనలేదు-  ధ్వని ఏదీ రాలేదు, ధూళి అసలు రేగలేదు .</p>
<p>&#8221; అదిగో, సగం దేహాన్ని వల్మీకం కప్పివేయగా స్థాణువైన వృక్షం వలె చలించక  తపస్సు చేస్తున్న కశ్యప ప్రజాపతి.ఇక్కడ ఆయన భార్య అదితీదేవి పెంచుతున్న మందారవనం. &#8221;</p>
<p>ఇవాళ గొప్ప నాటకీయత అని మనం దేన్ని [ప్రశంసగా ]  అంటామో దాని ఉజ్వలమైన ప్రారంభాన్ని ఈ ఏడవ అంకం లో &#8211; కశ్యపాశ్రమం లోని సంఘటనలలో చూడవచ్చు.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/08/Odilon-Redon-Apollo_s-Chariot-.jpg"><img class="aligncenter size-full wp-image-6143" title="Odilon Redon - Apollo_s Chariot" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/08/Odilon-Redon-Apollo_s-Chariot-.jpg" alt="" width="640" height="355" /></a></p>
<p>అప్పుడే స్వర్గం నుంచి తిరిగి వస్తున్న రాజు ఆ ప్రదేశాన్ని &#8216; స్వర్గాధిక తరం  నివృతి స్థానం &#8216; అంటాడు. [ స్వర్గం కన్న ప్రశాంతమైనదని ] అమృతహృదం [సరస్సు ]  లో తనను ముంచినట్లుందనీ అనుకుంటాడు. అవును, ఆయన హృదయం అక్కడ అమృతమయం కాబోతూ ఉంది కదా.</p>
<p>&#8221; కోరినదెల్లా ఇవ్వగల కల్పవృక్షాల తోటలే ఉన్నాయి అక్కడ, కాని వాయువే ప్రాణాధారంగా జీవనం నడుస్తోంది. స్వర్ణకమలాల పుప్పొడితో పరిమళించే జలాలను-[శృంగారార్థమై కాకుండా ]  దైవాభిషేకం కోసం వాడుతున్నారు. మణిమయమైన శిలావితర్దికల పైన ధాన్యాన్ని సాధన చేస్తున్నారు. మహా సౌందర్యరాశులు-అప్సరలు, చరించే చోట [తపస్వులు ] నిగ్రహం తో వర్తిస్తున్నారు. వేటికోసం సాధారణంగా  తపస్సు చేస్తారో అవి అన్నీ సమృద్ధిగా ఉన్న ఇక్కడ అంతకుమించినదానిని వెతుకుతున్నారు &#8221; &#8211; ఇది దుష్యంతుడి నోట పలికించిన  హేమకూటవర్ణన.  సౌఖ్యానికీ వైభవానికీ పరాకాష్ట అయినవి ఏవీ శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవని , వాటన్నిటినుంచీ కూడా ముక్తినే కోరాలనీ కాళిదాసు అన్యాపదేశంగా అంటున్నారు.</p>
<p>కశ్యపుడు  అదితి కోసం, ఇతర ఋషిపత్నుల కోసం ధర్మబోధ చేయబోయే వేళ అయిందని తెలిసి ఒక అశోకవృక్షం కింద వేచి ఉంటాడు దుష్యంతుడు. ఆ చెట్టు పేరును కూడా కావాలనే చెప్పినట్లు అనిపిస్తుంది- &#8216; అశోకం &#8216; .</p>
<p>కొన్ని సం వత్సరాల క్రితం కణ్వాశ్రమం లో అడుగుపెడుతున్నప్పుడు కల్గిన శుభసూచక శకునం- రాజు కుడిభుజం అదరటం మళ్ళీ అప్పుడు జరుగుతుంది. &#8221; నా మనోరథం ఇంకెక్కడ నెరవేరుతుంది ? అదృష్ట దేవతను ఒకసారి తిరస్కరిస్తే తిరిగి చేరవస్తుందా &#8221; అనే ఆయన అనుకుంటాడు.</p>
<p>తల్లిదగ్గర పాలు తాగే సిం హపు పిల్లని ఆడుకోవటానికని జుట్టు పట్టి లాక్కువచ్చే బాలుడు ఉంటాడా ? అక్కడ కనబడతాడు.దాన్ని &#8221; నోరు తెరువు, పళ్ళు లెక్కబెడతాను &#8221; అనే అతన్ని చూసి  రాజు , &#8216; ఏమి సాహసం ! ఎంత బలం ! &#8221; అనుకుంటాడు. ఆ వెనకే వచ్చిన మునికన్య &#8221; సర్వదమనుడని నీ పేరు సరిగానే పెట్టారు ఋషులు &#8221; అంటుంది.</p>
<p>రాజు &#8221; నాకు సంతానం లేనందువలనా ఏమిటి, ఈ బిడ్డ నాకు సొంతవాడనిపిస్తోంది ? &#8221; అనుకుంటాడు.</p>
<p>రెండో మునికన్య &#8221; తల్లి సిం హం కరుస్తుంది, జాగ్రత్త &#8221;  అని బెదిరించినా బాలుడికి లెక్కే ఉండదు.</p>
<p>&#8221; నీకింకో బొమ్మ ఇస్తాను &#8221; అని ఆమె అంటే</p>
<p>&#8221; ఏదీ, ఇవ్వు &#8221; అని అతను చేయి చాస్తాడు.</p>
<p>విచ్చుతున్న తామర మొగ్గ లాగా ఉన్న  ఆ చాచిన  అరచేతిలో చక్రవర్తి రేఖలు గమనించి రాజు ఆశ్చర్యపడతాడు. పిల్లవాడి మీద బలంగా మనసు లాగుతూ ఉంటుంది.</p>
<p>ఇక్కడ , పసిబిడ్డలు కలిగించే ఆహ్లాదాన్ని దుష్యంతుడి నోట పలికించిన శ్లోకం యొక్క  భావం ప్రసిద్ధం.</p>
<p>&#8221;  కారణం లేని బుల్లి నవ్వులలో మొగ్గలవంటి దంతాలు కనిపిస్తుండగా, వచ్చీరాని మాటల సొగసు [అవ్యక్త వర్ణరమణీయ వచః ]   చిందిపోతూ   ఒళ్ళో కూర్చున్న పుత్రులు  అంటించిన దుమ్ముతో   మాసిపోయినవారు &#8211; ఆ తండ్రులు కదా ధన్యులు ! &#8221;</p>
<p>వేరే ఆటబొమ్మను తెచ్చేందుకు ఒక మునికన్య వెళుతుంది, మరొకామె పిల్లవాడి పట్టునుంచి సిం హపు కూనను విడిపించేందుకు సాయం చేయమని రాజును అడుగుతుంది. ఆయన నవ్వుతూ అతన్ని  &#8221; మునికుమారులకు తగని ఇటువంటి పనులు ఎందుకు నీకు, నాయనా ? &#8221; అని అడుగుతాడు. &#8221; అతను మునికుమారుడు కానిదే !  &#8221; అని ఆమె బదులిస్తుంది.</p>
<p>రాజు &#8221; కాదనే అనుకున్నాను. &#8221; అంటూ బిడ్డను తాకగానే అపరిమితమైన ఆనందానికి లోనవుతాడు. &#8221; నా సొంతవారిని స్పృశించినట్లు ఉందేమిటి ? ఈ బిడ్డనుగన్న తండ్రిది  ఎంత అదృష్టం ! &#8221; అని తలమునకలవుతుంటే మునికన్య</p>
<p>&#8221; ఇదేమి ఆశ్చర్యమండీ..ఇతను అచ్చు మీలాగే ఉన్నాడు, కొత్తవారిదగ్గరికే వెళ్ళడు, మీదగ్గరికి వచ్చేశాడు &#8221;  అంటుంది .</p>
<p>రాజు &#8211; &#8221; ఇతను మునికుమారుడు కాకపోతే మరి ఎవరు ?&#8221;</p>
<p>&#8221; ఇతను పురువంశానికి చెందినవాడు &#8221;</p>
<p>&#8221; గొప్పవంశం వారైనా మానవులే కదా. ఈ చోటికి ఎలా రాగలరు ?&#8221;</p>
<p>&#8221; నిజమే. ఇతని తల్లికి ఒక అప్సరతో ఉన్న బాంధవ్యం కారణంగా ఆమె ఇక్కడ కశ్యపప్రజాపతి రక్షణ లో ఉంది &#8221;</p>
<p>ఆశ రేగిన రాజు -&#8221; అలాగా ! ఆమె భర్త పేరేమిటి ? &#8221;</p>
<p>&#8221; ధర్మబద్ధంగా పెళ్ళాడిన భార్యను వదిలేసిన భర్త సంగతి ఎవరికి కావాలి ! &#8221; అని మునికన్య ఇచ్చిన జవాబుతో</p>
<p>&#8221; కథ నా ఇంటికే చేరుతున్నట్లుంది . ఇతని తల్లి పేరు అడగనా ? వేరే వారి భార్య అయిఉంటే ఆమె గురించి మాట్లాడటం భావ్యం కాదేమో &#8221; అని తర్జన భర్జన పడుతున్నప్పుడే</p>
<p>&#8221; సర్వదమనా ! ఇదిగో, శకుంతలా వన్య [ అందమైన పక్షి ] , చూడు &#8221; అని ఒక నెమలి బొమ్మని తెచ్చి ఇస్తారు .</p>
<p>&#8221; అమ్మ ! అమ్మ ఏదీ  &#8230;&#8221;  దిక్కులు  చూస్తాడు పిల్లవాడు.</p>
<p>ఆరాటం హెచ్చయిన రాజు తన భాగ్యాన్ని తాను నమ్మలేక &#8221; ఆ పేరు ఎంతమందికి ఉండదు ! &#8221; అని సర్ది చెప్పుకుంటాడు.</p>
<p>సిం హపు పిల్ల తో ఆడుతున్నప్పుడు పిలావాడి మణికట్టు మీదినుంచి  జారిపడిన రక్షరేకు &#8216; అపరాజిత &#8216; ను రాజు తీసి, మునికన్యలు వద్దనేలోపే మళ్ళీ కట్టేస్తాడు. పిల్లవాడి తల్లిదండ్రులు తప్ప మరి ఎవరు తాకినా అది పాముగా మారి కరుస్తుందని వాళ్ళు చెబుతారు.</p>
<p>ఇంకా నమ్మలేని రాజు- &#8221; అలా ఇదివరలో జరిగిందా ? &#8221; అని ప్రశ్నిస్తే</p>
<p>&#8221; బోలెడు సార్లు &#8221; అని సమాధానం వస్తుంది.</p>
<p>పట్టలేని సంతోషంతో బిడ్డను కావలించుకుంటాడు రాజు.</p>
<p>&#8221; వదులు, వదులు- అమ్మ దగ్గరికి వెళతా &#8221; అని అతను మారాం చేస్తాడు.</p>
<p>&#8221; నువ్వు నా బిడ్డవి కూడా &#8221; అని రాజు మురిసిపోతాడు.</p>
<p>&#8221; మా నాన్న దుష్యంతుడు- నువ్వు కాదు &#8221;</p>
<p>&#8221; అదే కదా తమాషా &#8221; అని నవ్వుతుండగానే తల్లి  వచ్చింది.</p>
<p>దూరం నుంచి చూసింది రాజుని- &#8221; అవునా, నిజమేనా ? సానుమతి చెప్పినది ఋజువేనా ? &#8221;</p>
<p>ఆయనా చూశాడు. తనేనా ?</p>
<p>&nbsp;</p>
<p>&#8221; వసనే పరిధూసరే వసనా నియమక్షామముఖీ ఘృతైకవేణిః</p>
<p>అతినిష్కరుణస్య శుద్ధశీలా మమ దీర్ఘ విరహవ్రతంబిభార్తి &#8221;</p>
<p>&nbsp;</p>
<p>[ దుమ్ముకొట్టిన దుస్తులు, శుష్కించిన ముఖం, ఒంటిజడగా కట్టిన జుట్టు - ఈ పవిత్రురాలు నా క్రూరత్వం వలన, ఈ దీర్ఘ విరహం వలన- ఎలా అయిపోయింది ! ]</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/08/Raja_Ravi_Varma_-_Mahabharata_-_Bharata.jpg"><img class="alignright  wp-image-6144" title="Raja_Ravi_Varma_-_Mahabharata_-_Bharata" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/08/Raja_Ravi_Varma_-_Mahabharata_-_Bharata.jpg" alt="" width="302" height="343" /></a></p>
<p>శకుంతల కూడా  కృశించి ఉన్న రాజును చూడగానే గుర్తించలేక [ తానూ తన భాగధేయాన్ని నమ్మలేక ] ఆయన ఎవరో అనుకుంటుంది.</p>
<p>ఆయన అంటాడు &#8211; &#8221; ఇప్పుడు నేను అడుగుతున్నాను, నన్ను గుర్తించవా అని &#8221;</p>
<p>&#8221; ఆయనే,&#8230; ఇంతకాలానికి..&#8221;</p>
<p>&#8221; నా స్వామికి జయం కలుగుగాక &#8221; అనే మాటల నడుమ గొంతు దుఃఖంతో పూడిపోతుంది.</p>
<p>&#8221; నువ్వు కనబడినాక ఇక జయం కాక ఏమిటి ?</p>
<p>నా తిరస్కారాన్ని  మన్నించు, మరచిపోయే ప్రయత్నం చేయి. నా మనసుకి  ఆనాడు  ఏమయిందో, ఏ చీకటి కమ్మిందో, ఏ భ్రాంతి ఆవరించిందో&#8230;పూమాలని సర్పంలా విసిరివేసుకున్నాను &#8221; అని శకుంతల పాదాల పైన పడతాడు  దుష్యంతుడు.</p>
<p>&#8221; లేవండి స్వామీ ! నా ఏ పూర్వజన్మకృత పాపఫలమో అది- ఇంత దయామయులైన మీ హృదయం అప్పుడు కఠినమైపోయింది &#8211; అయితే, జ్ఞాపకం వచ్చానా ఇప్పుడు ? &#8221; అని ఇంకా విడని నిష్టురత్వంతో ఆమె ప్రశ్నిస్తుంది.</p>
<p>&#8221; నీ కన్నీటిని స్మృతి తప్పిన  ఆ నాడు నిర్లక్ష్యం చేశాను , ఇప్పుడు అదే కన్నీటిని నీ రెప్పలనుంచి తుడిచి వేసి, అప్పుడు- చెబుతాను &#8221;</p>
<p>&#8221; స్వామీ, ఈ అంగుళీయకం ? &#8221;</p>
<p>&#8221; అవును. దీన్ని తిరిగి పొందుతూనే జ్ఞప్తి వచ్చింది అంతా &#8221;</p>
<p>&#8221; ఇది నా స్వామిని ఒప్పించే ప్రయత్నం లో నాకు ద్రోహం చేసింది కదా &#8221;</p>
<p>&#8221; కలయికకి గుర్తు గా మళ్ళీ ధరించరాదా, పూవు తిరిగి తీగని చేరినట్లు ? &#8221;</p>
<p>&#8221; వద్దు వద్దు. నాకు దీని మీద నమ్మకం పోయింది. మీరే ఉంచుకోండి &#8221;</p>
<p>భార్యాభర్తలు ఇద్దరూ పిల్లవాడితో కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళతారు.</p>
<p>ఆయన &#8221; నీ కుమారుడు ఇంద్రుడికి యుద్ధం లో జయాన్ని కూర్చినది ఇతనే, దుష్యంతుడు. ఇతని ధనుస్సు ముందు ఇంద్రుడి వజ్రాయుధం కేవలం అలంకారప్రాయం &#8221; అని అదితికి రాజును పరిచయం చేస్తాడు.</p>
<p>ఎంత ప్రజాపతీ మోక్షగామీ అయినా కశ్యపుడి మాటలు, ముఖ్యంగా అదితితో దుష్యంతుడి గురించి అన్నవి &#8211; తమ కుమారుడైన ఇంద్రుడికి దుష్యంతుడు స్నేహితుడూ సహాయకారీ అన్న నేపథ్యం లో అన్నవిలాగా ఉంటాయి. చివరలో &#8221; మీరిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండండి &#8221; అని మన పిల్లవాడి స్నేహితుడితో మనం అన్నట్లే. ఇది లోకవృత్తాన్ని అనుసరించిన నడక. ఆ ఇంద్రుడు లోకాల క్షేమాన్ని కోరేవాడూ అతని విరోధులు నిర్మూలించదగినవారూ కనుక ఉచితంగానే ఉంటుంది.</p>
<p>ముగ్గురూ ఆ వృద్ధ దంపతులకి నమస్కరిస్తారు.</p>
<p>&#8221; అమ్మా, శకుంతలా !నీ భర్త ఇంద్రుడికి సమానమైనవాడు. నీ ఈ కొడుకు జయంతుడే. శచీదేవి వలె చిరకాలం వర్ధిల్లుదువు గాక ! &#8221;</p>
<p>అని కశ్యపుడు అంటాడు -&#8221; మీరు ముగ్గురూ- శకుంతల,  సర్వదమనుడు, దుష్యంత మహారజు- వరుసగా , విశ్వాసం, ఆశ [ భవిస్యత్తు ], ఆచరణ [పరాక్రమం ] -వీటికి చిహ్నాలు. మూడూ ఉన్న చోట దేనికి లోటు ? &#8221;</p>
<p>దుష్యంతుడు- &#8221; ముందు పూవు పూసి ఆ తర్వాత పండు అవుతుంది. ముందు మబ్బు పట్టి తర్వాత వర్షం కురుస్తుంది&#8230;ఇది కార్యకారణ సంబంధం.  మీ ఆశీస్సుకు ముందే నాకు వెల లేని సంపద లభించింది కదా, ఇంకేమి కావాలి మహర్షీ !</p>
<p>ఈమె మీ వంశీయుడైన కణ్వమహర్షి తో పెంచబడినది.  అంతకు ముందు గాంధర్వవివాహం చేసుకొని ఉండి కూడా నా ఎదటికి వచ్చినప్పుడు విస్మృతి తో నిరాకరించాను. ఈ అంగుళీయకాన్ని చూస్తూనే జ్ఞాపకం వచ్చింది.</p>
<p>ఇది ఎలా ఉందంటే- ఏనుగు కళ్ళముందు నుంచి వెళుతూ ఉంటే గుర్తు పట్టకుండా ఆ తర్వాత దాని అడుగుజాడలు చూసి నిశ్చయించుకున్నట్లుగా. &#8221;</p>
<p>కశ్యపుడు &#8221; చింతించకు రాజా ! అది అలా జరగవలసి ఉంది. &#8221; అని దుర్వాసుడి శాపాన్ని వివరిస్తాడు.</p>
<p>రాజుకి గొప్ప ఉపశమనం కలుగుతుంది  &#8221; అయితే నా తప్పు లేదన్నమాట ! &#8221;</p>
<p>దుష్యంతుడి చేత ఈ ఒక్క మాటా అనిపించటం కోసం పరమ సహృదయుడైన కాళిదాసు ఇంత నాటకం రాశారు.</p>
<p>శకుంతల తనలో &#8221; నా భర్త నిష్కారణంగా నిష్కరుణుడై పోలేదా&#8230; ఎంత అదృష్టం ! [ ఆమె ఆనందం అనవలసిన చోట అదృష్టం అంటూ ఉంది. పూర్తిగా విధి చేతిబొమ్మ అయి అదంతా పడిన తర్వాత ఇంకేమనిపిస్తుంది ! ] నాకు శాపమేమీ గుర్తే లేదే&#8230;జరిగిందేమో, నేను దుష్యంతుడిని వీడిన వేదన లో గమనించుకోలేదేమో. అంగుళీయకం జాగ్రత్త అని అందుకే నా సఖులు చెప్పారు కదా ఆశ్రమం వదలి వస్తుంటే &#8221;</p>
<p>కశ్యపుడు &#8221; అంతా సవ్యంగా జరిగింది కదా..నీ భర్త మీద కోపం పెట్టుకోకు. దుమ్ము కప్పిన అద్దం లో బొమ్మ కనబడదు, నీ భర్త శాపం ఆవరించి నిన్ను మరచాడు. అద్దం శుభ్రమైన తర్వాత చక్కగా ఉపకరిస్తుంది, ఇప్పుడు ఇక నీ భర్త మీద నీదే అధికారం &#8221; అని బుజ్జగిస్తాడు.</p>
<p>&#8221; మీ ఈ కుమారుడు సప్తద్వీప అయిన వసుంధరను మొత్తం గెలుస్తాడు. అతన్ని ఎదిరించగలవారు ఉండరు. అన్నిటినీ అణచివేయగలవాడు కనుక సర్వదమనుడు, రాబోయే కాలం లో అందరినీ రక్షించగలవాడు కనుక భరతుడు అవుతాడు. &#8221;</p>
<p>అదితి &#8221; కణ్వమహర్షి కి ఈ సంగతి చెప్పిపంపవద్దా, పాపం.మేనక అయితే ఇక్కడే ఉంది. ఆయనకీ తన కుమార్తె క్షేమ, విజయ వార్తలు తెలియాలి కదా &#8221; అని స్త్రీ సహజమయిన ఆర్ద్రతతో అడుగుతుంది.</p>
<p>&#8221; దివ్యదృష్టి తో ఆయనకు తెలిసే ఉంటుంది. అయినా కబురు పెడతాను &#8221; కశ్యపుడు చెప్పిన తర్వాత దుష్యంతుడు &#8221; ఆయన అందుకే నా పైన [శకుంతలను తిరస్కరించిన వార్త విని ] ఎక్కువ ఆగ్రహించలేదన్నమాట &#8221; అనుకుంటాడు.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/mithili2.gif"><img class="alignright  wp-image-4547" title="mithili2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/mithili2.gif" alt="" width="220" height="227" /></a></p>
<div><span style="color: #0000ee;"><br />
</span>కశ్యపుడు దీవిస్తాడు &#8221; మీరంతా మీ నగరానికి వెళ్ళండి. ఇంద్రుడు నీ ప్రజలకోసం పుష్కలంగా వానలు కురిపిస్తాడు. రాజా, నువ్వు యజ్ఞాలతో అతన్ని సంతోషపెట్టు. మీరు ఉభయులూ యుగాల తరబడి  రెండు లోకాల శ్రేయస్సుకూ కారకులు అగుదురుగాక ! &#8221;</p>
<div>
<p>దుష్యంతుడు నాటకపు చివరి మాటలుగా కశ్యపుడిని ప్రార్థిస్తూ ఇలా అంటాడు &#8221; రాజులు ఎప్పుడూ ప్రజల క్షేమం కోసం శ్రమించాలి&#8230;.జ్ఞానం కలిగిన వారి [కవుల ]  వాక్కులకు  గౌరవం లభించాలి&#8230;నీలలోహితుడవైన పరమేశ్వరా, నాకు పునర్జన్మ లేకుండాలి &#8221; &#8211; ఈ భరతవాక్యం కాళిదాసహృదయమేనని ఊహించవచ్చు.</p>
<p>ఖచ్చితంగా ఆయన జన్మరాహిత్యాన్ని పొందేఉంటారు .</p>
<p>&nbsp;</p>
<p style="text-align: center;">[ సమాప్తం ]</p>
</div>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=6136</wfw:commentRss>
		<slash:comments>18</slash:comments>
		</item>
		<item>
		<title>సహృదయ ప్రమాణం [శాకుంతలం] &#8211; రెండవ భాగం</title>
		<link>http://vaakili.com/patrika/?p=6030</link>
		<comments>http://vaakili.com/patrika/?p=6030#comments</comments>
		<pubDate>Fri, 01 Aug 2014 14:45:11 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కడిమిచెట్టు]]></category>
		<category><![CDATA[మైథిలి అబ్బరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=6030</guid>
		<description><![CDATA[<p></p> <p>భద్రమైన తన  ఆకుపసుపు  లోకం నుండి ఆతురయై నడచి నడచి పూర్తి అపరిచిత ప్రపంచం లోకి వస్తున్నది శకుంతల. శాంతమైన మునివాటిక నుంచి  విపణి వీధుల ,సౌధాల,  శకటాల  కోలాహలం  లోకి….. స్వచ్ఛం నుంచిసమ్మిశ్రితం  లోకి, నిసర్గసిద్ధం నుంచి నాగరికత లోకి.</p> <p>దుష్యంతుడి మనసంతా  శాపం తో శూన్యమైంది. స్వతహా  సత్పురుషుడు కనుక- అంతశ్చేతన  మాత్రం సత్యం చెప్పే ప్రయత్నం చేస్తోంది. అక్కడెక్కడో  అడుగున ,  గతం-  తెలిసీ తెలియని గీతిగా….. స్మృతీ విస్మృతీ పెనుగులాడే ఈ అయిదో అంకాన్ని [నాలుగో అంకం గొప్పదనే బహుధా ప్రశంస ] శాకుంతలం లో  ఉత్తమమైనదిగా అనుకునే రసహృదయులు ఉన్నారు.</p> <p>&#8221; లోతునకు దిగి విచారించినచో శాకుంతలమునకు కిరీటాయమానమైనది పంచమాంకము. ఇందలి రచనను దాటి సృష్టిలో నే కవియును చేయలేదు. సాధ్యము కాదు. &#8230;.దుస్యంతుని స్వరూపము పంచమాంకమునందే పండియున్నది. &#8230;శాపముచేత దెబ్బతిన్న సగము, నిద్రపోని యంతఃకరణము, రెండును జంట ప్రవాహములవలె పంచమాంకమునందే ప్రవహించుచున్నవి &#8221; [విశ్వనాథ ]</p> <p>నేపథ్యంలో విషాదమధురమైన పాట వినబడుతూ ఉండగా విదూషకుడు మాఢవ్యుడితో కలిసి దుష్యంతుడు ప్రవేశిస్తాడు.  &#8221; అభినవ మధులోలుపసత్వం తథా పరిచుంబిత చూతమంజరీం కమల వసతిమాత్ర నివృతో మధుకర విస్మృతోస్తథేన కథం &#8221;   తనను మరచిపోయిన తుమ్మెదను ఆక్షేపిస్తూ మామిడి పూల గుత్తి అంటుంది- తామరపూవులో వసతి మాత్రం గా ఉన్నావని. [  శకుంతలను మరచి  దుష్యంతుడు హస్తినాపురం లో ఉండటం ఒక విడిది లో నివసించటమే ,సహజమూ  శాశ్వతమూ  కాదు అని  ]  ఆ గానం చేస్తున్న స్త్రీ హంసపదిక &#8211; దుష్యంతుడి భార్యలలో ఒకరు. బహుపత్నీకుడైన అతనికి ఇటువంటి దెప్పిపొడుపులు కొత్తవేమీ అయి ఉండవు.  అయితే ఆ సమయం లో ఏదో , ఎందుకో తెలియని దిగులు అతన్ని ఆవరిస్తుంది. &#8221; అహో, రాగపరివాహి నీ  గీతిః &#8221; అనుకుంటాడు.ఆమెకు సర్దిచెప్పమని మాఢవ్యుడిని పంపుతాడు, అయిష్టంగానే అతను నిష్క్రమిస్తాడు. రాబోయే ఘట్టం లో మాఢవ్యుడు పక్కన [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg"><img class="aligncenter size-full wp-image-4744" title="kadimi" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg" alt="" width="810" height="284" /></a></p>
