<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; రవి E.N.V</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?feed=rss2&#038;tag=%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BF-e-n-v" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>హంపివిరూపాక్షుడు &#8211; దక్షిణ భారతదేశ సాంస్కృతిక ప్రస్థానం</title>
		<link>http://vaakili.com/patrika/?p=15585</link>
		<comments>http://vaakili.com/patrika/?p=15585#comments</comments>
		<pubDate>Thu, 30 Nov 2017 22:09:21 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[రవి E.N.V]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=15585</guid>
		<description><![CDATA[చాలా ప్రాచీన కాలంలో ప్రకృతి యొక్క శక్తులను దేవుళ్ళుగా, దేవతలుగా భావించి ఆరాధించేవారని చెప్పటానికి మన వాఙ్మయంలో కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. వేదకాలంలో ’రుద్రుడు’ ఒక దైవం. ఈ ’రుద్ర’ శబ్దానికి నిరుక్తంలో ’రోరూయమాణః ద్రవతి ఇతి రుద్రః’ అని ఒక వ్యుత్పత్తి చెప్పారు. అంటే "హుర్రు...అన్న తీవ్రమైన శబ్దం చేస్తూ ప్రవహించే వాయువు" రుద్రుడు. వాయుదేవుడే రుద్రుడు అని చెప్పటానికి ఋగ్వేదంలోనూ కొన్ని సూక్తములు ఉన్నవి. తదనంతరకాలంలో రుద్రుడు - ’శివుడు’ గా పరిణమించటం, ఏకాదశ రుద్రులుగా వ్యాప్తి చెందటం జరిగాయి. హిందూ దేవతల వెనుక మార్మికమైన కథలు, కారణాలు ఉన్నాయి. అలాంటి కారణాలే విరూపాక్షుడికీ ఉన్నాయి.]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">వా</span>ల్మీకి రామాయణంలో కిష్కింధకాండ: సీతను రావణుడు అపహరించిన తర్వాత రాముడు, లక్ష్మణుడితో సహా సీతను వెతుకుతూ బయలుదేరాడు. కిష్కింధకు చేరుకున్నాడు. అక్కడ పంపాసరస్సును చూచాడు.</p>
<blockquote><p>సౌమిత్రే! శోభతే పంపా వైడూర్యవిమలోదకా,<br />
ఫుల్లపద్మోత్పలవతీ శోభితా వివిధైర్ద్రుమైః || (రామాయణం, కిష్కింధాకాండ &#8211; ౧.౩)</p></blockquote>
<p>తా: లక్ష్మణుడా! పంపాసరస్సు వైడూర్యము వంటి స్వచ్ఛమైన నీటితో, వికసించిన తామరలతో, కలువలతో, తీరాన ఉన్న ఫలవృక్షాలతో ప్రకాశిస్తోంది చూడు!</p>
<p>ఆపై వాల్మీకి పంపాసరస్సును, కిష్కింధపరిసరాలను సుదీర్ఘంగా వర్ణించాడు. ఆ ప్రకృతి వర్ణనకు పరాకాష్ఠగా, రామునిచేత కంఠోక్తిగా ఒక్కమాట అనిపిస్తాడు.</p>
<blockquote><p>యది దృశ్యేత సా సాధ్వీ యది చేహ వసేమహి, |<br />
స్పృహయేయం న శక్రాయ నాయోధ్యాయై రఘూత్తమ || (౧. ౯౫)</p></blockquote>
<p>తా: లక్ష్మణుడా! ఆ సాధ్వి సీత కనిపించి, మనం ఇక్కడ నివసించే అవకాశం వస్తే, అయోధ్యను, ఇంద్రపదవిని కూడా ఆశించను.</p>
<p>వాల్మీకి వర్ణనలో ఎక్కడా ’తుంగభద్ర’ అన్న నది ప్రస్తావన లేదు. ఆయన కిష్కింధలోని పంపను ’సరోవరం’ అని అంటున్నాడు. అయితే వాల్మీకి ప్రస్తావించిన మాతంగ, మాల్యవంత, ఋష్యమూక, గంధమాదనాది పర్వతాలను, ఇతర పోలికలను గుర్తెరిగి అది కర్ణాటకలోని &#8220;హంపి&#8221; ప్రాంతంగా చారిత్రకులు, ప్రాజ్ఞులు భావించారు. ఈ ప్రాంతంలో తుంగభద్రనది ’పంప’ అన్న పేరుతో ప్రసిద్ధం. ఈ పంపానది దక్షిణ దిశగా, ఋష్యమూక, మాతంగ పర్వతాలకు కనుచూపు మేరలో నేడు &#8211; ఠీవిగా ఒక రాజగోపురం, ప్రసిద్ధమైన దేవాలయం కనిపిస్తాయి. అది ’పంపావిరూపాక్ష’ స్వామి ఆలయం.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Virupaksha_Temple_in_Hampi.jpg"><img class="aligncenter size-full wp-image-15587" title="Virupaksha_Temple_in_Hampi" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Virupaksha_Temple_in_Hampi.jpg" alt="" width="700" height="394" /></a></p>
<p>క్రీ.శ. పదమూడవ శతాబ్దంలో ఆ విరూపాక్షస్వామి ఆశీస్సులతో, విద్యారణ్యముని నేతృత్వంతో, హక్క, బుక్కలనబడే సోదరుల కర్తవ్యదీక్షతో ఒక సువిశాల సామ్రాజ్యం దక్షిణభారతదేశంలో ఏర్పడింది. అదే విజయనగరసామ్రాజ్యం. ఆ విశాల సామ్రాజ్యానికి మూలశక్తి విరూపాక్షస్వామి అనే ఈశ్వరరూపంలోని దైవం. ఎవరా విరూపాక్షుడు?</p>
<p style="text-align: center;">***</p>
<p>చాలా ప్రాచీన కాలంలో ప్రకృతి యొక్క శక్తులను దేవుళ్ళుగా, దేవతలుగా భావించి ఆరాధించేవారని చెప్పటానికి మన వాఙ్మయంలో కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. వేదకాలంలో ’రుద్రుడు’ ఒక దైవం. ఈ ’రుద్ర’ శబ్దానికి నిరుక్తంలో ’రోరూయమాణః ద్రవతి ఇతి రుద్రః’ అని ఒక వ్యుత్పత్తి చెప్పారు. అంటే &#8220;హుర్రు&#8230;అన్న తీవ్రమైన శబ్దం చేస్తూ ప్రవహించే వాయువు&#8221; రుద్రుడు. వాయుదేవుడే రుద్రుడు అని చెప్పటానికి ఋగ్వేదంలోనూ కొన్ని సూక్తములు ఉన్నవి. తదనంతరకాలంలో రుద్రుడు &#8211; ’శివుడు’ గా పరిణమించటం, ఏకాదశ రుద్రులుగా వ్యాప్తి చెందటం జరిగాయి. హిందూ దేవతల వెనుక మార్మికమైన కథలు, కారణాలు ఉన్నాయి. అలాంటి కారణాలే విరూపాక్షుడికీ ఉన్నాయి.</p>
<p>విరూపాక్షుడు &#8211; అంటే విరూపమైన నేత్రము కలిగిన వాడు. అంటే సాధారణంగా అడ్డంగా ఉన్న కనుదోయికి భిన్నంగా నిలువుగా ఉన్న మూడవకన్నును నొసటన కలిగిన పరమేశ్వరుడు అని రూఢ్యర్థం. &#8220;వామదేవో మహాదేవో విరూపాక్షస్త్రిలోచనః&#8221; &#8211; అని అమరకోశం. ఇంకా లింగపురాణం, శివసహస్రనామాలలో ఈ శబ్దం ఉంది. నారాయణ సూక్తంలో విష్ణువు పేరు ’విరూపాక్షుడు’.</p>
<blockquote><p>ఋతగుం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం |<br />
ఊర్థ్వరేతం ’విరూపాక్షం’ విశ్వరూపాయ వై నమో నమః || &#8211; నారాయణసూక్తం.</p></blockquote>
<p>సంస్కృత పురాణ వాఙ్మయంలో కొన్నిచోట్ల సహస్రాక్షుడైన ఇంద్రుణ్ణి విరూపాక్షుడని ఉద్యోతించడం ఉన్నది. అంతే కాదు. కైలాసం &#8211; పరమేశ్వరుడికే కాక కుబేరునికి కూడా స్థానం. అక్కడి అలకాపురి &#8211; కుబేరుని ముఖ్యపట్టణం. అందుచేత విరూపాక్షుడు (ఈశ్వరుడు) అంటే పరోక్షంగా కుబేరుడు కూడానూ.గంగాదేవి అనే కవయిత్రి రచించిన మధురావిజయమనే కావ్యంలో, విజయనగరాన్ని వర్ణిస్తున్న ఈ శ్లోకం చూడండి.</p>
<blockquote><p>యచ్ఛాఖానగరీం పంపామనేకధనదాశ్రితామ్ |<br />
అధితిష్టన్ విరూపాక్షో న స్మరన్త్యలకాపురీమ్ || &#8211; ౧. ౬౬.</p></blockquote>
<p>- అనేక వీధులుగల ఈ నగరిని, వివిధసంపదలున్న ఈ పంపా నగరాన్ని ఆశ్రయించిన విరూపాక్షుడు తనఊరైన అలకాపురిని స్మరించడమే లేదు. ఇక్కడ విరూపాక్షుడు అంటే కుబేరుడు అన్నది స్పష్టం. అనేక అర్థాలున్నప్పటికీ రూఢ్యర్థంలో విరూపాక్షుడు అంటే విశ్వేశ్వరుడే. ఈ విరూపాక్షుడిని దక్షిణ భారతంలో చాళుక్యులు తొలుతగా అర్చించినట్టు కనిపిస్తుంది.</p>
<p style="text-align: center;">***</p>
<p><span style="text-decoration: underline;"><strong>చాళుక్యుల పట్టదకల్లు విరూపాక్షుడు</strong></span></p>
<p>చరిత్రలో చాళుక్యులది ఆరవశతాబ్దము. వారి మొదటి రాజధాని వాతాపి/బాదామి. నేటి బాదామి కర్ణాటక రాష్ట్రంలోని బాగల్ కోట జిల్లాలో ఉంది. చాళుక్యుల సంస్కృతికి బాదామి మాత్రమే కాక చుట్టుపక్కల మలప్రభ నదీ తీర ప్రాంతాలయిన పట్టదకల్లు, ఐహోళె, మహాకూట వంటివి కూడా ప్రసిద్ధి. ఇందులో పట్టదకల్లు &#8211; చాలా ప్రాచీనమైన పట్టణం. గ్రీకు తత్వవేత్త టాలెమీ (PTolemy) వ్రాసిన ప్రపంచ భౌగోళికశాస్త్రంలో పట్టదకల్లు ప్రస్తావన ఉన్నదట. ఐదవ శతాబ్దానికి మునుపు అనేక స్థానిక సంస్థానాధీశులు ’పట్టదకల్లు’ కు వచ్చి పట్టాభిషేకం జరుపుకోవడం ఆనవాయితీగా ఉండేదట. పట్టదకల్లు &#8211; అంటే సంస్థానాధీశులు పట్టం కట్టుకోవడానికి ఏర్పరుచుకున్న స్థలం. ఆ ’పట్టదకల్లు’ లో నేడు మనకొక విరూపాక్ష దేవాలయం కనిపిస్తుంది. క్రీ.శ. 8 వ శతాబ్దంలో &#8211; చాళుక్యులలో రెండవ విక్రమాదిత్యుడు పల్లవులను జయించిన సందర్భంలో ఆతని భార్యలయిన త్రైలోక్యమహాదేవి, లోకమహాదేవి దక్షిణాదిన పల్లవుల రాజ్యం నుంచి శిల్పులను రప్పించి వరుసగా విరూపాక్ష, మల్లికార్జున దేవాలయాలను కట్టించారు. ఆపై విజయధ్వజాన్ని ప్రతిష్ఠించి దానిపై శాసనం వేయించారు.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Pattadakallu_Victory_Inscription.jpg"><img class="aligncenter size-full wp-image-15588" title="Pattadakallu_Victory_Inscription" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Pattadakallu_Victory_Inscription.jpg" alt="" width="480" height="640" /></a></p>
<p style="text-align: center;">***</p>
<p><span style="text-decoration: underline;"><strong>పంపావిరూపాక్షుడు</strong></span></p>
<p>క్రీ.శ. 1336 &#8211; ధాతృనామసంవత్సరం, వైశాఖశుద్ధసప్తమి నాడు శృంగేరి పరమాచార్యులు మాధవవిద్యారణ్యస్వామి విజయనగరసామ్రాజ్యాన్ని స్థాపించి హరిహరరాయలకు పట్టాభిషేకం చేసినట్టు ఐతిహ్యం. ఆ సమయంలోనే ఆయన విద్యానగరంలో హేమకూటాద్రిపై ఉన్న మూలవిరూపాక్షుని విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న చోటుకు మార్చి, పునఃప్రతిష్ఠించారు. ఆపై విజయనగరాన్ని తొలుతగా పాలించిన సంగమ ప్రభువులు విరూపాక్షస్వామికే కాక, పంపాదేవికి, భువనేశ్వరీదేవికీ ఆలయాలు కట్టించారు. ఆ దేవాలయానికే తదనంతరకాలం ఇమ్మడి ప్రౌఢదేవరాయల వారి కాలంలో గోపురం ఏర్పడింది.</p>
<p>విద్యానగరాన్ని &#8211; స్వామి విద్యారణ్యులు నిర్మించతలపెట్టటానికి పూర్వం ఈ రాజ్యం ఇతర రాజుల పరిపాలనలో ఉండేది. చాళుక్యులు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు. వారే హేమకూటంపై మూలవిరూపాక్షుణ్ణి ప్రతిష్ఠించారు. హేమకూటంపై ఇతరత్రా దేవాలయాలనూ కట్టించారు. ఇవి చాళుక్యుల రేఖానగర శైలిలో నేటికీ శిథిలరూపంలో కనిపిస్తాయి. హేమకూటం అంటే ప్రస్తుతం విరూపాక్షదేవాలయానికి దక్షిణంలో ఉన్న చిన్న గుట్ట.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Mula_Virupaksha_Temple.jpg"><img class="aligncenter size-full wp-image-15589" title="Mula_Virupaksha_Temple" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Mula_Virupaksha_Temple.jpg" alt="" width="640" height="480" /></a></p>
<p>చాళుక్యుల కాలంలో విజయనగర ప్రాంతానికి పంపాక్షేత్రమని పేరు. క్రీ.శ. 1012 నాటి బాదామి చాళుక్యరాజు ఐదవ విక్రమాదిత్యుని కాలపు ఒక శాసనంలో పంపాపతి అయిన మహాకాలునికి చేసిన దానం గురించిన వివరణ ఉంది. అలాగే క్రీ.శ. 1199 నాటి కలిదేవుని శాసనంలో &#8211; విరూపాక్షుడు, పంపాదేవి అన్న పేర్లు ఉన్నాయి. (యిది నేటి దేవాలయంలో ఉత్తరద్వారం వద్ద ఉంది) అంతకంటే ప్రాచీనమైన చాళుక్యవినయాదిత్యుని (క్రీ.శ. 680-696) తామ్రశాసనంలో విరూపాక్ష, పంపాపతిల ప్రస్తావన ఉంది. ఆ శాసనపు ఛాయాచిత్రం యిది.</p>
<p>పంపయే కన్నడభాషలో ’హంపి’ గా పరిణమించింది. హంపి లోని హేమకూట, విరూపాక్ష నామధేయాల వెనుక- ఇదివరకు మనం చెప్పుకున్న మార్మికత, విచిత్రమైన కథలూ దాక్కుని ఉన్నాయి.</p>
<p><span style="text-decoration: underline;"><strong>మౌఖికసాహిత్యంలో పంపాదేవి</strong></span></p>
<p>తుంగభద్ర నదికి ’పంప’ అనే పేరు పురాణాల్లో కనిపిస్తుంది. ఇదివరకే చెప్పుకున్నట్టు &#8211; రామాయణంలో వాల్మీకి కూడా కిష్కింధలో ’పంపాసరస్సు’ అనే ప్రస్తావించాడు. విరూపాక్షునికి పంపాపతి అని పేరు. పంపాదేవి- విరూపాక్షుని మొదటి భార్య. ఈమె ఎవరు? అన్న విషయంపై చాలాకాలం మునుపు స్థానికంగా ఒక కథ వ్యాప్తిలో ఉండేది. మౌఖిక సాహిత్యంలో భాగమైన ఈ కథను ఆంగ్లేయులు బళ్ళారి &#8211; మదరాసు కైఫీయత్తులలో నమోదు చేశారు.</p>
