కబుర్లు

ఈ-పుస్తకలోకంలో ఆమె విజయం!

మార్చి 2013

మహిళ!
ఆకాశంలో సగం!
తెలుగు సాహిత్య రంగంలో సగం !
తెలుగు పాఠకులలో సింహభాగం!
ఇప్పుడు ఈ-పుస్తకంలో వడి వడి అడుగులు!

ఎనభయ్యవ దశకంలో నవలాసాహిత్యంతో పాఠకులను ఉర్రూతలూగించినట్లే, నేటి కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతికతని అందిపుచ్చుకుని సాహిత్యంపై తమ ముద్ర వేస్తున్నారు రచయిత్రులు. తెలుగు సాహిత్యం మీద కూడా ఈ సాంకేతికత ప్రభావం ఉంది. పుస్తక ప్రచురణ రంగంలోనూ మార్పులు వస్తున్నాయి. తెలుగు పాఠకులకు కూడా ఆధునిక పరికరాలలో చదువుకోగలిగే డిజిటల్ బుక్స్ లేదా ఈ- పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి.

సాంకేతికతతో పాటు అవసరాలు, అవకాశాలు పెరిగాయి. గతంలో ఇంటి నిర్వహణకి మాత్రమే పరిమితమైన స్త్రీలు ఇప్పుడు ఉద్యోగ వాణిజ్య రంగాలలో ప్రవేశించి తమ ప్రతిభని నిరూపించుకుంటున్నారు. ఉద్యోగం చేస్తునే ఇంటి బాధ్యతలు నిర్వహించుకోడం, తమకి ఆసక్తి ఉన్న అభిరుచులను పెంపొందించుకోడం… ఉదాహరణకి సంగీతం, నృత్యం, చిత్రలేఖనం.. వంటి కళలలో ప్రావీణ్యం సంపాదించుకోడం చేస్తున్నారు. సాహిత్యాన్ని చదవడమే కాకుండా, తమ భావాలను స్వేచ్ఛగా వెల్లడించసాగారు. ఇందుకు మార్గం చూపింది బ్లాగు. ఇంటర్‌నెట్ వేదికగా బ్లాగులో రాసుకున్న రాతలకు ప్రోత్సాహం లభించి, వారిలో సృజనాత్మకత ద్విగుణీకృతమైంది. అది పాఠకులు రచయిత్రులుగా మారేందుకు దోహదపడింది. ఇంటర్‍నెట్ ఆధారంగా రాసుకున్న కథలూ, కవితలూ, నవలలను తదుపరి కాలంలో ఈ-పుస్తకాలుగా ప్రకటిస్తున్నారు రచయిత్రులు.

“జాజిమల్లి” అనే పేరుతో తన బ్లాగులో రాసుకున్న టపాలను కథా సంకలనంగా వెలువరించి, ఈ-బుక్ రూపంలో ప్రపంచ వ్యాప్తంగా చదువరులకి అందుబాటులోకి తెచ్చారు మల్లీశ్వరి.

తెలుగు ఈ-బుక్స్ విషయంలో తొలి అడుగు వేసింది కినిగె.కాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న తెలుగువారు తెలుగు పుస్తకాలను తమ తమ కంప్యూటర్లలో లేదా ఇతర ఉపకరణాల్లో చదువుకునే సౌలభ్యం కల్పించింది. ఇంటర్‌నెట్ అందుబాటులో ఉంటే రచయితలే స్వయంగా తమ రచనలను సులువుగా ఈ-పబ్లిష్ చేసుకునే వీలు కల్పించింది కినిగె.కాం.