<p>భద్రమైన తన  ఆకుపసుపు  లోకం నుండి ఆతురయై నడచి నడచి పూర్తి అపరిచిత ప్రపంచం లోకి వస్తున్నది శకుంతల. శాంతమైన మునివాటిక నుంచి  విపణి వీధుల ,సౌధాల,  శకటాల  కోలాహలం  లోకి….. స్వచ్ఛం నుంచిసమ్మిశ్రితం  లోకి, నిసర్గసిద్ధం నుంచి నాగరికత లోకి.</p>
<p>దుష్యంతుడి మనసంతా  శాపం తో శూన్యమైంది. స్వతహా  సత్పురుషుడు కనుక- అంతశ్చేతన  మాత్రం సత్యం చెప్పే ప్రయత్నం చేస్తోంది. అక్కడెక్కడో  అడుగున ,  గతం-  తెలిసీ తెలియని గీతిగా….. స్మృతీ విస్మృతీ పెనుగులాడే ఈ అయిదో అంకాన్ని [నాలుగో అంకం గొప్పదనే బహుధా ప్రశంస ] శాకుంతలం లో  ఉత్తమమైనదిగా అనుకునే రసహృదయులు ఉన్నారు.</p>
<p>&#8221; లోతునకు దిగి విచారించినచో శాకుంతలమునకు కిరీటాయమానమైనది పంచమాంకము. ఇందలి రచనను దాటి సృష్టిలో నే కవియును చేయలేదు. సాధ్యము కాదు. &#8230;.దుస్యంతుని స్వరూపము పంచమాంకమునందే పండియున్నది. &#8230;శాపముచేత దెబ్బతిన్న సగము, నిద్రపోని యంతఃకరణము, రెండును జంట ప్రవాహములవలె పంచమాంకమునందే ప్రవహించుచున్నవి &#8221; [విశ్వనాథ ]</p>
<p>నేపథ్యంలో విషాదమధురమైన పాట వినబడుతూ ఉండగా విదూషకుడు మాఢవ్యుడితో కలిసి దుష్యంతుడు ప్రవేశిస్తాడు.  &#8221; అభినవ మధులోలుపసత్వం తథా పరిచుంబిత చూతమంజరీం కమల వసతిమాత్ర నివృతో మధుకర విస్మృతోస్తథేన కథం &#8221;   తనను మరచిపోయిన తుమ్మెదను ఆక్షేపిస్తూ మామిడి పూల గుత్తి అంటుంది- తామరపూవులో వసతి మాత్రం గా ఉన్నావని. [  శకుంతలను మరచి  దుష్యంతుడు హస్తినాపురం లో ఉండటం ఒక విడిది లో నివసించటమే ,సహజమూ  శాశ్వతమూ  కాదు అని  ]  ఆ గానం చేస్తున్న స్త్రీ హంసపదిక &#8211; దుష్యంతుడి భార్యలలో ఒకరు. బహుపత్నీకుడైన అతనికి ఇటువంటి దెప్పిపొడుపులు కొత్తవేమీ అయి ఉండవు.  అయితే ఆ సమయం లో ఏదో , ఎందుకో తెలియని దిగులు అతన్ని ఆవరిస్తుంది. &#8221; అహో, రాగపరివాహి నీ  గీతిః &#8221; అనుకుంటాడు.ఆమెకు సర్దిచెప్పమని మాఢవ్యుడిని పంపుతాడు, అయిష్టంగానే అతను నిష్క్రమిస్తాడు. రాబోయే ఘట్టం లో మాఢవ్యుడు పక్కన ఉండి ఉంటే మరొకలాగా ఉండేదా అనిపిస్తుంది.</p>
<p>అప్పటి రాజు స్వగతం కాళిదాసును మహాకవి చేసిన శ్లోకాలలో ముఖ్యమైనది. &#8221; రమ్యాణి వీక్ష్య మధురాం శ్చ నిశమ్యశబ్దాన్ పర్యుత్సుకో  భవతి యత్సుఖితోపి జంతుః తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదాని &#8221;   &#8221; చేతసా స్మరతి &#8221; &#8211; మనసుకు గుర్తుంది, `మనిషికి కాదు. &#8216; అబోధ పూర్వం &#8216;- ఇదివరకు తెలిసిఉన్నది కాదు.</p>
<p>&nbsp;</p>
<p>భావం అన్న మాటకు విస్తృతమైన అర్థం ఉంది. సంస్కార విశేషం అనవచ్చును, కర్మల ఫలితం ఆత్మను అంటి పెట్టుకొని ఉండటం –‘  వాసన &#8216; అనీ అంటారు. ఇక్కడ శకుంతలా ప్రణయపు పరిమళం రాజుకి తోస్తూ ఉంది, స్పష్టం కావటం లేదు&#8230;ఆ అయోమయాన్ని ఆయన పూర్వజన్మకృతానికి తీసుకువెళుతున్నాడా అనీ అనిపిస్తుంది .</p>
<p>[ '' ఏ ప్రేమాస్పదులకూ నేను దూరంగా లేకపోయినా ఎందుకు కలవరపడుతున్నాను ?  సంతోషం లో మునిగి తేలుతూ ఉన్నవారు కూడా అందమైన వాటిని చూసి, తీయనైన శబ్దాలను విని కలత పడటం ఎందుకు? ఖచ్చితంగా ఇదివరకు తెలియనివి...ఇవి ఎప్పటివి...ఇంత చేరువ గా తోస్తున్నవి ?   ఏ పూర్వజన్మల స్నేహాల జ్ఞాపకాలు  ? '' ]</p>
<p>అది సభ చాలించి విశ్రాంతి తీసుకొనే సమయం.  [శకుంతలతో వచ్చిన ] తపస్వులైన వారిని తప్పనిసరిగా వెంటనే దర్శించాలి. నివేదించేందుకు వచ్చిన కంచుకి అనుకుంటాడు  ‘’ భూభారం వహించటం లో ఆదిశేషుడికి లాగే ఆరవ వంతు పన్నుగా  తీసుకునేవాడికీ  [షష్టాంశ వృత్తి- రాజు ] విశ్రాంతి ఉండదు. ప్రజలందరినీ ప్రజ [ సంతానం ] వలె కాచి పాలించి అలసిన రాజు విశ్రమిస్తున్నారు&#8230; తన గణాన్ని పగలెల్లా ఎండలో నడిపించిన గజరాజు నీడలో సేదదీరుతున్నట్లుగా. అయినా తప్పదు, చెప్పవలసిందే   ‘’</p>
<p>&#8221; అత్యున్నతమైన అధికారాన్ని సంపాదించేంతవరకే దానిపైని వాంఛ.  లభించినదాన్ని రక్షించుకోవటం ఎంత చికాకు పెడుతుంది !  నిరంతరం  గొడుగు పట్టుకోవలసిన చేతికి ఆ నీడ వలన శ్రమ తీరుతుందా ? &#8221;</p>
<p>ఆస్థాన  పురోహితుడు సోమరాతుడు పక్కన ఉండగా  మునిజనాన్ని కలుసుకునేందుకు ధర్మపీఠాన్ని ఎక్కుతాడు రాజు. అది మామూలు కొలువుకూటం కాదు, అంతకన్న పవిత్రమైనది. అక్కడ అగ్నిహోత్రం, ఆ ప్రక్కనే హోమధేనువు.</p>
<p>రాజు తాపసులను &#8216; కుశలమా &#8216; అని అడుగుతారు. కుశం అంటే దర్భ. వాటిని కోసి సేకరించే స్థితిలో ఉండటం బ్రాహ్మణుడికి ఆశించదగినది.</p>
<p>వారు రాజును &#8221; తమరు అనామయులు [ దైహిక, మానసిక వ్యాధి లేని వారు ] గా ఉన్నారు కదా &#8221; అంటారు. ఇది క్షత్రియుడిని పలకరించే పద్ధతి అట[శాకుంతలానికి సాధికారమైన పరిష్కరణా వ్యాఖ్యానమూ చేసిన M.R.Kale గారు   ఇంకా ఇలా చెబుతారు  - వైశ్యులను ' క్షేమమా '' అని అడిగేవారట, వారి సొమ్ము భద్రమా అనే అర్థం లో. వ్యవసాయ వృత్తి లో వారైన శూద్రులను ' ఆరోగ్యంగా [ శ్రమకు ఓర్చే శరీరస్థితిలో ] ఉన్నారా   అనటం అప్పటి  పద్ధతి. ]<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/08/taras-loboda.jpg"><img class="alignright  wp-image-6032" title="taras loboda" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/08/taras-loboda.jpg" alt="" width="432" height="434" /></a></p>
<p>&nbsp;</p>
<p>ఆ వచ్చిన తాపసులలో శార్ణరవుడు,   శారద్వతుడు అని ఇద్దరు.  శార్ణరవుడికి  తన ఉనికికి విరుద్ధమైన వాటి పట్ల ఓర్పు తక్కువ. &#8221; ఈ రాజు ధర్మపరుడిలాగే అనిపిస్తున్నాడు .  ప్రజలు &#8216; తక్కువస్థాయిలో &#8216;  వారైనా చెడ్డదారిలో ఉన్నట్లు లేరు. అయినా ఏకాంతం అలవాటైన నాకు ఈ సమ్మర్దాన్ని భరించటం కష్టంగా ఉంది &#8221; అని మిత్రుడితో అంటాడు అతను.</p>
<p>శారద్వతుడు , &#8221; నిజమే. నాకూ అలాగే ఉందిలే.ఒంటినిండా  నూనె పట్టించుకున్నవాడిని  చూస్తే శుభ్రంగా స్నానం చేసినవాడికి ఎలా ఉంటుందో , శుచియైనవాడికి అశుచి ని చూస్తే ఎలా ఉంటుందో, మేలుకున్నవాడికి నిద్రపోయేవాడిని చూస్తే ఎలా ఉంటుందో, స్వేచ్ఛగా ఉన్నవాడికి బంధితుడిని చూస్తే ఎలా ఉంటుందో- ఈ సుఖలాలసులైన జనాన్ని చూస్తే నాకూ అలాగే అనిపిస్తోంది &#8221; అని జవాబిస్తాడు.</p>
<p>నగరానికీ ఆశ్రమానికీ అంత దూరం.</p>
<p>శకుంతలకు దుశ్శకునాలు తోస్తాయి. వృద్ధ తాపసి గౌతమి  ఊరడిస్తుంది.</p>
<p>మేలిముసుగు లోని శకుంతలను చూసి &#8221; పండుటాకుల నడుమ ఈ పచ్చని చిగురు , ఈ పూజ్యురాలు</p>
<p>కనబడీ కనబడని లావణ్యం తో దర్శనీయురాలిగా ఉంది…. ఆమె ఎవరో ఏమిటో ..ఈ కుతూహలం నాకు తగదు.</p>
<p>&#8221;  అనుకుంటాడు రాజు.  ఆ అవకుంఠనం [ మేలిముసుగు ] రాజు మనసు ని మూసిన మరపుతెర కు చిహ్నం. ఆమె  అవతల, రాజు ఇవతల.</p>
<p>&#8221; ఇవి కణ్వమహర్షి మాటలు &#8221; అని చెప్పవలసినది రాజుకు చెబుతారు తాపసులు.</p>
<p>&#8221; ఏమిటీ నేనీమెను పెళ్ళాడానా ? &#8221; అన్న రాజు నిరాకరణ  విని శకుంతల వణికిపోతుంది.</p>
<p>దురుసువాడైన శార్ణరవుడు &#8221; ఇది చేసిన పనికి అసహ్య మా  ? బాధ్యతను విస్మరించటమా ? చేయవలసినదాన్ని గుర్తించకపోవటమా ? &#8221; అని విరుచుకు పడ తాడు .</p>
<p>&#8221; అమ్మా ! కాస్త నీ అవకుంఠనం తొలగించు. ప్రభువు గుర్తు పడతాడేమో &#8221; అని గౌతమి అన్న మీదట  రాజుకు పూర్తిగా కనబడుతుంది శకుంతల.</p>
<p>ఇదముపనత మేవం రూపమక్లిష్ట కాంతి</p>
<p>ప్రథమ పరిగృహీతం స్యాన్న వేత్య వ్యవస్యన్</p>
<p>భ్రమర ఇవ విభాతే కుందమంతస్తుషారం</p>
<p>నచ ఖలు పరిభోక్తుం నైన శక్నోమి హాతుం</p>
<p>&#8221;ఈ నిష్కళంక సౌందర్యాన్ని నేను ఇదివరకు స్వీకరించి ఉన్నానా , లేనా ? అవును అనలేకుండా ఉన్నాను, కాదనుకోలేకపోతున్నాను  -  మంచు మూసిన  మల్లెపూవుని తుమ్మెద ఆస్వాదించాలా, వదలిపెట్టాలా ? &#8221; ఆ  రూపం అక్లిష్టకాంతి అనుకుంటాడు.  [-కాంతి అంటే కోరబడుతున్నది అని. ] అదివరకే భార్య అయిన స్త్రీ సౌందర్యం భర్తకు క్లిష్టం కాదు. సమీపించదగినదిగానే అనిపిస్తుంది. అదే ఆశ్చర్యం దుష్యంతుడికి …</p>
<p>&#8221; అంతర్వర్తియై యీ విశేషార్థము భాసించుటకే &#8216;అక్లిష్ట &#8216; శబ్దముపయోగింపబడినది. లేనిచో కాంతి యన్న శబ్దమునకు అక్లిష్టమన్న విశేషమెవడు వేయును ? &#8221;  [విశ్వనాథ]</p>
<p>&#8216;విభాతే ‘-ప్రాతఃకాలం అది. పొద్దెక్కలేదు. అందుకని మల్లెపూవులో మంచు బిందువులు నిలిచి ఉన్నాయి. కొంత సేపటికి అవి మాయమై మల్లెపూవు అనుభవ యోగ్యం అవుతుంది. ఇది ఒక ధ్వని.</p>
<p>&#8221;  తప్తం తోషయతీతి తుషారః &#8221; తపించిన వాడిని సంతోష పెట్టేది తుషారం. కుందమంతస్తుషారం అన్న మాటతో శకుంతల గర్భవతి అని సూచించబడుతూ ఉంది. ఆ పుట్టే బిడ్డ పుత్రులు లేక తపించే రాజుకు భవిష్యత్తు లో ఉపశమనం ఇవ్వబోతున్నాడు. ఇది మరొక ధ్వని.</p>
<p>&#8216;మొదటిసారి ఆశ్రమం లో  శకుంతలను చూసినప్పుడు &#8221; ఈమె నేను పెళ్ళాడదగినది కాకపోతే నా హృదయం ఆమెపైన లగ్నమవదు &#8221; అని ధీమాగా అనుకున్న రాజుకు ,ఇప్పుడు ఆ వివేచన -శాపవశాత్తూ, తొలగిపోయింది. ఆమె తనకు ఆత్మీయ అనిపిస్తూనే  ఉన్నా ,</p>
<p>&#8221; ఈమెకు కలగబోయే శిశువు నా సొంతం కాడు, నేను క్షేత్రి అయిన భర్త గా  [మరొకరి బిడ్డ కు తండ్రిగా]  ఈమెను స్వీకరించమని అంటున్నారా ? &#8221;  అని ఊరుకుంటాడు.</p>
<p>&#8221; అలాగే. స్వీకరించకు. కణ్వమునికి ఈశాస్తి కావలసిందే ! దొంగిలించిన సొత్తును దొంగ చేతికే ఇచ్చినట్లు తన కుమార్తెను నీకు ఇవ్వబోతున్నాడు కదా &#8221; అని ఆవేశపడిన శార్ణరవుడు  -&#8221; శకుంతలా, విన్నావుగా. ఏమంటావు ?  &#8221;</p>
<p>&#8221;  అటువంటి ప్రేమ ఇలా పరిణమించినప్పుడు ఇంకేమని అనగలను ! అయినా నన్ను నేను శోధించుకుందుకు అడుగుతాను &#8221; అనుకున్న శకుంతల &#8221;ఆర్య పుత్రా [భర్తను ఇలా సంబోధిస్తారు ] అనబోయి  అర్థోక్తిలో ఆగి &#8221; ఓ పౌరవా ! లోకం తెలియని  నన్ను, ఆశ్రమంలో చేసిన వాగ్దానాన్ని మరచి ఇలా మోసగించటం తగునా ? &#8221; అని ప్రశ్నిస్తుంది.</p>
<p>&#8221; ప్రవహిస్తూ రెండు గట్లనూ తెంచి తాను కలుషిత అయి ఒడ్డున ఉన్న వృక్షాన్నీ పెకలించివేసే నది వంటి దానవు నీవు- నీ కుటుంబగౌరవాన్ని పాడుచేసినది చాలక నన్నూ భ్రష్టుడిని చేయ పూనుకున్నావు   &#8221; అని కర్కశపు మాటలాడాడు రాజు.</p>
<p>శకుంతల కి ఉక్రోషం వచ్చి  &#8221; గుర్తు చూపిస్తే నమ్ముతావా, నేను మరొకరి భార్యను కానని ? &#8221;</p>
<p>చూసుకుంటే , ఏదీ, లేదు- అంగుళీయకం.</p>
<p>&#8221; అయ్యయ్యో !  శచీతీర్థం లో పడిపోయినట్లుందమ్మా &#8221; -గౌతమి.</p>
<p>[ఏ మాటనూ ఏ పేరునూ వృధాగా వాడినవారు కాదు కాళిదాసు. శచీదేవి మహా పతివ్రత, అంతకుమించి భర్త తో దేవేంద్ర సిం హాసనం పైన వెలిగే వైభవం ఆవిడది. శకుంతల భవిష్యత్తు రక్షితం.]</p>
<p>ప్రత్యక్షమైన ఆధారం లేని శకుంతల రాజుకు గుర్తు చేసే అమాయకపు ప్రయత్నం లో -</p>
<p>&#8221; ఆ రోజు , మల్లెపొదరింటిలో- నీవొక తామరాకు దొప్ప ను నీటితో నింపి తెచ్చావు. సరిగ్గా అప్పుడే నా పెంపుడు జింక దీర్ఘపంగ దాహంతో  అక్కడికి వచ్చింది. నీవు ముద్దుగా  అందించినా అది మూతి పెట్టనేలేదు. అదే  నేను అందుకొని తాగిస్తే మొత్తం తాగేసింది.  అప్పుడు  అన్నావు కాదూ,  మేమిద్దరమూ అరణ్యకులమేనని &#8221;</p>
<p>‘’ ఈ తీయని మాటలకేమిలే ! నేర్వనివిద్యగా స్త్రీల చాకచక్యం అమానుషులైనవారిలోనూ కనబడుతుంది. నేర్చినవారి సంగతి వేరే చెప్పాలా ! పరభృతలు తమ ద్విజసంతతిని ఇతరుల మీద వదిలిపెడతారు  కాదా ? &#8221; అంటాడు రాజు. అమానుషి అంటే పక్షి కావచ్చు, దేవకాంతా కావచ్చు.  సామాన్యార్థం లో పరభృత అన్న మాటకు కోకిల అని అర్థం. తన గుడ్లను కాకి గూటిలో వదులుతుందని కదా. పరభృత అన్న మాటతో ఇంద్రుని అధీనం లో ఉండే మేనక వంటి అప్సర కూడా స్ఫురిస్తుంది. ద్విజసంతతి అంటే కోకిల విషయం లో పక్షి సంతానం అని, మేనక విషయం లో ద్విజుడైన విశ్వామిత్రుని సంతానం అని. అది తానే. తనను పుడుతూనే తల్లి వదలి వెళ్ళిపోతే కణ్వమహర్షి పెంచాడు .</p>
<p>శకుంతలకు ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది. శకుంతలనే ఎఱగనన్న రాజుకి ఆ జన్మ కథ ఎలా గుర్తుంటుంది ? ఆయన యథాలాపంగానే అన్నాడు . శకుంతల కోపం హద్దు దాటింది.  ఆమె  ముగ్ధ అయినంత మాత్రాన స్వాభిమానం లేనిది కాదు.</p>
<p>&#8221; అనార్యుడా [మర్యాద లేనివాడా ] !  నీవనుకొనేదే నిజమా, అందరి విషయాలలో   నీకెలా తోస్తే అలా తీర్పు చెబుతావా ? [రాజు ధర్మపీఠం మీద ఉన్నాడు ] అందరూ నీవంటి ధూర్తులే ఉంటారా ?  పూడుకుపోయిన బావివంటి వాడివి నువ్వు ! &#8221;</p>
<p>రాజుకి కొంత ఆశ్చర్యం. &#8221; ఈమె రోషం ఇంత సహజంగా ఉందేమిటి ? నాదే పొరబాటా ? &#8221;</p>
<p>&#8221; క్రోధం తో ముడివడిన ఆమె కనుబొమలను చూస్తే మన్మథుని విల్లు విరుగుతోందా [కనుబొమలను విల్లుతో పోల్చటం ప్రసిద్ధమే ]  అనిపిస్తూ ఉంది &#8221;  స్మర అనే శబ్దాన్ని మన్మథుడికి వాడతారు కాళిదాసు . ఆ మాటకు మరొక అర్థం స్మృతి అని ఉండటం వలన ఇక్కడ మన్మథుని విల్లు, జ్ఞాపకాల విల్లు- రెండూ వర్తిస్తున్నాయి .</p>
<p>ఈ  అసమాపక క్రియ కి చాలా ప్రాధాన్యం ఉంది. ఆ విల్లు విరుగుతోందా అని మాత్రమే అనిపించింది. విరగలేదు. జ్ఞాపకాల అల్లిక మొదలంటా  తునగలేదు, ఒకరి పట్ల మరొకరి  శృంగార భావం ఆఖరికి  తొలగలేదు.</p>
<p>అభిజ్ఞాన శాకుంతలం శృంగారరస ప్రధానం, ముగింపులో శాంతరసం లోకి పర్యవసిస్తుంది.  నాయికా నాయకులకు ఒకరి పట్ల ఒకరికి ఉండే రతీభావం  శృంగారరసానికి స్థాయీభావం.  [ ఇక్కడ అనురక్తి అని మాత్రమే అర్థం ] .  విభావ, అనుభావ, సంచారీ భావాల   పైన ఆధారపడి, వాటిని మించి సహృదయుల మనసులో చెదిరిపోకుండా స్థిరం గా నిలిచేది స్థాయీ భావం. దాన్ని నిలబెట్టేందుకు పంచమాంకం లో కాళిదాసు గొప్ప ప్రయత్నం చేశారు , ఆ ఉద్వేగాల హెచ్చుతగ్గులలో దుష్యంతుడు ధూర్తుడు గానో శకుంతల విరక్తురాలు గానో కనబడనీయకుండా చేయటంలో పూర్తిగా సఫలులైనారు. ఎంత తీవ్రమైన కోపం వచ్చినా దాన్ని  భర్త పట్ల చూపించే పద్ధతి వేరు. శకుంతల కోపం అలాగే ఉంది, ఆమె ఆయనను భర్త కాదనో వదిలిపెడదామనో అనుకోలేదు. దుష్యంతుడు తెలియకచేసినదీ ధర్మమని తాను అనుకున్నదీ  కనుక   ఆ నిరాకరణకు  [ప్రేక్షకులలో, పాఠకులలో ] దోషం పట్టదు. ఈ సన్నివేశం లో రసభంగం కాకపోవటాన్ని కుంతకుని వక్రోక్తి సిద్ధాంతం ప్రకారం కూడా సమర్థించవచ్చు .</p>
<p>[విభావం అంటే ప్రేక్షకుల హృదయం లో వాసనా రూపంగా ఉన్న భావాలను ఆస్వాదయోగ్యం గా చేయటం. తగిన పాత్రల సృష్టి విభావం. వారి చర్యల ద్వారా ఆ వాసనను చూస్తూ ఉన్నవారు అనుభవించేలా చేయటం  అనుభావం. కావ్యం అంతటా ఆ భావం ప్రసరించేలా చేసేవి  సంచారీభావాలు. ఇవి అనుకూలంగానూ ప్రతికూలంగానూ కూడా ఉండవచ్చు- ఉత్తమమైన రచనలో స్థాయీభావానికి భంగం ఉండదు.]</p>
<p>శకుంతల దుఃఖిస్తుంది &#8221; ఇతని వంశమర్యాదను విశ్వసించిన నేను పాంసులను[ధూళి అంటినదానిని] అయినాను కదా &#8221;  అని.</p>
<p>ఒళ్ళు మండిపోయి, శార్ణరవుడు అంటాడు. &#8221;ఎఱగని వారితో నీ ఇష్టప్రకారం చనువుగా ఉంటే ఇలా కాక ఎలా ఉంటుంది ?’’  &#8217; పురోభాగా &#8216; అని నిందిస్తాడు శకుంతలను.అంటే మొదటి భాగాన్ని తీసేసుకునేది-స్వార్థపరురాలు . నీ సంగతే నువ్వు చూసుకున్నావు కాని తండ్రి గురించి ఆలోచించి ఉండలేదని.</p>
<p>రాజా ! మీరు రాజనీతి రూపం లో మోసాన్ని అభ్యసిస్తారు. మాకు ఆ మాట కి అర్థమే తెలియదు. మీరు మమ్మల్ని అనేందుకు చాలరు ! &#8221;</p>
<p>రాజు వ్యంగ్యంగా &#8221; ఓ సత్యవాదీ ! మీరు చెప్పినది నిజమేననుకుందాం. ఈవిడని మోసం చేస్తే నాకేమి వస్తుంది ? &#8221;</p>
<p>&#8221; వినాశనం &#8221; అని గర్జిస్తాడు మునికుమారుడు.</p>
<p>శారద్వతుడు వారించి మన పని అయిపోయింది, వెళ్ళిపోదామంటాడు. శకుంతలను అక్కడే పడిఉండమంటాడు., ఈ కితవుడి[వంచకుడి ] దగ్గర నన్ను వదలివెళతారా అని శోకం శకుంతలకు.</p>
<p>‘’ ఏదో ఒకనాటికి ఆ మనసు కరుగుతుందేమో… &#8216; క్షితి పతి &#8216;  [వ్యంగ్యం] కదా , భూమిఅంతటికీ  భర్త- నిన్నూ భరించవలసిందే  ‘’</p>
<p>రాజు ఆదుర్దా పడతాడు. ఆయన భయం తన మనసు చెదురుతుందని. అప్పటికే కొంత చెదిరి ఉంది, అది ఆయనకు ఇష్టం కాదు. ‘’ ఎందుకు ఆమెకు లేనిపోని ఆశలు కల్పిస్తారు ? చంద్రుడు కలువలనీ సూర్యుడు తామరలనీ మాత్రమే మేల్కొలుపుతారు. వాంఛల పట్ల అదుపు ఉన్నవారు పరస్త్రీని ఎందుకు స్పృశిస్తారు ? ‘’</p>
<p>‘’ కొత్త రుచుల నిమిత్తమై గతం మరచి ఉన్న తమకు తప్పుదారి గురించి  అంత వెరపెందుకు  మహారాజా ?  ‘’</p>
<p>రాజుకు మళ్ళీ సందేహం వస్తుంది. మళ్ళీ కాదు, ఆ దృశ్యం ఆసాంతం ఆయన సందేహియే. &#8221; నేనే మోహితుడనైనానా ..ఈమె అబద్ధం చెబుతోందా.. నా భార్యను నేను తిరస్కరిస్తున్నానా.. లేదా పరస్త్రీలగ్నత తో పాపిని అవుతున్నానా &#8221; ఆ విచికిత్స అప్పటికి తెగదు, తెగే వీలు లేదు.</p>
<p>ధర్మం తెలిసినవాడూ, బిడ్డలగన్న తండ్రీ రాజ పురోహితుడు ఆమెను ప్రసవించేదాకా సం రక్షిస్తాననీ ఆ పుట్టిన బిడ్డ సాముద్రిక లక్షణాలను బట్టి [బహుశా రూపురేఖల బట్టి కూడానేమో ] మహారాజు సంతతి అవునో కాదో తేల్చుకోవచ్చుననీ అంటాడు. రాజు సరేనంటాడు.</p>