<p>పంప &#8211; అనే ఓ అమ్మాయి బ్రహ్మపుత్రిక. ఈ యువతి ఈ హంపి పరిసర ప్రాంతాలలోని మాల్యవంతపర్వతం పై నివాసం ఉండేది. మాతంగ, ఋష్యమూక పర్వత ప్రాంతాలలో సంచరిస్తూ, మునులకు పూలూ పళ్ళూ  సమర్పిస్తుండేది. అక్కడి మునులు ఈమె భక్తికి సంతోషించి, ఏదైనా వరం కోరుకొమ్మన్నారు. ఆమె ఎంతో సంతోషించి &#8211; విరూపాక్షుడిని భర్తగా అనుగ్రహించమని కోరింది. అందుకు మునులు అంగీకరించి ఆమెకు మంత్రోపదేశం చేశారు. అలా మంత్రోపదేశం పొందిన ఆ యువతి స్థానిక హేమకూటంపై మహాదేవుని గురించి తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి విరూపాక్షుడు ఆమెను అనుగ్రహించి పత్నిగా స్వీకరించాడు.సాధారణంగా పురాణాలలో ఈశ్వరుని భార్య పార్వతి/ఉమ. ఈమె హిమవంతుని పుత్రిక అని మనకు తెలుసు. అలాగే &#8211; భగీరథుడు ఆకాశగంగను నేలకు దింపినపుడు, ఆమె ఉద్ధృతిని ఆపడానికి ఈశ్వరుడు గంగను తన జటాజూటంలో బంధించాడు. ఆ విధంగా గంగ ఈశ్వరుని రెండవభార్య అయింది. అయితే హంపిలో విరూపాక్షుని మొదటి భార్య (నదికి చిహ్నమైన) ’పంప’. రెండవభార్య భువనేశ్వరీదేవి. (భువనేశ్వరి &#8211; చాళుక్యుల కాలపు గ్రామదేవత. ఈ దేవి రూపమే నేటి కర్ణాటక రాజ్యమాత అయింది). కాస్త సూక్ష్మంగా ఊహిస్తే &#8211; ఈ విరూపాక్షుడనే ఆయన స్థానికంగా గొప్ప రాజు కానీ, గొప్ప వీరుడు కానీ అయి ఉండాలి. ఈ మహాసత్వుని భార్య కావాలని పంప అనే యువతి తపన పడి ఉండాలి. తద్వారానే పైని కథ పుట్టి ఉంటుంది. ఇది ఊహే అయినా అసంభావ్యం కాదు. హంపిలో విరూపాక్షుని మూలవిగ్రహం పైన కూడా ఓ ముఖం కనిపిస్తుంది. డోమింగో పేస్ అన్న యాత్రికుడు కూడా తను వ్రాసిన చరిత్ర వృత్తాంతములో ఈ విషయం గురించి చెప్పాడు.</p>
<p>చాళుక్యుల బాదామి వద్ద మహాకూటం అనే ప్రదేశం ఉంది. విద్యానగరాన చాళుక్యులకు చెందినది హేమ కూటం. పరమేశ్వరుడు ముకుటేశ్వరుడుగా కల్యాణం అయిన తర్వాత గౌరితో కలిసి మహాకూటంలో స్థిరపడ్డాడు. ఆయనే విరూపాక్షుడుగా &#8211; పంచముఖుడుగా హేమకూటాద్రిపైన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అలా తపస్సు చేసుకుంటున్న సమయంలో మన్మథుడు ఆయనపై బాణాలను సంధించాడు. ఈయన మూడవ కన్ను తెరిచాడు. మన్మథుడే కాక, ఆ వెనకనున్న హేమకూటంపై ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా కరిగి నీరైపోయాయి. ఆ నీళ్ళు అన్నీ ఒక పల్లపు ప్రదేశానికి చేరినై. తదనంతరకాలంలో అక్కడ విజయనగరప్రభువులు ఓ పుష్కరిణిని కట్టించారు. విరూపాక్షదేవాలయం పక్కన, తుంగభద్రానదికి వెళ్ళేదారిలో మన్మథపుష్కరిణి వెనుక కథ యిది. ఇది స్పష్టంగా, విరూపాక్షుని కథకు తదనంతర కాలంలో, బహుశా, పుష్కరిణి కట్టిన తర్వాత ఏర్పడిన కథగా ఊహించవచ్చు.</p>
<p>భారతదేశంలో క్రీ.శ నాలుగు నుంచి ఏడవ శతాబ్దం &#8211; అనేక మార్మిక సంప్రదాయాలు/కథలు ఏర్పడిన కాలం. గజముఖుడైన గణపతి ఆరాధన ఆ కాలంలోనే అనూహ్యంగా వ్యాప్తిలోకి వచ్చింది. ఎన్నెన్నో పురాణగాథలు ఆ కాలంలోనే సంభవించాయి. ముకుటేశ్వరుడూ, లజ్జాగౌరి, బనశంకరి, రేణుకాయెల్లమ్మ,కోటర తదితర రూపాలను అర్చించటం ఆ కాలంలో ప్రబలింది. బౌద్ధంలో వజ్రయాన మత ప్రభావంతో తాంత్రిక విద్యల ప్రాబల్యమూ హెచ్చింది.</p>
<p>చాళుక్యుల నాటి కుమారరాముని కథలో కూడా చారిత్రక నేపథ్యం కలిగిన మౌఖికసాహిత్యం కనిపిస్తుంది. కాంపిల్య నగరాధీశుడైన కుమారరాముడు &#8211; ముష్కరులను ఎదుర్కొని ’గండుగలి’ (మగధీరుడు) అనే బిరుదు సంపాదించాడు. ఈయన కథ ’సారంగధర చరిత్ర’ ను పోలి ఉంటుంది. బళ్ళారి జిల్లాలో సండూరు కొండలనడుమ చాళుక్యుల రేఖానగరనిర్మాణ పద్ధతిలో కుమారరామునికి ఒక దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో ’స్త్రీలు’ ప్రవేశించరు. ఈ ఆచారానికి, ఆయన కథకూ మధ్య లంకె కుదురుతుంది.</p>
<p>భారతదేశచారిత్రకయవనికలో మార్మికసంప్రదాయపు ప్రాధాన్యం ప్రాధాన్యత హెచ్చుగా ఉన్న కాలం అది. మార్మికసంప్రదాయంలోని విశిష్టత ఏమంటే &#8211; కథలకూ, అవి సంధించే ప్రశ్నలకూ జవాబు మెదడులో మెదులుతూ ఉంటుంది కానీ దొరకదు. అసంబద్ధమని వదిలి వేయడమూ పూర్తిగా కుదరదు. స్పష్టాస్పష్టతల మధ్య ఉన్న సత్యమేదో తొంగిచూస్తూ, ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటుంది. హంపి చుట్టూ కొండలూ, కొండలంతటా అనేకానేక శిలలూ ఉంటాయి. అయితే హేమకూటం మాత్రం &#8211; కాస్త చదునుగా ఉంటుంది. అక్కడ కట్టడాలు, చిన్న చిన్న దేవాలయాలు నిర్మించే సందర్భంలో ఇలా జరిగిందా? లేక నిజంగానే శివుడనే నిజమైన (స్థానిక దైవస్వరూపమైన) వ్యక్తి అక్కడి శిలలను కాల్చి దగ్ధం చేశాడా? లేదా ఏదో చిన్న ప్రకృతి ఉత్పాతమో ఏదో జరిగితే దానికి చిలువలుపలవలుగా కల్పించుకుని ఈ కథ ఏర్పడిందా? హేమకూటం (పైడిరాశి) అనే ఆ చిన్నగుట్ట సాయంసంధ్యలో బంగారాన్ని పుటం పెట్టి కాల్చినట్టు బంగరు రంగులో కనిపిస్తూ ఉంటుంది. అలా బంగరు రంగులో ప్రకాశించే గుట్టలా (హేమకూటం) కనిపిస్తున్నది కాబట్టి దానికి కారణాలను వెతుక్కుని పురాణకథలకు అన్వయించుకుని, ఈ పేరును తగిలించారా? అంతు పట్టని ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఇలా ప్రశ్నలను సంధించి &#8211; విద్యార్థులకు విద్యగరపడం ఉపనిషత్తుల కాలంలో కనిపిస్తుంది. (జెన్ బౌద్ధపద్ధతిలోనూ ఇది ఉండేది) చాళుక్యుల కాలానికి ఆ పద్ధతి యొక్క ఆనవాళ్ళు మిగిలాయి. (చాళుక్యుల రెండవపులకేశి &#8211; హర్షవర్ధనుణ్ణి జయించాడు. హర్షవర్ధనుని ఆస్థానకవి రచించిన హర్షచరిత్రలో కొంతవరకు ఉపనిషత్తుల ఆనవాళ్ళుగా మిగిలిన ఋష్యాశ్రమాల వర్ణన ఉన్నది.). ఆ విద్యా రీతులే ఈ కథలకు మూలాధారం కావచ్చు.</p>
<p style="text-align: center;">***</p>
<p><span style="text-decoration: underline;"><strong>చాళుక్యశిల్ప వస్తువు</strong></span></p>
<p>సాధారణంగా చాళుక్యుల దేవాలయాలన్నీ రేఖానగరనిర్మాణాలయితే పట్టదకల్లులోని ఈ రెండు దేవాలయాలు మాత్రం ద్రవిడవిమానపద్ధతిలో నిర్మితమై ఉండటం గమనించవచ్చు. పట్టదకల్లులోని విరూపాక్షునికి, హంపిలోని విరూపాక్షునికి మధ్య కొన్ని విచిత్రమైన సామ్యాలు కనబడతాయి. ఎందుచేతనో ఈ రెండు దేవాలయాలపైన ముష్కరుల దాడి జరుగలేదు. (చుట్టుపక్క ప్రాంతాలన్నిటా తీవ్ర దాడి, దారుణవిధ్వంసం జరిగినప్పటికీ). ఈ రెండు దేవాలయాలలోనూ, నేటికీ నిత్యపూజలు జరుగుతున్నాయి. ఈ రెండు దేవాలయాలనూ, వాటి వెనుక దాగిన సంస్కృతినీ అనుశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.</p>
<p>జాగ్రత్తగా గమనిస్తే బాదామి చాళుక్య శిల్పాలలోనూ, ఆ శిల్పాలు చెప్పే కథలలోనూ, శిల్పనిర్మాణంలోనూ నాటి దేవతా మూర్తులలోనూ, దేవాలయ నిర్మాణంలోనూ, అప్పటి కాలానికి చెందిన కథలలోనూ పురాణకథలనేపథ్యమూ, మౌఖికసాహిత్యస్పర్శ, ఒక విధమైన మార్మికత (Mysticism) కనిపిస్తాయి.</p>
<p>&#8220;ఆషాఢమాసంలో మగనెమలి &#8211; తనివితీరా నృత్యం చేసింది. ఆపై అలసిపోయి, నృత్యాన్ని ఆపి ఆనందబాష్పం రాల్చింది. ఆ కన్నీటి చుక్కని ఆడునెమలి మింగి గుడ్డు పెట్టింది.&#8221;</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Peacock_Peahen1.jpg"><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Peacock_Peahen1.jpg" alt="" title="Peacock_Peahen" width="640" height="284" class="aligncenter size-full wp-image-15602" /></a></p>
<p>&#8220;సూర్య భగవానుడు చీకట్లను చీల్చుకుని సముద్రం నుండి ఉబికి వచ్చాడు. అతని భార్యలిద్దరూ తిమిరాలపై అస్త్రాలను సంధించారు. దేవతలు సూర్యుణ్ణి పొగుడుతున్నారు. అసురులు వెనక్కు మరలుతున్నారు. మనుషులు అబ్బురపాటుతో చూస్తున్నారు, లోకం ఆరంభమవుతూ ఉంది.&#8221;</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Soorya.jpg"><img class="aligncenter size-full wp-image-15591" title="Soorya" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Soorya.jpg" alt="" width="480" height="640" /></a></p>
<p>&#8220;వరాహమూర్తి భూదేవిని సముద్రగర్భం నుంచి పైకి తీసుకుని వచ్చాడు. దేవతలు ఆనందించారు. తెలిసిన పురాణ కథ అయినా ఈ వరాహమూర్తి నిలువెత్తు ఆకారాన్ని చెక్కిన తీరు చూస్తే &#8211; ఆ మూర్తిని చిహ్నంగా కాక, నిజంగా అలాంటి మూర్తి ఉండి ఉండేవాడన్నట్టుగా, చెబుతుందా శిల్పం&#8221;.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/VarahaMurthy.jpg"><img class="aligncenter size-full wp-image-15592" title="VarahaMurthy" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/VarahaMurthy.jpg" alt="" width="480" height="640" /></a></p>
<p>కథలే కాక, శిల్పనిర్మాణం లోనూ, ఆ శిల్పాల ఆకారంలోనూ, కళ్ళల్లోనూ ఏదో తీక్ష్ణత, ఆ శిల్పి ఇతమిత్థమని ఏమి చెప్పదలుచుకున్నాడో అంతుబట్టని భావాలూ కనిపిస్తాయి. చాళుక్యుల శిల్పానికి పరాకాష్ట అనదగిన బాదామి మొదటి గుహాలయపు ఆనందతాండవపరమేశ్వరుని శిల్పంలోనూ చాలా అద్భుతం కనిపిస్తుంది. చూడండి. ఆ శిల్పంలో నృత్యం తాలూకు 92 ముద్రలు ఉన్నాయని అంటారు.</p>
<p>జీవి పుట్టుక ఓ విస్మయకరమైన విషయం. ఈ జన్మ కు ఆధారభూతమైన స్త్రీ నాటి దేవత. స్త్రీ &#8211; సృజనకు మూలరూపం. చాళుక్యుల కాలం నాటి ముఖ్యమైన పరమేశ్వర రూపం మహాకూటేశ్వరుడు. ప్రముఖ దేవత లజ్జాగౌరి. ఇతర దేవతారూపాలయిన భువనేశ్వరి, బనశంకరి, ఎల్లమ్మ, రేణుక తదితరాలు కూడా భూదేవి రూపాలే. ఈ స్త్రీదేవతా రూపాలూ, నవబ్రహ్మలూ ఇత్యాదులకు సంబంధించిన మౌఖిక కథలలోనూ అంతు తెలియని మార్మికత తొంగి చూస్తూ ఉంటుంది. (ఈ వ్యాసం చూడండి.) ఇక్కడ ఓ ప్రశ్న కూడా ఉదయిస్తుంది. చాళుక్యుల కాలం నాటి ఐహోళె శాసనంలో కాళిదాసూ, భారవి కవుల పేర్లు పేర్కొనబడి ఉన్నాయి. కాళిదాసాదుల కావ్యాలకు, అంతకు ముందు ఏర్పడిన వేద, పురాణాది కథలలోని అంతుబట్టని విషయాలను భగవంతుని లీలలకు నిదర్శనంగా భావించి చాళుక్యులు కళలనూ, శిల్ప, దేవాలయనిర్మాణాదులనూ, వారి సాంప్రదాయాన్ని నిర్మించుకున్నారా? లేక ఇతర కారణాలతో ఏర్పడిన మార్మిక సంప్రదాయాలను ప్రాచీన కావ్య పురాణాదులకు అన్వయించుకున్నారా? &#8211; అన్న విషయం అంతుపట్టదు. చాళుక్యరాజుల ప్రస్థానమే బహువిచిత్రంగా ఉంటుంది. ఎవరో ముని ’చుళుకం’ లో జలాల నుంచి వచ్చారని ఓ కథ. చుళుకానికి సంబంధించినది చౌళుక అవాలి కానీ, చాళుక్య అవదు. ఆంధ్రులే చాళుక్యుల పూర్వీకులని కొందరు చారిత్రకులంటారు. వీరు నిజంగా ఎక్కడి వారో, వారి పూర్వచరిత్ర ఏమిటో స్పష్టంగా చెప్పగలిగే ఆనవాళ్ళు తెలియలేదు. ఏదేమైనా, చాళుక్యులు, వారి కాలం ప్రధానంగా పురాణకథలతోనూ, వాటి వెనుక మార్మికమైన లక్షణాలతోనూ కూడి ఉంది.</p>
<p style="text-align: center;">***</p>
<p><span style="text-decoration: underline;"><strong>విజయనగరశిల్పం</strong></span></p>
<p>ఇక విజయనగర సామ్రాజ్య కాలపు తీరుని గమనిస్తే &#8211; శిల్పాలలోనూ, సాహిత్యంలోనూ, నాటి కథలలోనూ, ప్రజల జీవనంలోనూ, లలితకళలలోనూ స్పష్టంగా గొప్ప వైభోగం, రసికత కనిపిస్తాయి. అదృష్టవశాత్తూ ఈ కాలానికి చెందిన విషయాలు నేటికి స్పష్టంగా రికార్డు అయి ఉన్నాయి.</p>
<p>సంగీతం పలికించే రాతి స్థంభాలు, శిల్పప్రాభవం తో అలరారే అనేకదేవాలయాలు, విశాలమైన నగర వీథులు, అంగళ్ళ రతనాలు, వేలాది గుర్రాలు, ఏనుగులు, ఇతరత్రా వ్యాపారవస్తువులూ, కేవలం కర్పూరాది వాసన ద్రవ్యాలకోసం ఏర్పడిన బజారు &#8211; విపరీతమైన భోగం. డోమింగో పెరెస్ మాటల్లో విజయనగర ప్రాభవం తాలూకు చిన్న నమూనా యిది.</p>
<p>&#8220;He who wears such jewels can understand the sort of things so great a lord would wear. Then to see tha grandeur of the nobles and men of rank, I cannot possibly describe it all, nor should I be believed if I tried to do so;&#8230;I have no words to express what I saw and to try and tell of all I saw is hopeless. &#8221;</p>
<p>విజయనగరప్రాభవం, సాహిత్యం, జీవనవిధానాల గురించి ఈ చిన్ని వ్యాసంలో చర్చించటం చూపించటం వృథా. ఈ వ్యాసలక్ష్యమూ అది కాదు. ఇక్కడ చెప్పదల్చుకున్నదేమంటే &#8211; విజయనగరప్రాభవం అత్యున్నత ప్రమాణాలను అందుకొంది. ఇది ’రసికుల’ కాలం. మహాభోగుల కాలం. చాళుక్యుల కాలం నాటి సమాజ మార్మిక వ్యక్తీకరణకూ, విజయనగర కాలపు వైభోగానికి మధ్య చాలా ఆసక్తికరమైన వారధులు ఈ నాడు హంపిలో మిగిలి ఉండటం విశేషం. అవి &#8211; హేమకూటం, విరూపాక్షస్వామి దేవాలయం.</p>
<p style="text-align: center;">***</p>
<p><span style="text-decoration: underline;"><strong>బిష్టప్పయ్య గోపురం</strong></span></p>
<p>హంపిలో విరూపాక్షస్వామి గోపురాన్ని రెండవ దేవరాయల (ఇమ్మడి ప్రౌఢదేవరాయలు) దండనాథుడైన ప్రోలుగంటి తిప్పయ క్రీ.శ. 1426-1448 మధ్యకాలంలో కట్టించినాడు. దేవాలయంలోపలి ఇతర నిర్మాణాలు తదనంతర కాలంలో ఏర్పడినవి. ఈ గోపురంపైన శిల్పాన్ని చూడండి.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Virupaksha_Gopuram.jpg"><img class="aligncenter size-full wp-image-15593" title="Virupaksha_Gopuram" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Virupaksha_Gopuram.jpg" alt="" width="600" height="435" /></a></p>
