మాట్లాడుకుందాం

ఒక సామాజిక సంవాదం చెయ్యాలంటే కేవలం కవిత్వం మీదే ఆధారపడలేం

జనవరి 2013

(ఆంధ్రజ్యోతి వివిధ లో అచ్చయిన అఫ్సర్ గారి ఇంటర్వ్యూ  పూర్తి పాఠం ఇదీ… )

అఫ్సర్…. ఈ పేరు తెలుగు సాహిత్య జీవులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఖమ్మం జిల్లాలో ఒక మారు మూల గ్రామం అయిన చింతకాని ఊరుబడి నుండి  టెక్సాస్ యూనివర్సిటీ దాకా అతని నడక,  మేధో యాత్రలో ఆలోచనల్ని ప్రోది చేసుకొనే క్రమం అంత సులువుగా జరిగింది కాదు. తండ్రి కౌముది నించి అభ్యుదయ సాహిత్య వారసత్వం, తల్లి వేపు కుటుంబం నించి వామ పక్ష రాజకీయాల ప్రభావం…వీటన్నీటి పునాది మీద నిర్మించుకున్న అస్తిత్వ వేదన అఫ్సర్.  ఆమెరికాలో ఉన్నా తన వూరితో  ముడిపడిన మూలాల వెతుకులాట అఫ్సర్.  అవే అఫ్సర్ ని కవిగా, కథకుడిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా ముందుకు నడిపిస్తున్నాయి; స్థానికత మాత్రమే ప్రపంచీకరణకి సమాధానం అనే దృక్పథం వేపు తీసుకు వెళ్ళాయి. సూఫీ కథనాల మీద రాయబోతున్న కొత్త పుస్తకానికి సంబంధించి పరిశోధనలో లో భాగంగా ఇటీవల మన రాష్ట్రం వచ్చిన అఫ్సర్ హైదరాబాద్  లో జరిగిన వివిధ సాహిత్య సమావేశాలలో తన పరిశోదన విషయాలను, సాహిత్య అనుభవాలను  సాహితీ మిత్రులతో పంచుకున్నారు.

‘80లలో  తెలుగు సాహిత్యం లో అస్తిత్వ , ఆధునిక ఉద్యమాల మార్పు వాటి  ధోరణుల నాడి, సరిగా అంచనా  వేసిన అఫ్సర్ విమర్శకుడిగా కూడా బలమయిన ముద్ర వేశారు. ఒకటి నిజం– తెలుగు కవిత్వ విమర్శలో ఒక లోతయిన ఖాళీ ఉంది దాన్ని పూరించే పని కొంత మేరకు అఫ్సర్ చేసారు.   1991లో “ఆధునికత- అత్యాధునికత” అనే విమర్శ పుస్తకంతో అస్తిత్వ ధోరణులమీద సాధికారికంగా ఆయన చేసిన చర్చలు ఇప్పుడు మరీ విలువయినవి. ఇక అంతర్జాతీయ స్థాయిలో – అమెరికన్ విశ్వ విద్యాలయం నించి డాక్టరేట్ తీసుకున్న తొలి తెలుగు కవి అఫ్సర్. అస్తిత్వ ధోరణుల మీద చర్చని అంతర్జాతీయ వేదికల దాకా తీసుకు వెళ్ళిన విమర్శకుడు కూడా ఆయనే.

ముఖ్యంగా స్థానికత , మౌఖిక రీతులు   దేశీయ మౌఖిక కధనాలు   దర్గా సూఫీ సంస్కృతుల మీద ఎన్నో  అంతర్జాతీయ పత్రికలలో ఆసక్తికరమయిన పరిశోదనా వ్యాసాలను రాసారు . స్థానిక కథనాలు అస్తిత్వ నిర్మాణంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయో చెప్తూ, వివిధ అంతర్జాతీయ సదస్సులలో తన స్వరం వినిపించారు. సాహిత్య సాంస్కృతిక రంగాలలో మైనారిటీ డిస్కోర్సు కి సిద్ధాంత బలాన్ని తీసుకు రావడం తన ప్రధానమయిన ప్రయత్నమని ఆయన అంటారు.  పీర్ల పండగ మీద ఆయన ఇంగ్లీషులో రాసిన పుస్తకం త్వరలో అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ద్వారా అచ్చు కానుంది.  కథకుడిగా మొదలెట్టి అంతర్జాతీయ స్థాయి పరిశోధకుడిగా అఫ్సర్ సాగించిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన లేవనెత్తిన పలు అంశాలు ఇంకా చర్చకు దారి తీయబోతున్నాయి.  ఈ నేపధ్యంలో అఫ్సర్ తో ఈ ముఖాముఖి .


 

1     అఫ్సర్ మీరు దాదాపు ఒక దశాబ్ద కాలంగా అమెరికాలో వున్నారు. అక్కడి/ఇక్కడి సాహిత్యమూ/ పరిశోధనలూ చూశారు.  చాల సందర్భాలలో నేడున్న సంక్లిష్ట వ్యక్తీకరణకు కవిత్వ్యం  సరిపోదనీ నిజంగా కవిత్యం తన రూపం మార్చు కోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఒక కవిగా మీ అస్తిత్వాన్ని ఉనికిని ఎలా వ్యక్తీక రించుకుంటారు మీరన్నట్లు ఇంత కాలం కవిగా మీ ఉనికి లేదా మీ కున్న అవగాహన ఎలా అర్ధం చేసుకోవాలో వివరిస్తారా ?