<p>శకుంతలకి తీవ్రమైన అవమానం స్ఫురిస్తుంది. ఇలా రాజు మొండిగా తిరస్కరించిన సందర్భం లో భారత శకుంతల &#8221; నా పని ముగిసింది. నీ కొడుకును నీకు అప్పగించాను &#8221; అని వెళ్ళిపోబోతుంది. అప్పుడు ఆకాశ వాణి వినిపిస్తుంది. కాళిదాసు శకుంతల అంతర్వత్ని.ఇక్కడ కొడుకు ఇంకా కలగలేదు. అప్పటివరకూ పురోహితుడి సం రక్షణలో ఉండి ఎదురు చూడటాన్ని ఆమె అభిజాత్యం ఒప్పుకోదు .   &#8221; అమ్మా ! భూదేవీ ! నాకు దారి ఇవ్వు &#8221; అని ఆక్రోశిస్తుంది.. ఈ &#8221; భగవతి వసుధే దేహిమే వివరం &#8221; అన్నది ఉత్తరకాండలో సీతాదేవి అన్న మాట వంటిది.</p>
<p style="text-align: center;"> <a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/08/Menaka-and-Shakuntala-Mini-seriesnew.jpg"><img class=" wp-image-6033 aligncenter" title="Menaka and Shakuntala (Mini series)new" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/08/Menaka-and-Shakuntala-Mini-seriesnew.jpg" alt="" width="630" height="630" /></a></p>
<p>భూమి  విచ్చుకోలేదు.. . కాని ,   తల పైకెత్తి చేతులు సాచి విలపించినప్పుడు ఆకాశం స్పందించింది.  అప్సరతీర్థం దగ్గర మెఱిసిన మెఱుపు ఒకటి ఆమెను ఆవరించి  మాయం చేస్తుంది. ఇక్కడా తల్లిప్రాణమే కదిలింది, స్వర్లోకం నుంచి.</p>
<p>ఆ అంకం ముగిసింది.</p>
<p>ఆరవ అంకం లో అంగుళీయకం ప్రత్యక్షం. మత్స్యకారుడొకరు అమ్మజూపబోతే రాజభటులు బందిస్తారు. నేను దొంగిలించలేదంటాడు అతను. నీ గొప్పతనానికి మెచ్చి రాజు నీకు బహుమతి చేశారా అని వేళాకోళం చేస్తారు భటులు. &#8221; ఏమి ? జన్మతో సంక్రమించిన ఏ వృత్తి అయిన గౌరవమైనదే. బ్రాహ్మణులు సైతం యజ్ఞాలలో పశుహింస చేయరా ఏమిటి ? &#8221; అని ధైర్యంగా బదులిస్తాడు అతను. ఆ ఉంగరం పచ్చి మాంసం వాసన వేస్తోంది కనుక చేప కడుపులో దొరికే ఉంటుందనుకుంటాడు భటుల అధికారి. కాళిదాసు లోకజ్ఞత !</p>
<p>తీసుకుపోయి రాజుకు చూపుతారు. అప్పటి రాజు కు స్మృతి తిరిగి రావటాన్నీ ఆయన ఉద్వేగాన్నీ వర్ణించకుండా విడిచిపెడతారు కాళిదాసు. వ్యంజనా శబ్దశక్తి [ పదాలకు అనుకూలమైన అర్థం పొసగిన తర్వాత , ఆ అర్థపు శోభను అతిశయింపజేసే మరొక అర్థం స్ఫురించేలా చేయగలగటం ] లో పారంగతుడయి ఉండీ శాకుంతలం లో మౌనం వహించిన సందర్భాలలో ఇది ఒకటి.   శకుంతలా దుష్యంతుల సమాగమ వర్ణననూ పరిహరించారు ఆయన .  రాజు కి ఏదో జ్ఞాపకం వచ్చినట్లుందనీ ప్రియమైన ఎవరినో తలచుకున్నారనీ మాత్రం బయట చెప్పుకుంటారు. ఉంగరం విలువకు సమమైన ధనాన్ని మత్స్యకారుడికి బహూకరిస్తారు&#8230; &#8221; ఉరికొయ్య నుంచి దించి ఏనుగు నెక్కించారు నిన్ను &#8221; అంటూ.</p>
<p>తన చేసిన మహాపరాధం వలన రాజు తీవ్రమైన ఆత్మశోధనకి గురి అవుతాడు. ధర్మాన్నీ న్యాయాన్నీ ఆయన వీక్షించే, సమీక్షించే తీరు మారుతుంది. ధనవంతుడైన ఒక వర్తకుడు నిస్సంతు గా మరణిం చిన సందర్భం లో &#8211; భార్యలకు భృతి మాత్రం ఇచ్చి అతని ఆస్తిని రాజ్యపు కోశాగారానికి జమ చేసే పద్ధతి ఉన్నప్పుడు -రాజు ఆ పని చేసేయకుండా ఆ చనిపోయిన వర్తకుడి భార్యలలో ఎవరైనా గర్భవతిగా ఉన్నారా అని ఆచూకీ తీయమని పురమాయిస్తాడు.  అటువంటి భార్య ఒకరు ఉన్నారని విన్న వెంటనే ఆస్తి ఆ పుట్టబోయే శిశువుకు సంక్రమిస్తుందని ఉత్తరువు ఇస్తాడు.  గర్భవతి యైన భార్యను తాను పరిత్యజించాడు. ఆమె గతి ఏమయిందో, ఆ తన సంతతి ఎలా జీవిస్తోందో అన్న పుట్టెడు దిగులు నిద్రలో కూడా ఆయనను వీడదు.ఆప్తులను కోల్పోయిన వారందరికీ ఉపశమనం స్వయంగా ఇస్తానని ప్రకటిస్తాడు.</p>
<p>అయితే అంత ఓపికేదీ&#8230;శరీరమూ మనస్సూ కూడా వాటి బరువునే  అవి మోయలేనప్పుడు !</p>
<p>తర్వాతి రంగం లో సానుమతి[ మిశ్రకేశి అని ఆమెకు మరొక పేరు] అనే అప్సర స్త్రీ, మేనకకు స్నేహితురాలూ శకుంతలకు ఆప్తురాలూ అయినది, రాజు పరిస్థితిని గమనించేందుకు [ శకుంతలకు సమాచారం ఇచ్చేందుకు ] అదృశ్యంగా దిగి వస్తుంది.</p>
<p>పరభృతిక [కోకిల అని అర్థం ] , మధుకారిక [తుమ్మెద అని ] అనే ఇద్దరు పరిచారికలు , రాజోద్యానం లో, వసంత ఋతువు రాకకి ఆనందిస్తూ ఉత్సవానికి ఏర్పాట్లు చేయబోతూ ఉంటారు. రక్షకభటాధికారి వచ్చి మందలిస్తాడు.</p>
<p>&#8221; రాజు శోకమగ్నుడై ఉన్నాడు. ఏ ఉత్సవానికీ ఇది సమయం కాదు.</p>
<p>ఆయన ఆనతిని వృక్షాలూ పక్షులూ కూడా మన్నిస్తున్నాయి, చూడరేమి ?</p>
<p>మామిడి పూత పట్టీ పుప్పొడి నింపుకోవటం లేదు. మొగ్గ మొగ్గగానే ఉండిపోయింది. గండుకోయిల గొంతులో గానం పెగలటం లేదు. పంచబాణుడయిన  మన్మథుడే తన శరాలను సగం లో ఆపేశాడు. &#8221;  [అరవిందమూ, అశోకమూ, నవమల్లికా, నీలోత్పలమూ, చూతమూ -అయిదు బాణాలు మన్మథుడికి. వీటిలో చూతమంజరి [ సుగంధం వెదజల్లే ఒక జాతి మామిడి  పూలగుత్తి ] ని మాత్రమే కాళిదాసు పదే పదే పేర్కొంటారు. ఆయనకు ఆ సువాసన ఇష్టమేమో]</p>
<p>‘’ తెలియక శకుంతలను తిరస్కరించిన దుఃఖం నుంచి రాజు తేరుకోనేలేదు.</p>
<p>అందమైన అన్నిటినీ రాజు ఇప్పుడు ద్వేషిస్తున్నాడు. పగలైతే మంత్రుల నివేదికలకి తల ఊపుతున్నాడు, రాత్రి మొత్తమూ నిద్రలేక మసలుతూనే ఉంటున్నాడు. తన రాణులకు యుక్తమైన మర్యాదయితే ఇస్తున్నాడుకానీ ఒకరి పేరుతో మరొకరిని పిలిచి లజ్జితుడయిపోతున్నాడు &#8221;</p>
<p>అంతలో రాజు ప్రవేశం. &#8221; వేదన పడుతూ కూడా ఎంత సుందరుడై ఉన్నాడు ఈయన ! కోతకు గురి అయిన వజ్రం కాంతిని కోల్పోనట్లుగా ! &#8221;   రాజభక్తిని మించిన ప్రేమను దేన్నో అధికారి మనసులో పెంచగలిగిన వ్యక్తిత్వం అయిఉండాలి రాజుది.</p>
<p>అవును, ఆయన తరగబడుతూ ఉన్న వజ్రం. సానుమతి కూడా అనుకుంటుంది &#8221; తిరస్కరించబడి కూడా శకుంతల ఇతని కోసం అంత వేదన పడుతోందంటే ఆశ్చర్యం లేదు &#8221;</p>
<p>రాజు మాటలు &#8221;  శపించబడిన హృదయం ఆమె ఎంత లేపినా నిద్ర లేవలేదు, ఇప్పుడు మేలుకుంటే ఏమి లాభం-ఆమె లేదు …కలలో కనిపిస్తుందా అంటే నిద్రన్నది చేరరాదు.  బొమ్మను చూద్దామా అంటే కంటినీటి తెరలు  అడ్డు &#8221;</p>
<p>విదూషకుడు మొత్తుకుంటాడు తనలో తాను &#8221; ఈ శకుంతలా వ్యాధి మళ్ళీ తీవ్రమైందే  &#8221; అని.</p>
<p>ఏ జబ్బుకైనా వేళ బట్టి, వ్యాధి లక్షణం బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయి, ఈ వ్యధా వ్యాధికి కూడా. ఏ వ్యాధికైనా ముందు ఆహారం మానాలి . &#8216; లంఘనం దివ్యౌషధం &#8216; . అలా రాజు ఆనందాలన్నిటినీ విసర్జించాడు.  చికిత్సా పథ్యమూ  ఆ తర్వాత.</p>
<p>&#8221; చిన్న సందు దొరికితే చాలు, కష్టాలు ముంచుకొస్తాయంటారు.నామనసు ఇప్పుడే మరపు నుంచి తేరుకుంటోంది.ఈ మన్మథుడి బాణం, చూతమంజరి-నన్ను అదను చూసి   గురి చూస్తోంది &#8221; అని అదొక ధోరణిగా ఉన్మత్తుడి వలె  మాట్లాడతాడు రాజు.</p>
<p>&#8221;ఏదీ, ఎక్కడ ఆ బాణం ? ఈ కర్ర పెట్టి కొడతాను ఉండు &#8221; అని రాజును చిన్న పిల్లవాడిని లాగా  రక్షించబోతాడు మాఢవ్యుడు.<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/08/nand-lal-bose.jpg"><img class="alignright size-full wp-image-6034" title="nand lal bose" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/08/nand-lal-bose.jpg" alt="" width="300" height="450" /></a></p>
<p>తెప్పరిల్లిన రాజుకి నవ్వు వస్తుంది. &#8216; ఆ&#8230; నీ బ్రాహ్మణత్వపు మహిమ నాకు తెలుసులే &#8221;</p>
<p>దుష్యంతుడు స్వయంగా చిత్రించిన శకుంతల చిత్రపటం , ఇంకా అసంపూర్తిగా ఉన్నది, అక్కడికి తీసుకురాబడుతుంది.</p>
<p>రాజు అడుగుతాడు &#8221; అవునయ్యా. అరణ్యం లో శకుంతల ను నేను ప్రేమించిన విషయం నీతో చెప్పాను కదా ? నువ్వైనా ఎందుకు నాకు గుర్తు చేయలేదు ? నువ్వూ నాలాగే మరచిపోయావా ?&#8221;</p>
<p>&#8221; అదంతా వట్టిదేనన్నావు కదా నువ్వు ? మృత్పిండబుద్ధి ని [మట్టిబుర్రవాడిని ] నిజమేననుకున్నాను. విధి బలీయం …’’</p>
<p>[వాచాలుడైన మాఢవ్యుడు శకుంతల సంగతి చెప్పి  అంతఃపురం లో గగ్గోలు సృష్టిస్తాడేమోనని రాజు అలా అబద్ధం చెప్పిఉన్నమాట నిజమే]</p>
<p>రాజు కి తల తిరిగిపోతుంది, అమితమైన అసహాయతతో   &#8221; సఖో, త్రాయస్వమాం &#8221; [స్నేహితుడా, రక్షించు ] అంటాడు.</p>
<p>&#8221; అంత బలహీనుడవు కాకు మిత్రమా, పెనుగాలికి అయితే మాత్రం పర్వతాలు చలిస్తాయా ? &#8221;</p>
<p>&#8221; వెళ్ళిపోయే తాపసుల వెంట తనూ కదలబోయింది. అతనెవరో తమతో రావటానికి వీల్లేదన్నాడు. కన్నులలో నీరు నిండి కాంతి తరిగిన చూపుతో, నన్ను తిరిగి చూసింది…. క్రూరాత్ముడిని, నన్ను.  ఆ జ్ఞాపకం విషం పూసిన బాణం లాగా గుచ్చుకుంటోంది &#8216;’</p>
<p>సానుమతి ఆలోచిస్తూ -&#8221;&#8217;  పూర్వాపర విరోధపూర్వ ఏష విరహమార్గః &#8221; &#8211; విరహులైనవారికి పూర్వాపరాలు తెలియవని ఒక అర్థం, ఇక్కడ నిజంగానే &#8211; తాని విని ఉన్న  ఇదివరకటి దుష్యంతుడికీ  విరహి అయిన ఇప్పటి దుష్యంతుడికీ పోలిక ఉండకపోవటం  అంతర్ధ్వని.</p>
<p>&#8221; ఆమెనెవరో ఎత్తుకొని వెళ్ళారట కదా ?&#8221;-మాఢవ్యుడు .</p>
<p>&#8221;  ఆ పవిత్రు రాలిని ఇతరులె వరు తాకగలరు ! ఆమె తల్లి, అప్సర, మేనక యే నీ సఖిని  తీసుకువెళ్ళి ఉండాలి &#8221;  [స్నేహితుడితో తన భార్యను గురించి చెప్పేటప్పుడు ' నీ సఖి ' అంటాడు రాజు. మనం వ్యవహారం లో ' మీ చెల్లెలు ' అన్నట్లుగా.  వ్యాస భారతం లోనూ కృష్ణుడికి ద్రౌపది ఇటువంటి ' సఖి ' యే కాబోలు. దానికి కొందరు చేసిన వ్యాఖ్యానాలు వేరు ]</p>
<p>&#8221;అలా అయితే ఆమె ను తప్పక నువ్వు కలుసుకుంటావు. తల్లిదండ్రులు ఆడపిల్లను భర్త దగ్గరికి పంపాలనే కదా అనుకుంటారు &#8221;</p>
<p>రాజు శాంతించనే లేదు.</p>
<p>&#8221; స్వప్నమా ? భ్రాంతియా ? మతిభ్రమణమా ? తరిగిపోయిన పుణ్యఫలమా ? మరి తిరిగి రానిదా ? పొడిపొడిగా రాలిపోయిన ఆశలా ? &#8221;</p>
<p>అంగుళీయకాన్ని చూసి &#8221; నా వలె నీదీ దురదృష్టమే. గులాబీవర్ణపు గోటితో రమ్యమైన ఆమె వ్రేలిపైన మీద  నీవున్న కాలం  స్వల్పమే , నీ భాగ్యమూ అంతవరకే.  ‘’</p>
<p>అదృశ్యంగా చూస్తూ ఉన్న అప్సర-సానుమతి , అనుకుంటుంది &#8221; ఇంతటి, ఇటువంటి ప్రేమకు ఒక జ్ఞాపిక కావలసి వచ్చిందా ..అది లేకపోతే ఇంత అయిందా… &#8221;</p>
<p>అయింది. అది ఎవరి అపరాధమూ కాదు, అభిశాపం …. అకారణమా ?</p>
<p>ఆ చిత్రపటం లో అనసూయా ప్రియంవద లతో కలిసి ఉన్న శకుంతల.’’  ఆ వెడల్పైన సోగకళ్ళు, తీవెచివరల లాగ అలా అందంగా ఒంపుతిరిగిన కనుబొమ్మలు. వెన్నెల కిరణాల వలే వెలిగే   లేనగవు  పెదవులు. ఆ ముఖం చిత్తరువులోనుంచి  కూడా ముచ్చటిస్తున్నట్లే  ఉంది ‘’-&#8221; రాజు</p>
<p>మొదటిసారి శకుంతలను చూసినప్పుడు &#8221; చిత్రే పరికల్ప నివేశయ సత్త్వయోగా &#8221; [సృష్టిలో అతి సుందరమైన వాటన్నిటినీ కలిపి బొమ్మ గీసి ప్ర్రణ ప్రతిష్ట చేసినట్లుంది ] అని వర్ణించుకున్న దుష్యంతుడు మనసా తాను భావించిన దానికి &#8211; ఇప్పుడు, ఆమె లేనప్పుడు- చిత్రం గా ఆకృతి ఇస్తున్నాడు. ఆయన ప్రతిభావంతుడైన చిత్రకారుడని మాఢవ్యుడి మాటలలో తెలుస్తుంది</p>
<p>&#8221; ఎంత సహజం గా చిత్రించారు మహారాజు  ! ఆ పరిసరాల ఎత్తుపల్లాలలో నా కళ్ళు తట్టుకుని పడిపోయేలా ఉన్నాయి &#8221;</p>
<p>&#8221; సరిగా రాలేదనుకుంటూ ఎన్నిసార్లు దిద్దానో&#8230;ఎంత చేసీ  బొమ్మ  కదా&#8230;ఆమె సోయగాన్ని కాస్త  సూచిస్తూ ఉంది, అంతే. &#8221; రాజు</p>
<p>అంతవరకూ ఆమెను చూడని విదూషకుడు గుర్తిస్తాడు. ఎలా ? ఆమె ఉన్న చోట రాజువి, స్వేదం తో తడిసిన వేలి ముద్రలు [పదే పదే తాకటం వలన] .ఆమె చెంప మీది రంగు చెదిరింది, అక్కడ రాలిపడిన అతని కన్నీటి చుక్కతో.</p>
<p>‘’  ఇక్కడ..ఈ అశోకవృక్షం ప్రక్కన. ఆ మెత్తని చివురాకులు నీట తడిసి మెరుస్తున్నాయి. ముడివీడి శిరోజభారం పూవులతో జారుతోంది. ముఖం చెమరించింది, లతల వంటి ఆ  చేతులు అశ క్తమై వాలినాయి. అలిసిపోయినట్లుంది పాపం, తనే కదా శకుంతల ? ఆ ఇద్దరూ  నెచ్చెలులు. ‘’</p>
<p>ఇంకా చిత్రించవలసి ఉన్నవి అని రాజు తలచుకుంటాడు గతాన్నంతా.  &#8221; మాలినీ నది. ఒడ్డున ఇసుక తిన్నెల మీద విశ్రమించే హంసల జంట. అటూ ఇటూ గౌరీదేవిని కన్న హిమవంతుని పవిత్ర పర్వత శిఖరాలు . అదిగో, ఆ చెట్టు కొమ్మలకు ఆరేసిన నారచీరలు. కృష్ణవర్ణపు జింక కొమ్ముకి రాసుకుంటూ ఉన్న లేడి …</p>
<p>అక్కడ శకుంతల. ఆమె చెవిలో సుకుమారశిరీష కుసుమమాన్నీ, మెడలో శరత్ జ్యోత్స్నా కాంతుల వంటి తామరతూడుల హా రాన్నీ&#8230;గీయటం మరచేపోయాను ‘’</p>
<p>ఎర్ర తామర రేకు వంటి అర చేతితో ముఖాన్ని కప్పుకుంటూ ఉంది ఎందుకు?  &#8221; మాఢవ్యుడు అడుగుతాడు.</p>
<p>&#8221; భయపడిందిగా తను, గండు తుమ్మెద ముసిరితే &#8230; ఎవరక్కడ- ఈ ధూర్తపు భ్రమరాన్ని తరిమికొట్టండి &#8221; వర్తమానానికీ గతపుస్మృతికీ హద్దు చెరిగిపోతోంది రాజుకి. మళ్ళీ ఉన్మాదం.&#8221; ఏయ్, తుమ్మెదా. నిన్ను తామరపూవులో పెట్టి తాళం వేస్తాను సుమా &#8221;</p>
<p>&#8216; అంత కఠినశిక్షకి అది ఎందుకు భయపడదు &#8221; అంటూనే మాఢవ్యుడు &#8221; ఇతనికి పిచ్చి ఎత్తింది. ఇతనితో బాటు నాకూనూ. &#8221; అనుకొని..&#8221;అయ్యో, మిత్రమా, అది వొట్టి చిత్రమయ్యా &#8221; అని అరుస్తాడు.</p>
<p>దుష్యంతుడు విలపిస్తాడు ‘’  దర్శనసుఖమనుభవతః సాక్షాదివ తన్మయేన హృదయేన</p>
<p>స్మృతికారిణా త్వయా మే పునరపి చిత్రీకృత కాంతా ‘’</p>
<p>[ అయ్యో. ఆమె ఉందనే సౌఖ్యం లో మైమరచి ఉన్నాను  కాదా. .. గుర్తు చేసి తిరిగి బొమ్మగా  మార్చేశావే ]</p>
<p>&nbsp;</p>
<p style="text-align: center;">[సశేషం ]</p>
<p> సంప్రదిస్తున్న గ్రంథాలు- ‘అభిజ్ఞానశాకుంతలం’ [M.R.Kale ] ‘,The Loom of  time ‘  [చంద్రా రాజన్] ,’  శాకుంతలము యొక్క అభిజ్ఞానత’  [ విశ్వనాథ సత్యనారాయణ ]&#8216;</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=6030</wfw:commentRss>
		<slash:comments>31</slash:comments>
		</item>
		<item>
		<title>సహృదయ ప్రమాణం, సంస్మరణీయ శోభ- శాకుంతలం [1]</title>
		<link>http://vaakili.com/patrika/?p=5658</link>
		<comments>http://vaakili.com/patrika/?p=5658#comments</comments>
		<pubDate>Wed, 30 Apr 2014 14:29:26 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కడిమిచెట్టు]]></category>
		<category><![CDATA[మైథిలి అబ్బరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=5658</guid>
		<description><![CDATA[<p></p> <p>&#8221;ఎవరు ఏ ఆత్మీయులను కోల్పోయినా ఆ స్థానాన్ని నేను భర్తీ చే స్తాను . పవిత్రమైన ధర్మబద్ధమైన ఎటువంటి బాంధవ్యాన్నైనా  స్వయంగా వారితో నెరపుతాను&#8217;</p> <p>దుఃఖం లో మునిగి తేలి మొత్తమంతా మెత్తనై పోయిన  మహా రాజు ఒకరు తన ప్రజలను ఉద్దేశించి ప్రకటిస్తాడు. ప్రేమించటం అంటే ఏమిటో, పోగొట్టుకోవటం ఎలా ఉంటుందోతెలుసుకున్న తర్వాతి  కారుణ్యం  అది .  గ్రహపాటు వలన విస్మరించిన ప్రియురాలిని ఎట్టకేలకు కనుగొన్నప్పుడు అక్షరాలా ఆమె పాదాల మీద పడతాడు [ఏకాంతంగా కూడా కాదు, ఆ సన్నివేశం లో ఇతరులు ఉండే అవకాశం ఉంది ] ఆ పాత్రను సృష్టించినది పరమ సహృదయుడైన కవి, కాళిదాసు. ఆ కృతి అభిజ్ఞాన శాకుంతలం. మహాభారతం ఆది పర్వం లోని ఉపాఖ్యానం లో  ఆ నిష్టురుడనిపించే నాయకుడిని శాపగ్రస్తుడైన మహా ప్రేమికుడిగా మలచి ఇచ్చిన ఉదాత్తకల్పన అది .</p> <p>సంస్కృత పంచ కావ్యాలలో మూడు ఆయనవి. వ్యాస వాల్మీకుల తర్వాత పెద్ద పీట ఆయనది. తన ఇష్టదేవత కాళీమాతకు సేవకుడనని  తప్ప ఏ వ్యక్తిగతమైన వివరాలనూ ఇవ్వలేదు, బుద్ధి పూర్వకంగానే వదలిపెట్టినట్లు తోస్తుంది. &#8221; తన ముందరివారినుంచి తక్కువ తీసుకొని తర్వాతి వారికి చెప్పేందుకు తక్కువ వదలిపెట్టిన &#8221; రచన కాళిదాసుది. ఇంతా చేసి అది ఆడంబరం లేని కవిత్వం.  వాచ్యం అయినది తక్కువ, స్ఫురింపచేసేది ఎక్కువ. ఆయన చేతిలో భాష ఒద్దికగా ప్రవహించింది, పదాలు ఆయన ఉద్దేశించిన అన్ని అర్థాలనూ  ఇచ్చాయి. ఆలోచనామృతం సాహిత్యం అన్న మాట అక్కడ సార్థకం. తరచేకొద్దీ ఒక్కొక్క పదమూ ఒక తలుపు తెరుస్తుంది. ఒక విషయాన్ని చెప్పేందుకు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయనిపించే మాటలలో ఒక్కదాన్నే ఏరుకొని వాడతారు. ఆ పదం ఎలా పుట్టిందో  [వ్యుత్పత్తి ] ఆ మూలం  అక్కడి సందర్భానికి అతికినట్లు సరిపోతుంది. కాళిదాసు తన ఉపమానాలను వ్యాకరణం, ఖగోళం వంటి శాస్త్రాలనుంచి కూడా తీసుకుంటారు. నూతనమైనవీ విలక్షణమైనవీ ఆ ఉపమలు. ఉదాహరణకి [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg"><img class="aligncenter size-full wp-image-4744" title="kadimi" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg" alt="" width="810" height="284" /></a></p>
<p>&#8221;ఎవరు ఏ ఆత్మీయులను కోల్పోయినా ఆ స్థానాన్ని నేను భర్తీ చే స్తాను . పవిత్రమైన ధర్మబద్ధమైన ఎటువంటి బాంధవ్యాన్నైనా  స్వయంగా వారితో నెరపుతాను&#8217;</p>
<p>దుఃఖం లో మునిగి తేలి మొత్తమంతా మెత్తనై పోయిన  మహా రాజు ఒకరు తన ప్రజలను ఉద్దేశించి ప్రకటిస్తాడు. ప్రేమించటం అంటే ఏమిటో, పోగొట్టుకోవటం ఎలా ఉంటుందోతెలుసుకున్న తర్వాతి  కారుణ్యం  అది .  గ్రహపాటు వలన విస్మరించిన ప్రియురాలిని ఎట్టకేలకు కనుగొన్నప్పుడు అక్షరాలా ఆమె పాదాల మీద పడతాడు [ఏకాంతంగా కూడా కాదు, ఆ సన్నివేశం లో ఇతరులు ఉండే అవకాశం ఉంది ] ఆ పాత్రను సృష్టించినది పరమ సహృదయుడైన కవి, కాళిదాసు. ఆ కృతి అభిజ్ఞాన శాకుంతలం. మహాభారతం ఆది పర్వం లోని ఉపాఖ్యానం లో  ఆ నిష్టురుడనిపించే నాయకుడిని శాపగ్రస్తుడైన మహా ప్రేమికుడిగా మలచి ఇచ్చిన ఉదాత్తకల్పన అది .</p>