<p>ఇది ప్రస్ఫుటంగా విజయనగరకాలపు దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశంలో ఆలయాలపైన ఈ బూతు శిల్పాలు ఖచ్చితంగా ఎప్పటి నుంచి ఏర్పడ్డాయో తెలీదు. (బహుశా గుప్తుల కాలం నుంచి కావచ్చు) ముఖ్యంగా గోపురంపైన. చాళుక్యుల గోపురాలు ఇదివరకు చెప్పుకున్నట్టు రేఖానగర నిర్మాణాలు. వాటిపై ఈ విధమైన శిల్పాలను చిత్రించే అవకాశం లేదు. స్త్రీలను, పురుషులను విలాసంగా చిత్రీకరించిన శిల్పాలు నాడు లేకపోలేదు.కానీ ఉద్దేశ్యం వేరు. పట్టదకల్లులో ముఖమంటపముఖద్వారాన్ని చూడండి. ఇక్కడ ఈ రెండు శిల్పాలలో ఆకర్షణీయమైన స్త్రీ విగ్రహాలు ఉన్నప్పటికీ, ఆ శిల్పాల వెనుక ఉద్దేశ్యం &#8211; రాచజంటనూ, పల్లెజంటనూ పోల్చి చూపటమే అని తెలుస్తుంది. ఇవి శృంగారాన్ని ఉద్దేశించినవి కాదు అని అనుకోవాలి.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Dampathi_Pattadakal.jpg"><img class="aligncenter size-full wp-image-15594" title="Dampathi_Pattadakal" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/Dampathi_Pattadakal.jpg" alt="" width="480" height="640" /></a></p>
<p>సమాజపు తీరు తెన్నులే ఆయా సమాజాలలో మనుషుల ఆలోచనలను ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తే &#8211; శృంగారం ఒక భోగం అనే విజయనగర కాలం నాటి ఆలోచన తీరు విరూపాక్ష శిల్పంలో కనిపిస్తుందని ఊహించవలసి వస్తుంది. సృజన అన్నది సృష్టి అనే విస్మయానికి మూలమైన కార్యమని చాళుక్యుల కాలపు లజ్జాగౌరి కథ గురించి ఇదివరకే చెప్పుకున్నాం. విస్మయకరమైన సృజన, విలాసమైన జీవితపు భోగంగా విజయనగర కాలానికి పరిణమించింది.</p>
<p>అంటే చాళుక్యుల నాటి మార్మిక సాంప్రదాయం విజయనగరకాలానికి రసికత సాంప్రదాయంగా మార్పు చెందింది. ఈ రెంటికి సూచనాప్రాయమైన వారధిలా హంపి విరూపాక్షస్వామి దేవాలయం నెలకొంది. ఈ దేవాలయానికి సంబంధించి ’పంప’ కథ మార్మికమైనది. (ఈశ్వరునికి ’పంప’ అనబడే పేరు గల భార్య పురాణాలలో లేదు. గంగ స్వరూపమే పంప అనుకున్నా, ఆవిడ ఈశ్వరుని మొదటి భార్య కాదు.). హేమకూట, మన్మథన హొండె ఉదంతాలు కూడానూ. అయితే దేవాలయంలో రంగమంటపం, బిష్టప్పన గోపురంపై దక్షిణ, పశ్చిమ దిశలలో నగ్న శిల్పాలు, మంటపాలలో యాళి స్థంభాలు, ప్రధాన స్థంభాలపై బంగారు పూత ఇవన్నీ వైభోగకరమైన విషయాలు. (ఇక్కడ మరో విషయం ప్రస్తావించక తప్పదు. విజయనగరంలో భోగకరమైన జీవితానికి సమాంతరంగా తార్కిక, ఆముష్మిక సాంప్రదాయమూ సాగింది. బుక్కరాయల కాలంలో మాధవవిద్యారణ్యులు భారతీయ దర్శనాలకు, వేదాలకు వ్యాఖ్యానాన్ని సంతరించారు. సాళువ నరసింహరాయలకు అన్నమయ్య, పురందరదాసు, అక్షోభ్యతీర్థులు, వంటి మునిపుంగవులకూ సముచిత స్థానం నాడు నెలకొంది. భక్తిఉద్యమ ప్రభావమూ నాడు ఉన్నది. అది సంగీతసాహిత్యాలకు బాసటగానే నిలిచింది.)</p>
<p>పంపా విరూపాక్షదేవుని వైభోగానికి మరో రూపు చైత్రమాసపు పంప-తేరు. చైత్రమాసంలో &#8211; వసంతోత్సవం జరుగుతుంది. ఈ వసంతోత్సవ వైభవాన్ని కన్నడకవి విరూపాక్ష-వసంతోత్సవ అన్న పేరుతో గ్రంథస్థం చేశాడు. కృష్ణరాయల ’జాంబవతీకల్యాణ’ సంస్కృత నాటకం ఆ వసంతోత్సవ రోజులలో ప్రదర్శింపబడుతుండేదని ఐతిహ్యం.</p>
<p>ఇలా పురాణ సంబంధమైన మార్మికత చాళుక్యుల కాలం నుంచి విజయనగరకాలానికి వచ్చేసరికి రసికతాసాంప్రదాయంగా పరిణామం పొందింది. ఇదే రీతి సాహిత్యంలోనూ ప్రవేశించింది. పురాణకావ్యాలు ప్రబంధకావ్యాలయ్యాయి. ప్రబంధాలలోనూ వైవిధ్యం. భక్తి, రసనిర్భరత, కథాసంవిధానం, సామాజికపరిశీలనం, శ్లేష, ఇలా ప్రబంధకావ్యాలు పలుపోకడలు పోయినాయి.శిల్ప, చిత్రకళల ప్రస్థానాలు చెప్పనవసరమే లేదు.</p>
<p>మౌఖిక, మార్మిక సాంప్రదాయాలతో పట్టదకల్లు, పంప విరూపాక్ష దేవాలయాలకు ఒనగూడిన సామాజిక ప్రయోజనం ఏమంటే &#8211; ఈ దేవాలయాలను ముష్కరులు విధ్వంసం చేయలేదు. హంపిని మొత్తం కొల్లగొట్టిన సుల్తానులు ఈ ఒక్క దేవాలయం జోలికి రాకపోవడం విశేషం. ఇటువంటివి కొన్ని కొన్ని ప్రముఖ ’మహిమాన్విత’మైన ప్రదేశాల విషయాలలో జరుగుతుంటాయి. (ప్రముఖ ఉదా: తిరుపతి)ఇందుకు స్థానికుల భక్తిప్రపత్తులూ, చుట్టూ అల్లుకుని ఉన్న కథలూ కూడా కారణంగా చెప్పుకోవచ్చు. విరూపాక్ష దేవాలయాల విషయంలోనూ ఇదే జరిగి ఉండాలి.</p>
<p>ఈ చారిత్రకపరిణామానికి మధ్య కేంద్రబిందువై నేడు &#8211; హంపి విరూపాక్షదేవాలయం దర్పంగా ఎన్నో కథలను చెలియ పంపకు చెబుతున్నట్టుగా బిష్టప్పన గోపురం నిలబడి ఉంది. ఈ గోపురాన్ని పదిహేడవ శతాబ్దంలో పునరుద్ధరించారని, బిష్టప్పయ్య అనే శిల్పి ఈ గోపురాన్ని పునః నిర్మాణంలో పర్యవేక్షించాడని, ఆ బిష్టప్ప శిల్పం దేవాలయ గోపురం లోపలి వైపున ఉన్నదని పరిశోధకులు చెబుతారు. ఏది ఏమైనా ఆ హంపి విరూపాక్ష దేవాలయం, ఆ గుడి తాలూకు 165 అడుగుల (49.6 metres) తొమ్మిదంతస్తుల సమున్నతమైన గాలి గోపురం- దక్షిణభారతదేశపు దేవాలయ వాస్తుకళకు, పౌరాణిక, మార్మిక సాంప్రదాయాలకు, ఉజ్జ్వలమైన చరిత్రకు, దక్షిణరాజ్యరమారమణుడైన శ్రీకృష్ణరాయల వారి జ్ఞాపకాలకు, విద్యారణ్యస్వామి వారి సన్నిధికి, అపూర్వ దేవాలయ శిల్పప్రాభవానికి, పైకప్పులో చిత్రించిన అపూర్వ చిత్రకళానైపుణ్యానికి, అద్భుతమైన మంటపాలకు, వసంతోత్సవాది పండుగలకు, తదితర సాంప్రదాయాలకు, ప్రబంధ సాహిత్యానికి, వైదికమత దర్శన వాఙ్మయ రచన ప్రేరణకు, భోగపరాయణతకూ వేదికగా నిలిచి ఉంది.</p>
<p style="text-align: center;">***</p>
<blockquote><p>సీ||<br />
పంపావిరూపాక్ష బహుజటా జాటికా | రగ్వధ ప్రసర సౌరభ్యములకు<br />
తుంగభద్రాసముత్తుంగ వీచీఘటా | గంభీర ఘుమఘుమారంభములకు<br />
కళసాపురప్రాంత కదళీ వనాంతర | ద్రాక్షాలతాఫల స్తబకములకు<br />
కర్ణాటి కామినీ కర్ణహాటకరత్న | తాటంకయుగ ధాళదళ్యములకు</p>
<p>గీ ||<br />
నిర్నిబంధ నిబంధమై నెనయు కవిత<br />
తెలుగునను సంస్కృతంబున బలుకనేర్తు<br />
ప్రౌఢదేవేంద్రరాయ భూపాలవరుని<br />
సమ్ముఖమ్మున దయజూడు ముమ్మ సుకవి !</p></blockquote>
<p>తాత్పర్యం:</p>
<p>ఓ ముమ్మ కవి! పంపావిరూపాక్షస్వామి (ఈశ్వరుని రూపం) యొక్క విశాలమైన జడలలో ధరించిన కొండగోగు పూల పరిమళాల వలే, తుంగభద్రానది ఎత్తైన అలల తాకిడి యొక్క గంభీరమైన నినాదాల లాగా, కళసాపురపు అరటితోటల నడుమ తీవెలకు వ్రేలాడుచున్న ద్రాక్షగుత్తులకు సరిపోలు విధంగా, కర్ణాట యువతులు చెవులలో అలంకరించుకున్న ముత్యాల చెవిపోగుల తళతళల మాదిరి చిక్కగా అల్లిన కవితను, తెలుగు సంస్కృతాలలో చెప్పగలవాడను. నన్ను మీ మహారాజైన ప్రౌఢదేవేంద్రరాయని ఎదుటకు కొనిపోవయ్యా!</p>
<p>శ్రీనాథ కవిసార్వభౌముడు, హంపి లో ప్రౌఢదేవరాయల వారి సముఖానికి అవకాశం కల్పించమని మమ్మ కవిని ప్రార్థించిన సందర్భంలో చాటువు ఇది. తెనుగు కవి శ్రీనాథకవిసార్వభౌముడు దక్షిణాధీశుని ముత్యాలశాలలో &#8211; దీనారటంకాల తీర్థమాడించటానికి కూడా ఆ విరూపాక్షుని దీవెనలే తోడ్పడి ఉంటాయి.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=15585</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ప్రబంధరసఝరి</title>
		<link>http://vaakili.com/patrika/?p=15179</link>
		<comments>http://vaakili.com/patrika/?p=15179#comments</comments>
		<pubDate>Sat, 30 Sep 2017 18:17:32 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[రవి E.N.V]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=15179</guid>
		<description><![CDATA[<p>నేడు మనకు తెలిసిన తెలుగు పద్యం ఎప్పుడో సహస్రాబ్దాల క్రితం ఊపిరిపోసుకుంది. ఆ పసిబిడ్డకు పాలిచ్చి పెంచిన వారు కొందరు. మాటలు నేర్పిన కవయిత్రులు/కవులు ఇంకొందరు. వస పోసి లాలించి పాలించిన వారు ఇంకా కొందరు. ఆ పద్యానికి తప్పటడుగులు, నడకలు, నడతలు, సుద్దులు, బుద్దులు, వినయం ఒద్దిక, నగవు, పొగరు ఇవన్నీ నేర్పిన వారు ఇంకెంతో మంది. అలా అంతమంది ఆప్తబంధువుల లాలన, పాలనలతో &#8211; ప్రబంధకాలానికి తెలుగుపద్యం అపురూపమైన లావణ్యాన్ని సంతరించుకుని యౌవనవతి అయింది. ఈ అందమైన అమ్మాయికి అలంకారాలు, లయలు, హొయలు, విలాసాలు, ఆట, పాట నేర్పిన కవులు ప్రబంధకవులు. వారిలో అగ్రగణ్యుడు వసుచరిత్రకారుడైన రామరాజభూషణుడు/భట్టుమూర్తి.</p> <p>తెలుగులో కావ్యప్రస్థానం సంస్కృతకావ్యాలకు అనుసృజనగా మొదలైనదని మనకు తెలుసు. అనుసృజనతో మొదలైనప్పటికీ సాధ్యమైనంత వరకు స్వతంత్రమైన రచనాసంవిధానాన్నే మనకవులు అనుసరించారు. ప్రబంధకాలంలో తెలుగు కవిత యొక్క స్వతంత్రత శిఖరాన్ని చేరుకొన్నది. అప్పటి వరకు సంస్కృతం నుంచి తెనుగు అనువాదాలకే తెనుగు రచన పరిమితం కాగా, పదునారవశతాబ్దం తరువాత వసుచరిత్ర మొదటిసారి సంస్కృతంలోనికి వసుచరిత్ర చంపువుగా అనువదింపబడినది. అంతే కాదు, సాధారణంగా ఇతర భాషాకవిత్వాలను అంతగా పట్టించుకొనని తమిళులు వసుచరిత్రను తమ భాషలో అనువదించుకున్నారు. వసుచరిత్రను అనుసరిస్తూ పిల్లవసుచరిత్రలు బయలుదేరినవి. ఈ కావ్యంలోని కొన్ని పద్యాలకు సంగీతబాణీలు కూర్చారు (శిష్టు కృష్ణమూర్తి వంటి) వ్యాఖ్యాతలు. (ఆ వ్యాఖ్యానం అలభ్యం). వీణియపై &#8220;లలనాజ, నాపాంగ, వలదావ, సదనంగ..&#8221; వంటి పద్యాలను పలికించే వారని పెద్దలంటారు. పద్యానికి పట్టం కట్టిన రచన ఈ ప్రబంధం. ఈ ప్రబంధంలో &#8211; తెలుగు పద్యం తాలూకు లావణ్యాన్ని ఎత్తిచూపిన ఒకానొక పద్యం పై వ్యాఖ్యానం ఈ వ్యాసం.</p> <p style="text-align: center;">***</p> <p>అదొక పెద్దకొండ. (పెనుగొండ). ఆ కొండ పేరు కోలాహలుడు. అతడు హిమాలయపర్వతరాజుకు సుతుడు. అంటే జగజ్జనని పార్వతీదేవికి అనుంగు తమ్ముడు. శంకరునికి ముద్దు మఱది. ఆ కోలాహలుడు అధిష్ఠాన నగరం దాపుల నున్నాడు. ఆ నగరాన్ని చుడుతూ, [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">నే</span>డు మనకు తెలిసిన తెలుగు పద్యం ఎప్పుడో సహస్రాబ్దాల క్రితం ఊపిరిపోసుకుంది. ఆ పసిబిడ్డకు పాలిచ్చి పెంచిన వారు కొందరు. మాటలు నేర్పిన కవయిత్రులు/కవులు ఇంకొందరు. వస పోసి లాలించి పాలించిన వారు ఇంకా కొందరు. ఆ పద్యానికి తప్పటడుగులు, నడకలు, నడతలు, సుద్దులు, బుద్దులు, వినయం ఒద్దిక, నగవు, పొగరు ఇవన్నీ నేర్పిన వారు ఇంకెంతో మంది. అలా అంతమంది ఆప్తబంధువుల లాలన, పాలనలతో &#8211; ప్రబంధకాలానికి తెలుగుపద్యం అపురూపమైన లావణ్యాన్ని సంతరించుకుని యౌవనవతి అయింది. ఈ అందమైన అమ్మాయికి అలంకారాలు, లయలు, హొయలు, విలాసాలు, ఆట, పాట నేర్పిన కవులు ప్రబంధకవులు. వారిలో అగ్రగణ్యుడు వసుచరిత్రకారుడైన రామరాజభూషణుడు/భట్టుమూర్తి.</p>
<p>తెలుగులో కావ్యప్రస్థానం సంస్కృతకావ్యాలకు అనుసృజనగా మొదలైనదని మనకు తెలుసు. అనుసృజనతో మొదలైనప్పటికీ సాధ్యమైనంత వరకు స్వతంత్రమైన రచనాసంవిధానాన్నే మనకవులు అనుసరించారు. ప్రబంధకాలంలో తెలుగు కవిత యొక్క స్వతంత్రత శిఖరాన్ని చేరుకొన్నది. అప్పటి వరకు సంస్కృతం నుంచి తెనుగు అనువాదాలకే తెనుగు రచన పరిమితం కాగా, పదునారవశతాబ్దం తరువాత వసుచరిత్ర మొదటిసారి సంస్కృతంలోనికి వసుచరిత్ర చంపువుగా అనువదింపబడినది. అంతే కాదు, సాధారణంగా ఇతర భాషాకవిత్వాలను అంతగా పట్టించుకొనని తమిళులు వసుచరిత్రను తమ భాషలో అనువదించుకున్నారు. వసుచరిత్రను అనుసరిస్తూ పిల్లవసుచరిత్రలు బయలుదేరినవి. ఈ కావ్యంలోని కొన్ని పద్యాలకు సంగీతబాణీలు కూర్చారు (శిష్టు కృష్ణమూర్తి వంటి) వ్యాఖ్యాతలు. (ఆ వ్యాఖ్యానం అలభ్యం). వీణియపై &#8220;లలనాజ, నాపాంగ, వలదావ, సదనంగ..&#8221; వంటి పద్యాలను పలికించే వారని పెద్దలంటారు. పద్యానికి పట్టం కట్టిన రచన ఈ ప్రబంధం. ఈ ప్రబంధంలో &#8211; తెలుగు పద్యం తాలూకు లావణ్యాన్ని ఎత్తిచూపిన ఒకానొక పద్యం పై వ్యాఖ్యానం ఈ వ్యాసం.</p>
<p style="text-align: center;">***</p>
<p>అదొక పెద్దకొండ. (పెనుగొండ). ఆ కొండ పేరు కోలాహలుడు. అతడు హిమాలయపర్వతరాజుకు సుతుడు. అంటే జగజ్జనని పార్వతీదేవికి అనుంగు తమ్ముడు. శంకరునికి ముద్దు మఱది. ఆ కోలాహలుడు అధిష్ఠాన నగరం దాపుల నున్నాడు. ఆ నగరాన్ని చుడుతూ, కొండచరియలో ఒద్దికగా, నిర్మలంగా, అమాయకంగా ఓ వాగు ప్రవహిస్తోంది. ఆ వాగు పేరు శుక్తిమతి. (ముత్యాలవాగు) ఆ శుక్తిమతిని కోలాహలుడు మోహించాడు. ఆమె ప్రవాహపు దారిని అడ్డగించినాడు. ఆ కన్నె అతణ్ణి వినయంగా ప్రార్థించి, అర్ఘ్యపాద్యాదులు స్వీకరించి, అడ్డు తొలగుమని వేడింది. కోలాహలుడు వినిపించుకొనలేదు. అతడు మోహపరవశుడై శుక్తిమతి చీరె కొంగు పట్టుకున్నాడు.</p>