ప్రస్తుతం వున్న సామాజిక సంవాద సందర్భంలో కవిత్వం బలహీనమయిన ప్రక్రియ అన్నది నా అభిప్రాయం. ఒక సామాజిక సంవాదం చెయ్యాలంటే కేవలం కవిత్వం మీదే ఆధారపడలేం. ఎందుకంటే, కవిత్వం ఎంత కాదన్నా ఉద్వేగ భాష. వ్యక్తిగత స్థాయిలో ఉద్వేగ భాషకి వున్న ప్రాధాన్యాన్ని గౌరవిస్తూనే మనం వొప్పుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పుడు మనకి కావలసింది మనల్ని ఆలోచింపజేసే భాష. ఆలోచనాత్మకమయిన భాష లేని చోట అవగాహన పెరగదు. అవగాహన లేని చోట అసహనమే వుంటుంది. అపోహలు పెరుగుతాయి. కవిత్వ భాషతో సంబంధం లేని నిర్దిష్టమయిన వచనం కూడా మనం రాయగలిగి వుండాలి. లేకపోతే, కవిత్వం అంతా వొక ఆక్రోశంగా మిగిలిపోతుంది. ముఖ్యంగా అస్తిత్వ ఉనికి వాదాల గురించి స్పష్టత వచనం ద్వారానే సాధ్యపడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. కవిత్వం పట్ల వున్న సెంటిమెంటుని వదిలించుకొని ఈ విషయాలు చర్చించుకోవాలి మనం. కవిత్వం అనేది అనేక పరిమితులున్న వ్యక్తీకరణ రూపం అన్న స్పృహ పెరిగితే తప్ప దాన్ని మార్చాలన్న ఆలోచన రాదు. దానికేదో మంత్ర శక్తి వుందనుకున్నంత కాలం మనం దాన్ని అపురూపంగా చూసుకుంటాం. అది చాలా సాధారణమయిన వ్యక్తీకరణ రూపం అనుకుంటే గాని, దాంతో స్వేచ్ఛగా ఆడుకోలేము. అలా ఆడుకునే వెసులుబాటు లేని చోట కవిత్వమే కాదు, ఏ సాహిత్య రూపమయినా కుంచించుకు పోతుంది.

మీరడిగిన రెండో ప్రశ్న ఇంత కాలంగా కవిగా నా వునికి గురించి- ఆ విషయం నేను కాదు మీరు మాట్లాడాలి. నన్ను మాట్లాడమని అడిగితే, నన్నెవరయినా కేవలం కవి అంటే నేను అసలే వొప్పుకోను. ఆ కవి అనే ముద్ర నాకే కాదు, ఎవరికయినా సుఖంగా వుంటుంది. బుద్ధిపరంగా వొక సుఖానికి అలవాటు పడిపోతాం ఆ ముద్ర పడగానే! కవి అనే లేబుల్ చుట్టూ మనకి చాలా గ్లామర్ వుంది. ఆ గ్లామర్ అర్థం లేనిది. కవులు అని పిలవబడుతున్న వాళ్ల కంటే తెలుగులో కథకులు, వ్యాస రచయితలు, పత్రికా రచయితలు చేస్తున్న కృషి కొన్ని రెట్లు మెరుగు. ఎంత కాదన్నా, తెలుగులో కవిత్వం ఎంత సామాజికతతో/ సామూహికతతో రాసినా “నేను” కేంద్రితమే! ఈ “నేను”కూడా ఎగువ మధ్యతరగతి సృష్టించుకున్న “నేను.”

2     . మూడు  దశాబ్దాలు ఒక కవిగా పరిశోదకుడిగా ఉన్నప్పటికీ మిమ్మల్ని తెలుగు సమాజం ఒక కవిగానే చూసింది ఈ సందర్భం లో కవిత్వానికి కాలం చెల్లింది అనే సంచలన మయిన ప్రసంగానికి మీ కవి మిత్రుల నుండి వ్యతిరేక త వచ్చింది ? ఈ విషయాన్ని ఎలా సమర్దించు కుంటారు ? ఇక నుండి మీరు కవిత్యం రాయరా

తెలుగు సమాజం నన్ను కవిగానే చూసిందని నేను అనుకోవడం లేదు. నేను రాసిన విమర్శ వ్యాసాలు గానీ, విమర్శ పుస్తకాలు గానీ కొంత వాద వివాదాలకు దారి తీసాయి. 1980ల తరవాతి సాహిత్య గతిని గురించి మాట్లాడుకోవడానికి అవి ఎంతో కొంత సాధనా లయ్యాయి. కవిత్వం కంటే ముందు నేను కథకుడిని, విమర్శకుడిని. నా లోపలి ఆ రెండు వ్యక్తిత్వాలకు తగినంత గుర్తింపు ఈ ముప్ఫయేళ్ళలో వచ్చిందనే నా నమ్మకం. అదలా వుంచితే, ఈ పదేళ్ళలో నేను సూఫీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రచురించిన రచనలు నా మటుకు నాకు వొక అర్థవంతమయిన మలుపు.