తమ రచనలను కినిగె.కాంపై స్వయంగా ప్రచురించుకుంటున్న రచయిత్రి టి. శ్రీవల్లీ రాధిక. కథారచయిత్రిగా, కవయిత్రిగా సుపరిచితురాలైన రాధిక – “స్వయంప్రకాశం, తక్కువేమి మనకు, మహర్ణవం” అనే మూడు కథా సంపుటాలు; “కైవల్యం” అనే కవితా సంకలనం, “ఒకరికొకరు” అనే నవలలను ఈ-పబ్లిష్ చేసారు. ప్రతీ రచనలోనూ మానవ మనస్తత్వాలను అద్భుతంగా విశ్లేషిస్తారు రాధిక.

తమ రచనలను ఈ-పబ్లిష్ చేస్తున్న మరో రచయిత్రి శ్రీపాద స్వాతి. నవలలు, కథలు, కవితలు, గీతాలు -విభాగం ఏదైనా అలవోకగా రచించి, పాఠకులను భావ ప్రపంచంలోకి తీసుకువెళ్లగలిగిన రచయిత్రి ఈమె. “గోడలు, పునరాగమనం, ఎక్కడినుంచి… ఇక్కడి దాకా, పాటల మధువని, మనసుంటే…, ఆగిపోయిన కాలమా” అనే వీరి పుస్తకాలు కినిగెలో లభిస్తాయి.

అలాగే కినిగెలో లభిస్తున్న ఈ-పబ్లిష్ సౌలభ్యాన్ని ఉపయోగించుకుని తన రచనలను అందించిన మరో యువ రచయిత్రి నల్గొండ జిల్లాకి చెందిన డా. సిరి. దంత వైద్యురాలైన ఈవిడ సాహితీవైద్యం కూడా చేస్తూ, “వెన్నెల పూదోట”, “ది లాస్ట్ మీల్ ఎట్ సాగరిక”, “ఎ గిప్ట్ కాల్డ్ లైఫ్”, “ఎబి నెగటివ్” అనే పుస్తకాలను పాఠకులకు అందించారు.

కొత్త, పాత తరం రచయిత్రులందరూ కూడా ఈ-పుస్తకాన్ని అందిపుచ్చుకుని తమ రచనలు అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు.

ఇల్లిందల సరస్వతీ దేవి డైబ్బయ్యవ దశకంలో తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన రచయిత్రి. వీరి రచనలను వారి కుమారుడు ఈ-బుక్స్ రూపంలో ప్రస్తుత తరం చదువరులకు అందిస్తున్నారు. కీ.శే. సరస్వతీదేవి గారు రచిందిన “భవతీ భిక్షాం దేహి”, “నీ బాంచను కాల్మొక్తా” అనే నవలలు, “స్వర్ణకమలాలు” అనే కథా సంకలానం రెండు భాగాలు కినిగెలో లభిస్తాయి.

రంగనాయకమ్మ గారి సాహిత్య సర్వస్వం – నవలలు, కథలు, విశ్లేషణలు – పిల్లల కోసం తెలుగు వాచకం, ఆర్ధిక శాస్త్రం – కినిగెలో ఉన్నాయి. ఏం రాసినా నిజాయితీగా రాయడం, సూటిగా చెప్పడం వంటివి ఈనాటి పాఠకులనూ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

తమ సమకాలీన రచయితలతో సమానంగా పేరు ప్రఖ్యాతులు పొంది తన నవలతో విశేషాదరణ పొందిన రచయిత్రి మాదిరెడ్డి సులోచన. “భిన్న ధృవాలు, జీవనయాత్ర, దేవుడిచ్చిన వరాలు, పూలమనసులు, వారసులు, కాంతిరేఖలు” అనే నవలలు కినిగెలో లభిస్తాయి. ఈమె నవలలో ప్రధాన పాత్రలు పట్టుదల, అవగాహన కలిగి ఉండి తమ జీవితాన్ని ఆనందకరం చేసుకునే ప్రయత్నం చేస్తూ, సమాజంలోను సుఖసంతోషాలు వెల్లివిరియాలని తపన పడతాయి.