<p>అప్పుడు&#8230;&#8230;</p>
<blockquote><p>ఉ||<br />
వేణి చలింపఁ గంపితనవీనమృణాళభుజాగ్రకంకణ<br />
శ్రేణి నటింప లోలశఫరీనిబిరీశకటాక్షకాంతి వి<br />
న్నాణము చూప హంసకగణక్వణనంబులు మీఱ సైకత<br />
శ్రోణి వివర్తితాబ్జముఖశోభితయై కడు సంభ్రమించినన్.</p></blockquote>
<p>వేణి = నీటిపాయ/అల్లిన జడ<br />
చలింపన్ = కదులాడగా<br />
కంపిత నవీన మృణాళ భుజాగ్ర కంకణశ్రేణి<br />
కంపిత = చలించిన<br />
నవీన = క్రొత్తదైన<br />
మృణాళ = తామరతూండ్ల<br />
భుజాగ్ర = బాహువుల కొనలందు<br />
కంకణ = జలబిందువుల/హస్తాభరణముల<br />
శ్రేణి = వరుస<br />
నటింప = నటనము చేయగా<br />
లోల శఫరీ నిబిరీశ కటాక్షకాంతి<br />
లోల = కదలుచున్న<br />
శఫరీ = బేడిసమీనుల (Silver fish)<br />
నిబిరీస = నిబిడమైన<br />
కటాక్ష = క్రీగంటి చూపుల<br />
కాంతి = ప్రకాశము<br />
విన్నాణము చూప = తెలియరాగా<br />
హంసకగణక్వణనంబులు<br />
హంసకగణ = హంసలగుంపు యొక్క/కాళ్ళ అందియల<br />
క్వణనంబులు = కలకలము<br />
మీఱ = హెచ్చవగా<br />
సైకతశ్రోణి = ఇసుకతిన్నెలు/ఇసుకతిన్నెలవంటి జఘనభాగము గల్గిన శుక్తిమతి<br />
వివర్తితాబ్జముఖశోభితయై<br />
వివర్తిత = ప్రక్కకు త్రిప్పుకొనిన<br />
అబ్జముఖ = కమలములతో/కమలము వంటి ముఖముతో<br />
శోభితయై = అలంకరింపబడినదై<br />
కడు = మిక్కిలి<br />
సంభ్రమించినన్ = తొందరపాటు పడెను.</p>
<p>ఈ పద్యానికి నదీపరంగా, కన్య పరంగా రెండు అర్థాలు. దీనికి శేషాద్రి రమణ కవుల తాత్పర్యం ఇలా ఉంది.</p>
<p>కోలాహలపర్వతము నదినడ్డగించుటచే నీటిపాయ చెదరెననియుఁ దామరతూండ్లు కలఁగెననియు, జలకణములు చిందెననియు, బేడిసమీ లెగిరి పడెననియు, హంసలు ధ్వని చేసెననియు, తామరపూలు కలతనొందెననియు (నదీపరమైన భావము)</p>
<p>శుక్తిమతి కొంగు కోలాహలుడు పట్టుకొన జడ కదలెననియు, భుజములు వణకుటచే కంకణములు మ్రోగెననియు ఓరకంటి చూపులొప్పారెననియు, కాలియందెలు మ్రోగెననియు, తొట్రుపాటుచేత మోము త్రిప్పుకొనెననియు (పడతి పరముగా నన్వయము).</p>
<p style="text-align: center;">***</p>
<p>ఈ అపూర్వమైన పద్యంలో ఎన్నో విశేషాలు. ఒక్కొక్కటీ వివరంగా చర్చించుకోవాలి.</p>
<p>1.<br />
శఫరమంటే బేడిసమీను. Silver fish. దీనిని చంచలమైన కనులకు ఉపమానంగా సూచించటం తెనుగు కవిత్వ సాంప్రదాయం.</p>
<p>&#8220;కంపితనవీనమృణాళభుజాగ్రకంకణశ్రేణి, లోలశఫరీనిబిరీశకటాక్షకాంతి, హంసకగణక్వణనంబులు, వివర్తితాబ్జముఖశోభిత&#8221; ఇత్యాది శబ్దాలు రూపకములు. ఈ రూపకములన్నీ నది/యువతి యొక్క శరీరవిన్యాసములలో పరిణమిస్తున్నాయి. అందువలన ఇవి ఏకదేశవివర్తి రూపకములు. వేణి, కంకణ, హంసక, అబ్జముఖ వంటి శబ్దములు &#8211; శ్లిష్టములు. శ్లేషార్థకములు. అంటే అర్థద్వయం కలిగినవి.</p>
<p>ఈ రూపకములు నదిని వర్ణిస్తూ, యువతి యొక్క సంభ్రమములలో పర్యవసిస్తున్నవి. అంటే కవి &#8211; నదిపై యువతిని superimpose (ఆరోపితం) చేశాడు. ఇది చాలా చాలా అరుదైన, అద్భుతమైన ప్రక్రియ. ఈ విధమైన superimpose అన్న ’కళ’ సాహిత్యం ద్వారా మాత్రమే సాధింపగల ప్రక్రియ అని, ఇటువంటి ప్రయత్నాన్ని ’చిత్రం’ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేస్తే విఫలం కావచ్చుననీ అంటారు శ్రీ నిడుదవోలు వేంకటరావు గారు.</p>
<p>2. &#8220;వేణి చలింపఁ&#8230;&#8221; పద్యానికి వావిళ్ళవారి వ్యాఖ్యానప్రతిలో ముందుమాట వ్రాస్తూ, శ్రీ నిడుదవోలు వెంకటరావు గారు ఈ మాట అంటారు. &#8220;కవి, చిత్రకారునికన్నా మిన్న యని రామరాజభూషణుడు మహాసమర్థతతో నిరూపించినాఁడు. ఈ పద్యమున శుక్తిమతీనది స్త్రీవలె సంభ్రమముతో వచ్చునట్టు నద్భుతభంగిని చెప్పినాఁడు. దీనిని రవివర్మ గంగావతరణముతో పోల్చిన చిత్రకారుడెట్ల కృతార్థుడు కాలేకపోయెనో తెలియవచ్చును.</p>
<p>పద్యమున శ్లేషచేత మనకు స్త్రీ మనోనేత్రములకు అగుపడుచున్నది. ప్రకృతిలో కన్నులకగుపడునది నదియే. రవివర్మ ఆకాశగంగ యవతరించుట చిత్రించఁబోయి గంగ వచ్చునట్లు కొన్ని గీతల మూలమునఁ దెలిపి, యా వెనుక వాని మధ్య నొక స్త్రీమూర్తిని లిఖించినాడు. దీనివలన ఆతని ఆశయము భగ్నమైనది&#8230;&#8221;</p>
<p>స్థూలంగా వారి తాత్పర్యమేమిటంటే, ఈ పద్యం చిత్తరువుకన్నా మరింత సమర్థమైనది. చిత్రంకన్నా సమర్థవంతంగా ఈ పద్యం నదిని యువతిగా మనోనేత్రం నుందు నిలుపుతోంది. వేంకటరావు గారు ప్రస్తావించిన రవి వర్మ చిత్రించిన ఆ గంగావతరణ చిత్రము యిదీ.<br />
<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/09/prabhandha_ravi_env.jpg"><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/09/prabhandha_ravi_env.jpg" alt="" title="prabhandha_ravi_env" width="466" height="640" class="aligncenter size-full wp-image-15184" /></a><br />
3. శ్రీ నిడుదవోలు వారి వ్యాఖ్యను అనుసరిస్తూ ఆలోచిస్తే, ఈ పద్యం ఒక చిత్తరువు కాదనీ, ఇదొక చలనచిత్రము (Multimedia) తరహా పద్యమని మనకు తెలియవస్తుంది. ఈ విధమైన చలనచిత్ర ప్రక్రియకు దోహదం చేస్తున్నవి ఈ పద్యంలోని క్రియాపదాలు. వీటిని కవి ఎంతో నేర్పుతో, తెనుగులో కూర్చాడు. &#8220;చలింపన్, నటింప, విన్నాణము సూప, మీఱన్, కడు సంభ్రమించినన్.&#8221; ఈ తెనుగు క్రియలన్నిటినీ ప్రకృతంలో జరుగుతున్నట్టుగా కల్పించడంతో ఈ పద్యం ఒక చలనచిత్రాన్ని రూపుకట్టిస్తోంది. ఇటువంటి ప్రక్రియలు సంస్కృతసాహిత్యంలో అరుదు. సంస్కృతంలో పదచిత్రాలే ఎక్కువ. తెనుగు సాహిత్యంలో ఇటువంటి ’చలన’చిత్రాల ఒరవడిని ఎత్తుకు తీసుకు వెళ్ళిన కవి, ఆంధ్రకవితాపితామహుడు అల్లసాని పెద్దన అని చెప్పుకోవాలి.</p>
<p>సంస్కృతంలో శ్లోకాన్ని ఒక వాక్యరూపంలో నిమంత్రించి, క్రియ (ధాతువు)తో ముగించటం సాంప్రదాయంగా వస్తోంది. బహుశా అందుకనే సంస్కృత సాహిత్యంలో పదచిత్రాలే ఎక్కువగా కనిపిస్తాయి. వసుచరిత్ర కావ్యాన్ని, అప్పయ్యదీక్షితపండితుని శిష్యుడైన కాళహస్తి కవి సంస్కృతంలో పరివర్తించినాడు. ఆ కావ్యంలో &#8220;వేణి చలింపఁ..&#8221; పద్యానికి సంస్కృతంలో అనువాదం యిది.</p>
<blockquote><p>వేణీ చచాల బిసవద్భుజకంకణానాం<br />
శ్రేణీ ననర్త విబభుశ్శఫరీకటాక్షాః<br />
నాణీయసీ పరిరరాణ చ హంసకాలీ<br />
శ్రేణీలసత్పులినసాచితమబ్జవక్త్రమ్ || (178)</p></blockquote>
<p>చచాల = చలించెను.<br />
ననర్త = నర్తించెను<br />
విబభుః = ప్రకాశించెను<br />
పరిరరాణ = రవములు సలిపెను.</p>
<p>ఇవన్నీ స్థిరమైన ధాతు రూపాలు. శ్లోకం ఆఖరు పాదంలో మాత్రం &#8220;లసత్&#8221; అన్న ధాతురూపం &#8220;సంభ్రమించినన్&#8221; అన్న అర్థంలో ముగుస్తోంది.</p>
<p>తెలుగులో &#8220;చలింపన్, నటింప..&#8221; ధాతురూపాలు సంస్కృతములో పరివర్తితమయ్యే సరికి సంస్కృతశ్లోకం పదచిత్రాల సముదాయంగా మారటం స్పష్టంగా పైని శ్లోకంలో గమనింపవచ్చు.</p>
<p>4. వేణి చలింపఁ &#8211; మన పద్యంలో శబ్ద గుణాల గురించి కూడా చెప్పుకోవాలి. పద్యాన్ని ఎడమచేతితో ఆడించేంత నైపుణ్యం గల ఒక గొప్ప కవి వ్రాసిన పద్యం యిది.అందుకనే గణయతి ప్రాసలు, తమంతట తాము అమరిపోయినట్టుగా అనాయాసంగా సమకూరటం పద్యంలో గమనించవచ్చు. అంతే కాదు, పద్యం చదువుకుంటూ వెళుతుంటే, అదే క్రమంలో అర్థమూ కుదురుతూ పోతోంది. ఇలా పద్యపు వరుసలో అర్థము సమకూరటాన్ని &#8220;రీతి&#8221; అని నిర్వచించినారు ఆలంకారికులు. &#8220;యథార్థక్రమ నిర్వహణం రీతిరిత్యభిదీయతే&#8221;. ఇటువంటి పద్యాలు వసుచరిత్రలో కొల్లలుగా కనిపిస్తాయి.</p>
<p>ఈ పద్యంలో &#8211; నాయిక శుక్తిమతి (నది) విభ్రమం కూడా అంతకంతకు పెరుగుతూ వెళ్ళటం స్పష్టంగా ప్రతీయమానం అవుతోంది.</p>
<p>మొదట ఆ యువతి<br />
౧. వేణి (జడ) చలించింది<br />
౨. అటుపై తామరతూడువంటి భుజాగ్రం నటించింది.<br />
౩. పిమ్మట మీలవంటి క్రీగంటి చూపు ప్రకాశం దాల్చింది<br />
౪. తదనంతరం కాలియందల రవములు మీఱినవి.<br />
౫. ముఖం శోభించింది.</p>
<p>చలించి, నటించి, విన్నాణము చూపి, మీఱి, &#8211; చివరన ’కడు సంభ్రమించినది’. ఈ ఎత్తుగడ కవి వివక్షితమో, అవివక్షితమో తెలియదు కానీ, నిష్ణాతుడైన కావ్యకర్త యొక్క పద్యశిల్పంగా యిది తోస్తున్నది.</p>
<p>5. ఇందాక సంస్కృతకావ్యాలలో పదచిత్రాల గురించి చెప్పుకున్నాం. సంస్కృతంలో సాధారణంగా పదచిత్రాల సాంప్రదాయం ఎక్కువ. అయితే ’చలనచిత్ర’ రూపాలు కూడా సంస్కృతంలో అక్కడక్కడా లేకపోలేదు. అమరుశతకంలో ఈ క్రింది శ్లోకం చూడండి.</p>
<blockquote><p>ఆలోలా మలకావళిం విలుళితాం భిభ్రచ్చలత్కుండలం<br />
కిఞ్చిన్మృష్ట విశేషకం తనుతరైః స్వేదామ్భసాం జాలకైః |<br />
తన్వ్యా యత్సురతాన్త తాన్తనయనం వక్త్రం రతివ్యత్యయే<br />
తత్త్వాం పాతు చిరాయ కిం హరిహర బ్రహ్మాదిభి ర్దైవతైః ||</p></blockquote>
<p>పురుషాయిత కేళిలో యే తన్వి యొక్క ముఖము పై ముంగురులు చలించి, చెదరిన వరుసను తాల్చి, చెవిపోగులు ఊగి ,సూక్ష్మములైన చెమటబొట్టులచేత నుదుటి బొట్టు కొంచెం చెరగి, కనులు అలసియుండుట గలదో, అట్టి సుందరముఖము నిన్ను రక్షించుగాక. హరిహరబ్రహ్మాది దేవులచేత ప్రయోజనమేమి?</p>
<p>భట్టుమూర్తి కవి &#8211; తన యొక్క నరసభూపాలీయ కావ్యారంభంలో, తనను తాను అమరేశ్వరుని యొక్క సమస్రముఖదృష్టి గలవాడని చెప్పుకొన్నాడు.</p>
<blockquote><p>&#8220;బాణు వేగంబును, భవభూతి సుకుమార<br />
తయు, మాఘు శైత్యంబు, దండిసమత,<br />
&#8230;&#8230;.<br />
&#8230;..<br />
యమరేశ్వరుని సహస్రముఖదృష్టి&#8221;</p></blockquote>
<p>ఇక్కడా మూర్తి కవి శ్లేషనుపయోగించాడు. అమరేశ్వరుని సహస్రముఖదృష్టి ఇంద్రుని వేయికనులచూపు అని, అమరుకవి యొక్క బహుముఖీన ప్రజ్ఞ అని అర్థాలు. అమరుకవిని వసుచరిత్రకారుడు ప్రస్తావించాడు కాబట్టి, ఆయన శ్లోకం ద్వారా కొంత ప్రేరణ గొని ఉన్నాడని ఊహించటం అర్థరహితం కాబోదు. అయితే మన తెనుగు కవి యువతి యొక్క సంభ్రమాలను చిత్రిస్తూ, నదిపై యువతిని ఆరోపం చేశాడు. అచేతనమైన నదిని, పర్వతాన్ని నాయికానాయకులుగా తీర్చటం తెలుగులోభట్టుమూర్తి కవియే మొట్టమొదటగా చేశాడు.</p>
<p>6. నాయికానాయకులను స్త్రీ పురుషులుగా కల్పించుట &#8211; కాళిదాసు ప్రేరణ అని శ్రీ కొరిడె రాజన్నశాస్త్రి పండితులు ఓ వ్యాసంలో పేర్కొన్నారు.శ్రీ రాజన్న శాస్త్రి పండితుడు పేర్కొన్న కాళిదాసు శ్లోకం యిది.</p>
<blockquote><p>వీచిక్షోభస్తనితవిహగశ్రేణికాఞ్చీగుణాయాః<br />
సంసర్పన్య్తాః స్ఖలితసుభగం దర్శితావర్తనాభేః |<br />
నిర్విన్య్ధాయాః పథి భవ రసాభ్యన్తరః సన్నిపత్య<br />
స్త్రీణా మాద్యం ప్రణయ వచనం విభ్రమో హి ప్రియేషు || (మేఘదూతమ్ 1.29)</p></blockquote>
<p>ఉజ్జయినికి తూర్పు దిశలో వెళ్ళుమని యక్షుడు మేఘునితో చెబుతూ, దారిలో నిర్వింధ్య నదిని చూచి, దానితో సంభోగించుమని చెపుతున్నాడు.</p>
<p>ఓ మేఘుడా! నిర్వింధ్య నది నిన్ను వలచిన నాయికగా నీకడకు వచ్చును. అలలచలనము చేత కదిలింపబడిన పక్షుల కూజితములే &#8211; ఆ నది (యువతి) మొలనూలి శబ్దములు. ఆ (నది) సుడిగుండములే నాభి. మేఘుడా! ఆమెతో కూడి నీవు ఆ రసములను గ్రహింపుము. ఆమె వలచుటకు మునుపే కూడుట యెట్లు అన్న సందేహము వలదు. ఎందుకంటే, స్త్రీలు తమ వివిధములైన విలాసములతో ప్రణయమును ప్రకటింతురు. కావును ఆమెకు ప్రియుడవు కమ్ము.</p>
<p>కాళిదాసమహాకవి అమోఘమైన శ్లోకం యిది. ఈ శ్లోకంలోని సంభోగశృంగారపు ఘాటును తెనుగు కవి తగ్గించుకొన్నాడు. వసుచరిత్ర &#8211; సన్నివేశపరంగా అనిష్టురాలైన నాయికపై, మోహపరవశుడైన నాయకుని ధాష్టీకం. అయినప్పటికీ, కవి అందులో ఔచిత్యాన్ని పద్యపు ఎత్తుగడ ద్వారా పరిహరించినాడు. కాళిదాసు మేఘదూత శ్లోకంలో సన్నివేశం ప్రణయబద్ధమైనా శ్లోకంలో ఘాటైన శబ్దాల తీరు వలన కొంత ’అరుచి’ కలిగించే అవకాశం ఉంది.</p>
<p>7. వస్తుపరంగా ఈ పద్యం కాళిదాసును అనుకరించినది అని రాజన్నశాస్త్రి గారన్నారు. వసుచరిత్రపై కూలంకషమైన వ్యాసం వ్రాసిన వజ్ఝల చినసీతారామశాస్త్రి గారు &#8220;వేణి చలింపఁ..&#8221; పద్యశైలి సంస్కృతకవి శ్రీహర్షుని శైలిని పోలినదని అభిప్రాయపడ్డారు. శాస్త్రి గారి వ్యాఖ్య యిది.</p>
<p>&#8220;నియతములగు యతిప్రాసములను మాత్రము నిలిపియు, నతిమనోహరమగు తూఁగు వెలయునట్లు పద్యముల నడిపించు నేర్పు రామరాజభూషణునకే గలదని చెప్పవచ్చును.</p>
<blockquote><p>శ్లో. వాచం తదీయాం పరిపీయ మృద్వీం మృద్వీకయా తుల్యరసాం స హంసః|<br />