ముఖ్యమయిన విషయం: కవిత్వానికి కాలం చెల్లింది అని నేను అనడం లేదు. అది చాలా అరిగిపోయిన స్టేట్మెంట్..మళ్ళీ నేను ఇవ్వక్కరలేదు. నేను అంటున్నది బౌధ్ధిక స్థాయిలో కవిత్వానికి రూప పరంగా వున్న పరిమితుల్ని గుర్తించమని మాత్రమే. ఏ సాహిత్య రూపానికయినా వొక కాలం వుంటుందని నేను అనుకోను. అయితే, మన ఆలోచనారాహిత్యం వల్లనో, వుద్వేగ మనస్తత్వం వల్లనో మనం కవిత్వానికి అవసరానికి మించి ప్రాముఖ్యం ఇచ్చాం. దానికి వొక కేంద్రీకృత శక్తిగా మార్చాం. అన్ని విధాలుగా కేంద్రరాహిత్యాన్ని కోరుకుంటున్న, వికేంద్రీకరించుకుంటున్న దశలో వున్న మనం కవిత్వాన్ని మాత్రం ఆ కేంద్ర శక్తిగా ఎందుకు కొలవాలి అన్నదే నా ప్రశ్న. ఈ ప్రశ్న వేయడం ద్వారా మనం ఇంకా కృషి చేయాల్సి వున్న వచన ప్రక్రియల వేపు నేను దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నా.

ఇక నేను కవిత్వం రాయడం గురించి…నేను కవిత్వం రాయకపోవడం అంటూ వుండదు. అది నా basic instinct. ఇక రాయొద్దు అనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ రాసే ప్రమాదం కూడా లేకపోలేదు. నా లోపల సహజంగా వున్న ధిక్కార స్వభావానికి అది తక్షణ వ్యక్తీకరణ. కానీ, ధిక్కారమే సరిపోదనే స్థితి వేపు నేను వెళ్తున్నాను. ఆ స్థితి రాయించే కొత్త కవిత్వం కోసం నా ఎదురు చూపులు.

3          ఒక జర్నలిస్టు గా కవిగా పరిశోదకుడిగా రూపాంతరం చెందిన మీ ప్రస్తానం -ఇటు ఇండియా లో అమెరికా/ యౌరోపెయన్ అకడమిక్ లో మీరు గమనించిన మార్పులు పరిశోదన విషయమా లో ఇక్కడ ఉన్న పరిశోధకుల అవగాహన మీరు ఎలా అంచనా వేయగలరు ? పరిశోధన లో మీ రు ఏం గమనించారు ?

చాలా పెద్ద ప్రశ్న. మొదట వొక సవరణ. మీరన్నట్టు, నేను జర్నలిస్టుగా నా ప్రస్థానం మొదలు పెట్టలేదు. మొదట నేను విమర్శ వ్యాసాలు రాశాను. తరవాత కథలు రాశాను. జర్నలిజంలోకి రావడం వొక యాక్సిడెంట్. జర్నలిస్టుగా కూడా నేను చేసిన పనికి – సాహిత్య పేజీల నిర్వహణ ద్వారా సాహిత్య జర్నలిజం వేపు వెళ్ళడం- లాంటివి నాకు తగినంత గుర్తింపుని తెచ్చాయి. కాబట్టి, సాహిత్య జీవిగా నాకు అప్పటికే వుండిన వొక అన్వేషణకి జర్నలిజం వొక సాధనం అయ్యింది. మొదటి నించీ నేను అస్తిత్వ వాదిని – నిర్దిష్ట ఉనికి, గుర్తింపు వాదాల పక్షపాతిని. అవి వొక ఉద్యమ రూపం దాల్చక ముందు నించీ వాటి అవసరాన్ని నేను చెప్తూ వస్తున్నా. ఇప్పుడు నా పరిశోధనా కృషి కూడా ఆ అస్తిత్వ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే ప్రయత్నమే. అయితే, అమెరికాలోని విశ్వ విద్యాలయాలలో లభించిన శిక్షణ, ఆదాన ప్రదాన అవకాశాల వల్ల అవి పదునెక్కాయి. అంతే కాదు, సమకాలీన అధ్యయనాలలో స్థానిక ఇస్లాం ల ప్రాధాన్యానికి వొక గుర్తింపు తేవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నం చాలా మటుకు సఫలమవుతోంది కూడా!

మన పరిశోధన కూడా స్థానికత మీద మరింత దృష్టి కేంద్రీకరించాలని నా అభిప్రాయం. అది సాహిత్యమా, సాంస్కృతిక అధ్యయనాలా అన్నది వేరే చర్చ. కానీ, స్థానికత మీద దృష్టి పెరిగే కొద్దీ మీ అంతర్జాతీయ దృష్టి పెరుగుతుంది. మొత్తంగా ప్రపంచాన్ని అర్థం చేసుకునే ధోరణిలో మార్పు వస్తుంది. మనకి అంతర్జాతీయ ప్రమాణాలకి ఏ మాత్రం తగ్గని పరిశోధకులున్నారు. కానీ, పడమటి గాలులకి తలలూపే ధోరణిలో పడిపోతున్నారు. అలా కాకుండా మన పరిసరాల్లో మేధో సంచారం చేయగల పరిశోధకులు కావాలని అనుకుంటున్నా. మనం పడమటి సాధనాలు మన స్థానికతని అర్థం చేసుకునేంత వరకే తీసుకోవాలి. మన స్థానికతని గందరగోళం చేసేట్టయితే, ఆ సాధనాల్ని నిరభ్యంతరంగా నిరాకరించాలి.

4.      బాబ్రి మస్జిద్ / లేదా సెప్టెంబర్ 11   లాంటి ఒక సంక్లిష్ట సందర్భం లో  మీరు ఇస్లాం ను ఒక టెర్రరిస్టు గా బూచి గా చూపించిన అమెరికన్ సొసైటీ లో ఏమయినా ఇబ్బందులు  పడ్డారా ?

