<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; డా. సీతారామయ్య (రామసూరి)</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?feed=rss2&#038;tag=%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%B8%E0%B1%80%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>కృష్ణశాస్త్రి జీవితం  &#8211; సాంస్కృతిక నేపథ్యం</title>
		<link>http://vaakili.com/patrika/?p=12606</link>
		<comments>http://vaakili.com/patrika/?p=12606#comments</comments>
		<pubDate>Sat, 05 Nov 2016 16:03:14 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[డా. సీతారామయ్య (రామసూరి)]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=12606</guid>
		<description><![CDATA[భావకవిత్వాన్ని ఉద్యమంగా తీర్చిదిద్దిన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారు 1-11-1897 న కార్తీక శుద్ధ అష్టమినాడు పిఠాపురం దగ్గర చంద్రంపాలెంలో జన్మించారు. తండ్రి దేవులపల్లి వేంకటశాస్త్రి అనే తమ్మన్నశాస్త్రిగారు. పెదతండ్రి దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి. దేవులపల్లి సోదరకవులుగా ప్రసిద్ధులైన వీరి పూర్వీకులు కృష్ణాజిల్లా ఆగిరిపల్లికి చెందినవారు.]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/11/ks0.jpg"><img class="alignleft  wp-image-12671" title="ks0" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/11/ks0.jpg" alt="" width="309" height="395" /></a></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">భా</span>వకవిత్వాన్ని ఉద్యమంగా తీర్చిదిద్దిన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారు 1-11-1897 న కార్తీక శుద్ధ అష్టమినాడు పిఠాపురం దగ్గర చంద్రంపాలెంలో జన్మించారు. తండ్రి దేవులపల్లి వేంకటశాస్త్రి అనే తమ్మన్నశాస్త్రిగారు. పెదతండ్రి దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి. దేవులపల్లి సోదరకవులుగా ప్రసిద్ధులైన వీరి పూర్వీకులు కృష్ణాజిల్లా ఆగిరిపల్లికి చెందినవారు.</p>
<p>కృష్ణశాస్త్రిగారి పూర్వీకులంతా &#8216;వేదంబుల శాస్త్రంబుల వాదంబుల నెదురులేని వారలే&#8217; &#8216;సీతావర పదసేవన విధాన పావనులే.&#8217; కావ్యాలూ, నాటకాలూ రచించిన దేవులపల్లి కులాగ్రణి వేంకట సూరిమణి, ఆ తర్వాత జగన్నాథార్యుడు గాథాబోధనాశాలి. వేంకట రామశాస్త్రి, అందరూ కళావేత్తలే. వేంకట రామశాస్త్రిగారు సంగీత సాహిత్యాలలో నిష్ణాతులు. కృష్ణశాస్త్రిగారి పూర్వీకుల కళా సంస్కారంలో సంప్రదాయం మెరుగులు దిద్దుకుంది.</p>
<p>పెదతండ్రి సుబ్బరాయశాస్త్రి, తండ్రి తమ్మన్నశాస్త్రి (కృష్ణశాస్త్రి), ఇద్దరూ సంస్కృతాంధ్రాలలో కవిత చెప్పినవారు. సుబ్బరాయశాస్త్రిగారు మహేంద్ర విజయమనే ప్రబంధము, మందేశ్వర శతకం, రాజనీతిని తెలిపే కుమారశతకం, రామరాయవిలాసం వంటి తెలుగు గ్రంథాలూ, శ్రీరామపంచశత్, శ్రీరావు వంశ ముక్తావళి వంటి సంస్కృత గ్రంథాలూ రచించారు. తండ్రి దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి అనే తమ్మన్న శాస్త్రిగారు &#8216;యతిరాజవిజయం&#8217; అనే నాలుగాశ్వాసాల గ్రంథం రచించారు. రామానుజాచార్యుని గురువర్యుల పవిత్ర జీవితాన్ని చిత్రించిన గ్రంథమిది. వీరిద్దరికీ అష్టావధాన విద్య వెన్నతో పెట్టిన విద్య.</p>
<p>పండిత వంశంలో పుట్టిన కృష్ణశాస్త్రిగారు &#8216;నేను స్వంతంత్రంగా ఏమీ సంపాదించలేదు. ఏమయినా నాకు కవిత వస్తే మా పూర్వుల నుంచి వచ్చిందే &#8216; అని సవినయంగా మనవి చేశారు.</p>
<blockquote><p>&#8216;ఏమనోహర సీమలందే పవిత్ర<br />
విమల తేజోమయ విశాల వీధులందు<br />
అక్షరామోద సంచరితాంత రంగు<br />
లగుచు విహరించుచున్నారొ &#8216;</p></blockquote>
<p>అని స్మరిస్తూ &#8216;అమృతగాన మధుర మందాకిని&#8217;గా ప్రవహించిన తండ్రి, బాబయ్య గార్ల కవితని కీర్తించారు.</p>
<blockquote><p>&#8216;మీ పవిత్ర యశో నిర్మలాపగాతి<br />
శీతల తరంగ జల సుధా సేచనమున<br />
కలుష కౌటిల్య కర్దమమలినమైన<br />
మీ తనయు జీవితము కూడ పూతమయ్యె &#8216;</p></blockquote>
<p>ఎన్నడో తండ్రితాతలు పాడిన వసంత మధుర జీవనగీతి తన జీవితాన్ని కవితామయం చేసిందని కృష్ణశాస్త్రిగారు చెపుతూ ఉంటారు. తల్లి సీతమ్మగారి దగ్గర జానపద గీతాల మాధుర్యాన్ని పుణికి పుచ్చుకున్నారు.</p>
<p>బాల్యంలోనే తండ్రుల దగ్గర ప్రాచీన సాహిత్యంలోని పద్య సంస్కృతిని వంట పట్టించుకున్నారు. పిఠాపురం హైస్కూలులో కూచి నరసింహంగారి శిష్యరికంలో ఆంగ్ల కావ్య నాటకాలలోని మెలకువలని గుర్తించి తన ప్రతిభకి మెరుగులు పెట్టుకున్నారు. గ్రంథ పఠనంతో తెనుగు పద్యాల సొగసుని గ్రహించారు. గ్రాంథిక, వ్యావహారిక భాషా వివాదం ఆంధ్రదేశపు యువకులని నూతన మార్గాల వైపు దృష్టిని మళ్ళిస్తున్న కాలమది.</p>
<p>1916లో విజయనగరం మహారాజ కళాశాలలో వి.ఏ చదివారు. మామిడిపూడి వేంకట రంగయ్యగారు, బుర్రా శేషగిరిరావుగారు, రామవతారంగారు వంటి విశిష్ట గురువుల దగ్గర విద్యని అభ్యసించారు. విజయనగరంలో చదువుకునే రోజుల్లో మహాకవి గురజాడ అప్పారావుగారిని చూశారు. వీరి పెద తండ్రి సుబ్బరాయశాస్త్రిగారి అవధానానికి గురజాడవారు పృచ్ఛకులుగా వ్యవహరించారు. అప్పారావుగారి గురించి రాస్తూ కృష్ణశాస్త్రి &#8220;సన్నగా, అర్భకంగా, కాని పదును పెట్టిన కత్తిలాగుండేవారు. ఎప్పుడయినా పిఠాపురం నుంచి వచ్చే నా తండ్రిగారూ వారూ సాహిత్య గోష్ఠి జరిపేవారని జ్ఞాపకం&#8221; అని రాశారు.</p>
<p>కాల్పనిక కవితకి రూపురేఖలు దిద్దిన గురజాడ వారిని &#8216;మహాకవి&#8217; గా సంబోధించినది కృష్ణశాస్త్రిగారే. గురజాడవారి కవితని గురించి</p>
<blockquote><p>&#8216;యుగ యుగంబుల నుండి మ్రోగెడు<br />
విశ్వగాన వియత్తరంగిణి<br />
భంగముల నుప్పొంగు నాతని<br />
గీత శీకరముల్&#8217;</p></blockquote>
<p>అన్నారు. గురజాడవారి భావ సంస్కారం కృష్ణశాస్త్రిలో కొత్త ఆలోచనలకి పాదులు వేసింది.</p>
<p>దేశం పరాధీనమై ఉంది. బ్రిటిషువారు పరిపాలనా సౌలభ్యం కోసం మూడు ప్రధాన రైలు మార్గాలు వేశారు. మద్రాసు, బొంబాయి, కలకత్తాలలో మూడు విశ్వ విద్యాలయాలు స్థాపించారు. ప్రజలని మరింత బానిసలుగా మార్చటానికి ఆంగ్ల విద్యని ముమ్మరం చేశారు. దేశంలో ఆంగ్లవ్యాప్తి యువకులలో ఉత్సాహాన్నీ, కొత్త తరహాల పట్ల ఆసక్తిని కలిగించాయి. దేశంలో స్వేచ్చ కోసం సంస్కరణ ఉద్యమాలు ప్రారంభమైనాయి.</p>
<p>నవీన మానవుడు రాజారామమోహనరాయలు ప్రారంభించిన మానవోద్యమం మానవులందరికీ స్వేచ్చా స్వాతంత్ర్యాలు కావాలంటుంది. రూసో మొదలయిన తత్వవేత్తల ఆలోచనల ఫలితంగా ఆవిర్భవించిన ఉద్యమమిది. ప్రాచీన భారతీయ సంస్కృతిని సహేతుకంగా విమర్శించి, దేశకాల పరిస్థితులను బట్టి మార్పులు అవసరమనే ఉద్యమమిది. జగత్తులొ మానవుణ్ణి మించింది ఏదీలేదు. &#8216;నాజాతి మానవజాతి&#8217; అనే విశ్వజనీనమైన భావాలకి నాంది పలికిన ఉద్యమమిది. ప్రతి వ్యక్తికీ స్వాతంత్ర్య వికాసాలుంటేనే జాతి ముందుకి నడుస్తుందనీ, అప్పుడే మానవజాతి సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందనీ ఈ ఉద్యమం ఆశిస్తోంది.</p>
<p>రాజారామమోహనరాయలు భావాల ప్రభావంతో ఆంధ్ర దేశంలో సంస్కరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినవారు కందుకూరి వీరేశలింగం పంతులుగారు.</p>
<blockquote><p>&#8216;అభినవాంధ్ర శుభోదయ ప్రాప్తికెల్ల<br />
మూలపురుషుడొకడుండె, విశాలదృష్టి<br />
ఆ మహర్షి నాటిన మహోద్యమ లతికలె<br />
సూన పల్లవ తతి మోసె&#8230; &#8216;</p></blockquote>
<p>అని కందుకూరి వారి ఆధునిక దృష్టిని కృష్ణశాస్త్రిగారు వివరించారు. బాల వితంతువుల దుస్థితి, నిమ్న జాతుల దయనీయ స్థితిగతులు, కళావంతుల హేయపద్ధతి &#8211; వీటినన్నింటినీ తొలగించాలనీ, దాస్యాలన్నింటిలోనూ మనోదాస్యం మరీ చెడ్డదనీ, దాన్ని వదిలించుకోవాలనీ జాతిని హెచ్చరించినవారు కందుకూరి వీరేశలింగం పంతులుగారు.</p>
<p>పంతులుగారి భావచైతన్యం కృష్ణశాస్త్రివంటి యువకుల హృదయాలని చలింప జేసింది.</p>
<p>భారతదేశంలో బ్రహ్మసమాజ ఉద్యమ స్థాపకుడు రాజారామమోహనరాయలు. దేశంలోని మతాలన్నీ మనిషిని మరచిపోయి, జాతి వైషమ్యాలకి దారి తీస్తుంటే, అన్ని మతాలలోని మంచిని గ్రహించి,మానవుణ్ణి మానవునిగా తీర్చిదిద్దే బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. వ్యక్తిగత సాంఘిక జాతీయ మానవ సమస్యల పరిష్కారానికీ, ప్రతి మానవునికీ అందగల సమగ్ర సుందరమయిన విధానాన్ని నిర్మించిన నూతన యుగ నిర్మాత రాజారమామోహనరాయలు.</p>
<p>&#8216;ఏక మేవా ద్వితీయం బ్రహ్మ&#8217; అన్నది బ్రహ్మ సమాజానికి మకుటం. కేశవచంద్రసేన్ మొదలైన వారి కృషితో ఇది ఉద్యమరూపం ధరించింది. కందుకూరి కృషి వల్ల రాజమండ్రిలోనూ, బ్రహ్మర్షి రఘుపతి వేంకటరత్నం నాయుడుగారి కృషివల్ల కాకినాడలోనూ, బ్రహ్మసమాజం చైతన్యవంతమై ఆంధ్రదేశమంతా వ్యాపించింది. పిఠాపురం మహారాజా రావువేంకట మహీపతి సూర్య రాయబహద్దూర్ వారి ప్రేరణతో ఆంధ్రదేశంలోని బ్రహ్మ సమాజ ఉద్యమానికి కాకినాడ కేంద్రమైంది. నాయుడుగారి శిష్యరికంలో మొక్కపాటి రామ్మూర్తి , తారకం, చలం, ముద్దుకృష్ణ, కృష్ణశాస్త్రివంటి యువకులు ఉద్యమానికి ఊపుని, కొత్త చూపునీ ఇచ్చారు. నాయుడుగారు అధ్యక్షులుగా ఉన్న కాకినాడ కళాశాలలో కృష్ణశాస్త్రి విద్యార్థిగా చేరారు. కళాశాలలో విద్యార్థులకి పాఠాలు చెప్పిన నాయుడుగారు రూమీ, హఫీజ్, సాది లాంటి సూఫీ కవులవీ, కబీర్, మీరా, విద్యాపతి వంటి మధ్యయుగం భారత భక్తులవీ కావ్యాలు వినిపించేవారు . ఆంగ్లకవులు షెల్లీ, కీట్స్, బైరన్ వంటి కవుల సౌందర్య దృష్టిని వివరించేవారు. కృష్ణశాస్త్రి వంటి యువకులకి ప్రతి అణువులోనూ అనంతత్వాలన్నీ, ప్రతి అనుభూతిలో పరమార్థాన్నీ పరిశీలించే నిశిత దృష్టిని కలిగించింది నాయుడుగారి శిష్యరికం.</p>
<p>కృష్ణశాస్త్రిగారు నాయుడుగారి నిశిష్టతని వివరిస్తూ</p>
<blockquote><p>&#8216;ఈ జడ జీవితమ్ము పలికించితి: వీ యఘపంకమందు నం<br />
భోజము మొల్వజేసితి; వపూర్వము నీ దయ; ఈ నిశీథి నీ<br />
రాజన మెత్తినావు; విపులమ్మగు నీ యెద నిండెనే శర<br />
ద్రాజిత చంద్రకాంతు లమృతమ్ములు స్వర్గలతాంత వాసనల్ &#8216;</p></blockquote>
<p>అన్నారు. సూఫీ చరితామృతాన్ని కళాశాల స్థాయిలోనే గురుదేవులనుంచి అధ్యయనం చేసిన కృష్ణశాస్త్రి తన కవితలో ఉదారాశయాలని, తత్వ దృష్టినీ అలవరచుకున్నారు.</p>
<p>విద్యారంగంలో, సాంఘికరంగంలో, సాంస్కృతిక రంగంలో అపూర్వ చైతన్యం తెచ్చిన బ్రహ్మసమాజం పవిత్రమైన శీలం, ఏకేశ్వరోపాసన, ప్రేమ, ఔదార్యం వంటి విలువలని ఆవిష్కరించింది. అనాథల జీవితంలో కొత్తకాంతులు వెలిగించింది. వసుధైక కుటుంబానికి రూపకల్పన చేసింది.</p>
<p>సంస్కరణ ఉద్యమాల ప్రభావంతో కృష్ణశాస్త్రిగారు హరిజనోద్యమంలోనూ కళావంతుల వివాహోద్యమంలోనూ పాల్గొన్నారు. బంధువులూ, బ్రాహ్మణులూ ఆయనని బహిష్కరించారు. బ్రహ్మసమాజం ఆయనని కవిగా తీర్చి దిద్దింది.</p>
<p>1923 కి పూర్వం వేంకట పార్వతీశ్వర కవుల &#8216; ఏకాంతసేవ &#8216; వెలువడింది. రాయప్రోలు సుబ్బారావుగారి కావ్య సంస్కారం, గురజాడవారి నవ్య ధోరణులూ, ఏకాంతసేవలోని భక్తి సౌందర్యం కృష్ణశాస్త్రిగారిని ప్రభావితం చేశాయి. తెలుగు కవితారంగంలో నవ్య రీతులకోసం ప్రయత్నాలు జరుగుతున్న కాలమది. 1923 లో సాహితీసమితి ఏర్పడింది. నవ్య కవిత్వాన్నీ ఒక ఉద్యమంగా చేసింది సాహితీసమితి. &#8216;సాహితి&#8217; పత్రిక స్థాపనతో ఖండ కావ్యాలు విరివిగా ప్రచురింపబడ్డాయి. ఆంగ్ల విద్యా సంస్కారం గల తెలుగు యువతరాన్ని ఈ నవకవుల పద్యాలు బాగా ఆకర్షించాయి. సాహితీ సమితి కృష్ణశాస్త్రిని భావకవిని చేసింది.</p>
<p>గిడుగు రామమూర్తి పంతులుగారి వ్యావహారిక భాషా ఉద్యమం తెలుగు సారస్వత రంగంలో నవీనమైన మార్పులు తెచ్చింది. ఆంగ్ల కవితా ప్రపంచంలో వర్డ్స్ వర్త్ ప్రజల భాషలో రాయమని చెప్పినట్టుగా గిడుగువారు తెలుగు భాషని సంస్కరించుకోవలసిన ఆవశ్యకతని తెలియజెప్పారు. కృష్ణశాస్త్రిగారు ప్రయాణీక కవి. ఆంధ్రదేశంలోని అన్ని ఊళ్ళలో తనవీ, ఇతరులవీ పద్యాలు సభలలో చదివి భావ కవితకి ఉద్యమ రూపాన్నిచ్చారు. ఆ పర్యటనలో భాగంగానే పర్లాకిమిడిలో గిడుగువారికి కృష్ణశాస్త్రిగారు తమ పద్యాలు వినిపించారు. రామమూర్తి పంతులుగారి మెప్పు లభించింది. 1925లో &#8216;కృష్ణ పక్షం&#8217; ప్రచురించారు.</p>
<p>నవ్యసాహిత్యానికి ఒక వేదిక కావాలనే ఉద్దేశ్యంతో కొంతమంది సాహిత్యవేత్తలు 1933లో బరంపురంలో &#8216;అభినవాంధ్ర కవిపండిత సభ&#8217; పేరుతో సమావేశమయ్యారు. దీనికి సూత్రధారి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగారు. డా.చిలుకూరి నారాయణరావుగారు ప్రథమ సభాధ్యక్షులు. వ్యావహారికాంధ్రాన్ని ఉపయోగించాలనీ, నవ్య రచనలని ప్రచారం చేయాలనీ, నవ్య రచనల బాగోగులని చర్చించాలనీ, నవ్య సాహిత్యం గురించిన అపోహలని తొలగించాలనీ, వచన వాజ్ఞ్మయాన్ని ప్రజలకి అందుబాటులోకి తేవాలనీ ఆకాంక్షించిన సంస్థ ఇది . 1942లో నవ్య సాహిత్య పరిషత్ సమావేశం ఏలూరులో జరిగింది. దీనికి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు అధ్యక్షత వహించారు.</p>
<p>భావ కవిత్వానికి పెద్ద పీట వేసిన పత్రికలు ఎక్కువగా సాహిత్య సంస్థలు నడిపినవే. ఆంధ్రభారతి, ఆంధ్ర గ్రంథాలయ సర్వస్వము, అనసూయ, శారద మొదలైన పత్రికలలోని పద్యాలు కృష్ణశాస్త్రి వంటి యువకులు ఉత్సాహంతో చదివేవారు. &#8216;భారతి&#8217; పత్రిక నవ్య సాహిత్యాన్ని ఆహ్వానించింది. 1925లో సాహితీసమితి పత్రిక &#8216;సఖి&#8217;, 1927లో విశ్వనాథవారి &#8216;జయంతి&#8217; పత్రిక, కొంపెల్ల జనార్దనరావు నడిపిన &#8216;ఉదయిని&#8217;, పాటిబండ్ల మధవశర్మ &#8216;వీణ&#8217;, ముద్దుకృష్ణ &#8216; జ్వాల&#8217; వంటి పత్రికలు నవ్య సాహిత్యం కోసం నడిపినవే. కోలవెన్ను రామకోటేశ్వరరావుగారి ఆంగ్ల పత్రిక &#8216;త్రివేణి&#8217; కూడా నవ్య కవిత్వానికి వేదికగా వ్యవహరించింది.</p>
<p>కృష్ణశాస్త్రిగారు స్వేచ్చాజీవి.ఆత్మాభిమానం ఎక్కువైన కారణం చేత ఎక్కడా స్థిరమైన ఉద్యోగం చేయలేదు. కాకినాడ మిషను స్కూలులో కొన్నాళ్ళు పనిచేసారు. 1932 నుంచి 1941 వరకు కాకినాడ పిఠాపురం రాజావారి కళాశాలలో తెలుగు శాఖలో అధ్యాపకునిగా పనిచేసారు. 1957 నుంచి 62 దాకా ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో సాహిత్య ప్రయోక్తగా పనిచేశారు. రేడియోకి ఎన్నో సంగీత రూపకాలు రచించారు. బుచ్చిబాబు, మునిమాణిక్యం నరసింహారావు వంటి రచయితలతో కలిసి రేడియోకి సాహిత్య పరిమళాలు అందించారు.</p>
<p>1925లో అక్కిరాజు ఉమాకాంతమ్గారు &#8216; నేటికాలపు కవిత్వం&#8217; గ్రంథంలో కృష్ణశాస్త్రిగారి కవిత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కొత్త తరహా కవిత్వాన్ని పరిశీలించవలసిన పద్ధతిలో పరిశీలించకపోవడం వలన ఉమాకాంతమ్గారు ఆనందాన్ని అనుభవించలేకపోయారని కృష్ణశాస్త్రిగారు బాధపడ్డారు. &#8216;కొంత ఆర్ద్ర దృష్టితో, కవితా హృదయంతో ఆ విమర్శన సాగితే నేటి కాలపు కవిత్వంలో వారు చక్కదనమూ, కవిత్వ గుణమూ గ్రహించి ఉండేవారు &#8216; అని రాశారు. ఊపిరాడనీయనంత కోపంతో దాడి చేసినవారికి సమాధానం చెప్పడం కంటే కొత్త పద్యాలు రాయడమే జవాబనే దృఢ సంకల్పంతో &#8216;ప్రవాసము&#8217; &#8211; ఊర్వశి&#8217; కావ్యాలూ ప్రకటించారు.</p>
<p>బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావు, నాయని సుబ్బారావు, చింతా దీక్షితులు, చలం, మొక్కపాటి రామమూర్తి &#8211; వీళ్ళంతా మంచి స్నేహితులు. కాల్పనిక సౌందర్యానికి సన్నిహితులు. హరీంద్రనాథ్ చటోపాధ్యాయ వంటి ఆంగ్లకవితో పరిచయం ఏర్పడింది. హరీంద్రుని కావ్య పఠనం కృష్ణశాస్త్రిగారికి బాగా నచ్చింది. ఈయన కూడా నవకవుల పద్యాలు ఒక పద్ధతిలో కూర్చి సరికొత్త కావ్య పఠనానికి రూపం సిద్ధం చేశారు. &#8216;సంధ్యారాగం&#8217; లోని &#8216;ఆగుమాగుమా తెరువరీ&#8217; అన్న స్వాగతంతో ఆరంభించి, పింగలి-కాటూరి &#8216;తొలకరి&#8217; లోని &#8216;కవితాసామగ్రి&#8217; తరువాత చదివి, ఎంకి పాటలు పాడేవారు. ఊరూరా వాడవాడలా సభలూ సమావేశాలతో కవితా వసంతోత్సవాలే. దీని వలన భావకవిత్వం ఉద్యమమై నిలవడానికి కృష్ణశాస్త్రిగారి కృషి ఉందని తెలుస్తుంది.</p>
<p>1922లో కృష్ణశాస్త్రిగారి మొదటి భార్య మరణం ఆయనని అమితంగా కదిలించి &#8216;కన్నీరు&#8217; ఖండకావ్యం రచించేలా చేసింది. ఆధ్యాత్మిక గురువు మొక్కపాటి రామమూర్తి మరణంతో &#8216;ప్రవాసం&#8217; ఆయనకి అంకితమిచ్చారు. కూతురు సీత మరణం ఆయనని ఎంతాగానో కలచి వేసింది. &#8216;తిరుప్పావై&#8217; కీర్తనలు రచించేలా చేసింది. బ్రహ్మర్షి నాయుడుగారి వియోగ వేదన కృష్ణశాస్త్రి కావ్య జీవితానికి ఊపిరి పోసింది.</p>
<p>కృష్ణశాస్త్రిగారు మంచి వక్త. సాహిత్యాన్ని గురించి అందంగా, విజ్ఞానదాయకంగా మాట్లాడి సభలని అలరింపజేసిన వక్తగా ఆయన పేరు పొందారు. నవ్య సాహిత్య పరిషత్తు సమావేశాలలో కానీ, కళాశాలల సాంస్కృతిక ఉత్సవాలలో కానీ ప్రాచీన ఆధునిక కవుల కావ్య సృజన గురించి, రీతుల గురించి అనర్గళంగా మాట్లాడగల ప్రతిభావంతులు. బొమ్మకంటి శ్రీనివాసాచార్యులుగారు, వేల్చేరు నారాయణరావుగారు కృష్ణశాస్త్రిగారి వక్తృత్వాన్ని గురించి వివరించారు. ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలొ నన్నయగారి &#8216;వాడి మయూఖముల్ కలుగు వాడపరాంభుధి కుంకె&#8217; అనే పద్యంలోని అందాలని గురించి, జానపద గీతాల నేపథ్యం గురించి ఆయన ప్రసంగించిన తీరు ప్రజలని ముగ్ధులను చేసిందనీ, కృష్ణశాస్త్రిగారికి ప్రాచీన సాహిత్యం పట్ల ఉన్న ఆధునిక దృష్టిని తమ &#8216;తెలుగులో కవితా విప్లవాలు&#8217; సిద్ధాంత గ్రంథంలో తెలిపారు. విజయనగరంలో జరిగిన నవ్య సాహిత్య సమావేశంలో గొర్తి సూర్యనారాయణగారిని తెలుగుపండితులు భావకవుల కవిత్వాన్ని ఎద్దేవా చేస్తూ ప్రజలని రంజింపచేస్తూ హాస్యస్ఫోరకంగా ప్రసంగించారనీ, ఆ ప్రసంగాన్నితిప్పి కొడుతూ కృష్ణశాస్త్రిగారు తమ సహజ ధోరణిలో భావకవుల పద్యాలని భావస్ఫోరకంగా చదువుతూ, మృదువైన మాటలతో భావ కవితా సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూ ప్రసంగించారనీ, అబ్బూరి వరద రాజేశ్వరరావు వివరించారు. వక్త భావకవిత్వానికి ఉద్యమ స్ఫూర్తిని కలిగించిన కవి కృష్ణశాస్త్రి.</p>
<p>కృష్ణశాస్త్రిగారు స్వతహాగా హాస్యప్రియులు. ఆయన ప్రభావంతో కవిత్వం రాసే యువకులు ఆయనలాగా గిరజాలు పెంచేవారు. మెరుగు కళ్లజోళ్ళు పెట్టేవారు. పద్యం మీద మాత్రం శ్రద్ధ ఉండేది కాదు. ఆ ధోరణిని హేళన చేస్తూ కృష్ణశాస్త్రిగారు</p>
<blockquote><p>&#8216;మెరుగు కళ్ళజోళ్ళు గిరజాలు సరదాలు<br />
భావకవికి లేని వేవి లేవు<br />
కవితయందు తప్ప గట్టివాడన్నింట<br />
విశ్వదాభిరామ వినురవేమ &#8216;</p></blockquote>
<p>అని చెప్పారు. చలం, అబ్బూరి రామకృష్ణారావు, కృష్ణశాస్త్రి, విశ్వనాథ వంటి కవుల సమావేశాలు నవ్వుల జల్లులు కురిపించాయి.</p>
<p>విజయనగరం, కాకినాడ కళాశాలలో విద్యని అభ్యసించే రోజులలో &#8216;విశ్వకవి&#8217; రవీంద్రుని రచనలు చదివి,సౌందర్య దాహాన్ని గురించి అధ్యయనం చేశారు. గీతాంజలి, క్రియేటివ్ యూనిటీ, సాధన వంటి గ్రంథాలలోని సౌందర్యదృష్టి కృష్ణశాస్త్రిని ఆకర్షించింది. ఆంగ్ల కవిత్వాన్ని అధ్యయనం చేసి తెలుగు కవితకి నగిషీలు చెక్కినవారు కృష్ణశాస్త్రిగారు. &#8216;ఆంగ్లకవిత తెలుగుకవిత అద్భుతంగా సమ్మిళితమైన ఒక అపూర్వమైన సాహిత్య సమ్మేళనం కృష్ణశాస్త్రి&#8217; అని ఆచంట జానకీరామ్ గారు అన్నారు.</p>
<p>1948లో మద్రాసు వెళ్ళిన కృష్ణశాస్త్రిగారు బి.ఎన్.రెడ్డి గారు దర్శకత్వం వహించిన కళాత్మక &#8216; మల్లీశ్వరి &#8216; సినిమాకి మాటలూ, పాటలూ రాసారు. అప్పటిదాకా పద్య రచనలో సిద్ధహస్తులై, చందస్సులో ఎన్నో మెలకువలు గ్రహించి, పద్యాన్ని పాటలా పాడుకునేలా తీర్చి దిద్ది పాటల కూర్పులోని రహస్యాన్ని గ్రహించారు. జానపద గేయాల నడకలూ, పల్లీయజన నుడికారాన్ని సన్నిహితంగా పరిశీలించి, మల్లీశ్వరి చిత్రానికి పాత్రోచిత సంభాషణలు రచించి సినిమాకి కావ్య గౌరవాన్ని తెచ్చారు. ప్రేమకథని ఉదాత్త కళాత్మక విలువలతో తీర్చి దిద్దడంలో కృష్ణశాస్త్రి తనవంతు బాధ్యతని సమర్థంగా నిర్వహించారు. అప్పటినుంచి చలనచిత్రాలకి పాటలు రాసి, పాట రచనలో తన ముద్రని వ్యక్తం చేయడమే కాక తెలుగుపాటకి మారుపేరై స్థిరపడ్డారు.</p>
<p>చక్కని మాటకారిగా, వక్తగా ఆంధ్రులని ఆనందింపచేసిన కృష్ణశాస్త్రిగారికి 1966లో గొంతు కేన్సర్ వచ్చి మరి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. మూగబోయాక ఆయనకి మనుషుల పట్ల ఆసక్తి మరీ ఎక్కువైంది. &#8216;స్క్రిబ్లింగ్ పాడ్స్&#8217; మీద ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలూ, అనుభూతులూ మానవ మనస్తత్వం పట్ల ఆయనకి గల అవగాహనని స్పష్టం చేస్తాయి.</p>
<p>కౄష్ణశాస్త్రిగారు నిత్య యువకులు. ఎప్పుడూ యువతరం పట్ల ఆశావహంగా ఉండేవారు. శ్రీశ్రీ, పఠాభి, ఆరుద్ర వంటి నవ్య కవులపై ఆయన అభిప్రాయాలూ, యువకవులని ఆయన ప్రోత్సహించిన తీరూ భవిష్యత్తులో కవిత మరింత వికాస దృష్టితో ఉంటుందనీ, ఉండాలనీ ఆయన అభిలషించేవారని తెలుస్తుంది.</p>
<p>ప్రకృతిలో మానవ ప్రకృతిని దర్శించి, రచనలో ప్రదర్శించడం కృష్ణశాస్త్రిగారికి ఇష్టం. ఆయన ఒకచోట రాసుకున్నట్టు, &#8216;ఒకసారి హైదరాబాదు నుంచి మదరాసు వెళుతున్నాను కారులో. దారిలో నాగార్జునసాగర ప్రాంతాననో, దేవరకొండ ప్రాంతాననో ఒక ఎత్తైన కొండ ఉంది. ధుమధుమలాడుతూ, కనుబొమలు ముడుచుకొని తిక్కగా కొందరు మనుష్యుల లాగున &#8216; అంటారు. ఆయన కవిత్వం అంతటా ప్రకృతి ప్రీతి కనిపిస్తుంది.</p>
<p>వైష్ణవ భక్తి, సూఫీ తత్వం, ఆంగ్ల కవితా సంస్కారం కృష్ణశాస్త్రిగారిలో సౌందర్య దృష్టిని నిశితం చేసింది. షెల్లీ, కీట్స్ వంటి కవుల పదాల కూర్పును తెలుగు కవిత్వంలో ప్రవేశపెట్టి, నూతన పోకడలకి దారి చూపించారు. వచనాన్ని కావ్య సరణిలో తీర్చి దిద్ది స్వీయానుభవాలని అందరూ పంచుకొని ఆనందించేలా రచనలు చేసారు.</p>
<p>తన రచనలతో తెలుగు సాహిత్య ప్రపంచంలో ప్రభాత వాయువులా ప్రవేశించి, ప్రేమతత్వం సౌందర్య దృష్టితో ఆవిష్కరించి, తెలుగువారి హృదయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందిన కృష్ణశాస్త్రిగారు 24-2-1980 తేదీన మదరాసులో మరణించారు. చివరిదాకా ఆయన పాటలు రాస్తూనే ఉండేవారు. గొంతు మూగవోయాక రాసిన పాటలు తెలుగువారి తీరుతెన్నులని మరింత ఆర్ద్రంగా చిత్రించినాయి.</p>
<p>కృష్ణశాస్త్రి సాహిత్యంలో వైవిధ్యంతో కూడిన రచనలున్నాయి.</p>
</div>
<p>తొలి పద్యకృతుల సంపుటి :<br />
1.కృష్ణపక్షము<br />
2. ప్రవాసము-ఊర్వశి</p>
<p>గేయనాటికలు:<br />
1. శర్మిష్ఠ<br />
2. ధనుర్దాసు<br />
3. శ్రీవిద్యాపతి<br />
4. కొత్తకోవెల</p>
<p>యక్షగానాలు:<br />
1. క్షీరసాగర మథనం<br />
2. విప్రనారాయణ<br />
3. మాళవికాగ్నిమిత్రము</p>
<p>పద్యాలు:<br />
1. ఋగ్వీధి<br />
2. పల్లకీ<br />
3. బదరిక</p>
<p>వచన రచనలు:<br />
1. అప్పుడు పుట్టి ఉంటే<br />
2. బహుకాల దర్శనం<br />
3. పుష్పలావికలు<br />
4. కృష్ణశాస్త్రి వ్యాసావళి ( 4 సంపుటాలు )</p>
<p>గేయసాహిత్యం:<br />
1. అమృతవీణ (మహతి, కన్నీరు)<br />
2. మంగళకాహళి<br />
3. తిరుప్పావై కీర్తనలు</p>
<p>సినీ సాహిత్యం:<br />
1. మేఘమాల<br />
2. గోరింట</p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p>పైన పేర్కొన్న గ్రంథాలన్నీ సంపుటాలుగా వెలువడ్డాయి. రౌతు బుక్ డిపో, రాజమండ్రి వారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి సన్మాన సంఘం, మద్రాసు వారు, విశ్వోదయ ప్రచురణ, కావలి వారు, రాజహంస ప్రచురణలు మద్రాసు వారు, ఓరియంట్ లాంగ్మన్ హైదరాబాదు వారు కృష్ణశాస్త్రిగారి రచనలని ప్రచురించి తెలుగువారికందించారు.</p>
<p>రాజా, కాటూరి వేంకటేశ్వరరావుగారు, సూరి నారాయణమూర్తిగారు, ఆచంట జానకీరామ్గారు, పాలగుమ్మి పద్మరాజుగారు, బాలాంత్రపు రజనీకాంతరావుగారు, బాలాంత్రపు నళినీకాంతరావుగారు, కురుమెళ్ల వేంకటరావుగారు మొదలైన వారు కృష్ణశాస్త్రి గ్రంథాలు వెలుగు చూడటానికి కృషి చేసినవారు.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=12606</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>కృష్ణశాస్త్రి సాహిత్యం – సౌందర్యతత్వం</title>
		<link>http://vaakili.com/patrika/?p=12598</link>
		<comments>http://vaakili.com/patrika/?p=12598#comments</comments>
		<pubDate>Sat, 05 Nov 2016 16:03:01 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[డా. సీతారామయ్య (రామసూరి)]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=12598</guid>
		<description><![CDATA[కృష్ణశాస్త్రి సాహిత్య జీవితం సౌందర్యాన్వేషణే. షెల్లీ, కీట్స్, టాగూర్ కృష్ణశాస్త్రికి బాటలు వేసినవారు. అందరూ సౌందర్యాన్ని అన్వేషించినవారే. ఆరాధించినవారే. కవిత్వమూ, కళలూ మనిషికి సౌందర్య పిపాస కలిగిస్తాయి. మనిషిని పరిపూర్ణ మానవుణ్ణి చేస్తాయి. 