<p>సంస్కృత పంచ కావ్యాలలో మూడు ఆయనవి. వ్యాస వాల్మీకుల తర్వాత పెద్ద పీట ఆయనది. తన ఇష్టదేవత కాళీమాతకు సేవకుడనని  తప్ప ఏ వ్యక్తిగతమైన వివరాలనూ ఇవ్వలేదు, బుద్ధి పూర్వకంగానే వదలిపెట్టినట్లు తోస్తుంది. &#8221; తన ముందరివారినుంచి తక్కువ తీసుకొని తర్వాతి వారికి చెప్పేందుకు తక్కువ వదలిపెట్టిన &#8221; రచన కాళిదాసుది. ఇంతా చేసి అది ఆడంబరం లేని కవిత్వం.  వాచ్యం అయినది తక్కువ, స్ఫురింపచేసేది ఎక్కువ. ఆయన చేతిలో భాష ఒద్దికగా ప్రవహించింది, పదాలు ఆయన ఉద్దేశించిన అన్ని అర్థాలనూ  ఇచ్చాయి. ఆలోచనామృతం సాహిత్యం అన్న మాట అక్కడ సార్థకం. తరచేకొద్దీ ఒక్కొక్క పదమూ ఒక తలుపు తెరుస్తుంది. ఒక విషయాన్ని చెప్పేందుకు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయనిపించే మాటలలో ఒక్కదాన్నే ఏరుకొని వాడతారు. ఆ పదం ఎలా పుట్టిందో  [వ్యుత్పత్తి ] ఆ మూలం  అక్కడి సందర్భానికి అతికినట్లు సరిపోతుంది. కాళిదాసు తన ఉపమానాలను వ్యాకరణం, ఖగోళం వంటి శాస్త్రాలనుంచి కూడా తీసుకుంటారు. నూతనమైనవీ విలక్షణమైనవీ ఆ ఉపమలు. ఉదాహరణకి అనసూయా ప్రియంవదల తో ఉన్న  శకుంతలను రెండు విశాఖ నక్షత్రాలతో కలిసి ఉన్న శశాంక లేఖ లాగా ఉందంటారు. ఆయన  స్వయంగా జ్యోతిశ్శాస్త్రజ్ఞుడనీ ఉంది.</p>
<p>&#8221; ఆత్మని  ఆకట్టుకొని కట్టిపడేసేవి అన్నిటికీ , తృప్తి పరచి విందు చేయగల అన్నిటికీ నెలవైనది  శాకుంతలం .  యౌవన  వసంత  పుష్పాలు,  పరిణత హేమంత ఫలాలూ ఒక్కసారే ఒకే చోట అక్కడ. &#8230;స్వర్గ మర్త్య లోకాలు ముడివడిన ఆ పేరు, ఆ చోటు  శాకుంతలం.  &#8221;  [Goethe ]</p>
<p>భారతీయుల ఈ పున్నెపు పంట పాశ్చాత్యులకి అనువాదమవటం వారి అదృష్టం. వారు గుర్తించినంత మాత్రాన దాని ఘనత ప్రత్యేకించి హెచ్చదు.  18, 19 వ శతాబ్దాలలో వారి వారి ప్రతిభనూ దృక్పథాన్నీ అనుసరించి భాషాంతరీకరణం చేసినవారెవరినీ [William Jones, Monier-Wiliams మొదలైనవారు] భారతీయతను పూర్తిగా ప్రతిబింబించలేదని తప్పు పట్టలేమని కూడా  నాకు అనిపిస్తుంది. ఆ నాటకపు ఉత్తమత్వాన్ని తమ దేశపు ప్రజలకి ఆమోదయోగ్యంగా చేరవేసే క్రమం లో చేసుకున్న మార్పులు అవి… కొంతమేరకు కలోనియల్ తప్పిదా లు దొర్లిఉండవచ్చు.<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/04/hari-lal-medh.jpg"><img class="alignright size-medium wp-image-5662" title="hari lal medh" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/04/hari-lal-medh-295x300.jpg" alt="" width="350" /></a></p>
<p>ఈ దేశపు చరిత్రకారిణి ఐన రొమిల్లా థాపర్ ఆయనను విమర్శించారు… మహాభారతం లో సబల గా కనిపించే శకుంతలను పితృస్వామ్యపు బందీ గా , బలహీనురాలిగా చిత్రించారని.  కావచ్చు, కాకపోవచ్చు.</p>
<p>శతపథ బ్రాహ్మణం లో శకుంతల ప్రసక్తి ఉంది. అప్సరస కుమార్తె గా కాక అప్సరస గానే ఆమె చెప్పబడింది. కుమారుడు భరతుని ప్రస్తావనా ఉంది. పద్మపురాణం స్వర్గ ఖండం లో శకుంతల కథ కాళిదాసు చెప్పినదానిని పోలి ఉంది. తెలుగులో పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి వ్యాస కాళిదాసుల కథలను  కలిపి శృంగార శాకుంతలం రచించారు .</p>
<p>ఋషి అయిన వ్యాసులు శకుంతలోపాఖ్యానం లో లోకవృత్తాన్ని వ్యాఖ్యానిస్తారు. బుద్ధి తో  అర్థం చేసుకోవలసిన వృత్తాంతం అది. కాళిదాసు రచన హృద యాన్ని గురి చూస్తుంది. వీటిలో ఒకటి మెఱుగైనదని, మరొకటి కాదని అనగల వీలు లేదు. తన నాయకుడిని నిష్కళంకుడిగా నిరూపించేందుకు కాళిదాసు మనసారా చేసిన  ప్రయత్నం ఒక అద్భుతంగా పరిణమించింది. బహుశా ఆయన ఇచ్చిన ధైర్యం వల్లనే భవభూతి సాక్షాత్తు శ్రీరామచంద్రుడినీ తన ఉత్తరరామచరితం లో దిద్దారు, నాటకాన్నిసుఖాంతం  చేశారు.</p>
<p>మహాభారతం లో వేట నిమిత్తం వచ్చిన దుష్యంతుడు శకుంతలను చూసి మోహావిష్టుడవుతాడు.తన పుట్టు పూర్వోత్తరాలను శకుంతల యే అతనికి చెబుతుంది.   కణ్వ మహర్షి ఫల సేకరణకు అరణ్యం  లోకి వెళ్ళి ఉండి కొంతసేపు ఎదురు చూస్తే తిరిగివచ్చే పరిస్థితి అది. అయినా దుష్యంతుడు తొందర పడతాడు, తొందర పెడతాడు గాంధర్వ వివాహానికి. శకుంతల ఆలోచనాశీల , తనకు కలగబోయే  కుమారుడు పట్టాభిషిక్తుడయే షరతు మీద దుష్యంతుడిని చేరతానని అంటుంది. ఆ ఒప్పందానికి ఒప్పుకొని కా సేపు మాత్రమే అమెతో ఉండి అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కణ్వమహర్షి తిరిగి వస్తాడు. ఇక్కడ దుష్యంతుడి వాంఛ, శకుంతల . ముందుచూపు..రెండూ లౌకికమైన విషయాలు. దుష్యంతుడికి ఆమెను నగరానికి తెచ్చుకోవాలనే తొందర మాత్రం ఉండదు. చివరకు కొంత ఎదిగిన పుత్రుడితో ఆమె సభకు వచ్చినప్పుడు తిరస్కరిస్తాడు, ఎఱగనని అంటాడు. నీ తల్లి వేశ్య, నీ తండ్రి బ్రాహ్మణత్వం కోసం వెంపర్లాడినవాడు అని నిందిస్తాడు. [శాకుంతలం ఐదవ అంకం లో ఈ సందర్భం వస్తుంది. దుష్యంతుడు శకుంతలను నిందించటం ఉంది, అయితే అంత దురుసుగా ఉండదు.పైగా ఆయన మరచిపోయాడని మనకు తెలుసాయెను]</p>
<p>భారతం లో రాజసభ లోని శకుంతల మాటలలో  ఆమె వాక్చమత్కృతి, అనల్పమైన  జ్ఞానం కనిపించినా, . అంత నేర్పుగా చేసిన  వాదనకూ అతనేమీ లొంగడు. ఆకాశవాణి సత్యాన్ని తెలియజేసినాకనే   ఆమెనూ పుత్రుడినీ స్వీకరిస్తాడు. &#8216; నా అబద్ధాలన్నీ లోక భీతి తో అన్నవి &#8221; అని సంస్కృతం, తెలుగు రెండు పాఠాలలోనూ ఉంది. &#8221; పతివ్రత వైన నువ్వు నా తప్పును మన్నించు &#8221; అని వ్యాస భారతం లో మాత్రమే ఉంది. అటువంటి పద్యమేదీ నన్నయ్య గారు  రచించినట్లు కనబడదు, కారణం తెలియదు.     భారతం లో కేవలం ఇది ఒక ఉపాఖ్యానం కనుక ఎక్కువ వివరాలను ఆశించలేము.</p>
<p>కాని సాధారణం గా వచ్చే సందేహం ఉంటుంది, శకుంతల అటువంటి  తన భర్త గురించి ఏమనుకొని ఉంటుందా అని. పట్టమహిషి అవటం తో, యువరాజ మాత అవటం తో తృప్తి పడి ఉంటుందా ? అయితే  అది ఇతిహాసం,  చరిత్రను కాలం తో హెచ్చవేస్తే వచ్చినది. అన్ని ప్రశ్నలకూ జవాబులు ఉండనవసరం లేదు.  అటువంటి అనుమానమే [తార్కిక పరిభాష లో అనుమానం అంటే ఊహించి తెలుసుకోవటం]  కవికుల గురువు కాళిదాసు కి వచ్చి ఉండవచ్చు. ఆ కథ లోని &#8216; నాటకీయత &#8216; ఆయనను ఆకర్షించి ఉండాలి. సారాన్ని ఆధారమాత్రంగా గ్రహించి తమ  ఉపజ్ఞతో  మచ్చ లేని ధీరోదాత్త నాయకుడినీ ముగ్ధ అయిన వనబాల గా  నాయికనీ  సృష్టించారు.  ఆ కథా క్రమాన్ని పొసగిస్తూ రావటం లో పూర్తిగా &#8216; సంస్కృతమైన &#8216;  రచన ఏర్పడింది. తీర్చి దిద్దని భావమూ శబ్దమూ కనబడవు, అసలు ప్రతి వాక్యానికీ వేర్వేరు  స్థాయిలలో అర్థం ధ్వనిస్తుంది. భరతుని నాట్యశాస్త్రాన్నికాళిదాసు  పూర్తిగా పాటించి ఉండలేదని అంటారు. ఆ భరత ముని  కాళిదాసుకు  తర్వాతి వాడేమో. శాస్త్రం కాళిదాసు విషయం లో retrospective  అయిఉండనూవచ్చు.</p>
<p>సరైనది ఇది అని నిర్ణయించలేనన్ని పాఠాంతరాలు శాకుంతలానికి ఉన్నాయి. ఆసేతు శీతాచలమూ అవిరళం   అయిన వ్యాప్తికి అవి తార్కాణాలు . ముఖ్యమైనవి- తూర్పు [బెంగాల్  ],  దక్షిణ, కాశ్మీరీ, ఉత్తర [దేవనాగరి ] ప్రతులు. వీటిలో తూర్పు ప్రతి ఎక్కువ ప్రామాణికం అన్న అభిప్రాయం ఉంది</p>
<p>అరిస్టాటిల్ పొయిటిక్స్ లో నాటకం గురించి చెప్పినదానికి భిన్నమైనది భారతీయ నాటక లక్షణం. నిజాన్ని యథా తథం గా ప్రతిబింబించరు ఇక్కడ. అనుకరణ పైన కాక సాదృశ్యం  [మరొక వస్తువుతో పోలిక ], ప్రమాణం  [ ఉండవలసిన పద్ధతి ] మీద  నాటకం  ఆధారపడుతుంది .  పాశ్చాత్యనాటకం లో కష్టాలు నాయకుడి వ్యక్తిత్వం లోనో ప్రవర్తన లోనో కలిగిన దోషాలవలన ప్రాప్తించవచ్చు. భారతీయనాటకం లో అవి దైవికంగానో కర్మ ఫలితంగానో వస్తాయి . ఇక్కడ విషాదాంతమైన నాటకం ఉండదు, ఉండకూడదు. జీవి ముక్త అయే క్రమం లో ఈ జన్మ ఒక అంకం మాత్రమే కనుక ఆశ చావటం ఎన్నటికీ లేదు, దాన్ని నిలిపి ఉంచటం కళకి ధ్యేయం.</p>
<p>అక్కడ లేని విధంగా ఇక్కడ భావుకుడైన ప్రేక్షకుడికి  కూడా సముచితమైన  స్థానం ఇవ్వబడింది .  ప్రదర్శించే రసానికి అనువైన స్థాయీభావాలు  ప్రేక్షకుల మనసులలో కొనసాగేందుకు సంగీతం ఉపయోగపడుతుంది .</p>
<p>భరత మునిని అనుసరించి నాటకం లో రసం వట్టి ఉద్వేగం కాదు, పూర్తిగా వైయక్తికమూ కాదు. కళ చేత వడకట్టబడిన అనుభూతి అది. భారతీయ లక్షణ కారులు రసానుభవాన్ని కళా  సృజనా ఆస్వాదనా ఇరు దిక్కులనుండి వచ్చి  ఏకమైన  స్థితిగా వర్ణించారు. వాస్తవ జీవిత  భావాలను శుభ్రపరచి సానబట్టిన  తర్వాత గానీ వాటికి కావ్యస్థాయి రాదు అన్నది వారి నిర్దేశం. అయినా  లోకధర్మ, నాట్యధర్మాలను అనుసరించేవి గా రెండు రకాలైన నాటకాలను భరత ముని గుర్తించారు.</p>
<p>శాకుంతలం రెండవ రకానికి చెందినది.  రసజ్ఞు లైన ప్రేక్షకుల లో ఎక్కువ శాతం మందికి  [అభిరూప భూయిష్ఠులు ]నాటకం నచ్చుతుందనేవిశ్వాసాన్ని  ప్రారంభం  లో    సూత్రధారుడి నోట పలికిస్తారు. ఎంత సుశిక్షితమైనప్పటికీ కవి హృదయం తన సృజన ను  తాను పూర్తిగా విశ్వసించలేదనే  ఆ సన్నని  అభద్రతను సూచిస్తారు.</p>
<p>నాటకం  విస్మృతి, స్మరణ ల  మీద నడుస్తుందనే అర్థం  ప్రస్తావన లో ఉంది. సూత్రధారుని వెంట ఉన్న నటి గ్రీష్మ ఋతువు ను వర్ణిస్తూ గానం చేస్తుంది.  ఈ కాలంలో  నీటిలో మునగటం సుభగం అన్నది మొదటి మాట. సుభగము  అన్న మాట ఉల్లాసాన్నీ, శుభాన్నీ  రెండింటినీ చెబుతుంది.  [ కణ్వ మహర్షి శకుంతల క్షేమం కోసం సోమతీర్థానికి వెళ్ళి ఉంటాడు] . అరణ్యాల లోంచి వీచే గాలి పాటల పుష్పాల సం సర్గం చేత సురభిళమైనది [ వనవాసిని ఐన శకుంతల సహచర్యం తర్వాత తిరిగివచ్చే   దుష్యంతుడి స్థితి సూచితమైంది ] ప్రచ్ఛాయ సులభ నిద్రా  [చిక్కని నీడ లో ఇట్టే నిద్ర వస్తుందని ఒక అర్థం, శాపపు నీడలో మరపు వస్తుందనే ధ్వని ] దివసాః పరిణామ రమణీయా [ రోజులు తమ ముగింపు లో రమ్యమైనవి, నాటకం ముగుస్తూ రమణీయమైనది ]  పాట పూర్తవగానే  సూత్రధారుడు &#8221; ఇంతకూ మనం ఏమి ప్రదర్శించబోతున్నాము ? &#8221; అని నటిని ప్రశ్నిస్తాడు. &#8221; మీరే చెప్పారు కదండీ అభిజ్ఞాన శాకుంతలమని &#8221; అని జవాబిస్తుంది నటి. &#8221; అవును సుమా, నీ పాట లో మైమరచి  మరచేపోయాను &#8221; అని &#8221; అడుగో దుష్యంత మహారాజు, సారంగాన్ని వెండిస్తున్నాడు &#8221; అని  నాటకం లోకి వెళతాడు సూత్రధారుడు. కాళిదాసు వైదర్భీ శైలి [  గౌడీ , పాంచాలీ వైదర్భీ అన్న భేదాలు  కఠిన, మధ్యమ,సులభ శైలులను వరుసగా చెబుతాయి ]   ఇలాగ, ప్రేక్షకులకు , పాఠకులకు ప్రసన్నమవుతుంది .</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/04/abhijnanashakuntalam-kalidasa_virchit5256.jpg"><img class="alignleft size-medium wp-image-5663" title="abhijnanashakuntalam--kalidasa_virchit5256" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/04/abhijnanashakuntalam-kalidasa_virchit5256-212x300.jpg" alt="" width="212" height="300" /></a>దుష్యంతుని సారధి రాజును &#8221; ఆయుష్మంతుడా &#8221;  అనే అస్తమానం సంబోధిస్తాడు. వయసులో పెద్దవాడవటం ఒక కారణమైతే, యుద్ధాలలో, అరణ్యమృగాలతో  ప్రమాదం ఎదురవగల పరిస్థితులలో సారధి రథం నడప వలసి రావటం ఇంకొకటి. &#8221; సారంగాన్ని వెంబడిస్తున్న పినాకి [శివుడు ] వలె ఉన్నారు మహారాజు అంటాడు అతను. అద్వైతి అయిన  విశ్వనాథ తమ &#8216; శాకుంతలము యొక్క అభిజ్ఞానత &#8221; విమర్శ లో ఈ ప్రారంభం గురించి విపులంగా వివరిస్తారు. రాజు యొక్క అంతఃకరణం జాగృతమైన స్థితిని [  శివుడు ఉన్నట్లుగా]  కాళిదాసు ఉద్దేశించారని   ఆయన అంటారు. బుద్ధి, అహంకారం, చిత్తం, అంతఃకరణం  అనే నాలుగు పొరలలో అప్పటినుంచీ ఆయన అంతఃకరణం మేల్కొనే ఉంటుంది.  శాపం వలన మరపు వచ్చినప్పుడూ అది పనిచేస్తూనే, హెచ్చరిస్తూనే ఉంటుంది.శకుంతల దుష్యంతునికి మోక్ష సంబంధిని.</p>
<p>శాకుంతలం లో అసమాపక క్రియలను ఎక్కువ ఉపయోగించారని విశ్వనాథ అంటారు. కథ యొక్క చలనశీలత [dynamics] కి అవి ఊతం ఇచ్చాయేమో .</p>
<p>ఆ సారంగం పరుగెత్తుతున్న వర్ణన తో కథా గమనం సూచితమవుతూ ఉంది. జింక వెనుక భాగం ముందు భాగం లోకి చొచ్చుకుపోతున్నట్లుగా [నాటకపు చివరి అంకాల కోసమే మొదటివి ] , వియత్తు [ఆకాశం ] లో ఎక్కువగా భూమిమీద తక్కువగా కనిపిస్తోంది  జింక . శకుంతలలోనూ దివ్యత్వం ఎక్కువ, భౌమమైనది తక్కువ. ఆమె తల్లి దివిజ, తండ్రి మానవుడైనా , తపోనిధి. నాటకం ముగిసేదీ ఆకాశం లోనే. రాజు అంటాడు &#8221; తమ కదలిక వల్ల రేగిన ధూళి తమకే  అంటనంత వేగం గా రథాశ్వాలు పరుగెడుతున్నాయి. ఆ వేగం వలన సూక్ష్మమైనది పెద్దదిగా కనబడుతోంది, మధ్యలో విభజించబడినది ఒక్కటిగా అనిపిస్తోంది, వక్ర రేఖలు లు తిన్నగా కనిపిస్తున్నాయి . ఏదీ నాకు దగ్గరగా ఉందని తోచదు, అలాగని దూరంగానూ లేదు &#8221; నిజంగానే వేగం గా ప్రయాణించే వాహనం లోంచి చూస్తే ఇలాగే ఉంటుంది ఎప్పుడైనా. ఇంకా కొన్ని చోట్ల కనిపించే కాళిదాసు నిశిత పరిశీలనా దృష్టి ఇది, స్వభావోక్తి, ఉత్ప్రేక్షల కలయిక. అంతర్ధ్వని కాల గమనం-తరుముకొని వచ్చినట్లున్న కలయిక, వియోగ భ్రాంతి, పునస్సమాగమం.</p>
<p>జింక ని వెంటాడుతూ ఆశ్రమ పరిసరాల  లో ప్రవేశించిన రాజును తాపసులు వారిస్తారు,  పూల రాశి పైన నిప్పులుపోయవద్దని, బాధితులను రక్షించవలసిన నీవు అమాయకులను వేధించరాదని. రాజు తక్షణమే బాణాన్ని ఉపసం హరిస్తాడు. &#8221; యోగ్యుడైన పుత్రుడిని పొందెదవుగాక &#8221;  అని వారు దీవిస్తారు. సంతానం లేని రాజు &#8221; స్వీకరిస్తున్నాను &#8221; అంటాడు.</p>
<p>కణ్వ మహర్షి తన కుమార్తె ఐన శకుంతల గ్రహస్థితి అనుకూలం గా లేనందున దుర్విధి ని నివారించేదుకు సోమ తీర్థానికి వెళ్ళాడని వారు చెబుతారు .  ప్రతి వాక్యం లోనూ వర్తనం లోనూ అర్థాన్ని ఇమిడ్చిన తీరు ఇక్కడా తెలుస్తుంది. చంద్రుడు రోహిణితో  మాత్రమే ఉండి తక్కిన ఇరవై ఆరుగురు భార్యలనూ నిర్లక్ష్యం చేసినందుకు మామగారైన దక్షుడు క్షయ వ్యాధి గ్రస్తుడివి కమ్మని శపిస్తాడు. ఆ శాప నివృత్తి కోసం చంద్రుడు ఆ తీర్థాన్ని సేవించి సగం విముక్తుడవుతాడు. నెలలో సగం రోజులు వృద్ధి, సగం రోజుల క్షయం. కణ్వమహర్షి కూడా శకుంతల దుర్విధిని సగం మాత్రమే నివారించగలుగుతాడు. ఎంత అన్యోన్య ప్రేమికులైనా ధర్మాన్ని తప్పక పాటించి తీరాలని, దు ర్వాసుడి విషయం లో అతిథి సత్కారమనే  కర్తవ్యాన్ని మరచిన శకుంతల శాపగ్రస్తురాలైందని ఒక వాదన ఉంది.  ఈ సోముని [తక్కిన భార్యల పట్ల అధర్మం గా ప్రవర్తించిన] అపరాధం, ప్రాయశ్చిత్తం ఆ వాదాన్ని సమర్థిస్తున్నాయి.</p>
<p>మా పుణ్య క్రతువులు నీ రక్షణ లో ఏ విధంగా కొనసాగుతున్నాయో చూసి వెళ్ళమని, శకుంతల  ఆతిథ్యం స్వీకరించమనీ  ఆహ్వానిస్తారు రాజును. శకుంతల ను ఆశ్రమవాసులు &#8216; కణ్వదుహిత &#8216; అంటారు. ఒక్కతే కూతురని అర్థం,  తండ్రి లేనప్పుడు అతిథి మర్యాద ఆమె బాధ్యత. దుర్వాసుడి విషయం లో తప్పిదం అలా జరిగింది. ఆశ్రమం లో ప్రవేశించే ముందు తన కిరీటాన్నీ రాజలాంచనాలనూ తీసివేసి సారథి కి ఇస్తాడు రాజు, తపోభూమి లో ఆడంబరాలు, ఆభరణాలు ఉండకూడదని…   జరిగిన మేలు  సుందరుడైన సాధారణ మానవుడుగానే  శకుంతల ప్రేమను పొందగలగటం.</p>
<p>రాజు అనుకుంటాడు ‘’ ఇంత శాంతంగా ఉన్న మునివాటిక లో నా కుడిభుజం ఎందుకు అదురుతూ ఉంది ? ఇక్కడ నాకు ఏ శుభఫలం వస్తుందని  ? ఏమో, ఎవరికి తెలుసు, భవిష్యత్తు కి అన్నీ ద్వారాలే ![ భవితవ్యానాం  ద్వారాణి భవంతి సర్వత్ర ]శకుంతల, అనసూయ , ప్రియం వద &#8211; ముగ్గురు కన్యలనూ ఒకేసారి  కనిపిస్తారు. కొంత  దూరం నుంచీ ముగ్గురూ అందమైనవారు గానే  గోచరిస్తారు. దగ్గరికి వచ్చెసరికి శకుంతల రూపం ఒకటే లోకోత్తరం గా రాజుకి కనబడుతుంది. ఇక్కడా కాళిదాసు సూక్ష్మ దృష్టి.</p>
<p>&#8221; నీలి తామర రేకుతో శమీ వృక్షాన్ని కోయబోయినట్లు ఈ ముగ్ధ సౌందర్యానికి తపస్సు శక్యమా! &#8221;</p>
<p>పండుటాకు మాటున దాగిన పూవు లాగా ఈమె నార బట్టలలోనూ ప్రకాశిస్తోంది &#8221;</p>
<p>శకుంతల అనుకుంటుంది &#8221;ఇతనిని చూస్తే తపోవనానికి విరుద్ధమైన’ వికాసం ‘ ఏదో కలుగుతూ ఉందేమిటి ?&#8221;</p>
<p>ఆమె  సౌందర్యానికి కవి వేసిన ఉపమానాలు అన్నీ లతా తరు గుల్మ  సంబంధమైనవే. లేతగా తాజాగా ఉంటాయి. ఆమె నవమల్లికా లత  నొకదాన్ని పెంచుకుంటుందట, దానికీ తనకూ తేడా లేదట.  దాని పేరు వనజ్యోత్స్న. అంటే అడవిని  కాచిన  వెన్నెల. మనం వాడే లోకోక్తి ఇక్కడ నిరుపయోగం అవుతూంది.అసలు వెన్నెల కాయవలసినది అడవిలోనేనన్న మాట. అది ఋతువు కాకపోయినా మొగ్గలతో నిండిపోయింది .మల్లె తీగకూ మామిడిచెట్టుకూ మొదట జరిగిన పెళ్ళి  ఇక్కడేనేమో.   శకుంతల జననానికి  సంబంధించిన కథను అనసూయ వినిపిస్తూ &#8221; ఆ వసంత కాలం లో తనను ఉన్మత్తుడిని చేయగల మేనకా సౌందర్యాన్ని విశ్వామిత్రులు వీక్షించి ..&#8221; అని అర్థోక్తిలో ఆగుతుంది. &#8221; అర్థమైంది.  ఈమె అప్సర కుమార్తెనా ? &#8221; అంటాడు రాజు . సున్నితమైన సంభాషణ. .[ ఇదే సందర్భం లో భారతం లో శకుంతల  తన జన్మ వృత్తాంతాన్ని తల్లిదండ్రుల కలయిక తో సహా  విపులంగా వివరిస్తుంది.]</p>
<p>&#8221; అవును, మానవ స్త్రీలకి ఇంత అందం ఉంటుందా ! ప్రభా తరళమైన   జ్యోతి [తరళము అంటే చలించేదీ ప్రకాశించేదీ రెండూ ] భూమి మీద మొలుస్తుందా ! &#8221;<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/04/1940s_Vintage_Hindu_Print_Dushyant__Shakuntala.jpg"><img class="alignright size-medium wp-image-5661" title="1940s_Vintage_Hindu_Print_Dushyant_&amp;_Shakuntala" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/04/1940s_Vintage_Hindu_Print_Dushyant__Shakuntala-199x300.jpg" alt="" width="350" /></a></p>
<p>ఆమె క్షత్రియుడు పెళ్ళాడదగినది  అని, అవివాహిత అని తెలుసుకొన్నాక &#8221; సందేహాస్పదమైనది నిశ్చితం అవుతోంది కదా, హృదయమా నీ ఈప్సితం నెరవేరేలాగా ఉంది, అగ్ని అనుకున్నది ఆభరణమైంది ‘’</p>
<p>&#8221; ఆ  కోమలమైన చూపు,  కన్నుల్లో తడి  వెలుగులు &#8230;నా కోసమే అవునా, లేక నన్ను నేనే చూస్తున్నానా ? &#8221;</p>