సమస్య అమెరికా మాత్రమే కాదు, మన దేశంలోనూ అలాంటి సమస్యలు వున్నాయి, అలాంటి ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. వొకే అమెరికా, వొకే ఇండియా అనే జాతీయవాద భావన ప్రమాదకరం ఎప్పుడయినా! అమెరికా భిన్న సంస్కృతుల కలయిక. ఆ భిన్నత్వాన్ని చెరిపేసి, “వొకే” అమెరికా అన్న భావనని పెంచే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. అదృష్ట వశాత్తూ, దీనికి ప్రజల నించి సమ్మతి లేదు. అలాంటి ఎకోన్ముఖీకరణ మన దేశంలోనూ జరుగుతోంది. అయితే, మన దేశంలో దానికి తగినంత ప్రతిఘటన లేదు.

ఇక రెండో విషయం: వలసలో ఎప్పుడూ కొన్ని కష్టాలూ, సాహసాలూ వుంటాయి. అది ఖమ్మం నించి హైదరబాద్ కావచ్చు, హైదరబాద్ నించి ఢిల్లీ కావచ్చు. దేశం నించి ఇంకో దేశం కావచ్చు. అయితే, అదృష్టం బాగుండి, నేను పని చేసిన రెండు యూనివర్సిటీలు – అప్పుడు విస్కాన్సిన్, ఇప్పుడు టెక్సాస్- రెండూ వొక విధంగా కొంచెం బహుళ సాంస్కృతిక వాద అనుకూల ప్రదేశాలు. ఇంకో కొత్త సంస్కృతిలోకి అడుగేట్టినప్పుడు కొన్ని అస్తిత్వ సమస్యలు ఎదుర్కొక తప్పదు – అది అమెరికా అయినా, ఉత్తర భారతమయినా, మన పొరుగు వూరే అయినా. ఆ సంస్కృతికి సంబంధించిన అంశాలు కొన్ని మనల్ని సవాల్ చేస్తాయి. వాటిని ఎదుర్కొని నిలబడడం కష్టమే,కానీ అసాధ్యం కాదు. నేను అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజు నారాయణ రావు గారు అన్న మాట ఇప్పటికీ బాగా గుర్తు పెట్టుకుంటా. “అంతర్జాతీయ అస్తిత్వం చాలా సాహసంతో కూడుకున్నది. మీరు చాలా పెద్ద సాహసానికి సిద్ధ పడాలి. వొక తెలుగుకవిగా మీరు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మాత్రమే ఇక్కడ సరిపోవు. చాలా కొత్త విషయాలు నేర్చుకోవాల్సి వుంటుంది. ఇప్పటి దాకా నేర్చుకున్నది మరిచిపోవాల్సి వుంటుంది కూడా.”

అయితే,  నేను స్థానికతని బాగా నమ్మే వ్యక్తిని. ఆ స్థానికత నేను పెరిగిన చిన్న వూరు చింతకానిది అయినా, అమెరికాలోని ఆస్టిన్ ది అయినా…నేర్చుకోవాల్సింది/ మారాల్సింది చాలా వుంటుందన్న వాస్తవికతకి నేనెప్పుడూ సిద్ధమే.

అలాగే,  నాలోపల వొక జంగమ ప్రవృత్తి కూడా వుంది. అందుకే వొక కవితలో “జంగమం నా ఇలాకా” అని రాసుకున్నా. అలాంటప్పుడు నాకు కృత్రిమ స్థావరాలు సృష్టించే అడ్డుగోడల మీద నమ్మకం లేదు. అలాంటప్పుడు ఇబ్బందులు పడడమూ వుండదు.

5.     ఈ నేపధ్యం లో అంతర్ జాతీయ సమాజం మీ సృజనాత్మక రచనల లో ఈ సంక్షోభం  సమర్ద వంతంగా ప్రతిఫలించింది అని భావిస్తున్నారా ?

అవును. ఆ అంతర్జాతీయత ప్రతిఫలనాలు తప్పక కనిపిస్తాయి. “రక్తస్పర్శ”లోని నా కవితల్లో వొక విధమయిన అంతర్జాతీయత కనిపిస్తుందని చేకూరి రామారావు గారు వొక చోట రాశారు. ఇటీవలి నా పుస్తకం “ఊరిచివర”లో కూడా అంతర్జాతీయత కనిపిస్తుంది. కానీ, రక్తస్పర్శలో కనిపించేది పరోక్ష అంతర్జాతీయత, వూరిచివరలో అది ప్రత్యక్ష అంతర్జాతీయత – అంటే, మిగిలిన కవుల మాదిరిగా అంతర్జాతీయతని నేను వూహించుకొని కవిత్వం రాయడం లేదు. అది వొక వ్యక్తి జీవితంలో భాగంగా ఇంకిపోతే ఎలా వుంటుందో “ఊరిచివర”లో కనిపిస్తుంది.

 6 . సెప్టెంబర్ 11   తరవాత ఇస్లాం ప్రపంచం పై అమెరికా రాజ్యం  అవలంబించిన విదానం పై దేశం లోని బుద్ధి జీవుల నుండి రావాల్సినంతగా   ప్రతిస్పందన రాలేదు. దాన్ని ప్రస్తుత మైనార్టీ డిస్కోర్సు ద్వారా ఎలా అర్ధం చేసుకోవచ్చు?