<br />కృష్ణశాస్త్రి ఆదర్శ సౌందర్యం ఊర్వశి. భారతీయ సాహిత్యంలో ఊర్వశికి ప్రత్యేక స్థానం ఉంది. కాళిదాస మాహాకవి స్వర్గానికీ మానవ లోకానికీ ముడిపెడుతూ ప్రేమ, సౌందర్యాలు మనిషికి అవసరమని చెప్పాడు.]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/11/Devulapalli.jpg"><img class="alignleft  wp-image-12697" title="Devulapalli" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/11/Devulapalli.jpg" alt="" width="345" height="453" /></a></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">కృ</span>ష్ణశాస్త్రి సాహిత్య జీవితం సౌందర్యాన్వేషణే. షెల్లీ, కీట్స్, టాగూర్ కృష్ణశాస్త్రికి బాటలు వేసినవారు. అందరూ సౌందర్యాన్ని అన్వేషించినవారే. ఆరాధించినవారే. కవిత్వమూ, కళలూ మనిషికి సౌందర్య పిపాస కలిగిస్తాయి. మనిషిని పరిపూర్ణ మానవుణ్ణి చేస్తాయి.</p>
<p>కీట్స్ సౌందర్యాన్వేషణ చేస్తూ,</p>
<blockquote><p>&#8216;Heard melodies are sweet, but those unheard<br />
Are sweeter, therefore, ye soft Pipes, play on<br />
Not to the sensual ear, but, more endeared,<br />
Pipe to the spirit ditties of no tone&#8217;</p></blockquote>
<p>మనం చెవులతో వినే సంగీతం కంటే భావించే సంగీతం మరీ తీయగా ఉంటుందంటున్నాడు. ఎలాంటి సంగీతం కావాలో అది అందనంత ఎత్తులో ఉంటుంది. ఆ శిఖరాలని అధిరోహించే ప్రస్థానమే సౌందర్య ప్రస్థానం. కృష్ణశాస్త్రి స్వేచ్ఛాయాత్రలో &#8216;దిగిరాను దిగిరాను దివి నుండి భువికి&#8217; అన్నారు. మనస్సుని ఉన్నత శిఖరాలకి చేర్చాలనే తపన ఆయన కావ్యారంభంలోనే సూచించారు. &#8216; In all arts men reach towards such an ideal and know that, though they can not even attain it, it provides a standard and criteria for what all they have&#8217;</p>
<p>వాస్తవానికి అటువంటి సంగీతం సులభంగా లభించేది కాదు. మనిషి క్రమవికాసాన్ని పొంది, అభిరుచిని సంస్కరించుకోగలగాలి. అప్పుడే ఆదర్శ సౌందర్యాన్ని అందుకోగలుగుతాడు. కళల ప్రధాన లక్షణమిదే. కాల్పనిక కళలు ఆలోచనలని కాదు రేకెత్తించేది. భావుకతని వృద్ధి చేస్తాయి.</p>
<p>హేతుబద్ధంగా అన్వేషించేది కాదు సత్యమంటే. భావన ద్వారా అన్వేషించాలి. కీట్స్ కడపటి వాస్తవం సౌందర్యమని అన్నాడు. అదే సత్యమని విశ్వసించాడు. అనంతత్వంలో విశ్వాసం సృజనకి పునాది.<br />
షెల్లీ &#8216;Hymn to intellectual beauty&#8217; అనే ఖండికలో ఇలా అంటాడు.</p>
<blockquote><p>&#8216;Men were immortal and Omnipotent,<br />
Didst-thou, unknown awful as thou art<br />
Keep with thy glorious train firm state<br />
within his heart&#8217;</p></blockquote>
<p>సర్వ వ్యాపితమూ, శాశ్వతమూ అయినదాన్ని అందుకునే ప్రయత్నాన్ని మనిషిలో కలిగించేది సౌందర్యం. ఇది అనంతమైన అన్వేషణ. ఎప్పటికప్పుడు కొత్తదనంతో పలకరించే సృష్టిరహస్యం. &#8216;Truth&#8217;s Call is the Call of beauty&#8217; అంటారు టాగూర్. షెల్లీ గురించి రాస్తూ ఇంకా ఇలా అంటారు. &#8216;He had the Creative mind which could only approach truth through its joy in Creative effort.&#8217; సత్యాన్ని గ్రహించాలంటే సృజనాత్మక హృదయం ఉండాలి. సృజనాత్మక ప్రయత్నంలో పొందే ఆనందంలో సత్యాన్ని దర్శించగలమని టాగూర్ అభిప్రాయం.<br />
కవిది ఆరని చిచ్చు. తీరని తృష్ణ. అతనిని సంతృప్తి పరచే సుందర వస్తువు, అతనిని ఆనందింప చేసే ఆర్ద్ర ప్రేమ ఈ లోకంలో దొరకవు. అందుకే కృష్ణపక్ష కవి &#8216;వనరు చేడ్వగలేను, చచ్చి చావగలేను కనలేని వెలుగుకొరకై&#8217; అన్నాడు.</p>
<p>ఎడతెగని అన్వేషణతో సౌందర్య సృజనకి తపిస్తున్నాడు కవి. &#8216;ఒక ఆంధ్రకవి కృష్ణపక్షంలో ప్రవాసియై తిరిగి తిరిగీ, కంటపడిన ప్రతి లావణ్యాన్నీ కదిపి కదిపీ, పక్కన మ్రోగిన ప్రతి హృదయాన్ని పలకరించి పలకరించీ, లోకంలో తనకు నచ్చిన సౌందర్యం లేదనీ, తన్ను ప్రేమించి తాను ప్రేమించే ప్రేయసి లేదనీ కుంగిపోయి కుంగిపోయీ ముచ్చిచ్చులో వేగి వేగి, &#8216;నాకుగాదులు లేవు, నాకుషస్సులు లేవు&#8217; అన్న నరకంలోకి వచ్చాక, తపస్సు పూర్తయ్యాక, శాంతచిత్తుడై తానే ప్రేయసిని సృష్టించుకున్నాడట&#8217; అని కృష్ణశాస్త్రిగారు రాశారు.</p>
<p>అనంతత్వాన్ని ఆరాధించడమే సౌందర్యోపాసన. దీనికి దేశకాల సంబంధం ఉండదు. షెల్లీ కూడా సౌందర్య దర్శనం చేసిన సందర్భంలో ఇలా అంటాడు.</p>
<blockquote><p>&#8216;Never joy illumed my brow<br />
Unlinked with hope that thou wouldst free<br />
This World from its dark slavery;<br />
That Thou &#8211; O awful loveliness -<br />
Wouldst give Whatever these words can not express&#8217;</p></blockquote>
<p>షెల్లీ పద్యంలో స్వేచ్ఛ కోసం మనిషి పడే ఆరాటం ఉంది. సమగ్రత కోసం తపన ఉంది. మానవ ప్రపంచాన్ని ఈ చీకటి బానిసత్వం నుంచి విముక్తను చేసేది అనంత సౌందర్యమే నంటాడు.</p>
<p>కృష్ణశాస్త్రి ఆదర్శ సౌందర్యం ఊర్వశి. భారతీయ సాహిత్యంలో ఊర్వశికి ప్రత్యేక స్థానం ఉంది. కాళిదాస మాహాకవి స్వర్గానికీ మానవ లోకానికీ ముడిపెడుతూ ప్రేమ, సౌందర్యాలు మనిషికి అవసరమని చెప్పాడు. ఊర్వశిని రవీంద్రుడు &#8216;అనంత యౌవనా&#8217; అని కీర్తించాడు. మానవునిలో నిత్య చైతన్యాన్ని కలిగించే భావన యౌవనం. కాలంలో వచ్చే మార్పులని బట్టి శరీరానికి వార్ధక్యం తప్పదు. కానీ మనసుకి యౌవనాన్ని ఇచ్చేది సౌందర్య భావన. మనుషుల్లో సౌందర్య చేతన లోపిస్తే ప్రపంచం నిర్జీవమైపోతుంది. సృష్టి సౌందర్యానికి ఆనందించలేని మనిషి రాయిలా మిగిలిపోతాడు.</p>
<blockquote><p>&#8216;దారి తలలెత్తు నింత సౌందర్య లవము<br />
వదలి పోలేరు చంపెడివరకు వీరు &#8216;</p></blockquote>
<p>ప్రజలలో సౌందర్య భావం నశించింది. కనిపించే సౌందర్యాన్ని ఎలా ఉపయోగించుకుందామా అనే ఆలోచన తప్ప అనుభవించి ఆనందించే శక్తి లేదు. ఈ భావాన్ని చలంగారు ఇలా చెబుతున్నారు.</p>
<p>‘సౌందర్యం మీది భక్తి ఉంటుందని కూడా మరచిపోయినారు. గొప్ప కవులూ, కళారాధకులూ సౌందర్యాలన్నిటిలోకి సుందరమైనది సుందరమైన జీవితం అని విశ్వసించారు. దానికి సూత్రం సుందరమైన ఆత్మ&#8217;</p>
<p>మానవ జీవితానికి అందాన్నిచ్చే విలువలూ, పద్ధతులూ చూస్తే భరించలేని లోకాన్ని కృష్ణశాస్త్రి, చలం ఒక విధంగానే తిరస్కరించారు.</p>
<blockquote><p>&#8216;వాడిపోయిన ప్రతి సౌరభమ్ము కొరకు<br />
కనుమొరంగిన ప్రతి హిమకణము కొరకు<br />
బ్రతుకు బ్రతుకెల్ల కరగు బాష్పములు కాగ<br />
ఎట్లు కననేర్తు నానాటి దృశ్యమేను&#8217;?</p></blockquote>
<p>తన మనస్సుని తాకిన ప్రతి సౌందర్య ఖండాన్నీ, తన హృదయాన్ని పలికించిన ప్రతి ప్రేమ శకలాన్ని ఏరుకొని ఆదర్శ సౌందర్యాన్ని నిర్మించుకున్నాడు కవి. ఆమె ఊర్వశి. &#8216;మృదుల కరుణా మధురము నా హృదయము, ఎవ్వరెరుగజాలుదు రేమని యేడ్తునెపుడు&#8217; దుఃఖంతో, ప్రవాసంతో మనస్సు పవిత్రమయ్యింది. అగ్ని శోధనతో, ఎడతెగని సాధనతో సృజన శక్తులు పక్వానికి వచ్చాయి. మనస్సు ఉన్నత స్థితికి చేరుకుంది.</p>
<p>ప్రేమించలేక పోయానన్న బాధతో కవిని, పాత జ్ఞాపకాలు బాధిస్తున్నాయి. &#8216;తుది మొదలులేనిదానాటి తొలి నిశీధపుం దమము; ఆఘాత మయ్యెది; అందు దారిలేదు; మిణుగు రేనియు కానరాదు; ఒకండ పొంచి యొదిగితి నేమూల మూలలందు&#8217; అంటాడు. కృష్ణపక్షంలో, భార్య మరణించినప్పుడు కవి పాడిన &#8216;తుది మొదలు కానికానరానిది; మహాంధకార కలుషిత కృష్ణపక్షంపు వీధి&#8217; జీవితం జ్ఞప్తికి వచ్చి కవిని మరింత వేదనకి గురి చేస్తోంది.</p>
<p>&#8216;ఊర్వశి&#8217; గీతాల ప్రారంభంలో కృష్ణశాస్త్రిగారు,</p>
<blockquote><p>&#8216;నా కఠిన పాదశిలల క్రిందబడి నలగి<br />
పోయె నెన్నెన్నియో మల్లెపూలు మున్ను&#8217;</p></blockquote>
<p>అని పాడారు. పాటలో విషాదపు జీర మనసుని కదిలిస్తుంది. కృష్ణపక్షంలో తన పూర్వానుభవాలని గుర్తు చేసుకుంటున్నాడు కవి. &#8216;తేటివలపు&#8217; ఖండికలో మల్లెపూవుని పెళ్ళికూతురిని చేసిన తీగలు తుమ్మెదతో అంటాయి. &#8216;ఆర్ద్రచిత్తుడని బేల వరించేను నిను మల్లికా లలన, యెరుంగ దింత అనురాగము తేనెల తేటకంచు&#8217;</p>
<p>ఆ మాటలు విని తుమ్మెద,</p>
<blockquote><p>&#8216;తెనెలంగూర్చి వలపుల దేటపరచి<br />
ధన్యురాలనయ్యె మీ చెలి తలిరుబోణీ!<br />
కాని నిరతంబు మల్లిక కడనె యుండి<br />
ముదము కూర్పగ మాకొక్క పూలె చెపుమ&#8217;</p></blockquote>
<p>తీగలతో అంటుంది. చంచలమైన తుమ్మెద మనస్తత్వం కవికుమారునిలో కనిపిస్తుంది. స్వేచ్ఛాప్రణయం దుఃఖానికి దారితీసి కవిని ప్రవాసిని చేసింది.</p>
<p>రకరకాల అనుభవాలు మూటకట్టుకున్న కవిని వార్ధక్యం,మరణం కలవరపెడుతున్నాయి.</p>
<blockquote><p>&#8216;నా కనుల క్రాగు చీకట్లు ప్రాకుచోట<br />
లేదు నెత్తావి, మధువేని లేదు, లేదు<br />
ప్రాణ, మొక్క లావణ్య లవమ్ము లేదు<br />
ఏను రుజనైతి, జరనైతి, మృత్యువైతి&#8217;</p></blockquote>
<p>కామవాంఛకి సౌందర్యానురక్తి ఉండదు. కవికి అంత దుఃఖంలోనూ ఆశాకిరణంలా</p>
<blockquote><p>&#8216;ఈ నిశావసానమ్మున, ఏ శుభాని<br />
లమ్ము నిట్టూర్చెనో జాలిరాగనేడు<br />
వ్రాలె నా పాడు అడుగుల మ్రోలనొక్క<br />
తారయే, యొక్క దివ్యమందార సుమమె&#8217;</p></blockquote>
<p>స్వర్గ సౌందర్యానికి ప్రతీకగా ఊర్వశిని సృష్టించుకున్నారు కృష్ణశాస్త్రి. &#8216;In the Poetical Compositions that followed Pravasam (Exile) and Urvasi &#8211; I attempted to offer an insight into values realized in the course of the earlier search for love and its fulfillment.&#8217; అని అంటారు కృష్ణశాస్త్రి</p>
<p>మానవ విలువలు, ప్రేమవికాసం, వీటి అన్వేషణకి అంతర్దృష్టి అవసరం. అది కృష్ణశాస్త్రికి పుష్కలంగా ఉంది.</p>
<p>&#8216;మోహినీ హాసమల్లీ ప్రఫుల్ల రుచియె, శ్రీ లలిత వైజయంతీ పరిమళమ్మో, హర జటా పారిజాత లంతాంత మధువె&#8217; అందుకోలేని అందం ఊర్వశిది. ఆమె దర్శనంతో నిర్దయతో పదునెక్కిన ఈ నీచమైన గోళ్ల కొసలు కూడా పరవశంతో చలించి పోతున్నాయంటాడు కవి. గత జీవితంలో తన క్రూర ప్రవృత్తి కవిని చలింప చేస్తోంది.</p>
<blockquote><p>&#8216;త్రిజగతీ పతి కోటీర దివ్య రత్న<br />
రాజి నేలు వజ్రాల తురాయి నీవు!<br />
ఏనొ పాతాళలోకంపు టిరుకు సందు<br />
లందు దిగబ్రాక వెరచు గాఢాంధ రేఖను&#8217;</p></blockquote>
<p>మానసిక సంఘర్షణ కవి మనస్సుని ఉన్నతీకరిస్తోంది. కవి శృంగార బాధ అంతా సౌందర్యాన్వేషణే. ఒకనాడు విర్రవీగి స్త్రీని పతనం చేసిన కవి నేడు ఆమెని ఉన్నతమైన స్థితిలో దర్శించి, ఆత్మౌన్నత్యాన్ని సాధించే తపనలో తనని తాను కుంచింప చేసుకుంటున్నాడు. &#8216;పతిత నెట్లౌదు, నేనెటు పక్షినౌదు&#8217; నంటాడు. ఐక్యం కుదిరేలా లేదు.</p>
<blockquote><p>&#8216;ఇన్ని కల్పాలు కాలు నాయెద నడంగి<br />
నాకు ప్రాణమె యగు వేదనా సుఖమ్ము<br />
ఇదె పలుకరించు, నా సఖీ ఇపుడు నీ య<br />
పూర్వ కరుణార్ద్ర నీరవమూర్తి యగుచు&#8217;</p></blockquote>
<p>యుగయుగాలుగా మానవుడు తనలో దాగిన సౌందర్యాన్ని తానే గ్రహింపలేకుండా ఉన్నాడు. కారణం. అహంకారం, అధికారం, మదం, గర్వం &#8211; ఇవన్నీ మనిషిని అసహ్యంగా తయారు చేస్తున్నాయి. భౌతికాన్వేషణ ఊపిరిగా బ్రతుకుతూ సుఖాల వెంట పరుగులు తీస్తూ తీవ్రమైన అఘాతానికి గురౌతున్నాడు. ఇప్పుడు కవికి ప్రాణమైన వేదనా సుఖం తన ప్రేయసిని కరుణార్ద్ర నీరవమూర్తిగా పరిచయం చేస్తోంది.</p>
<blockquote><p>&#8216;నే కురియ లేని మూగకన్నీరు యుగయు<br />
గాల నేత్రాల యశ్రువర్షాలు, కడుగ<br />
చల్లగా జాలిజాలిగా శాంతమధుర<br />
ముగ నుషఃకాల కౌముది సొగసువైతి&#8217;</p></blockquote>
<p>కృష్ణపక్షం చివరి రోజులలో ఉషఃకాలంలో వెన్నెల మెరిసిపోతూ ఉంటుంది. సౌందర్య సాక్షాత్కారం ప్రారంభమయింది. చీకటి, వెలుగు మానవ జీవితంలో సహజం. చీకటిని భరించటమంటే వెలుగుని అన్వేషించటం, తపస్సు, దుఃఖమంతా కన్నీటి శిల్పమై, సౌందర్యంగా, రసాధిదేవతగా సాక్షాత్కరిస్తుంటే, కృష్ణశాస్త్రి</p>
<blockquote><p>&#8216;ప్రేయసీ! వీని కృపణ జీవిత గళమ్ము<br />
ఎండ వానల చివికి పోయినది, జీర<br />
వారునో, మూగవోవునో, వడకి వెలితి<br />
యౌనొ, పాడదో&#8217; యను సందియమ్ము వలదు&#8217;</p></blockquote>
<p>అంటాడు. ఆమె దయావీక్షణాలతో తను రచించే కవిత్వంలో &#8216;మూడు లోకాల సుఖమొక్క ముడినిమిడ్చి విసరలేనొ కాలాంతమే వెనుక ప్రాక!&#8217; అని ఆత్మ విశ్వాసాన్ని ప్రకటిస్తాడు ప్రణయోపాసకుడు.</p>
<blockquote><p>&#8216;మత్సురానేక పుణ్య జన్మములు పండి<br />
జాహ్నవీ స్వచ్చవును సుధాస్వాదుమూర్తి<br />
వైన నీ దివ్య సాన్నిధ్య మందుకొంటి<br />
పుడమికిన్ స్వర్గమున కొక్క ముడి రచించి&#8217;</p></blockquote>
<p>అని నాయని సుబ్బారావుగారంటే, వేదుల తన ప్రేయసిని గురించి,<br />
&#8216;ఆమె మూడులోకాల కళ్యాణమునకు<br />
అవతరించిన యొక పవిత్రానుభావము&#8217;</p>
<p>అంటారు. &#8216;ఎంకెవ్వరని ఎవరైన అడిగితే, ఎలుగునీడల కేసి ఏలు సూపింతు&#8217; నన్నాడు నండూరి.</p>
<p>భావకవులు నాయని, నండూరి, వేదుల, కృష్ణశాస్త్రి నలుగురూ ఒకే రకమైన అనుభవాన్ని ఎవరి పద్ధతుల్లో వారు చెప్పినవారు. విశ్వ రహస్యాన్ని, మానవుని అనంతవేదనని భావన ద్వారా చెప్పినవారు. ప్రేమని ఉపాసించి సౌందర్యాన్ని అందుకున్నవారు.</p>
<blockquote><p>&#8216;నాడు &#8216;శాఫో&#8217; విరహ కంఠనాళ వేణు<br />
వాలపించిన యరుణారుణాంచ గీతి<br />
యేడ్చు, నిట్టూర్పు, కోపించు నిపుడు సంధ్య<br />
యటుల, కాల విశాల విహాయసమున&#8217;</p></blockquote>
<p>అంటాడు కవి. విరహగీతాల శాశ్వతత్వాన్ని వివరిస్తూ &#8216;శాఫో&#8217; అనే గ్రీకు కవయిత్రి విరహంలో తన కంఠనాళాన్ని వేణువుని చేసి పాడిన అరుణారుణాంధ గీతి ఎర్రని సంధ్యలా కాల విశాలాకాశంలో పలకరిస్తోందని అంటున్నాడు. ఊర్వశితో ఇంకా ఇలా అంటాడు. &#8216;యుష్మదీయ చరణ మస్వణారుణోదయ సురభి కాంతి&#8217; తన గీతాలలో ఆరని వెలుగుగా చేర్చికొంటానని ఆరాట పడుతున్నాడు.</p>
<p>అసలు ఊర్వశి అంటేనే సౌందర్య తత్త్వం. చలంగారు కూడా &#8216;పురూరవ&#8217; నాటకంలో ఈ తత్త్వాన్ని నిరూపించారు. అందులో ఊర్వశి ఇలా అంటుంది. &#8216;సౌందర్యాన్నే అనుభవించటం నేర్చుకొన్ననాడు స్వర్గమే నీ కరతలామలకం&#8217; అని. పురూరవుడు ఎలా నేర్చుకోగలను అంటాడు. ఊర్వశి &#8216;అదో విద్య కాదోయి. ఎదగాలి. ఆ జ్ఞానంలోకి&#8217; అని అంటూంది. ఈ సంభాషణంలో తేలిన దేమిటంటే శరీరాల కలయిక భౌతికానందాన్ని, హృదయాల కలయిక అలౌకికానందాన్ని కలిగిస్తాయని. శృంగారంలో ఉండే ఔన్నత్యమే సౌందర్యమని చలం భావన.</p>
<p>ప్రేమ గురించీ, స్త్రీ సౌందర్యాన్ని గురించీ చలం పురూరవ నాటకంలో ఊర్వశి చేత ఇలా అనిపిస్తారు. &#8216;ప్రేమంటే ఆశించి, స్త్రీ నీ ఆలింగనంలోకి వస్తే ఏ భారం లేకుండా అనుభవించడ మనుకున్నావా? కంటికి బాగున్న స్త్రీ నల్లా నీ పాన్పు మీదకి రమ్మని ఆహ్వానించడ మనుకున్నావా? కాదు. స్త్రీ సౌందర్యం &#8211; పురుషుణ్ణి కాల్చి మెడవంచి కళ్లు తెరవడానికి. అతని ఆత్మని అతనికి చూపడానికి.&#8217;</p>
<p>యుగాల ఫలితమైన పురూరవుని శృంగార వాంఛ ఊర్వశి రూపంలో వచ్చిందని చలం అంటారు. ఈ సృష్టి, ఈశ్వరుడు, ఎంత వాస్తవమో తన ప్రేమ అంత వాస్తవమని ఊర్వశి పురూరవునికి చెపుతుంది. తీవ్రమైన, భేదమైన, అగ్నితుల్యమైన విషాదంలోంచి తప్ప నేర్చుకోలేడు మానవుడు. అందువల్లనే మానవలోకంలో ఇంత వియోగం, అశాంతి, బాధ.</p>
<p>అందరానిది అందుకోవాలని మానవుడు పడే ఆవేదనకి అర్థం చెప్పిన నాటకం చలం పురూరవ.</p>
<p>కృష్ణశాస్త్రి, చలం ఇద్దరూ రొమాంటిసిస్ట్లే. ప్రేమకోసం, స్వేచ్ఛకోసం తపన పడ్డ వాళ్లే. ఆత్మసౌందర్యం కోసం అన్వేషించినవాళ్లే. తమని తాము సంస్కరించుకొనే ప్రయత్నంలో సాహిత్య సృజన చేసినవాళ్లు. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకొనే ఆరాటంలో విలువలని గౌరవించినవాళ్లు.</p>
<p>&#8216;నేటి తెలుగుకవికి ఊర్వశి అంటే లోపం లేని ఆనందం. కలత లేని శాంతి. అమృతం. ఊర్వశిని ప్రేమిస్తే లోకంలో ఎవరినీ ప్రేమించలేకుండా ఉండలేమంటాడు&#8217; అని అంటారు కృష్ణశాస్త్రి.</p>
<p>భావనతో సృష్టించుకున్న ప్రేయసి ఊర్వశి. వ్యక్తిగత ప్రేమని విశ్వప్రేమగా మలచి సౌందర్య రూపంలో కవి ఆరాధించిన అపురూప లావణ్యరాశి ఊర్వశి. కవి తన హృదయంలోని ఊర్వశిని చూడటానికి సిగ్గు పడుతున్నాడు. పూర్వానుభవాలు కవిని భ్రాంతిలో పడేశాయి. అహంకారం కరిగి పోయాక అందులోంచి బయటపడ్డాడు. ఇప్పుడు ఊర్వశి దర్శనమిస్తోంది. కవితో ఇలా అంటుంది.</p>
<blockquote><p>&#8216;తొలి వియోగిని నేనె! తొలి ప్రేయసిని నేనె!<br />
ఆనాటి కేనాటి కేను నీ దాననే&#8217;</p></blockquote>
<p>సౌందర్యం మానవ హృదయంలోనే దాగి ఉంటుంది. ఎవరి అభిరుచిని బట్టి వారు దాన్ని చూడగలుగుతారు, అనుభవించగలుగుతారు. ఈ సౌందర్యానుభూతితో తపించిన కవి ఊర్వశిని గుర్తించాడు.</p>
<blockquote><p>&#8216;మున్నీటి తరగలకు మిన్నేటి నురుగులకు<br />
తడయు నెడబాటౌనె! విడని కౌగిలి నేనె!<br />
వాన చినుకుగ సొగసి వలపు చూపుగ నెగసి<br />
పడిపోవుదును నేనె! పరువులిడుదును నేనె!&#8217;</p></blockquote>
<p>కవి కోసం ఊర్వశి దిగిరావడంలోనే &#8216;మిసిమి వన్నెల మేన మసి జాలిగానయ్యె&#8217; అన్నది. లోక సంగ్రహార్థం అయిన ఊర్వశి పాట కవికి తనను తాను తెలుసుకొనేలా చేసింది. ఆమె పాటని ఉద్దేశ్యించి కవి,</p>
<blockquote><p>&#8216;నీవు తేనియ గొంతెత్తి తేని, నీ క<br />
పోలములు చిరునవ్వు నేత్రాలు కూడ<br />
మరచి సర్వమ్ము, సొగసుగా శిరసు ద్రిప్పు<br />
చెందులకొ పాడినట్లుండు నేదొ యేదొ!&#8217;</p></blockquote>
<p>అని అంటాడు. ఆమె పాటని కవి భావిస్తూ ఆమె పిలిచినట్టుగా, పాడినట్టుగా ఆనందిస్తూ ఉంటాడు.</p>
<p>కవి ఊర్వశి పాటగురించి చెప్పిన తర్వాత ఆమె కళ్లలోని భావాలని గురించి చెపుతాడు. అనంత సౌందర్యమైన ప్రకృతి ఎంత గంభీరమైనదో ఆమె కనులలోని భావాలు అంత గంభీరమైనవి. &#8216;ఏదియో అపూర్వ మధుర రక్తి స్పురియించుగాని అర్ధమ్ముగాని భావగీతమ్ము లవి.&#8217; భావ కవిత్వ సారాంశమంతా ఈ వాక్యంలో ఉంది. భావ కవిత్వం అర్థ తాత్పర్యాలకి లొంగేది కాదు. దీనిలో భావనకే ప్రాధాన్యత. పాటగా కనిపించిన సౌందర్య దేవతని చూడగానే కవికి జీవితరహస్యం బోధపడింది.</p>
<blockquote><p>&#8216;ఎదలోపలి యెదలో, నె<br />
మ్మదిలో, జీవిత రహస్యమార్గమ్ములలో<br />
వదలని కోరికవై, నా<br />
బ్రదుకు బరువు లెల్ల పాట పాడింతు సఖీ!&#8217;</p></blockquote>
<p>కృష్ణశాస్త్రి హృదయం సౌందర్యంతో నిండిపోతుంటే తన బ్రతుకు బరువులెల్ల పాటలా పలుకుతుంటే, కవిలోని కళాకారుని గొంతు ముడి విడిపోతుంది.</p>
<blockquote><p>&#8216;నీ యాజ్ఞ కూడెనా, గొంతు ముడి వీడెనా<br />
హాయిగా యుగయుగంబుల కలల్ పాడనా!<br />
చిర గాఢనిద్ర మేల్కొలిపి సందేశాలు<br />
పరపనా దిక్కు దిక్కులకు చుక్కలకు!&#8217;</p></blockquote>
<p>అని అంటాడు. గొప్ప కళ ఎప్పుడూ శాశ్వతత్వాన్ని కోరుతుంది. కవి హృదయంలో చిరకాలంగా నిద్రించే కలలు ఆనందగీతాలు పాడతాయి. యుగయుగాల ఆవేగంతో, ఆనందంతో, ఆశతో, ఆశయాలతో, వివిధానుభవాలతో ఊర్వశిని చేశారు. అందుకే కవి ఊర్వశిని ఆరాధిస్తాడు.</p>
<blockquote><p>&#8216;ఆ యనాధ బాలిక ప్రియురాలు నాకు!<br />
ఆమె నవసాంధ్య సమయ మల్లీ మనోజ్ఞ<br />
కుసుమకామిని ; ఎదొ వింత కోర్కె తీయ<br />
దనపు వేదన నా జీవితమున రేపు&#8217;</p></blockquote>
<p>అంటాడు కవి. జీవితాన్ని రసమయం చేసుకోవడమే కవి వాంఛ. దానినే తీయదనపు వేదన అంటున్నాడు. కవి భావార్థ హృదయుడు, ప్రణయరాజరాజేశ్వరుడూ అయ్యాడు. అప్సరస ఊర్వశి ప్రేమ భావనకి ప్రతీక.</p>
<p>కృష్ణశాస్త్రిగారు ప్రేయసిని సృష్టించుకోవడం గురించి ఇలా అంటారు. &#8216;నేను విధాత అంతవాణ్ణి. అతడు సరస్వతిని సృష్టించుకున్నాడు. ప్రేమించాడు. ప్రేమింపబడ్డాడు. నేనూ అంతే.&#8217; అని. కళకీ, ప్రేమకీ ఉన్న సంబంధాన్ని చెప్పారు. సృజనాత్మక ఆదర్శం, సౌందర్యం విధాతకి సరస్వతి అయితే కవికి ఊర్వశి. ఆమె ప్రేమ స్వరూపిణి. కని హృదయాన్ని సౌందర్యమయం చేస్తుంది.</p>
<p>&#8216;ఊర్వశి పుట్టుకను గురించి రెండు గాథలున్నాయి. క్షీరసాగర గర్భంలోంచి అప్సరసలు అందరితో జన్మించింది. అన్నది ఒకటి. రవీంద్రుడు ఇదే అంటాడు. ఒక చేతిలో సుధాపాత్రతో, ఒక చేతిలో విషభాంఢంతో అవతరించావనీ అంటాడు. ఆంధ్రకవికి అప్సరసలు అందరితో ఊర్వశి పుట్టింది అన్న మాట గిట్టదు. ఇక రెండో గాథ. బదరికాశ్రమంలో నారాయణదేవుడు తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడు వెర్రివాడు. ఆయన మనస్సు కలపెట్టడానికని వసంత మన్మథాదులు ఆసరాగా రంభాద్యప్సరసలని పంపుతాడు. నారాయణదేవుడు చిరునవ్వు నవ్వి ఊరువు (తొడ) లోంచి ఏదో తీసి అచ్చరల కెదురుగా విసురుతాడు. అది ఊర్వశిగా నిలుస్తుంది. రంభ వెలవెలబోతుంది. రంభ సిగ్గుపడుతుంది. రంభ సౌందర్యం లౌకికం. వాడి పోగలదు. ఊర్వశి సౌందర్యం అలౌకికం. సత్యం. అనంత యౌవన ఊర్వశి&#8217; తెలుగుకవికి రెండవ గాథ ఇష్టమని కృష్ణశాస్త్రిగారు అన్నారు.</p>
<p>ఊర్వశిని శాశ్వత స్త్రీ అన్నారు రవీంద్రుడు. నహోమాతా, నహోకన్యా, నహోవధూ అని కూడా అన్నారు. విషంతో, అమృతంతో, చీకటితో, వెన్నెలతో కలిసిన ఊర్వశి యుగయుగాలవీ, చతుర్దశ భువనాలవీ అశ్రువులు కడగగా కడగగా సుందరతరం, దివ్యతరం, ఉజ్వలతరం అయిపోతూ ఉన్న ఆదర్శ సౌందర్యం ఊర్వశి.</p>
<blockquote><p>&#8216;నీ కనుచూపు చీకటుల నీడల<br />
నాయెద నిల్వలేదు, పే<br />
రాకలి గొన్న నా బ్రతుకునందు<br />
త్వదీయ మనోజ్ఞ హాసరే<br />
ఖాకమనీయ కాంతి సుధ<br />
కాల్వలుకట్టగలేదు, కానియే<br />
మో గలగున్ మనమ్ము<br />
వలపుం దమకమ్మున నిందలంచినన్&#8217;</p></blockquote>
<p>ఊర్వశి సౌందర్యం తలచుకున్నప్పుడు కవి మనస్సు అశాంతికి లోనవుతుంది. ప్రేమతో పర్యవసించిన ఆదర్శం సౌందర్యమై సాక్షాత్కరిస్తోంది. నూతన వియోగంతో బాధపడే దీనుడైన కవిని అనురాగంతో చూస్తోంది ఊర్వశి. విశ్వసౌందర్యం కవి భావనలో మానవ రూపాన్ని ధరించింది. ఆమె అతని జీవితంలో చైత్ర ఋతువులా ప్రవేశించింది.</p>
<blockquote><p>&#8216;నా బ్రతుకు నేడు నందన చైత్ర వనమౌనొ<br />
ప్రాభాత గగన పూర్వ ప్రాంగణమ్మౌనొ!<br />
చెర తొలగు జీవమో!<br />
మరపు విడు తేజమో!&#8217;</p></blockquote>
<p>ఊర్వశి ప్రేమపిపాసి. జీవితంలో పాటలా, పక్షిలా ప్రవేశించి కొత్త ఆశని, కొత్త హాయిని కలిగిస్తోంది.</p>