<p>శకుంతల  తన ఆసక్తిని దాచుకుంటూ వెళ్ళబోతున్నప్పుడు[కొంత దూరం వెళ్ళి వెనక్కి వస్తుంది ] &#8221;అనుయాస్యన్ మునితనయాం  సహసా వినయేన వారితప్రసరః  స్థానాదనుచ్చలత్రాపి గత్వేవ పునః ప్రతి నివృతః &#8221; అనుకుంటాడు.  &#8221;  ఆమెను వెంబడించి   వెళ్ళేందుకు సభ్యత అడ్డు వచ్చి వెళ్ళలేక ఉన్నచోటనే ఉన్నా , వెళ్ళి  తిరిగి వచ్చినట్లే ఉంది &#8216; విశ్వనాథ &#8216; వేయి పడగలు &#8216; చివరలో అంటారు &#8221; ఆమె ద్వారము వద్ద నిలుచుండెను . ఆ నిలుచుండుట కూడ తన వంకకు  నడుచుచున్నట్లే యుండెను  &#8221; అని.  ప్రభువైన కాళిదాసు అని ప్రస్తావిస్తారు కదా  ఆయనను విశ్వనాథ తమ విమర్శలో.</p>
<p>&#8221; , ఆగాగు.. ఇంకా రెండు చెట్లకి నీరు పోయటాన్ని  నువ్వు నాకు బాకీ ఉన్నావు &#8221; అంటుంది ప్రియంవద.’’  ఆమె అలసిపోయినట్లుంది,ఇదిగో, ఈ అంగుళీయకం తో ఆమె అప్పు తీరుస్తాను &#8221; అంటాడు రాజు. ఆ ఉంగరం మీద పేరు చదువుకుని అతన్ని వారు గుర్తిస్తారు. ఇక్కడే  ప్రధాన పాత్రధారిణి  , ప్రతినాయికా తుల్య ఐన అంగుళీయకం ప్రవేశిస్తుంది.</p>
<p>మాలినీ [మందాకిని ] నదీతీరం, సప్తపర్ణి వృక్షాల చల్లటి  నీడలు,  పద్మాల సుగంధం,  స్నేహితురాళ్ళ ఆహ్లాదం… చెప్పీ చెప్పని మాటలు, అటువైపు తిరిగినా చూడగలిగిన  చూపులు …ఆకుపచ్చని స్వప్నలోకం- అమాయకమైన ఆహ్వానం దుష్యంతుని కోసం .</p>
<p>వెళ్ళలేక ముల్లు గుచ్చుకున్న వంక తో ఆగి తిరిగి చూస్తూన్న శకుంతల రవివర్మ చిత్రం ద్వారా మనకు పరిచయమే.</p>
<p>అసలు కవిత్వం అప్పటి దుష్యంతుని భావన లో ఉంది. &#8221;ఆలోచనను ఆమెనుంచి తెంపుకోలేకుండా ఉన్నాను. రథం ముందుకు కదులుతూ ఉంటే ఆపైని చీనా  పట్టు జెండా వెనక్కి ఎగురుతున్నట్లు నా శరీరం ముందుకు వెళుతూ ఉంటే హృదయం వెనక్కి లాగుతూ ఉంది. &#8221;</p>
<p>రెండవ అంకం దుష్యంతుని శిబిరం లో. చెలికాడైన మాఢవ్యుడితో  రాజు [శకుంతలను ఉద్దేశించి ]  &#8221; అసలు చూడవలసిన దాన్ని నువ్వు చూడనేలేదు &#8221; అంటాడు. &#8221; నువ్వు నా ఎదురుగానే ఉన్నావు కాదా &#8221; అంటాడు మాఢవ్యుడు.యథాలాపంగా అన్నట్లు అనిపించినా అతనికి దుష్యంతుడి మీద ఎంతో అభిమానమని తర్వాత రాజు అన్న మాటలలో తెలుస్తుంది &#8221; సర్వః కాంతమాత్మీయం పశ్యతి &#8221; [ప్రియమైన వారు అందరికీ అందంగానే కనిపిస్తారు ]</p>
<p>సరే,మునికన్య నీకు ఎలా అందుతుందని మాఢవ్యుడు అడుగుతాడు..  రాజు &#8221; అప్సరా దివ్యదేహం  నుంచి   ప్రభవించిన ఆమె  ఋష్యాశ్రమంలో పెంపుడు బిడ్డ అయింది,  సువాసనలు చిమ్మే  తెల్లని మల్లె పూవు తీగ నుండి విడివడి  జిల్లేడు ఆకు మీద రాలినట్లు’ ’అని వివరించి రెండు శ్లోకాలలో ఆమెను వర్ణిస్తాడు .</p>
<p>&#8221; చిత్రే నివేశయ పరికల్పిత సర్వ యోగా &#8221; అన్నది మొదటిది. ఆమె ఒక ప్రత్యేకమైన సృష్టి [స్త్రీరత్న సృష్టిరపరా ప్రతిభాతి సా ] అని, విధాత  అరుదైన చక్కదనాలన్నీ  కలిపి  చిత్తరువు గీసి ప్రాణం పోశాడా అని.</p>
<p>ఆ తర్వాతి శ్లోకం సుప్రసిద్ధం .</p>
<p>&#8221; అనాఘ్రాతం పుష్పం కిసలయమలూనం కరరుహై [ఆఘ్రాణించబడని పుష్పం, గోరు తగలని లేత మొలక ]</p>
<p>రనవిద్ధం రత్నం మధు నవమనాస్వాదితరసం [రంధ్రం చేయబడని రత్నం, రుచి చూడని మధురసం ]</p>
<p>అఖండ పుణ్యానాం ఫలమివచ తద్రూపమనఘం [ ఆ నిష్కల్మషమైన రూపం [నా ]  అఖండపుణ్యఫలం ]</p>
<p>న జానో భోక్తారం కమిహి సముపస్థాస్యయతి విధిః [ఆమె కోసం విధాత ఎవరిని నిర్ణయించి ఉన్నాడో]</p>
<p>మూడవ పంక్తి చదువుతున్న ప్రతిసారీ కళ్ళు చెమ్మగిల్లుతాయి&#8230; దుష్యంతుడు తన  సుకృతాన్ని గుర్తు పట్టటం అది. ఆ మాటలు భార్య గురించి ప్రతి పురుషుడూ భావించగల దానికి  పరమావధి.</p>
<p>‘’ మరి ఆమె సంగతి ?’’- మాఢవ్యుడు</p>
<p>‘’ ఆమె ప్రేమను వ్యక్తం చేయలేదు, దాచిఉంచనూ లేదు ‘’</p>
<p>‘’ అయితే  త్వరగా ఆమెను రక్షించండి, ఏ ఇంగుడి నూనె అంటిన జిడ్డు చేతులలోనే ఆమె పడిపోగలదు &#8221; అని హాస్యం చేస్తాడు మాఢవ్యుడు.</p>
<p>ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు-కణ్వమహర్షి  లేడు కనుక, ఆశ్రమవాసులు రాజును కొన్నాళ్ళు  రక్షగా ఉండమని అడుగుతారు. ఈ లోపల రాజ మాత తన వ్రతం ముగుస్తోందనీ కొడుకును రమ్మనీ కబురు చేస్తుంది. &#8221;దూర దూరంగా ఉన్న  రెండు చోట్లాకర్తవ్యాన్ని    నిర్వహించటం ఎలాగ !ప్రవాహం మధ్యలో పర్వతం అడ్డువచ్చి రెండుగా చీలిన నదిలాగా  నా హృదయం ద్విదాభూతమైంది. &#8221; [వాస్తవానికి మున్యాశ్రమ రక్షకు ఎవరినైనా నియమించవచ్చు, తానే అవసరం లేదు. అది ఒక మిష.] నువ్వూ మా తల్లికి కొడుకు వంటి వాడవే నని మాఢవ్యుడిని నగరానికి వెళ్ళమంటాడు.  ఈ వాగుడు పిట్ట ఇక్కడి వార్తలను అంతఃపురం లో వినిపించి ఎక్కడ కలకలం రేపుతాడోనని &#8221; ఇదంతా ఒట్టిదేనోయీ [పరిహాస విజల్పం ] మనమెక్కడ, లేళ్ళతో సమంగా పెరిగిన, పరోక్ష మన్మథ [ఇక్కడా రెండు అర్థాలు. మన్మథ భావమే తెలియనిదని, పరోక్షం లోనే  ఆ భావం ఉన్నదని ]అయిన ఆమె ఎక్కడ!  &#8221; అని చెప్పి పంపుతాడు. దుష్యంతుడికి మనస్స్థానీయుడైన మాఢవ్యుడు శకుంతలా దుష్యంతుల గాంధర్వ వివాహ సమయం లో ఉండకపోవటం అనర్థమైంది, అతను లేకపోయిన మరొక సన్నివేశమూ అస్తవ్యస్తమవుతుంది.</p>
<p>మూడవ అంకం లో ఒకరి ప్రేమ మరొకరికి తెలిసే తీరు  మృదువుగా, మర్యాదగా ఉంటుంది. ఇక్కడి మాటలలో హృద్యమైనవి కొన్ని ..దుష్యంతుడి స్వగతాలు</p>
<p>‘’’’ ఆమె రూపం  నేత్రనిర్వాణం ‘’</p>
<p>&#8221;ఎంత లోతుగా ప్రేమించీ ఆమెను గెలుచుకోవటం తేలికేమీ కాదు&#8230; ఊరికే ఆమెను గమనిస్తూ  ఉన్నా చాలు.  ‘’</p>
<p>&#8221; ముఖాలు పైకెత్తి రెప్పలార్పని కళ్ళతో నెలవంకను , అందుతుందనేనా చూస్తారు అంతా ? నేనూ ఆమెను అంతే.’’</p>
<p>శకుంతలను ఉద్దేశించి &#8221; లక్ష్మి కోసం వెతికేవారికి ఆమె లభించవచ్చు, లేకపోవచ్చు. లక్ష్మి స్వయంగా వెతికేవారు ఆమెకు అందకుండా ఉంటారా ? &#8221; ఎవరు నిన్ను తిరస్కరిస్తారనుకుంటున్నావు ? రత్నం వెదకదు, వెదకబడుతుందిగానీ  ! &#8221;</p>
<p>‘’ నిన్నూ విరహం దహిస్తోంది, నన్నయితే మింగేస్తోంది.-పొద్దు పొడుపు కి కలువ వాడుతుంది, చంద్రుడు మొత్తా నికీ మాయమవుతాడు  &#8221;</p>
<p>ఆ తర్వాత ‘’నా రుగ్మతకు కారణమైన స్మరుడే ఉపశమనాన్ని కూడా ఇస్తున్నాడు. మబ్బులు మూసిన చీకటి లోంచే కదా  వేసవి ముగిసిన వర్షం కురుస్తుంది ! &#8221; &#8221; ఆహా ! అదృష్టం అమృతమై కురిసి ఫాలాక్షుడు  దహించిన వృక్షం చిగురు తొడుగుతూ ఉంది &#8221;</p>
<p>కాలాతీతమైందని వెళ్ళిపోయే ఆమెతో &#8221; నీ హృదయమెంత కఠినం, పూవు కాడ లాగా&#8221;అనటం తమాషాగా ఉంటుంది , ఆ ఎడబాటు మరుసటి రోజువరకే అయినప్పుడు అంతకన్న గట్టి పదార్ధాన్ని ఉపమానంగా వాడక్కర్లేదు కదా..</p>
<p>‘’ ‘’ మళ్ళీ ఆమె ఒంటరిగా దొరికితే ఒట్టిగా పోనీయరాదని తెలివిమాలిన నా మనస్సు పథకం వేస్తుంది అలా&#8230;తీరా ఆమెను చూస్తే &#8211; జంకుతుంది, ఆగుతుంది &#8221;</p>
<p>అంతవరకూ అస్వస్థురాలిగా ఉన్న శకుంతల సంతోషంగా కనిపించటం చూసిన గౌతమి అనే వృద్ధ తాపసి  &#8221; ఇప్పుడు నీకు ఒంట్లో తేలికగా ఉందా ? &#8221; అని అడిగినప్పుడు శకుంతల &#8221;ఆర్యే, అస్తిమే విశేషః &#8221; అంటుంది. &#8221; నాలో [మెరుగైన ] మార్పు వచ్చింది &#8221; అని అర్థమట. అవును, విశేషమే, ఆ పైన . ఆ ప్రణయానికి పర్యవసానం అప్పటికి సంగమ శృంగారమే అయినా , అది హఠాత్తుగా సంభవించదు… ఏ షరతులూ అక్కడ విధించబడవు.  ఆ వైపుకు ఇద్దరూ  వేసే అడుగులు ఒక క్రమాలంకారం వలె సొగసుగా అనిపిస్తాయి</p>
<p>శకుంతలా దుష్యంతుల సమాగమాన్ని అసలు చెప్పరు కాళిదాసు.. అది ఆయన ఔచిత్యపు సౌకుమార్యం . అంగుళీయకం పైన ఉన్న తన పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని రోజులు గడిచేలోగా ఆమెను నగరానికి తీసుకువెళతానని తను ముందు బయలుదేరతాడు.</p>
<p>నాలుగవ  అంకం -అతని ధ్యాసలో నిమగ్నయై తన రాకను గుర్తించలేదని దుర్వాసుడు శపిస్తాడు, ‘’  అతని ధ్యాసలోంచి నువూ మాయం అయిపోతావు. ..మదిర సేవించినవాడికి  అంతకు ముందరి  కథలాగా  ‘’ &#8216;[ దుర్వాసుడు అనే పదం వ్యుత్పత్తులలో ఒకటి చెడ్డ అతిథి అని  ] . ప్రియంవద ప్రాధేయపడితే గుర్తు గా ఒక ఆభరణాన్ని చూపిస్తే జ్ఞాపకం వస్తుందని మాత్రం కరుణిస్తాడు.</p>
<p>ఈ శాపపు ఉదంతం లో ధర్మాతిక్రమణం[చెప్పుకోదగిన స్థాయిలో ] కాక ఒట్టి పుణ్యానికే వచ్చి మీద పడిపోయే ఇక్కట్లే నాకు కనిపిస్తాయి. వాటికి మూలం కర్మఫలమో గ్రహచారం బాగా లేకపోవటమో అనవచ్చు, అప్పుడు చేసిన అపరాధం మాత్రం కాదు.</p>
<p>ఇదంతా శకుంతలకు తెలియనే తెలియదు, అంత ఏకాగ్రత అతని మీద. స్నేహితురాళ్ళూ  చెప్పరు. కాలం గడిచిపోతుంది.</p>
<p>నాలుగవ అంకం లో  కణ్వ మహర్షి ఆమెను నగరానికి పంపే రోజున శిష్యుడిని రాత్రి ఎంత గడిచిందో చూడమంటాడు. అప్పటి శ్లోకం ఒక సుభాషితంగా ప్రసిద్ధం &#8221; ఒక వైపున ఓషధులకు రాజైన చంద్రుడు అస్తాద్రి లో క్రుంగుతున్నాడు. ఇంకొక వైపున అరుణుడిని ముందు పంపి సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఈ తేజోనిధులకే తప్పని ఇటువంటి పరిణామాలు లోకానికి మాత్రంతప్పుతాయా ? [లోకో నియమ్యత ఇవాత్మ దశాంతరేషు ] ‘’</p>
<p>ఆ సమయానికనే దాచి ఉంచిన పొగడపూలదండను [పరిమళం వీడనిదాన్ని ] అనసూయ తెస్తుంది. కణ్వుని అనుగ్రహం తో వనదేవత ఇచ్చిన పట్టు వస్త్రాలనూ నగలనూ &#8221; మాకు చేత అయితే కాదు కానీ చిత్రపటాలలో చూసి ఉన్నాము కదా, అలా అలంకరిస్తాము &#8221;  అంటారు చెలిమికత్తెలు. ఇక్కడ కణ్వ మహర్షి  చెప్పిన నాలుగు శ్లోకాలూ &#8221; కావ్యేషు నాటకం రమ్యం &#8221;   అన్న ప్రశంస లోవి. ఆయన  శర్మిష్ఠ లాగా వర్ధిల్లమని శకుంతలను దీవిస్తాడు. శకుంతలది లాగానే శర్మిష్ఠదీ గాంధర్వ వివాహం. ఆమె భర్త యయాతి అంతకుముందే దేవయానికి భర్త. అయినా శర్మిష్ఠ కొడుకైన పూరుడే అనంతరం రాజు అవుతాడు. అలాగే శకుంతల కి కలగబొయే కొడుకే రాజ్యాధికారి అవుతాడని ధ్వని.</p>
<p>కనబడని వన దేవతల దీవెన-&#8221;ఆమె మార్గం సురక్షితమగుగాక ! అనుకూల శీతల పవనాలు వీచుగాక ! పచ్చని తామర తీగలు  నిండిన సరస్సులు ఎదురవుగాక !  ఆతప కిరణాలనుంచి  దట్టమైన తరువులు  కాచుగాక ! కలువల పుప్పొడి మెత్తని ధూళిగా ఆమె పాదాలకు సుఖమవుగాక ! &#8221;<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/mithili2.gif"><img class="alignright  wp-image-4547" title="mithili2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/mithili2.gif" alt="" width="165" height="170" /></a></p>
<p>తన మల్లె తీగ వనజ్యోత్స్నను అనసూయా ప్రియంవద లకు అప్పగిస్తుంది శకుంతల. &#8221; మమ్మల్నెవరికి అప్పచెబుతావు &#8221; అని బావురుమంటారు వాళ్ళు.  ఆమె వెళుతూ ఉంటే కనిపించినంత మేరకూ చూసి స్నేహితురాళ్ళు ఇద్దరూ &#8221; అంతర్హితా శకుంతలా వనరాజ్యా &#8221; [  అరణ్య వృక్షాల వరుస వల్ల ఆమె కనబడకుండా పోయింది ] అని దిగులు పడతారు. ఇటు ఆశ్రమానికీ అటు అంతఃపురానికీ చెందక మొత్తంగా  అంతర్హిత అవబోతున్న సూచన ఇది. అయితే,  ఆ రెండూ కానక్కర్లేని అండగా ఆమెకు మరొక  లోకం ఉంది.</p>
<p>[సశేషం]</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=5658</wfw:commentRss>
		<slash:comments>47</slash:comments>
		</item>
		<item>
		<title>రససిద్ధుని  ప్రస్థానం</title>
		<link>http://vaakili.com/patrika/?p=5310</link>
		<comments>http://vaakili.com/patrika/?p=5310#comments</comments>
		<pubDate>Mon, 31 Mar 2014 19:56:32 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కడిమిచెట్టు]]></category>
		<category><![CDATA[మైథిలి అబ్బరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=5310</guid>
		<description><![CDATA[<p style="text-align: center;"></p> <p>నా వ్యక్తిగత  దృక్పథం లోంచి ఆయన శాపగ్రస్తుడై జన్మించిన కిన్నరుడో , విద్యాధరుడో. పూర్వ జ్ఞానం లేదు, లేకనూ పోలేదు. ఆకాశ గంగా నిర్మల ధారలు, దేవ పారిజాత వృక్ష ఛాయలు, మానవ కంఠాలలో పలకని దివ్యతరమైన సంగీతం , ఇవన్నీ స్ఫురించీ స్పష్టమవని అయోమయం , కొన్ని మధుర కటుత్వాలు, , కొన్ని జ్వరిత స్వప్నాలు, మరి కొన్ని భ్రాంతులూ సాక్షాత్కారాలూ. .. వాటిలోంచి పుట్టిన కవిత్వ సౌందర్యం.</p> <p>ఇంద్రజాలపు గవాక్షాలలోంచి ఆ  నిషిద్ధ సముద్రాల పొంగే నురగలు, చేరరాని గంధర్వలోకాలు.</p> <p>ఇరవై ఐదేళ్ళ జీవితవ్యవధిలో కిక్కిరిసిపోయిన శోకాలూ తీవ్రతలూ స్నేహాలూ అనురాగం&#8230;. కొన్ని దోసిళ్ళ సన్నజాజులూ కొన్ని గుప్పెళ్ళ విరజాజులూ …వెరసి యాభై మూడు పద్యాలు,  మిగిలాయి.</p> <p>ఇంగ్లీష్ రొమాంటిక్ కవులలో అందరికన్న ఆఖర్న జన్మించి ముందుగా గతించినవారు జాన్ కీట్స్.</p> <p>పదిహేడవ శతాబ్దపు చివరలో ఉధృతమైన  &#8216; Age of enlightenment ‘  &#8217; పాశ్చాత్య మేధోవిప్లవాలలో ముఖ్యమైనది.  అంతకు ముందే ఏర్పరచిన మతపు, రాజకీయపు నియమాలూ నిబంధనలూ వీటిని పక్కకు పెట్టి  సొంత మేధతో ఆలోచించమని ఎలుగెత్తిన ఇమాన్యుయేల్ కంట్[  ' The Critique of pure reason ‘  రచయిత  ]వంటివారు  కొన్ని సంకెళ్ళను తెంచారు. కాని అన్నిటినీ రీజన్ తో ముడిపెట్టట మూ బంధనమనీ మనిషి శక్తిని కుంగదీస్తోందనీ ఊపిరి ఆడనీయటం లేదనీ ఆ కొత్త సంకెళ్ళనూ తెగగొట్టినది రొమాంటిక్ మూవ్ మెంట్.</p> <p>మానవ ఉద్వేగం, ఊహాశక్తి, వైయక్తికమైన అనుభూతి, స్వేచ్చగా విస్తృతంగా  దాన్ని వ్యక్తీకరించటం, ఆదర్శాలు&#8230;స్థూలంగా వీటి పైన ఆధారపడినది రొమాంటిక్ కవిత్వం.</p> <p>పద్నాలుగు పదిహేనేళ్ళ వయసులో వర్జిల్ కి అభిమాని అయారు. పదహారేళ్ళప్పుడు ఎడ్మండ్ స్పెన్సర్ దీర్ఘ కవిత &#8216; ద ఫెయిరీ క్వీన్ &#8216; కి విపరీతంగా ఆకర్షితులయారు. అందులోని ఛందస్సునూ అనుసరించే ప్రయత్నం చేశారు, తన మొదటి పద్యమూ దాని గురించే. మానవ జీవితపు అత్యున్నతమైన [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: center;"><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg"><img class="size-full wp-image-4744 aligncenter" title="kadimi" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg" alt="" width="810" height="284" /></a></p>
<p>నా వ్యక్తిగత  దృక్పథం లోంచి ఆయన శాపగ్రస్తుడై జన్మించిన కిన్నరుడో , విద్యాధరుడో. పూర్వ జ్ఞానం లేదు, లేకనూ పోలేదు. ఆకాశ గంగా నిర్మల ధారలు, దేవ పారిజాత వృక్ష ఛాయలు, మానవ కంఠాలలో పలకని దివ్యతరమైన సంగీతం , ఇవన్నీ స్ఫురించీ స్పష్టమవని అయోమయం , కొన్ని మధుర కటుత్వాలు, , కొన్ని జ్వరిత స్వప్నాలు, మరి కొన్ని భ్రాంతులూ సాక్షాత్కారాలూ. .. వాటిలోంచి పుట్టిన కవిత్వ సౌందర్యం.</p>
<p>ఇంద్రజాలపు గవాక్షాలలోంచి ఆ  నిషిద్ధ సముద్రాల పొంగే నురగలు, చేరరాని గంధర్వలోకాలు.</p>
<p>ఇరవై ఐదేళ్ళ జీవితవ్యవధిలో కిక్కిరిసిపోయిన శోకాలూ తీవ్రతలూ స్నేహాలూ అనురాగం&#8230;. కొన్ని దోసిళ్ళ సన్నజాజులూ కొన్ని గుప్పెళ్ళ విరజాజులూ …వెరసి యాభై మూడు పద్యాలు,  మిగిలాయి.</p>
<p>ఇంగ్లీష్ రొమాంటిక్ కవులలో అందరికన్న ఆఖర్న జన్మించి ముందుగా గతించినవారు జాన్ కీట్స్.</p>
<p>పదిహేడవ శతాబ్దపు చివరలో ఉధృతమైన  &#8216; Age of enlightenment ‘  &#8217; పాశ్చాత్య మేధోవిప్లవాలలో ముఖ్యమైనది.  అంతకు ముందే ఏర్పరచిన మతపు, రాజకీయపు నియమాలూ నిబంధనలూ వీటిని పక్కకు పెట్టి  సొంత మేధతో ఆలోచించమని ఎలుగెత్తిన ఇమాన్యుయేల్ కంట్[  ' The Critique of pure reason ‘  రచయిత  ]వంటివారు  కొన్ని సంకెళ్ళను తెంచారు. కాని అన్నిటినీ రీజన్ తో ముడిపెట్టట మూ బంధనమనీ మనిషి శక్తిని కుంగదీస్తోందనీ ఊపిరి ఆడనీయటం లేదనీ ఆ కొత్త సంకెళ్ళనూ తెగగొట్టినది రొమాంటిక్ మూవ్ మెంట్.</p>
<p>మానవ ఉద్వేగం, ఊహాశక్తి, వైయక్తికమైన అనుభూతి, స్వేచ్చగా విస్తృతంగా  దాన్ని వ్యక్తీకరించటం, ఆదర్శాలు&#8230;స్థూలంగా వీటి పైన ఆధారపడినది రొమాంటిక్ కవిత్వం.</p>
<p>పద్నాలుగు పదిహేనేళ్ళ వయసులో వర్జిల్ కి అభిమాని అయారు. పదహారేళ్ళప్పుడు ఎడ్మండ్ స్పెన్సర్ దీర్ఘ కవిత &#8216; ద ఫెయిరీ క్వీన్ &#8216; కి విపరీతంగా ఆకర్షితులయారు. అందులోని ఛందస్సునూ అనుసరించే ప్రయత్నం చేశారు, తన మొదటి పద్యమూ దాని గురించే. మానవ జీవితపు అత్యున్నతమైన ఘనతలను కీర్తించటం ఆ కవిత్వపు లక్ష్యంగా స్పెన్సర్ స్వయంగా  చెప్పుకున్నారు. ఆ ప్రభావం కీట్స్ భావధారను బలంగా మలచింది.<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/03/listening-to-the-nightingale-by-joseph-stevern.jpg"><img class="alignright  wp-image-5314" title="listening to the nightingale by joseph stevern" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/03/listening-to-the-nightingale-by-joseph-stevern.jpg" alt="" width="378" height="378" /></a></p>
<p>గ్రీక్ పురాణ గాథలు కీట్స్ కవిత్వంలో పదే పదే కనబడతాయి. ఇంగ్లీష్ లో అనువదించబడిన గ్రీక్ సాహిత్యం తో బాటు గ్రీక్ శిల్పం కూడా అద్భుతంగా తోచింది. గ్రీక్ భాష రాని కీట్స్ అంత అందంగా పద్ధతిగా ఆ  దేవతల గురించి ఎలా రాయగలిగారని షెల్లీ ని ఎవరో అడిగినప్పుడు &#8221; he is Greek  &#8221; అని జవాబిచ్చారట. చంద్రుడినీ  అరణ్యాన్నీ   ఇతర ప్రకృతి భాగాలనూ మానవరూపంలో భావించటం , సౌందర్య స్పృహ, పొంగి పొరలే జీవన కాంక్ష..ఇవన్నీ గ్రీక్ లక్షణాలు గా చెప్పబడినాయి. స్థలం దృష్ట్యా గ్రీస్ దాటి తూర్పుకి రాలేదు ఆ ఊహ , కాని ఆ కవిత్వానికి ప్రాణాధారమైన  &#8217; instinct  &#8217; గ్రీక్ పురాణాల కన్నా ప్రాచీనమైనదిఏమో .</p>
<p>ఆ  పద్యాల ప్రేరణతో అద్భుతమైన ప్రీ రాఫెలైట్ చిత్రాలు రూపొందాయి , వాటికి తమదైన ఘనత ఉంది.</p>
<p>‘’ భూమి నా   సిం హాసనం,  ఆకాశం కిరీటం, గాలి నేను కట్టిన దుకూలం&#8230;సముద్రం నా కోసం గానం చేస్తూ ఉంది ‘’</p>
