నిన్నటి నుండి మంచు కురుస్తూనే వుంది. యే దిగులూ, ఆర్భాటం లేని ఇంత స్వచ్చత ఎలా అబ్బిందో దీనికి అనుకుంటూనే వున్నా వెన్నెలే కొత్త రంగులో ప్రతిఫలిస్తుంటే . సరిగ్గా అప్పుడే ముకుంద రామారావు గారి ‘మరో మజిలీకి ముందు ‘ నా పుస్తకాల సొరుగులోనుండి బయటకు తీసాను. ‘సమయానికి తగు మాటలాడెనె ‘ అన్న త్యాగరాజ కృతిలా ఈ కవిత దగ్గరే కళ్ళు, మనసు విడిది చేసాయి. కాస్తో కూస్తో ఈ కవితని తర్కించాక ఏదో రహస్యం మనసుని తట్టి లేపుతుంది.
——————————————————————-
మరో మజిలీకి ముందు
అద్దం ముందు ఆకాశమంత అబద్ధం
అద్దాల మధ్య బింబ ప్రతిబింబాల్లో
నిజానిజాల సందేహం
ఎండని చెమటతో తుడుచుకుంటూ
చలిని ఎండలో కాచుకుంటూ
పగుళ్ళు బారిన దేహాన్ని
చాలీ చాలని చినుకులతో తడుపుకుంటూ
రోజులు
అవును నిజ మే!
ఏక కణానికి ఏ ప్రతిపత్తీ వుండదు
మనసుకి హత్తుకోని
ఏ కలా మర్నాటికి గుర్తుండదు
ఎంత మోజుపడ్డా
ఎదుగుతున్న కొద్దీ
ఉన్న దుస్తులేవీ సరిపోవడం లేదు
ఎరిగున్న దారులేవీ
విశాలం కావడం లేదు
పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీలోలా!
ఆకొసకెలా చేరాలన్నది
ఎప్పుడూ తలెత్తే ప్రశ్నే!
వెనక్కి పోనూలేక
ఆగిపోనూలేక
మొదట్లా కాదు
ప్రాకారాలు దాటుతున్న ఆలోచనల్ని
లోపల సమస్యలు లాగిలాగి ప్రశ్నిస్తున్నాయి
నా కాళ్ళకింద భూమి
నన్ను తొలిచేస్తూనే ఉంది
నా వేర్లని తెలుసుకుందుకిప్పుడు
నన్ను నేనే తవ్వుకోవాల్సొస్తుంది
తొందరపడాలి
సాయంకాలం మంచుతెరలు దట్టమయ్యేలోగా
వాటిలోని పరిమళాల్ని
నా దారంతా పరుచుకుంటూ పోవాలి
——————————————————————
ఒక్కోసారేమిటి చాలాసార్లు మనకు మనమే నిలువెత్తు అబద్ధంలా కనిపిస్తాం మనసుని మభ్య పెట్టినప్పుడల్లా! అదేమిటో, సరిగ్గా అప్పుడే అద్దంలో చూసుకున్నామా అది ఆకాశమంత అగుపడుతుంది. నచ్చని ఘడియల్లోకి చేరి, మరింత గాయపరిచే జ్ఞాపకమయి కూర్చుంటుంది. ప్రతిదానికి రెండు కోణాలే కనిపిస్తాయి నిజమని, అనిజమని. మరి మూడొవది మనస్సులో మొలకెత్తే సందేహమే. బింబ, ప్రతిబింబాల్లో ఎటూ తేల్చుకోలేని సంశయమే జీవితాన్ని ముందుకో, వెనక్కో తోస్తుంది.