<p>కని కన్న స్వప్నాలన్నీ వెలుగు రూపాన్ని ధరించినాయి. జీర్ణజీవిత ప్రాంగణంలో వసంత విలాస మధుర్యమూ, ఉషఃకల్యాణ లావణ్యమూ ప్రవేశించినాయి. అప్పటి తన స్థితిని కవి ఇలా పాడుకుంటున్నాడు.</p>
<blockquote><p>&#8216;నేడు నా జీవితము కూడ నిర్జరాంగ<br />
నా దరస్మితమయి ప్రపంచాలు ప్రాకు!<br />
పిలుచునేరేడు లోకాల ప్రేమకొరకు!<br />
పరపు నాహృదయము చరాచరములకును&#8217;</p></blockquote>
<p>సృష్టిలో ప్రతిపదార్థమూ ఉన్నత దశని పొందాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆత్మవికాసమే మనిషికి సౌందర్యాన్నిస్తుంది.</p>
<p>భావ కవిత్వంలో ప్రధానమైన మరో అంశం అద్భుత సృజన. ప్రతి విషయాన్ని లోపలికి పెల్లగించి చూసి అసలు తత్త్వాన్ని భావనతో అన్వేషించటం. కృష్ణశాస్త్రి ఊర్వశి అద్భుత సృజనే ఆత్మావలోకనమే. ఆనందభావనే.</p>
<blockquote><p>&#8216;ప్రతి పదార్థమ్ములోని రూపమ్ము వరకు<br />
అసలు తత్త్వమ్ము కొరకు ప్రయాణమౌ మ<br />
నస్సునకు అడ్డు కంచెలన్నవియె లేవు&#8217;</p></blockquote>
<p>ప్రేమ అసలు తత్త్వం అన్వేషణలో పడ్డ కవి దుఃఖానికి గురై హృదయాన్ని క్షాళన చేసి విశ్వసౌందర్యాన్ని దర్శించి, ప్రేమని విశ్వవ్యాపితం చేస్తున్నాడు.</p>
<p>కవి హృదయంలో &#8216;విశ్వ వీణాగళమ్ము భోరుభోరున&#8217; మ్రోత పెడుతోంది. విశ్వప్రేమని ఉపాసిస్తున్నాడు. అనుభవాలతో అణగారిన పరిస్థితి కవిది. కారుచీకటిలో ప్రయాణించినవాడు కవి. ఊర్వశితో అంటున్నాడు.</p>
<blockquote><p>&#8216;కరుణచే వలపుచే తరళమైనా నీవు<br />
బిడియాన నిరులలొ బడి యేడ్చినా నేను&#8217;</p></blockquote>
<p>ఆమె కరుణని చూసి కవి సిగ్గుపడుతున్నాడు. దయా స్వరూపిణియైన విశ్వప్రేయసితో &#8216;కలుగునా నాకు నీ వియోగమ్ము సకియ&#8217; అని ప్రశ్నిస్తున్నాడు. సౌందర్యం కోసం అన్వేషించి &#8216;ఎంత దిగజారి దిగజారి ఎంత వెదకి వెదకి పడినవొ, పెంధూళి కదలలేక వెలుగులేక యెగురలేక వీని కనులె శిలలు గాక, వదలని కౌగిలి పెనంగ చెదరు గాక లజ్జా గాఢ వేదనాగ్ని! &#8216; అని అంటాడు.</p>
<p>కవి ఊహలకి అతీతమైన ఆనందానికై అర్రులు చాచే ఆశాజీవి. ముద్దుకృష్ణ మాటల్లో చెప్పాలంటే, &#8216;ఆశయాలలో, అనుభవాలలో కొత్తదనమూ, విశేషప్రత్యేకత ఉన్నవాడు కృష్ణశాస్త్రి. ప్రేమకై విదాహం పొందాడు. విరహంలో వేగిపోయాడు.&#8217;<br />
భావకవిగా కృష్ణశాస్త్రి విశిష్టత ఆయన సౌందర్యాన్వేషణలో కనిపిస్తుంది. ప్రేమకై ఆయన పడిన ఆరాటం, ప్రకృతిలో సమన్వయించుకున్న తీరు, కాల్పనిక సౌందర్య దృష్టి పట్ల ఆయనకి గల అవగాహన తేట తెల్లమవుతుంది.</p>
<blockquote><p>&#8216;నిదురలో స్వప్నాల కదలికే బరువైన<br />
కలలెల్ల కనువిచ్చి కాల్చు నాగతియేమి<br />
బ్రదుకులో భావాల పరిమళమె బరువైన<br />
భావాలె పరువమై బ్రతుకు నా గతి యేమి&#8217;</p></blockquote>
<p>మధురమైన బాధ, కాల్చే తియ్యదనం, తియ్యతేనియ బరువు కృష్ణశాస్త్రి కవిత్వానికి ఆధునికతని సంతరింప జేశాయి. లోకాతీతమైన పరమసత్యాలని ఇంద్రియానుభవం ద్వారా ఆవిష్కరించటం కృష్ణశాస్త్రి ప్రత్యేకత. స్వప్నాల కదలికలో ఉండే బరువునీ, భావాల పరిమళాల బరువునీ అనుభవించి అక్షరీకరించటం కృష్ణశాస్త్రి కవితాశిల్పం. ఆయన విశ్వప్రేమ భావనలోంచి &#8216;కలదు నాలోన క్షీరసాగరము నేడు&#8217; 52 అంటాడు. &#8216;ఆనందమూ, అనురాగమూ లోపల నిండి ఉన్నప్పుడు మన హృదయం మెత్తబడి మెత్తబడి క్షీరమై, మంచై, పాలమంచు కాలవై ఊరికే ప్రతి వస్తువు మీద కురుస్తుంది. &#8211; అది అలాంటి అశ్రువు! ఊర్వశినాది, ప్రేమ అందరిదీని.&#8217; అంటారు కృష్ణశాస్త్రి.</p>
<p>ప్రపంచంలో ప్రతి మానవునికీ కారుణ్య దృష్టి ఉండాలని కృష్ణశాస్త్రి మతం. అది ప్రేమని వెలిగిస్తుంది. కన్నీరు కావ్యానికి ప్రేరణ అయినట్లుగానే కావ్యం పాఠకుల చేత కన్నీరు కార్పించాలని కృష్ణశాస్త్రి కవితా సిద్ధాంతం. ఏ తత్త్వవేత్త అయినా ప్రపంచం బాధని తాను అనుభవించీ, జీవిత సత్యాన్ని అన్వేషించీ ఆనందాన్ని ప్రపంచానికి అందించాలని తపిస్తాడు. యుగయుగాలుగా ఈశ్వరయోధులైన సంస్కర్తలు, మానవతావాదులు సాగించిన ప్రస్థానమే సత్యాన్వేషణం. కృష్ణశాస్త్రి తన సౌందర్య ప్రస్థానంలో పడిన తపన ఇదే.</p>
<p>కవికి స్వప్నం వస్తుంది. స్వప్నం వంటి సత్యం. &#8216;నిశా నిటలాంత సీమ శ్యామల లలితాలసాలకల&#8217; నుంచి కవి కనురెప్ప సెజ్జల మీద వాలుతుంది. ఆ కలలో కవీ, ఊర్వశి నందన వీధులలోకి వెళ్ళిపోయారు. అపుడు ఊర్వశి</p>
<blockquote><p>&#8216;ప్రియతమా! దాసి అక్షయ ప్రేమసేవ<br />
కీలతాంతాలు మొత్తాలు చాలునోయి!<br />
నింగి మూలలె నీలిపందిళ్లు పరచి<br />
ఎంత తెలిమల్లె తోట వేయించినానొ&#8217;</p></blockquote>
<p>అంటుంది. ఈ విధంగా ఊర్వశి సంయోగం స్వప్నావస్థలో లభించినట్లు కృష్ణశాస్త్రి చిత్రించారు.</p>
<p>ఊర్వశి శాశ్వతమైన సౌందర్యం. కృష్ణశాస్త్రికి స్త్రీపట్ల, ప్రేమపట్ల ఆదర్శ దృష్టి ఉంది. మృదుభావన ఉంది. ప్రేమ మనిషికి శక్తినిస్తుంది. శిశిరంలా పడిఉన్న కవి హృదయంలో వసంతంలా ప్రవేశించింది ఊర్వశి.</p>
<blockquote><p>&#8216;విడని వాసన పదములు విరులెయయ్యె<br />
ఆననమ్మున నశ్రులే యారవయ్యె<br />
నిలిచినాడ నేటికి కూడ తొలి వసంత<br />
కాలపు ప్రభాత తరుణ వృక్షమ్ము కరణి!&#8217;</p></blockquote>
<p>అనుకుంటాడు కవి. సృష్టిలో కనిపించే వస్తువులన్నింటికీ ఏదో అమరిక ఉంటుంది ఆ అమరిక అర్థం కాకపోవడంతో ప్రపంచం అసమగ్రమౌతోంది. అసమగ్రతలోంచి దుఃఖం. భావకవులు ఆ అమరికని అన్వేషించడానికీ అంతర్దృష్టిని అలవరుచుకున్నారు. అంతర్దృష్టి భావనకి మెరుగు పెడుతుంది. కవి శాశ్వత సౌందర్యాన్వేషణలో సృష్టిమూలాల కేసి దృష్టిని సారించాడు. కవి తొలివసంత కాలపు ప్రభాతవృక్షమయ్యాడు. అన్వేషణ పూర్తయ్యింది.</p>
<p><em>&#8216;The Romantics thought that beauty is a final quality of reality revealed through visible things&#8217;</em></p>
<p>కాల్పనిక కవులు దృశ్యమాన వస్తువుల ద్వారా అదృశ్య ప్రపంచాన్ని అన్వేషించే ప్రయత్నంలో కడపటి వాస్తవ గుణం సౌందర్యమని విశ్వసించారు.</p>
<p>కవి దయాపూరితమైన హృదయంలోంచి కన్నీరు పువ్వులుగా, పాటలుగా రాలతాయి.</p>
<blockquote><p>&#8216;నావలెనె యాతడున్మత్త భావశాలి,<br />
ఆగికోలేడు రేగు నూహల నొకింత<br />
ఎట్టి నిశి నేనదరిపోవు నెగసిపడును!&#8217;</p></blockquote>
<p>భావకవి ప్రవృత్తిని గురించిన గొప్ప సత్యం ఇందులో ఉంది. ఎగసి పడడమనేది భావకవి జీవ లక్షణం. ప్రకృతిలో తాదాత్మ్యానికి తహతహలాడే ఆవేశం భావకవిని సృష్టితత్త్వాన్ని గ్రహించేలా చేస్తుంది</p>
<blockquote><p>&#8216;ఇంత చిరుగీతి యెద వేగిరించు నేని<br />
పాడుకొనును, తాండవ నృత్య మాడుకొనును;<br />
మస్తక మ్మోరగా వంచి మన్నుమిన్ను<br />
వేయి కేలాడగా వ్రాసి వేసికొనును!<br />
ఏనెరుంగుదు నావలెనే యతండు<br />
పాట పదములకై నిత్య పథికుడయ్యె!&#8217;</p></blockquote>
<p>భావకవిత్వం అంటే పాట. బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావు, కృష్ణశాస్త్రి &#8211; వీళ్ల దృష్టిలో కవిత్వం అంటే పాట. జీవితం అంటే పాట. కిక్కిరిసిన అనుభవాలతో బరువెక్కిన హృదయాలని పాటతోనే దింపుకునే వాళ్లు. పాటల రహదారుల్లో నిత్యపథికులు వీళ్లు. ఈ లక్షణం వల్లనే భావకవిత్వం ఉద్యమరూపాన్ని ధరించి రెండు దశాబ్దాల పాటు ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించింది.</p>
<blockquote><p>&#8216;ఈ వియోగ నిరాశాక్ష<br />
ణ క్షణ ప్రతీక్ష చెదరి<br />
ఎగసి ఎగసి పగిలి పోదునో! &#8216;</p></blockquote>
<p>అని ప్రేయసి కోసమే కాదు, పాటకోసమూ అంత తపన పడతాడు.</p>
<p>కృష్ణశాస్త్రిగారు కృష్ణపక్షము &#8211; ప్రవాసము &#8211; ఊర్వశి కావ్యాలలో ప్రేమానుభవంతో పాటు అంతర్లీనంగా సృజనాత్మక ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, కవిత్వాన్ని సంగీత స్థాయికి తెచ్చి సరస్వతిలో లీనమై పోవాలని తపిస్తున్నారు. &#8216;All art aspires to the condition of Music&#8217; అంటాడు వాల్టర్ పీటర్. కృష్ణశాస్త్రి కవితలో ఉన్న గానగుణం ఆయన కవిత్వాన్ని సంగీత స్థాయికి తెచ్చింది. ఆయన సాహిత్య రసవేత్త. సంగీత రసవేత్త.</p>
<p>కాల్పనిక సౌందర్య శాస్త్రములో కవి తన ఆత్మానుభవాన్ని వ్యక్తం చేయడమే కాక, కళాకారునిగా సృజనాత్మక అనుభవాన్ని కూడా వ్యక్తం చేయడం ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. కృష్ణశాస్త్రి తన సౌందర్య ప్రస్థానంలో ఇది నెరవేర్చారు.</p>
<p>సృష్టితత్త్వాన్ని ఆకళించుకొని, &#8216;మూడులోకాల బరువుల మోత నడగి యడగి చిదికెను గద అంధజడము తాను&#8217; గ్రహించాడు కవి.</p>
<blockquote><p>&#8216;ఈ మిడిసిపాటు నీ మ్రోల నేల, తేనె<br />
తేట చినుకేని లేని యీ పాటకిపుడు?<br />
ఇంత చివురిచ్చి యంత హేమంత శృంఖ<br />
లాల బంధింతు మూగతనాల గొంతు &#8216;</p></blockquote>
<p>కవి మనసు భక్తి వైపు మళ్లింది. &#8216;స్వామి! నూత్న వసంత జీవ ప్రవాళ పల్లవమ్ముల రుచులె నా బ్రతుకు జీర గోసి తీయదనమ్ములు వోసినప్పుడె వెడలి పడలేద! యొక యదుగిడగలేద&#8217; అంటాడు. కవికి తన సంగతి తనకి తెలిసింది. &#8216;ఓయి గాయక సార్వభౌమా! యివేటి తగని త్రుళ్లింత వెలితి నృత్యమ్ములోయి!&#8217; అంటాడు. స్వేచ్ఛపట్ల భ్రమలు తొలగి పోయినాయి. శాశ్వతమైన స్వేచ్ఛని గ్రహించ గలుగుతున్నాడు కవి</p>
<p>కళని గురించి చెప్పేది సౌందర్య శాస్త్రం. సౌందర్యాన్ని వ్యక్తం చేసేది కళ. ఆనందాన్ని వ్యక్తం చేసెది సౌందర్యం. మనస్సుని వికసింప చేసేది ఆనందం.</p>
<p>&#8216;Beauty is that profound expression of Reality which satisfies our hearts without any other allurements but its own ultimate value&#8217; అని అంటారు రవీంద్రుడు. అసలు వాస్తవాన్ని గాఢంగా వ్యక్తం చేయగలిగేది సౌందర్యం. మన హృదయాలకి ఆనందం కలిగించినప్పుడే అది సౌందర్యం అవుతుంది. అయితే మన హృదయాలు సంతృప్తి చెందాలి.</p>
<p>దేవులపల్లి కృష్ణశాస్త్రిగారూ, తల్లావజ్ఝల శివశంకరశాస్త్రిగారు మొదలైన కవుల చేతిలో సాహిత్యకళ భరతనాట్యం చేస్తున్నది. వచనకావ్యం హృదయాన్ని సంస్కరించలేదు. ఈ కవులు హృదయ సౌకుమార్యాన్ని వృద్ధి చేయగలుగుతున్నారు. ఎప్పటికైనా మేధ కంటే హృదయమే ముందు భగవంతుని సాన్నిధ్యం సంపాదించుకుంటుందనిపిస్తుంది ఈ కవుల కవిత్వం చూస్తే. నవ్యసాహిత్యం పుట్టేవరకూ సాహిత్య కళచేత మెదడుకు మెరుగు పెట్టించుతూ వచ్చారు. ఈనాడు ఈ సౌందర్యం కవిత్వాన్ని ఆశ్రయించి హృదయాన్ని సంస్కరింపజేస్తున్నది.</p>
<p>భావకవుల సౌందర్యదృష్టి మానవ హృదయాన్ని ఎలా సంస్కరిస్తుందో చెబుతూ కొడవటిగంటి కుటుంబరావుగారు &#8216;నవ్య సాహిత్యం పుట్టేవరకూ&#8217; అని ఒక మాట అన్నారు. అది సత్యం కాదు. ప్రాచీన సాహిత్యంలో శతకాలూ, పోతన భాగవతమూ మొదలైనవి హృదయాన్ని భక్తిభావంతో నింపినవే. అయితే కుటుంబరావుగారు అన్నట్టు భావకవులు మేధకంటె హృదయానికి ప్రాధాన్యాన్నివ్వటం వలన సౌందర్య దృష్టి మెరుగులుదిద్దుకుంది.</p>
<p>కవికిగల అనంత సౌందర్య దాహం నిలవనివ్వడం లేదు. భగవంతుని దర్శనం కోరుతోంది. భక్తుడూ, పిచ్చివాడూ, కవి ముగ్గురూ ఒకలాంటి మనస్తత్వం కలవారే.</p>
<blockquote><p>&#8216;అంత నే వెర్రి నైపోదువయ్య; నిన్ను<br />
బోలి పాడబోవుదు; నిన్ను పోలినాట్య<br />
మాడబోవుదు, లజ్జబోనాడి, కాక<br />
ఇంత దాహమ్ము దహియింప నెటులు మనుదు&#8217;</p></blockquote>
<p>అంటాడు కవి. సౌందర్య దాహం కవిని ఉన్మత్త శిఖరాలకి చేరుస్తుంది.</p>
<blockquote><p>&#8216;ఏవిధాన సౌందర్య రసైక జీవి<br />
నిలువ నేరుతు నిత నొక్కనిమిషమేని<br />
మామకీన జీవితశుష్కమార్గముల త్వ<br />
దీయ పాదమంజీరముల్ మ్రోయకున్న&#8217;</p></blockquote>
<p>కృష్ణపక్షంలో ప్రారంభించిన పవిత్ర యాత్ర ఎడతెగని అన్వేషణై సాగుతూనే ఉంది. దర్శనం సాధించేవరకూ సాగేది. ఈ యాత్ర మనస్సు వెన్నెలతో నిండి &#8216;కార్తీకి&#8217; గా పర్యవసిస్తోంది.</p>
<p>కృష్ణపక్షంలో స్వేచ్ఛకోసం, ప్రేమకోసం, ఆదర్శ సౌందర్యం కోసం అన్వేషించిన కవి తపస్సు ఫలించింది. వెలుగునీ, అమృతాన్నీ అందుకున్నాడు కవి. అది శాశ్వత సౌందర్యం.</p>
<blockquote><p>&#8216;ప్రేయసి సోయగమ్మునకు లేదు శరీరము; లేదు మేను నా<br />
తీయని ప్రెమకేని, కలదే యెడబాటికమాకు; శ్యామ వై<br />
హాయస సీమ కారితికి యామవతీ హసితమ్మువోలె నన్<br />
బాయదెదో వెలుంగొ &#8211; మధువె&#8230;&#8217;</p></blockquote>
<p>అంటాడు కవి.</p>
<p>స్వర్గ సౌందర్యానికీ, భూలోకంలోని ప్రేమ మధుర్యానికీ ముడిపెట్టి మానవలోకాన్ని ప్రేమ సౌందర్యంతో తీర్చి దిద్దాలన్న తపనతో కవి సాగించిన అన్వేషణ ఫలించింది. పరమశివునితో అద్వైత సిద్ధి లభించింది. &#8216;తన కంఠమున దాచి హాలాహలం &#8211; తల నుంచి కురిపించి గంగాజలం&#8217; మనిషి శివుడవాలని తపించిన కవి విషాదాన్ని గుండెల్లో దాచుకొని సౌందర్యామృతాన్ని ప్రపంచాని కందిస్తున్నాడు. కరుణతో లోకాన్ని వెలిగిస్తున్నాడు. తనని తాను తెలుసుకొని, శాశ్వతమైన స్వేచ్ఛనీ, సత్యాన్నీ ఆవిష్కరించేది కృష్ణశాస్త్రి సౌందర్య తత్త్వం.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
<p>Artwork: Anwar</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=12598</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>కృష్ణశాస్త్రి &#8211; సినీ సాహిత్యం</title>
		<link>http://vaakili.com/patrika/?p=12661</link>
		<comments>http://vaakili.com/patrika/?p=12661#comments</comments>
		<pubDate>Sat, 05 Nov 2016 16:02:47 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[డా. సీతారామయ్య (రామసూరి)]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=12661</guid>
		<description><![CDATA[తెలుగు సినీ సాహిత్యానికి కావ్య గౌరవం తెచ్చిన రచయితలలో కృష్ణశాస్త్రిగారు ప్రసిద్ధులు. మల్లీశ్వరి సినిమాకి మాటలు-పాటలు రాయటంతో ఆయన తెలుగు సాహిత్యంలో చలనచిత్ర గీతాలకి ప్రత్యేకతని సంతరించారు. ఆయన వెలువరించిన సినీసాహిత్యంలో పరిశీలించవలసిన అంశాలు రెండు. ఒకటి మల్లీశ్వరి రచన. రెండు సినీగీతాలు.]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/11/dks.jpg"><img class="alignleft  wp-image-12713" title="dks" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/11/dks.jpg" alt="" width="303" height="437" /></a></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">తె</span>లుగు సినీ సాహిత్యానికి కావ్య గౌరవం తెచ్చిన రచయితలలో కృష్ణశాస్త్రిగారు ప్రసిద్ధులు. మల్లీశ్వరి సినిమాకి మాటలు-పాటలు రాయటంతో ఆయన తెలుగు సాహిత్యంలో చలనచిత్ర గీతాలకి ప్రత్యేకతని సంతరించారు. ఆయన వెలువరించిన సినీసాహిత్యంలో పరిశీలించవలసిన అంశాలు రెండు. ఒకటి మల్లీశ్వరి రచన. రెండు సినీగీతాలు.</p>
<p>దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారు 1950 లో సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగుచలనచిత్ర చరిత్రలో ఆణిముత్యమైన మల్లీశ్వరి చిత్రానికి ఆయన రాసిన సంభాషణలు చిత్రానికి వన్నె తెచ్చినాయి. ప్రసిద్ధ దర్శకులు బి.ఎన్.రెడ్డిగారు కృష్ణదేవరాయల కాలంనాటి కథని సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు. సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం వంటి లలితకళలకి సమ ప్రాధాన్యాన్నిచ్చి, రాయలవారి కళాభిరుచిని దృశ్యకావ్యంగా తీయాలని రెడ్డిగారి సంకల్పం. &#8216;దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి రచనలమీద నాకెంతో గౌరవం. ఆయనచేత చిత్రాలలో పాటలు రాయించాలనుకునేవాడిని. &#8216;మల్లీశ్వరి&#8217; ఆలోచన రాగానే, ఆ కథకు ఆయనే తగినవారని, ఆయనతో చెప్పి రాయమని అడిగాను. కృష్ణశాస్త్రిగారు చాలా నిదానం, నెమ్మది. ఎంత ఆలస్యం అయినా సరే, ఒక కళాఖండంగా నిర్మించాలని వారిచేతనే మాటలు, పాటలు రాయించాను.&#8217; అని బి.ఎన్.రెడ్డిగారు అన్నారు.</p>
<p>కృష్ణశాస్త్రిగారు రొమాంటిసిస్ట్ కావడంతో మల్లీశ్వరి చిత్రం ఆయన అభిరుచులకి తగ్గట్టుగా రూపుదిద్దుకుంది. ఏ సన్నివేశానికి, ఏ రసానికి, ఏ పాత్రకి మాటలు ఎంతవరకు అవసరమో గుర్తించి మరీ సంభాషణలు రాశారు. పాత్రల స్వభావాలని దృష్టిలో ఉంచుకొని ఔచిత్యాన్ని పాటిస్తూ రచన చేశారు.</p>
<p>పల్లె వాతావారణం, తిరునాళ్ళ సంబరాలు, నాట్య సన్నివేశాలూ, శిల్పుల జీవితాలూ, నేతపనివాండ్ర జీవితాలూ, రాజమందిర వాతావరణం, అమాయక ప్రకృతి &#8211; అన్నింటినీ పరిశీలించి సందర్భానికి తగ్గట్టు రచన చేశారు. సంభాషణలు పాత్రల స్వభావాలనుంచి పుట్టే సంఘర్షణలకి అద్దం పడతాయి. తద్వారా కథ నడుస్తుంది. కథని సాగదీసినట్టుగా కాకుండా, సహజధోరణిలో నడిపించడం కృష్ణశాస్త్రిగారి ప్రతిభకి గీటురాయి.</p>
<p>కృష్ణశాస్త్రిగారు కవి. సంభాషణలు రాసేటప్పుడు ఆయనలొ కవి కనిపించడు. పాత్రల మనసులోంచి, వాళ్లున్న పరిస్థితిలోంచి ఎలాంటి మాటలు వస్తాయో ఆలోచించి, ఆ మాటలనే రాయటం ఆయన ప్రత్యేకత. అసలు అభిప్రాయాన్ని ప్రకటించడానికి మాటలూ, అనుభూతిని వ్యక్తం చేయడానికి కవిత్వమూ అన్న స్పృహ సంభాషణల రచయితకు ఉండాలి. ఆ స్పృహ కృష్ణశాస్త్రిగారికి ఉంది.</p>
<p>&#8216;మల్లీశ్వరి&#8217; చిత్రంలో చిన్నపిల్లల అల్లరీ, అమాయక సంభాషణమూ, ఆటపాటలూ చిత్రించి మల్లీ,నాగరాజుల బాల్యాన్ని రసమయం చేసారు. నాటక రచనా, సినిమా రచనా కొంచెం దగ్గరగ ఉంటాయి. కథలోని పాత్రల స్వభావాల సంఘర్షణలోంచి పలికే సంభాషణలే కథని కొసదాకా నడిపిస్తాయి.</p>
<p>&#8216;మల్లీశ్వరి&#8217; చిత్రంలో నాగమ్మ అత్యాశ, నాగప్ప సంతృప్తికర జీవితం, మల్లీ, నాగరాజుల అమాయకత్వం, కళాభిరుచులూ, రాయలవారికి కళలపట్ల ఉన్న ఆదరణ కథకి కీలకమైన అంశాలు. నాగమ్మ &#8216;తన కూతురు మహారాణివారి ఇష్టసఖి కావాలని&#8217; ఆశపడటం, నాగరాజు &#8216;మల్లిని మహారాణీవారి ఇష్టసఖిని చేయమని&#8217; అమాయకంగా కోరటం, రాయలవారు సరదాపడి వారి ముచ్చట తీర్చటం &#8211; ఈ మూడు అంశాలూ కథని నడిపించాయి. నాగరాజు శిల్ప సృష్టి, మల్లీశ్వరి నాట్యకౌశలం కథకి వన్నెలు దిద్దినాయి. మల్లీశ్వరి నవరసభరితంగా రూపుదిద్దుకొంది.</p>
<p>&#8216;రాతిబొమ్మ మోజులో పడి, అసలు బొమ్మని మరిచిపోతావేమో&#8217; అని మల్లి అంటే &#8216;అసలు బొమ్మకంటే రాతిబొమ్మే నయం కదూ&#8217; అని నాగరాజు అంటాడు. ఈ సంభాషణం తనని పట్టించుకోకుండా, బొమ్మలు చెక్కడంలో, నిమగ్నమైన బావ మనసుని మళ్లించడానికి మల్లి సరదాగా అన్నదీ, నాగరాజు చమత్కారంగా అన్న మాటలూ కథకి జీవం పోసినాయి.</p>
<p>మహారాజావారి మెడలోని హారం మల్లి చేతిలోకీ, పల్లె వాతావరణంలో పండిన జాంపండు రాణీవారి చేతిలోకి మారడం కథని మలుపు తిప్పింది. రాజుగారి కళాభిరుచి,పల్లెప్రజల అమాయక సంస్కృతీ ప్రస్ఫుటించేలా చిత్రించిన ఈ సన్నివేశం కళలకీ రాజుల కొలువుకీ వంతెనలా భాసిల్లింది.</p>
<p>ధనం, అహంకారం నాగమ్మ వ్యక్తిత్వాన్నీ, మంచితనం, అమాయకత్వం నాగప్ప వ్యక్తిత్వాన్నీ తీర్చిదిద్దినాయి. పౌరుషాన్ని ప్రదర్శించిన నాగరాజు శిల్పవిద్యలో రాణకెక్కుతాడు. మల్లీశ్వరి రాణీవారి ఇష్టసఖి అవుతుంది.</p>
<p>మల్లి,నాగరాజుల వియోగాన్ని కృష్ణశాస్త్రిగారు హృదయాలని కదిలించేలా చిత్రించారు. చివరికి ప్రేయసీ ప్రియులు సాహసించి దగ్గరవటంతో, రాయాలవారు ముచ్చటపడి, వారిని విడుదల చేయటంతో కథ సుఖాంతమౌతుంది.</p>
<p>రాణివాసాలకంటే అమాయక పల్లెటూరి నివాసమే సుఖమని గ్రహిస్తారు, మల్లీనాగరాజులు. వారి కోరికని రాజుగారు రాణీవారికి తెలియజేసినపుడు రాణీవారు &#8216;పాపం! ఆ చిన్నవారి మనసులో రాణీవాసపు భోగభాగ్యాలంటే వింత వింత ఊహలున్నాయి కాబోలు&#8217; అని అంటారు. రాణివాసాల భ్రమ తొలగి, జీవితంలో అసలు వాస్తవాన్ని ఆవిష్కరించటం చిత్రంలో ప్రధాన ఉద్దేశ్యం. ప్రేమ ఎంత ఉదాత్తమైనదో, జీవనసౌందర్యాన్ని ప్రేమ ఎలా ప్రోది చేస్తుందో కళాత్మకంగా చెప్పిన చిత్రం &#8216;మల్లీశ్వరి&#8217;. కళలకి, ప్రేమకీ ఎంత దగ్గర సంబంధముందో చెప్పిన చిత్రం ఇది. కళాకారుల సృజనాత్మక అనుభవాన్నీ, ఆ అనుభవంలో వారు పడే వేదననీ, లక్ష్యసాధనలో వారి దృఢ దీక్షనీ మల్లీ నాగరాజు పాత్రలలో కృష్ణశాస్త్రి తేటతెల్లం చేశారు.</p>
<p>సాహిత్యం రసజగత్తు. చలనచిత్ర రచన ప్రజలకి సన్నిహితమైన శైలిలో ఉండాలి. మనుషులూ వారి ప్రవృత్తులూ, కదలికలూ, మాటతీరూ, స్వరభేదాలూ, సంస్కారం, కుటుంబ నేపధ్యం, పరిసరాల ప్రభావం, అనుబంధాలూ &#8211; అనురాగాలూ అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని, లోకంపట్ల ఎరుకతో సంభాషణలు రాయడం వల్ల &#8216;మల్లీశ్వరి&#8217; కళాఖండమయ్యింది. సాహిత్యానికి సంబంధించి తనవంతు పాత్ర సమర్థంగా నిర్వహించారు కృష్ణశాస్త్రిగారు.</p>
<p>చలనచిత్ర రచనతో కృష్ణశాస్త్రిగారిలోని కవి ప్రజలకి మరింత సన్నిహిత మయ్యాడు. తెలుగు మాటల కూర్పు పాటకి ఎలా ప్రాణం పోస్తుందో కృష్ణశాస్త్రిగారికి బాగా పట్టుబడింది. సినిమాలో సందర్భం, పాత్రల స్థితిగతులూ, అప్పటి మనస్స్థితి, వారి భాష అన్నీ తెలుసుకొని పాట రాసినప్పుడే సినిమాపాట రక్తి కడుతుంది. కృష్ణశాస్త్రిగారి పాటలలో ప్రత్యేకత ఏమిటంటే, సినిమా చూస్తున్నప్పుడు ఎటువంటి అనుభూతికి లోనవుతామో, పాట విడిగా వింటున్నప్పుడు కూడా అటువంటి అనుభూతికి లోనవుతాము.</p>
<p>మానవ జీవితంలో ఎన్నో సన్నివేశాలు, ఎందరో మనుషులు, ఎన్నెన్నో మానసిక స్థితులు. అన్నింటికీ అన్ని రకాలుగా భాషలో మాటలుంటాయని కృష్ణశాస్త్రిగారి విశ్వాసం. ఆ &#8216;మాట&#8217; తప్ప మరో &#8216;మాట&#8217; ఆ మానసిక స్థితిని వ్యక్తం చేయలేదని ఆయన నమ్మకం. ఆ &#8216;మాట&#8217; వచ్చేదాకా ఓపిక పడితే, పాట జీవం పొసుకుంటుంది. మాటకి పర్యాయ పదాలుండవనీ ఆ స్థితిని వ్యక్తం చేయడానికి అది తప్పనిసరి పదమని ఆయన అభిప్రాయం. అందుకే కృష్ణశాస్త్రిగారి పాటల రచనలో ఆలస్యం జరిగినప్పటికీ, పాటలు అమృతబిందువులైనాయి. సంగీతం నాదం ద్వారా సాధించేది. కవిత్వం శబ్దం ద్వారా సాధించాలి. తెలుగు జీవితాన్ని ప్రతిబింబించే కృష్ణశాస్త్రిగారి పాటలు రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. 1975లో కృష్ణశాస్త్రి సన్మాన సంఘం, మద్రాసు వారు &#8216;మేఘమాల&#8217; పేరుతో ఒకటీ, 1996లో ఓరియంట్ లాజ్మన్ వారు &#8216;గోరింట&#8217; పేరుతో ఒకటీ సినిమాపాటల సంకలనాలు వెలువరించారు.</p>