అంతర్జాతీయ స్థాయిలో మేధావులు స్పందించినంత తీవ్రంగా మన దేశంలోని  బుద్ధిజీవులు దీని మీద స్పందించ లేదన్నది వాస్తవం. దానికి ప్రధానమయిన కారణం: మనం సెప్టెంబర్ 11 అనంతర ప్రపంచాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడమే! మొత్తంగా ప్రాపంచికదృక్పథాన్ని మార్చడంలో దీని ప్రభావాన్ని మనం ఇప్పటికీ అంచనా వేసుకోలేక పోతున్నాం. అసలు మైనారిటీ డిస్కోర్సు వొకటి వుందన్న చైతన్యం అమెరికాలోనూ/ ఇతర దేశాల్లోనూ కలిగింది ఈ సెప్టెంబరు 11 తరవాతనే- అమెరికాలో రాజ్య విధానాలకూ, ప్రజలకూ మధ్య వున్న వైరుద్ధ్యం బాగా అర్థమయింది కూడా దీని తరవాతనే. ఈ వైరుద్ధ్యం అర్థమయిన తరవాత మైనారిటీ డిస్కోర్స్ తేలికగా అర్థమవ్వడం మొదలయ్యింది. అమెరికాలోని మైనారిటీల స్వరం అటు సాహిత్యంలోనూ, ఇటు పబ్లిక్ స్పేస్ లోనూ బాగా వినిపించడం మొదలయ్యింది. అలాగే, ఇస్లాం అంటే ఏమిటో  అందులో ఎంత విభిన్నత వుందో తెలిసి వచ్చింది. చాలా కాలంగా ఇస్లాం అంటే కొందరు మతాచార్యుల గుప్పిట్లో బందీ అనే భావనని ప్రపంచం పెంచి పోషిస్తూ వచ్చింది. అది వొక్క సారిగా బద్దలయి, ఇస్లాంలోని అభ్యుదయ శక్తులు ముందుకొచ్చి, ప్రతిఘటనని వ్యక్తం చేశాయి. ఇది మన దేశంలో కూడా జరగాల్సి వుంది. ఇస్లాంలో వున్న అభ్యుదయ శక్తులు బలపడితే తప్ప, ముస్లిం సమాజాలకు విముక్తి లేదు.

 7. అలాగే ఇక్కడ తెలుగు లో మైనారిటీ డిస్కోర్సు ఒక సంకుచితత్వంలోకి పోయింది అంటే ఆ వాదాన్ని సమర్ద వంతంగా తీసుకెళ్లడం లో మైనారిటీ కవుల లోపాన్ని ఎలా అంచనా వేస్తారు ?  

ఇంతకు ముందే చెప్పినట్టు, ఇప్పుడు అంతర్జాతీయ సాహిత్యం అంతా వొక  మైనారిటీ డిస్కోర్స్ ని వెతుక్కుంటోంది. అంచులలో వున్న జీవన దృశ్యాల ఆవిష్కరణ అన్ని భాషల్లోనూ కనిపిస్తోంది. తెలుగులో ఈ ప్రక్రియ మొదట ప్రారంభమయినంత బలంగా కొనసాగలేకపోతోంది. దానికి ముఖ్య కారణం: అది కవిత్వం గుప్పిట్లో వుండిపోవడమే! ఈ విషయంలో వొక్క దళితస్త్రీ వాదులే కొంత మినహాయింపు. దళిత స్త్రీవాదులు తరవాతి దశలో వచనంలోకి చేసిన ప్రయాణం గొప్ప మలుపు నా దృష్టిలో. అది మిగిలిన మైనారిటీ వాదులకి ఆదర్శం కావాలి. ముఖ్యంగా ముస్లిం వాదులకి!ముస్లిం వాదం ఇప్పుడు రాస్తున్నది తక్కువ, వివాదాలు ఎక్కువ అన్నట్టుగా వుంది. వ్యక్తిగత అహంకారపూరిత రాజకీయాల వల్ల ముస్లింవాదంలోని బలం బలహీనతగా మారుతోంది. ఈ రాజకీయాలు మానేసి, ముస్లిం రచయితలు నిజంగా సృజనాత్మకత మీద దృష్టి పెడితే బాగుంటుంది. సృజనాత్మకత విషయంలో నాకు దళిత వాదం సృష్టించిన మాడల్స్ బాగా నచ్చాయి. ఏ వాదానికయినా ఆ వాదం పరిధిలోకి వచ్చే నిజ జన సమూహాలతో ఆత్మీయ సంబంధం వుండాలి. తెలుగు ముస్లిం రచయితలకు –ముఖ్యంగా కవులకు- వాళ్ళ తక్షణ సమూహం అంటే ముస్లింలతో దగ్గిర సంబంధాలు లేవు. అది వాళ్ళ రచనల్లో కూడా కనిపిస్తున్న లోపమే! అలా సమూహ  సంబంధం లేని సాహిత్యం డొల్లగా వుంటుంది.

8. ఆదునికత, ఉత్తరాదునికత తదితర భావ జాలాల మీపనిచేసిన మీరు తరవాత స్తానికత గురించి మాట్లాడడం మొదలెట్టారు. మీ విమర్శనీ,  పరిశోదననీ  తెలుగు సమాజం సరిగా అంచనా వెయ లేక పోయిందని మీరు భావిస్తున్నారా  ?