ఎండని చెమటతో తుడుచుకుంటూ, చలిని ఎండలో కాచుకుంటూ, పగుళ్ళు బారిన దేహాన్ని చాలీ చాలని చినుకులతో తడుపుకుంటూ రోజులు – బాధని నవ్వుతోనో తాత్కాలిక ఆనందంతోనో కప్పిపుచ్చుకుంటూ, సంతోషం మూలల్లో కూడా ఏవో నీలినీడల్ని పోగేసుకుంటూ, నిలకడ లేని క్షణాలని వెలిగిస్తూ – విఫలమవుతూ అనుభవాలతో బీటలు వారే ఈ దేహానికెప్పుడూ చాలీ చాలని తృప్తే. ఈ ఒక్కలైనులోనే ప్రస్తుత జీవనగతి ఒదిగినట్టనిపిస్తుంది. యధేచ్చగా ప్రవహించాల్సిన జీవితమేదో ఎన్నో సర్దుబాట్లు, ఎడబాట్లు, ఒప్పందాల నడుమ ఉపిరాడని ఓ భావాజాలమని తేలిపోతుంది ఈ పదాలు పూర్తయ్యేపాటికి.
మరో అద్భుత వాక్యం ‘మనసుకి హత్తుకోని ఏ కలా మర్నాటికి గుర్తుండదు ‘. అది కలయినా, ఎదురొచ్చిన సంఘటనయినా, వెనక పేజీల్లోకి వెళ్ళిపోయిన మనిషైనా. ఇంత సూటిగా తాకిన అనుభూతి పదాలకు మరింత వివరణ అవమానం.
‘ఎరిగున్న దారులేవీ విశాలం కావడం లేదు’ – తరచి చూసేకొద్దీ ఎంత రాపిడి వుందీ వాక్యంలో అనిపించకమానదు. చూపు, కదలిక నిశ్చలమయినట్టనిపిస్తుంది దీని సారాంశమేంటో తెలిసాక. మోజుపడి నిజం చేసుకున్న కలలేవీ మన నిత్యావసరాలను తీర్చలేవు. అలాగే , ఏర్పరుచుకున్న దారులన్నీ అన్నివేళల్లోను అక్కరకు రావు. పోగేసుకుంటూ పోతున్న అనుభవాల రద్దీలో, జీవితం గడిచేకోద్దీ ఇరుకవుతూనే వుంటుంది.
నిజంవైపుకి పయనమెప్పుడూ సుఖాంతమే, సంతృప్తిభరితమే. కాకపోతే మార్గమేంటో, పయనమెలానో అన్నవే చిరకాలం మిగిలిపోయే ప్రశ్నలు. ఇదివరకులా కాదు. ఇప్పుడు ప్రహారి దాటుతున్న ఆలోచనలు న్యాయమైన స్వేచ్చకోసమో, సంశయ బంధనాలు తెంచుకునే దిశలోనో ప్రస్తుత గతాలను ప్రశ్నిస్తున్నాయి. నిజమైన నన్ను తెలుసుకునే కాలం ఒకటుంటుంది, దానికోసం నన్ను నేను తవ్వుకోవాలి. ఆట్టే సమయం లేదు. తొందరపడాలి…సాయంకాలం మంచుతెరలు దట్టమయ్యేలోగా, వాటిలోని పరిమళాల్ని నా దారంతా పరుచుకుంటూ పోవాలి – ఈ ముగింపులోనే మౌనంగా ఓ భావం మెరిసి మాయమవుతుంది.
ఇలాంటి కవితల్ని చదివినప్పుడు, ఉన్నచోటనే ఆగిపోతాం. కనీసం కొద్దిసేపైనా కాళ్ళు భూమినట్టిపెట్టుకుంటాయి. ఇప్పుడద్దంలో మనల్ని మనం దర్శించుకుంటే కనిపించేది సందేహాన్ని వీడిన స్వచ్చమైన చిరునవ్వే. మరో మజిలీకి ముందు ఇలాంటి కవితలు కొన్నైనా చదవాలి, ఒక్కటైనా రాసిపెట్టుకోవాలి.
ఓ మంచి కవిత చదివించారు. అంతకన్నా మీ కవితాపరిచయం ఇంకా చక్కగా ఉంది. అభినందనలు.