<p>జానపద గీతాల స్వరూప స్వభావాలూ, నన్నయవంటి మహాకవుల పద్యాల ఛందో రీతులూ, త్యాగయ్య అన్నమయ్యల కీర్తనల అంతఃసౌందర్యమూ, జీర్ణించుకొని, తెలుగుపదాల కూర్పులో పాటని పలికించే సౌందర్య రహస్యాన్ని కృష్ణశాస్త్రి గ్రహించగలిగారు. ప్రజల జీవితంలోని కష్టసుఖాలూ, మాటతీరూ నిశితంగా పరిశీలించే దృష్టి కృష్ణశాస్త్రికి పుష్కలంగా ఉంది.</p>
<p>కృష్ణశాస్త్రిగారి శైలి లలితమైనది. ఆయన ముద్రని మనం పాటలో పట్టుకోగలం. ఆ ఆత్మీయతని ఆయన పాట కూర్పులో సాధించగలిగారు. దానికి కారణం ఒక మాట పక్కన ఏ మాట పొదిగితే భావం, రసం, రాగం సమర్థంగా పలుకుతాయో కృష్ణశాస్త్రిగారికి తెలిసిన విద్య. అందరం మాట్లాడుకొనే మాటలతోనే పాట పాడించగల కళావేత్త. ఆయన. &#8216;పాట పదములకై నిత్య పథికుడు&#8217; కృష్ణశాస్త్రి.</p>
<p>భావ వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కృష్ణశాస్త్రిగారి సినీగీతాలని ఐదు రకాలుగా విభజించవచ్చు. 1. జోలపాటలు 2. సంస్కృతి 3. సంస్కరణదృష్టి 4. మానవత 5. ప్రణయం.</p>
<p>పసితనంలో అమ్మ పాడే జోలపాటతో మనిషికీ పాటకీ అనుబంధం ఏర్పడుతుంది. చందమామ రావె! జాబిల్లి రావే! అంటూ మానవ జీవన స్రవంతిలో ఆనందాన్ని కలిగించే పాటలు ఎన్నో ఉన్నాయి. కృష్ణశాస్త్రిగారు ఈ పాటల తత్త్వాన్ని గ్రహించి, ఆయన పద్ధతిలో కొన్ని సినిమాలకి సందర్భానికి తగినట్టుగా జోలపాటలు రాసారు. ఆ పాత్రల స్థితిగతులని బట్టి పాటలో చరణాలు ఉంటాయి. ఆ పాటలు వింటుంటే పాత్రల స్వభావాలు మనకు అవగతమవుతాయి.</p>
<p>&#8216;బంగారుపాప&#8217; సినిమాకి రాసిన పాటలో &#8216; లుళలుళలుళా! అనే సాకీతో ప్రారంభమై, &#8216;తాధిమి తకధిమి తోల్బొమ్మా! దీని తమాష కీల్బొమ్మా!&#8217; అంటూ తాత్త్విక ధోరణిలో సాగే జోలపాట రాశారు. &#8216;ఎవరికెవ్వరో ఏమౌతారో, యివరము తెలుసా? కీల్బొమ్మా, ఈ యివరము తెలుసా మాయబొమ్మా&#8217; అనే చరణంలో మనిషి జీవితరహస్య మార్గాలని అన్వేషించే ధోరణి ఉంది. &#8216;కోపము తాపము క్రూరకర్మలూ, కూడని పనులే తోల్బొమ్మా, పాపపు రొంపిని పడబోకే, పరమాత్ముని నమ్మవె కీల్బొమ్మా&#8217; అంటూ మానవులు జీవన ధోరణిని తెలియజేస్తారు. ఈ సందర్భంలో పాప సాహచర్యంతో దుర్మార్గుడు మంచివాడుగా మారతాడు. ఆటన్నా పాటన్నా పరమాత్ముని బొమ్మలాటని చెప్పే జీవన సత్యం ఈ పాటకి సాహిత్య గౌరవాన్నిచ్చింది.</p>
<p>&#8216;సంపూర్ణ రామాయణం&#8217; చిత్రంలో &#8216;రామాలాలీ! మేఘశ్యామాలాలీ! తామరస నయనా! దశరధ తనయాలాలీ! &#8216; అనే పాటలో దృశ్య చిత్రీకరణంలో పాత్రల స్వభావాలు ఆవిష్కరించేలా, మాటలు పొదిగారు కృష్ణశాస్త్రిగారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, రామునికి తల్లులు. &#8216;ఎవ్వరు ఊపాలి? ఎవ్వరు జోల పాడాలి?&#8217; అని కౌసల్య &#8216;నేనా&#8217; అంటుంది. కన్నతల్లికే సందేహం వస్తే, సుమిత్ర &#8216;నేనో&#8217; అని తటపటాయిస్తుంది. కైకెయి &#8216;నేనే&#8217; అని ఖచ్చితంగా చెబుతుంది. కాకువు భేదంతో కైకేయికి రామునిపై ఎంత ప్రేమ ఉందో చెప్పి కృష్ణశాస్త్రిగారు ఈ జోలపాటలో కైకేయి స్వాభావిక సౌందర్యాన్ని ఆవిష్కరించారు.</p>
<p>&#8216;కాలం మారింది&#8217; చిత్రంలో అనాధ బాలికపై జోలపాట కరుణరసం ఉట్టిపడేలా రాశారు. &#8216;పల్లె నిదురించేను &#8211; తల్లి నిదురించేను! ప్రతిపాప తల్లి పొత్తిళ్ళు నిదురించేను&#8217; అని ప్రారంభించి, &#8216;ఎవరికి నీవు కావాలి? ఎవరికి నీ మీద జాలి&#8217; అని అనాధబాలికని ప్రశ్నిస్తారు. &#8216;ఏ తల్లి పాడేను జోల? ఏ తల్లి ఊపేను డోల, ఎవరికి నీవు కావాలి, ఎవరికి నీ మీద జాలి&#8217; అని ప్రపంచం కర్కశత్వాన్ని ప్రకటిస్తారు. &#8216;కలువ పాపాయికి కొలను ఒడి ఉన్నది! చిలుక పాపాయికీ చిగురు ఒడి ఉన్నదీ! ప్రాణమే లేని ఒక శిలకు గుడి ఉన్నది! నీకే.. అమ్మ ఒడి లేనిదీ &#8230; గుడి లేనిదీ &#8230; &#8216; ప్రకృతిలో అన్నీ ఆనందంగానే ఉన్నాయి. మానవ సమాజంలోనే కరుణలేదనీ,మనుషుల కంటే మతానికి ప్రాధాన్యానిస్తున్నారనే జీవనసత్యాన్ని కృష్ణశాస్త్రి భావకవిత్వంలో ఒక అంశమైన దృశ్యచిత్రణం కళాత్మకంగా చేశారు.</p>
<p>తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టేవి పండగలు. మానవులందరూ కలసి మెలసి సాగించే జీవన విధానంలో పండగలకి ప్రాధాన్యం ఉంది. సుఖదుఃఖాలూ, కలిమిలేములూ అన్నీ మరచిపోయి, ఆనందాన్ని పొందేది పండగలప్పుడే. పల్లెలు సంస్కృతికి ఆటపట్టు. నారు పోసింది మొదలు,పంటలు ఇళ్ళకి చేరేదాకా మనిషికి పాట తోడు ఉంటూనే ఉంటుంది. తెలుగు సినిమాలలో కృష్ణశాస్త్రిగారు మన పండగలని చిత్రిస్తూ కొన్ని పాటలను రాశారు. అవి ఆయనకి మన సంస్కృతి పట్ల ఉన్న అవగాహనని తెలియజేస్తాయి.</p>
<p>మన పండగలు వినాయక చవితితో ప్రారంభమౌతాయి. &#8216;వినాయక విజయం&#8217; చిత్రానికి రాసిన పాటలో &#8216;వేల్పులందరిలోన తొలివేల్పువో ఏమో! పూజలలో మొదటి పూజ నీదేనేమో! అని అంటారు. పిల్లలూ పెద్దలూ భక్తి శ్రద్ధలతో చేసే వినాయక పూజని ప్రస్తావించారీ పాటలో. అట్ల తదియకీ, ఉండ్రాళ్ల తదియకీ &#8216;గోరింటాకు&#8217; పెట్టుకొని సంబరపడే కన్నెపిల్లల కలలని చిత్రిస్తూ &#8216;గోరింట పూసింది కొమ్మా లేకుండా, మురిపాల అరచేత మొగ్గా తొడిగింది, ఎంచక్క పండిన ఎర్రని చుక్క , చిట్టీ పేరంటాలికి శ్రీరామ రక్ష&#8217; అంటారు. &#8216;మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తె కలవాడొస్తాడు. సిందూరంలా పూస్తే చిట్టీ చేయంతా అందాల చందమామ అతనే దిగివస్తాడు.&#8217; కృష్ణశాస్త్రిగారు కలలకి మాటల రంగులద్ది, భావాన్ని అందంగా పలికించి తెలుగు సంస్కృతిలోని సౌందర్యాన్ని ఆవిష్కరించారు.</p>
<p>&#8216;అమెరికా అమ్మాయి&#8217; తెలుగుపాట పాడే సన్నివేశాన్ని చిత్రించి, &#8216;ఒళ్లంత వయ్యారి కోక, కళ్లకు కాటుక రేఖతో&#8217; తెలుగు పడతిని పరిచయం చేస్తారు. సాంస్కృతిక సౌందర్యమంతా మూసపోసిన పాట ఇది.</p>
<p>&#8216;కార్తీక దీపం&#8217; చిత్రంలో కృష్ణశాస్త్రిగారు కార్తీకమాసంలో స్త్రీలు అరటిదొప్పలపై దీపాలు వెలిగించి, చెరువులలో వదిలే దృశ్యాన్ని చిత్రిస్తూ పాట రాశారు.</p>
<p>&#8216;ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం<br />
చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం &#8216;</p>
<p>అనే పల్లవితో ప్రారంభమై, &#8216;ఆకాశానా ఆ మణిదీపాలే ముత్తైదువులుంచారో, ఈ కోనేటా, ఈ చిరుదివ్వెల చూచి చుక్కలనుకొంటారో&#8217; అని అంటారు. భావకవికి భావన ముఖ్యం. భూమ్యాకాశాల మధ్య దూరాన్ని చెరిపివేసేలా చిత్రీకరించిన పాట కృష్ణశాస్త్రిగారిది. మన సంస్కృతిలోని సౌందర్యాన్ని భావించి రాసిన పాట ఇది.</p>
<p>&#8216;రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా&#8217; అంటూ రాసిన పాట &#8216;ఉండమ్మా బొట్టు పెడతా&#8217; చిత్రంలో సంక్రాంతి వాతావరణాన్ని సాక్షాత్కరింపజేస్తారు. &#8216;కడివెడు నీళ్లు కళ్ళాపి చల్లి గొబ్బిళ్లో గొబ్బిళ్లు, కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్లో గొబ్బిళ్లో&#8217; అంటారు</p>
<blockquote><p>&#8216;గాదుల్లో ధాన్యం ! కావిల్లా భాగ్యం<br />
కష్టించే కాపులకూ! కలకాలం సౌఖ్యం&#8217;</p></blockquote>
<p>అని శ్రమైక జీవన సౌందర్యాన్ని పలికిస్తారు. సాంస్కృతిక నేపథ్యంలోంచి కృష్ణశాస్త్రి రాసిన పాటలు తెలుగు సాహిత్యంలో శాశ్వతమైన స్థానాన్ని పొందాయి.</p>
<p>రాజారామమోహనరాయలు మానవోద్యమం ప్రభావంతో ఆంధ్రదేశంలో సంస్కరణ ఉద్యమాలకి శ్రీకారం చుట్టినవారు కందుకూరి వీరేశలింగం పంతులుగారు, రఘుపతి వేంకటరత్నం నాయుడుగారు. ఇద్దరూ బ్రహ్మ సమాజానికి ఉద్యమరూపాన్ని ఇచ్చినవారే. సంస్కరణ ఉద్యమంలో వితంతు వివాహం, వేశ్యానిర్మూలనం, దళితుల ఉద్ధరణం ప్రధానమైన అంశాలు. ఈ భావాలు నేపథ్యంలోంచి భావకవితా వైతాళికుడు కృష్ణశాస్త్రి కొన్ని సినిమాపాటలు రాశారు.</p>
<p>&#8216;కల్యాణ మంటపం&#8217; సినిమాలో ఒక వేశ్య కూతురు తనకి తమ కులవృత్తి నచ్చక సాంసారిక జీవితం గడపాలని కోరుకుంటుంది. &#8216;సరిగమపదనిస&#8230; పలికేవారుంటే, హృదయము తెరిచేవారుంటే.. వలచే మనసుకు బదులుగ, పిలిచే కనులకు ఎదురై, ఎదురై పలికేవారుంటే” అని ఆమె సంస్కరణ భావాలు గల హృదయంకోసం ఎదురుచూస్తోంది. &#8216;ఒక కోవెలలో ఒకడే దేవుడు, ఒక హృదయంలో ఒకడే ప్రియుడు! జీవన నేత, ప్రేమ విధాత &#8216; అని కృష్ణశాస్త్రిగారు వేశ్యా వృత్తిలోంచి బయటపడాలనుకొనే స్త్రీ ఆకాంక్షని చిత్రించారు.</p>
<p>సామాన్యులు ఊర్వశిని వేశ్యగా భావిస్తే, కృష్ణశాస్త్రి విశ్వప్రేయసిగా గౌరవించారు. స్త్రీని ఉన్నత దృష్టితో చూడటం భావకవిత్వంతోనే ప్రారంభమైంది. స్త్రీ హృదయాన్ని, ఆవేదననీ అర్థం చేసికొని కృష్ణశాస్త్రి సంస్కరణ దృష్టితో రాసిన పాట ఇది.</p>
<p>హరిజనోద్యమం, కళావంతుల వివాహం మొదలైన సంస్కరణ ఉద్యమాలతో సన్నిహిత సంబంధం గల కృష్ణశాస్త్రిగారు సినీ సాహిత్యంలో సంస్కరణ ధోరణి ప్రదర్శిస్తూ &#8216;మంచిరోజులు వచ్చాయి&#8217; చిత్రంలో</p>
<blockquote><p>&#8216;నేలతో నీడ అన్నది నను తాకరాదనీ<br />
పగటితో రేయి అన్నదీ నను తాకరాదనీ<br />
నీరు నన్ను తాకరాదనీ గడ్డిపరక అన్నది<br />
నేను భర్తనే తాకరాదనీ ఒక భార్య అన్నదీ&#8217;</p></blockquote>
<p>అనె పాటలో కులాంతర వివాహం చేసుకున్న భార్య భర్తని తృణీకరించిన సందర్భంలో ఆమె హృదయాన్ని సంస్కరించే ధోరణిలో కృష్ణశాస్త్రి ఇలా అంటారు.</p>
<blockquote><p>&#8216;రవికిరణం తాకనిదే నవకమలం విరిసేనా<br />
మధుపం తను తాకనిదే మందారం మురిసేనా&#8217;</p></blockquote>
<p>అని ప్రకృతిలోని నైర్మల్యాన్ని మనుషుల్ని అలవరచుకోమంటున్నారు. &#8216;అంటరానితనము &#8211; ఒంటరితనము, అనాదిగా మీ జాతికి అదే మూలధనము&#8217; అని అంటారు. మనుషుల మూర్ఖత్వాన్ని తొలగించే ప్రయత్నం. ఈ భావసంస్కరణం. అదే కృష్ణశాస్త్రి పాటలకి ఆభరణము.</p>
<p>కృష్ణశాస్త్రిగారి సాహిత్యంలో అంతర్లీనంగా స్ఫురించేది మానవత. మనిషిని మనిషిగా, మానవునిగా చేసేది మానవత. ప్రపంచ పరిస్థితుల పట్ల , విశ్వమానవుల పట్ల కరుణతో అర్థం చేసుకొనే స్పృహ కలిగించేది మానవత. కొన్ని సినిమా పాటలలో మానవతా సుమగంధాలు వెదజల్లేరు కృష్ణశాస్త్రి.</p>
<p>సుఖదుఃఖాలు చిత్రానికి రాసిన పాట. &#8216;ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది’ అనే పల్లవితో ప్రారంభమౌతుంది. &#8216;మరిగిపోయేది మానవహృదయం కరుణకలిగేది చల్లని దైవం;&#8217; అని అంటారు. &#8216;ద్వారానికి తారామణి హారం, హారతి వెన్నెల కర్పూరం&#8217; అని పాట ముగిస్తారు. సంకుచిత మనస్తత్త్వాన్ని చెరిపి విశాల దృక్పథాన్ని ధ్వనింపచేస్తున్నారీ పాటలో. వ్యక్తులు తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలకి గుమ్మాలకి మామిడితోరణాలు కట్టుకుంటారు. ఒక చిన్నపళ్లెంలో హారతి పడతారు. కానీ కవి విశ్వకుటుంబి . ప్రపంచ శుభం కోరే కవి ఇంటి గుమ్మానికి నక్షత్రాల మణిహారమే తోరణం. ఆకాశం హారతిపళ్లెం. చందమామ కర్పూరం బిళ్ల. వెన్నెల హారతి. ఆరుమాటలలో ఆరు ఖండాలని కలిపి, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ధ్వనింపజేసిన ఈ గీతం మానవతకి అద్దం పడుతుంది.</p>
<p>&#8216;ఉండమ్మా! బొట్టు పెడతా&#8217; చిత్రంలో &#8216;అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది&#8217; అనే పాటలో &#8216;ఆ గుడిలో దీపం ఉంది . అదియే దైవం&#8217; అని అంటారు కృష్ణశాస్త్రి. మానవ హృదయంలో వెలిగే ప్రేమ ఆ దైవం. &#8216;ప్రతిమనిషి నడిచే దైవం. ప్రతి పులుగూ ఎగిరే దైవం&#8217; అని అంటారు. మతవైషమ్యాలతో మనిషిని మరిచిపోతున్న ఈనాడు మనిషిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతని గుర్తు చేస్తున్నారు కవి. మతం కంటే మానవత ఎంత గొప్పదో చెబుతున్నారు. మనిషి మనసు ఈశ్వరుని కొలువు అనిపించాలనే తపనతో రాసిన గీతమిది. కులమతాల కతీతమైన మానవత ఈ గీతంలో అక్షరకాంతులు వెదజల్లింది.</p>
<p>తెలుగు సినీ గీతాలలో ప్రణయానికి ప్రాధాన్యాన్నిచ్చిన వారిలో కృష్ణశాస్త్రిగారిని ప్రత్యేకంగా చెప్పాలి. వియోగాన్నీ, సంయోగాన్నీ సున్నితంగా చెప్పడంలో ఆయన సిద్ధహస్తులు. &#8216;మల్లీశ్వరి&#8217; చిత్రానికి రాసిన పాటలు ప్రణయ మాధుర్యానికి ప్రతినిధులు.</p>
<p>&#8216;మనసున మల్లెల మాలలూగెనే, కన్నుల వెన్నెల డోలలూగెనే&#8217; అంటూ మల్లీశ్వరి చిత్రంలోని విరహగీతం కథానాయిక మనోభావాలని క్రమక్రమంగా వ్యక్తం చేస్తూ, ఆమె తన వ్యక్తిత్త్వాన్ని విశ్లేషించుకొనేలా చిత్రించిన ధోరణిలో రచించారు కృష్ణశాస్త్రి. భావకవిత్వంలో లిరిక్ లక్షణాన్ని పుణికి పుచ్చుకున్న గీతమిది. &#8216;ఎన్నినాళ్లకీ బ్రతుకు పండెనో, ఎంత హాయి ఈ రేయి నిండెనో&#8217; అని ముగిసిన ఈ పాట సినిమాలో సందర్భానికి సరిగ్గా అతకడమే కాక, విడిగా విన్నప్పుడు ఆ దృశ్యం మన మనస్సులో కనిపించేలా రాశారు కృష్ణశాస్త్రి.</p>
<p>&#8216;ఎందుకే నీకింత తొందర, ఇన్నాళ్ల చెరసాల ఈ రేయి తీరునే&#8217; అని తొందరపడే మనసుని చిలకగా భావించి, రాణివాసమనే పంజరంలోంచి కథానాయిక విముక్తమవటాన్ని సూచించి, పాటరచనలలో సృజనాత్మక భావనకి ప్రాధాన్యాన్నిచ్చారు కృష్ణశాస్త్రి.</p>
<p>ఆకాశవీధిలో హాయిగా ఎగిరే మేఘమాలని పిలిచి, మల్లి అమాయకంగా తన హృదయ వేదన తెలుపుతూ మల్లీశ్వరి చిత్రంలో,</p>
<blockquote><p>&#8216;జాలిగుండెల మేఘమాలా! నా, బావలేనిది బ్రతుకజాల!<br />
కురియు నా కన్నీరు గుండెలో దాచుకొని<br />
వానజల్లుగా కురిసి పోవా! కన్నీరు, ఆనవాలుగా బావమ్రోల&#8217;</p></blockquote>
<p>వియోగ శృంగారం పలికించారీ గీతంలో.</p>
<blockquote><p>&#8216;సుందర సురనందనవని మల్లీ, జాబిల్లీ!<br />
అందేనా! ఈ చేతుల కందేనా?<br />
చందమామ ఈ కనులకు విందేనా? &#8216;</p></blockquote>
<p>అనే పాట &#8216;పూజాఫలం&#8217; చిత్రానికి రాశారు. ప్రేమించిన ప్రియుడు ఎదురుగా ఉన్నా తనకి దక్కక పోవడాన్ని కన్నులకి విందులు చేస్తూ, చేతులకందని చందమామలా చెప్పేరీ పాటలో కృష్ణశాస్త్రి. &#8216;కలువ పేద బ్రతుకులో వలపు తేనె నింపేనా? &#8221; అంటూ పేద ప్రియురాలి మనోవేదన వియోగ శృంగారంలో పలికించి ప్రకృతిలో మానవ మనఃస్థితిని దర్శించారు.</p>
<p>&#8216;రానిక నీకోసం సఖీ! రాదిక వసంత మాసం&#8217; అంటూ &#8216;మాయని మమత&#8217; చిత్రంలో విఫలప్రేమని పలికించారు. వియోగంతో భార్యకి భర్త రాసిన లేఖ రూపంలో &#8216;కుశలమా! నీకు కుశలమేనా?&#8217; అని అంటూ &#8216;బలిపీఠం&#8217; చిత్రంలో రాసిన పాటలో విరహాగ్ని కొత్త తరహాలో పలికించారు.</p>
<p>ప్రియుని తన ఒడిలో పరుండబెట్టికొని &#8216; రాజమకుటం&#8217; చిత్రంలో కథానాయిక పాడే పాట &#8216;సడిసేయకేగాలి సడిసేయబోకే &#8216; అంటూ కృష్ణశాస్త్రి అమూర్తమైన వాటికి ఆకారాన్ని కల్పిస్తారు. &#8216;పండువెన్నెల నడిగి పాంపు తేరాదే! నీలిమబ్బుల దాగి నిదుర తేరాదే! విరుల వీవన పూని విసిరిపోరాదే! &#8216; గాలిని బ్రతిమాలే ధోరణి ప్రణయంలో ప్రకృతిని చిత్రిస్తారు కృష్ణశాస్త్రి.</p>
<p>&#8216;ఏకవీర&#8217; చిత్రంలో &#8216;ప్రతిరాత్రి వసంత రాత్రి, ప్రతిగాలి పైరగాలి, బ్రతుకంతా ప్రతినిమిషం పాటలాగ సాగాలి&#8217; అంటూ సంయోగ శృంగారంలోని సౌందర్యాన్ని పలికించారు కృష్ణశాస్త్రి. &#8216;మావిచిగురు తినగానే కోయిల పలికేనా/ కోయిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా?&#8217; అని &#8216;సీతామాలక్ష్మి&#8217; చిత్రంలో రాసిన పాటలో ప్రణయంలో అమాయక ప్రకృతిని చిత్రించారు. &#8216;ఒకరి పెదవి పగడాలు వేరొకరి కనుల దివిటీలు, ఒకరి గుండె ఉయ్యాల వేరొకరి గుండె జంపాల&#8217; అనడంలో ప్రణయం హృదయంలో మాధుర్యాన్ని చిందించాలనే భావనకి ప్రాధాన్యాన్నిచ్చారు.</p>
<p>తెలుగు సాహిత్యరంగంలో ప్రత్యేకించి, సినిమారంగంలో విలువలు పడిపోతున్న ఈనాడు కూడా కృష్ణశాస్త్రి సినిమా పాటలకి వన్నె తగ్గలేదు. దానికి కారణం, తెలుగు మాటలకి, జిలుగు వెలుగూ కలిగించి, పాటలు రాసి, పాటలో భావసౌందర్యాన్ని ఆవిష్కరించటం, మానవ మనస్తత్త్వంలోని వైవిధ్యాన్ని గ్రహించి, విభిన్న అనుభూతులని పాటలుగా పలికించిన కృష్ణశాస్త్రి తెలుగు సాహిత్యంలో అజరామరుడు.</p>
<p>కృష్ణశాస్త్రిగారి సాహిత్యాన్ని పరిశీలిస్తే ఆయన సౌందర్య ప్రస్థానంలో శాశ్వతమైన స్వేచ్చకోసం, నిర్మలమైన ప్రేమకోసం, శాశ్వతమైన సౌందర్యం కోసం ఆయన పడిన తపన తెలుస్తుంది.</p>
<p>&#8216;కృష్ణపక్షం&#8217;లో కవికుమారుడు భౌతికమైన స్వేచ్చాన్వేషణంలో ప్రేమకి దూరమై, సౌందర్యాన్ని కోల్పోయాడు. &#8216;ప్రవాసం&#8217; లో దుఃఖంతో తనని తాను సంస్కరించుకొనే ప్రయత్నం చేశాడు. ప్రేమభావనతో హృదయాన్ని సౌందర్యమయం చెసుకున్నాడు. &#8216;ఊర్వశి&#8217;లో శాశ్వతసౌందర్యాన్ని దర్శించాడు. శోధన, సాధన, ఆరాధన ప్రధానమైన అంశాలుగా సాగిన కృష్ణశాస్త్రి సౌందర్య ప్రస్థానంలో ప్రేమ ఎంత ఉదాత్తమైనదో తెలుస్తుంది.</p>
<p>ప్రకృతిప్రేమ, మానవత, భక్తి, ప్రణయం, పల్లీయ జీవనమాధుర్యం, దేశభక్తి మొదలైన అంశాలు ఆయన కవిత్వంలో చోటు చేసుకొని, మానవవిలువలని ఆవిష్కరించాయి.</p>
<p>భౌతిక సౌందర్యం కంటే ఆత్మసౌందర్యం శాశ్వతమైనదనే సత్యం ఆయన సాహిత్యంలో మనకి కనిపిస్తుంది. బ్రహ్మసమాజం, మానవోద్యమం ఆయనకి మానవులపట్ల కలిగించిన అవగాహనతో, ఆయన సృష్టించిన సాహిత్యం మనిషిపట్ల ఆయనకి గల ప్రేమని తెలియజేస్తుంది</p>
<p>ఆంగ్లవిద్యా సంస్కారం ఆయనకి సాహిత్య సృజనలో రూపానికి సంబంధించిన నూతన సంవిధానమూ, భావాలకి సంబంధించిన సంస్కరణ దృష్టిని అలవరించాయి. భావకవిత్వాన్ని ఉద్యమరూపం ధరించేలా చేసినాయి.</p>
<p>కృష్ణశాస్త్రి సౌందర్య దృష్టి, మానవ ప్రేమ, కరుణ, పదలాలిత్యం తెలుగు సాహిత్యంలో నవ్య ధోరణులకి మార్గదర్శకాలైనాయి.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=12661</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>కృష్ణశాస్త్రి సాహిత్యం – సౌందర్యతత్వం</title>
		<link>http://vaakili.com/patrika/?p=12212</link>
		<comments>http://vaakili.com/patrika/?p=12212#comments</comments>
		<pubDate>Fri, 30 Sep 2016 22:19:39 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[డా. సీతారామయ్య (రామసూరి)]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=12212</guid>
		<description><![CDATA[<p></p> <p>రాయప్రోలు సుబ్బారావుగారి ప్రభావంతో ఆధునిక కావ్యాలలో వియోగ శృంగారానికి ప్రాధాన్యం వచ్చింది. నవరసాలలో ప్రప్రథమంగా చెప్పదగినది శృంగారం. ఇది సంభోగం, విప్రలంభం అని రెండు విధాలు. విప్రలంభ శృంగారం ఐదు విధాలని మమ్మటాదుల అభిప్రాయం. అవి 1. అభిలాష 2. విరహం 3. ఈర్ష్య 4. ప్రవాసం 5. శాపం. ఇందులో ప్రవాసం కృష్ణశాస్త్రి కావ్య పరిశీలనకి అవసరం. &#8216;అనురక్తులైన నాయికా నాయకులు కార్యాంతర వశమున దేశాంతరగతులగుట ప్రవాసము&#8217;.</p> <p>కాళిదాసు మేఘసందేశం ప్రవాస విప్రలంభానికి చెందిన కావ్యం.</p> <p>&#8216;త్వా మాలిఖ్య ప్రణయ కుపితాం ధాతురాగైః శిలయా<br /> మాత్మానంతే చరణపతితం యావదిచ్చామి కర్తుమ్<br /> అస్త్రైస్తావమమ్హరు ప చితై ర్దృష్టి రాలుప్యతే మే<br /> క్రూరస్త స్మిన్నపి న సహతీ సంగమం నౌకృతాంతః&#8217;</p> <p>కుబేరుని శాపానికి గురైన యక్షుడొకడు రామగిర్యాశ్రమంలో నివసిస్తూ మేఘుని చేత తన ప్రియురాలికి పంపిన సందేశమిది. ప్రియురాలా!</p> <p>ప్రణయ కుపితవై యున్న నీ రూపాన్ని, ధాతురాగాలచే శిలపై రాసి, నేను నీ పాదాలపై పడాలనుకునేంతలో మరల మరల ఉబికే కన్నీటిచే నా చూపు లోపిస్తుంది. క్రూరమైన దైవం చిత్రంలో కూడా మన సంబంధాన్ని సహింపలేకున్నది.</p> <p>హృదయాన్ని కరిగించేలా కాళిదాసు చిత్రించిన ప్రవాస విప్రలంభమిది.</p> <p>సీతారాముల శృంగారం ధర్మశృంగారం. బాహ్య సౌందర్యము చేతనే కాక ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం, క్షణిక సౌఖ్యాన్ని కాక భవిష్యత్ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొనుట ఈ ధర్మశృంగార లక్షణాలు.</p> <p>శృంగార రసాన్ని రసరాజమన్నవాడు భోజుడు. శృంగారానికి అహంకారం, అభిమానం, రసం పర్యాయ వాచకాలు.</p> <p>ఆధునిక యుగంలో అమలిన శృంగార చర్చ చేసినవారు రాయప్రోలువారు. తృణకంకణం, లలిత, స్నేహలతాదేవి లేఖ వంటి ప్రణయ కావ్యాలలో భావకవిత్వానికి రూపురేఖలు దిద్దినవారు. కరుణ, శృంగారరసాలు రెండే రసావిష్కరణకి సమర్థాలని అభిప్రాయపడినవారు వీరు. పూర్ణానందాస్వాదానికి శృంగారం, మనో దోష శుద్ధికి కరుణ ఉపయుక్తాలని వీరి భావం. శృంగార రసానికి సంభోగమవధి అన్న పూర్వుల సిద్ధాంతాన్ని వీరు తిరస్కరించారు. ఉపాధి మాత్రమైనది కాబట్టి [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/10/ks.jpg"><img class="alignleft  wp-image-12439" title="ks" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/10/ks.jpg" alt="" width="386" height="430" /></a></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">రా</span>యప్రోలు సుబ్బారావుగారి ప్రభావంతో ఆధునిక కావ్యాలలో వియోగ శృంగారానికి ప్రాధాన్యం వచ్చింది. నవరసాలలో ప్రప్రథమంగా చెప్పదగినది శృంగారం. ఇది సంభోగం, విప్రలంభం అని రెండు విధాలు. విప్రలంభ శృంగారం ఐదు విధాలని మమ్మటాదుల అభిప్రాయం. అవి 1. అభిలాష 2. విరహం 3. ఈర్ష్య 4. ప్రవాసం 5. శాపం. ఇందులో ప్రవాసం కృష్ణశాస్త్రి కావ్య పరిశీలనకి అవసరం. &#8216;అనురక్తులైన నాయికా నాయకులు కార్యాంతర వశమున దేశాంతరగతులగుట ప్రవాసము&#8217;.</p>
<p>కాళిదాసు మేఘసందేశం ప్రవాస విప్రలంభానికి చెందిన కావ్యం.</p>
<blockquote><p>&#8216;త్వా మాలిఖ్య ప్రణయ కుపితాం ధాతురాగైః శిలయా<br />
మాత్మానంతే చరణపతితం యావదిచ్చామి కర్తుమ్<br />
అస్త్రైస్తావమమ్హరు ప చితై ర్దృష్టి రాలుప్యతే మే<br />
క్రూరస్త స్మిన్నపి న సహతీ సంగమం నౌకృతాంతః&#8217;</p></blockquote>
<p>కుబేరుని శాపానికి గురైన యక్షుడొకడు రామగిర్యాశ్రమంలో నివసిస్తూ మేఘుని చేత తన ప్రియురాలికి పంపిన సందేశమిది. ప్రియురాలా!</p>
<p>ప్రణయ కుపితవై యున్న నీ రూపాన్ని, ధాతురాగాలచే శిలపై రాసి, నేను నీ పాదాలపై పడాలనుకునేంతలో మరల మరల ఉబికే కన్నీటిచే నా చూపు లోపిస్తుంది. క్రూరమైన దైవం చిత్రంలో కూడా మన సంబంధాన్ని సహింపలేకున్నది.</p>
<p>హృదయాన్ని కరిగించేలా కాళిదాసు చిత్రించిన ప్రవాస విప్రలంభమిది.</p>
<p>సీతారాముల శృంగారం ధర్మశృంగారం. బాహ్య సౌందర్యము చేతనే కాక ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం, క్షణిక సౌఖ్యాన్ని కాక భవిష్యత్ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొనుట ఈ ధర్మశృంగార లక్షణాలు.</p>