మనసు ఫౌండేషన్ వారి సహకారంతో తమ సమగ్ర సాహిత్యం సంపుటాన్ని వెలువరించారు బీనాదేవి. ఈ సంపుటం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

“ముంగిట ముత్యాలు” పేరుతో పిల్లల కోసం విజయవాడ నుంచి భమిడిపాటి బాలా త్రిపుర సుందరి, “అనగా అనగా కథలు” పేరుతో హైదరాబాదు నుంచి అబ్బురి ఛాయాదేవి, “బుజ్జి కథలు” అనే శీర్షికతో  వాసిరెడ్ది సీతాదేవి రాసిన పుస్తకాలు కినిగెలో లభిస్తాయి. చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో గుర్రం కొండ ఆధారంగా రూపొందించిన “రెడ్డమ్మ గుండు” నవలతో పాఠకులను అలరించారు అమెరికాలో ఉంటున్న ఆర్. వసుంధరా దేవి.

ముంబయి నుంచి రాసే ఆయుర్వేద వైద్య నిపుణులు డా. గాయత్రి దేవి “ప్రకృతి వరాలు (రెండు భాగాలు), అమ్మాయి-అమ్మ-అమ్మమ్మ, ఎవరితో ఎలా మాట్లాడాలి” అనే రచనల ద్వారా అశేష పాఠకాభిమానాన్ని చూరగొన్నారు. ఆరోగ్యానికి, వెల్‌బీయింగ్‌కి వారి సూచనలు సలహాలు ఎంతో ఉపకరిస్తాయి.

పి. సత్యవతిగారు కథకురాలిగా, వ్యాసకర్తగా, అనువాదకురాలిగా చిరపరిచిచుతులే. వీరి “మెలకువ” అనే కథాసంకలనం, “ఇస్మత్ చుగ్తాయ్ కథలు” అనే అనువాదకథా సంకలనం, “రాగం భూపాలం” అనే వ్యాస సంపుటి కినిగెలో ఉన్నాయి.

భూమిక పత్రిక సంపాదకురాలిగా మహిళా పాఠకులందరికీ బాగా తెలిసిన రచయిత్రి కొండవీటి సత్యవతి. “మెలకువ సందర్భం” అనే కథా సంకలనం, “భండారు అచ్చమాంబ సచ్చరిత్ర” అనే పుస్తకాలను కినిగె ద్వారా పాఠకులకు అందించారు.

స్త్రీవాద రచయిత్రిగా అందరికీ తెలిసిన ఓల్గా తన రచనలు “ఆకాశంలో సగం, విముక్త, రాజకీయ కథలు, కన్నీటి కెరటాల వెన్నెల, గురజాడ అడుగుజాడ, నేను.. సావిత్రిబాయిని, కుటుంబ వ్యవస్థ” వంటి రచనలతో చదువరులలో చైతన్యం నింపడానికి ప్రయత్నిస్తారు.

తక్కువగా రాసినా, మంచి కథలు రచించిన వి. రామలక్ష్మి గారి “నాకూ విశ్రాంతి కావాలి”, “కొండఫలం మరికొన్ని కథలు” పేరుతో వాడ్రేవు వీరలక్ష్మీదేవి, “అతడు-నేను” అనే శీర్షికతో కె. వరలక్ష్మి; “అడ్డా” అనే కథాసంకలనాన్ని శైలజామిత్ర, “ఆసరా” అనే కథాసంకలనంతో వారణాసి నాగలక్మి, “అమ్యూజింగ్స్” అనే కథాసంకలనంతో పుష్పాంజలి, “మూడో అందం” పేరుతో గోటేటి లలితాశేఖర్; “జీవన శిల్పం” పేరుతో కథా సంపుటం వెలువరించిన కన్నెగంటి అనసూయ, “కొత్తగూడెం పోరగాడికో లవ్ లెటర్” అనే పేరుతో డా. సామాన్య, “చందనపు బొమ్మ” కథా సంకలనంతో ప్రముఖ రిపోర్టర్ పప్పు అరుణ, “స్మోకీ మౌంటెయిన్స్” కథా సంకలనంతో పి. రాధా మహాలక్ష్మి, “దృష్టి” కథా సంకలనంతో ఎస్. వి. కృష్ణ జయంతి తెలుగు అంతర్జాల పాఠకులకు తమ కలం బలం చూపారు.