ఇస్మాయిల్ గారు అన్నట్లే కవితా పరిచయం వల్ల మబ్బులని పక్కకి తోసి పున్నమి చంద్రుడిని స్పష్టంగా చూపించినట్లయింది.
nijame. anthuleni aakasham mundu manam o andamaina abaddham lanti addam. aa addam etu tippite, yedi kanapadite ade nijamanukune abaddham. aa addam lo kanipince nijam kani anijallo antuleni tavvakalu saginchi, nijanni vetukkone prayatnam. aa pratibimbamlone aneka bhavaveshalani santhrupitiparacukone prayatnam. aakasham nijam, addam abaddam. kudi edamayite porapatu ledoyi.
మోహ గారూ,
జీవిత చరమాంకంలోకి ప్రవేశిస్తున్నకొద్దీ (మరో మజిలీకి దగ్గరౌతున్నకొద్దీ) మనిషిలో ఆత్మావలోకనం పాలు పెరుగుతుంటుంది. అదే అద్దం. మనం నిజాయితీగా సమీక్షించుకోగలిగితే,అందులో మనం జీవించిన జీవితమనే ప్రతిబింబమే మనకు ఆకాసమంత అబద్ధంలా కనిపిస్తుంది. మనం అంతవరకూ కప్పుకున్న పొరలు విప్పుకోగలిగితే, మన విశ్వాసాల రాదారులు ఎంత సంకుచితంగా ఉన్నాయో మనకే అర్థం అయిపోతుంది. కార్పొరేట్ ప్రపంచంలో పెర్ఫార్మెన్స్ రెవ్యూ ముందు ఉద్యోగి పరిస్థితిలా ఉంటుంది మన మనస్థితి. మిగిలి ఉన్న సమయం ఎంతో తెలీదు. లక్ష్యం ఎలా సాధించాలో తెలీదు. మనం ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిద్దామనుకున్నా, లోపల టెన్షన్ పెరిగిపోతుంటుంది. మళ్ళీ మనం మన మూల విశ్వాసాలని పునశ్చరణ చేసుకోవలసిన పరిస్థితి వస్తుంది. ఇది ఒక గొప్ప మానసిక సంఘర్షణ. ముకుందరామారావుగారు ఈ పరిస్థితిని చాలా చక్కగా ఆవిష్కరించేరు.
మంచికవితని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
“ఇలాంటి కవితల్ని చదివినప్పుడు, ఉన్నచోటనే ఆగిపోతాం. కనీసం కొద్దిసేపైనా కాళ్ళు భూమినట్టిపెట్టుకుంటాయి.”
నిజమే! కాసేపన్నా ఆగి మనమెళ్తున్న దారి గురుతులు సరిచూసుకోవాలనిపిస్తుంది, ఇలాంటి కవిత చదివాక! రామారావు గారి కవితలోని తార్కికత ఎంతో సరళంగా వివరించారు!
చాలా నచ్చింది, మీ కవితా పరిచయం.. మీ నించి మరిన్ని రచనల కోసం ఎదురుచూస్తుంటాము
ఒక కవితని సావకాశంగా చదివి ఇంత సహనంతో విశ్లేషించినందుకు ముందుగా మీకు అభినందనలు. ఈ విశ్లేషణలోని ప్రతి వాక్యం కవిత్వం పట్ల మీకు వున్న మంచి అభిరుచినే కాదు, మీ తపనని కూడా చెబ్తోంది. మీ పరామర్శ చదవగానే ఈ పుస్తకంలోని మిగిలిన కవితలు మళ్ళీ చదవాలన్న ఆసక్తి కలిగింది. మీ వచనం ఎంత సూటిగా వుందో, అంత అందంగానూ వుంది. ఆలోచనల స్పష్టత ప్రతి వాక్యంలోనూ కనిపిస్తోంది. కవిత్వం లోపలి సారాన్ని గ్రహించే మీ శక్తి కూడా ఈ వాక్యాల్లో ప్రతిఫలిస్తోంది. కవిత్వాన్ని గురించి ఇంత వచనం కవిత్వం అంతే అందంగా రాయడం అంత తేలికేమీ కాదు. కానీ, మీరు మొదలు పెట్టిన ఈ ప్రయత్నం నాకు మనస్ఫూర్తిగా నచ్చింది. మీరు రాసిన పద్దతి వల్ల అది ఇంకా నచ్చింది. ఆ పద్ధతికి కొంత భావనల బలం కూడా కూర్చారనుకొండి. ఇంకా బాగుంటుంది.