<p>శృంగార రసాన్ని రసరాజమన్నవాడు భోజుడు. శృంగారానికి అహంకారం, అభిమానం, రసం పర్యాయ వాచకాలు.</p>
<p>ఆధునిక యుగంలో అమలిన శృంగార చర్చ చేసినవారు రాయప్రోలువారు. తృణకంకణం, లలిత, స్నేహలతాదేవి లేఖ వంటి ప్రణయ కావ్యాలలో భావకవిత్వానికి రూపురేఖలు దిద్దినవారు. కరుణ, శృంగారరసాలు రెండే రసావిష్కరణకి సమర్థాలని అభిప్రాయపడినవారు వీరు. పూర్ణానందాస్వాదానికి శృంగారం, మనో దోష శుద్ధికి కరుణ ఉపయుక్తాలని వీరి భావం. శృంగార రసానికి సంభోగమవధి అన్న పూర్వుల సిద్ధాంతాన్ని వీరు తిరస్కరించారు. ఉపాధి మాత్రమైనది కాబట్టి ఇది పనికిరాదన్నారు. వియోగ శృంగారం అనుపాధికం కాబట్టి స్వీకరించాలన్నారు. వియోగంలో ఆలంబన విభావం ప్రత్యక్షం కాదు. ఇక్కడ హృదయానికి ప్రాధాన్యం. నిర్మలమైన శృంగారం వియోగంలోనే అనుభూతికి వస్తుందని రాయప్రోలు వారి అభిప్రాయం. &#8216;స్థూలంగా చూచినచో సౌందర్య శృంగారములొక్కటే&#8217; అని సి.నారాయణరెడ్డిగారు అభిప్రాయపడ్డారు.</p>
<blockquote><p>&#8216;కానవచ్చు సౌందర్య శృంగారములకు<br />
అంతరంబనభివ్యక్తమయి; ఉపాధి<br />
గతము సౌందర్య &#8211; మను పాధికము రసాధి<br />
కారి శృంగార &#8211; మఖిల మాంగల్య పరము&#8217;</p></blockquote>
<p>అని రాయప్రోలు వారు చెప్పారు. నిర్మలమైన సౌందర్య ధ్యానంతో ఆనందాన్ని అనుభవించవచ్చునని వియోగంలోనే ప్రేమ ఔన్నత్యం పరిఢవిల్లుతుందని రాయప్రోలు వారి సిద్ధాంతం.</p>
<p>కృష్ణశాస్త్రిగారి ప్రవాసం ఖండికలలో కవి కోరిన శృంగార జీవితం, ప్రేయసి లభ్యం కాకపోవడం, ఆదర్శ సౌందర్యం కోసం నిరీక్షించడం మొదలైన అంశాలు ప్రాముఖ్యాన్ని వహించాయి. ప్రవాసం ఖండికలు కృష్ణశాస్త్రిగారు మొక్కపాటి రామమూర్తికి అంకితం ఇచ్చారు. అంకిత గీతం &#8216; ఓ మానవోత్తమా! అని సంబోధిస్తూ</p>
<blockquote><p>&#8216;ఈ యశ్రుఝరులతో, ఇరులతో, రొదలతో<br />
సొదలతో, ఈ హాస మృదుల వాసనలతో<br />
విసముతో, సిగ్గుతో, కొసరు తేనియలతో<br />
ఈ పాట బ్రతుకు నీ కేపాటిదోయీ, నా<br />
నెచ్చెలీ!&#8217;</p></blockquote>
<p>అంటారు.</p>
<p>బ్రహ్మసమాజానికి సన్నిహితులైన వారిలో రామమూర్తి నిజాయితీ అంటే అందరికీ అమితమైన గౌరవం. కృష్ణశాస్త్రిగారు రామమూర్తిని ఆధ్యాత్మిక గురువుగా భావించేవారని చలం రాశారు. రామమూర్తిని గురించి తెలుసుకోవాలంటే చలం మ్యూజింగ్సు ఆధారం. వ్యక్తిగత కారణాలచేత ఆత్మహత్య చేసుకొన్న రామమూర్తిని గురించి చలం ఇలా అంటారు.</p>
<p>&#8216;నీ మరణం అపజయం కాదని &#8211; సంఘం మీదనే కాదు, మనుష్య స్వభావం మీద, మరణం మీద జయధ్వానమని చెప్పడానికి మిగిలాను నేను.&#8217;</p>
<p>రామమూర్తి ధైర్యం, ఉత్సాహం, అశాంతి, తిరుగుబాటు &#8211; ఆ కాలం నాటి సాంఘిక దురాచారాల మీద విరుచుకపడేలా చేశాయి. ప్రేమకోసం, సత్యం కోసం, సమత కోసం, సమాజంలో ఆయన లేవనెత్తిన ఆలోచనలు చలం, ముద్దుకృష్ణ, కృష్ణశాస్త్రి వంటి రచయితల కలాలలో బలంగా ప్రతిధ్వనించినాయి. రామమూర్తి చలానికి రాసిన లేఖలో ఇలా అంటారు.</p>
<p>&#8220;And you are not alone in this suffering for want of sympathy and communion. For the first time I heard similar cry from D.K. (Krishna Sastri). With almost a broken heart he has been telling how people merely say his verses are good and fashionably read them rapidly through and skip over the surface while he has taken such pains to paint picture after picture in some of them.&#8217;</p>
<p>భగ్నహృదయంతో కృష్ణశాస్త్రి రాసిన గీతాలు రామమూర్తిని ఆకర్షించాయి. చలం రచనలలో ఏ భావాలు సంచలనాన్ని కలిగించాయో, ఏ స్థాయిలో సాహిత్యలోకాన్ని ఆలోచింపజేశాయో, అలాంటి స్పందనే కృష్ణశాస్త్రి గీతాలూ కలిగించాయి.</p>
<p>My sin is the desire to be loved&#8217; అన్నాడు రామమూర్తి. &#8216;బ్రతుకు&#8217;, &#8216;ప్రేమించు&#8217; &#8211; ఇదీ రామమూర్తి సిద్ధాంతం. నిజమైన ధీరులనీ, నిజంగా ప్రజలని ప్రేమించేవారినీ లోకం దగ్గరకు రానివ్వదు. ప్రేమ నటించి, మోసం చేసేవారిని లోకం ఆదరిస్తుంది. ఇది లోకస్వభావం. రామ్మూర్తి చచ్చిపోగానే ముద్దుకృష్ణ రామమూర్తి జీవిత చరిత్ర రాద్దామా అన్నారు చలం గారితో. &#8216;మీరూ నేనూ చదువుకోవాలి. రామ్మూర్తి ఎవరికి గొప్ప&#8217; అన్నారు చలంగారు.</p>
<p>ప్రేమకోసం, మనుషులకోసం, సత్యం కోసం జీవితాన్ని త్యాగం చేసిన రామమూర్తి మరణించడం కృష్ణశాస్త్రిని అమితంగా కదిలించింది. &#8216;హృదయ భేదకమైనవీ, అర్థం కానివీ, అయిన రెండూ మూడు మరణాలూ, అంతకన్నా దారుణంగా కలతపెట్టిన రెండు మూడు వియోగాలు అవసరమైనాయి&#8217; అని చలంగారు అన్నారు. (దేనికి అవసరమైనవి?)</p>
<p>భావకవిత్వంలో వియోగానికీ, సౌందర్య ధ్యానానికీ విలువైన స్థానం ఉంది. ప్రేమ సామ్రాజ్యైక చక్రవర్తిగా, స్నేహశీలిగా, అభివర్ణింపబడిన రామమూర్తి కృష్ణశాస్త్రి కవితా ప్రస్థానంలో ప్రేరణ కలిగించిన వ్యక్తిగా మనకి కనిపిస్తాడు.</p>
<p>భావకవిత్వం అంటే పాట. కృష్ణశాస్త్రి భావకృతులన్నీ గానయోగ్యమైనవే. కవిత్వాన్ని సంగీత స్థాయికి తెచ్చినవారు కృష్ణశాస్త్రిగారు. ఆంగ్ల కవిత్వ విమర్శకులు &#8216;లిరిసిజం&#8217; అంటారు. అశ్రుఝరులూ, చీకట్లూ, మృదుహృదయం, కొసరుతేనియలూ మొదలైన పదాలు రామమూర్తి వ్యక్తిత్వంలోని విశాల దృక్పథాన్ని తెలియజేస్తున్నాయి.</p>
<p>సంకుచితంగా వ్యవహరించే లోకం చూపిన దుర్మార్గానికి బలైపోయిన రామమూర్తితో, &#8216;ఈ పాట బ్రతుకు నీకేపాటిదోయీ&#8217; అనడంలో పాటకంటే ఉదాత్తమైన వ్యక్తిత్వం కలవాడని కృష్ణశాస్త్రి అభిప్రాయం.</p>
<p>&#8216;ప్రేయసీ, ప్రేయసీ, వెడలిపోయితివేల, ఆ యగమ్య తమస్వినీ గర్భకుహరాల&#8217; అంటూ ప్రారంభమౌతుంది ప్రవాసము. కృష్ణపక్షములోని &#8216;ప్రతీక్ష&#8217; ఖండికలో వ్యక్తమైన &#8216; ఆ యగమ్య తమస్సాంద్ర యవనికాంతరంపుటేకాంతమున బడి, యా క్రమ క్రమాస్తమిత నూపురారవాహ్వానములను వెంటనంటి,నా హృదయము వెడలిపోయె&#8217; నన్నదానికి ప్రతిధ్వని ప్రవాసంలో కనిపిస్తుంది. ‘ప్రవాసం’ కవి వేదన యొక్క విశ్వరూపాన్ని, కవి హృదయ పరిణామాన్ని స్పష్టం చేస్తుంది. &#8216;కవి రసాత్మకుడు. తాను ఆనందిస్తూ మనల్ని ఆనందింపజేస్తాడు. కవి ఋషియట. అతని ఆత్మోన్నతి మనకి వివృతమౌతోంది. మరి భావకవి అంటే లోకానికి ఎంత ఆశో! ఆ ఆశ ఎంత న్యాయమైనదో&#8217; అని కొంపెల్ల జనార్దనరావు అన్నారు.</p>
<p>కృష్ణపక్షంలో &#8216;నేను&#8217;గా అహంభావం ప్రకటించిన కవి తనని తాను సంస్కరించుకొని, విశ్వవ్యాపితమయ్యే ప్రయత్నం ప్రవాసంలో కనిపిస్తుంది. ప్రియురాలి ఎడబాటు భరించలేక, అపుడు గొంతెత్తి యేడిస్తే, తారకలు ఆర్చుకుపోయినాయి. మొగిళ్లు మరింత నల్లబడి నిట్టూర్పు దొంతరలైనాయి. చీకట్లు తలలు వాల్చుకున్నాయి. ఇలా అమూర్తమైన వాటికి ఆకారాన్ని కల్పిస్తూ గాలి చలించిపోవడాన్ని కృష్ణశాస్త్రి</p>
<blockquote><p>&#8216;అపుడు బ్రతుకొక్కటె యేడుపైన గాలి<br />
రిచ్చవడి వట్టి పసిపాప లీల మౌన<br />
యానమున బరి సుప్త పత్రాళి నొదిగి<br />
పొంచి చూచుచు చలియించి పోయినాడు&#8217;</p></blockquote>
<p>ఏకాంతంలో మానవుని మానసిక స్థితిని ప్రకృతిలో సమన్వయించి ప్రవాసిని చిత్రించారు.</p>
<p>వేసటేలేని వెర్రి అన్వేషణం కవిలో అశాంతిని కలిగించింది. అసలు సౌందర్యంలో ఈ అశాంతిని కలిగించే శక్తి ఎక్కువగా ఉంది. సౌందర్యాన్ని ఆకర్షకంగా చేసే సూత్రం ఇదే. సౌందర్య సృజన చేయగల కళాకారులు లోకంలోని సౌందర్యంతో తృప్తిపడరు. దీన్ని ప్రపంచం చంచలత్వం అంటుంది. సౌందర్యం ఎవరిని కదిలించలేదో, ఎవరికి సౌందర్యం చాలా అల్ప విషయమో వాళ్లకి కవి బాధ అర్థం కాదు. అందుకే చలంగారు &#8216;కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ&#8217; అని అన్నారు.</p>
<p>కళాకారుల మనసులోని విలువలు ప్రత్యేకమైనవి. ఆశలూ, స్వప్నాలూ అనంతమైనవి. ఈ గుణం వాళ్లు ఆరాధించే సౌందర్య దేవతలోనే ఉంది. సౌందర్యమూ, ఆనందమూ మాయ కావు. అందవికారమూ, అసహ్యమూ మాయ. నిర్మలత్వమూ, ఏదో అర్థం కాని నూతనత్వమూ సౌందర్యం. అందుకే కృష్ణశాస్త్రిగారు,</p>
<blockquote><p>&#8216;అంతమే లేని నా యాత్రా పథాన నా<br />
పదచిహ్నములు వోలె పడియున్న వెన్నెన్నో<br />
అడుగుజాడలు మదీయార్ద్ర హృదయమ్ములో<br />
నిశికడుపులో తారలై, నిశ్శబ్ద<br />
వాటిలో చిరుపాటలై,&#8217;</p></blockquote>
<p>అన్నారు. కవి ఇక్కడ అనంత ప్రయాణీకుడు అవుతున్నాడు. అంటే సౌందర్య ధ్యానంలో ఈ ప్రపంచం వెనకాల అసలు సత్యం ఏమిటో తెలుసుకోవాలనే ఆకలి ఎక్కువైంది. తాను ఎంత దూరం నడిచినా, తన పాద చిహ్నాలు కరుణతో నిండిన తన హృదయంలో కనిపిస్తున్నాయి. అవి కవికి ఆశాజనకంగా ఉన్నాయి &#8211; చీకటి కడుపులో నక్షత్రాల్లా, నిశ్శబ్దంలో చిరుగీతుల్లా. తన ప్రయాణానికి రెండు పక్కలా నిలబడ్డ చెట్లూ, పక్షులూ ఇవన్నీ &#8216;సంజియ కావి వింతలై&#8217; నశించి పోతాయని కవికి బాధ కలిగిస్తున్నప్పటికీ, ఏదో తెలియని ఆశ ముందుకే నడిపిస్తుంది.</p>
<p>1925 &#8216; ప్రవాసం&#8217;లోని ఏ ఖండికకీ శీర్షిక లేదు. తనని అర్థం చేసుకోని లోకాన్ని గురించి కృష్ణశాస్త్రి ఇలా అంటారు.<br />
&#8216;కొందరు స్వేచ్చా విహంగం అన్నారు. కొందరు కుటిల పన్నాగం అన్నారు. కొందరు మూఢ దివాంధం అన్నారు. నేను మాత్రం నా యథార్థ స్వరూపం అజ్ఞాత దుఃఖంలో పదిలపరచాను&#8217;</p>
<p>ఎవరికోసమైతే ఆరాటపడతారో, ఎవరి భవిష్యత్తుని గురించి ఆందోళన పడతారో, ఎవరి మంచి కోరి కష్టాలని వరిస్తారో వారినుంచే విరోధం పొంగుతుంది. ప్రపంచంలో ప్రతి కళాకారుడికీ, తత్వవేత్తకీ, ప్రవక్తకీ ఎదురైన పరిస్థితి ఇదే. అయినా కళాకారులు హాలాహలాన్ని దిగమింగి, అమృతాన్ని ప్రపంచానికి అందించాలనే దృఢ సంకల్పంతో ఉంటారు. తాత్కాలికమైన ప్రయోజనాలు ఆశించే వారికీ శాశ్వతమైన సత్యాన్ని ప్రకటించాలని తపించేవారికీ మధ్య యుగయుగాలుగా సంఘర్షణ ఉండనే ఉంది. వెలుగుకోసం చీకటితో సంఘర్షించడమే ధీరులు చేసే పని. అదే ప్రవాసంలో కృష్ణశాస్త్రి ప్రదర్శించారు.</p>
<p>కవి సముద్ర తీరాన నిలబడి సముద్రునితో అంటాడు. &#8216;ఎంత బాధ నీది! లోకంలో దుఃఖమంతా నిజంగా నీదే . ఈ విశాల విశ్వంలో ఉన్న ఆర్తి అంతా నీదే కదా! నీవు ప్రవాసులలో ఓ చక్రవర్తివి&#8217; అని అంటాడు.</p>
<p>అనంతమైన వేదన కవికి ప్రేమ కిటికీలు తెరచి ప్రియురాలిని సృష్టించుకొనే శక్తినిస్తుంది.</p>
<p>కావ్య కల్పనలో, కావ్య సృజనలో కరుణకి తగిన స్థానం ఉంది. &#8216;ఏకోరసః కరుణ ఏవ&#8217; కనుక విశ్వప్రేమనూ, కరుణనూ ఇతరుల హృదయాలలో కలిగించటమే కావ్యానికి ముఖ్యమైన ఉద్దేశ్యమని కృష్ణశాస్త్రిగారి అభిప్రాయం. చలంగారు కృష్ణశాస్త్రిగారి ఈ పరిస్థితిని &#8216;శృంగార బాధ&#8217; అని అన్నారు. అంతేకాదు. శృంగారాన్ని కళగా భావించినవారని అన్నారు. శృంగార బాధే కరుణకి దారితీసింది. ఏ రసమైనా కరుణతో ప్రపంచాన్ని ప్రేమించగలిగినప్పుడే కళగా వన్నెకెక్కుతుంది.</p>
<p>&#8216;చక్కని శరీరానికి సుఖమూ, చక్కని ఆత్మకు దుఃఖమూ కావాలి. అన్నాడొక తత్వవేత్త. కనుక అశ్రువులలోనే ఆనంద సందేశం ఉంది, ఆశాజ్యోతి ఉంది’ అని అంటారు కృష్ణశాస్త్రి.</p>
<p>మనసు ఎంత బాధకి గురైతే అంత పక్వానికి వస్తుంది. తిక్కన నిర్వచనోత్తర రామాయణం రాసేనాటికి, మహాభారతానువాదం చేసేనాటికీ ఎంత పరిణామానికి లోనయ్యాడో అందరికీ తెలిసినదే. ఆ కాలం నాటి ఆంధ్రదేశంలోని పరిస్థితులు ఆయన హృదయాన్ని ఎంత కలతకి గురిచేశాయో గ్రహించగలం. అంటే కళలోని రసం అమృతస్థితికి చేరాలంటే కళాకారుని మనసు ఎంత మధనానికి గురైతే అంతమంచిది. కీట్స్, షెల్లీ వంటి కవులు ఆదర్శ సౌందర్య లక్ష్య సాధనలో దుఃఖాన్ని అనుభవించినవారే.</p>
<blockquote><p>&#8216;వెదకి వేసారి నా వెర్రిబ్రతుకెపుడేని<br />
తుది రేయి కనుమూయనా<br />
బేలయై<br />
నిదుర బరువుల క్రుంగునా<br />
మరపు మసకల దారి తెరచికొని కలయేదో<br />
విరిసికొని పరతించును,<br />
కారురా<br />
తిరి కొనల మెరపించును&#8217;</p></blockquote>
<p>అంటారు కృష్ణశాస్త్రి. ఈ ప్రపంచంలో తన ఆదర్శానికి సరిపోయే ప్రేమనీ, సౌందర్యాన్ని వెదకి వెదకి చివరికి బ్రతుకు ముగిసిపోతుందేమోననీ, మనసు కుంగిపోతుందేమోననీ అనుకుంటున్నాడు కవి. కానీ, మరపు మసకల దారిలో &#8216;కల&#8217; లా పలకరిస్తుందన్న విశ్వాసం, కారు రాతిరి కొనలని మెరిపిస్తుందన్న ఆశ కవిని నిలబెడుతున్నాయి.</p>
<blockquote><p>&#8216;వనరు చేడ్వగలేను, చచ్చి చావగలేను<br />
కనలేని వెలుగుకొరకై<br />
ఎన్నడును<br />
కనరాని దానికొరకై&#8217;</p></blockquote>
<p>కృష్ణశాస్త్రి అన్వేషించే వెలుగు సౌందర్యం. అదే విశ్వప్రేమ. అసలు కవులందరూ అన్వేషించేది వెలుగే. &#8216;పెంజీకటి కవ్వలి వెలుగుల&#8217; కోసం ఆర్తితో భాగవతం రాసిన పోతన వెలుగు &#8216;మోక్షం&#8217;. &#8216;మతములన్నీ మాసిపోవును. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును&#8217; అన్న గురజాడ ఆశించిన వెలుగు &#8216;జ్ఞానం&#8217;. అలాగే కృష్ణశాస్త్రి ఆకాంక్షించేది ప్రేమ. సుందరమైన జీవితం. &#8216;కవులకి బాధలో ఆనందం, వేదాంతులకి ఆనందంలో బాధ&#8217; ఉంటుందంటారు చలం. కవులు తమ అనుభవాలని సృజనకి తొలిమెట్లుగా భావిస్తారు. కనుక బాధ ఆనందాన్నే కలిగిస్తుంది. బాధించే సత్యాలు విచ్చుకుంటున్న కొద్దీ ఆనందం అధిక మౌతూ ఉంటుంది.</p>
<p>మానవుడి వెతుకులాట కృష్ణశాస్త్రి పాట అని చెప్పవచ్చు. &#8221; ఆయన కవిత్వమంతా గొప్ప అన్వేషణ. అందుకే అంత దిగులూ, అంత నిరాశ. వెలుగు ఇంత అందరానిది కావడం చేతనే, All great art is tragic. కానీ ఈ అశాంతి, ఈ వెలుగు కొరకు ఏడుపు &#8211; దీనికంతా గొప్ప అర్థం, సంతోషం ఉంటూంది&#8217; అంటారు చలం.</p>
<p>కృష్ణశాస్త్రి స్వతహాగా సౌందర్యరసైకజీవి. అనుభవించిన దానిని లోపలికి తీసుకొని దాని అందాన్ని రసంగా తీసి పలికేవాడే కళాకారుడు. ఇక్కడ కవి ప్రియురాలిని మనసునిండా నింపుకొని, కన్నీళ్లతో కడిగి స్వచ్ఛమైన సౌందర్యంగా సృష్టించే తపనలో శరీరాన్ని దహింప చేసుకుంటున్నాడు.</p>
<blockquote><p>&#8216;నాకుగాదులు లేవు<br />
నాకుషస్సులు లేవు<br />
నేను హేమంత కృష్ణానంత శర్వరిని<br />
నాకు కాలమ్మొక్కటే<br />
కారురూపు,నా శోకమ్ము వలెనె, నా బ్రతుకు వలెనె<br />
నా వలెనె&#8217;</p></blockquote>
<p>కృష్ణశాస్త్రి కవిత్వ కళ విషాదాన్ని చిత్రించే సన్నివేశాలలో బహుముఖాలుగా విస్తరిస్తుంది. ప్రపంచమంతా ప్రణయోత్సవాలతో ఆనందంగా ఉంటే కవికి తన పరిస్థితి &#8216;హేమంత కృష్ణానంత శర్వరి&#8217; గా అనిపించింది. చీకటిలో తడిసిన నది గడ్డకట్టినప్పటి స్థితి ఇది. కవి తన పరిస్థితిని పాఠకుని మనస్సులో పునస్సృష్టి చేయగలగటం భావకవితా ధోరణి.</p>
<p>కృష్ణ పక్షంలో కవి శోధన కనిపించింది. ప్రవాసంలో కవి సాధన కనిపిస్తుంది. ప్రియురాలిని సృష్టించుకోవాలనే దీక్షతో కనిపించిన ప్రతి సౌందర్యాన్నీ పదిలపరచుకుంటున్నాడు.</p>
<p>విశ్వమంతా వ్యాపించిన కవి నిర్వేద తమస్సు ఒక స్త్రీమూర్తిగా రూపు దిద్దుకుంటుంది.</p>
<p>సూఫీ తత్వంలో ప్రేమ గురించి ఇలా అంటారు. &#8216;Love is the complete consecration of the desires of the heart to the purpose of god&#8217; &#8211; అంతే కాదు. Rumi మాటల్లో చెప్పాలంటే, This is Love to fly heaven wards. Union గురించి ఇలా అంటారు. ‘With two figures but with one soul, thou and I; Individuals no more, but mingled in ecstasy, joyous and serene, thou and I&#8217; హృదయంలోని కోరికలన్నిటినీ కాల్చేసి, తనని తాను అర్పించుకొని అద్వైతసిద్ధిని సాధించటం సూఫీ తత్వం. ఈ భావాన్ని కృష్ణశాస్త్రి,</p>
<blockquote><p>&#8216;కంట కురిసిన కార్చిచ్చు మంట యేళ్ల<br />
కాలినుసియై నశించే వాంఛా లవాలె;<br />
ఏరెరుంగుదురని ఏ యెడారి దార్ల<br />
నింకెనో చుక్కతడి జాడయేని లేక&#8217;</p></blockquote>
<p>కవికి ఇప్పుడు ఏ కోరికలు లేవు. ప్రేయసీ సాక్షాత్కారం కోసం శరీరాన్ని దుఃఖంలో కాలుస్తున్నాడు కవి. &#8216;మంటయేళ్లు&#8217; అన్న పదం ద్వారా ఈ భావాన్ని సూచిస్తున్నారు కృష్ణశాస్త్రి. మనస్సు చేసే తపస్సు సౌందర్య దేవతకోసమే.</p>
<blockquote><p>&#8216;వలపు టాకలి స్రుక్కు నా బ్రతుకు మీద<br />
ఇనుప పాదాలనిడి లోకమిపుడు నడుచు&#8217;</p></blockquote>
<p>ప్రేమకోసం పరితపించిన ప్రవాసి బ్రతుకుని లోకం ఎంత కర్కశంగా బాధించిందో తెలుస్తుంది. తనని తాను దుఃఖ కుటీరంలో దాచుకున్న ఏకాంత స్థితిని కవి</p>
<blockquote><p>&#8216;రేయి కడుపున చీకటి చాయవోలె<br />
తమసుటెడద దివాంధగీతము విధాన<br />
ఘూకరావాన వలవంత రేకరీతి<br />
నా విషాదమ్ములో దాగినాడ నేనె&#8217;</p></blockquote>
<p>తనని ప్రేమించేవారూ, తన బాధని అర్థం చేసుకునేవారూ లేరనే పరిస్థితిలోంచి పుట్టిన నిర్వేదమిది. &#8216;నా విషాదమ్ములో దాగినాడ నేనె&#8217; అనే వాక్యం కృష్ణశాస్త్రి కవితా తత్వాన్ని ఆవిష్కరిస్తూ కరుణ రసం నిండుగా పండిన సన్నివేశమిది.</p>
<p>కవి ప్రేయసితో అంటాడు, &#8216;నీ దీర్ఘ ధమ్మిల్ల నీల వల్లీ చాయ పొడిచికొని, నిదుర చెర విడిచి, పూవులు నేడు&#8217; కనిపిస్తున్నాయి. &#8216;తళతళపాట&#8217; పాడుతున్నాయి. ఈ ఆహ్వానం కవి భరించలేకపోతున్నాడు. ఇది సురభిళాహ్వానం. చీకటికి అలవాటు పడినవాడు వెలుగుని భరించలేనట్లుగా, అనుకోని ఈ ఆహ్వానం కవి భరించలేకపోతున్నాడు. &#8216;నటియించు ఆపూవులెటు నవ్వుచున్నవో! తురిమి విసరుమువాని ఎరుగ నేరని దూరదూరాలకో, రహస్తీరాలకో, చెలీ&#8217; అంటాడు. విభ్రాంతికి లోనైన కవి &#8216;నా సఖీ! నీ ప్రేమ శాపమీ అపూర్వ నరకయాతనాఖర్వతాపము&#8217; అంటున్నాడు.</p>
<p>&#8216;ప్రవాసంలో కవి జీవితానుభవ యవ్వనోదయము మాత్రము ఇప్పుడు కొంత చిక్కబడింది. నాటి కోవెల కొలనుతనము నేడు హేమంత శృంఖలోచితమైన కొత్త వెలుగులకు తావలమైనది. ఈ ఐక్యనిధి ఈ కావ్యాల ఆనుషంగిక పరిశీలనంలో ఫలించినట్టిది&#8217; అని కొంపెల్ల జనార్దనరావు అన్నారు.</p>
<p>కృష్ణశాస్త్రిగారు కృష్ణపక్షం ఖండికలు చాలా వరకు వసంతఋతు నేపథ్యంలో రచించారు. మానవ జీవితంలోని రకరకాల అనుభవాలకి ప్రతిబింబాలు ఋతువులు. ప్రకృతిలోని పరిణామం కవి హృదయ పరిణామంలో కనిపిస్తుంది. కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి క్రమపరిణామంగా భావించి పరిశీలిస్తుంటే కవి హృదయవికాసము బోధపడుతుంది.</p>
<p>కృష్ణపక్షంలో ఉన్నంత అందుబాటులో ఉండవు ప్రవాసంలో రచనలు. దానికి కారణం కృష్ణశాస్త్రిగారు నా గొప్ప రచన అనే వ్యాసంలో ఇలా అంటారు. &#8216;అన్వేషణ ఆగిపోలేదు. ఇదివరకు ఎక్కడికీ చూడలేనివాడు ఇంక లోపలికి చూడటం ప్రారంభించాడు. చూపులు పగలు పైకి పరుగెత్తుతాయి. రాత్రి తలతిప్పుకొని లోపలికి వెళ్ళగించుకొని చూస్తాయి.&#8217;</p>
<p>ఏ కళాకారుడైనా సృజనాత్మక భావనని అంతర్దృష్టితో మేళవించినప్పుడే సౌందర్యాన్ని సృష్టించగలుగుతాడు.</p>
<p>&#8216;ప్రేమకంటే గొప్ప అనుభవం మానవుడికి లేదు. ఇది వరకు అసమగ్రంగా ఉన్న నా ప్రకృతి నీవు నాలోకి వచ్చాక సమగ్రంగా అయింది.&#8217; అంటాడు ప్రెమికుడైన కవి&#8217; అని అంటారు కృష్ణశాస్త్రి.</p>
<p>మనిషి ప్రేమలోనే ఆనందాన్ని పొందగలుగుతాడు. అదే శాశ్వత సత్యం. అదే కడపల. అనంతము అద్వైతము అయినది ప్రేమ. ప్రేమలో ఉన్న కవికి దుఃఖం సౌందర్యంగా పర్యవసిస్తుంది.</p>
<blockquote><p>&#8216;వినరావీ విభావరీ<br />
వేలాశాలల నీమృదు<br />
వసనాంచలముల గుసగుసలో</p>
<p>మసలు చరణ మంజీరము<br />
కొసరు జాలి పలుకరింతలో!</p>
<p>ఈ కుటీర ముఖద్వార<br />
మిందే వ్రేలాడి సగము<br />
వాడి, విరహతోరణమ్మునై</p>
<p>వలవంత సడలి నేలజీ<br />
రాడి యెన్నినాళ్లు మనుదునో!<br />
&#8230;.<br />
నీ మనోజ్ఞ కాంచన కాం<br />
చీమణి ఘంటా గళములు<br />
ఏకాంతము కరగ మ్రోయగా</p>
<p>విన నరచే బ్రదుకు దాల్చి<br />
యెడద మోత కెంత యేడ్తునో&#8217;</p></blockquote>
<p>కృష్ణశాస్త్రిగారి సహజకళా వికాసం, శిల్పం అనన్య సామాన్యమనిపించే పాట యిది.</p>
<p>&#8216;ఆకసమాలోకనముగా లోకమెల్ల వీనుగ కాలాంతమునకు కాచియుందునా&#8217; శాశ్వతమైన సత్యాన్ని ఆవిష్కరించేటప్పుడు కృష్ణశాస్త్రి కవిత ఉన్నత శిఖరాలని అందుకుంటుంది.</p>
<p>ప్రియురాలి మృదువసనాంచలముల గుసగుసలు వినటానికి కవి చెవులని దిశాంతాలదాకా లాగి వింటాడు. దరిద్ర హేమంతంలో చైత్ర శుభోత్సవ విభాత కళ్యాణం కోసం చూస్తాడు. &#8216;అన్వేషణలో ఎంత అలసట ఉందో అంత రుచి ఉంది&#8217; అంటారు కృష్ణశాస్త్రి.</p>
<blockquote><p>&#8216;ఇది ముగియబోని ఏ అర్థమెరుగరాని<br />
వేసటేలేని వెర్రి అన్వేషణమ్ము&#8217;</p></blockquote>
<p>సౌందర్యం అతిలోకమైనది. తన ఆదర్శానికి సరిపోయేది. అందుకే తనని తాను ఇలా ప్రకటించుకుంటాడు.</p>
<blockquote><p>&#8216;నా నివాసమ్ము తొలుత గంధర్వలోక<br />
మధుర సుషమా సుధాగాన మంజువాటి<br />
ఏనొక వియోగ గీతిక.&#8217;</p></blockquote>
<p>గంధర్వలోక సౌందర్యానికీ, మానవప్రేమకీ ముడిపెట్టి మానవలోకాన్ని అందంగా తీర్చి దిద్దాలనే తపన కవిలో కనిపిస్తుంది.</p>
<p>కవికి ఎంత ఏకాకితనం ఉందో అంత ఆత్రత, అంత ఆర్ద్రత ఉన్నాయి. అగ్నిపరీక్ష పూర్తయింది. తాను పరుచుకున్న మరణశయ్యపై తానే వాలి, తన చితిని తానే పేర్చుకొని ప్రవాసియైన కవి మరణిస్తాడు.</p>
<blockquote><p>&#8216;ఏను మరణించుచున్నాను &#8211; ఇటు నశించు<br />
నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు&#8217;</p></blockquote>
<p>నిండు యౌవనంలో మరణించాలన్న ఆలోచన కవికి ఎందుకు రావాలి? అని ప్రశ్నించుకొని ప్రసిద్ధ నవలారచయిత బుచ్చిబాబు ఇలా అంటున్నారు. &#8216;ఈ పద్య కావ్య సంపుటంలో &#8216;నేను&#8217; అన్నది ఒక వ్యక్తిగా కవి కాడనే అనుకుంటున్నాను. &#8216;ఏను మరణించుచున్నాను&#8217; అంటే &#8216;తను&#8217; అని కాదు. తనలాంటి వాళ్లెందరోనని. ప్రత్యేకమైన అంతరంగ జగత్తులో &#8211; శరీరానికి బంధింపబడ్డ వ్యక్తి &#8211; విముక్తుడై తన వ్యక్తిత్వాన్ని బాధతో కుంగదీసి, నలిపి, ముక్కలు చేసి ఇతరుల అంతరంగ జగత్తులో వెదజల్లి, వ్యక్తిగా తను మాయమై &#8211; ఒక శక్తిగా ఇతరులలో తన్ను చూసుకొని దాగిలి మూతలాడటం లాంటిది&#8217;</p>
<p>బుచ్చిబాబుగారు &#8216;నాకొరకు చెమ్మగిల్ల నయనమ్ము లేదు&#8217; అన్న కృష్ణశాస్త్రిగారి వాక్యం ప్రేరణగా &#8216;చివరకు మిగిలేది&#8217; నవల రాశానని చెప్పారు. &#8216;ఇంతకంటే విషాదకర గీతం ఏదుంది&#8217; అన్నారు. ఈ సమస్య బుచ్చిబాబుని బాధించింది. వ్యక్తిగతమైన విముక్తి తన నవలకి ప్రేరణ అని చెప్పుకున్నారు.</p>