స్థానికత అత్యాధునికతలో ప్రధానమయిన కోణం. 1991లో వెలువడిన “ఆధునికత- అత్యాధునికత” వ్యాసాలు మళ్ళీ చదివితే ఆ వాదంలో స్థానికత పాత్ర ఏమిటో తెలుస్తుంది. తెలుగు సమాజం వీటిని ఎలా అంచనా వేస్తుంది అన్నది నాకు అంత పట్టింపు లేదు. నేను చెప్పాలనుకున్నది నేను చెప్తున్నా. అంతే! కానీ, ఆ వ్యాసాలు వెలువడినప్పుడు, తరవాత నేను అస్తిత్వ వాదాల మీద రాసినప్పుడు కూడా అనుకూల/వ్యతిరేక స్పందనలు గట్టిగానే వచ్చాయి. అయితే, నేను కవిని అన్న విషయం మీరు మరచిపోతే తప్ప, విమర్శకుడిగా నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాదు. స్థానికత అనేది ఇప్పటికిప్పుడు అవసరమయిన  సాహిత్య ప్రమాణం అని ఇప్పటికీ నేను అనుకుంటున్నా- అది ప్రవాస స్థానికత కూడా కావచ్చు. అమెరికా తెలుగు రచయితలు ఇటీవలి కాలంలో వెతుక్కుంటున్న ప్రవాస స్థానికత కూడా ఇందులో భాగమే.

9.  దక్కనీ సమాజం దాదాపు 11  వందల ఏళ్ళ పాటు సూఫీ ప్రభావం లో ఉంది    ఈ క్రమం లో మీరు చేస్తున్న దర్గాలు  సూఫీ సంస్కృతల మీద పరిశోదన మైనారిటీ డిస్కోర్సు కు ఏవిదం గా దోహద పడుతుందని భావిస్తున్నారు ?  

దక్కనీ సమాజ అధ్యయనాలలో మనం అంతగా పట్టించుకోని రంగం: సూఫీవాదం. సూఫీ అనగానే మనం రూమీ దాకా వెళ్తున్నాం కానీ, మన పక్కనే వున్న సూఫీల జోలికి మాత్రం పోవడం లేదు. మన స్థానికత మీద మనకి అంత శ్రద్ధ లేదనడానికి ఇదొక వుదాహరణ. నేను ఈ సారి ట్రిప్ లో ఆంధ్ర, తమిళ్ నాడు, కర్నాటకలలో అనేక సూఫీ స్థలాలు తిరిగా. తిరిగిన చోటల్లా కుప్పలు పడి వున్న చరిత్ర కనిపిస్తున్నది. అది మనకు తెలియని మన చరిత్ర. కానీ, సాధారణ ప్రజానీకానికి ఈ చరిత్రకి సంబంధించిన చైతన్యం వుంది. లేనిదల్లా, చదువుకున్న మనలోనే! మనం కులాలుగా, మతాలుగా చీలిపోయాం. విడదీసే అంశాల మీద వున్నంత ఆసక్తి మనల్ని కలిపే అంశాల మీద లేదు. సూఫీ వాదం అందరినీ కలిపే సంస్కృతి. రూమీ గురించి కాదు, మన గ్రామాల సూఫీల గురించి ముందు నేర్చుకోవాలి. మైనారిటీ డిస్కోర్సుని బలంగా వినిపించిన వాళ్ళు మొదట సూఫీలే! ఇవాళ మనం మాట్లాడుకుంటున్న చాలా అంశాలు ఆ రోజుల్లో వాళ్ళు మాట్లాడారు. వాటి వర్తమానికతని మనం అర్థం చేసుకోవాలి.

10. మీ పరిశోధన లో మీకు ఆసక్తి కరంగా తోచిన విషయాలు వివరిస్తారా ?  

చాలా వున్నాయి. ముఖ్యంగా, మానవ సంబంధాల గురించి సూఫీలు చెప్పిన విషయాలు, ప్రేమని వొక అద్భుతమయిన ప్రత్యామ్నాయంగా వాళ్ళు దర్శించిన పద్ధతి. ఇటీవలి నా కవితల్లో ఆ ప్రేమ భావనకి సంబంధించిన భిన్న పార్స్వాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా.

11. ఈ పరిశోదన ద్వారా పశ్చిమ దేశాలు తేలుచు కోవాల్సిన విషయాలు ఏమయినా ఉన్నాయా ?

పశ్చిమ దేశాలు ఏం నేర్చుకుంటాయని కాదు, నా మొదటి లక్ష్యం నేనేం నేర్చుకుంటున్నానో అది ముఖ్యం. అది వొక వ్యక్తిగా, రచయితగా నాకు తక్షణ అవసరం. నా చుట్టూ వాళ్ళకి దాని ద్వారా నేనేం చెప్పగలనన్నది రెండో అవసరం. ముస్లిం సమాజాల స్వభావం గురించి పశ్చిమ దేశాలే కాదు, మనం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా వున్నాయి. ముఖ్యంగా, ముస్లిం సమాజాలు సంకుచితం అనే అపోహ చాలా మందిలో వుంది, ముస్లిం సమాజాలు అభ్యుదయం వేపు చూడడం లేదన్న నిరంతర విమర్శ వుంది. ముస్లిం సమాజాల్లో వున్న అనేకత్వాన్ని చెప్పడానికి సూఫీజమ్ బాగా వుపయోగపడుతుంది, ఎందుకంటే, ముస్లింల వాస్తవ పరిస్తితి చెప్పేది వాళ్ళ సూఫీ చరిత్ర మాత్రమే!