<p>అన్న,  మన్నూ మిన్నూ ఏకమైన ఉత్సవం ఆ కవిత్వం.  వింటూనే లాక్కునేదీ అనంతరం వెంటాడేదీ రెండూ , అది &#8221;  రాతిరీ పగలూ మరపు రాని హొయలు.  &#8221;</p>
<p>శస్త్ర వైద్యుడిగా తర్ఫీదు పొందటం ఆయనకు వేదనను దగ్గరగా చూపించింది. డ్రెస్సర్ గా గాయాలకు కట్లు కట్టటం, ఎముకలను సరిచేయటం కూడా ఆయన చేయవలసి ఉండేది. అప్పటి రాజకీయాలలో &#8216; లిబరల్ &#8216; పక్షాన్ని తీసుకున్నారు. అయితే ప్రపంచపు రుగ్మతను నయం చేయటానికి కవిత్వానికే శక్తి ఉందని ఆ స్వాప్నికుడి  విశ్వాసం. ‘’ ‘’ కనబడేవాటిని మాత్రమే చూడగలవారు కాదు, అంతకుముందు ఉందని తెలియనిదాన్ని దర్శించగలిగేవారే ప్రపంచపు సమస్యలను తీర్చగలరు ‘’ఇదే భావాన్ని తన కవిత్వానికీ లార్డ్  బైరన్ రచన కూ భేదాన్ని చెప్పుకోవటం లోనూ వాడతారు.</p>
<p>తోటి వైద్యుల, వైద్య విద్యార్థుల మధ్య ఆయన విలక్షణంగా కనిపించేవారు. ఎవరో దేవుడు దిగివచ్చినట్లుండేది ఆ ప్రవర్తన అని సహపాఠి హెన్రీ స్టీఫెన్స్ ఫిర్యాదు చేస్తారు. . అయి ఉండాలి, ఆ చూపు, ప్రయత్నం &#8230;వాటి గమ్యం అక్కడక్కడే ఖచ్చితంగా ఉండి ఉండదు.</p>
<p>షేక్ స్పియర్ ని చదివి లోతుగా అర్థం చేసుకోగలిగినందుకు  జన్మకి సరిపడా తృప్తి ఉందని అంటారు. మిత్రుడికి రాసిన ఒక ఉత్తరంలో   &#8221; ఏమిటి ఈయన్ని [షేక్ స్పియర్ ]   అంత గొప్పవాడిని చేసిందో అర్థమవుతోంది నాకు. అనిశ్చితత్వాల మధ్య నిలిచిఉండగలగటం ఆయన సాధించారు. నిజాలనీ తర్కాలనీ సాయం తెచ్చుకోకుండా సందేహాలనీ రహస్యాలనీ సహించటం అది  &#8221;</p>
<p>వైరుధ్యాలకి కారణాలు వెతక్కుండా జీవించటాన్ని,  ఏదో ఒక  మూసలో  బిగిసే  ప్రయత్నం చేయకుండా ఉండగలగటాన్ని &#8216; అభావ సామర్థ్యం &#8216; [negative capability] అన్నారు కీట్స్. ఆ సందేహం, ఆ రహస్యం చాలా విధాలుగా జీవనాన్ని ఆకర్షణీయం  చేస్తాయి. ఇది కొంత అదనపు విలువ ఇచ్చినా ఆ సిద్ధాంతం పరమావధి అది మాత్రమే కాదు . ప్రశ్నలతో కలిసి బ్రతకటం దగ్గర మొదలయి అన్ని ప్రశ్నలూ అంతమైన చోట పర్యవసించటం ఆ మార్గం.</p>
<p>వర్ణించబడే వస్తువు , వర్ణన, వర్ణించే వ్యక్తి ముగ్గురూ ఒకటే అయిన స్థితి ని కీట్స్ దర్శించారు.</p>
<p>ఆయన మాటలలో కవిత్వపు లక్షణం దానికి సొంత ఉనికి  అంటూ లేకపోవటమే. &#8221; అది అన్నీ అవును, ఏదీ కాదు. ఎండనీ  నీడనీ  ఒకేలా అనుభవిస్తుంది  కవిత్వం . ఔన్నత్యం, నీచత్వం- సంపన్నత, పేదరికం -వికృతతత్వమూ సౌందర్యమూ అన్నిటినీ నింపగలదు . తత్వవేత్త లకు అఘాతం కలిగించేవాటిని, కవి- ఊసరవెల్లి వంటి వాడు,  ఆస్వాదించగలడు. కవి ఒక్కడే ఇక్కడ కవిత్వం కానిది, ఎప్పుడూ ఇంకొక శరీరం లో జీవించే అతనికి తనది అంటూ ఏముంటుంది ! &#8221;</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/03/John-Keats-In-His-Last-Illness-Engraved-After-The-Sketch-By-Joseph-Severn-From-The-Book-The-Century-Illustrated-Monthly-Magazine-May-To-October-1883.jpg"><img class="alignleft  wp-image-5315" title="John-Keats-In-His-Last-Illness,-Engraved-After-The-Sketch-By-Joseph-Severn,-From-The-Book-The-Century-Illustrated-Monthly-Magazine,-May-To-October,-1883" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/03/John-Keats-In-His-Last-Illness-Engraved-After-The-Sketch-By-Joseph-Severn-From-The-Book-The-Century-Illustrated-Monthly-Magazine-May-To-October-1883.jpg" alt="" width="347" height="360" /></a>ఇంగ్లీష్ లో డౌట్ అనేది లాటిన్ &#8216; డ్యూబిటైర్ &#8216;  నుంచి వచ్చింది. ఆ లాటిన్ పదానికి &#8216; రెండు &#8216; అని అర్థం. అంటే ద్వంద్వత్వం. ఆ రెంటిమధ్యా నలగటం కాకుండా వాటిని వదిలేసి, దాటి చూడగలగటాన్ని కీట్స్ కలలు కన్నారు. మరొకలా చెప్పాలంటే అన్నిటి, అందరి  ఎడలా సానుభూతి, తనకూ మరొకదానికీ భేదం తెలియని, లేని సహానుభూతి. దీన్ని సామర్థ్యం అనటం చాలా మంది  పాశ్చాత్యులకి , సహజం గానే- మింగుడు పడలేదు. ఇందులో భారతీయులకి అర్థం కానిదేమీ లేదు. తత్వ వేత్తలు వేటి  వలన ఖంగు తింటారని కీట్స్ అన్నారో ఆ ముడులను విప్పటమే ఇక్కడి తత్వశాస్త్రం.</p>
<p>అనిశ్చితత్వం వల్ల , తెలియక పోవటం వల్ల వచ్చే అయో మయాన్నీ  బాధనూ భరించటం అభావ సామర్థ్యం అని ప్రముఖ సైకో అనలిస్ట్ విల్ఫ్రెడ్ బియాన్ అంటారు. నిజంగానే ఇరవైయవ శతాబ్దపు అనాలిసిస్ లో , సైకో థెరపీ లో ఈ అంశాన్ని ఉపయోగించుకున్నారు.</p>
<p>వివిధ స్థాయిల, విధాల అనుభూతుల, స్పందనల సమాహారంగా జీవితపు సంపత్తి గురించి రాశారు.</p>
<p>ఒక ప్రమాద కరమైన స్త్రీ సమక్షం లో ఆ కౄరత్వాన్ని అనుభూతి చెందుతూ గడిపాను అంటే ఏ కాస్తో అర్థం చేసుకున్నా బిలియర్డ్  బంతి ని దాని గుండ్రదనానికీ నున్నదనానికీ సంసిద్ధతకీ వేగానికీ నేను ఆనందిస్తాను అన్న ఆయన మాటలు విమర్శకులను తికమక పెట్టినట్లున్నాయి. మనిషిలో తప్ప జంతువులలో, వృక్షాలలో ఆత్మ ఉందని అంగీకరించని సంప్రదాయం లో నిర్జీవమనిపించే వస్తువులకు ఆ స్థాయి ఇచ్చి చెప్పటం ఏమనిపించి ఉండాలి ?</p>
<p>వస్తువుతో కవి మమేకమైపోతే ఇక చెప్పటం ఎలాగా అన్న ప్రశ్నలూ  లేచాయి. స్పృహలో ఉన్న మనస్సుతో ఎంత దూరం వెళ్ళవచ్చో ఆ మేరకు ఏకత్వం అది. ఆ స్పృహ పోయిన తర్వాత అది కవిత్వం అవదు, అసలు ఏమీ అవదు. [శమనం అవుతుంది,  శాంతి అవుతుంది .]</p>
<p>ఎన్నెన్ని గ్రంథాల అధ్యయనమూ ఆ దశ కి తీసుకు వెళ్ళలేదు, సౌందర్యదృష్టి తప్ప అని కీట్స్ అభిప్రాయం. ఇక్కడ సౌందర్యం అన్న మాటకి చాలా విస్తృతమైన అర్థం ఉంది. &#8221; సౌందర్యమే సత్యం, సత్యమే సౌందర్యం . ఇది తెలిస్తే ప్రపంచం లో  ఇంకేమీ తెలుసుకోనక్కర్లేదు &#8221; అని Ode to Grecian urn ‘  లో అంటారు. అది అన్నిటీకీ అవతలికి తీసుకువెళుతుందని, కాదు, అన్నిటినీ నశింపజేస్తుందనీ కూడా అంటారు ఆయన.</p>
<p>ఈ అభావ సామర్థ్యం అంతరాత్మను నమ్మటం వంటిది అని ఒక విమర్శకులు అంటారు. ఆ నమ్మకానికి హెచ్చు తగ్గులు ఉంటాయి గనుక సామర్థ్యానికీ ఉంటాయి… దాని కోసం ప్రయత్నం చేస్తూ పోవాలా, కాదు , వేచి చూడాలేమో. &#8216; ఎండీమియాన్  &#8216; అనే కవితను పూర్తిచేసేందుకు  కొన్ని నెలలల పాటు ఏమీ రాయలేని స్థితిని దాటవలసి వచ్చిందని కీట్స్ అంటారు. &#8221; కవిత్వం ఆకులు చిగిర్చినంత సహజంగా రాకపోతే అది అసలు రాకపోవటమే మంచిది &#8221;</p>
<p>ఈ లోకం పరిహరించవలసినది కాదనీ ప్రతి ఉనికిలోనూ దాగి ఉన్న దివ్యత్వాన్ని కనుగొనవచ్చనీ ఆయన నమ్మారు. విశ్వానికంతటికీ ఒక రక్షకుడు అన్నదాన్ని త్రోసిపుచ్చారు. జీసస్ ని  శిలువ వేయటాన్నీ   దైవికంగా తీసుకోలేకపోయారు. &#8221; ఊహ ని ఆడం   కన్న కలగా అనుకోవచ్చు, అతను మేల్కొని అది నిజమని తెలుసుకున్నాడు &#8221; వంటి మాటలు ఆయనకి మతం బొత్తిగా లేదని చెబుతాయి .</p>
<p>గ్రీక్ దేవతల ప్రస్తావన తరచు చేసినా అపోలో ను ఆరాధిస్తున్నారనిపించినా వారినీ &#8216; ముక్తిదాతలు &#8216; గా భావించలేదు. విముక్తి అన్నది తర్కం తో సాధ్యపడదు అనే చివరివరకూ భావిస్తూ వచ్చారు. అనుభూతి, దాని వలని జాగృతి , లౌకికమైన అవధులను అధిగమించి శాశ్వతమైన ఆనందం లో లీనమవటం&#8230;స్థూలంగా ఇది ఆయన ప్రణాళిక. నిజంగానే ఒక పది సంవత్సరాలు పట్టే అధ్యయనాన్ని ,వ్యక్తీకరణని చివరి సంవత్సరంలో ఊహించారు.</p>
<p>ఫానీ బ్రాన్  అనే యువతిని తీవ్రంగా గాఢంగా ప్రేమించారు.&#8221; నేను ఇంతగా ప్రేమించగలనని నాకే తెలియదు &#8221;, &#8221; నాకెప్పుడూ నువ్వు కొత్తగానే అనిపిస్తావు &#8221; ,&#8221; నీ కోసం ఎంత వేదన పడతానో ఊహించలేవు నువ్వు &#8221;  &#8221; నువ్వు నన్ను పీల్చివేస్తున్నావా, నేను కరిగిపోతున్నానా అనిపిస్తోంది &#8221;   ఆ తర్వాతి కాలం లో రకరకాలైన కళారూపాలలో మనం అదే పనిగా విన్న ఇటువంటి మాటలు కీట్స్  గొంతులో వాటి అసలైన అర్థంతో వినిపిస్తాయి . ‘’  చలించిపోయే నా మనసుకి నా ఈ చిన్న దేహం చాలదు, నాకు తృప్తి లేదు.  నీమీద నిలిచినట్లు నేను ఇంక దేని మీదా ఎవరి మీదా నిలవలేను. నువ్వు నాతో  ఉంటే నా ఆలోచనలు గంతులు వేయవు ‘’</p>
<p>&nbsp;</p>
<p>చివరి కొన్ని సంవత్సరాలలో …sఆత్మీయుల మరణాలు వరసగా చూడవలసి రావటం, ఆ తర్వాత &#8211; అప్పటికి సరయిన వైద్యం లేని క్షయ వ్యాధి తనకే ప్రాప్తించటం….</p>
<p>ప్రపంచం సుందరమైనది, గొప్ప కవికి మరింతగా.  అనురాగం మధురమైనది,భావుకులకి ఇంకా చాలా. ప్రేమించే వస్తువులో ప్రకృతి లో ఎడం లేనంతగా  లీనమయి ఎంత ఆనందాన్ని అయినా పొందగలిగే హృదయాలుంటాయి. ఒక్కటే కదా హద్దు, ఆటంకం- అది మృత్యువు.  దేన్నీ  శాశ్వతమని అనుకోలేని ఆ నిస్పృహ ఎంత చేయదని ! ఎంత సాంద్రతర అనుభవమైనా ఇప్పటికీ ఇక్కడా మాత్రమే కదా సత్యం అనిపించే నిర్వేదం  నుంచి కీట్స్ చేస్తూ పోయిన అన్వేషణ లోనుంచి ఆయన ఆఖరి సంవత్సరాల పద్యాలు వచ్చాయి. అప్పటి The eve of St. Agnes  ఒకవెటకారపు తిరుగుబాటు…కాని తక్కిన కవిత్వమంతా ఆశ, ఆర్ద్రత…</p>
<p>&#8221; నాకు అమరత్వం కావాలని ఉంది. నీతో కలిసి ఎల్లకాలమూ బ్రతకాలని ఉంది &#8221; అని ఆ ఇరవై నాలుగేళ్ళ యువకుడు ప్రేయసితో అనటం వింటే గుండె చెరువై పోతుంది.  ‘’ ఏడవకు, కళ్ళు తుడుచుకో. ఈ పూవు మళ్ళి వచ్చే ఏడు పూస్తుంది ‘’ అనే ఓదార్పూ తనే ఇస్తారు.</p>
<p>ఆయన  పద్యాలలో ముఖ్యమైన odes ఆ 1819 లో వచ్చాయి. వాటిలో చివరిదీ అత్యుత్తమమని చెప్పబడేదీ To Autumn . .హేమంతాన్ని ఒక పక్వత గా, ప్రశాంతి గా చూపించిన ఆ పద్యం జీవితం ముగియబోతుందన్నప్పటి అంగీకారం. పగలు అంతమైనప్పటి సంధ్య కాలపు గులాబివర్ణం , కోత పూర్తయిన పొలాలు, రసం ఓడ్చబడుతూన్న ఆపిల్ పళ్ళు &#8211; హేమంతపు సంకేతాలు.  వసంతగానం వెనకబట్టినా సంగీతం అంతమవదు.  తనూ మరో లోకానికి ఎగిరిపోబోవటాన్ని వాన కోయిలల వలసగా చెబుతారు.</p>
<p>Ode to nightingale లో నైటింగేల్ తో  &#8221; ఎగిరిపో, నేనూ నీ వెనకే కవిత్వపు రెక్కలపైన వస్తాను కదా   &#8221; అంటూ &#8221;  ఇప్పటికే నీతో ఉన్నాను &#8221;  అని తెలుసుకుంటారు.   వెన్నెల కూడా చొరబడని సాంద్రమైన అడవిలో , పూలనైనా కన్నులతో చూడలేని అర్థరాత్రి  చీకటిలో… సౌరభాల అలల మధ్యన- మరణాన్ని కలగంటారు.</p>
<p>‘’ వ్యాకులతను భరించేందుకు విషం వద్దు, మధువు వద్దు, లేత్ నది [ఆ నది పూర్వస్మృతిని పోగొడుతుంది ] లో మునగవద్దు &#8230;ఇంద్రధనుసు వన్నెలనూ ప్రేయసి నేత్రాలనూ వికసించే పుష్పాలనూ చూడు&#8230;సౌందర్యం  మరణించాల్సిందే&#8230;సంతోషపు వెల్లువ వెనకే  శోకం కనిపిస్తుంది, ఆ ద్రాక్ష జిహ్వకి తగిలి  చిట్లి విషం చిందితేనేమీ,  ఆ విషాదమొక అనుభవమే.   ‘’</p>
<p>‘’ వినిపించని రాగాలు వినబడేవాటికన్న మధురమైనవి, ఈ చర్మ శ్రవణానికి కాదు, ఆత్మలోకి మ్రోగుతాయి అవి.’’<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/03/johnKEATS_2361818b.jpg"><img class="alignright  wp-image-5316" title="johnKEATS_2361818b" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/03/johnKEATS_2361818b.jpg" alt="" width="372" height="232" /></a></p>
<p>‘’  సౌందర్యం మరణించీ  నశించదు, శూన్యమవదు. విశ్రాంతిగా నిద్రించేందుకు, కలలు కనేందుకు అందమైన పొదరిల్లును  సిద్ధం చేస్తుంది.’’</p>
<p>ఇంత తెలుసుకునీ దిగులు పడిన క్షణాలూ ఉన్నాయి&#8230;&#8221; గాయం మాన్పేవారు   లేరే అనుకోకుండా మనసు రాయి చేసుకోవటాన్ని ఏ కవులూ చెప్పలేదే…’’</p>
<p>‘’ ఈ విశాల ప్రపంచపు ఒడ్డున  నిలుచుని ఒక్కడినే ఆలోచిస్తున్నాను, ప్రేమా కీర్తీ అంతమైన ఇప్పుడు ,నేనిక ఉండనని తట్టినప్పుడు…     నేను మరణిస్తే నన్ను తలచుకుని మిత్రులు గర్వపడేలాగా ఏ అమరమైన కృతినీ వదిలి వెళ్ళటం లేదు. కాని, చరాచరమైన అన్నింటిలోనూ తొణికే సౌందర్యాన్ని ప్రేమించగలిగాను. సమయం ఉండి ఉంటే&#8230;నన్ను గుర్తుంచుకోవటానికి ఏమయినా చేయగలిగి ఉండేవాడినేమో ‘’</p>
<p>మెల్లిగా మృత్యువు తో సగం ప్రేమలో పడ్డానని అంటారు. ‘’ నా శ్వాసను సుతిమెత్తగా  గాలిలో కలిపేయమని బ్రతిమలాడుతున్నాను చావుని, తేలికగా తీసుకుపొమ్మని ‘’</p>
<p>తనను సమాధి చేయవలసిన చోటు &#8230; రకరకాల పూలు పూసే గడ్డి మైదానం అది, వయొలెట్ పూలు అసంఖ్యాకంగా  ఉన్నాయి, ఒక  గొర్రెల మంద, దాన్ని  కాచే  కుర్రవాడు &#8230;ఈ దృశ్యం చూసి వచ్చానని మిత్రుడు చెప్పినఫ్ఫుడు సంతోషపడ్డారు. &#8221; ఇప్పటికే నా పైనంతా వయొలెట్ పూలు వికసిస్తున్నట్లు అనిపిస్తోంది &#8221; అన్నారట.</p>
<p>‘ ఇక్కడ నిద్రించేవారి పేరు నీటి పైని  రాసిన రాత’  అని ఉందట  ఇటలీ లోఉన్న కీట్స్ సమాధి పైన. నిజానికి ఆ పేరు పగలూ రేయీ వెలిగే చుక్కలతో రాసి ఉన్నది. ఇంద్రియాలతో పొందగలిగినదానిని చివరంటా దర్శించాక  వాటికి అతీతమైన మధుకాంతిని వెదికేందుకు ఆయన బయలుదేరి వెళ్ళారు.</p>
<p>చివరగా రాసిన వాక్యాలు ఇవి</p>
<p>‘’ ఇదిగో, ఈ చేయి చాస్తున్నాను. ఇప్పుడు వెచ్చగా సజీవంగా నీ చేతిని మమతగా అందుకోగలను. ఇదే    చేయి సమాధిలో శీతలమై పోతే  నీగుండెనిండిన  రక్తిమనంతా నాకోసం  వాడేస్తావా,  నా రక్తం పరుగెత్తేందుకు- నీ తృప్తి కోసం , పోనీ. ‘’</p>
<p>ఆ మాటలు ప్రేయసి ఫానీ బ్రాన్ ని ఉద్దేశించినవని కొందరు, కాదు రాబోయే చదువరుల కోసం అని మరికొందరు. రెండూ అవునేమో. రచయిత్రి   Dianne Setterfield  అడుగుతారు&#8230; &#8221; మరణించిన రచయితలకి వారి రచన ఎవరైనా చదువుతూంటే తెలుస్తుందా?  చదివే వారి హృదయం వారి ఆత్మతో మెత్తగా రాసుకుంటుందా ? &#8221; అని. మృత్యువు చాలా ఒంటరిది అంటారు ఆమె , తెలిసినవారేగాని అది పూర్తిగా పడమటి మాట.</p>
<p>పాశ్చాత్యులకి పునర్జన్మ పైన నమ్మకం లేదు. మళ్ళీ పుడతాము, అప్పుడు  చూసుకోవచ్చు అనే&#8217;  ఆశ అంతరించినప్పటి  ఆశ &#8216;   ఇవ్వగల ఆ కొంత ఉపశమనం అందదు వారికి. మొదలూ తుదీ లేని విశ్వలీల లో భాగం ఇది అంతా అనే జ్ఞానమూ విస్తరించి ఉపయోగించుకోరు.   కర్మ సిద్ధాంతం భారతీయులకి వేల ఏళ్ళుగా అందజేస్తూన్న శాంతిలో దానికి అదే సాటి.</p>
<p>ఇవి ఏవీ వర్తించని  ఒక దేశం లో, సంస్కృతిలో &#8230;. ఎంత నల్లటి చీకటో కమ్ముకున్న ఆ స్థితిలో &#8221; ఇది కాదు అంతం, ఇదే కాదు మొత్తం, అవతల ఉన్నది ఏదో ఆ నిలకడ మూలకందం &#8221; అనే ఎఱుక కోసమని వేసిన  అడుగులలో….</p>
<p>పరిమితులని అధిగమించి bards and minstrels గురించి రాసిన పద్యం  మనకి సమాధానం  .  ముందే కూర్చినా  కూడా  ఇదే ఆ హంస కు ఆ జన్మకు హంసగీతం  .</p>
<p>రసోద్వేగం, నిర్భరానందం కలిసిన ఉన్నత ప్రకృతులుగా కవులను, గాయకులను  కీర్తించారు . వారికి రెండు జీవితాలు చిరకాలమూ ఉంటాయట. భూమి పైనా స్వర్గం లోనూ కూడా వారు శాశ్వతులు. అక్కడి  రోజాపూలది దివ్యమైన పరిమళం. అక్కడి కోయిల పాటలో సత్యపు శ్రావ్యత. స్వర్ణమయ కాంతుల గాథల రహస్యాల మధ్య, సూర్యచంద్రులతో సంభాషిస్తూ,  నీలి పూల డేరాల కిందన , ఆకుల గుసగుసలు వింటూ ఆ పచ్చిక పైన శాంతంగా  &#8230;.</p>
<p>ఇక్కడా వదలి వెళ్ళారు తమను  , నవ్వులలో కన్నీళ్ళలో  , తీవ్రతలో నైచ్యంలో, వైభవం లో అవమానంలో -మానవులకి నేర్పేందుకు. అక్కడి సంతోషాన్నంతా ఇక్కడ స్ఫురింపజేసేందుకు, అందాకా ఆ దారిని చూపిస్తూ ఉండేందుకు !</p>
<p>[ఇది భారతీయమైన  వాక్కు -<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/mithili2.gif"><img class="alignright  wp-image-4547" title="mithili2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/mithili2.gif" alt="" width="165" height="170" /></a></p>
<p>జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వరా</p>
<p>నాస్తి యేషాం యశః కాయే జరామరణజం భయం  ]</p>
<p>&nbsp;</p>
<p>Picture credit:<br />
1. John-Keats-In-His-Last-Illness,-Engraved-After-The-Sketch-By-Joseph-Severn,-From-The-Book-The-Century-Illustrated-Monthly-Magazine,-May-To-October,-1883</p>
<p>2. listening to the nightingale by joseph stevern</p>
<p>&nbsp;</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=5310</wfw:commentRss>
		<slash:comments>65</slash:comments>
		</item>
		<item>
		<title>నృత్య నాట్య తాండవ వేదిక -నర్తనశాల</title>
		<link>http://vaakili.com/patrika/?p=5132</link>
		<comments>http://vaakili.com/patrika/?p=5132#comments</comments>
		<pubDate>Fri, 28 Feb 2014 21:02:49 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కడిమిచెట్టు]]></category>
		<category><![CDATA[మైథిలి అబ్బరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=5132</guid>