<p>జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడం కూడా కాదు. ప్రేమించలేకపోవడమని బుచ్చిబాబు అభిప్రాయపడ్డారు.</p>
<blockquote><p>&#8216;నా కాష్టాల రేగుమంట<br />
మును బ్రతుకునట్ల నాదేహమును దహింపు<br />
పడదులే ఆర్పగా నొక బాష్పమేని&#8217;</p></blockquote>
<p>కృష్ణశాస్త్రి కృష్ణపక్షములోని కవికుమారుని తన బ్రతుకులాగే తన దేహాన్ని దహిస్తున్న కాష్ఠజ్వాలలలో ఎవరినీ కన్నీరు కార్చొద్దంటున్నాడు. సూఫీ తత్వంలో సత్యాన్వేషణం ఇలా ఉంది. &#8216;Probe through the surface self and discover the transcendent self to rend the veils in Sufi language perceive the truth.&#8217;</p>
<p>ఆనందాన్వేషణలో పడ్డ కవి ప్రేమని పొందలేక, ప్రేమించలేక దుఃఖంతో శరీరాన్ని బాధించి, కాల్చి హృదయాన్ని ప్రేమతో నింపుకున్నాడు. ప్రేమే సత్యం. ఇక్కడ కవి చనిపోవడమన్నది ప్రతీక. వాస్తవమేమిటంటే వేదన నుండి విముక్తిని పొందటం.</p>
<p>&#8216;టాగూర్ కలలు&#8217;, సౌందర్యాన్వేషణ, సమన్వయ ప్రయత్నం యీనాటి యువకవీరులకి ఉత్త పనికిరాని మూలుగు అయిపోయింది. కృష్ణశాస్త్రి బాధ ఉత్త ఉన్మాదంలాగు కనబడుతోంది.&#8217; అని అంటారు చలం.</p>
<p>ఈ సృష్టిలోని ఏ అణువు మన హృదయాన్ని స్పందింప జేసినా అది అనంతత్వాన్ని అన్వేషించేలా చేస్తుంది. చలం గారు ఇంకా ఇలా అంటారు.</p>
<p>&#8216;ఈ నాటికి కాకపోయినా, మీ మనోనేత్రం తెరుచుకునేనాటికైనా, ఎప్పటికో జన్మలుంటే, ఎన్ని జన్మలకో, కృష్ణశాస్త్రి ఈనాడు పడుతున్న శృంగార బాధ, సంకుచితత్వాన్ని దాటి వ్యాపించాలని పడే వేదన &#8211; మీరు మాత్రం తప్పించుకోగలరా? ఈనాటి మీ చీకటి అన్వేషణకి తోవలో వెలుగు వెయ్యాలని శాస్త్రిగారి ప్రవాసానికి అర్థం&#8217;</p>
<p>కృష్ణశాస్త్రి భావకవి. భావకవులకి భావన ప్రాణం. మానవులని బాధించే జీవిత సత్యాలని అన్వేషించడానికి కవులు భావనకి అగ్రతాంబూలం ఇచ్చారు. మెదడుకి అందని సత్యం హృదయానికి లభిస్తుందని వీరి విశ్వాసం. శాశ్వత సత్యమైన ప్రేమని, కవి తన శరీరాన్ని నలగ గొట్టడం ద్వారా తెలుసుకోగలిగాడు. &#8216;కృష్ణపక్షం&#8217; చీకటిలో ప్రయాణం ప్రారంభించి, ప్రవాసంలో సంకుచితత్వాన్ని దాటి, విశ్వవ్యాపితమైన ప్రేమని రక్షించగలిగాడు. సాధన పూర్తయింది. అదే సౌందర్యం, భావకవులు అన్వేషించే సత్యం. అది శాస్త్రానికి, తర్కానికి, వేదాంతానికి లొంగేదికాదు. అందుకే భావకవులు అంతర్దృష్టితో భావనకి పదును పెట్టుకుని సృజన సాగించారు. ఈ పరంపరలోనే కృష్ణశాస్త్రి సౌందర్య ఆరాధనలో పడ్డారు.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=12212</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>కృష్ణశాస్త్రి సాహిత్యం &#8211; సౌందర్యతత్వం</title>
		<link>http://vaakili.com/patrika/?p=11960</link>
		<comments>http://vaakili.com/patrika/?p=11960#comments</comments>
		<pubDate>Wed, 31 Aug 2016 21:32:20 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[డా. సీతారామయ్య (రామసూరి)]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=11960</guid>
		<description><![CDATA[<p>కృష్ణశాస్త్రి కవిత్వంలో దుఃఖం కొత్త తరహాలో రూపుదిద్దుకుంది. భావకవులు బాధని వరంగా భావించారు. రొమాంటిక్ కవులూ, ఫ్రెంచి కవులూ తమ తమ కవితాప్రస్థానంలో దుఃఖానికి తగిన స్థానాన్నిచ్చారు. ఆంగ్ల సాహిత్యంలో ఈ రకమైన దుఃఖాన్ని రొమాంటిక్ మెలంకలీ అంటారు. దీని తత్వం ఇలా ఉంటుంది.</p> <p>‘Longing for the unattainable ideal; and the feeling that the sensitive artistic genius is bound to be destroyed by the material crowd&#8217;</p> <p>ప్రపంచం నిర్జీవంగా కనిపించి, కృష్ణశాస్త్రి సంధ్యా సమీరాన్ని ఉద్దేశించి ఇలా అంటారు.</p> <p>‘ఓయి సంధ్యా సమీరణా, రేయి తోడ<br /> కారు చీకటి తోడ దుఃఖమ్ము కూడ<br /> పరువు పరువున నాకొరకరుగు దెంచు<br /> నీదు నునులేత రెక్కలమీద వడిగ<br /> నెత్తికొన పోవరాదె నన్నెచటి కేని<br /> నిత్య తేజోమయానంద నిలయమునకు&#8217;</p> <p>ఆదర్శ సౌందర్యం కోసం అన్వేషించే కవి దుఃఖాన్ని ఆహ్వానిస్తున్నాడు. అసలు ఈ దుఃఖం స్వభావమేమిటో పరిశీలిస్తే కాని, కవి దుఃఖించటానికి కారణం తెలీదు.</p> <p>కవి భార్య విషయంలో పాపం చేశాననే బాధతో, బాధని అనుభవించి తీరాలనే దృఢ నిశ్చయంతో జీవించి ఉన్నాడు. ఫ్రెంచి కవి బోదెలైర్ బాధ గురించి ఇలా అంటాడు. &#8216;Suffering was a new lyric theme in 19th century French Poetry&#8217;. మనిషి తను చేసిన పాపాన్ని గుర్తించి, బాధతో, కన్నీళ్లతో హృదయాన్ని పరిశుభ్రపరచుకోవాలని అంటాడు.</p> <p>బాధ కవికి అంతర్దృష్టిని ఇస్తుంది. అంతర్దృష్టి భావనని మేల్కొలుపుతుంది. అంతే కాదు, సృజనకి పదును పెడుతుంది. సత్య దర్శనానికి మార్గాలు విచ్చుకునేలా చేస్తుంది. బాధపడేవాడు లోపలికి కూడా చూసుకుంటాడు. అక్కడి అసమగ్రతనీ, అజ్ఞానాన్నీ అంధకారాన్నీ చూసి, ఇతరులతో తనకుగల సామ్యాన్ని గ్రహిస్తాడు. అణకువతో కుంగిపోతాడు. దీనివలన ప్రేమ వికసిస్తుందన్నది కృష్ణశాస్త్రి తాత్వికత. ఆయన దార్శనికత ఏమిటంటే, ప్రేమ, వేదన రెండూ లోకానికి రెండు కళ్లు. ప్రేమార్హులైన ప్రేయసీప్రియులకు దుఃఖమే [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">కృ</span>ష్ణశాస్త్రి కవిత్వంలో దుఃఖం కొత్త తరహాలో రూపుదిద్దుకుంది. భావకవులు బాధని వరంగా భావించారు. రొమాంటిక్ కవులూ, ఫ్రెంచి కవులూ తమ తమ కవితాప్రస్థానంలో దుఃఖానికి తగిన స్థానాన్నిచ్చారు. ఆంగ్ల సాహిత్యంలో ఈ రకమైన దుఃఖాన్ని రొమాంటిక్ మెలంకలీ అంటారు. దీని తత్వం ఇలా ఉంటుంది.</p>
<p>‘Longing for the unattainable ideal; and the feeling that the sensitive artistic genius is bound to be destroyed by the material crowd&#8217;</p>
<p>ప్రపంచం నిర్జీవంగా కనిపించి, కృష్ణశాస్త్రి సంధ్యా సమీరాన్ని ఉద్దేశించి ఇలా అంటారు.</p>
<blockquote><p>‘ఓయి సంధ్యా సమీరణా, రేయి తోడ<br />
కారు చీకటి తోడ దుఃఖమ్ము కూడ<br />
పరువు పరువున నాకొరకరుగు దెంచు<br />
నీదు నునులేత రెక్కలమీద వడిగ<br />
నెత్తికొన పోవరాదె నన్నెచటి కేని<br />
నిత్య తేజోమయానంద నిలయమునకు&#8217;</p></blockquote>
<p>ఆదర్శ సౌందర్యం కోసం అన్వేషించే కవి దుఃఖాన్ని ఆహ్వానిస్తున్నాడు. అసలు ఈ దుఃఖం స్వభావమేమిటో పరిశీలిస్తే కాని, కవి దుఃఖించటానికి కారణం తెలీదు.</p>
<p>కవి భార్య విషయంలో పాపం చేశాననే బాధతో, బాధని అనుభవించి తీరాలనే దృఢ నిశ్చయంతో జీవించి ఉన్నాడు. ఫ్రెంచి కవి బోదెలైర్ బాధ గురించి ఇలా అంటాడు. &#8216;Suffering was a new lyric theme in 19th century French Poetry&#8217;. మనిషి తను చేసిన పాపాన్ని గుర్తించి, బాధతో, కన్నీళ్లతో హృదయాన్ని పరిశుభ్రపరచుకోవాలని అంటాడు.</p>
<p>బాధ కవికి అంతర్దృష్టిని ఇస్తుంది. అంతర్దృష్టి భావనని మేల్కొలుపుతుంది. అంతే కాదు, సృజనకి పదును పెడుతుంది. సత్య దర్శనానికి మార్గాలు విచ్చుకునేలా చేస్తుంది. బాధపడేవాడు లోపలికి కూడా చూసుకుంటాడు. అక్కడి అసమగ్రతనీ, అజ్ఞానాన్నీ అంధకారాన్నీ చూసి, ఇతరులతో తనకుగల సామ్యాన్ని గ్రహిస్తాడు. అణకువతో కుంగిపోతాడు. దీనివలన ప్రేమ వికసిస్తుందన్నది కృష్ణశాస్త్రి తాత్వికత. ఆయన దార్శనికత ఏమిటంటే, ప్రేమ, వేదన రెండూ లోకానికి రెండు కళ్లు. ప్రేమార్హులైన ప్రేయసీప్రియులకు దుఃఖమే కిరీటమంటాడు.</p>
<p>కృష్ణశాస్త్రి విరహానిదో ప్రత్యేక తరహా. అది ప్రబంధాల విరహం లాంటిది కాదు. అక్కడ విరహానికి ఉపశమనం ఉంది. ఇక్కడ విరహాగ్నిని వృద్ధి చేయడం ఉంది. దీనివలన దుఃఖం పెరుగుతుంది. దుఃఖం ఆనందస్థాయికి చేరుకుంటుంది. &#8216;ప్రాణకాంత&#8217; ఖండికలో మలయ పవనాలనీ, హిమకణాలనీ, తేనేచినుకులనీ, తుమ్మెదలనీ, కోయిలనీ పిలిచి మరీ విరహాన్ని వృద్ధి చేసుకుంటున్నాడు కవి.</p>
<blockquote><p>&#8216;ప్రాణమునకును ప్రాణమౌ ప్రాణకాంత<br />
యెడద శోధించి యశ్రులై పడిరె యిచట&#8217;</p></blockquote>
<p>అని అనడంలో దుఃఖం పట్ల కవికి ఎంత ఆసక్తి ఉందో తెలుస్తుంది.</p>
<p>ఆంగ్లకవులలో కీట్స్ &#8216;Ode on Melancholy&#8217; అనే ఖండికలో</p>
<blockquote><p>&#8216;But when the Melancholy fit shall fall<br />
Sudden from heaven like a weeping cloud&#8217;</p></blockquote>
<p>అని రచిస్తే, కృష్ణశాస్త్రి</p>
<blockquote><p>&#8216;ఎంత బరువయ్యెనో గాని యెడద వెలికి<br />
తొలగి పారని దుఃఖాశ్రు జలమువలన<br />
ప్రావృడంభోధరస్వామి! నీవు కూడ<br />
నావలెనె జాలి వొడమ వాపోవుచుంటి&#8217;</p></blockquote>
<p>అని అంటూ, &#8216; జీవనంపు భారము తొలంగి పోవ నెవ్వారికేని కోరి నీ సొదలను చెప్పికొందువేమొ -&#8217; అని అంటారు.</p>
<p>దుఃఖం కళాకారుని మనస్సుని నిశితం చేస్తుంది. ప్రకృతితో తాదాత్మ్యం చెంది, మానవ దుఃఖాలకి శాశ్వతమైన అనుకంప కోసం వెతికే తపన కలిగిస్తుంది.</p>
<p>Keats రచించిన &#8216;Ode on Melancholy&#8217; గురించి William H. Marshall ఇలా అంటాడు.</p>
<blockquote><p>&#8216;Here the speaker, by contemplating the paradox that for man melancholy is at the heart of his brief vision of Beauty, creates the self absorbing poem, a work of art and thus a form of beauty, that will defy time, from the joylessness of his first recognition he derives joy in art and a moment of truth, at the heart of which perception he again finds his melancholy recognition of his own human impermanence.&#8217;</p></blockquote>
<p>ఆనందంలేని స్థితిలోంచి సత్య దర్శనం కోసం కళలో పొందే ఆనందం . ఇదే విషాద సుఖం.</p>
<p>కృష్ణశాస్త్రి &#8216;దుఃఖము&#8217; అనే ఖండికలో రోజంతా సూర్యుని వేడి కిరణాలకి వేగి, చీకటి పడగానే చల్లగా కనుమోడ్చిన నా హృదయకుసుమం నీకు జాలి కలిగించడం లేదా?</p>
<p>&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;..నీవేల స్వప్న<br />
మటుల లోలోన కలచి, చీకటి ముసుంగు<br />
నొత్తిగిలద్రోసి, వదలని పొత్తు గోరి<br />
తొంగి తొంగి చూచెదవయ్యో! దుఃఖమా! యొ<br />
కించుకైనను జాలి వహించవేమి? అంటారు.</p>
<p>ఆయన హృదయసుమము ఆయన ప్రియురాలు.</p>
<blockquote><p>&#8216;ఎవ్వరని యెంతురో నన్ను? ఏననంత<br />
శోకభీకర తిమిర లోకైక పతిని!<br />
నాకు నిశ్వాస తాళవృంతాలు కలవు<br />
నాకు కన్నీటి సరుల దొంతరలు కలవు<br />
నాకమూల్య మపూర్వ మానంద మొసగు<br />
నిరుపమ నితాంత దుఃఖంపు నిధులు కలవు&#8217;</p></blockquote>
<p>కవి సమాజం నుంచి వేరుపడి, దుఃఖ సామ్రాజ్యానికి తనని తాను అధిపతిగా ప్రకటించుకుంటున్నాడు. ఈ పద్యంలో paradox ఏమిటంటే , ఆనందాన్ని కలిగించే దుఃఖ నిధులు తనకి కలవని కవి చెప్పటం. ఇదే రొమాంటిక్ మెలంకలి. తనని చూసి ఎవరూ జాలిపడనవసరం లేదనీ, తనకి నిట్టూర్పుల విసనకర్రలున్నాయనీ, కన్నీటి ముత్యాల హారాలున్నాయనీ, గొప్ప విలువైన అపూర్వమైన ఆనందాన్ని కలిగించే సాటిలేని దుఃఖంపు నిధులు తనకి ఉన్నాయని కవి అంటాడు.</p>
<p>ఈ రకమైన భావంతో పద్యరచన తెలుగు సారస్వతంలో పూర్వమెపుడూ లేదు. కృష్ణశాస్త్రి మాటల్లోనే చెప్పాలంటే, &#8216; బాధంతా ఘనీభవించి దుఃఖమైపోయి బ్రతుకంతా నిండిపోయింది.&#8217; ఇది ప్రాయశ్చిత్తమని కవి గ్రహించాడు. &#8216;కంటక కిరీటధారినై&#8217;, &#8216;ఏకాంత గోష్ఠి&#8217; జరుపుతానంటాడు. &#8216;దుఃఖమే తోడునీడగా&#8217; రాత్రులు గడుపుతానంటాడు. లేకపోతే ఎడతెగని యాత్రనిట్లు సాగింపలేక యేడ్వగాలేక కృశియింతు నేనొకండ!&#8217; అని అంటాడు. మానవ హృదయం ఉన్నతమైన స్థితికి చేరుకొనే ప్రయత్నమిది.</p>
<p>ఒంటరి తనాన్ని కోరుకోవడం కూడా భావకవిత్వంలో ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. అమితమైన దుఃఖాన్ని భరించలేని కవి</p>
<blockquote><p>&#8216;మీరు మనసారగా నేడ్వనీరు నన్ను -<br />
నన్ను విడువుడు! ఒకసారి నన్ను విడిచి<br />
నంత నేకాంత యవనికాభ్యంతరమున<br />
వెక్కి వెక్కి రోదింతును &#8211; &#8216;</p></blockquote>
<p>అంటాడు. కళాకారుడు స్వతహాగా ప్రేమికుడు. అంతేకాదు, భావుకుడు కూడా. యౌవనంలో విఫల ప్రేమికుడయ్యాడు. దానికి స్వయంకృతాపరాధమే కారణమని గుర్తించాడు. అందుకే కన్నీళ్లతో హృదయాన్ని శుభ్రం చేసి, కొత్త చూపుకోసం ఆరాటపడుతున్నాడు. ఇది గుర్తించని లోకం ఆయనని హింసించింది. అందుకే చలంగారు ఇలా అంటారు.</p>
<p>&#8216;ఎవరో రాస్తున్నారు. కృష్ణశాస్త్రి కవిత్వం వెనుక చూపని. నీకూ, నీ చీమలపుట్టకీ, గింజలకోసం వెతికీ, రాసే నీ రెండంగుళాల దృష్టికీ శాస్త్రిగారి కవిత్వం వెనకచూపు. కాదు. అసలు చూపే లేదు. శాస్త్రి ఎందుకు &#8216;యేడ్వగనీరు&#8217; అంటున్నాడో చెప్పాలిట. ఎందుకు ఏడుస్తున్నాడు? నీకోసం,నాకోసం, లోకంకోసం, ఇట్లా ఇంత బాగా తనని అర్ధం చేసుకొనే విమర్శకుల కోసం.&#8217;</p>
<p>వ్యక్తిగతమైన ప్రేమానుభవం నుండి విశ్వజనీనమైన ప్రేమ కోసం పరితపించే కృష్ణశాస్త్రి హృదయాన్ని అర్థం చేసుకున్నవారిలో చలం ముఖ్యులు. బాధ అనంతమైన ప్రేమకి దారి తీస్తుంది.</p>
<p>&#8216; Pain on that scale has its harmony in great love; for by hurting love it reveals the infinity of love in all its truth and beauty&#8217; అని టాగూర్ అంటారు.</p>
<p>ఎప్పుడైతే ప్రేమ ఆఘాతానికి గురవుతుందో, ఆ బాధ ప్రేమ యొక్క అనంతత్వాన్ని విశదీకరిస్తుందని టాగూర్ అభిప్రాయపడుతున్నారు. ఆ సందర్భంలో ప్రేమలో ఉండే సత్యమూ, సౌందర్యమూ విశ్వవ్యాపితమౌతాయి.</p>
<p>విశ్వనాథ సత్యనారాయణగారిని ఎంతగానో కదిలించిన పద్యం కృష్ణశాస్త్రి రచించిన &#8216;అబ్బ&#8217;! అనేది. కవితా ప్రసంగాలు చేస్తూ బందరులో విశ్వనాథవారికి వినిపించిన పద్యమిది.</p>
<blockquote><p>&#8216;హృదయ వనజాత సుమ<br />
మృదు మనోహర దళము<br />
లదయతను ద్రుంచినారే<br />
పెంధూళి<br />
చిదిమి వెదజల్లినారే!<br />
హృదయ శోణిత ధార<br />
నెదుగు జీవిత వల్లి<br />
మొదలంట దూల్చినారే<br />
భయదాన్ని<br />
కీలలను వ్రేల్చినారే!&#8217;</p></blockquote>
<p>భావకవిత్వ జీవలక్షణం ఈ ఖండికలో ఉంది. కవి హృదయం చాలా సున్నితం. సృజనలో ఉన్నతం. ప్రేమ వంటి మృదువైన భావాలకి కాణాచి. ప్రకృతినీ, మానవ ప్రపంచాన్నీ సమన్వయం చేసే దార్శనికతకి కేంద్రం. అటువంటి హృదయం లోకనిందలకి గురయింది. దయలేని వారి క్రూరత్వానికీ, దుర్మార్గానికీ హృదయం ఛిన్నాభిన్నమైన తీరుని కృష్ణశాస్త్రి చిత్రించారు. అనుభూతికీ, భావనకీ నెలవైన హృదయ ప్రాధాన్యాన్ని వివరించిన పద్ధతి కృష్ణశాస్త్రి కవితా శిల్పానికి మచ్చుతునక.</p>
<p>దుఃఖంతో కవి హృదయం &#8216;అంతు లేని దారిలేని శోకంపు టెడారి&#8217; గా మారిపోయింది. కవికి పాడాలని ఉంది. బాధతో ఘనీభవించిన గొంతులో మాట పెగలడంలేదు. ఆ స్థితిని కృష్ణశాస్త్రి</p>
<blockquote><p>&#8216;మూగవోయిన నాగళమ్మునను గూడ<br />
నిదురవోయిన సెలయేటి రొదలు కలవు -<br />
ఐన నేమాయె &#8216;-</p></blockquote>
<p>&#8216;ఐననేమాయె&#8217; అనడంలో మించిపోయింది లేదు అనే అర్థం స్పురిస్తుంది. ఎప్పటికైనా ఆయన గళంలోని పాట, నిదరోయే సెలయేరు లోకం దాహం తీరుస్తాయన్న ఆశ కలిగిస్తున్నాయి. కృష్ణపక్షం రాస్తున్న రోజుల్లో గళం మూగవోతుందని అనడం , ఆయన జీవితంలో గొంతు మూగవోవడం చిత్రమైన పరిస్థితి. &#8216;ఐననేమాయె&#8217; అని ఆయనే అన్నట్లుగా గొంతు మూగవోయినా, ఆయన ఎన్నో మంచి పాటలు రాసి, తెలుగు కవితాప్రియుల హృదయాలని రంజింపజేశారు.</p>
<p>కృష్ణశాస్త్రి యౌవనదశలో రాసిన ఈ కావ్యాలలో ఇంత దుఃఖం ఉండటానికి కారణం ఏమిటి? యౌవనంలో ఉత్సాహం, ఉద్వేగం, ఆశ, ఆనందం, జీవితం పట్ల పరిపూర్ణ విశ్వాసం, మనోధైర్యం వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుతాయి. అయినా కృష్ణశాస్త్రి కవిత్వం బాధ, దుఃఖం, నిరాశలలో నిండి ఉంది. దీనికి కారణాలు చెబుతూ నవలా రచయిత బుచ్చిబాబు (శివరాజు వెంకటసుబ్బారావు) ఇలా అంటారు.</p>
<p>&#8216;ఆనాడు దేశానికింకా స్వరాజ్యం రాలేదు. తనకి స్వేచ్ఛ లేదు. భావ స్వాతంత్ర్యం లేదు . అనువైన ఉద్యోగం లేదు. తను ప్రేమించిన స్త్రీకి తను అక్కరలేదు; ఆదర్శమూర్తిని తనదిగా చెసుకొనే పరిస్థితి లేదు. పరిసరాలలో సౌందర్యం లేదు. సమాజంలో వైజ్ఞానిక తృష్ణ, దానితో వచ్చే నిజాయితీ లేవు. ఇవి ఆతని బాధకి కారణాలు కావచ్చు.&#8217;</p>
<p>బుచ్చిబాబు చెప్పిన కారణాలన్నీ భౌతికమైనవి. కృష్ణశాస్త్రి ప్రధానంగా రొమాంటిసిస్టు.</p>
<p>తన ప్రియురాలు లేకుండా కవి ఉండలేకపోతున్నాడు. &#8216;ఇదె వచ్చుచున్నాను&#8217; ఖండికలో కృష్ణశాస్త్రి</p>
<blockquote><p>&#8216;శూన్యలోకము దాటి శుష్కదేహము దాటి<br />
యన్యోన్య నిబిడ నిత్యాశ్లేష కాంక్షతో<br />
ఇదె&#8230;&#8217; అంటారు.</p></blockquote>
<p>లోకం కంటే, దేహం కంటే శాశ్వతమైన సత్యాన్వేషణలో అలమటిస్తున్న కవి హృదయం ప్రియురాలి హృదయంతో ఐక్యాన్ని కోరుకుంటోంది. దుఃఖంతో శరీరాన్ని నాశనం చేసి హృదయాన్ని స్ఫురింపజేయడమే కవి ఉద్దేశ్యం. అందుకే భగవంతుని ధ్యానంలో పడతాడు కవి. యౌవనంలో అహంకారంతో దైవాన్ని నిరాకరించిన కవి &#8216;ఎట్లు నిన్నూహ సేయుటో యెరుగలేక వంగి వంగి శిరము వొంచి కుంగిపోతు&#8217; నంటాడు. &#8216;మనసారా, వలపూర, కలత తీర కాన్కగా ఏమొసంగగా గలను&#8217; &#8216;గాఢ లజ్జానుతాప సంకలిత హృదయ నీరజదళాల రాలు కన్నీటిచుక్క తప్ప’ అని అంటాడు. భక్తి రవళించిన ఆత్మానుభవం దుఃఖం లక్ష్యం నెరవేర్చింది. &#8216;కన్నీరు&#8217; ఖండికలో ఇంకా ఇలా అంటాడు.</p>
<blockquote><p>&#8216;కలుష దుర్దాంత పంక సంకలిత కుహర<br />
ముల జనించు మదీయాశ్రు మలిన ధార<br />
స్వామి భవదీయ పాద దేశమున పారి<br />
పరమ పావన జాహ్నవీ ప్రతిభ గాంచు&#8217;</p></blockquote>
<p>పశ్చాత్తాపం కవిని భగవంతుని సాన్నిధ్యాన్ని కోరేలా చేస్తోంది. క్షణికమైన ఆనందాన్ని కోరి, ఎండమావుల వెంట పరుగెత్తిన కవి బ్రహ్మసమాజ భావాలలో హృదయ పరివర్తనం తెచ్చుకొని, పాత అనుభవాలకి వీడ్కోలు పలుకుతూ &#8211; &#8216;నిర్యాణము&#8217; ఖండికలో,</p>
<blockquote><p>&#8216;చల్లగా నున్నదీ సుప్రశాంత వేళ<br />
చల్లగా సాగునీ సుప్రశాంత పథము<br />
బయలు దేరుము దూరంపు బయనమునకు<br />
వలదు తడయగు, దవ్వేగ వలయునేడు&#8217;</p></blockquote>
<p>&#8216;పరమపద శాంతి పూర్ణ నిర్వాణగీతి&#8217; ఆలపిస్తున్నాడు.</p>
<p>కృష్ణశాస్త్రి దుఃఖ గీతాలలో అలౌకికమైన ప్రేమ, భావ ఔన్నత్యం ఉన్నాయి. అసలు ఈ గీతాలు కవి తన హృదయభారాన్ని దింపుకోవడానికేననిపిస్తుంది. కవికి ప్రాణమిత్రుని వంటి ప్రకృతి, సర్వాధికారి ఈశ్వరుడు ఉన్నాడు.<br />
కృష్ణశాస్త్రిగారు ఇలా అంటారు.</p>
<p>&#8216;నా ప్రేమగీతాలలో, నా శోకగీతాలలో నాకు ఈ సామాన్య లోకం లేదు. వాటిని నాకో, నాలాగే స్వచ్ఛందమైన మూర్తి యైన ప్రకృతికో ఆలపించేవాణ్ణి. పరమేశ్వరుని పాదరేణువునో ప్రార్థించేవాణ్ణి, అనుకంప కొరకు&#8217;</p>
<p>ప్రేమకు బదులు రాకపోతే హృదయం ఎంత దహించుకు పోతుందో కవి గ్రహించాడు.</p>
<p>&#8216;కృష్ణపక్షం&#8217; అని పేరు పెట్టడంలోనే ఔచిత్యం ఉంది. ఇందులో కవే కథానాయకుడు. స్వేచ్ఛకీ, ప్రేమకీ సంబంధించిన అనుభవాలతో, ఆత్మీయుల మరణంతో కవి కృష్ణపక్షంలో పడిపోయాడు. &#8216;కృష్ణ భక్తి తత్వం&#8217; ఆసరా దొరికింది. అన్వేషణకి మార్గం సుగమమైంది. రొమాంటిక్ కవితలో దుఃఖం హృదయాన్ని ఎలా క్షాళన చేస్తుందో గ్రహించాం. అదే దుఃఖం కవిని ప్రవాసిని చేసింది.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=11960</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
		</item>
		<item>
		<title>కృష్ణశాస్త్రి సాహిత్యావలోకనం (రెండవ భాగం)</title>
		<link>http://vaakili.com/patrika/?p=11650</link>
		<comments>http://vaakili.com/patrika/?p=11650#comments</comments>
		<pubDate>Sun, 31 Jul 2016 16:39:35 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[డా. సీతారామయ్య (రామసూరి)]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=11650</guid>
		<description><![CDATA[<p></p> <p>కృష్ణశాస్త్రిగారి కవిత్వంలో ప్రేమకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆనాటి భావకవులు ప్రేమని గురించి కొత్త తరహాలో చెప్పారు. ఉదాహరణకి గురజాడ అప్పారావు గారి &#8216;కాసులు&#8217; అనే కవితలోని ఈ పాదం&#8230;</p> <p>&#8216;ప్రేమ -<br /> పెన్నిధి గాని, యింటను నేర్ప<br /> రీ కళ, ఒజ్జ లెవ్వరు లేరు -<br /> శాస్త్రములిందు గూర్చి తాల్చె<br /> మౌనము&#8217;</p> <p>గురజాడవారు ప్రేమని కళగా భావించారు. ఇది శాస్త్రాలలో లభించేది కాదు. అనుభవంతో అన్వేషించాలి. ఆయన ఇంకా ఇలా అంటారు. &#8216;ప్రపంచం యొక్క అచ్చమైన తత్వం స్వార్థ త్యాగంలో, పరోపకారంలో ఉంది. స్వార్థత్యాగానికి దారి తీయగల ప్రేరణ ప్రేమని మించింది ఉందా? మానవాత్మ పూసిన అత్యంత ఉజ్వలమైన పుష్పం ప్రేమ.&#8217; ఈ భావాలు కృష్ణశాస్త్రిగారిని ప్రభావితం చేశాయి. భావనతో ప్రేమని అన్వేషించేలా చేశాయి.</p> <p>లోకం స్వార్థంతో నిండి ఉంది. విలువలు పడిపోతున్నాయి. మానవ ప్రేమ కరువౌతోంది. లోకం పోకడని కృష్ణశాస్త్రి-</p> <p>&#8216;తోయముల తీయనైన పానీయమొసగి<br /> వలపు నునులేత గాలి వీవనల విసరి<br /> ప్రబల నైదాఘ తీవ్రాతపంబు వలన<br /> నిట్టులైతివె సెలయేర, తుట్ట తుదకు &#8216;</p> <p>లోకం దాహం తీర్చిన సెలయేరు చివరికి ఎండిపోయిన తీరుని చూపిస్తూ స్వార్థత్యాగము ప్రేమకి ఎలా ప్రేరణ కలిగిస్తుందో చెప్పేరు. తనని తాను అర్పించుకోవడం ద్వారా మనిషి శాశ్వతంగా మిగిలిపోతాడనే సత్యం ఇందులో ఉంది. ఇదే భావాన్ని టాగూర్ &#8216;Beauty is the self &#8211; offering of the one to the other one&#8217; అని అంటారు. స్వార్థత్యాగం విశ్వాసానికి పాదు గొల్పుతుంది. విశ్వాసం మనిషికి సౌందర్యాన్నిస్తుంది.</p> <p>కృష్ణపక్షం కావ్యంలో కవి ప్రేమించిన వాళ్ళు కవిని ప్రేమించలేదు. కవిని ప్రేమించినవాళ్లని కవి ప్రేమించలేదు. ప్రేమలేని చోటికి సౌందర్యం రాదు. సౌందర్యం లేని చోటికి ప్రేమ పోదు. దీనికి ఆధారం &#8216;తేటివలపు&#8217; ఖండికలో దొరుకుతుంది. హృదయానికి ప్రాధాన్యాన్నివ్వకుండా, శరీరానికే ఆనందాన్నివ్వడంలో [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/06/krishna_sastry.jpg"><img class="alignleft  wp-image-11453" title="krishna_sastry" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/06/krishna_sastry.jpg" alt="" width="343" height="320" /></a></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">కృ</span>ష్ణశాస్త్రిగారి కవిత్వంలో ప్రేమకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆనాటి భావకవులు ప్రేమని గురించి కొత్త తరహాలో చెప్పారు. ఉదాహరణకి గురజాడ అప్పారావు గారి &#8216;కాసులు&#8217; అనే కవితలోని ఈ పాదం&#8230;</p>