తత్యాజ తోషం పరపుష్టఘోషే (ఘుష్టే) ఘృణాం చ వీణాక్వణితే వితేనే ||</p></blockquote>
<p>యని యిట్లు నైషధకావ్యమున శ్రీహర్షుఁ డానుషంగికానుప్రాసములతోఁ దాండవమాడి యున్నాఁడు. అట్టి రీతులు శ్రీనాథుని యాంధ్రీకరణమున నంతగా నగపడవు. రామరాజభూషణునకుఁ గల శ్రీహర్షుని కవితామార్గముల ననుసరించుటయందలి యభిరుచి యీ విషయమునను జూపఁబడినదని తోఁచుచున్నది.</p>
<p>ఇట్లె యర్థాంతరస్ఫోరకముగఁ గవిత్వము చెప్పు నభిరుచియు శ్రీహర్ష మార్గానుసరణ లోలుపత్వమును వెల్లడి సేయుచున్నది.&#8221;</p>
<p>శాస్త్రి గారు ఉటంకించిన &#8220;వాచం తదీయాం..&#8221; శ్లోకార్థం యిది.</p>
<p>&#8220;ఆ హంస ద్రాక్షతో సమానమైన రుచి గల దమయంతీదేవి పలుకులను మిక్కిలి శ్రద్ధతో నాలకించి, కోకిలకూజితము పై సంతోషమును త్యజించినది. వీణానాదమందు విరక్తి పొందినది. అనగా ఆ దమయంతి పలుకులు ద్రాక్షరసము కన్నా, కోకిల కూజితములకన్నా, వీణానాదముకన్నా మధురముగానున్నవని యర్థము&#8221; &#8211; (నైషధీయచరితమ్ &#8211; 3.60)</p>
<p>వజ్ఝల వారు శ్రీహర్షుని పోలిక చెప్పినా, రాజన్నశాస్త్రి గారు కాళిదాసును అనుకరించినట్లు చెప్పినా, ప్రస్తుత వ్యాసకర్తకు (నాకు) అమరుకుని శ్లోకం స్ఫురణకు వచ్చినా, ఇవన్నీ భట్టుమూర్తి పద్యానికి గల విభిన్న పార్శ్వాలను సూచిస్తాయనటం న్యాయం.</p>
<p>ఏతావతా, రామరాజభూషణకవి మార్గం స్వతంత్రమైనది, సంస్కృతకవిత్వరీతులకు ధీటైనదని ఒప్పుకోక తప్పదు.</p>
<p style="text-align: center;">***</p>
<p>అట్లు సంభ్రమించిన ఆ నదిపై పర్వతానికి గల అతిశయగుణంతో కోలాహలుడు కోపముతో ముఖము జేవురింపగా ఆమెను బలవంతంగా పరిగ్రహించాడు. అది రసాభాసమని వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.</p>
<p>ఈ వసుచరిత్ర కావ్యం &#8211; ప్రబంధకాలంలో పుట్టినది. ప్రబంధకవులకు కథ చెప్పటం కన్నా, వర్ణనలమీద, వ్యాకరణ, జ్యోతిష్య, సంగీత, నాట్యాది శాస్త్ర విషయాలపైన,భాషపైన, అలంకారాలపైన, ఆలంకారిక పద్ధతులపైన గురి. ఈ కాలంలో కథకన్నా, పద్యం రాణకెక్కింది. అందుచేత ఆ దృష్టిలో చదువుకుంటేనే ఉత్తమం.</p>
<p>ఇరవై ఒకటవ శతాబ్దంలో అల్పమైన వ్యుత్పత్తి కలిగి, మూడు నాలుగు వ్యాసాలు చదివిన ఒక సాధారణ పాఠకుడికే విషయాలు తెలిస్తే, నాటియుగంలో సంగీతసాహిత్యాలను మథించిన ఎందరు రసికులను ఈ కావ్యం ఉర్రూతలూగించిందో!</p>
<p>&#8220;మూర్తికవీ, ధన్యుఁడవీ వన్నిటన్.&#8221;</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=15179</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ప్రబంధరాగలహరి</title>
		<link>http://vaakili.com/patrika/?p=12901</link>
		<comments>http://vaakili.com/patrika/?p=12901#comments</comments>
		<pubDate>Sat, 31 Dec 2016 20:16:45 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[రవి E.N.V]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=12901</guid>
		<description><![CDATA[అన్ని అవ్యక్త రాగాలు పలికించే వరూధిని, ప్ర-వరుని చూచింది. చూచి ఆ ’పంకజ’ముఖి, ఆతని సౌందర్యానికి మోహవిభ్రాంతి చెంది, తన ’అరవిందము’ను పోలిన తన పాదముల అడుగులు తడబడుతుండగా దిగ్గున లేచి ఎదురేగింది. ప్రవరుడికి మాత్రం అవేవీ పట్టలేదు. తనను ఊరికి చేర్చమని ఆమెను ప్రార్థించాడు. ఆవిడ - ఇక లాభం లేదని, ఇదివరకు అవ్యక్తంగా చూపిన అనురాగాన్ని వ్యక్తం చేసింది. ఇన్ని వ్యక్త అవ్యక్త రాగాలు పలికించినా, ఆ ’అరుణాస్పదపురవాసి’ ప్ర-వరుడికి ఆమెను చూడగా ఎదలో అనురాగం ఉదయించలేదు. (ఆస్పదము అంటే - నెలకొను, ఊనిక base అని అర్థం. అరుణాస్పదము - అంటే కావ్యంలో ప్రకరణికార్థంగా ఏ ప్రత్యేకతా లేదు కానీ, వ్యావహారికంగా ’రాగ’బద్ధమైన అని అర్థం తీసుకోవచ్చు.) రాగానికి (ఎరుపు రంగుకు) నిలయమైన ]]></description>
			<content:encoded><![CDATA[<p>&#8230;అలా ప్రవరుడు వీణను మ్రోగిస్తున్న అపురూపసుందరిని చూచాడు. (<a href="http://vaakili.com/patrika/?p=11751">ఇదే పత్రిక లో ఇదివరకు వినిపించిన ప్రబంధవిపంచిస్వరలహరి ని వీలైతే ఓ మారు ఆలకించి రాగలరు.</a>)</p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">వ</span>రూధిని</p>
<p>అప్సరోభామిని</p>
<p>మృగమదము, ఘనసారము మేళవించిన తాంబూల చర్వణంతో ఆమె మోవి రాగ రంజితమైనది.<br />
ఆ చిన్నదాని అంగదట్టపు (పావడా) కాంతిప్రసారము వలన చంద్రకాంతమణిపీఠము రాగ రంజితమైనది.<br />
ఆమె తన గోళ్ళతో వీణపై రాగాలు పలికిస్తూ పాడుకుంటున్న జిలిబిలిపాటతో పరిసరాలు ’రాగ’ రంజితమైనవి.<br />
సన్నగా ఆలాపం చేస్తూ అరమూసిన కనులతో రతిపారవశ్యవిభ్రమమమును తెలియజేస్తూ ఆమె మనసు రాగ రంజితమైనది.</p>
<p style="text-align: center;"><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/12/1.jpg"><img class="aligncenter  wp-image-12905" title="1" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/12/1.jpg" alt="" width="515" height="667" /></a></p>
<p style="text-align: center;">(వరూధినీప్రవరాఖ్యోపాఖ్యానం వడ్డాది పాపయ్య గారి కుంచెలో)</p>
<p>రాగము &#8211; అంటే సరిగమలతో కూడిన గీతము, ఎరుపురంగు, ప్రేమాతిశయము అని రకరకాల అర్థాలు ఉన్నాయి. (ఇలా ఒక విషయాన్ని అనేక విషయాలతో వర్ణించి చెప్పడాన్ని, సాభిప్రాయప్రకటననూ, ప్రతిపాదనావైచిత్రిని లేదా ప్రౌఢిమను ఓజస్సు అనే అర్థగుణంగా ‘రసగంగాధరం’ లో జగన్నాథపండితరాయలు పేర్కొంటాడు.)</p>
<p>అన్ని అవ్యక్త రాగాలు పలికించే వరూధిని, ప్ర-వరుని చూచింది. చూచి ఆ ’పంకజ’ముఖి, ఆతని సౌందర్యానికి మోహవిభ్రాంతి చెంది, తన ’అరవిందము’ను పోలిన తన పాదముల అడుగులు తడబడుతుండగా దిగ్గున లేచి ఎదురేగింది. ప్రవరుడికి మాత్రం అవేవీ పట్టలేదు. తనను ఊరికి చేర్చమని ఆమెను ప్రార్థించాడు. ఆవిడ &#8211; ఇక లాభం లేదని, ఇదివరకు అవ్యక్తంగా చూపిన అనురాగాన్ని వ్యక్తం చేసింది. ఇన్ని వ్యక్త అవ్యక్త రాగాలు పలికించినా, ఆ ’అరుణాస్పదపురవాసి’ ప్ర-వరుడికి ఆమెను చూడగా ఎదలో అనురాగం ఉదయించలేదు. (ఆస్పదము అంటే &#8211; నెలకొను, ఊనిక base అని అర్థం. అరుణాస్పదము &#8211; అంటే కావ్యంలో ప్రకరణికార్థంగా ఏ ప్రత్యేకతా లేదు కానీ, వ్యావహారికంగా ’రాగ’బద్ధమైన అని అర్థం తీసుకోవచ్చు.) రాగానికి (ఎరుపు రంగుకు) నిలయమైన ’అరుణాస్పద’పురవాసి ప్రవరుడికి &#8211; అంత అతిలోకసౌందర్యవతిని చూచినా ’రాగం’ (ప్రీతి) ఉదయించలేదు. ఇక చేసేదేం లేక ఆ ’పాటల’ గంధి అనురాగాన్ని సువ్యక్తం చేసి ఆతణ్ణి కౌగిలించుకుంది. (పాటలమంటే ఎఱుపు రంగు కలిగొట్టుపువ్వు). ఆ భూసురుడు శ్రీహరి నామస్మరణతో మోము తిప్పుకుని ఆమెను పక్కకు త్రోసి &#8211; చివరకు అగ్నిని ప్రార్థించాడు. &#8220;స్వాహావధూవల్లభుని&#8221; ప్రత్యక్షం చేసుకుని. ఆ దేవుని అనుగ్రహంతో ’నవ్వరూధిని హృదయకంజమున రంజిల్లు నమందాను రాగ రస మకరందంబు నందంద పొంగంజేయుచుఁ’ నిజగృహానికి వెళ్ళేడు.</p>
<p>వలచిన ప్రియుడు కనుమరుగయినాడు. ఇక ఈ అప్సరకాంత తీవ్రవిరహశోకంలో పడ్డది. ఆమె ’దరుణ కమలదళ శోణంబులగు దృక్కోణంబులన్’ కన్నీరు దిగువాఱింది.</p>
<blockquote><p>రాగం<br />
పంకజముఖి<br />
అరవిందము<br />
అరుణాస్పద పురము<br />
పాటలగంధి<br />
స్వాహావధూవల్లభుడు<br />
తరుణకమలదళ శోణంబు</p></blockquote>
<p>స్వారోచిషమనుసంభవం/మనుచరిత్ర లో తడవ తడవకూ నాయికానాయకులకు, ప్రకృతి వర్ణనలకు సంబంధించిన కవిప్రయోగాలలో- ’అరుణం’/ఎఱుపు రంగు కనిపిస్తుంది. ఈ అరుణం వెనుక కవిహృదయం ఏమై ఉంటుంది?</p>
<p style="text-align: center;">***</p>
<p>వరూధిని ’రాగ’రంజిత. ప్రవరుడు &#8211; ’అరుణా’స్పదపురవాసి. ఈ కథను కృతికర్త పెద్దన, కృతిభర్త రాయలవారికి చెబుతున్నాడు. చెబుతూ కృష్ణరాయలను &#8220;హరనిటల నటత్పావక పరిభావి మహః ప్రావృతనిఖిలాశ&#8221; అని ప్రస్తుతిస్తాడు.అంటే &#8211; &#8220;ఈశ్వరుని చిచ్చరకన్నులో నర్తించే అగ్నిని ధిక్కరిస్తున్న ప్రచండ తేజః ప్రతాపాలతో దిశలను నింపినవాడా&#8221; అని అర్థం.</p>
<blockquote><p>&#8220;శుక్లత్వం కీర్తిహాసాదౌ కార్ష్ణ్యం దుష్కీర్తఘాదిషు<br />
ప్రతాపే రక్తతోషత్వే రక్తత్వం క్రోధరాగయోః&#8221; &#8211; కావ్యకల్పలత.</p></blockquote>
<p>(ఇది ’హరనిటల నటత్పావక..’ పద్యానికి సంబంధించి, శేషాద్రి రమణ కవుల మనుచరిత్ర వ్యాఖ్యలో ఉటంకించిన శ్లోకం)</p>
<p>కీర్తిని వర్ణించే సందర్భంలో తెలుపు రంగునూ, ప్రతాపాన్ని ఎఱుపు రంగుతో ఉపమించాలి. ఉదయాన్ని, క్రోధాన్ని, రాగాన్ని అరుణవర్ణంగా చూపాలి. ఇవి కవిసమయాలు. కావ్యనాయకుడు, కావ్యనాయికలతో బాటు ‘అగ్నిని ధిక్కరించే తేజః ప్రతాపాలతో అలరారే శ్రీ కృష్ణదేవరాయలు’ అనగా కృతిభర్త కూడా ఎఱుపు రంగుకు ప్రతీకే. వీరందరూ కాక అంతట అక్కడకు కర్మసాక్షి ఏతెంచినాడు. ఆయన కూడా అరుణుడు. అంతవరకూ కావ్యారంభం నుంచీ అవకాశం చిక్కినప్పుడల్లా ’ఎఱుపు’ రంగుతో దోబూచులాడిన అల్లసాని పెద్దన సంధ్యా’రాగా’న్ని తొమ్మిది పద్యాలలో అపూర్వంగా వర్ణించాడు. అందులో తలమానికమైన పద్యం మొదటిది.</p>
<blockquote><p>చం||<br />
తరుణి ననన్యకాంత నతిదారుణ పుష్పశిలీముఖవ్యథా<br />
భరవివశాంగి నంగభవు బారికి నగ్గముసేసి క్రూరుఁడై<br />
యరిగె మహీసురాధముఁ డహంకృతితో నని, రోషభీషణ<br />
స్ఫురణ వహించెనో యన నభోమణి దాల్చెఁ గషాయ దీధితిన్. (3-10)</p></blockquote>
<p>తరుణిన్ = కన్యను,<br />
అనన్యకాంతన్ = మరియొక ప్రియుడు లేనిదానను,<br />
అతిదారుణ పుష్పశిలీముఖవ్యథాభరవివశాంగిన్<br />
అతిదారుణ = మిక్కిలి క్రూరమైన<br />
పుష్పశిలీముఖ = కుసుమశరునియొక్క<br />
వ్యథాభర = బాధచేత<br />
వివశాంగిన్ = పరవశయైన శరీరము గల దానిని,<br />
అంగభవు = మన్మథుని<br />
బారికిన్ = తావునకు,<br />
అగ్గముసేసి = అర్పించి<br />
క్రూరుఁడై = కఠినుడై<br />
అహంకృతితోన్ = అహంకారముతో<br />
మహీసురాధముడు = బ్రాహ్మణబ్రువుడు<br />
అరిగెన్ = వెళ్ళినాడు<br />
అని = అనుకొని<br />
రోషభీషణస్ఫురణ = కోపముచే భయంకరమైన తేజమును,<br />
వహించెనో అనన్ = దాల్చెనో అన్నట్టుల<br />
నభోమణి = భానుడు<br />
కషాయదీధితిన్ = ఎఱుపు రంగును<br />
తాల్చెన్ = వహించెను.<br />
కన్యను, పరపురుషుని ఎఱుగక తననే వలచిన వరూధినిని ప్రేమను అంగీకరించకుండా, ఆమెను మన్మథుని బారికి వదిలి, ఆ బ్రాహ్మడు అహంకారంతో క్రూరుడై వెళ్ళిపోయాడు &#8211; అన్నట్టుగా ఆకాశాన సూర్యుడు కషాయ వర్ణాన్ని సంతరించుకున్నాడు.<br />
(ఇక్కడ కషాయమంటే ఎఱుపు).</p>
<p style="text-align: center;"><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/12/2.jpg"><img class="aligncenter  wp-image-12906" title="2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/12/2.jpg" alt="" width="614" height="461" /></a></p>
<p style="text-align: center;">(అల్లసాని పెద్దనకు ప్రేరణనిచ్చిన హంపి (నాటి విద్యానగరం) లో ఓ సంధ్య.)</p>
<p>చాలా గమ్మత్తైన పద్యం యిది. శిరీషకుసుమపేశలసుధామయోక్తులతో అల్లనల్లన సాగే ఈ పద్యంలో అల్లసాని పెద్దనామాత్యుని శైలి స్పష్టంగా కనిపిస్తున్నా &#8211; దీనిని పెద్దన వ్రాసి ఉండడని కొందరు పండితులు అన్నారు. ఈ పద్యభావంలో కవి నాయిక పెద్దన వరూధినిని సమర్థిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. పైగా అదివరకు భాషాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీక్షాపరతంత్రుడు అని నాయకుని పొగిడి, ఈ ఘట్టంలో ప్రవరుని పట్టుకుని ’మహీసురాధముడు’ &#8211; అని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాడు. అంతేకాక అంతకు ముందరి ఘట్టం వరకున్నూ ప్రవరుని ద్వారా కర్మనైష్ఠిక వాదాన్ని సమర్థించిన పెద్దన అంతలోనే ప్రవరుని ఆక్షేపించి వాదంలో ప్రతికక్షి అయిన నాయికను పరోక్షంగా సమర్థిస్తూ ఎలా కవిత్వరచన చేస్తాడు? అందుచేత ఇది పెద్దన రచన అయి ఉండదని కొందరు పండితుల ఊహ. ఆలోచిస్తే ఈ ఊహ అసమంజసమేమో అని అనిపిస్తుంది. అల్లసాని పెద్దనకవి రసలుబ్ధుడు, రసావేశపరుడు. ఇదివరకటి వ్యాసంలో చెప్పుకున్నట్టు రసావేశానికి, ఔచిత్యానికి కొంత చుక్కెదురు. ఓ అద్భుతమైన దృశ్యాన్ని కానీ, నిరుపమానమైన సౌందర్యాన్ని కానీ చూచి మనస్సులో భావించినప్పుడు, ఆ భావనకనుగుణంగా కవిత్వం జాలువారినప్పుడు ఆ ఘట్టంలో ఒకింత ఔచిత్యం లోపం జరుగటం అంతపెద్ద ముప్పు కాదు. ఇటువంటి అనుద్దేశ్యపూర్వక ప్రమాదాలు (Unforced errors) అక్కడక్కడా పెద్దన కవిత్వంలో కనిపిస్తాయి.</p>