12.  ఈ పరిశోధన ద్వారా పశ్చిమ దేశాల కేంద్రిత అవగాహనను విబేధించే పరిశోధక  అంశాలను మీరేమయినా స్పృశించారా?

మొత్తంగా ఈ పరిశోధన అంతా పశ్చిమ-కేంద్రిత అవగాహనతో విబేధించడమే. స్థానికత అనే వాదంలోనే ఆ విభేదం వుంది. స్థానిక సాహిత్యాల/సంస్కృతుల అధ్యయనం కేవలం వొక భాషకి సంబంధించిన విషయం కాదు. అది ఇంకో స్థాయిలో  సైద్ధాంతిక/రాజకీయ ప్రకటన కూడా. వివిధ అంతర్జాతీయ పత్రికలలో/ సంకలనాల్లో నా వ్యాసాలు చదివితే, ఇది నేనెలా చేశానో అర్థమవుతుంది. ఈ వ్యాసాల్లో కొన్నీటిని తెలుగులోకి అనువదించడానికి మిత్రులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఈ ప్రయత్నం చెయ్యడం అంటే తెలుగులో ఆ సైద్ధాంతిక పరిభాషని కూడా నిర్మించడమే! దానికి ముందు పశ్చిమ-కేంద్రిత పరిశోధన నించి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా వున్నాయి. పరిశోధనా పద్ధతి, విశ్లేషణ, ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కునే దారి మనకి ఇంకా అంత స్పష్టంగా లేదు.

13.   అఫ్సర్ మీరు చెప్పండి గడిచిన కొన్ని దశాబ్దాలుగా వర్తమాన మేదో సమాజం యూరప్ కేంద్రకంగా ఒక తిరుగులేని స్తితి లో ఉంది . దానికి కౌంటర్  గా  మధ్య ప్రాచ్యం,  లాటిన్అమెరికా లో జరిగిన (ఎడ్వర్డ్ సైద్, ఫాన్నోన్ )    ప్రత్యామ్నాయ మేధో స్రవంతి దక్షిణ ఆసియా నుండి రాలేక పోవడానికి , మన బుద్ధిజీవుల / మేధో వైఫల్యం ఉందని  భావిస్తున్నారా ? అలా జరగక పోవడానికి కారణాలు ఏమయి ఉంటవి అని అనుకుంటున్నారు

సంఘర్షణ అనేది కేవలం సమాజాల్లో జరిగినంత మాత్రాన్న సరిపోదు. మేధో సమూహాలు ఆ సంఘర్షణలో పాల్గొన్నప్పుడే దానికి సరిదీటు అయిన సాహిత్యమూ, సిద్ధాంత చర్చా జరుగుతుంది. దక్షిణాసియా దాకా ఎందుకు గానీ, తెలుగు సమాజానికే పరిమితమయి మాట్లాడితే- పబ్లిక్ ఇంటెక్చ్యుయల్స్ మనకి లేరు, తెలుగులో అలా నిలబడేది వొక్క బాలగోపాల్ మాత్రమే. అయితే, గుండె లోతుల్లోంచి, లేదా మేధో లోతుల్లోంచి మాట్లాడే బుద్ధిజీవిని తట్టుకునే శక్తి తెలుగు సమాజానికి ఎంత వుందో ప్రశ్నార్థకమే.  మనకి ఆలోచించే వాళ్ళంటే భయం. ఆలోచన పెరుగుతుందంటే భయం. అందుకే, మన చర్చలు చాలా మటుకు ఉద్వేగ స్థాయికి మాత్రం వెళ్ళి, కవిత్వంలో చతికిలబడ్తాయి. కవిత్వాన్ని చిన్న చూపు చూడడం కాదు, మరీ పెద్ద చూపు చూడడం వల్ల మన మేధోప్రపంచం చిన్నదయిపోతున్నదని నా బాధ. మన మేధో వికాసానికి అదొక అడ్డంకి. ఆలోచనల్ని కూడదీసుకునే శక్తి లేని చోట సమూహాల్ని సమీకరించే శక్తి కూడా వుండదు. ఈ విషయంలో మన కంటే పాకిస్తాన్, బంగ్లా దేశ్ లాంటివి చాలా నయం. వాళ్ళ మేధో వికాసం, సాహిత్య వికాసం మనకి వొక నమూనా కావాలి. పాకిస్తాన్ స్త్రీవాద కవయిత్రులూ, బంగ్లాదేశ్ ముస్లిం రచయితలూ ఏం చేస్తున్నారో వొక సారి గమనించాలి. మనకి ఆ తులనాత్మక దృష్టి పెరిగితే తప్ప మనకి మనంగా ఏం చెయ్యాలో తెలియదు.

రెండు: మన ప్రతిఘటన ఉద్యమాలలో వొక నిలకడ లేదు. రాజ్య హింస మీద ఇప్పటికీ మన ప్రతిఘటన బలహీనంగానే వుంది. తెలంగాణ తో సహా వివిధ అస్తిత్వ ఉద్యమాలు నిజానికి ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా నడవడం లేదు. వొక వేపు కార్పొరేట్ శక్తుల విష కౌగిలిలో చిక్కుకొని వున్నాం కూడా. ఇంకో వేపు అగ్రవర్ణ ఆధిపత్యం కొనసాగుతూనే వుంది. ఇక మిగిలిన అరకొర బుద్ధిజీవులు నిశ్శబ్దంలోకి వెళ్లిపోతున్నారు, లేదా ఉద్దేశ పూర్వక మౌనం ప్రకటిస్తున్నారు. వొక విధమయిన కృతిమ మేధో వాతావరణం మధ్య నిజమయిన బుద్ధిజీవి నిజానికి భయంకరమయిన వొంటరితనాన్ని అనుభవించే స్థితి తెలుగు నాట వుంది.