<blockquote><p>&#8216;ప్రేమ -<br />
పెన్నిధి గాని, యింటను నేర్ప<br />
రీ కళ, ఒజ్జ లెవ్వరు లేరు -<br />
శాస్త్రములిందు గూర్చి తాల్చె<br />
మౌనము&#8217;</p></blockquote>
<p>గురజాడవారు ప్రేమని కళగా భావించారు. ఇది శాస్త్రాలలో లభించేది కాదు. అనుభవంతో అన్వేషించాలి. ఆయన ఇంకా ఇలా అంటారు. &#8216;ప్రపంచం యొక్క అచ్చమైన తత్వం స్వార్థ త్యాగంలో, పరోపకారంలో ఉంది. స్వార్థత్యాగానికి దారి తీయగల ప్రేరణ ప్రేమని మించింది ఉందా? మానవాత్మ పూసిన అత్యంత ఉజ్వలమైన పుష్పం ప్రేమ.&#8217; ఈ భావాలు కృష్ణశాస్త్రిగారిని ప్రభావితం చేశాయి. భావనతో ప్రేమని అన్వేషించేలా చేశాయి.</p>
<p>లోకం స్వార్థంతో నిండి ఉంది. విలువలు పడిపోతున్నాయి. మానవ ప్రేమ కరువౌతోంది. లోకం పోకడని కృష్ణశాస్త్రి-</p>
<blockquote><p>&#8216;తోయముల తీయనైన పానీయమొసగి<br />
వలపు నునులేత గాలి వీవనల విసరి<br />
ప్రబల నైదాఘ తీవ్రాతపంబు వలన<br />
నిట్టులైతివె సెలయేర, తుట్ట తుదకు &#8216;</p></blockquote>
<p>లోకం దాహం తీర్చిన సెలయేరు చివరికి ఎండిపోయిన తీరుని చూపిస్తూ స్వార్థత్యాగము ప్రేమకి ఎలా ప్రేరణ కలిగిస్తుందో చెప్పేరు. తనని తాను అర్పించుకోవడం ద్వారా మనిషి శాశ్వతంగా మిగిలిపోతాడనే సత్యం ఇందులో ఉంది. ఇదే భావాన్ని టాగూర్ &#8216;Beauty is the self &#8211; offering of the one to the other one&#8217; అని అంటారు. స్వార్థత్యాగం విశ్వాసానికి పాదు గొల్పుతుంది. విశ్వాసం మనిషికి సౌందర్యాన్నిస్తుంది.</p>
<p>కృష్ణపక్షం కావ్యంలో కవి ప్రేమించిన వాళ్ళు కవిని ప్రేమించలేదు. కవిని ప్రేమించినవాళ్లని కవి ప్రేమించలేదు. ప్రేమలేని చోటికి సౌందర్యం రాదు. సౌందర్యం లేని చోటికి ప్రేమ పోదు. దీనికి ఆధారం &#8216;తేటివలపు&#8217; ఖండికలో దొరుకుతుంది. హృదయానికి ప్రాధాన్యాన్నివ్వకుండా, శరీరానికే ఆనందాన్నివ్వడంలో భౌతిక దృష్టి కనిపిస్తుంది. శారీరక సుఖంలో తృప్తి పడని కవి భావనతో ప్రేమాన్వేషణం ప్రారంభిస్తాడు. కాల్పనిక కవితలో భావనకి గల స్థానం ప్రత్యేకమైనది.</p>
<p>షెల్లీ ప్రేమగురించీ, భావన గురించీ ఇలా అంటాడు.</p>
<p>&#8216;The great secret of morals is love; or going out of our nature, and an identification of ourselves with the beautiful which exists in thought, action or person, not our own. A man, to be greatly good, must imagine intensely and comprehensively, he must put himself in the place of another and of many others, the pains and pleasures of his species must become his own. The great instrument of moral good is imagination.&#8217;</p>
<p>గొప్ప నైతిక రహస్యం ప్రేమ. సౌందర్యంతో మనల్ని మనం ఐక్యం చేసుకోవాలి. దానికి భావన అవసరం. గాఢంగా, విశాలంగా ఆలోచించగలిగినప్పుడే మనిషి మంచితనం తెలుస్తుంది. ప్రేమభావన మనిషిని ఇతర మానవులని ప్రేమించగలిగేలా చేస్తుంది- అని షెల్లీ అభిప్రాయపడుతున్నాడు.</p>
<p>కృష్ణశాస్త్రి ప్రేమపిపాసి. అంతేకాదు ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించే కవి. స్వేచ్ఛాన్వేషణంలో, ప్రేమాన్వేషణంలో కవి లోకాన్ని నిరాకరించాడు. కృష్ణపక్షంలో పడ్డ కవి కాంతికోసం ప్రయాణిస్తూ పాంథుని (wayfarer) గా మారాడు.</p>
<blockquote><p>&#8216;శ్యామలాంబర పరిణాహ సరసిలోన<br />
ప్రణయలీలా విహార విలాసినులగు<br />
తారకల గాంచుమా! నీ హృదయము నందు<br />
భావనక్షత్ర కాంతులు పర్వునేమో!&#8217;</p></blockquote>
<p>అన్న కృష్ణశాస్త్రి ఆదర్శాన్ని సాధించడానికి హృదయాల్ని మేల్కొలుపుతున్నారు &#8216; This great world, where it is a creation, an expression of the infinite &#8211; where its morning sings of joy to the newly awakened life, and its evening stars. sing to the traveler, weary and worn, of the triumph of life in a new birth across death &#8211; has its call for us.&#8217; అన్న టాగూర్ మాటలు ఇక్కడ గుర్తొస్తాయి.</p>
<p>కవి తన పరిస్థితిని చీకటి ఆకాశంలో దర్శించి తన హృదయంలో ప్రేమకోసం అన్వేషణ ప్రారంభించారు. ఋగ్వీధిలో ఇంకా ఇలా అంటారు.</p>
<blockquote><p>&#8216;కారు చీకటిలో బైలుదేరి, యమృత<br />
కాంతిగోరి, సతమ్ము లోకమ్ములో: బ్ర<br />
యాణమగు బాటసారి యీ మానవాత్మ<br />
యనుచు నమృతాలతేట బ్రహ్మర్షి మాట&#8217;</p></blockquote>
<p>సామాన్యులకైతే మామూలు మాటలూ వెలుగూ చాలు. ప్రేమలో ఉన్న మనిషికి పలుకుని సంగీతంగా మలచాలనీ, వెలుగుని ఇంద్రచాపంగా దిద్దాలనీ తపన. ఇక్కడ కవి తన హృదయాన్ని ప్రేమతో నింపడం ద్వారా సృజనకి మెరుగు పెడుతున్నాడు. సృజనాత్మక అనుభవాన్ని సాధించడం భావన ద్వారానే సాధ్యం.</p>
<p>&#8216;తేటివలపు&#8217; లో కవి మధుపమై అనుభవించిన పువ్వుని, హృదయంతో చూస్తే ఇలా కనపడుతుంది.</p>
<blockquote><p>&#8216;రంగు రంగుల సొగసు చీరల ధరించి<br />
నవ్వు వెన్నెల కాయు క్రొన్ననల నడుమ<br />
వాడి వాడని యీ విరిచేడే తాల్చు<br />
మంచి ముత్తియముల గన మది కరంగు&#8217;</p></blockquote>
<p>కవిని తన జీవితభాగస్వామిగా భావించిన ఆ పువ్వు కవిని చంచల మధుపంగా నిరసిస్తుంది. స్వచ్ఛమైన ప్రేమ ధారలతో పెంచిన స్నేహంపు పూల తీగె గాలి తాకిడికి నేలవాలినది.</p>
<p>చిరుత ప్రాయంలోనే కోరికలు చెదరిపోయాయి. ఆశయాలు అడుగంటినాయి. అని బాధపడుతూ,</p>
<blockquote><p>&#8216;మత్తిలిన యొక్క చంచల మధుపమునకు<br />
కోలుపోయితి మకరంద జాలమెల్ల<br />
ఇంతలో వీచి యెచటికో యెగిరిపోవు<br />
మారుతము తోడ వలపులు మాయమయ్యె&#8217;</p></blockquote>
<p>అని దుఃఖిస్తుంది. హృదయనాళము తెగిపోయి, హృదయ ధనము కోల్పోయి &#8216;వలపె విషమయిన తుచ్ఛజీవనము విషము&#8217; అని కూడా అంటుంది. ఆనందంలో పడి తనని మరచిపోయిన ప్రియునితో ప్రియురాలు &#8216;ఘోర దుఃఖ తమంబున కుందునపుడు తెరచి హృదయంబు,నారని దివ్వెనిత్తు&#8217; నని స్వార్థత్యాగంతో తనని తాను అర్పించుకున్న ప్రియురాలు ప్రియుని హృదయంలో ప్రణయదీపాన్ని వెలిగిస్తానంటుంది.</p>
<p>&#8216;నా యిచ్చ యే గాక నాకేటి వెరపు&#8217; అన్న కవిలో, బాధతో కూడిన మార్పు కలుగుతోంది. &#8216;నాప్రేమ&#8217; ఖండికలో &#8216;క్రౌర్య కౌటిల్య కలుష పంకంబు వలన మలినమౌ నా హృదయము ధామమెటులయ్యె నతి విశుద్ధము మధురము నఘ రహితము ప్రణయమున కంచు సందియపడుదువేమో&#8217; అని అంటూ</p>
<blockquote><p>&#8216;ప్రేయసీ శర్వరీ తమో వీధుల బడి<br />
చందురుడు రాడె పూర్ణ తేజస్వియగుచు?<br />
అఘవిదూషిత మీ హృదయంబు నందె<br />
ప్రేమ కోమలతమము పవిత్రమయ్యె&#8217;</p></blockquote>
<p>అంటాడు. కవి ఆశాజీవి. పాపపంకిలమైన హృదయాన్ని సంస్కరించుకొనే ధీశాలి. కోమలమైన ప్రేమ భావనతో జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవాలనే తపనగలవాడు. చెడుని ప్రేమతో క్షాళన చేయాలనుకొనే హృదయవాది.</p>
<p>ప్రకృతిలో ప్రేమ ఎంత సహజమైనదో, ఎంత నిస్వార్థమైనదో, ఎంత స్వచ్ఛమైనదో &#8216;ఏల ప్రేమింతును&#8217; అనే ఖండికలో, ప్రపంచలోని ఐక్యతని వివరిస్తూ,</p>
<blockquote><p>&#8216;సౌరభము లేల చిమ్ము పుష్ప వ్రజంబు?<br />
చంద్రికల నేల వెదజల్లు చందమామ?<br />
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?<br />
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?&#8217;</p></blockquote>
<p>అని అంటారు. షెల్లీ Love&#8217;s Philosophy అనే ఖండికలో కూడా ప్రకృతిలో అణువణువూ ప్రణయమయం అనే భావాన్ని వ్యక్తీకరించాడు. మావి కొమ్మల్లోంచి మధుమాస వేళలో, కోయిల పాడే పాట ఇతరులని ఆనందింపజేయటానికో, తన బాగుకోసమో ఆలోచించమంటున్నాడు కవి.</p>
<p>నిజమైన ప్రేమకి కలుషిత హృదయం భయపడుతుందని చెబుతూ,</p>
<blockquote><p>&#8216;విరిసి విరియని క్రొవ్విరి నరయుటకును<br />
ఎంతొ సందియపడ, స్పృశియింపగలమె?<br />
వలపుల హరింపగలమె? యౌవనము నూత్న<br />
వికసితము, కలుష హృదయము వెరపుః జెందు&#8217;</p></blockquote>
<p>ప్రేమతత్వాన్ని ఆవిష్కరిస్తారు. రొమాంటిక్ కవి Rosetti, &#8216; Lover Enthroned&#8217; అనే కవితలో ఇలా అంటాడు.</p>
<p>&#8216; Love&#8217;s throne was not with these, but far above<br />
All Passionate Wind of welcome and farewell<br />
He sat in breathless bowers they dream not of ;<br />
Thou Truth foreknow Love&#8217;s heart, and Hope fore tell,<br />
And fame be for Love&#8217;s Sake desirable,<br />
And Youth be dear, and Life be sweet to Love&#8217;</p>
<p>ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఎంత ఉదాత్తమైనదో, ఎలాంటి విలువలనందిస్తుందో చెబుతున్నాడు Rosetti. జీవితంలో యౌవనం ప్రేమ మాధుర్యాన్ని నింపుకొని ఆశలకి ప్రాధాన్యాన్నిస్తుందంటాడు. కవులు ప్రేమకు ఇంత ఉన్నతిని ఇవ్వడమెందుకంటే, సౌందర్య దర్శనానికి ప్రేమ తొలిసోపానం కనుక.</p>
<p>రొమాంటిక్ కవులు కనిపించని సౌందర్యాన్ని అన్వేషించడానికి కనిపించే సౌందర్యాన్ని సాధనంగా చేసుకున్నారు. భౌతిక సంవేదనలోనే అన్వేషణ ప్రారంభమౌతుంది. &#8216;ఇంగ్లీషు కాల్పనిక కవిత్వంలోని స్వచ్ఛంద ప్రణయము భావకవులని ఆకర్షించినది. ప్రేమించుట యన్నది ఉదాత్త కృత్యమని వారికి తోచినది&#8217; అని డా. సి.నారాయణరెడ్డిగారు &#8216;భావకవిత్వం&#8217; అనే విభాగంలో చెప్పారు.</p>
<p>కృష్ణశాస్త్రి కావ్య ఖండికల్లో వెల్లివిరిసిన ప్రేమ ఆత్మాశ్రయ ధోరణిలో సాగింది. కవే కథానాయకుడు. ప్రకృతి ప్రీతి అధికం కావడంతో ప్రేయసితో ఇలా అంటాడు.</p>
<blockquote><p>&#8216;సార్వభౌమ భోగములేల చాన, మనకు?<br />
ఏలికల మౌద మన్యోన్య హృదయములకు<br />
ప్రవిమల ప్రేమ సామ్రాజ్య పట్టభద్ర<br />
భాగ్యముగన్న జిఱుత సంపదలేల?&#8217;</p></blockquote>
<p>&#8216;దివ్యభాగ్యము&#8217; ఖండికలో బంగారం, మణిభూషణాలూ, ముత్యాల హారాలూ అనవసరమని భావించి, సంధ్యా కాంతులలోని సువర్ణచాయలను, కాంతులీనే నక్షత్రాలను చూసి చింతలని దూరం చేసుకుందామనీ, సెలయేటి నురుగుల సౌందర్యాన్ని చూసి ఆనందంగా ఉందామనీ ప్రియురాలితో అంటాడు. ఈ సందర్భంలో చలంగారు, &#8216;కృష్ణశాస్త్రి తన ప్రియురాలిని హృదయరాజ్యాలని ఏలుకుందాం రమ్మని ఆహ్వానించాడు. బయట వస్తువు లేనిదే దాని నుంచి రాగల ఆనందాన్ని కల్పించుకోగల మనసే ఉంటే అది ఎంత అదృష్టం&#8217; అని అంటారు. కృష్ణశాస్త్రి సృజనాత్మకతని చలంగారు పరిశీలనతో గ్రహించారు. అదే కాల్పనికత.</p>
<p>కృష్ణశాస్త్రిగారి ప్రేమలో రెండు రకాల ధోరణులు కనబడతాయి. 1. ఆయనని ప్రేమించిన వాళ్లు 2. ఆయన ప్రేమించిన వాళ్లు. ఆయన ప్రేమలో సౌందర్య దృష్టి ఉంది. కాని లోకం దానిని అర్థం చేసుకోలేదు. ఆయన లోకాన్ని లెక్క చేయలేదు.</p>
<blockquote><p>&#8216;వెఱ్ఱిలోకమ! హృదయంపు స్వేచ్ఛనెటులు<br />
పంజరంబున బంధింతె? పాదపమున<br />
కూడియుందు మెల్లప్పుడు కొమ్మమీద<br />
ప్రవిమల ప్రేమవిహగ దంపతులమగుచు&#8217;</p></blockquote>
<p>అని అంటారు. అంతే కాదు యుగయుగాలుగా ప్రేమికుల స్వేచ్ఛకి ఆంక్షలు విధించిన పద్ధతిని తెలియజేస్తూ &#8216;శాపము&#8217; అనే ఖండికలో,</p>
<blockquote><p>‘నవవసంత శుభోదయానంద వశత<br />
ప్రకృతి నూతన జీవలావణ్య మొంద<br />
రాయి రప్పయు కంఠస్వరంబు దాల్చి<br />
నైజగుణము త్యజించి గానంబుసేయ<br />
పికమ, పాడకుమనుచు శపించినారు!&#8217;</p></blockquote>
<p>ప్రేమికుల పట్ల లోకం పోకడని తెలియజేస్తూ, తన స్వేచ్ఛాయాత్రలో, ప్రేమాన్వేషణంలో తనతో రాని నిర్జీవ ప్రపంచాన్ని ఆయన లెక్క చేయలేదు.</p>
<blockquote><p>&#8216;పక్షినని పాడగలనని ప్రణయవీధి<br />
నిత్యలీలా విహారముల్ నెరపుదునని<br />
పక్షముల దూల్చి, బంధించి పంజరాన<br />
గానమును బ్రాణము హరింప బూనినారు&#8217;</p></blockquote>
<p>అంటారు కృష్ణశాస్త్రి. భావకవిత్వానికి సంబంధించిన రెండూ ప్రధాన గుణాలు పరిచయం చేస్తున్నారు. అవి సంగీతం, ప్రేమ . రెండూ దగ్గర సంబంధం కలిగి ఉన్నవే. కవి దృష్టిలో రెండింటికీ స్వేచ్ఛ ప్రాణం. ఈ రెండింటి ఔన్నత్యాన్ని కృష్ణశాస్త్రి కవితాత్మకంగా చెప్పారు.</p>
<p>కృష్ణశాస్త్రి వేంకట పార్వతీశ కవులని గురించి రాస్తూ ఇలా అంటారు.<br />
&#8216;నవ్యకవులకి స్వేచ్చ ప్రాణము. వీరు ప్రాణమైన కోల్పోవుదురు గాని శృంఖలముల ధరింపరు. వీరికి ప్రాణము కన్న గానము తీపు. సంకెలలో సంగీతమా? కట్టుబాటులో కవిత్వమా?&#8217;</p>
<p>ప్రేమకీ, కళకీ గల సంబంధం విడదీయరానిది. ప్రేమికుల పట్ల, కళాకారుల పట్ల &#8211; ముఖ్యంగా నవ్య ధోరణులు ప్రదర్శించేవారి పట్ల లోకం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో కృష్ణశాస్త్రి చిత్రించారు.</p>
<p>కృష్ణపక్షంలో కవికి తన ప్రేయసి నుండి బదులు రాలేదు. పైగా ఆమెకు వేరొకరితో వివాహమైంది. ఈ విషయాన్ని కృష్ణశాస్త్రి &#8216; మా ప్రణయలేఖల కథ&#8217; లో ఇలా రాస్తారు. &#8216;ఓ అద్భుత వ్యక్తి నా హక్కయింది. నా కోసమే జీవితం వహించింది. తన ప్రేమతో నన్ను కప్పేసింది. నాకూపిరాడింది కాదు. నాకెందుకో ఇరుకైంది ఈ ప్రపంచం&#8217; అని అంటూ, ఆమె ప్రేమని స్వీకరించలేక పోయాడు. ఆమెని ప్రేమించ లేకపోయాడు. బాధతో ఆమె నలిగిపోయింది. చివరకి ప్రాణాలు విడిచింది.</p>
<blockquote><p>&#8216;నా విరుల తోట పెంచికొన్నాడ నొక్క<br />
పవడపు గులాబిమొక్క నా ప్రణయ జీవ<br />
నమ్ము వర్షమ్ముగా ననయమ్ముకురిసి<br />
కొన్ని నాళ్లాయె; సుకుమార కుసుమమొకటి<br />
నవ్వె కిలకిలమని నా వనమ్ములోన&#8217;</p></blockquote>
<p>అంత దానిని జీవితాశంగా ప్రేమించారు. ఎదల నిశ్శబ్దంగా పలకరించుకున్నారు. కాని అంతలోనే &#8216;నొక్క క్రూరార్క కిరణమ్ము; ఉర్వి వాలి నా గులాబి సోలుచు తూలి నన్ను వీడె&#8217;. భార్య మరణంతో క్రుంగిపోయిన కవి దుఃఖంతో కుమిలిపోతాడు.</p>
<p>భార్యని ప్రేమించక అందరాని ఆనందం కోసం అన్వేషించిన కవి &#8211; తన పరిస్థితిని &#8216;చుక్కలు&#8217; కవితలో ఇలా వివరిస్తారు .</p>
<blockquote><p>&#8216;మింట నెచటనొ మెరయు చుక్కల<br />
కంట చూచితి కాంక్షలూరగ<br />
కాంక్షలూరిన కొలది చుక్కలె<br />
కాంచి బ్రదుకే గడపితిన్<br />
చేతి కందెడు పూలకొరకై<br />
చేయి చాపక చేరి కోరక<br />
దూరమున లేవంచు వానిని<br />
దూరి వదలితిని&#8217;</p></blockquote>
<p>అందుబాటులో ఉన్న ప్రేమని కాదని అందరాని ప్రేమకి అర్రులు సాచినపుడు ఆకాశంలో చుక్కలు అదృశ్యమవుతాయి. చేతికందే పూలు వాడిపోతాయి. పక్షిలా ఆకాశంలో ఎగిరి పోవాలని కోరుకున్నాడు కవి . రెక్కలు లేవన్న సంగతి గ్రహించలేదు. చివరికి జీవితం కలగా మిగిలిపోయింది. ఇపుడు కవిలో పశ్చాత్తాపం కలుగుతోంది.<br />
రొమాంటిక్ కవి షెల్లీ కూడా యౌవనంలో స్వేచ్ఛని విశృంఖలంగా కోరుకొని &#8216;Prometheus unbound&#8217; పద్య నాటకం రాసేనాటికి వ్యక్తిత్వంలో ఎంతో పరిణామాన్ని సాధించాడు. దీనికి Methodist విధానాలు అతని మనసుని పక్వానికి తెచ్చాయి. తెలుగుకవి కృష్ణశాస్త్రి వైష్ణవభక్తి, బ్రహ్మసమాజం, సూఫీతత్వం వంటి ఆధ్యాత్మిక భావసంస్కారంతో, శూన్యమైన తన హృదయాన్ని సౌందర్యంతో నింపుకొనే ప్రయత్నం చేశాడు. దాని ఫలితమే అన్వేషణము. కృష్ణశాస్త్రి కవిత్వం ఎడతెగని అన్వేషణ. దానికి ఊత భావనాశక్తి.</p>
<p>&#8216;అన్వేషణము&#8217; ఖండిక సంభాషణాత్మకంగా సాగింది. కవికీ, గోపికకీ మధ్య జరిగిన సంభాషణమిది. గోపిక శ్రీకృష్ణుని మురళీగానాన్ని ఆసరా చేసుకొని, కృష్ణుని సౌందర్యాన్ని అనుభవించగలగటం ఈ ఖండికలో ఉంది. ప్రేమ అనంతమైనదని గాఢమైనదని చెప్పటానికే కవి ఈ ఖండికను రచించారు. &#8216;అప్పుడు నీపవనిలో శ్రీకృష్ణుని వెదికినది నేనుకాదు. యుగయుగాల నుంచీ ఎరిగున్న గోపిక&#8217; అని కృష్ణశాస్త్రిగారు అన్నారు. అమూర్తమైన వేణుగానాన్ని భావన ద్వారా అనుభవంలోకి తెస్తారు కృష్ణశాస్త్రి.</p>
<blockquote><p>&#8216;ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల<br />
బడిపోవు విరికన్నె వలపువోలె<br />
తీయని మల్లె పూదీవె సోనల పైని<br />
తూగాడు తలిరాకు దోనెవోలె<br />
తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో పయనమై<br />
పరువెత్తు కోయిల పాటవోలె<br />
వెల్లువలై పారు వెలది వెన్నెలలోన<br />
మునిగిపోయిన మబ్బు తునుక వోలె</p>
<p>చిరుత తొలకరి వానగా చిన్ని సొనగ<br />
పొంగి పొరలెడు కాల్వగా నింగి కెగయు<br />
కదలిగా పిల్లగ్రోవిని వెడలు వింత<br />
తీయదనముల లీనమై పోయె నెడద. &#8216;</p></blockquote>
<p>బృందావన వేణుగానము కవి హృదయాన్ని భావశబలితం చేస్తోంది.</p>
<p>కవిని భార్య మరణం కుంగదీస్తోంది. ఎడద మోడైపోయి, జీవితం శిథిలమైంది. హృదయాన్ని చిగురింపజేయడంకోసం కవి తపన. భావకవిత్వంలో హృదయానికి అంత ప్రాధాన్యం ఉది. రొమాంటిక్ కవిత్వానికి సంబంధించిన లక్షణం &#8216;అన్వేషణం&#8217; లో కనబడుతుంది. ఇస్మాయిల్గారన్నట్టు, &#8216;ఈ విశ్వానికి ఆలంబనలైన అదృశ్యశక్తులు దృశ్యవస్తువుల ద్వారా వ్యక్తమవుతాయని రొమాంటిక్ కవుల అభిప్రాయం. ఇంద్రియానుభూతి ద్వారానే ఈ అదృశ్యశక్తులని అందుకోగలం. ప్రతి కవికీ ఇంద్రియానుభూతి అవసరం. రొమాంటిసిస్టులకు మరీను&#8217;. చీకటిలో చల్లని గాలిని తాకి, యమునానదీ కెరటాల సంగీత ఝరులతో కలసి, వెన్నెల స్వచ్చతని అందుకొని వేణుగానం చెవిని తాకుతోంది. కృష్ణశాస్త్రి సృజనాత్మక శక్తులు విజృంభించి మరీ &#8216;అన్వేషణ&#8217; రూపుదిద్దుకుందేమో అనిపిస్తుంది. గాఢత, సాంద్రత, క్లుప్తత మెరుగులు దిద్దుకొని కవి అనుభూతి రసగీతిగా జాలువారిన సన్నివేశమిది.</p>
<p>సహధర్మచారిణి, మధురమధుర ప్రియురాలు, సఖురాలు, పూర్ణరాగకలిత అయిన కవిగారి భార్య కరముకరమున కీలించి కలసి మెలసి జీవించింది. ఆమె మరణంతో కవి చలించిపోయి &#8216;నాకు మరణమ్ము వలదనినాను&#8217; అని అంటూ మరణం అనే మాట వినపడితే వణికిపోయే వాణ్ణికాను. &#8216;మహాంధకార కలుషిత &#8216;కృష్ణపక్షంపు&#8217; వీధిలో ఆమె స్మృతులు హృదయాన్ని కదిలిస్తుంటే -</p>
<blockquote><p>&#8216;నా దుఃఖ మసువులే తొలగిపోవ,<br />
వీడిపోవు నేమొ యను వెరపు వలన<br />
నాకు మరణమ్ము వలదనినాను&#8217;</p></blockquote>
<p>అని అంటారు. భావకవులు దుఃఖాన్ని &#8216;విషాదసుఖం&#8217; గా భావించారు. ఆత్మ ప్రక్షాళనానికి దుఃఖాన్ని వరంగా స్వీకరించారు. &#8216;సగము నిద్దురలోకమ్ము స్వప్నమటులు&#8217; కదలిపోయిన భార్య కవిని చీకట్లో మిగిల్చింది. చీకటి చిక్కదనాన్ని కృష్ణశాస్త్రి ఇలా అంటారు.</p>
<blockquote><p>&#8216;ఆ నిగూఢ ప్రశాంత సంధ్యా దురంత<br />
గర్భ కుహరాంతరమ్ముల కలచిపోవు<br />
కమ్ర భవదీయ మంజీర కటకగాన<br />
రవముచే తిమిరమ్ము సాంద్రతరమయ్యె&#8217;</p></blockquote>
<p>భార్యతో వెళ్లిపోయిన తన హృదయం కోసం ప్రతిరోజూ ఎదురుచూస్తూ ఉంటాడు కవి. దుఃఖం భయంకరంగా ఆవరించింది. అందులో ఆశ మెరుస్తూ ఉంటుంది. కన్నీటి కెరటాల వెన్నెలనీ, హాలహలంలో అమృతాన్నీ, శిథిల శిశిరంలో చివురునీ, రాతిలో పూవునీ చూడగల భావనాశక్తి కవికి ఉంది. అందుకే ఎంత దుఃఖాన్నైనా భరించగల ధైర్యం ఉంది. భావకవికి. ఆశాసంగీతం వినిపించగల సృజన శక్తులున్నాయి.</p>
<p>&#8216;Man achieves his close contact with reality only by participation in love through the activity of the imagination&#8217; షెల్లీ ప్రవృత్తికి సంబంధించిన ఆత్మావలోకనమిది.</p>
<p>రొమాంటిసిజం ప్రభావంతో భావకవిత్వంలో ప్రధానమైన ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో ఎంత ఉదాత్తమైనదో, ఎంత గాఢమైనదో కృష్ణశాస్త్రిగారు తమ కావ్య ఖండికల ద్వారా చెప్పారు. ఆ ప్రేమ సౌందర్య ప్రస్థానానికి తొలి సోపానంగా ఎలా మారుతుందో వివరించారు.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=11650</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
		<item>
		<title>కృష్ణశాస్త్రి సౌందర్య ప్రస్థానం (మొదటి భాగం)</title>
		<link>http://vaakili.com/patrika/?p=11445</link>
		<comments>http://vaakili.com/patrika/?p=11445#comments</comments>
		<pubDate>Thu, 30 Jun 2016 19:03:53 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[డా. సీతారామయ్య (రామసూరి)]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=11445</guid>
		<description><![CDATA[కృష్ణశాస్త్రి స్వేచ్ఛాన్వేషణలో సౌందర్య స్పృహ ఉంది. కృష్ణశాస్త్రి ప్రధానంగా రొమాంటిక్ కవి. బైరన్, షెల్లీ, వర్డ్స్ వర్త్, కీట్స్ వంటి కవులు స్వేచ్ఛనీ, సౌందర్యాన్నీ అన్వేషించినవాళ్లే. రొమాంటిక్ కవుల స్వేచ్ఛని గురించి క్రిష్టఫర్ కాడ్వెల్ 'ఇల్యూజన్ అండ్ రియాలిటే' అనే గ్రంథంలో ఇలా విశ్లేషించాడు. 'సమకాలిక నిరంకుశ విధానాల నుంచి విముక్తిని కోరిన బైరన్, సహజంగా మంచి లక్షణాలు గల వ్యక్తిని నాశనం చేసిన వ్యవస్థల నుంచి స్వేచ్ఛని కోరిన షెల్లీ, తిరిగి ప్రకృతిలోకి వెళ్లిపోదామన్న వర్డ్స్ వర్త్, 'Revolution as a flight from reality' అన్న కీట్స్, అందరూ రొమాంటిక్ కవితా పతాకాన్ని స్వేచ్ఛగా, ఎగరేసినవాళ్లే' . వీళ్లందరూ కృష్ణశాస్త్రిని ప్రభావితం చేసినవారే.]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;"><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/06/krishna_sastry.jpg"><img class="alignleft  wp-image-11453" title="krishna_sastry" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/06/krishna_sastry.jpg" alt="" width="274" height="256" /></a><br />