ఆత్మకథ లేదా స్వీయచరిత్రలను రాసుకున్న రచయిత్రులు కినిగెలో ఉన్నారు. “గోరాతో నా జీవితం” అంటూ సరస్వతీ గోరా, “నిర్జన వారధి” అనే శీర్షికతో కొండపల్లి కోటేశ్వరమ్మ, “ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ” అనే పేరుతో నళిని జమీలా స్వగతాలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. ఆలిండియా రేడియోలో పనిచేసిన శారదా శ్రీనివాసన్ తన జ్ఞాపకాలను “నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు” అంటూ వివరించారు. గోగు శ్యామల మొట్టమొదటి దళిత మహిళా మంత్రి సదాలక్ష్మి బతుకు కథని అందించారు.

చాగంటి తులసి అనువాద కవిత్వం “గోరింటపూలు”, కొండేపూడి నిర్మల కవిత్వం “నివురు”, రేణుక అయోల “లోపలి స్వరం”, స్వాతికుమారి “కోనేటి మెట్లు”, అయినంపూడి శ్రీలక్ష్మి “అలల వాన, లైఫ్ ఎట్ చార్మినార్”, పద్మకళ “దృష్టి” తెలుగు కవిత్వాన్నిష్టపడే పాఠకులను అలరిస్తాయి.

పరిశోధనాత్మక వ్యాసాలతో డా. ముదునూరి భారతి, డా. సి. భవానీదేవి, డా. సామాన్య, ఓలేటి ఉమాసరస్వతి, గుర్రంకొండ నీరజ పాఠకుల అవగాహనా పరిధిని విస్తృతం చేస్తారు. డా. గజ్జల రమాదేవి ఆక్యూప్రెజర్, ఆక్యూపంచర్ పై రెండు పుస్తకాలను కినిగెలో ఈ-పబ్లిష్ చేసారు.

కుప్పిలి పద్మ పుస్తకాలు “మహి, మంచుపూల వాన, శీతవేళ రానీయకు” కినిగెలో ఉన్నాయి.

సీనియర్ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారి సునిశిత హాస్య వ్యంగ్య రచనలు కూడా కినిగెలో లభ్యమవుతాయి.

పర్యావరణం, ప్రకృతి, జన్యుమార్పిడి పంటలు వంటి అంశాలపై రచనలు చేసిన చంద్రలత గారి పుస్తకాలు “మడత పేజీ, వివర్ణం, చేపలెగరా వచ్చు, వచ్చే దారెటు” కినిగెలో లభిస్తాయి.

వివిధ దేవాలయాలను, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తూ, వాటి గురించి సరళమైన భాషలో వివరిస్తూ కినిగె పాఠకులకు అందిస్తున్నారు పి. ఎస్. ఎమ్. లక్ష్మి. “యాత్రా దర్శిని నల్గొండ జిల్లా, యాత్రాదీపిక – వరంగల్ జిల్లా, పంచారామాలూ – పరిసర క్షేత్రాలు” అనే వీరి పుస్తకాలు దేవాలయాలు, పర్యటనలు అంటే ఆసక్తి ఉన్న చదువరులకు ఉపయుక్తమైన సమాచారాన్ని అందిస్తాయి.