<p>అల్లసాని పెద్దన నివసించిన నాటి విద్యానగర (కిష్కింధ) ప్రాంతంలో మాల్యవంతం ప్రస్రవణగిరి సానువులపై సంధ్యాకాలపు ఆకాశాన్ని వాల్మీకి మహర్షి ’పుండు’ లా ఉందని వర్ణించాడు.</p>
<blockquote><p>సంధ్యారాగోత్థితైస్తామ్రై రన్తేష్వధికపాణ్డరైః |<br />
స్నిగ్ధైరభ్రపటచ్ఛేదైః బద్ధవ్రణమివాంబరమ్|| (వాల్మీకిరామాయణము, కిష్కింధాకాండ. 28.5)</p></blockquote>
<p>వర్షము వెలసిన తర్వాత అల్పజలసంచయంతో తెల్లగా నున్న మేఘాలతో కూడిన యంబరము సంధ్యారాగాంచితమై – శరీరంపై ఏర్పడిన పుండుకు బట్టతో కట్టిన తెల్లటి కట్టులాగా, మధ్యభాగంలో ఎఱ్ఱగా. చివరల లేతరంగులోనూ ఉందట. తప్పిపోయిన సీత తిరిగి దొరికి, మాల్యవంతంపై నివసించే అవకాశం లభిస్తే, అయోధ్యను, ఇంద్రపదవిని కూడా ఆశించనని రామునిచేత అనిపిస్తాడు వాల్మీకి.( కిష్కింధాకాండ 1.95) తుంగభద్రా నదీసోయగాలతో, పర్వతసానువులతో, ప్రకృతిరామణీయతతో నిండిన విద్యానగర పరిసరాల యొక్క సంధ్యాసమయాలు పెద్దనకు కూడా పెద్దపెట్టున ప్రేరణగా నిలిచి ఉంటాయని ఊహించటం అత్యుక్తి కాదు.</p>
<p>తిరిగి మనుచరిత్ర తృతీయాశ్వాసానికి&#8230;</p>
<p>తరువాత ’ఉరుదరీకుహరసుప్తోత్థశార్దూలముల్&#8230;’ అన్న పద్యంలోనూ అరుణ రాగం నలుదిశలా నిండుతుంది. ఇది విద్యానగరం (హంపి) హేమకూటాద్రి, అంజనాద్రి, ఋష్యమూక పర్వతాదుల నడుమ తుంగభద్ర పై అస్తమిస్తున్న సంధ్యాఫలకం కాబోలు.</p>
<p style="text-align: center;"><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/12/3.jpg"><img class="aligncenter  wp-image-12908" title="3" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/12/3.jpg" alt="" width="691" height="461" /></a></p>
<p style="text-align: center;">(సంధ్యారాగంతో రక్తవర్ణం సంతరించుకున్న తుంగభద్రా నది.)</p>
<p>ఆపై చీకటి పడింది. పిమ్మట చంద్రోదయమున్నూ ’రాగ’ బంధురమై ప్రకాశిస్తుంది.</p>
<blockquote><p>మ||<br />
స్ఫుటసౌగంధికరాగరక్తరుచి మైఁ బూనెన్ జపాసన్నిధి<br />
స్ఫటికంబ ట్లుదయాద్రి గైరిక శిరస్స్థానస్థితిన్ జంద్రుఁడ<br />
చ్చొటు వాయన్ శుచియయ్యెనౌఁ బ్రకృతి నచ్ఛుండైన సన్మార్గియె<br />
న్నఁటికిం గూటమి వంకవచ్చు వికృతిన్ మగ్నుండుగానేర్చునే. (3-24)</p></blockquote>
<p style="text-align: center;">తా: చంద్రోదయ సమయాన &#8211; తూర్పుకొండ దాపుల నున్న చంద్రుడు ఆ కొండ యొక్క ధాతు రాగం చేత ఎర్రబడ్డాడు. అది ఎలా ఉందంటే &#8211; మంకెన పువ్వు పక్కగా స్ఫటికాన్ని ఉంచితే ఆ స్ఫటికం మంకెన పువ్వు రంగు సంతరించుకున్నట్టుగా ఎర్రగా ఉంది. అలా ఎర్రటి రంగును పొందిన చంద్రుడు కాసేపటికి పైకి తేలి, (ధవళకాంతులతో) స్వభావసిద్ధమైన స్వచ్ఛతను సంతరించుకున్నాడు. స్వభావసిద్ధంగా నిర్మలుడైన వాడికి ఏదైనా సందర్భంలో సహవాసదోషం చేత ఒక వికారం అంటుకున్నప్పటికీ, దాని నుండి త్వరగా తప్పించుకుని బయటపడగలడు కానీ అదే వికారంలో ఎల్లవేళలా మునిగి యుండడు కదా!<br />
<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/12/4.jpg"><img class="aligncenter  wp-image-12909" title="4" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/12/4.jpg" alt="" width="480" height="360" /></a><br />
అర్థాంతరన్యాసాలంకారంతో చంద్రుని ప్రవర్తనను దృష్టాంతీకరించిన ఈ పద్యం &#8211; ప్రవరుని నిష్కళంకప్రవృత్తిని ప్రతీయమానం చేసే వస్తుధ్వనికి ఉదాహరణ. మనుచరిత్ర ఆరంభంలో ప్రవరుని &#8220;చతురాస్యవంశ కలశోదధి పూర్ణశశాంక..&#8221; అని పూర్ణచంద్రునితో ఉపమించడమూ ఇక్కడ ప్రస్తావనార్హం. ఆ ’శశాంకుడే’ ఈ కళంకరహితుడైన ’రాతిరిఱేడు’.</p>
<p>ప్రవరుడు వరూధినిని నిరాకరించిన తర్వాత,ఆమెపై ఎంతోకాలం మరులు గొని ఉన్న మాయాప్రవరుడు అక్కడికి వస్తాడు. ఆతడు ప్రవరుని వేషం ధరిస్తాడు. ఇక్కడ గమనార్హమైన విషయం మాయా(వియచ్చర) ప్రవరుని ఆహార్యం.</p>
<blockquote><p>సీ||<br />
అర్ధచంద్రుని తేట నవఘళించు లలాట<br />
పట్టి దీర్చిన గంగమట్టితోడఁ<br />
జెక్కుటద్దములందు జిగివెల్లువలు చిందు<br />
రమణీయ మణికుండలములతోడఁ<br />
బసిఁడి వ్రాఁతచెఱంగు మిసిమి దోఁపఁ జెలంగు<br />
నరుణాంశుకోత్తరీయంబుతోడ<br />
సరిలేని రాకట్టు జాళువా మొలకట్టు<br />
బెడఁగారు నీర్కావిపింజెతోడ<br />
గీ||<br />
ధవళధవళములగు జన్నిదములతోడఁ<br />
గాశికాముద్ర యిడిన యుంగరము తోడ<br />
శాంతరసమొల్కు బ్రహ్మతేజంబుతోడఁ<br />
బ్రవరుఁ డయ్యె వియచ్చరప్రవరుఁడపుడు. (3.71)</p></blockquote>
<p>తాత్పర్యము: (వరూధినిని సమీపించే) ఆ సమయంలో గంధర్వుడైన మాయాప్రవరుడు &#8211; (బోర్లించిన) నెలవంకను తిరస్కరించే ఫాలభాగంపై గంగమట్టిని తిలకంగా దిద్దాడు. తన అద్దాల చెక్కిళ్ళలో కాంతిరేఖలు ప్రతిఫలించే రత్నాల కర్ణభూషణాలను ధరించాడు. బంగరు అంచు మిసమిసలాడే ఎఱ్ఱని ఉత్తరీయాన్ని ధరించాడు. మెరుపు రంగు దోవతి తాలూకు కుచ్చెళ్ళు జారే రత్నాల మొలత్రాడు ధరించాడు. ఇంకా, తెల్లని యజ్ఞోపవీతాన్ని, కాశీముద్ర గల ఉంగరాన్ని ధరించి, మొఖాన శాంతరసం కనబడే లాగున బ్రహ్మతేజస్సు వెలయగా నిజప్రవరుని రూపాన్ని ధరించాడు.</p>
<p>అద్భుతావహమైన ఈ పద్యంలో వియచ్చర ప్రవరుడు రసపర్యవసాయి. ఇక్కడ &#8211; మాయాప్రవరుడు అరుణాంశుకోత్తరీయాన్ని ధరించడం గమనార్హం.</p>
<p>వచ్చిన వ్యక్తి మాయాప్రవరుడని ఎఱుగని వరూధిని అతణ్ణి మనసా తన ప్రియుడైన ప్రవరుడనే భావించి జతకడుతుంది. వారికి ’స్వరోచి’ జన్మిస్తాడు. మనుచరిత్రలో వరూధిని అప్సరకాంత, మహా భోగిని. ఆమె పుత్రుడు స్వరోచి కూడా బహుపత్నీకుడు. భోగి. మృగయావినోది.</p>
<p>వరూధిని, ఆమె కొమరుడు స్వరోచి ఇద్దరూ రజోగుణ బద్ధులు. &#8220;రజో ’రాగా’త్మకం విద్ధి&#8221; అని భగవద్గీత. రజోగుణం రాగాత్మకమైనది. ఆ ’రాగా’నికి ఎరుపు రంగు ప్రతీక. విష్ణుధర్మోత్తర పురాణం, శిల్పరత్నం ఇత్యాది గ్రంథాల ప్రకారం &#8211; రజోగుణ సంబంధమైన విషయాలను చిత్రకళలో ప్రదర్శించడానికి అరుణ వర్ణాన్ని ఉపయోగించాలి. నాట్యశాస్త్రం ప్రకారం &#8211; రౌద్ర రసానికి ఎరుపు రంగు చిహ్నం.</p>
<p>మనుచరిత్ర తృతీయధ్యాయంలో పరంపరగా వచ్చే సంధ్యావర్ణన, చంద్రాగమనం, చంద్రోపలంభం, మన్మథోపలంభం, ఆపై సూర్యోదయసంధ్య, సూర్యోదయాన వరూధిని చెలికత్తెల పుష్పాపచయ క్రీడలో ఎడనెడ రాగరంజితమై అరుణవర్ణం కానవస్తుంది. మనుచరిత్రలో కొన్ని తామ్రరాగ ప్రస్తావనలకు ఉదాహరణలు ఇవి.</p>
<p>’ఉరుసంధ్యాతపశోణమృత్కలితమై యొప్పారు బ్రహ్మాండమన్ గరిడిన్..’ 3.59 &#8211; ప్రాతస్సంధ్య, చంద్రాస్తమయ వర్ణన<br />
&#8216;వెలఁది యిచ్చటి సంపెంగవిరులు గగన దేవతల ఇండ్ల నెత్తిన దీపశిఖలు..’ 3.76<br />
’అపరిమితానురాగ సుమనోలసయై చిగురాకుఁ జేతులన్&#8230;’3.77<br />
&#8216;మృగనాభినికరంపుబుగబుగల్ గలచోటఁ జదలేటి తుంపురుల్ చెదరుచోట..’3.111<br />
’చెంగల్వపూదండ సేర్చి పెందుఱుముపై..’ &#8211; స్వరోచి భార్య మనోరమ తొలిసమాగమ వర్ణనలో ఆమూలాగ్రం ఎఱుపు దనం (6.5)<br />
&#8216;దట్టంబు నీ కట్టినట్టి చెంగావికి..’ 6.8<br />
’సొన దేఱి పొటమరించి నెఱె వాసినయట్టి..’ &#8211; 6.27 (వసంత వర్ణనము)<br />
’అలకని జీబులోఁ గుసుమమద్దిన పావడ దోఁపఁ గొప్పు చెంగలువలవల్పుఁ&#8230;’ (6.31) &#8211; పుంజికస్థల అనే అప్సరస వర్ణన. మళ్ళీ నిండుగా అరుణంపు ధగధగ<br />
’అరవిందాక్షులుఁదాను ఇట్లభిమత..’ 6.63</p>
<p>ఇలా పెద్దన కవి, ఉద్దేశ్యపూర్వకంగానో లేదా అవివక్షితంగానో కావ్యాన్ని ’రాగ’ రంజితం చేశాడు.</p>
<p>కావ్యంలో అంతర్భాగంగా కవి &#8211; వివక్షితంగానో, అవివక్షితంగానో మనోభావాన్ని నిక్షిప్తం చేశాడని ఊహించటం విపరీతము, విడ్డూరమూ కాదు. సాధారణంగా తమకు ఇష్టమైన భావాన్ని ఒక పదంలో నిక్షిప్తం చేసి సర్గ చివరి శ్లోకంలో ఉపయోగించటాన్ని సంస్కృత, ప్రాకృతకవులు ఆరంభించారు. ఈ విధంగా వాకాటకప్రవరసేన కవి ’అనురాగ’ శబ్దాన్ని, సర్వసేనుడు ’ఉత్సాహ’ శబ్దాన్ని, భారవి ’లక్ష్మీ’ శబ్దాన్ని, మాఘుడు ’శ్రీ’ శబ్దాన్ని ఉపయోగించారు. ఇదే పోకడ తెలుగులో కొనసాగింది. ఇవి వివక్షితాభిప్రాయ ప్రకటనలు. అవివక్షితంగా కూడా కవి భావాలు కావ్యాలలో దొరలి కవుల మనోభావప్రకటనలుగా తెలియడం కావ్యాలలో ఉన్నది. భవభూతి ఉత్తర రామ చరితమ్ లో తెలుగు పలుకుబడులు సంస్కృత రూపంలో కవి వెలువరించడం స్పష్టంగా తెలుస్తుంది. నంది తిమ్మన పారిజాతాపహరణ కావ్యం రాయలకు ఆయన భార్య తిరుమల దేవికి మధ్య కలహాన్ని నివారించడానికి నంది తిమ్మన వ్రాశాడని విజ్ఞుల అభిప్రాయపడడం తెలిసిందే. రామరాజభూషణుని వసుచరిత్ర వెనుక కూడా ఏదో రాజకీయకలహప్రస్తావన ఉందని మాన్యులు చెబుతారు.</p>
<p style="text-align: center;">***</p>
<p>అల్లసాని వాని జీవితాదర్శం &#8211; చారిత్రక పరామర్శ:</p>
<p>కావ్యం – కవి యొక్క సంస్కారపు కుప్ప. కవి కూడా సాధారణ మానవుడే. అయితే ఆతని విశిష్టత్వం సాధారణత్వం నుండి అసాధారణత్వం వైపు చూచే దృష్టిలో, సాగించే అన్వేషణలో ప్రతిఫలిస్తుంది. ఆ అన్వేషణ కావ్యంలో వ్యక్తం అవుతుంది. మనుచరిత్రను చాలామంది పండితులు విమర్శకులు ఏళ్ళ తరబడి వివిధ రకాలుగా అనుశీలిస్తూ, పరామర్శిస్తూ, విమర్శిస్తూ కవి హృదయపు భిన్న పార్శ్వాలను ఆవిష్కరిస్తూనే ఉన్నారు. తెలిసిన చారిత్రక వివరాల నేపథ్యం తో, అల్లసాని పెద్దిరాజు కవిని అనుశీలిస్తే ఆయన సంస్కారం తెలుస్తుంది.</p>
<p>రాయవాచకంలో చెప్పిన ప్రకారం &#8211; రాయలవారు ముక్కుతిమ్మనకూ, పెద్దన వారికీ ఒకేసారి కర్పూరతాంబూలం ఇచ్చి కావ్యరచనకై నిర్దేశించారు. తిమ్మన గారి పారిజాతాపహరణ కావ్యం తొందరగా పూర్తయితే పెద్దన కావ్యానికి మాత్రం కాస్త ఎక్కువకాలమే పట్టింది. ఈ విషయాన్ని వేటూరి ప్రభాకరశాస్త్రి గారు తమ మనుచరిత్ర పీఠికలో చెప్పారు. పరిమాణంలో తక్కువ ఉన్న మనుచరిత్రకు అంత సమయం ఎలా పట్టింది? కారణం ఊహిస్తే &#8211; పెద్దన కవిత్వానికి ప్రేరణ కావాలి. &#8216;ఊరక కృతులు రచింపు’ మన్న ఆయనకు కుదరదు. ఆ స్ఫూర్తి &#8211; రమణీప్రియదూతిక తెచ్చు కప్పురవిడెమో, తూగుటుయ్యాలో, అందమైన సాయంత్రమో, మనోహరమైన నదీప్రవాహప్రాంతమో, మత్తుగొలిపే సౌరభాన్వితమైన మలయమారుతమో, వీనులవిందైన వీణావాదమో, సంగీత మాధుర్యమో, నాటి విజయవిట్ఠల రంగమంటపంలో అచ్చరలను మించిన విద్యానగరభామినుల నృత్యకేళియో&#8230;ఏదో! ఏదైనా కావచ్చు. ఆ ప్రేరణ లేక కవిత్వం లేదు. అలా ఆ ప్రేరణకోసం తపించి వేచినాడు గనకనే కావ్యానికి అంతసమయం పట్టింది. ఈ ఊహలకు దృష్టాంతాలు కూడా మనుచరిత్రలో వెతికితే కనిపిస్తాయి. సూక్ష్మంగా గమనిస్తే మనుచరిత్రలో కొన్ని ఘట్టాలు సుదీర్ఘంగాను, కొన్ని త్వరత్వరగా ముగించినట్టూ సులభంగానే తెలుస్తుంది.</p>
<p>పెద్దన గారి ’నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు&#8230;’ అన్న చాటువు ద్వారానూ, అల్లసాని వారు చిత్రించిన వరూధిని, స్వరోచి పాత్రల మూలకంగాను తెలిసే విషయం ఏమంటే అల్లసాని పెద్దన కవి కవిగా రసలుబ్ధుడు, స్వాభావికంగా పరిపూర్ణజీవితాభిలాషి. కొంతవరకూ భోగి. రాయలవారి సాంగత్యాన గండపెండెర సత్కారం మొదలుకుని అగ్రహారాదులు అన్నీ అమరిన కవి. అల్లసాని పెద్దన కవికి గండికోట సీమలోని ’కోకట’ గ్రామాన్ని హక్కుభుక్తంగా, &#8220;ఉంబళి&#8221; (Tax free asset) గా కృష్ణరాయలవారు వ్రాసి ఇచ్చిన సంగతి సహృదయులకు తెలుసు.</p>
<p>అయితే తెలియవలసిన విషయం మరొకటి ఉన్నది.</p>
<p>క్రీ.శ. 1518, బహుధాన్య నామ సంవత్సరం రాయల వారికి ప్రముఖమైన సంవత్సరం. అప్పటికి రాయలు ఉదయగిరి దుర్గాన్ని జయించారు. పొట్నూరు విజయస్థంభాన్ని నాటించారు. తిరిగి వస్తూ విజయవాడ మల్లికార్జున స్వామి దేవళం వద్ద వైశాఖ పౌర్ణమి చంద్రగ్రహణం నాడు భూరి దానాలు చేశారు. నాడు ఆయనతో బాటు ఉన్న అల్లసాని చొక్కరాజు పుత్రుడైన అల్లసాని పెద్దనకవి గారు, తనకు హక్కుభుక్తంగా వచ్చిన కోకట గ్రామంలో చాలా భాగం చేనును కోకటం లోని సకలేశ్వరుని సన్నిధికి దానం చేశారు. (South India Inscriptions Vol 16)<br />
అదే యేడు కార్తీకమాసం ఉత్థానద్వాదశి రోజున, కోకట గ్రామంలో నాలుగున్నర పుట్ల (~ 9 ఎకరాల) భూమిని, తిరిగి మరోమారు అల్లసాని పెద్దన కవి చెన్నకేశవ స్వామికి దానం చేసేశారు. రాయల వారు తిరిగి పెద్దనకు ఆర్కాటు జిల్లాలోని మరో గ్రామాన్ని దానం చేస్తే, ఆ గ్రామాన్ని కూడా పెద్దన తనకై ఉంచుకోకుండా వరదరాజపెరుమాళ్ళకు దానం చేశారు.(శాసన పాఠం వ్యాసం చివర)<br />