		<description><![CDATA[<p style="text-align: left;"></p> <p style="text-align: left;">కొన్ని ఏళ్ల కిందట, అప్పుడే విశ్వనాథ వారి నవలలు చదువుకుంటూ సంభ్రమంతో తల మునకలవుతూ ఉన్నప్పుడు, స్నేహితురాలయిన రచయిత్రి అన్నారు &#8216; ఆయన నాటకం నర్తనశాల చదవండి, అది చలం గారు రాసినట్లు ఉంటుంది &#8216; అని. సంపాదించి చదివినప్పుడునాకు అలా అనిపించలేదు . అసలు చలం గారి సాహిత్యం తో ఏమైనా సంబంధం ఉందనీ అనుకోలేకపోయాను. దుర్యోధనుడు, రావణుడు వంటి పాత్రలకి ఆ వైపుని చూపే ప్రయత్నం చేసినవారు విశ్వనాథ అని ఎందరికో తెలియదు. అదీ అటువంటిదేననిపించింది.</p> <p>ఆ తర్వాత చాలా కాలానికి అర్థ తాత్పర్య సహితంగా తిక్కన గారి విరాటపర్వాన్ని గ్రహించే ప్రయత్నం చేశాను . వ్యాస భారతానికికొంతవరకూ సాధికారమైన తెలుగువచనానువాదం లభించింది. నా శక్తి మేరకు పరిశీలించాక తిరిగి విశ్వనాథ నాటకం చదివాను.</p> <p>అప్పటికే మరొకరు చెప్పిన కథని తిరిగి ఎందుకు చెప్పాలనిపిస్తుంది? ఆ కవికో, రచయిత కో కథ మీద పట్టలేనంత ప్రేమ ఉండవచ్చు, ఎంత అంటే తనదీ అనేదాన్ని కొంత చేర్చకుండా ఉండలేనంత. ఆ పూర్వ కవులపైన గౌరవానికి భంగం రాకుండానే తనకు అక్కడ ఔచిత్యం మరొకలాగా అయితే ఎక్కువ భాసిస్తుందనిపించవచ్చు. పఠితల, ప్రజల హృదయాలలో , ఆలోచనాధారలో లీనమయిపోయిన కథలని తన పద్ధతిలో చెప్పుకురావటం కష్టం, మార్పుని ఒప్పించటం కనుక….<br /> సులువు కూడానూ, అప్పటికే కనీసం మాధ్యమికమైన అవగాహన ఉంటుంది కనుక, తన చేర్పు ఉచితంగా , అందంగా ఉంటే చప్పున రాణిస్తుంది కనుక.</p> <p>ఈ మార్పు చేర్పులలో న్యాయం పాటించే రచయితలు, కవులు &#8211; దుష్టపాత్రలలో సద్విషయాలను ఆరోపించవచ్చు, కానీ ఉత్తమ పాత్రలను దుష్టులుగా చూపకూడదు. ఎందుకంటే అది మూలచ్ఛేదం , కావ్యప్రయోజనం పూర్తిగా దెబ్బతింటుంది .<br /> విరాట పర్వం లో వ్యాసులు శ్లేష ను అతి నిపుణంగా ఉపయోగించారని విన్నాను. సంస్కృతం రాని నాకు ఆ లోతులు తెలిసే అవకాశం లేదు. తెలుగులోనే [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: left;"><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg"><img class="aligncenter size-full wp-image-4744" title="kadimi" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg" alt="" width="810" height="284" /></a></p>
<p style="text-align: left;">కొన్ని ఏళ్ల కిందట, అప్పుడే విశ్వనాథ వారి నవలలు చదువుకుంటూ సంభ్రమంతో తల మునకలవుతూ ఉన్నప్పుడు, స్నేహితురాలయిన రచయిత్రి అన్నారు &#8216; ఆయన నాటకం నర్తనశాల చదవండి, అది చలం గారు రాసినట్లు ఉంటుంది &#8216; అని. సంపాదించి చదివినప్పుడునాకు అలా అనిపించలేదు . అసలు చలం గారి సాహిత్యం తో ఏమైనా సంబంధం ఉందనీ అనుకోలేకపోయాను. దుర్యోధనుడు, రావణుడు వంటి పాత్రలకి ఆ వైపుని చూపే ప్రయత్నం చేసినవారు విశ్వనాథ అని ఎందరికో తెలియదు. అదీ అటువంటిదేననిపించింది.</p>
<p>ఆ తర్వాత చాలా కాలానికి అర్థ తాత్పర్య సహితంగా తిక్కన గారి విరాటపర్వాన్ని గ్రహించే ప్రయత్నం చేశాను . వ్యాస భారతానికికొంతవరకూ సాధికారమైన తెలుగువచనానువాదం లభించింది. నా శక్తి మేరకు పరిశీలించాక తిరిగి విశ్వనాథ నాటకం చదివాను.</p>
<p>అప్పటికే మరొకరు చెప్పిన కథని తిరిగి ఎందుకు చెప్పాలనిపిస్తుంది? ఆ కవికో, రచయిత కో కథ మీద పట్టలేనంత ప్రేమ ఉండవచ్చు, ఎంత అంటే తనదీ అనేదాన్ని కొంత చేర్చకుండా ఉండలేనంత. ఆ పూర్వ కవులపైన గౌరవానికి భంగం రాకుండానే తనకు అక్కడ ఔచిత్యం మరొకలాగా అయితే ఎక్కువ భాసిస్తుందనిపించవచ్చు. పఠితల, ప్రజల హృదయాలలో , ఆలోచనాధారలో లీనమయిపోయిన కథలని తన పద్ధతిలో చెప్పుకురావటం కష్టం, మార్పుని ఒప్పించటం కనుక….<br />
సులువు కూడానూ, అప్పటికే కనీసం మాధ్యమికమైన అవగాహన ఉంటుంది కనుక, తన చేర్పు ఉచితంగా , అందంగా ఉంటే చప్పున రాణిస్తుంది కనుక.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/Raja_Ravi_Varma_Keechaka_and_Sairandhri_1890.jpg"><img class="alignleft  wp-image-5135" title="Raja_Ravi_Varma,_Keechaka_and_Sairandhri,_1890" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/Raja_Ravi_Varma_Keechaka_and_Sairandhri_1890.jpg" alt="" width="293" height="414" /></a>ఈ మార్పు చేర్పులలో న్యాయం పాటించే రచయితలు, కవులు &#8211; దుష్టపాత్రలలో సద్విషయాలను ఆరోపించవచ్చు, కానీ ఉత్తమ పాత్రలను దుష్టులుగా చూపకూడదు. ఎందుకంటే అది మూలచ్ఛేదం , కావ్యప్రయోజనం పూర్తిగా దెబ్బతింటుంది .<br />
విరాట పర్వం లో వ్యాసులు శ్లేష ను అతి నిపుణంగా ఉపయోగించారని విన్నాను. సంస్కృతం రాని నాకు ఆ లోతులు తెలిసే అవకాశం లేదు. తెలుగులోనే ఉన్నా తిక్కన గారి రచన కూడా పూర్తిగా అర్థమైందనుకునే పాండిత్యం లేదు. ఏతావతా ఈ పరిశీలన స్థూల దృష్టితో చేసినది మాత్రమే.</p>
<p>కథ అందరికీ తెలిసినదే. పాండవులు, ద్రౌపది మారు వేషాలలో మత్స్యదేశపు రాజు విరటుడి కొలువులో సేవక వృత్తిని అవలంబించటం, రాజశ్యాలకుడైన కీచకుడు ద్రౌపదిని కామించి వేధించటం, రాణి సుధేష్ణ కీచకుడి మాటను కాదనే ధైర్యం లేక సైరంధ్రిని అతని ఇంటికి మదిర తెచ్చే నెపంతో పంపించటం , భీముడు రహస్యంగా అతన్ని మట్టుపెట్టటం , అర్జునుడు బృహన్నల వేషాన్ని వదిలి ఉత్తర గోగ్రహణం లో కురు సేనను ఓడించటం, చివరికి ఉత్తరాభిమన్యుల కల్యాణం.</p>
<p>నర్తనశాల అనే పదబంధానికి రెండు మూడు స్థాయిలలో భాష్యం చెప్పుకోవచ్చు. రాజకుమారి ఉత్తర, అంతఃపుర స్త్రీలు, నాట్య గురువు బృహన్నల- ఇది ఒక స్థాయి. మారు వేషాలలో ద్రౌపది, పాండవులు&#8230;వారెవరో చదువరులకు తెలుస్తూ కథలో ఇతర పాత్రలకు తెలియని నాటకం..ఇది ఇంకొక స్థాయి. అటూ ఇటూ అయిపోయే ప్రాపంచిక సంపదలలో మనుషులు అందరూ ఆడవలసిన నాటకం అంతర్ధ్వనిగా మరొక స్థాయి. లోకైక మహానర్తకుడెవడో వాడి నాట్యానికి వ్యాఖ్యానం పరమమైన స్థాయి.</p>
<p><em>&#8220;నర్తకుని భంగి పెక్కగు</em><br />
<em> మూర్తులతో నెవ్వడాడు మునులు దివిజులున్</em><br />
<em> కీర్తిం ప నేరనెరెవ్వని</em><br />
<em> వర్తనములెఱుగరట్టివాని నుతింతున్&#8221;</em><br />
- బమ్మెర పోతనామాత్యులు [శ్రీమదాంధ్రభాగవతం]</p>
<p>[ వేదవ్యాసులు మహాభారత రచన ముగించి వికలమైన తమ హృదయానికి శాంతికోసం నారదమహర్షి సూచన మేరకు మహాభాగవతం రచించుకున్నారు ]</p>
<p style="text-align: center;">* * *</p>
<p>వేయిరేకుల నల్లకలువ పాంచాల రాజకుమారి. యజ్ఞగుండం లోంచి పుట్టటమే యౌవనవతిగా. ఆ యౌవనం, శోభా వైభవం తుదిదాకా బీరుపోలేదు, అయిదుగురు బిడ్డలను కన్నా,ఎన్ని ఎన్ని ఇక్కట్లు పడినా. జన్మ చేత దివ్యమూ జీవనం వలన భౌమమూ అయిన మహా సౌందర్యం. ఆ విరుద్ధపు మేళవింపు లో తప్పించుకోలేనంతటి ఆకర్షణ. వైకుంఠం కాదు, కైలాసం కాదు, స్వర్గం ఆమె తొలిలోకం, చేయి చాస్తే అందుతుందేమో అనిపిస్తుంది. అయిదు అంశలుగా జన్మించిన స్వర్గాధిపతికి సామ్రాజ్ఞి- కాని, . దేవతాంశ సంభూతులు మాత్రమే ఆ భర్తలు, దైవమెత్తిన అవతారాలు కారు, కర్మ నిబద్ధులు. ఆ అడుగడుగు గండాలలో కాచేందుకు, లయించేందుకు దైవం వెన్వెంట సోదరస్థానీయుడై, పశుపతి యై.</p>
<p>వ్యాసుడి ద్రౌపది అభిజాత్యం గల క్షత్రియ. కీచకుడు సూతపుత్రుడనీ తనను అవమానించాడనీ పదే పదే వ్యాసుల ద్రౌపది కుమిలిపోతుంది. నావంటిదాన్ని అతను అవమానిస్తాడా అనే వేదన ఆమెది. తానెవరో అతనికి తెలియనే తెలియదాయె, తెలిస్తే మొదటికే మోసమాయె ! విరాటసభ లో తన అవమానం జరిగిన రోజు రాత్రి భీముడికి చెప్పుకునేటందుకు వెళ్లి అతను నిద్రపోతుంటే &#8221; ఏమి, దీర్ఘనిద్ర లో ఉన్నావా ? &#8221; అని ఎత్తిపొడుస్తుంది.</p>
<p>తిక్కన గారి ద్రౌపది ఎక్కువసార్లు కీచకుడు సూతుడనే ప్రసక్తి తీసుకురాదు. సామాన్యమైన తెలుగు ఇల్లాలి వలె కీచకుడితో &#8221; అన్న, &#8230;.ఆడుబుట్టువులతోడ నీవును బుట్టినాడవు &#8221; అంటుంది. సేవికా వృత్తి వలని దైన్యం ఎక్కువ ఆమె లో . అయినా ధర్మరాజుని సభలో నిందించేటప్పుడు, భీముడితో మొరపెట్టుకునేటప్పుడు అజ్ఞాతవాసం భంగమయితే ఏమి కానున్నదో అనే ఆలోచన ఆమె చేసినట్లు కనిపించదు. నిద్రపోయే భీముడిది దీర్ఘనిద్ర అనకుండా &#8221; నీకు నిద్ర ఎలా పడుతోంది ? మీ అన్న ఇది సమయం కాదని చెప్పటం చేత విశ్రమించావా ఏమిటి? &#8221; అంటుంది.</p>
<p>విశ్వనాథ ద్రౌపది పూర్తిగా రాజ్ఞి. లోతుగుండె గలది. పెదవి విప్పి పలికేదే తక్కువ. కీచకుడి ని భ్రమిపజేసి నర్తనశాలకి రమ్మనే సందర్భం లోనూ మూడు నాలుగు మాటల కంటె మాట్లాడదు. కీచకుడు సూతపుత్రుడని అనటం ఉండదు, ఎవరైనా ఒకటే ఆమెకి. అతను &#8216; పాంచాలీ &#8216; అని సంబోధించినప్పుడు మొట్టమొదట ఆమెకి తట్టేది అజ్ఞాతవాసం భగ్నం కావచ్చునని. అప్పుడే కీచకుడి చావును ఆమె నిర్ణయిస్తుంది. &#8221; ఇతడనుమానించినాడు. మేధావియే. పాపము దుష్టగుణము వచ్చి త్రుంచుకొని పోవుచున్నది. [అజ్ఞాత వాసపు ] రహస్యము బయటకు ప్రాకకుండ నితని తొందరలో భూమికి దూరము చేయవలసినదే &#8221; అనుకుంటుంది. ఇక్కడ భీముడు నిద్ర పోనే పోడు. ఆమె వస్తుందని తెలిసి ఎదురు చూస్తూ ఉంటాడు. అతను, ధర్మరాజు, సహదేవుడు, ద్రౌపది&#8230;అంతా ఒక కనబడని సూత్రం ప్రకారం నడుస్తారు, ఒకే పట్టు మీద ఉంటారు.<br />
కీచకము అంటే గుల్లగా ఉన్న వెదురుబొంగు అని అర్థం. సిం హబలుడు అనేది ఇంకొక పేరు కీచకుడికి. పరస్పరవిరుద్ధాలైన ఈ రెంటిలో చివరకు కీచక నామమే సార్థకమైంది. అతను అలాగే విరిగిపోతాడు.</p>
<p>వ్యాసులు ఋషి. ఆయన చెప్పినది వేదం. అందుకు తెలుపు నలుపులలో చూపించినా చెల్లిపోయింది. అది అలా ఉంటే ఇది ఇలా ఉంటుంది అని ఆయన వాక్కు. వ్యాసుడి కీచకుడు కేవలం కాముకుడు. సైరంధ్రి ని ఏ విధంగానయినా పొందాలనే ప్రయత్నం లో కౄరంగా ప్రవర్తిస్తాడు. తన ఇంటికి పంపబడిన సైరంధ్రిని చేయిపట్టి లాగి వెంబడించి విరాటసభలో నేలకి ఈడ్చి ఆమె శిరస్సు ను తన్నుతాడు. జూదం తర్వాత కురుసభలో జరిగిన దానికి ఇది ఇటో, అటో. ఆమె లభించకపోతే మరణిస్తాననేటంత వాంఛ ఉన్నా సైరంధ్రి సాధారణ సేవిక కాదేమోననే అనుమానం ఉన్నా ఆమెతో అతని ప్రవర్తన మొరటుగానే ఉంటుంది.</p>
<p>తిక్కన గారు కవి. శాసించటం కవుల పని కాదు, నచ్చజెప్పటం, ఒప్పించటం. అది అలా ఉన్నా కూడా ఇది ఇలాగే ఉంటుంది అని చెప్పే అవసరం పడిన కాలం అది. తర్వాత కొన్నాళ్లకే ప్రబంధయుగం మొదలైంది. కాకతీయుల కాలం ఆయనది, జాయప సేనాని’ నృత్త రత్నావళి ‘ రచించిన కాలం. బహుశా&#8217; పరకీయ &#8216; [మరొకరి ప్రాపులోనో, వారికి భార్య గానో ఉన్నది ] అనే నాయిక ను కామించటం గుర్తించబడిన కాలం కూడానేమో</p>
<p>తిక్కన కీచకుడికి కొత్త విశేషణాలు ఇచ్చారు. అవి రూపాభిమాని [ తన రూపమూ ఎదటివారి అందమూ రెండింటి పట్లా ] , నానాభరణ ధరణశీలుడు [అలంకార ప్రియుడు ], దుర్విదగ్ధుడు [అవివేకి ] , బలగర్వితుడు అని. తర్వాత అతని పాత్రపోషణ మొత్తాన్నీ సూత్రప్రాయంగా చెప్పిన మాటలు ఇవి. సైరంధ్రి సౌందర్యాన్ని ప్రశంసించటం లో అతను ఇంచుమించు ఉత్తమ నాయకుడి స్థాయిలో పలవరిస్తాడు. ఆ వర్ణన పాదాల దగ్గరనుంచి ప్రారంభించటం విశేషం. దేవతల అందాన్ని అలా చెబుతారట, మనుషుల రూపాన్ని తల నుంచి కిందికి వర్ణిస్తారట. మోహోన్మత్తుడై తన ఇంటికి పంపబడిన ఆమెను కౌగలించుకోబోతాడు. రాజసభ దాకా వెంబడిస్తాడు. ఆమె వేగాన్ని నిలవరించేందుకు అందిన కేశపాశాన్ని పట్టుకోగా ఆమె ఆ ఊపుకి కింద పడుతుంది. ఆమె శిరస్సును తాడించటాన్ని తిక్కన పరిహరించారు. తన మన్మథ ప్రలాపాలకు సైరంధ్రి కళవళపడితే అది మోహం వలన అని అర్థం చేసుకునే అవివేకి. ఆమె భర్తలు గంధర్వులైనా మరొకరైనా తాను నిర్జించగలననే గర్వం అతన్ని అంతం చేసింది.</p>
<p>ఇంత అయినా అతని ఆరాధన లో నిజాయితీ ఉన్నట్లుగానే తిక్కన సూచించి వదులుతారు. కొన్ని ఎడల నవ్వు, ఇంకొన్ని ఎడల జాలి పుట్టిస్తారు. అది ఎలా సాధ్యపడిందంటే అతను అధముడనీ మూఢుడనీ ఎలాగా నెగ్గడనీ మనకి ముందు నుంచీ తెలుస్తూ ఉండే ఆయన నాటకశిల్పం వలన.</p>
<p>ఎవరు ధూర్తంగా ప్రవర్తిస్తున్నారో వారి వైపునుంచి కథ చెప్పుకురావటం , అది అవసరమైన వారికి వారి మాటలలోనే సమాధానం చెప్పటం. కీచకుడి పాత్రను మార్చి చిత్రించటం వెనుక తిక్కన గారి ఉద్దేశం అదే అయి ఉండాలి.<br />
విశ్వనాథ నాటకం కీచకుడు సైరంధ్రి [ద్రౌపది ] ని చూసి తన్మయుడవటం తో మొదలై అతని వధ ను సూచిస్తూ ముగుస్తుంది. ఎందుకని ఆ మాత్రమే రాయదలచారు? నర్తనశాల అని పేరే కాని కీచకవధ కు తప్ప అది ఉపయోగపడినది లేదు. బృహన్నల పాత్ర కూడా నాటకం లో లేదు.</p>
<p>నాకు సమాధానం నాందీ పద్యాలను తరచి చూస్తే కనబడటం మొదలు పెట్టింది. ఆ రెండింటిలో ఒకటి పరమశివుని మూడో కన్నుని , ఆయన చేసిన కామదహనాన్ని ప్రస్తుతించేది. &#8216; ఓహో &#8216; అనిపించింది. రెండో పద్యం శివతాండవం గురించి.. రూఢి అయింది రచయిత ఉద్దేశం. తమాషా ఏమిటంటే దీనికి మూలం వ్యాసభారతం లో ఉంది. కీచకుడు సైరంధ్రి లభించక పోతే శంకరుడిని ప్రార్థిస్తానని అంటాడు &#8221; ప్రభూ, నన్ను సైరంద్రితో కలుపు, లేదా మరణాన్ని ప్రసాదించు &#8221; అని. శివుడి ఆ ఎంపికను, ఆజ్ఞను నాందిలో వాడారు విశ్వనాథ.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/Raja_Ravi_Varma_Pleasing.jpg"><img class="alignright  wp-image-5136" title="Raja_Ravi_Varma,_Pleasing" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/Raja_Ravi_Varma_Pleasing.jpg" alt="" width="321" height="480" /></a></p>
<div><span style="color: #0000ee;"><br />
</span>ద్రౌపదీ లావణ్య వాహిని లో కొట్టుకు పోతూ దిక్కు తోచని అభిశప్తుడిగా కీచకుడు ఇక్కడ గోచరిస్తాడు. ఆమెని చూసిన క్షణం నుంచీ శాంతి ఎరగని దీనత్వం ఎంతటిదయినా ఆమె తిరిగి ప్రేమించి తీరాలనిలేదు. చెప్పీ ఒప్పించబోయీ కాసింత నొప్పించీ అతను ఏమీ సాధించలేకపోతాడు. ఒక మాట్లాడబోయే ప్రయత్నం తో ఆమె పరుగెత్తి వెళ్లిపోతూ ఉంటుంది. అతను వెంబడిస్తాడు .&#8221; ఆగు, నేను చెప్పేది ఆలకించు, ఎందుకు భయపడిపోతావు &#8221; అంటాడే కాని ఆమెను రాజసభ దాకా తరమడు. తననుంచి దూరంగా పరుగెత్తేటప్పుడు కీచకుడి నోట ఈ పద్యం నాటకంలో , ఇటువంటి ధోరణే మొత్తం-ఇంచుమించు భావకవిత్వం లాగా.<em>&#8220;ఆ గమనరేఖ నన్నెంత యాహరించు ?</em><br />
<em> దూరమునకెంత సౌందర్య వారి రాశి</em><br />
<em> ఆ ఎగురుచున్న నీదు చేలాంచలముల</em><br />
<em> వెలది నా ప్రాణములు ముడివేసుకొందు&#8221;</em>ఇక తన్ని అవమానించటం ఎక్కడ?</p>
<p>చివరి చివరికి ఊరికే ఆమెని చూసి అయినా సంతోషిస్తాను, ఆమె నిలబడిన నేలకి నమస్కరిస్తాను అనే దశ కి వెళతాడు. చెలికాడయిన శారద్వతుడు &#8221; ఈ భక్తి దైవము యెడలనయిన కైవల్యమొసగెడివాడే &#8221; అంటాడు. &#8221; ఇంతకన్న కైవల్యమేమిటి &#8221; అని కీచకుడి సమాధానం.పరకాంతను, పతివ్రతను సాధించదలచినప్పుడే మరణం తప్పనిసరి పరిణామం. కానీ ఇతనికి పుణ్యలోకాలు రాకపోయినా ఉత్తమమైన పునర్జన్మ వస్తుందేమోనన్నట్లుగా ఉంటుంది ఆ పాత్ర చిత్రణ.</p>
<p>‘ విశ్వనాథ సౌందర్యదర్శనం’ అనే అద్భుతమైన గ్రంథాన్ని రచించిన యు.ఎ.నరసిం హమూర్తి గారు ఈసత్వగుణసంపన్నుడైన కీచకుడి సృష్టిఅద్భుతమని అంగీకరిస్తూనే ఈ తీరు విశ్వనాథ పైన పాశ్చాత్య సాహిత్యం వలన వచ్చిన ఉదాత్త సంస్కారాన్నో లేక విశ్వనాథ వారి విలక్షణమైన పూర్వజన్మ సంస్కారాన్నో సూచిస్తుందని అభిప్రాయ పడ్డారు. నాకు &#8216; కాదు &#8216; అనే తోచింది. ఈ నాటకం రచన 1924 లో. అప్పటి స్వేచ్చా ప్రణయ సిద్ధాంతపు నేపథ్యాన్ని ఊహించుకుంటే ఆయన ఏమి చెప్పదలచారో తెలుస్తుంది. తీవ్రమైన ,గాఢమైన అనురక్తి ఎలా ఉంటుందో బొమ్మ కడుతూనే దాని అచ్చపుదనమెంతటిదయినా &#8211; దేశ కాల పరిస్థితుల రీత్యా ఒక హద్దును అతిక్రమించినప్పుడు ,అవతలివారు స్పందించనప్పుడు ,ఆ ఉద్వేగాన్ని ఆమోదయోగ్యంగా చేయలేదని .</p>
<p>అసాధారణమైన లోకజ్ఞతా అమితమైన మృదుత్వమూ రెండూ సమంగా ఉన్న సాహిత్యకారులకు మాత్రమే సాధ్యమయేది అది.<br />
సైరంధ్రి పైని వ్యామోహం తో బాధ పడే కీచకుడిని శారద్వతుడు ఊరడిస్తూ ఉంటాడు. కథ చెప్పనా అని, &#8221; అనగనగా ఒక రాజు &#8221; అంటాడు.</p>
<p>కీచకుడు &#8221; ఆ రాజుకి ఏడుగురు కొడుకులా ? &#8221; అని అడుగుతాడు.</p>
<p>&#8221; కాదు, నలుగురే, పెద్దవాడు అడవికి వెళ్ళాడు .. అతని భార్యను ఒక రాక్షసుడు ఎత్తుకు వెళ్లాడు &#8221;</p>
<p>&#8221; ఈ కథ నాకు తెలియును &#8221; [కీచకుడు ]</p>
<p>&#8221; నీకుతెలియదు,[ తెలిస్తే ఇలా ప్రవర్తించవు అని ధ్వని] చివరకు ఏమయినది ? &#8221;</p>
<p>&#8221; ఇంకొక కథ చెప్పుము &#8221; అని మాట మారుస్తాడు కీచకుడు</p>
<p>ఒంటరిగా అదేపనిగా తలపోస్తున్నప్పుడు ఆమె పాంచాలి ఏమో అని అతనికి అనుమానం వస్తుంది. తనది తప్పేమో అని తర్కించుకుంటాడు ఇలాగ &#8221; అందందు నా చేసిన పుణ్యకార్యములును నీ మహా పాపరాశి లో మునిగిపోయినవి. నేను సుక్షత్రియుడను కాను గనుకనే నాకీ నీచపు బుద్ధులని కూడ విరోధులు గుసగుసలాడుచున్నారు &#8221; నిర్జించలేనంత తృష్ణ కు దాసుడై పోయినందుకు తనను తాను నిందించుకుంటాడు.</p>
<p>అతని అంతర్మథనం చివరి వరకూ కొనసాగుతుంది .సంకేతస్థలానికి కూడా వెళ్లటం మానేద్దామా, పోనీ వెళ్లి పశ్చాతాపాన్ని ప్రకటిద్దామా అనుకుంటాదు. ఇందులో మోసం ఉందా అన్న సందేహమూ వస్తుంది అతనికి. అయినా , బుద్ధిః కర్మానుసారిణీ !</p>
<p>అతను మరణించబోయే రోజున దీర్ఘాయుష్మాన్ భవ అని స్నేహితుడు దీవిస్తాడు, రాగల ఆపద తెలుస్తూ ఉంటుంది అతనికి. కామిని లభించాలని దీవించరాదా అంటాడు కీచకుడు. &#8221; నాలుగు రోజులు బ్రతికినా చాలు, ఆమె లభిస్తే. ఆమె పూలు కోసిన లతను కౌగలించుకుంటాను, ఆమె నిలబడిన నేలను గుండెకద్దుకుంటాను &#8221; అనే కీచకుడి ధోరణికి<br />
శారద్వతుడు అది కుతర్కమంటాడు. [,ఇటువంటి తర్కం వేరే తెలుగు కావ్యాలలోనూ కనిపిస్తుంది. ఉదాహరణకి వరూధిని ప్రవరాఖ్యుడితో అనే మాటలలో. సైరంధ్రీ దేవకాంత అనే కీచకుడు నమ్ముతూ ఉంటాడు. ]</p>
<p>నాగరికుడూ, ఏకాగ్రచిత్తుడూ, మనస్వీ, ఏ మాత్రమో వివేకీ… ఇన్ని అయినా , కీచకుడి మోహం ధర్మవిరుద్ధం.<br />
ఎవరి ధర్మం? అని ప్రశ్నిస్తే ఎవరిని కామించాడో ఆమె ధర్మం.</p>
<p>విశ్వనాథ కల్పనలో ఇంకొక విశేషం సుధేష్ణ. వ్యాసభారతంలో, ఆంధ్రమహాభారతం లో ఆమె ఇంచుమించు ఒకేలా ఉంటుంది. యుక్తాయుక్త విచక్షణ ఉండి కూడా కీచకుడిని మెప్పించక తప్పని స్థితిలో సైరంద్రిని మదిర కోసం కీచకుడి దగ్గరికి పంపుతుంది. ఆమె నీతిసీలలు వదులుగా అనిపిస్తాయి, ఏ ఉద్దేశం తో చేసినా. ఇక్కడి సుధేష్ణ కీచకుడిని తీవ్రంగా మందలిస్తుంది. వల్లకి అనే పరిచారిక పన్నిన వ్యూహం లో కీచకుడు, సుధేష్ణ ఇరుక్కుంటారు. ఆ వల్లకికీ ప్రత్యేకమైన కారణమేమీ ఉండదు, అందరు పరిచారికల వలె సైరంధ్రి ఎందుకు ఉండదనే అక్కసు తప్ప.</p>