మూడు: అంచుల నించి వస్తున్న అభిప్రాయాల మీద మనకి చిన్న చూపు. అంటే, వొక కొత్త అభిప్రాయాన్ని దళితులో, స్త్రీలో, ముస్లింలో, పల్లె నించి వచ్చే బుద్ధిజీవులో వ్యక్తం చేసినప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకునే సహనం ఇంకా మనకి రాలేదు. అదే అభిప్రాయం పట్టణ ప్రాంతాల అగ్ర వర్ణాలు వ్యక్తం చేస్తే జయహో అంటున్నాం. ఈ ధోరణి మనలోని బానిసతత్వాన్ని, పరాధీనతని, వ్యక్తిత్వలేమిని చెప్తుంది.

14. ఇలాంటి ప్రతిఘటన లేకపోవడానికి ఈ దేశ సామాజిక పరిస్తితి ,ఈ దేశ రాజకీయ వ్యవస్తకు మధ్య ఎలాంటి సంబంధం ఉంది ? దానికి ప్రత్యామ్నాయ ప్రతి ఘటన సాహిత్య రూపాలు తీసుకొని రావడం లో దళిత బహుజన వైఫల్యం ఉందని అనుకుంటున్నారా ?

ప్రజల్లో నిజమయిన  ప్రతిఘటన వుంది. దాన్ని గుర్తించినా ముందుకు తీసుకువెళ్లే రాజకీయ  వాతావరణం మనకు లెదు. ఇక మన ప్రతిఘటన సాహిత్య రూపాల మీద కూడా మన చదువుల ప్రభావం వుంది. మన చదువులు, మన మేధోలోకం  ఇంకా వలస వాద చట్రంలో వున్నాయి. ఆ చట్రం నించి బయట పడే శక్తి ఇంకా మనకి రాలేదు.  విశ్వవిద్యాలయాలు మాత్రమే ఈ పని చేయాలని అనుకోవడం మన పొరపాటు. అలాగే, ఎంత కాలం ఈ బ్రాహ్మణ పండిత వర్గాల్ని తిట్టుకుంటూ కూర్చుందాం? మన పరిస్తితికి ఇతరుల కంటే మనమే బలమయిన కారణం. మనల్ని మనమే ముందు నిందించుకోవాలి. బ్రాహ్మణ అని కాదు కానీ, అగ్రవర్ణ అంటాను. వాళ్ళలో వున్న ఐక్యత ఇంకెక్కడా లేదు. అలాగే, కుడి పక్షం ఎప్పుడూ ఐక్యంగా వుంటుంది. వామపక్షం చీలికలు పీలికలయి పోతూ వుంటుంది. విశ్వవిద్యాలయాలలో అగ్రవర్ణ  ఆధిపత్యం ఇంకా వుంది. మైనారిటీలు, అణగారిన వర్గాలు తమ లోపలి  బలహీనతల్ని గుర్తించి, తమ బలాన్ని పెంచుకునే శక్తి సంపాదించుకోవాలి.

15. మీరు అమెరికాలో అధ్యాపకుడిగా మారాక మీ ఆలోచన / అవగాహన లో / మేధో శ్రమ లో అస్తిత్వ రాజకీయాలలో  ఏ మార్పులు గ్రహించారు?

అధ్యాపకుడిగా పని చేస్తూ వుండడం వల్ల కొత్త తరం సంవేదనలూ, అనుభవాలూ, ఆలోచనలూ నాకు తెలుస్తున్నాయి. అట్లాగే, నా తరగతి గదుల్లో భిన్న దేశాల భిన్న సంస్కృతుల విద్యార్ధులు వుండడం వల్ల ఆ భిన్నత్వం నా ఆలోచనల్ని తప్పనిసరిగా మారుస్తుంది. నా విద్యార్థులు నా నించి ఎంత నేర్చుకుంటున్నారో నేనుగా చెప్పలేను గాని, ప్రతి విద్యార్థినించీ నేను నేర్చుకుంటూనే వుంటాను. అధ్యాపకుడయినా, వ్యక్తి అయినా నిరంతరం ఆ విద్యార్థి స్తితిలో వుండాలి అనుకుంటా. అందు వల్ల మీలోపల పీఠాలు ఏమయినా నిర్మితమవుతూ వుంటే, అవి వెంట వెంటనే కుప్పకూలిపోతాయి వాటికి అవే! ఇందులో చాలా మేధో శ్రమ వుంటుంది. మీ అస్తిత్వం నిరంతరం ప్రశ్నల మధ్య వూగిసలాడడమూ వుంటుంది. ఇది మేధో ఆరోగ్యానికి చాలా మంచిది. వొక్క ప్రశ్న కూడా పుట్టని రోజు నేను నిలవ నీరయిపోయినట్టే లెక్క. వొక కవితలో రాసుకున్నట్టు “ ఎక్కడో వొక చోట గడ్డ కట్టుకుపోలేను.”

(గుర్రం సీతారాములు)

ఇంటర్వ్యూ: గుర్రం సీతారాములు, డాక్టోరల్ ఫెలో ఇంగ్లీష్ ,విదేశీ భాషల విశ్వవిద్యాలయం, హైదరాబాద్.