అంటే &#8211; అల్లసానిపెద్దన భోగి. అయితే భోగ’లాలసుడు’ కాదు. స్వభావతః ఆయన ధార్మికుడు, కొంతమేరకు ’విరాగి’ కూడా.</p>
<p>సూక్ష్మంగా గమనిస్తే పై ఉదంతాలతో ఆ కవి మానసికప్రవృత్తి, మనుచరిత్ర కావ్య కథాపరిణామంలో ప్రతిఫలించిందా? అని అనిపిస్తుంది. వరూధిని అప్సరస. స్వేచ్ఛావర్తిని. మాయాప్రవరుడు ఓ గంధర్వుడు. వరూధిని యొక్క భోగప్రవృత్తి, స్వేచ్ఛావర్తనము &#8211; ఆమెకూ, మాయాప్రవరునికి జన్మించిన స్వరోచికి జన్మరీత్యా వచ్చినవి. స్వరోచి &#8211; ఒక మృగయావినోది. బహుపత్నీకుడు. రజో గుణ బద్ధుడు. అయితే స్వరోచికి, వనకన్యకు జన్మించిన స్వారోచిషుడు మాత్రం సత్వగుణసమన్వితుడైనాడు.</p>
<blockquote><p>తే||<br />
అట్లు జనియించి స్వారోచిషాఖ్య నతఁడు<br />
శాంతి దాంతి దయా సత్య శౌచ నిరతుఁ<br />
డై యకామతఁ జిరతపం బాచరించె<br />
నచ్యుతునిఁ గూర్చి యంతఁ గృపార్ద్రుఁ డగుచు.</p></blockquote>
<p>అట్లు రజోగుణాన్వితుడైన స్వరోచికి జన్మించిన స్వారోచిషుడు నిష్కామకర్ముడై బాహ్యాంతర ఇంద్రియ నిగ్రహము గలవాడై , సత్యమునందు, శుచియందు నిరతుడై విష్ణుమూర్తిని గురించి తపమాచరించాడు. అలా ఆ స్వారోచిషుడు, సత్వగుణప్రధానుడై, శ్రీ మహా విష్ణువును గురించి గొప్ప తపమాచరించి చివరికి ఆ మహాదేవుని ప్రత్యక్షం చేసుకొన్నాడు. శ్రీ మహావిష్ణువు ఆతని మనువుగా పట్టాభిషిక్తుని చేశాడు.</p>
<p>ఈ నేపథ్యంలో స్వారోచిష మనుసంభవ కావ్యం రాగము (రజోగుణం) నుండి విరాగము (సత్వగుణం) వైపు సాగిన పయనానికి ప్రతీక అని, ఆ పయనంలో అంతర్భాగంగా రజోగుణానికి ప్రతీక అయిన ఎఱుపు రంగు ఎడనెడా కావ్యంలో (కవి సాభిప్రాయప్రకటన మూలంగా కానీ, లేదా అలవోకగా జాలువారిన కవిత్వమనే భావప్రవాహంలో కానీ) పరుచుకున్నదని, వరూధిని తో మొదలైన రజోగుణం ఆమె పుత్రుడైన స్వరోచితో పెంపొంది, సత్వగుణంగా స్వారోచిషుని జన్మలోనూ, ఆతడు పొందిన శ్రీమహావిష్ణువు దర్శనంలోనూ పరిణమించి పరిపూర్ణమైనదని, ఆ సత్వగుణాన్వేషణ కవి మనోఫలకాన్ని, జీవితాదర్శాన్ని ప్రతిబింబిస్తోందని, దరిమిలా కవి మానసికజీవితాదర్శమే కావ్యరూపంలో తీర్చబడినదని ప్రతిపాదించడమే ఈ వ్యాస సారాంశం.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/12/51.jpg"><img class="aligncenter size-full wp-image-12911" title="5" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/12/51.jpg" alt="" width="1143" height="1876" /></a><br />
<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/12/6.jpg"><img class="aligncenter size-full wp-image-12912" title="6" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/12/6.jpg" alt="" width="1212" height="1883" /></a><br />
<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/12/7.jpg"><img class="aligncenter size-full wp-image-12913" title="7" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/12/7.jpg" alt="" width="1025" height="712" /></a></p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
<p>Credits:<br />
1. Hampi Photoes courtesy: Sree Shiva Shankar Banagar’s facebook page</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=12901</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>మధ్యమవ్యాయోగం</title>
		<link>http://vaakili.com/patrika/?p=12243</link>
		<comments>http://vaakili.com/patrika/?p=12243#comments</comments>
		<pubDate>Fri, 30 Sep 2016 22:18:01 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[రవి E.N.V]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=12243</guid>
		<description><![CDATA[<p>ప్రస్తావన:</p> <p>సాధారణంగా ఓ కథ అల్లడానికి కథకుడు కొన్ని మౌలికమైన పద్ధతులు పాటిస్తాడు. అవే పద్ధతులు నాటకరచన లోనూ ఉపకరిస్తాయని భావించవచ్చు. రేఖామాత్రమైన కథ (storyline) ను ఊహించి, దాన్ని పొడిగించి, కొన్ని అంకాలుగా తీర్చి, పాత్రలను, పాత్రధారులను, సన్నివేశాలనూ, సంభాషణలనూ జోడిస్తూ విస్తరించడం ఒక పద్ధతి. అలా కాక ఒక వృత్తాంతాన్ని (theme) ఎంచుకుని, థీమ్ కు సరిపడా కథను సాధ్యమైనంత విస్తృతంగా ఒక చిత్తుప్రతి ద్వారా కూర్చుకొని, ఆ కథను ట్రిమ్ చేసి, అనవసరమైన సంభాషణలనూ, పాత్రలనూ, సన్నివేశాలనూ కత్తిరించి, మెరుగుపెట్టటం రెండవ పద్ధతి. మొదటిది రాత. రెండవది కోత. మొదటిది ఎక్కువభాగం Writing. రెండవది ఎక్కువభాగం Editing.</p> <p>భాసుని నాటకాలలో స్వప్నవాసవదత్తమ్ అన్న &#8220;ఆరు అంకాల&#8221; నాటకపు ఇతివృత్తాన్ని క్లుప్తంగా (Thin storyline) చెప్పవచ్చు. (ఆ Thin story line: ఉదయనుడు &#8211; వాసవదత్తకు భర్త. అతడు తన రాజ్యాన్ని కోల్పోయాడు. అతనికి పద్మావతి అని ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి ద్వారా కోలుపోయిన రాజ్యాన్ని కట్టబెట్టడానికి &#8211; మంత్రి యౌగంధరాయణుడు పన్నిన యుక్తి స్వప్నవాసవదత్త నాటక ఇతివృత్తం). ఇది మొదటి పద్ధతిలో రచించిన రచన.</p> <p>భాసకవి మరొక రచన మధ్యమవ్యాయోగమ్. ఇది ఒక ఏకాంకిక (Single Act Play). ఈ &#8220;ఒక్క&#8221; అంకంలోని కథను ఒక చిన్న storyline లో చెప్పడం కుదరదు. చెప్పగలిగినా ఒక theme గా మాత్రమే చెప్పవచ్చు. ఏ మాత్రం సంక్షిప్తీకరించినా సమగ్రత చెడుతుందన్నమాట. అంటే, రచయిత ఒక పెద్ద కథను కూర్చి దానిని క్రమంగా  మెరుగుపెట్టి ఉంటాడా అనిపిస్తూ, రెండవ పద్ధతిలో కూర్చిన రచన ఇది. అందుకు నిదర్శనంగా &#8211; అనవసరంగా ఒక్క పాత్ర, సంభాషణ, సన్నివేశమూ ఈ రచనలో కనబడదు. ఇలా ఒక్క చిన్న వ్యర్థమూ కనబడలేదంటే &#8211; రచయిత దీనిని బాగా edit చేసి చివరికి ఈ నాటకాన్ని తీర్చి ఉంటాడని మనం అంచనా కట్టవచ్చు. ఆ విధంగా ఒక్క [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="text-decoration: underline;"><strong>ప్రస్తావన:</strong></span></p>
<p><span style="font-size: 30px;">సా</span>ధారణంగా ఓ కథ అల్లడానికి కథకుడు కొన్ని మౌలికమైన పద్ధతులు పాటిస్తాడు. అవే పద్ధతులు నాటకరచన లోనూ ఉపకరిస్తాయని భావించవచ్చు. రేఖామాత్రమైన కథ (storyline) ను ఊహించి, దాన్ని పొడిగించి, కొన్ని అంకాలుగా తీర్చి, పాత్రలను, పాత్రధారులను, సన్నివేశాలనూ, సంభాషణలనూ జోడిస్తూ విస్తరించడం ఒక పద్ధతి. అలా కాక ఒక వృత్తాంతాన్ని (theme) ఎంచుకుని, థీమ్ కు సరిపడా కథను సాధ్యమైనంత విస్తృతంగా ఒక చిత్తుప్రతి ద్వారా కూర్చుకొని, ఆ కథను ట్రిమ్ చేసి, అనవసరమైన సంభాషణలనూ, పాత్రలనూ, సన్నివేశాలనూ కత్తిరించి, మెరుగుపెట్టటం రెండవ పద్ధతి. మొదటిది రాత. రెండవది కోత. మొదటిది ఎక్కువభాగం Writing. రెండవది ఎక్కువభాగం Editing.</p>
<p>భాసుని నాటకాలలో <a href="http://vaakili.com/patrika/?p=6313">స్వప్నవాసవదత్తమ్</a> అన్న &#8220;ఆరు అంకాల&#8221; నాటకపు ఇతివృత్తాన్ని క్లుప్తంగా (Thin storyline) చెప్పవచ్చు. (ఆ Thin story line: ఉదయనుడు &#8211; వాసవదత్తకు భర్త. అతడు తన రాజ్యాన్ని కోల్పోయాడు. అతనికి పద్మావతి అని ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి ద్వారా కోలుపోయిన రాజ్యాన్ని కట్టబెట్టడానికి &#8211; మంత్రి యౌగంధరాయణుడు పన్నిన యుక్తి స్వప్నవాసవదత్త నాటక ఇతివృత్తం). ఇది మొదటి పద్ధతిలో రచించిన రచన.</p>
<p>భాసకవి మరొక రచన మధ్యమవ్యాయోగమ్. ఇది ఒక ఏకాంకిక (Single Act Play). ఈ &#8220;ఒక్క&#8221; అంకంలోని కథను ఒక చిన్న storyline లో చెప్పడం కుదరదు. చెప్పగలిగినా ఒక theme గా మాత్రమే చెప్పవచ్చు. ఏ మాత్రం సంక్షిప్తీకరించినా సమగ్రత చెడుతుందన్నమాట. అంటే, రచయిత ఒక పెద్ద కథను కూర్చి దానిని క్రమంగా  మెరుగుపెట్టి ఉంటాడా అనిపిస్తూ, రెండవ పద్ధతిలో కూర్చిన రచన ఇది. అందుకు నిదర్శనంగా &#8211; అనవసరంగా ఒక్క పాత్ర, సంభాషణ, సన్నివేశమూ ఈ రచనలో కనబడదు. ఇలా ఒక్క చిన్న వ్యర్థమూ కనబడలేదంటే &#8211; రచయిత దీనిని బాగా edit చేసి చివరికి ఈ నాటకాన్ని తీర్చి ఉంటాడని మనం అంచనా కట్టవచ్చు. ఆ విధంగా ఒక్క అంకంలో ప్రేక్షకుణ్ణి కట్టిపారెయ్యగల అపూర్వసృష్టి మధ్యమవ్యాయోగమ్.</p>
<p>ఆయోగమంటే కలయిక. వ్యాయోగం అంటే విశేషమైన కలయిక. సంస్కృతరూపకాలు పది రకాలు. వ్యాయోగం-పది రూపకభేదాలలో ఒకటి. మధ్యమం అధికృత్య కృతః వ్యాయోగః &#8211; అని ఒక వ్యుత్పత్తి. అంటే పాండవ మధ్యముడైన భీముడు నాయకుడుగా రచించిన వ్యాయోగం అని అర్థం.  మధ్యమౌ అధికృత్య రచితః వ్యాయోగః – అంటే ఇద్దరు మధ్యములను గురించి రచించిన వ్యాయోగం అని మరొక వ్యుత్పత్తి. ఈ రెండవ వ్యుత్పత్తి ఔచిత్యవంతమైనది. ఒక బ్రాహ్మణుని ముగ్గురు కొడుకులలో మధ్యవాడూ, పాండవమధ్యముడైన భీముడూ వీరిద్దరి కలయికతో, ధర్మవీరం అనే రసం ప్రధానంగా అద్భుత, హాస్య, బీభత్స రసాలు గర్భితంగా కూర్చిన రచన ఈ మధ్యమవ్యాయోగమ్.</p>
<p>ఇక్కడ ఒక ప్రశ్న పుడుతుంది. (పాండవ) మధ్యముడు అంటే అర్జునుడు కదా? మరి భీముడెలా పాండవ మధ్యముడు అయ్యాడు? &#8211; ఇందుకు కావ్యజ్ఞులు సమాధానం చెప్పారు. మధ్యముడు అంటే &#8211; గరిష్ఠునికి, కనిష్ఠునికి  మధ్యనున్న వాడు. అంటే భీమార్జుననకులు మువ్వురూ పాండమధ్యములే. సందర్భాన్ని బట్టి ఈ నాటకంలో భీముని మధ్యమునిగా అన్వయించుకోవాలి.</p>
<p>ఈ వ్యాసంలో మధ్యమవ్యాయోగం గురించి సాధ్యమైనంత వివరంగా తెలుసుకుందాము.</p>
<p><strong><span style="text-decoration: underline;">కథాక్రమం</span></strong><strong><span style="text-decoration: underline;">:</span></strong></p>
<p>అదొక అందమైన ఉదయం. అడవిలో కేశవదాసనే బ్రాహ్మణుడూ, అతని భార్య, ముగ్గురు పిల్లలూ కలిసి పొరుగూరు వెళుతున్నారు. అంతలో వాళ్ళను ఒక రాక్షసుడు అడ్డగించాడు. బ్రాహ్మణుని కుటుంబం ఆ రాక్షసుణ్ణి చూసి భయంతో బిక్కచచ్చిపోయేరు. ఎలాగో తమాయించుకుని ’ఏం కావాలి నీకు?’ అని అడిగేడు బ్రాహ్మణుడు. మీ కుటుంబంలో ఒక బాలుణ్ణి నాకప్పగించమన్నాడా రాక్షసుడు. ’లేకపోతేనో?’ &#8211; లేకపోతే మొత్తం కుటుంబం నాశనం అవుతుందన్నాడతను. ఆ రాక్షసుడి పేరు ఘటోత్కచుడు. పాండవమధ్యముడైన భీమునికి, హిడింబకూ పుట్టాడు. బ్రాహ్మణులను చంపటం తప్పని తెలిసినా భోజనం కోసం అమ్మ &#8211; లేత నరమాంసం తెమ్మంది కాబట్టి ఈ పనికి ఒడిగట్టాడతను.</p>
<p>’సరే నన్ను పట్టుకుపో &#8211; నీవెంట వస్తా’నన్నాడు బ్రాహ్మడు.</p>
<p>’వద్దు, నన్ను పట్టుకు పొ’మ్మంది బ్రాహ్మణి.</p>
<p>’కాదు నే’నని పెద్దవాడు.</p>
<p>’లేదు నేనంటే నే’నని మధ్యవాడూ, చివరిపిల్లవాడూ అందరూ పోటీపడ్డారు.</p>
<p>చివరికి పెద్దవాణ్ణి బ్రాహ్మడూ, కడపటివాణ్ణి బ్రాహ్మణి వదలనన్నారు. ఇక చేసేదిలేక మధ్యవాడు ఘటోత్కచుని వెంట వెళ్ళటానికి సిద్ధమయ్యాడు.ఆ అబ్బాయి చివరి సారి అమ్మానాన్నల దగ్గర వీడుకోలు తీసుకున్నాడు. &#8220;చిరం జీవ&#8221; అని దీవించిందా అమ్మ. చివరి సారి నిత్యకర్మలు చేసుకొస్తానని రాక్షసుని అనుమతి పొంది పక్కన ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళేడు.</p>
<p>అలా చెరువు దగ్గరికి వెళ్ళినవాడు ఎంతకూ రాలేదు.</p>
<p>ఇవతల రాక్షసబాలుడు ఘటోత్కచునికి అసహనం హెచ్చింది. వాణ్ణి పిలవాలి.</p>
<p>&#8220;వాడి పేరేంటి?&#8221;</p>
<p>‘….’ బ్రాహ్మడు మౌనం వహించేడు.</p>
<p>&#8220;తపస్వీ మధ్యముడు అని పిల్చుకో ఫో&#8230;&#8221; బ్రాహ్మడి పెద్దకొడుకన్నాడు.</p>
<p>&#8220;ఓ మధ్యమా, మధ్యముడా&#8230;&#8221; ఎలుగెత్తి పిలిచేడు ఘటోత్కచుడు.</p>
<p>అదే అడవిలో మరొకచోట ‘మార్నింగ్ ఎక్సర్ సైజులు’ చేసుకుంటున్న పాండవమధ్యముడైన భీమునికి ఈ కేక వినబడింది. ఆ గొంతు తన తమ్ముడైన అర్జునుని గొంతులా వున్నది. ఆ పిలుపు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దిశగా బయల్దేరి వచ్చి &#8220;ఇదిగో వచ్చా&#8221;నన్నాడు.</p>
<p>&#8220;నేనివతల మధ్యముణ్ణి పిలిస్తే నువ్వెవరయ్యా, మధ్యలో&#8221; అని రాక్షసబాలుడు.</p>
<p>&#8220;మధ్యమా&#8221; అన్నావుగా అందుకే వచ్చాను.</p>
<p>&#8220;నువ్వు మధ్యముడివా?&#8221;</p>