<p>&#8221; వెళ్లమని సెలవా ? &#8221; అని సైరంధ్రి అడిగిన ప్రశ్నకు మదిర మత్తులో &#8221;ఊ &#8221; అంటుంది సుధేష్ణ. ఈ పాత్రను పైకి ఎత్తటం లో విశ్వనాథ కు కారణాలు ఉన్నాయి. పాండవులంతటివారు ఆశ్రయం పొందేందుకు ఎంచుకున్న ఒక రాజ్యాన్ని ఏలుతున్న రాణి ఆ విధంగా ప్రవర్తించదు, ప్రవర్తించరాదు అని ఒకటి అయితే ఎవరివలన పాండవుల వంశం నిలబడిందో ఆ ఉత్తరను కన్న తల్లి అటువంటిది కాకూడదు అని ఇంకొకటి.</p>
<p>ఆ రెండు కథనాలలో లేని పద్ధతిలో ఉత్తరను ఉత్తమురాలయిన రాజకుమారిగా, అవసరమయితే మేనమామ కీచకుడినీ అప్రయత్నంగా నిలవేసే ధర్మాగ్రహం చూపగలదానిగా తీర్చారు. సైరంధ్రి, వలలుడి వేషం లో ఉన్న భీముడు ఆమె పైన చూపే పుత్రికా వాత్సల్యం అపురూపంగా ఉంటుంది. ఈడు వచ్చిన కొడుకులున్న తల్లిదండ్రులకు యోగ్యురాలైన అమ్మాయి కనబడితే పడే ముచ్చట అంతా అక్కడ ఉంటుంది.</p>
<p><img class="alignright  wp-image-4547" title="mithili2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/mithili2.gif" alt="" width="165" height="170" /></p>
<p>ఉన్నతమైన మోహమూ, భక్తి అనవలసినంతటి ఆరాధనా కలిపి తాను సృజించిన కీచకుడి పైన విశ్వనాథకు జాలి, సానుభూతి, గౌరవం ఉన్నాయి. భారతీయనాటకం లో మృతిని దృశ్యం చేయకూడదు . కాని అతని చావును మరొక పాత్రతో చెప్పించేందుకు కూడా ఆయనకు చేతులు ఆడలేదు. అంత సంప్రదాయవాదికీ లోపల అంత మెత్తదనం ఉంది. &#8221; నాయనా , ఇది పద్ధతి కాదోయీ &#8221; అని బుద్ధి మార్చే ప్రయత్నం చేస్తారు.</p>
<p>&#8221; ఏమి కామమోయీ, ఏమి కామము ? &#8221; అని గర్జించేందుకు ఆయనకు పది సంవత్సరాలకు పైగా పట్టింది. ఆ నిర్దాక్షిణ్యపు నీతి కథ &#8216; చెలియలి కట్ట &#8216; 1935 లో వచ్చింది.</p>
<p style="text-align: center;">*** ** ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=5132</wfw:commentRss>
		<slash:comments>36</slash:comments>
		</item>
		<item>
		<title>ప్రజ్ఞా పారమిత &#8211; జేన్ ఆస్టిన్</title>
		<link>http://vaakili.com/patrika/?p=4920</link>
		<comments>http://vaakili.com/patrika/?p=4920#comments</comments>
		<pubDate>Sat, 01 Feb 2014 00:19:07 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కడిమిచెట్టు]]></category>
		<category><![CDATA[మైథిలి అబ్బరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=4920</guid>
		<description><![CDATA[<p></p> <p>చార్లొటి బ్రాంటి లాగా ఆమె ఉద్వేగం నిండిన రచన చేయలేదు. జార్జ్ ఇలియట్ లాగా దిగంతాలను చూడలేదు. తనకు తెలిసిన, తాను మెలిగిన మనుషుల గురించే, పైపైన చూస్తే పైపైనిదనిపించే పద్ధతి లో చెప్పారు . ఆమె నాయికా నాయకులు ఉదాత్తతకో విజ్ఞానానికో పేరు మోసినవారు కానే కారు. మరి ఆమె ఏమి రాశారు?</p> <p>హృదయానికీ మేధస్సుకీ సమన్వయం కుదిరేలా చేసుకోవటం ఆలోచించగలవారందరికీ అందీ అందక వేధించేదే. బ్రతకటం లో కళ ఎంత , శాస్త్రం ఎంత, రెండిటినీ కలిపిఉంచగల వీలెంత? గొప్ప కళాకారిణి జేన్ఆస్టిన్ రెండు వందల ఏళ్ల క్రితం చెప్పినదే ఇది అంతా.</p> <p>పరిమితమైన పరిధిలో ఆమెకనబరచినది అపరిమితమైన ప్రజ్ఞ . ఎంత సానబట్టిఉంటారో ఊహించలేనంత మెరుపు ఆమె వాక్యాలలో. అసలు అప్రయత్నంగానే ఆ వజ్రనిశితమైన బుద్ధినుంచి వచ్చాయేమోననీ అనిపిస్తుంది. పాత్రలు వారికి ఏది సహజమో అలాగే ప్రవర్తిస్తాయి. ఇంకా, ఆ స్వభావాన్ని చిత్రించేందుకు ఆమె ఎక్కువ రంగులు కలుపుకోరు కూడా. రెండు మూడు వాక్యాలలో గతాన్నీ భవిషత్తు నీ వర్తమానం తో తెచ్చి ముడి వేస్తారు.</p> <p>ఆమె గతించిన సంవత్సరమే జన్మించిన విమర్శకుడూ, ఇంచుమించు అభిమానీ అని చెప్పదగిన George Henry Lewes రాసిన వ్యాసం చాలా మేరకు సరిగ్గా అనిపించింది. కాకపోతేఆయన జేన్ ఆస్టిన్ స్థానాన్ని ప్రధాన సాహిత్య స్రవంతి లో ఎత్తున, ఒక మూలగా చెబుతారు. ఆయన దర్శనం అంతవరకే వెళ్లింది. నిజంగానే ఆమె తన జీవితకాలం లో సుమారయిన విజయాన్నే చూశారు. ఐరిష్ రచయిత్రి మేరియా ఎడ్జ్ వర్త్ వంటివారు ఆమె కంటె ఎక్కువ స్థితిలో ఉండేవారు. పెద్ద పెద్ద కుడ్య చిత్రాలవంటి నవలలు రాసిన వాల్టర్ స్కాట్ అప్పటి సాహిత్యానికి చక్రవర్తి. జేన్ ఆస్టిన్ రచనను ఆయన ఇష్టపడి మెచ్చుకునేవారు. ఆ ప్రశంస లు ఆమె నవలల ని ప్రమోట్ చేయటం లో వాడుకునేవారట. [కాలం గడిచాక ఆయన నవలలని ఆమె మెచ్చుకున్నవి [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg"><img class="aligncenter size-full wp-image-4744" title="kadimi" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/kadimi1.jpg" alt="" width="810" height="284" /></a></p>
<p>చార్లొటి బ్రాంటి లాగా ఆమె ఉద్వేగం నిండిన రచన చేయలేదు. జార్జ్ ఇలియట్ లాగా దిగంతాలను చూడలేదు. తనకు తెలిసిన, తాను మెలిగిన మనుషుల గురించే, పైపైన చూస్తే పైపైనిదనిపించే పద్ధతి లో చెప్పారు . ఆమె నాయికా నాయకులు ఉదాత్తతకో విజ్ఞానానికో పేరు మోసినవారు కానే కారు. మరి ఆమె ఏమి రాశారు?</p>
<p>హృదయానికీ మేధస్సుకీ సమన్వయం కుదిరేలా చేసుకోవటం ఆలోచించగలవారందరికీ అందీ అందక వేధించేదే. బ్రతకటం లో కళ ఎంత , శాస్త్రం ఎంత, రెండిటినీ కలిపిఉంచగల వీలెంత? గొప్ప కళాకారిణి జేన్ఆస్టిన్ రెండు వందల ఏళ్ల క్రితం చెప్పినదే ఇది అంతా.</p>
<p>పరిమితమైన పరిధిలో ఆమెకనబరచినది అపరిమితమైన ప్రజ్ఞ . ఎంత సానబట్టిఉంటారో ఊహించలేనంత మెరుపు ఆమె వాక్యాలలో. అసలు అప్రయత్నంగానే ఆ వజ్రనిశితమైన బుద్ధినుంచి వచ్చాయేమోననీ అనిపిస్తుంది. పాత్రలు వారికి ఏది సహజమో అలాగే ప్రవర్తిస్తాయి. ఇంకా, ఆ స్వభావాన్ని చిత్రించేందుకు ఆమె ఎక్కువ రంగులు కలుపుకోరు కూడా. రెండు మూడు వాక్యాలలో గతాన్నీ భవిషత్తు నీ వర్తమానం తో తెచ్చి ముడి వేస్తారు.</p>
<p>ఆమె గతించిన సంవత్సరమే జన్మించిన విమర్శకుడూ, ఇంచుమించు అభిమానీ అని చెప్పదగిన George Henry Lewes రాసిన వ్యాసం చాలా మేరకు సరిగ్గా అనిపించింది. కాకపోతేఆయన జేన్ ఆస్టిన్ స్థానాన్ని ప్రధాన సాహిత్య స్రవంతి లో ఎత్తున, ఒక మూలగా చెబుతారు. ఆయన దర్శనం అంతవరకే వెళ్లింది. నిజంగానే ఆమె తన జీవితకాలం లో సుమారయిన విజయాన్నే చూశారు. ఐరిష్ రచయిత్రి మేరియా ఎడ్జ్ వర్త్ వంటివారు ఆమె కంటె ఎక్కువ స్థితిలో ఉండేవారు. పెద్ద పెద్ద కుడ్య చిత్రాలవంటి నవలలు రాసిన వాల్టర్ స్కాట్ అప్పటి సాహిత్యానికి చక్రవర్తి. జేన్ ఆస్టిన్ రచనను ఆయన ఇష్టపడి మెచ్చుకునేవారు. ఆ ప్రశంస లు ఆమె నవలల ని ప్రమోట్ చేయటం లో వాడుకునేవారట. [కాలం గడిచాక ఆయన నవలలని ఆమె మెచ్చుకున్నవి గా చెప్పే స్థితీ వచ్చింది] ఆ తర్వాతి 19 వ శతాబ్దపు సాహిత్యమూ గొప్ప గౌరవాన్ని ఇవ్వలేదు కూడాను. డికెన్స్ ఏలిన దశాబ్దాలలో విల్కీ కాలిన్స్ వంటి వారికే సరయిన గుర్తింపు రాలేదు. ఈమె ను ఇంచుమించు విస్మరించారు. బ్రాంటి సోదరీమణులు , జార్జ్ ఇలియట్ తక్కిన చోటుని పంచుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం కష్టాలనీ క్లిష్టతలనీ ఆమె నిర్లక్ష్యం చేశారనిపించటం. నెపోలియన్ తో ఇంగ్లీష్ వారు యుద్ధం చేసే రోజులలో ఆ సంగతే తన రచనలలో ఎత్తుకోరు ఆమె. అది అలా రాయదలచుకోనితనం, తానై గీసుకున్న పరిధి ఒక కారణం. వేణువు సన్నాయి లాగా మ్రోగనవసరం లేదు, దాని దినుసు వేరే .</p>
<p>ఇరవైయవ శతాబ్దం, ముఖ్యంగా దాని ఉత్తరార్థంలోనే ఆమె వన్నే వాసీ తెలిసివచ్చాయి<br />
సమకాలీనమైన కథలను ప్రతిభ ఉట్టిపడేలా రాయటం లో ఆమె ఇంచుమించు మొదటివారు. సభ్యత, నియమాలు&#8230;వీటికి ఆమె ఇచ్చిన నిర్వచనాలు ఈ రోజుకీ చెల్లుతాయి. స్త్ర్రీ పురుషుల విషయం లో సమాజం వేర్వేరు తీర్పులు ఇస్తుందనే విషయాన్నీ ఆమె కదిపారు. విమర్శ ఏమిటంటే ఆమె &#8216; భద్రంగా &#8216; ఉండటం గురించి మాట్లాడారని. ఎంత అరాచకంగా ఉంటే అంత గొప్ప రచనేమోనన్న భ్రాంతి బలిష్టంగా ఉన్న ఇప్పుడు అలా ఎందుకు ఉండాలన్నారో తెలుసుకుని ఒప్పుకోవటం కష్టమే. నిజానికి ఆమె తర్వాతి తరం రచయిత్రి ఛార్లొటీ బ్రాంటి ఆమె ను ఘాటు గానే దుయ్యబట్టారు. తీవ్రత అంటే ఏమిటో తెలియదు అనీ ఏ సంఘటననీ ఆరుబయటకి తీసుకురారనీ. నిజమే, ఆమె ఎటువంటి తపననూ ఎక్కడా తీవ్రంగా చిత్రించలేదు. సెన్స్ అండ్ సెన్సిబిలిటీ లో ప్రేమించినవాడు మోసం చేస్తే మంచానపడిన మేరియన్ గురించి చెప్పటంలోనూ సం యమనం పాటిస్తారు.అక్కర లేక అయితే కాదు, అది ఇంకొక పాత్ర రూపంలో [కల్నల్ బ్రాండన్ ] చూపిస్తారు. దుఃఖపడటాన్ని రొమాంటిసైజ్ చేయదలచుకోరు ఆమె. సమస్యకు నివారణ ముందు చెబుతారు, ఇక పరిష్కారం చెప్పకుండా వదిలే పనే లేదు. నిజ జీవితం లోఉంటాయా అలాంటి పరిష్కారాలు? సమాధానం ఏమిటంటే సాహిత్యం ఎప్పుడూ ఒక సూచన, ఒక వైద్యం. నిజజీవితపు నేలబారుతనాన్నీ నిరాశనూమాత్రమే చెప్పి ఊరుకోవటాన్ని ఆమె ఇష్టపడినట్లు లేరు.</p>
<p>వాతావరణ కల్పన చాలా తక్కువగా కనిపిస్తుంది ఆమె రచనలో, అదీ నిజమే. సుందరమైన ఇంగ్లీష్ పల్లెటూళ్ల వర్ణన జోలికే వెళ్లరు ఆమె. ప్రకృతితో నిమిత్తం లేకుండా నాలుగు గోడ ల మధ్య నడిచే కథ చెప్పటమే కష్టం. అది కష్టమని తెలియకపోయేలా రాయటం ఇంకా కష్టం. ఇక్కడే ఆమె ఒక నాటకకర్త అనిపిస్తారు. షేక్ స్పియర్ తర్వాత పాత్ర చిత్రణ ఆమెలాగా చేసినవారు లేరంటారు. మన తిక్కన్న గారితోనూ పోల్చుకోవచ్చు. ఏ చెరిపివేతా లేకుండా స్పష్టంగా సరిగ్గా గీస్తారు మనుషులని. ఆమెని పారడీ చేసిన ఆస్కార్ వైల్డ్ కూడా ఆమె ప్రభావం లోంచి తప్పించుకోలేకపోయారు. ఆమె నాటకం రాస్తే ఆయన &#8216; లేడీ విండర్ మియర్స్ ఫాన్ &#8216; అయిఉండేదేమో అనుకుంటాను. ఆమె రచనా పద్ధతి ఫ్లూయిడ్ గా ఉంటుంది .పెద్ద పెద్ద వాక్యాలతో చిన్న అధ్యాయాలు, ఎక్కడ అధ్యాయం ముగిస్తారో ఒక పేజీ ముందే తెలిసిపోతూ ఉంటుంది, అది ఆమె ముద్ర. నాజూకైన ,పదునైన అధిక్షేప హాస్యం అంతర్లీనంగా ఉంటూ ఉంటుంది ఆమె కథనం లో.</p>
<p><img class="alignleft size-full wp-image-4923" title="jane-austen-portrait" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/jane-austen-portrait.jpg" alt="" width="200" height="287" /></p>
<p>ఆ పందొమ్మిదో శతాబ్దపు తొలి సంవత్సరాలలో స్త్రీలకే కాదు, పురుషులకీ అవకాశాలు తక్కువే. వివాహం ఒక ఉపాధి గా ఉన్న కాలం అది. ఇంగ్లండ్ గొప్పవంశాల వారికి ధనం ప్రసక్తి లేని వివాహాలు చేసుకుని బతికే సామాజిక పరిస్థితులు లేవు. ఆ &#8216; నిధివేట &#8216; లని ఆమె వెటకారంచేస్తారు. డబ్బు కోసం పెళ్లిళ్లు చేసుకోవద్దని హెచ్చరిస్తారు . అయితే దాదాపు అన్ని నవలలలోనూ ముఖ్యపాత్రలు అనుకూలమైన పరిస్థితులలోనే స్థిరపడతాయి. ఇదొక వైరుధ్యమని ఫిర్యాదు ఆమె పైన . ప్రత్యేకించి సహాయ పాత్రల విషయంలో , ఒక స్థితి తప్పనప్పుడు దాన్ని వీలయినంత తక్కువ నొప్పితో చేరే మార్గం చెబుతున్నారా అని ఉక్రోషం వస్తుంది కూడా. తన పాత్రల మీద మమకారం[[అది నేరమేమీ కాదు ] వివాహమంగళం గా పర్యవసిస్తుందనుకోవలసిందే. ఆధునిక దృష్టితో చూస్తే ఆమె రొమాంటిక్ కామెడీ లు రాశారు . ఆమెను బాహాటంగా విమర్శించినా జార్జ్ ఇలియట్ శ్రేష్టకృతి &#8216; మిడిల్ మార్చ్ &#8216; మీద ఆమె ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి.</p>
<p>&#8220;అరుదుగా, చాలా అరుదుగా పూర్తి సత్యం అనేది మనుషులకి అందుతుంది. కొంచెం మార్పుతోనో , ఇంకొంచెం పొరబాటుతోనో కలిసి ఉండని సత్యం తెలియటం మరీ అరుదైనది’’అంటారు. సత్యపు పాక్షికతనీ సాపేక్షతని అంగీకరిస్తూనే &#8216; వినా దైన్యేన జీవనం &#8216; గడపగల మెళకువనీ మెలకువనీ చెప్పగల సాహిత్యం ఆమెది. సంఘటనలూ సందర్భాలూ ఆమె రచన ఇచ్చే యంత్రలాభం [ మెకానికల్ అడ్వాంటేజ్ ] వలన సరళం అవుతాయి , సాహిత్యం లోనూ వాస్తవ ప్రపంచంలోనూ. ఈ మధ్యన &#8216; game theory &#8216; నీ ఆమె రచనలకి విజయవంతంగా వర్తింపజేశారు. William Deresiewicz 2012 లో &#8216; ఆ ఆరు జేన్ ఆస్టిన్ నవలలు నాకేమి నేర్పాయి? &#8216; అని ఒక పుస్తకం రాసుకొచ్చారు, అది పెద్ద సక్సెస్. ఆమె ఎంత విశ్వసనీయమైనవారో నొక్కి చెప్పాలని కాదు, గుర్తు చేయాలని .</p>
<p>ఆమె నవలలు ఏవీ ఔటాఫ్ ప్రింట్ అవవు. ఆంగ్ల సాహిత్యవిద్యార్థులకే కాదు, సాధారణమైన పాఠకుల కోసం కూడా.<br />
Northanger Abbey అప్పటి గోథిక్ నవలల మీద పారడీ. [ఆ కాలపు ] వాస్తవికతని చిత్రించని రచనల పట్ల ఆమెకి ఎంతమాత్రమూ సానుభూతి లేనట్లే. ఆశ్చర్యకరంగా ఆమె రాసిన కాలాన్ని అధిగమించి ఆమె నవలలు నిలిచి ఉన్నాయి. మానవ స్వభావాన్ని దాని అతి సున్నితమైన స్థాయిలో ఆమె ఒడిసిపట్టుకోగలగటం దానికి కారణం అయిఉండాలి.<br />
సెన్స్ అండ్ సెన్సిబిలిటీ ఉద్వేగాన్నీ వివేచననూ ఎలాగ తూకం వేసుకుని ఆలోచించాలో చెప్పదలచిన రచన. ఆ కత్తిమీది సాము ని ఆమె ఒడుపుతో చేసి చూపిస్తారు. పదమూడేళ్ల కిందట దక్షీణభారతం లో సినిమాగా వచ్చినప్పుడూ ఆ త్రాసు సరిగానే పనిచేస్తూ ఉన్నట్లుంది. నవల లోని ఏ పాత్రనూ ఏ ముఖ్యమైన సన్నివేశాన్నీ వదలకుండా , 2000 సంవత్సరానికి అన్వయించి తీసిన ఆ సినిమా [కండుకొండే కండుకొండేన్ ( ప్రియురాలు పిలిచింది ) ] అక్షరాలా రక్తి కట్టింది. ఆలోచనామగ్నమైన టాబూ ముఖం ఎలినార్ పాత్రకి కి గొప్పగా న్యాయం చేసింది. పాతరోజులలో అయితే నూతన్ సరిపోయిఉండేవారనిపిస్తుంది.</p>
<p>మాన్స్ ఫీల్డ్ పార్క్ కొంత విలక్షణమైన నవల. స్థూల దృష్టికి అది జడ్జిమెంటల్ గా కనిపించే అవకాశమూ ఉంది.నాయిక ఫానీ ప్రైస్ ని తన పెరిగిన పరిసరాలకంటే ఉన్నతురాలిగా చూపించటం లో వింతేమీ లేదు. కాని ఆమె ఆ వాతావరణాన్ని అయిష్టం గా చూడటం అప్పటి ఆదర్శవాదాన్ని . పక్కకి నెట్టటమే. ఫానీ ప్రైస్ అందుకు చాలామందికి నచ్చదు. ఆమె &#8216; యోగ్యత &#8216; ని నమ్ముతారు, దాన్ని సాధన తో తెచ్చుకోవచ్చుననే నమ్మకమూ కలిగిస్తారు. మార్క్ ట్వేన్ &#8216; ప్రిన్స్ అండ్ద పాపర్ &#8216; లో టాం కాంటీ తండ్రిని అలాగే ద్వేషింపజేస్తారు.[ ఆమెని తీవ్రంగా విమర్శించినవారిలో మార్క్ ట్వేన్ ఒకరు] ఈ రెండు చోట్లా దరిద్రం మనసులలో , దయ లేకపోవటం లో, సిగ్గుమాలిన స్వార్థం లో.</p>
<p>ఎమ్మా నవల జేన్ ఆస్టిన్ కల్పనా చాతుర్యపు పరాకాష్ట. &#8216; ఎవరికీ నచ్చని నాయిక ని సృష్టిస్తున్నాను &#8216; అన్నారట ఆమె రాయబోతూ. కాని ఎమ్మా ధూర్తత్వంలోని అమాయకతని ఇష్టపడి తీరతాము. తెలిసీ తెలియని జ్ఞానం తో పక్కవారి జీవితాలను సవరించబోయే ఎమ్మావుడ్ హౌస్ ప్రపంచ సాహిత్యం లోని ఆహ్లాదకరమైన పాత్రల లో ఒకటి. రచయిత్రి సుఖాంతమైన కథలే చెప్పారు కనుక ఆ సరదా కి ఏమీ భంగం రాదు కూడా. అవవలసినంత అల్లరీ అయిపోయాక ఆమెని నీడలా కాచుకునే నైట్ లీ అంతంత పెద్ద ఫిర్యాదులేమీ చేయకుండానే పెళ్ళాడుతాడు ఆమెని. సెన్స్ అండ్ సెన్సిబిలిటీ లో కల్నల్ బ్రాండన్ కి మరొక రూపం నైట్ లీ. ప్రేయసిని, వయసులో చిన్న అవటమూ ఒక కారణంగా లాలించి క్షమించి దగ్గరికి తీసుకునే పురుషులు వీళ్లు.</p>
<p>పర్సుయేషన్ చివరి నవల. నాకు ఇది విశ్వనాథ వేయిపడగలు లో ప్రస్తావించిన నవల కూడా. అనారోగ్యం వలనా సమయం లేకా ఎక్కువ చిత్రిక పట్టని నవల అంటారు. బహుశా అందువల్లనే ఎక్కువ సహజంగానూ అనాయాసమైనది గానూ అనిపిస్తుందేమో కూడా. నా వరకు ఇది ఆమె మాస్టర్ పీస్. ఎవరో వద్దని నచ్చజెపితే విని కెప్టెన్ వెంట్ వర్త్ కి దూరమవుతుంది ఆన్ ఇలియట్. కాలాంతరాన తిరిగి కలుసుకుని ఒకరినొకరు కనుగొంటారు ఇద్దరూ. ఈ లోపున ఆన్ పరిణతి లోతుగా, మాధుర్యపూరితంగా ఉంటుంది. చెప్పుకోదగిన విషయం ఆమె ఒకప్పటి తన నిర్ణయానికి అమితంగా పశ్చాత్తాప పడకపోవటం. తన పట్ల తన ఒప్పుదల అది, జేన్ ఆస్టిన్ తాత్వికత కి ఇది అపురూపమైన ప్రారంభం. ఆయుర్దాయం ఉండిఉంటే వచ్చి ఉండగల ఆ తర్వాతి రచనలని కోల్పోయాము.</p>
<p>ఆమె పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది అత్యంత ఆకర్షణీయమైన, &#8216; ప్రైడ్ అండ్ ప్రజుడిస్ &#8216;. ఆనవలల వరసలో ఉత్తమమైనదని అనిపించదు నాకు. బహుశా నేను దాన్ని నా యౌవనం గడిచిపోయాక చదవటం ఒక కారణమయి ఉండవచ్చు. ఆ నవల మొదలుపెట్టిన సంప్రదాయం జార్జెటి హేయర్ విజయవంతం గా కొనసాగించారు. ఈ రోజుకీ వెలువడే రీజెన్సీ రొమాన్స్ లకి ఒరవడి ఆ నవల పెట్టినదే. జేన్ ఆస్టిన్ ని చేసుకునే అపార్థాలకూ ఆ నవలే కారణం ఆ విధంగా.</p>
<p>జోన్ ఐకన్ అనే ప్రసిద్ధ రచయిత్రి జేన్ ఆస్టిన్ కి వీరాభిమాని. చాలా సీక్వెల్ లు రాశారు. రకరకాలయిన &#8216; మళ్లీ చెప్పే &#8216; నవలలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి.</p>
<p>ఇంగ్లీష్ లో ఎన్నోసార్లు సినిమాలుగా, టీ వీ సీరీస్ గా వస్తూనే ఉంటాయి ఆమె నవలలు.<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/mithili2.gif"><img class="alignright  wp-image-4547" title="mithili2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/mithili2.gif" alt="" width="165" height="170" /></a></p>
<p>మనకి లభ్యమయే పోర్ ట్రైట్ లో లాగానే ఆమె స్ఫురద్రూపిఅట. అవి వివేకం చిందిపోయే కవళికలు . బంధువులూ స్నేహితులూ అందరూ గుమిగూడి వినోదించేవేళ ఒక కనీకనబడని మూలలో కూర్చుని విప్పారిన కళ్లతో గమనించి రాసినట్లు ఉంటాయంటారు ఆమె రచనలు. ఆ సంపన్న గృహాలలోని సౌకర్యవంతమైన ఆసనాల మధ్య జన్మించిన ఆమె రచన దేశకాలాలని అధిగమిస్తూనే ఉంది.</p>
<p>జేన్ ఆస్టిన్ కి కాపీరైట్ లేదు, ఆన్ లైన్ లో ఉచితంగా దొరుకుతాయి ఆమె రచనలుఅన్నీ.. చదవనివారు ఒకసారి ప్రయత్నించి చూడండి. ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ చదువుతూ, డార్సీ ప్రపోజల్ ని ఎలిజబెత్ బెన్నెట్ అంగీకరించిందనే ఆనందాన్ని చెప్పుకోవటానికి , .మా అమ్మాయి స్నేహితురాలు ఏడాది క్రితం అర్థరాత్రి కాల్ చేసింది. ఆమెకి ఇంకొక రెండువందలేళ్లు ఢోకా లేదనిపించింది. .</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=4920</wfw:commentRss>
		<slash:comments>30</slash:comments>
		</item>
	</channel>
</rss>