కవిత్వానికి పరిచయం అనవసరమనిపిస్తుంది ఒక్కోసారి. కానీ, ఇంతటి చిక్కని, కవితాత్మకమైన వచనంతో కవితలను పరిచయం చేస్తే బంగారానికి తావి అబ్బినట్టే! ముకుందరామారావు గారి కవితలో తఱచి చూసే కొద్దీ తఱగని భావాల నిధి ఉంది. మీ కవితాపరిచయం ఆ నిధి మీద మాకూ ఆశ కల్పించిందనటంలో సందేహం లేదు!
కవిత అంటే యెలా ఉండాలో యెలా రాయాలో అఫ్సర్ సర్ మొదటి నుండి నాకు సూచిస్తూనే ఉన్నారు, అయితే ఎప్పటికప్పుడూ యేదో తెలీని సందేహాలు. మీ కవిత కూడా చాలా సులబతరం అనిపించినా దానిలో దాగిన అర్ద్రత ఎంత గాఢమైనదో తెలుస్తుంది.
మైసూరు రీజనల్ కాలేజిలో మొదటి సంవత్సరం పొయెట్రీ క్లాసుల్లో కూర్చున్నట్టుంది. పద్యం ప్రతిపదార్థమే తెలిసిన నాకు మొదటి సారి కవిత్వాన్ని ” చదివి ఆస్వాదించడం.అర్థం చేసుకుని అనుభవించడం” అక్కడే తెలిసింది. ఇప్పుడు ఇక్కడ ఆ ప్రక్రియ మళ్ళీ ప్రారంభమయ్యింది.
అప్పుడప్పుడూ చదువుతున్న కవితలోని ఆత్మను పట్టుకోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తుంటాను. కానీ ఆలోచన, స్పురణలు నా మనస్థితిపైన, సమయంపైన అల్లుకుని వాటిచుట్టూ తిరుగుతుంటాయి. అప్పుడు కవితలోని ఆత్మ వేవేలా కన్పిస్తుంది.
ఈ కవితను మొదటిసారి నేను చదువుతున్నప్పుడు
శీర్షికను ప్రక్కకు పెట్టి మొదటి రెండు పాదాలు పూర్తయ్యేసరికి – వర్షాలు లేక నెర్రలువారిన, భూమిని గురించి అటువైపుగా నా దృష్టిని కవి తీసుకెళుతున్నాడా అన్పించింది.
మూడవపాదం పూర్తయ్యేసర్కి నేను, నా ఆలోచన పప్పులో కాలేసాయని తెలిసింది. మళ్ళీ పైకి శీర్షిక దగ్గరకు వెళ్ళి కవిని పిలుచుకొచ్చి ప్రక్కన కూర్చోబెట్టుకొని చదవడం మొదలుపెట్టాను.
ఇప్పుడు నా అలోచనా, స్పురణలు అక్షరాల మధ్య ధ్వనిస్తున్న ముకుంద రామారావు గొంతు వినిపిస్తుంది.(ముకుంద రామారావు గొంతు చాలాసార్లు విన్నాను).
సమయం తీసుకుని మీ అభిప్రాయాలను తెలిపినందుకు, ప్రోత్సాహానికి, సూచనలకు మీ అందరికీ కృతజ్ఞతలు.