<em><span style="color: #993366;">తెలుగులో కావ్యరచన కేవలం అలంకారభూయిష్టంగా, పాండిత్య ప్రకర్షగా, మేధోమథనంగా కొనసాగుతుందనే ఆలోచన 19వ శతాబ్ధంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆకాలంలో వెలుబడిన ఆధునిక కవిత్వధోరణుల్లో భావకవిత్వానిదొక ప్రత్యేకమైన శాఖ. తెలుగులో భావకవిత్వానికి పర్యాయపదాలుగా నిలిచే కవుల్లో కృష్ణశాస్త్రిగారు ముఖ్యులు. ఆయన కవిత్వం ప్రధానంగా స్వేచ్ఛాకాంక్ష, సౌందర్యారాధన, ప్రేమ భావన, వియోగవేదన అనే అంశాలని ప్రతిఫలిస్తుంది. దేశం బానిసత్వంలో మగ్గుతున్న కాలంలో మనిషిలోపలి భావదాస్యాన్ని ప్రశ్నించి, సౌందర్యరాహిత్యాన్ని నిరసించి, వ్యక్తి ప్రేమ యొక్క అనివార్యతను నొక్కిచెప్పి తనదైన సుస్పష్టమైన భావజాలన్ని విస్తరింపజేసిన కవి ఆయన.</span></em><em><span style="color: #993366;">కృష్ణశాస్త్రి సాహిత్యాన్ని అవలోకిస్తూ డా. సీతారామయ్య గారు రచించిన సిద్ధాంత గ్రంధంలోని కొన్ని భాగాలను ఇక్కడ వ్యాసాలుగా ప్రచురిస్తున్నాం.</span></em> <em><span style="color: #993366;">-ఎడిటర్</span></em></p>
<p style="text-align: center;"><span style="font-size: 30px;">కృష్ణపక్షం &#8211; ప్రవాసం – ఊర్వశి</span></p>
<p><span style="font-size: 30px;">క</span>ళ వెనక ఉండే శక్తి సౌందర్యం. అది మానవుల ఏర్పాటుకి లొంగనిది. కళాకారుడు ఎంత సౌందర్యాన్ని తాను స్వాధీనం చేసుకుంటున్నానుకుంటున్నాడో, అంతకన్నా గొప్పగా సౌందర్యం అతనిని వశం చేసుకుంటుంది.</p>
<p>కృష్ణశాస్త్రి జీవితంలో సౌందర్యం పట్ల ఆయన వేదనని పరిశీలిస్తే ఇది బోధపడుతుంది. ఆయన కావ్యాలు కృష్ణపక్షం &#8211; ప్రవాసం &#8211; ఊర్వశి భావకవితకి రూపకల్పనలు. ఒక్కొక్క అనుభవం మనస్సుని కదిలిస్తే ఒక్కొక్క పద్యంగా బయటకి వచ్చి పడ్డాయి. &#8216;నా జీవితంలో అతి తీవ్రమైన వేదన, ఆవేశమూ కలిగించే గొప్ప అనుభవాలు కొన్ని వచ్చాయి &#8216;. అని కృష్ణశాస్త్రిగారు స్వయంగా చెప్పుకున్నారు.</p>
<p>గురజాడ అప్పారావుగారి &#8216;ప్రేమ కలుగక బ్రతుకు చీకటి&#8217; వంటి వాక్యాలూ, అబ్బూరి రామకృష్ణారావు, రాయప్రోలు సుబ్బారావు గార్లతో ప్రారంభమైన కాల్పనిక కవిత్వం ఆయనలో కొత్త ఆలోచనలు రేకెత్తించినాయి. ఒకే రకం అనుభవాలని ఆత్మపరమైన కావ్యాలలో చెప్పుకున్న కవులలో వేదుల, నాయని, బసవరాజు, నండూరి, కృష్ణశాస్త్రి ప్రసిద్ధులు. హృదయావేశమూ, భావన, భాష అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని వీరి చేతుల్లో కావ్యరూపాలు ధరించినాయి. వీళ్ళ కావ్యాలలొ వేదన, కరుణ ఎక్కువగా చోటు చేసుకున్నాయి.</p>
<p>&#8216;జీవించినందుకు రెండే ఫలితాలు. తీవ్రమైన ప్రేమతో జీవితం వెలగాలి; లేకపోతే విరహంతో కాలిపోవాలి. అంతే కాని ధనమూ, సుఖమూ, భోజనమూ- ఇవన్నీ కలిగి బ్రతకడం ఎందుకు &#8216; అంటారు చలం. అటువంటి ఆదర్శ ప్రేమ కోసం ప్రపంచంతో సంఘర్షించి, సౌందర్య ధ్యానంతో, ఆత్మని సంస్కరించుకొని, దివ్య సౌందర్యాన్ని దర్శించిన కవి కృష్ణశాస్త్రి.</p>
<p>ఆంగ్ల సాహిత్యంలోనూ, సూఫీ, వంగ, వైష్ణవ సాహిత్యాలతోనూ పరిచయం ఏర్పడటంతో సరికొత్త పద్ధతిలో సౌందర్య తత్వాన్ని ఆవిష్కరించాలన్న తపన కృష్ణశాస్త్రిగారిలో కలిగింది. ఆయన కావ్యాలలో క్రమ వికాసం ఉంది. అనుభవ ఉదాత్తతలో శిల్పం ఒక దానికంటే మరొకదానిలో రాటుతేలింది.</p>
<p>ఫ్రెంచి కవి, పండితుడు పాల్ వేలరీ కవి లక్షణాల్ని వివరిస్తూ ఇలా అంటాడు. &#8216;A poet, in sum, is an individual in whom the agility, subtlety, ubiquity and fecundity of this all-powerful economy are found in the highest degree&#8217;</p>
<p>కృష్ణశాస్త్రిగారిలో పాల్ వేలరీ చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయి. పొదుపైన మాటలతో సూక్ష్మమైన విషయాన్ని సర్వవ్యాపక లక్షణంగా రమణీయమైన శైలిలో చెప్పటం ఆయన ప్రత్యేకత. భావోద్రేకం, నిరంతర సౌందర్య తృష్ణ ఈయన కావ్యాలలో దర్శనమిస్తాయి.</p>
<p>కృష్ణశాస్త్రి కృష్ణపక్షం &#8211; ప్రవాసం &#8211; ఊర్వశి కావ్యాలు 1925-29 కాలంలో ప్రచురించారు. ఇందులో &#8216;మా బాబయ్య, నాన్నగారు &#8216; ఖండికలు ఏడు, మరియు గురజాడ అప్పారావుగారిపై రచించిన &#8216;మహాకవి&#8217; ఖండిక మినహాయిస్తే మిగతా కావ్యంలో కృష్ణశాస్త్రి హృదయ వికాసం విశదమవుతుంది.</p>
<p>కవిలో సృజన అతి సున్నితంగా తీవ్రంగా ఒక సునిశిత నిర్మల వాతావరణంలొ పదునెక్కుతుంది. &#8216;కొత్తయుగం కవికి కొత్త యౌవనం, స్వేచ్చా జీవనమంటే అభిలాష, సమాజంతో సంఘర్షణా, బాధ, అన్వేషణా, కోరికలు, అవి ఫలించకపోవడమూ, కృష్ణపక్ష రాత్రి &#8211; ప్రియతముల మృత్యువూ, ప్రవాసమూ, కొత్త లోకపుటంచుల దర్శనము, గాంధిజీ, మానవమాత్రుని సాక్షాత్కారము’ ఈ సంఘటనలన్నీ ఆయనలోని కళాకారుణ్ణి స్పందింపజేశాయని కృష్ణశాస్త్రిగారే అవతారికలో చెప్పుకున్నారు.</p>
<p>సౌందర్య ప్రేమ, సృజనాత్మక కళ మానవ మనస్తత్వాన్ని వెల్లడి చేస్తూ జీవితం పట్ల కొత్త విలువలు ప్రతిపాదిస్తాయి. &#8216;ఈ ప్రపంచ దుఃఖాలకీ సౌందర్యాలకీ అనుకంప పడగల ఆత్మ ఉంటేగాని కళని కల్పించలేడు మానవుడు&#8217; అంటారు చలం. ఆ అనుకంప కృష్ణశాస్త్రి కవితకి ప్రాణం. పదాలలో లాలిత్యం, భావాలలో సౌందర్యం, కవితలో గాంభీర్యం తొణికిసలాడించి తెలుగువారిని ఉర్రూతలూగించిన భావకవి కృష్ణశాస్త్రి.</p>
<p style="text-align: center;">***</p>
<p>భావకవిత్వపు తొలి రోజులలో నిత్యకవితావసంతోత్సవాలతో, వాడవాడలా తిరుగుతూ, కొత్త గొంతుకలు విసురుతూ, ఎందరు పండితులు అవహేళన చేసినా మునుముందుకు సాగిపోయిన వైతాళికుడు ఆయన. బ్రహ్మ సమాజ గీతాలతో, రసపరిమళ పారిజాతాలతో మధురమైన సాహిత్యాన్ని సృష్టించారు కృష్ణశాస్త్రిగారు. ఆరోజుల్లోనే వచ్చింది &#8216;కృష్ణపక్షం&#8217;. కొందరు అభినందించారు. మరి కొందరు నిందించారు. అందుకే కొందరు &#8216;కృష్ణ&#8217; పక్షాన చేరితే, మరి కొందరు &#8216;కృష్ణపక్షం&#8217; లోనే ఉండిపోయారు.</p>
<blockquote><p>&#8216;క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్య<br />
శృంఖలములు తమంతనె చెదరిపోవ<br />
గగనతలము మార్మోగగ కంఠమెత్తి<br />
జగమునిండ స్వేచ్ఛాగాన ఝరులనింతు&#8217;</p></blockquote>
<p>కృష్ణశాస్త్రిగారి స్వేచ్ఛ ఆత్మ చైతన్యానుభూతిలోంచి పలికిన గానఝరి. భావకవులు వ్యక్తి స్వేచ్ఛకి ప్రాణమిచ్చారు. ప్రకృతిలో పక్షులూ, వాగులూ ఎలా స్వేచ్ఛగా ఉన్నాయో వ్యక్తి కూడా అంత స్వేచ్ఛగా ఉండాలని భావకవి అభిలషిస్తాడు. లోకం నవ్వుతుందనే బెంగ లేదు వీరికి.</p>
<blockquote><p>&#8216;నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు<br />
నా యిచ్చయేగాక నాకేటి వెరపు &#8216;</p></blockquote>
<p>అని అంటూ &#8216;తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ జతకూడి దోబూచి సరసాల నాడి&#8217;</p>
<blockquote><p>&#8216;దిగిరాను దిగిరాను దివినుండి భువికి<br />
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు&#8217;</p></blockquote>
<p>అని నినదిస్తారు.<br />
కృష్ణ పక్ష కవికుమారుని స్వేచ్ఛాగానంలో నవయౌవనంలోని ఉత్సాహపులకితమైన హృదయం ఉంది. ఈ దశలో లోకాన్ని గురించి ఎరుక అస్పష్టంగా ఉంది. ప్రపంచాన్నీ, ప్రపంచం ఆరాధించే దైవాన్నీ తృణీకరించే ధోరణి ఉంది.</p>
<p>ఏ గంధర్వలోకం నుంచో కొందరు గంధర్వులు ఈ లోకంలోకి దిగివస్తారు. వాళ్లల్లో చాలామంది ఇక్కడ కళాకారులౌతారు. ప్రజల దృష్టికి ఎంతో దూరమూ, ఉన్నతమూ ఐన సౌందర్యాన్ని తమ కళలో ప్రదర్శిస్తారు.</p>
<blockquote><p>&#8216;నా నివాసమ్ము తొలుత గంధర్వ లోక<br />
మధుర సుషమ సుధాగాన మంజువాటి<br />
ఏనొక వియోగ గీతిక&#8217;</p></blockquote>
<p>అని అంటారు. &#8216;వియోగ శాలినీ హృదయరాగ వేదనారేఖ&#8217;గా తనని చెప్పుకుంటూ అనంత విశ్వంలో పడి &#8216;సకల దిశాంతరాళం&#8217;లో ప్రతిధ్వనించేలా విరహగీతాలు పాడి వేదనలో రగిలిన సౌందర్యోపాసకుడు కవి. &#8216;కృష్ణపక్షం&#8217; లోని ఖండకావ్యాలని ఏర్చి కూర్చిన శివశంకరశాస్త్రిగారు &#8216;అన్నియునొక్క కవి ఆత్మలో నుండి ఉద్భవించిన వనుదాని కంటే నన్య విధమగు నైక్యమీ సంపుటిలో గాన రాలేదు&#8217; అంటూనే మళ్లీ &#8216; కానీ కొంచెము పరిశీలించినవారు కృష్ణశాస్త్రిగారి భావతరంగిణి ప్రధానముగా చతుర్విధముల ప్రవహించుచుండునని తెలిసికొనగలరు&#8217; అని కూడా అన్నారు.</p>
<p>కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి కావ్యాలలో కృష్ణశాస్త్రిగారి కాల్పనిక ఆవేశం, హృదయ పరిణామం స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మూడు కావ్యాలనీ క్రమపద్ధతిలో పరిశీలిస్తే స్వేచ్ఛ, ప్రేమ, దుఃఖం, ప్రవాసం, సౌందర్యం అనే అంశాలు కనిపిస్తాయి. స్వేచ్ఛాన్వేషణంలో, ప్రేమాన్వేషణంలో ఆయన పడ్డ ఆరాటం దుఃఖానికి దారితీసి ప్రవాసిని చేసింది. అంతర్ముఖులయ్యారు. హృదయాన్ని క్షాళనం చేసుకున్నారు. సౌందర్యాన్ని దర్శించారు. ఇదీ ఆయన సౌందర్య ప్రస్థానం.</p>
<p>యువకుడైన కవికుమారుడు ప్రకృతి దర్శనంతో ఆనందపరవశుడై స్వేచ్ఛనీ, ఆనందాన్నీ ప్రకటిస్తాడు.</p>
<blockquote><p>&#8216;ఆకులో ఆకునై పూవులో పూవునై<br />
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై<br />
ఈ యడవి దాగిపోనా&#8217;</p></blockquote>
<p>అంటారు కృష్ణశాస్త్రి. ఋషులు తమ అన్వేషణ అరణ్యాలలోనే సాగించేవారు. అనంతత్వాన్ని అందుకొనే శోధనలో కవి తన సౌందర్య ప్రస్థానం అడివిలోంచే ప్రారంభించటం ఔచిత్యాన్ని సంతరించుకుంది. జగము నిండా స్వేచ్ఛాగానాన్ని నింపాలని తపించే కృష్ణశాస్త్రి &#8216;నాకు ప్రేమ దొరికింది కాదు. నా ఆదర్శానికి సరిపోయే సౌందర్యమూ దొరికింది కాదు.&#8217; అంటారు. వాటి అన్వేషణతోటే ఆయన కావ్యజీవితం ప్రారంభమైంది. ప్రేమ, సౌందర్యం, విశ్వాసం కాల్పనిక కవికి ఊపిరులు. యౌవనంలో ఉరకలు వేసే భావాలతో స్వేచ్ఛాగానం చేస్తాడు భావకవి.</p>
<blockquote><p>&#8216;తిమిర లత తారకాకుసుమములఁ దాల్చఁ<br />
గర్కశ శిలయు నవజీవ కళలఁ దేఱ<br />
మ్రోడు మోక చివురులెత్తి మురువు సూప<br />
జగమునిండ స్వేచ్ఛాగాన ఝరులనింతు&#8217;</p></blockquote>
<p>చీకట్ల తీగలు నక్షత్రాల పూలని వికసింప చేసినట్లుగా, మోళ్లు చిగుళ్లు తొడిగినట్లుగా, కఠినశిలలు ప్రాణం పోసుకున్నట్లుగా ప్రపంచమంతటా స్వేచ్ఛాగానం ప్రవహించాలి. భావకవులు మనిషికి సంకెళ్లు ఎందుకని ప్రశ్నిస్తారు.</p>
<p>లోకాన్నీ, లోకం ఆరాధించే దైవాన్నీ నిరాకరించే ధోరణి &#8216;నేను&#8217; కవితలో కనిపిస్తుంది. యౌవనంలో మనిషికి అహంకారం ఎక్కువ. ఎవ్వరినీ లెక్కచేయక పోవడం, ఎక్కడికో రెక్కలొచ్చి ఎగిరిపోవాలనే ఉద్వేగంతో చెలరేగిపోవడం ఉంది. సౌందర్యాన్వేషణంలో భౌతికదృష్టి కనిపిస్తుంది. స్వేచ్ఛనీ, ఆనందాన్నీ అనుభవించాలనే ఆరాటం ఉంది. భగవంతుణ్ణి &#8216;రాజవీధుల రతనాల రథమునెక్కి నెడలు నిర్జీవ పాషాణ విగరం&#8217; గా , &#8216;చలువరాతి మేడలు చెరసాలలందు, తళుకు బంగారు సంకెళ్ల దాల్చి లోకపాలకుని&#8217; గా మురిసే బానిసీడుగా చూస్తాడు కవి. సంప్రదాయాలనీ, మతవిశ్వాసాలనీ చిన్నచూపు చూస్తాడు.</p>
<p>&#8216;తేటివలపు&#8217; లో కవి యొక్క చంచలమైన మానసిక స్థితి కనిపిస్తుంది. తేనెల కోసం మల్లెపూవుని అనుభవించిన తేటితో రెమ్మలు అంటాయి &#8216;లలిత మనోజ్ఞమూర్తి, మనోహర గాన సత్కళా విలసితుడు, ఆర్ద్రచిత్తుడు&#8217; అని అమాయకంగా వరించింది మల్లిక. అప్పుడు తేటి సమాధానమిస్తుంది. &#8216;నిరతంబు మల్లిక కడ&#8217;నే యుండి ముదము కూర్పగ మాకొక్క పూవె చెపుమా&#8217; ప్రేమ ప్రకృతి సహజమైన స్థితిగా అభివర్ణించడం జరిగింది. ఈ కవితలో స్వేచ్ఛా ప్రణయం ఉంది. విశృంఖల ధోరణి ఉంది. ఇంత జరిగినా ప్రకృతి సౌందర్య రసాస్వాదనలో పడి &#8216;అవిరళ స్వేచ్ఛ వెనక ముందరయబోక వారిదమ్ములు చిత్ర కాశ్మీర రుచుల బూని విహరించి పశ్చిమ భూధరమున రజని రానున్నదంచు తెల్పంగరాదె&#8217; అని అంటారు. స్వేచ్ఛా ప్రణయంలో కవి చీకట్లోకి జారిపోతున్నాడు. అదే కృష్ణపక్షం.</p>
<p>భావకవిత్వంలో స్వేచ్ఛ ఒక ప్రధానమైన విలువ. కృష్ణశాస్త్రిగారి స్వేచ్ఛాగానం రెండు భాగాల్ని పరిశీలించినపుడు తేలే అంశం ఏమిటంటే, దేశం కోసం స్వేచ్ఛ కంటే మనిషి స్వేచ్ఛ కోసం ఆయన కలలు కన్నారనే విషయం. పైకి కనిపించే దాస్యాల కంటే ఆంతరంగిక దాస్యం మనిషిని ఎలా కృంగదీస్తుందో చెప్పడానికి ప్రయత్నిస్తారు.</p>
<p>స్వేచ్ఛాగానము-1 లో రెండురకాల స్వేచ్ఛలు ఉన్నాయి. మొదటిది యుగయుగాలుగా ఈశ్వరయోధులైన వారు పోరాడిన స్వేచ్ఛ. రాజారామమోహనరాయలు, రఘుపతి వేంకటరత్నం నాయుడు వంటి సంస్కర్తలు కలలు గన్న శాశ్వత స్వాతంత్ర్యం. రెండవది యౌవనోద్రేకంతో వైయక్తికమైన అనుభవాల కోసం భౌతిక దృష్టితో సాగిన స్వేచ్ఛ. మొదటిది సత్యం, శాశ్వతం. రెండవది భ్రమ, క్షణికం.</p>
<blockquote><p>&#8216;యుగ యుగంబుల నీశ్వర యోధులగుచు<br />
స్వేచ్ఛకై ప్రాణసుమము లర్పించువారి<br />
అమల జీవిత ఫలము ధన్యతను గాంచ,<br />
జగమునిండ స్వేచ్ఛాగాన ఝరులనింతు&#8217;</p></blockquote>
<p>ఈ పద్యంలో మానవుల మనోదాస్యాన్ని పెకలించాలనే సంస్కర్తల తపన ఉంది. నిర్మలమైన జీవితం కోసం సంస్కర్తలు పడిన సంఘర్షణ ఉంది. శాశ్వతమైన స్వేచ్ఛకి సంబంధించిన భావన కృష్ణశాస్త్రి పలికించారు.</p>
<p>కృష్ణపక్షంలోని కవికుమారుని మనస్సు చంచలమైనది.</p>
<blockquote><p>&#8216;చిత్త మానంద మయ మరీచికల సోల<br />
హృదయ మానంద భంగ మాలికల దేల<br />
కనులనానంద జనితాశ్రుకణము లూర<br />
జగమునిండ స్వేచ్ఛాగాన ఝరులనింతు. &#8216;</p></blockquote>
<p>అనే పద్యంలో శారీరక వాంఛ ఉంది. క్షణికమైన ఆనందమనే ఎండమావుల వెంట పరుగులు తీసే మనస్సుని సోలిపోవడంగా , అక్కడితో ముగిసిపోయే ఆనందానుభవాన్ని తేలిపోవడంగా చిత్రించి భ్రమతో కూడిన స్వేచ్ఛని ధ్వనింప చేశారు కృష్ణశాస్త్రి. ఈ పరిస్థితిలో కవి కృష్ణపక్షంలో పడిపోతాడు. భయాన్ని కలిగించే కష్టాలని దాటి, బాధల చీకట్లని ఛేదించుకోవాలనే తపనతో శాశ్వత స్వేచ్ఛాన్వేషణలో పడతాడు. అజ్ఞానాంధకారంలో పడిన మనిషి, అహంకారంతో పతనమైన మనిషి ప్రేమాన్వేషణలో హృదయాన్ని రసమయం చేసికొని ద్వైతస్థితిలోంచి అద్వైతసిద్ధికి ఉన్నతుడవటానికి ప్రయత్నిస్తాడు.</p>
<p>స్వేచ్ఛాగానము &#8211; 2 లో భౌతిక దృష్టి కనిపిస్తుంది. ఎక్కడికో ఎగిరిపోవాలనే తపనతో, &#8216;మాయ మయ్యెదను నా మధురగానమున&#8217; అని అంటూ పువ్వు పువ్వునీ పలకరిస్తూ, ప్రణయరహస్యాన్ని చెపుతూ, &#8216;తుమ్మెద&#8217;లా ప్రవర్తిస్తాడు కవి. అంతేకాదు. &#8216;నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు? నా యిచ్చయే గాక నాకేటి వెరపు&#8217; అని అంటాడు. &#8216;In human nature sexual passion is fiercely individual and destructive, but dominated by the ideal of love, it has been made to flower into a perfection of beauty&#8217; అని టాగూర్ అంటారు. వాంఛ వినాశనాన్ని కోరకూడదు. ఆదర్శంతో కూడిన ప్రేమ సౌందర్యాన్ని పరిమళింప చేస్తుందని టాగూర్ అభిప్రాయం.</p>
<p>కృష్ణపక్ష కవి తనని &#8216; స్వేచ్ఛాకుమారుని &#8216; గా, &#8216; గగన పథ విహార విహంగమ పతి &#8216;గా, &#8216;మోహన వినీల జలధరమూర్తి &#8216;గా, &#8216; ప్రళయ ఝంఝూ ప్రభంజనస్వామి&#8217;గా అభివర్ణించుకుంటాడు. ఆంగ్ల విద్యా సంస్కారం, తరతరాల కట్టుబాట్లు, దేశంలో తరగలెత్తుతున్న జాతీయోద్యమం, స్వేచ్ఛా ప్రణయ సమితి &#8211; ఇవన్నీ కవిని ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో పడేశాయి.</p>
<blockquote><p>&#8216;వక్ర గతి బోదు జక్కని పథమునందు<br />
రాజ పథమునకై కుమార్గమున జూతు &#8216;</p></blockquote>
<p>అని కృష్ణశాస్త్రి &#8216;నేను&#8217; కవితలో విశృంఖలతని పరిచయం చేస్తారు. &#8216;విసమమృతమట్టు లమృతంబు విసము రీతి &#8216; చిత్ర చిత్ర గతుల మార్చే కృష్ణశాస్త్రి జీవితంలోని కొన్ని అంశాలు పరిశీలిస్తే కానీ ఆయన వ్యక్తిత్వ వికాసం అర్థం కాదు. యౌవనంలో పరిపరివిధాల పరుగులు తీసే జీవితంలోని పరిణామాలను కృష్ణశాస్త్రి మిత్రులందరూ అనుభవించారు.</p>
<p>రామమూర్తి, చలం, ముద్దుకృష్ణ, కృష్ణశాస్త్రి &#8211; నలుగురూ ప్రాణమిత్రులు. బ్రహ్మసమాజానికి సన్నిహితులు. &#8216;మతాలనీ, అధికారాలనీ ధిక్కరించీ, అన్ని బంధాలు, సంఘం, బంధుత్వం, స్నేహం అన్నీ మా అన్వేషణ కోసం, ఆచరణ కోసం త్యజించి, యీ జీవితపు అగాధాలను, కొసలని విడదీసి, మనసు ఎంతవరకు తెలపగలదో అంతవరకూ చర్చించీ, తరిచీ తక్కినది అబద్ధమనీ నిర్ణయించిన వాళ్లం&#8217; అని చలం స్పష్టంగా చెప్పారు.</p>
<p>తెలుగు సారస్వతంలో జీవితాన్ని ఒకే కోణంలోంచి మూడు విధాలుగా చూసినవాళ్లు చలం, ముద్దుకృష్ణ, కృష్ణశాస్త్రి. ఈ ముగ్గురి నుంచి పుస్తకాలు అంకితం పొందినవాడు మొక్కపాటి రామమూర్తి. నలుగురూ ప్రేమకోసం తపించివాళ్లు. కట్టుబాట్లు తెంచినవాళ్లు కాంతి కోసం, సత్యం కోసం ఎవరి మాటనీ, ఏ శాస్త్రాన్నీ నమ్మక వాళ్ల అనుభవాలు ఆధారంగా ఆలోచించుకునే వాళ్లు. అన్వేషించేవాళ్లు. మధనపడేవాళ్లు.</p>
<p>&#8216;ఎన్నియుగాలనించో ఋషులు చేసిన అన్వేషణ, క్రిస్టియన్ ప్రవక్తలు మతానికై ధారపోసిన రక్తపువేడి, దిక్కుమాలి నశించిన దీనుల ఆర్తాలాపం జీవితమంతా ధీరంగా ఎదిరించిన యోధుల పట్టుదల, పురాతన కాలపు యత్నాలూ, కలలూ, ఆశలూ, బాధలూ, వ్యధలూ, ఇవేవీ వృధా పోలేదనీ, ఈనాటికి, ఏనాటికి, మనుష్య స్వభావాన్ని, యత్నాలని, ప్రోత్సహిస్తో జీవించి ఉన్నాయని విశ్వసిస్తే, గొప్పగా ప్రేమించుకున్న పూర్వుల అనుభవం, విరహం, ఈనాటి శృంగారానికి మెరుగు పెట్టక తప్పదు.&#8217; అంటారు చలం</p>
<p>అదే ధోరణిలో యుగయుగాల ఈశ్వర యోధుల ఆశయాలని స్వేచ్ఛాగానంగా పలికిన కృష్ణశాస్త్రి, యుగయుగాల ఋషుల అన్వేషణ గురించి చెప్పిన చలం &#8211; ఇద్దరూ ప్రేమే సత్యమనీ త్రికరణశుద్ధిగా నమ్మినవాళ్లు. ప్రేమ శాశ్వతమని పోరాడిన వాళ్లు. ప్రేమకీ కళకీ గల సంబంధాన్ని గుర్తించిన వాళ్లు. శృంగారం కళలలోకల్లా గొప్పకళ అని గ్రహించిన వాళ్లు. ఆర్టిస్ట్ కొంతవరకైనా ప్రేమికుడు కావాలని దృఢంగా చెప్పినవాళ్లు. అందుకే ఇద్దరూ లోకంనించి విమర్శని ఎదుర్కొన్న వాళ్లయ్యారు.</p>
<p>కృష్ణశాస్త్రి గురించి చెప్తూ &#8216;తన నిజ జీవితానికీ, తన స్వప్న సీమలలో గోచరించే సుందరానుభవానికీ, తను తాకే లోకానికీ, తను భావించుకునే స్వర్గానికీ, మధ్య యీ వృత్యాసం బాధించడం వల్లనే అతనిలో ఈ అశాంతి, ఈ అన్వేషణ&#8217; అంటారు చలం.</p>
<p>కృష్ణశాస్త్రి స్వేచ్ఛాన్వేషణలో సౌందర్య స్పృహ ఉంది. కృష్ణశాస్త్రి ప్రధానంగా రొమాంటిక్ కవి. బైరన్, షెల్లీ, వర్డ్స్ వర్త్, కీట్స్ వంటి కవులు స్వేచ్ఛనీ, సౌందర్యాన్నీ అన్వేషించినవాళ్లే. రొమాంటిక్ కవుల స్వేచ్ఛని గురించి క్రిష్టఫర్ కాడ్వెల్ &#8216;ఇల్యూజన్ అండ్ రియాలిటే&#8217; అనే గ్రంథంలో ఇలా విశ్లేషించాడు. &#8216;సమకాలిక నిరంకుశ విధానాల నుంచి విముక్తిని కోరిన బైరన్, సహజంగా మంచి లక్షణాలు గల వ్యక్తిని నాశనం చేసిన వ్యవస్థల నుంచి స్వేచ్ఛని కోరిన షెల్లీ, తిరిగి ప్రకృతిలోకి వెళ్లిపోదామన్న వర్డ్స్ వర్త్, &#8216;Revolution as a flight from reality&#8217; అన్న కీట్స్, అందరూ రొమాంటిక్ కవితా పతాకాన్ని స్వేచ్ఛగా, ఎగరేసినవాళ్లే&#8217; . వీళ్లందరూ కృష్ణశాస్త్రిని ప్రభావితం చేసినవారే.</p>
<p>కృష్ణశాస్త్రిగారి స్వేచ్ఛాప్రియత్వం ఛందస్సులో కూడా కనిపించడం విశేషం. ఆంగ్ల సాహిత్య పరిచయం, నవ్య ధోరణి పట్ల అభిరుచి, భావ పరివర్తనం ఆయనని ఛందః ప్రయోగంలో వైవిధ్యాన్ని ప్రదర్శించేలా చేసి భావ సౌందర్యాన్ని కొత్త తరహాలో ఆవిష్కరించేలా చేశాయి.</p>
<p>నన్నయగారి నుండి ప్రచారంలో ఉన్న ఛందస్సులలో కొన్ని మార్పులను సాధించే ప్రయత్నం కృష్ణశాస్త్రిగారు చేశారు. పాద సంఖ్యకి సంబంధించిన భంగము, పాదముల మధ్య పద్యాన్ని పూర్తిచేసి పాదభంగాన్ని కలిగించడం, పాదమధ్యం లోంచి పద్యాన్ని ప్రారంభించడం మొదలైనవి ఆయన చేసిన ప్రయోగాలు. అన్నీ తేటగీతి పద్యాలలొనే చేయడం గమనింపదగినది.</p>
<p>సాంప్రదాయకంగా పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి. అంతకన్నా ఎక్కువ పాదాలూ ఉండవచ్చు. కానీ తక్కువగా ఉండటం పూర్వ సంప్రదాయం కాదు. ఈ పాద సంఖ్యా భంగము భావకవులు మొదట ప్రవేశపెట్టారు. కృష్ణశాస్త్రిగారి కవిత్వంలో ఈ ప్రయోగం కనిపిస్తుంది.</p>
<blockquote><p>&#8216;నా విరులతోట బెంచికొన్నాడ నొక్క<br />
పవడపు గులాబిమొక్క నా ప్రణయజీవ<br />
నమ్ము వర్షమ్ముగా ననయమ్ముగురిసి&#8217;</p></blockquote>
<p>ఒక పాదము భంగము కలిగిన పద్యమిది.</p>
<p>పాదముల మధ్యలోనే పద్యాన్ని పూర్తి చేయటం పాదభంగము. &#8216;ఇలాంటివి స్వేచ్ఛాప్రియత్వమని శ్రీ శివశంకరశాస్త్రిగారు కృష్ణపక్ష సింహావలోకనంలో చెప్పారు.&#8217;</p>
<blockquote><p>&#8216; మరల గ్రుడ్డిరాతిరిపడు, మరలనోరు<br />
కాని శృతులేని లేని చీకటులు మరల<br />
మరల పాడిల్లు&#8230;&#8217;</p></blockquote>
<p>పై పద్యం మూడవ పాదంలో మూడు గణాలు లేకుండా పద్యం పూర్తయ్యింది. దీనిని పాదభంగము అంటారు.</p>
<p>పాదమధ్యంలో పద్యం పూర్తిచేయడమే కాక, పాదం మధ్యలోంచి పద్యం ప్రారంభించుట కూడా ఉంది.</p>
<blockquote><p>&#8216;నేను నిదుర<br />
వెన్నెలలదారి నొకరేయి వెడలిపోతి<br />
నొక విపంచీ విరహకంఠమొరసి యెగసి &#8216;</p></blockquote>
<p>పై పద్యంలో మొదటి పాదంలో మొదట ఉండవలసిన మూడు గణాలు వదలివేయబడ్డాయి. పద్యం కూడా మూడు పాదాలలోనే ఉండటం విశేషం.</p>
<p>ఆంగ్ల సాహిత్యంలో వర్డ్స్ వర్తు ఇటువంటి ప్రయోగాలు చేశాడు. Enjambment పద్ధతి ద్వారా ఈ ప్రయోగం చేశాడు. A skillful poet, however, will use the line ending to reinforce his meaning. Consider the way Wordsworth makes use of a pause at the line ending to emphasise and enact his meaning.&#8217;</p>
<p>సమర్ధుడైన కవి భావం బలంగా చెప్పడానికి గాని క్లుప్తత సాధించి గాఢమైన అనుభూతిని పాఠకునిలో కలిగించడానికిగాని ఇటువంటి స్వేచ్ఛని తీసుకుంటాడు. పాదసంఖ్యా, పాదభంగములకు స్వేచ్ఛాప్రియత్వమే కారణం. ఇందులో ఉండే సౌందర్యాన్ని గ్రహించిన ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య &#8216;భావ పరిమితి కన్న పద్యము వ్యర్ధ పదములను కూర్చుటయా చేయవలసియుండును. అది భావసౌందర్యమునకు అనువుగా ఉండదు. అందువలన భావమెక్కడ పూర్తియైన పద్యమును కూడా అక్కడనే ఆపవచ్చును&#8217; అని అన్నారు.</p>
<p>కృష్ణశాస్త్రిగారి స్వేచ్ఛాన్వేషణంలో రూపానికి సంబంధించి ఛందస్సులోనూ భావాలకి సంబంధించి ప్రణయం, సంస్కరణ లోనూ కనబడుతుంది. కానీ యౌవనోద్రేకంలో ప్రణయానికి సంబంధించిన విశృంఖలమైన స్వేచ్ఛ కవిని కృష్ణపక్షంలో పడేసింది. భ్రమతో కూడిన స్వేచ్ఛలోంచి శాశ్వతమైన స్వేచ్ఛకోసం ప్రేమాన్వేషణంలో పడతాడు.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=11445</wfw:commentRss>
		<slash:comments>5</slash:comments>
		</item>
	</channel>
</rss>