“సంప్రదాయ ముగ్గులు” పేరుతో రకరకాల రంగవల్లుల్ని తెలుగు పాఠకులకి పరిచయం చేసారు జ్యోతి వలబోజు. వేల వేల వత్సరాల మానవ జీవన సారమే హిందూ ధర్మమని,. దానిని అర్థం చేసుకోవటం ఈ తరానికే కాదు అన్ని తరాలవారికీ అవసరమేనంటూ “ధర్మపథం” శీర్షికతో పుస్తకాన్ని అందించారు కంచర్ల అనూరాధ. హిట్లర్ గురించి “జాత్యాహంకారి హిట్లర్” అనే పుస్తకంలో వివరించారు రమాదేవి చేలూరు. “కలుపు తీశిన కంప్యూటర్ చేసిన” అంటూ తన జీవన యానాన్ని వివరించారు చంద్రకళ. “విధిని ఎదిరిస్తున్న వీధి బాలలు, పేద పిల్లలు” అనే శీర్షికతో వీధి బాలల గురించి చక్కని రచనని అందించారు గురజాడ శోభ పేరిందేవి.

ఇక పడమటి దేశాల నుంచి కవిత్వం రాస్తున్న రచయిత్రులలో పాలపర్తి ఇంద్రాణి తమ రెండు కవితా సంకలనాలు “వానకు తడిసిన పువ్వొకటి, అడవి దారిలో గాలి పాట” లను కినిగెలో ఈ-పబ్లిష్ చేసారు. అలాగే అమెరికా నుంచి మరో రచయిత్రి ఉమాదేవి “వర్షించవే నీలి మేఘమా” అనే కవితా సంకలనాన్ని కినిగె ద్వారా ఈ బుక్ గా అందించారు.

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సాహితీ సౌరభాల పరిమళాలను వెదజల్లుతునే ఉన్నారు తెలుగు రచయిత్రులు.

***

నేటి నాటి రచయిత్రుల నుంచి రచనలను ఆహ్వానిస్తోంది కినిగె.కాం

కినిగెలో ఈ-పుస్తకం ఉంచడం తేలిక. కేవలం కవర్ పేజీ, రన్నింగ్ టెక్స్‌ట్ ఉంటే చాలు. ఈ రన్నింగ్ టెక్స్‌ట్ పీడీయఫ్ రూపంలో గాని, అడోబ్ పేజ్ మేకర్ ఫైళ్ల రూపంలో గాని ఉండవచ్చు.

మీరు ఇప్పటికే పుస్తకాన్ని ముద్రించి ఉంటే ప్రింటరుకు ఇచ్చిన ఫైళ్లు చాలు!

మీకు ఇంటర్‍నెట్ అందుబాటులో ఉంటే మీ పుస్తకాలను మీరే స్వయంగా అప్‍లోడ్ చేయవచ్చు.

కినిగెకు పుస్తకాన్ని సబ్‌మిట్ చెయ్యడం చాలా సులభం. మీరు www.kinige.com దర్శించి పైన కుడివైపున ఉన్న “ePublish your book” అని ఉన్న లింకు నొక్కండి. అక్కడ కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మీ పుస్తకానికి నప్పే ఆప్షన్ ఎంచుకోని క్లిక్ చేసి ముందుకు వెళ్లండి. మీరు ఇక్కడ కినిగె ఖాతా ఈసరికే లేకుంటే సృష్టించుకోవాలి. కినిగె ఖాతా సృష్టించుకోవడం పూర్తిగా ఉచితం మరియు సులభం కూడా.

తరువాత మూడు స్క్రీన్లలో మీ పుస్తకం గురించిన వివిధ వివరాలు (పేరు, వివరణ, కవర్, రన్నింగ్ టెక్స్ట్ వంటివి) ప్రవేశపెట్టి కినిగెకు మీ పుస్తకాన్ని అతి సులభంగా సమర్పించవచ్చు.



2 Responses to ఈ-పుస్తకలోకంలో ఆమె విజయం!

  1. March 3, 2013 at 10:14 am

    ఈ-పుస్తకం తయారీ గురించి ఉపయోగకరమైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు అనిల్ గారూ.

  2. Syamala Kallury
    June 6, 2013 at 11:28 am

    Thanks for this useful information

Leave a Reply to Syamala Kallury Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)