<p>&#8220;అవును. నేను ఈ విధంగా మధ్యముణ్ణి&#8221; &#8211; అని ఎనిమిది విధాలుగా చెప్పాడు భీముడు. ఘటోత్కచునికి అర్థం కాలేదు కానీ, కేశవదాసుకు మాత్రం &#8220;విషయం&#8221; అర్థమయ్యింది. మమ్మల్ని రక్షించమని వేడుకున్నాడు భీముణ్ణి. అభయం ఇచ్చాడు భీముడు. ఎదుటనున్న వ్యక్తి ఆనవాళ్ళు కనుక్కున్నాడు. అతడు తన పుత్రుడే.</p>
<p>బ్రాహ్మణ కుటుంబాన్ని విడిచి పెట్టమన్నాడు భీముడు రాక్షసునితో.<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/09/11.jpg"><img class="alignright size-full wp-image-12250" title="1" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/09/11.jpg" alt="" width="288" height="463" /></a></p>
<p>&#8220;నువ్వెవరవోయి?&#8221; &#8211; రాక్షసుడు.</p>
<p>&#8220;నీ బాబును&#8221;</p>
<p>&#8220;ఆ?&#8221;</p>
<p>&#8220;నేను రాజును. రాజుకు ప్రజలందరూ కన్నబిడ్డలేగా? వీళ్ళను వదులు. &#8221;</p>
<p>&#8220;మా నాన్న చెప్పినా వదల్న&#8221;న్నాడు ఘటోత్కచుడు.</p>
<p>&#8220;మీ నాన్న ఎవడోయి? బ్రహ్మా, విష్ణువా, శివుడా, ఇంద్రుడా, కృష్ణుడా, యముడా?&#8221;</p>
<p>&#8220;అందరూ కలిపితే మానాన్న.&#8221;</p>
<p>నవ్వుకుని &#8211; ’వాళ్ళను వదిలి వీలైతే, నన్ను జయించి పట్టుకుపొ’మ్మన్నాడు భీముడు. రాక్షస బాలుని ప్రతాపం &#8211; ఆ వచ్చిన కొత్త ఆసామీ ముందు నిలబడలేదు. చివరకు అమ్మ నేర్పించిన మాయాపాశం తో కూసింతసేపు భీముని బంధించగలిగేడు. ఆ మాయాపాశం విడిపించుకోగలిగినప్పటికీ, కాసేపైనా తనను జయించేడు కాబట్టి రాక్షసుని వెంట బయల్దేరేడు భీముడు. వెనకనే కేశవదాసూ కుటుంబమూ వెళ్ళింది. ఇంటికి వచ్చి &#8220;అమ్మా, మనిషిని తీస్కొచ్చా&#8221;నన్నాడు. అమ్మ బయటికి వచ్చింది. &#8220;ఉన్మత్తక! ఆయన నీ తండ్రిరా&#8221; అన్నది. ‘నాన్నా నన్ను క్షమించమ’న్నాడు కొడుకు. నవ్వేడు తండ్రి. &#8220;ఏంటే ఇదంతా?&#8221; అడిగేడు భీముడు వాళ్ళవిడను. ఆమె మొగుని చెవిలో ఏదో చెప్పింది. నవ్వుకున్నాడాయన. జాతివలన మాత్రమే రాక్షసి. గుణం వల్ల కాదని ఆమెను మెచ్చుకున్నాడు.</p>
<p>అందరూ కలిసి బ్రాహ్మణకుటుంబాన్ని సాగనంపేరు.</p>
<p>కథ తెలిసిందిగా. ఇంకాస్త వివరంగా ఈ కథను <a href="https://archive.org/stream/Chandamama196012December/Chandamama%201960%2001%20january#page/n51/mode/2up">1960 </a>జనవరి చందమామ సంచిక లో &#8211; అంటే ఈ లంకెలో 34 వ పేజీ నుంచి చదువుకోవచ్చు.  ఈ నాటకం యొక్క ఇతర విశేషాలు చూద్దాం.</p>
<p><strong><span style="text-decoration: underline;">వ్యాయోగం</span></strong><strong><span style="text-decoration: underline;">:</span></strong></p>
<p>సంస్కృతంలో నాటకాలు ప్రధానంగా పది విధాలు. (ఉపనాటకాలు మరిన్ని) ఆ పదిరకాలలో వ్యాయోగం ఒకటి. వ్యాయోగం లక్షణాలు ఇవి.</p>
<ul>
<li>ఒక్క అంకంలో ప్రదర్శించాలి. ఒక్క రోజులో జరిగిన కథ అయి ఉండాలి.</li>
<li>నాయకుడు ప్రముఖుడు అయి ఉండాలి. అలాగని దివ్యుడు కారాదు కానీ రాజర్షి కావడం యుక్తం. కథ ప్రఖ్యాతమైనది అయి ఉండాలి.</li>
<li>యుద్ధాభిముఖులైన నటులు ఉండాలి. స్త్రీపాత్రలు తక్కువగా ఉండాలి.</li>
<li>యుద్ధము/నియుద్ధము/సంఘర్షణతో కూడిన ఇతివృత్తం అయి ఉండాలి.</li>
<li>ఓజోగుణభరితంగా ఉండాలి.</li>
</ul>
<p>ఈ లక్షణాలన్నీ ఇంచుమించుగా మధ్యమం లో అగుపిస్తున్నాయి. ఈ కథలో నాయకుడు ఘటోత్కచుడని కొందరూ, భీముడు, ఘటోత్కచుడు ఇద్దరున్నూ అని మరికొందరూ అంటారు.</p>
<p>మధ్యమం కథ మహాభారతంలో లేదు. భాసుడు ఈ కథను ఐతరేయ బ్రాహ్మణంలోని శునశ్శేపుని కథనూ, మహాభారతంలో బకాసురుని ఉదంతాన్ని ప్రేరణగా తీసుకుని స్వీయకల్పనగా రచించాడు. ఇది రెండు కుటుంబాల కలయిక. ఇద్దరు మధ్యముల కలయిక. చిరకాలం తర్వాత భార్యాభర్తల కలయిక.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/09/2.jpg"><img class="alignright size-full wp-image-12251" title="2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/09/2.jpg" alt="" width="768" height="432" /></a></p>
<p align="center">(కేరళ కూడియాట్టం ప్రదర్శనలో &#8211; ఘటోత్కచుడు, హిడింబ. Courtesy – keralaculture.org )</p>
<p><strong><span style="text-decoration: underline;">Dialogues and Dramatic irony :</span></strong></p>
<blockquote><p>యత్రార్థే చింతితే అన్యస్మిన్ తల్లింగో అన్యః ప్రయుజ్యతే |<br />
ఆగంతుకేన భావేన పతాకాస్థానకం తు తత్ || (నాట్య శాస్త్రం &#8211; 19.30)</p></blockquote>
<p>తాత్పర్యము: ఒక వాక్యము ఒక అర్థమునుద్దేశించి ప్రయోగింపబడినప్పటికినీ, దాని నుండి ఆగంతుక భావముచే  నిగూఢమగు ఇంకొక అర్థము సాధింపబడినచో అది &#8216;పతాకాస్థానక &#8216; మనబడును. (ఈ నిగూఢార్థము మొదటి అర్థమునకు అనుగుణమై ఉండవలెను.) పతాకాస్థానకాన్ని డ్రమటిక్ ఐరనీ అంటారు. ‘ఉద్దేశించిన సమాధానం, ఎదుటివాడికి కాక మరొకరికి అర్థం అయ్యేలా అయ్యేలా చెప్పడం’ డ్రమటిక్ ఐరనీ. నాటకం రక్తి కట్టడానికి ఈ డ్రమటిక్ ఐరనీ ఓ ప్రధానమైన ఉపకరణం. కుంతకుడనే అలంకారికుడు చెప్పిన ‘వాక్యవక్రోక్తి’ కూడా ఈ కోవకే చెందుతుంది. పతాకాస్థానకం &#8211; జరుగబోయే సన్నివేశాన్ని సూచించాలని ధనంజయుడు అనే మరొక అలంకారికుడు చెబుతాడు. ఈ పతాకస్థానకాలు నాలుగు విధాలని భరతముని వింగడించాడు. భరతముని ఈ పతాకాస్థానకాలకు పేర్లు పెట్టలేదు కానీ,  వీటిని ప్రథమము, శ్లిష్టము, శ్లిష్టోత్తరము, తుల్యవిశేషణము అని తన వ్యాఖ్యానంలో సింగభూపాలుడు పేర్కొన్నాడు. ఈ నాలుగు పద్ధతుల్లో శ్లేష పాలు వరుసగా పెరుగుతూ పోతుంది.  ఇలాంటివి భాసుని నాటకాలలో చాలాచోట్ల కనిపిస్తాయి</p>
<p>రాక్షసుడు మధ్యముణ్ణి పిలువగానే అక్కడికి ఒక ఆసామీ వచ్చాడు. ’నేను మధ్యముణ్ణి పిలుస్తుంటే,  నువ్వెవరయ్యా ఇక్కడికొచ్చా’వని అడిగేడు రాక్షసుడు. ’నేనూ మధ్యముణ్ణి కాబట్టే వచ్చా’నన్నాడు ఆసామీ.</p>
<p>’నువ్వు మధ్యముడివా?’</p>
<p>’అవును’.</p>
<blockquote><p>మధ్యమోऽహ మవధ్యానా ముత్సిక్తానాం చ మధ్యమః |<br />
మధ్యమోऽహం క్షితౌ భద్ర! భ్రాతృణామపి మధ్యమః ||</p>
<p>అపి చ,</p>
<p>మధ్యమః పంచభూతానాం పార్థివానాం చ మధ్యమః |<br />
భవే చ మధ్యమో లోకే సర్వ కార్యేషు మధ్యమః ||</p></blockquote>
<p>1. నేను శత్రువులు సంహరించలేని వారిలో మధ్యముణ్ణి. (అవధ్యుడు &#8211; యుద్ధంలో ఎవరూ చంపలేని వాడు. పాండవులకు అవధ్యులని పేరు. అవధ్యులలో మధ్యముడంటే &#8211; పాండవమధ్యముడు అని సూచన)</p>
<p>2. పౌరుషవంతుల్లో మధ్యముణ్ణి. (జరాసంధుడు, కీచకుడు, భీముడు, బకాసురుడు, దుర్యోధనుడు &#8211; ఇలా ఐదుగురు పౌరుషవంతులు. వారిలో మధ్యముడు)</p>
<p>3. భూమ్మీద పుట్టిన వాళ్ళలో మధ్యముణ్ణి (మొదటి రెండు లక్షణాలతో భగవంతుడు/రాక్షసుడని అనుకోరాదని ఈ సూచన.)</p>
<p>4. అన్నదమ్ముల్లో మధ్యముణ్ణి. (కుంతీసుతమధ్యముడు)</p>
<p>5. పంచభూతాల్లో మధ్యముణ్ణి. (పృథివి, నీరు, అగ్ని, వాయువూ, ఆకాశమూ &#8211; ఈ ఐదింటిలో వాయు అంశనని భావం )</p>
<p>6. రాజులలో ఒకణ్ణి (చాతుర్వర్ణ్య వ్యవస్థలో మధ్యముడు)</p>
<p>7. పుట్టుకలో రెండవవాణ్ణి (కుంతీసుతమధ్యముడు)</p>
<p>8. లోకంలో జరిగే కార్యాలను (లావాదేవీలను) సంధానపర్చే వాణ్ణి. (settling the affairs between different parties, A middle man, సమర్థుడు.)</p>
<p>ఎనిమిది సార్లు మధ్యముడని చెప్పడం ద్వారా, తననెవరూ చంపలేరని, బలవీర్యసమన్వితుణ్ణని, మానవుడినని, తనకు అన్నదమ్ములున్నారని, పంచభూతాల అంశ కాబట్టి మహాప్రతాపవంతుడినని, రాజునని, మధ్యమపుత్రుణ్ణని,అన్ని కార్యాలను చక్కబెట్టగల సమర్థుడినని సూచించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే &#8211; ఇది ఘటోత్కచునికి చెబుతున్నట్టుగా చెబుతూ కేశవదాసుకు ఇస్తున్న అభయం. ఇది మొదటి పతాకస్థానకం. ఉద్దేశించిన ప్రయోజనం కంటే ఎక్కువ ఉపకారం జరిగే ఉత్కృష్టమైన మరో అర్థం బయటపడుతున్నది.</p>
<p>పైని సూచనల ద్వారా కేశవదాసు ఆ వచ్చిన ఆసామీని ’భీముడు’ అని గుర్తించేడు.  తనకు నమస్కరించిన అతణ్ణి బ్రాహ్మడు ఆశీర్వదిస్తూ ’వాయురివ దీర్ఘాయుర్భవ’ (‘వాయువు వలే దీర్ఘాయుష్షు గలవాడివగుము’) అని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చక్కటి చమత్కారాన్ని, ఔచిత్యాన్ని పండించాడు భాసుడు. &#8216;నిన్ను భీముడని నేను గుర్తించేను సుమా &#8216; అని కూడా ఆశీర్వాదం సూచిస్తూంది.</p>
<p>- తన కొడుకును రాక్షసునికై ఆహారంగా పంపుతూ &#8220;చిరంజీవ&#8221; అని ఆశీర్వదిస్తుంది బ్రాహ్మణి. ఇక్కడ ప్రేక్షకునికి నవ్వూ, జాలి రెండూ వస్తాయి. ఇది కూడా ఒక పతాకస్థానకం (A kind of dramatic irony).</p>
<p>- అలాంటిదే నాటకం చివరన ఒక సన్నివేశం ఉంది. అడ్డంకులన్నీ తొలగిపోయిన తర్వాత &#8211; చివర్న ఘటోత్కచుడు కేశవదాసుకు నమస్కరిస్తాడు. అప్పుడు కేశవదాసు అతణ్ణి ఆశీర్వదిస్తూ అంటాడు &#8221; పితృసదృశ గుణకీర్తిర్భవ!&#8221; (మీ తండ్రి వంటి గుణకీర్తి కలిగి ఉందువు గాక!). ఇక్కడ కూడా ప్రేక్షకుడు కాస్త నవ్వుకుంటాడు. &#8220;ఇలా దారిని పోయే వాళ్ళను వేధించక మీ నాన్నలా ప్రజలను కాపాడవోయ్&#8221; అనే ధ్వని ఆ ఆశీర్వాదంలో వినిపిస్తుంది. ప్రకృతార్థంలో ఆశీర్వాదమూ, పరోక్షార్థంలో మందలింపును సూచిస్తూంది. ఇది శ్లిష్టం అనే పతాకస్థానకం.</p>
<p><strong><span style="text-decoration: underline;">పాత్రౌచితి</span></strong><strong><span style="text-decoration: underline;">, </span></strong><strong><span style="text-decoration: underline;">పాత్రల</span></strong><strong></strong><strong><span style="text-decoration: underline;">స్వభావం</span></strong><strong><span style="text-decoration: underline;">:</span></strong></p>
<p>మధ్యమం లో భాసుడు &#8211; అత్యంత సహజత్వంతో నిండిన పాత్రలను సృష్టించాడు. ఎక్కడా అతిశయోక్తులు కానీ, అనౌచిత్యం కానీ పాత్రలలో కనిపించదు. ఆరంభంలోనే బ్రాహ్మణకుటుంబానికి ఘటోత్కచుడు ఎదురైనప్పుడు ఆ కుటుంబసభ్యుల స్పందన ఎలా ఉంది. వారి స్పందన వెనుక వారి వారి స్వభావాలు ఎలా ప్రతిబింబించేయి అన్న విషయాలు వాకిలిలో <a href="http://vaakili.com/patrika/?p=7118">ఇదివరకే ఒక వ్యాసం</a> లో ప్రస్తావనకు వచ్చేయి.</p>
<p>తర్వాతి ఘట్టంలో భీముడు వస్తాడు. భీముడు &#8211; ఘటోత్కచుని &#8216;మధ్యమా&#8217; అన్న పిలుపు విని ఇది తనకు ఆత్మీయమైన (అర్జునుని) కంఠంలా ఉన్నదని భావించాడు. అటుపై వచ్చి ఘటోత్కచుని చూచాడు. చూచి ఇలా అనుకుంటాడు.</p>
<blockquote><p>సింహాస్యః సింహదంష్ట్రః మధునిభనయనః స్నిగ్ధగంభీరకంఠః<br />
బభ్రుభ్రూః శ్యేననాసో ద్విరదపతిహను ర్దీర్ఘవిశ్లిష్టకేశః |<br />
వ్యూఢోరా వజ్రమధ్యో గజవృషభగతి ర్లంబపీనాంసబాహుః<br />
సువ్యక్తం రాక్షసీజో విపులబలయుతో లోకవీర్యస్యపుత్రః ||</p></blockquote>
<p>తాత్పర్యం: సింహము వంటి ముఖము, సింహము వంటి కోరలు, తేనెకళ్ళు, గంభీరమైన గొంతు, పింగళ వర్ణపు కనుబొమలు, గద్దముక్కు, సింహపు దవడలు, శిథిలమైన కేశపాశం, విశాలమైన వక్షస్థలం, వజ్రంలా కఠినమైన నడుము, గజంలా, వృషభంలా నడక, ఇతడు రాక్షసికి పుత్రుడని, మిక్కిలిబలవంతుడని, లోకవీరుని పుత్రుడని స్పష్టంగా తెలుస్తూంది.   (ఈ శ్లోకం &#8216;శార్దూల విక్రీడితం&#8217; కావడం గమనార్హం.)</p>
<p>- చివరిపాదం ద్వారా భీమునికి &#8211; లీలగా ఈతడు హిడింబకూ, తనకూ కలిగిన పుత్రుడని మనసులో ఏదో మూల అనుమానం ఉన్నట్టు భాసుడు అత్యంత ప్రతిభతో చిత్రించాడు. ఈ విధమైన భావాన్నే కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో వాచ్యం చేసి అపూర్వమైన శ్లోకం చెప్పాడు.</p>
<blockquote><p>రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్ద: పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జన్తు: |<br />
తచ్చేతసా స్మరతి నూనం అబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదాని ||</p></blockquote>
<p>తాత్పర్యం: అందమైన వస్తువును చూసినప్పుడు, మధురమైన శబ్దాన్ని విన్నప్పుడు ఎంత సుఖంగా ఉన్న ప్రాణికైనా ఏదో తెలియని భావావేశం కలుగుతుంది. బహుశా ఆ సమయంలో, ప్రాణి మనసులో మరచిపోయిన గతం తాలూకు అనుబంధాలు కలవరపెడుతుంటాయి.</p>
<p>భీమునికి కూడా ఘటోత్కచుని చూచి అలాంటి కలవరం కలిగింది. భాసుడు అందమైన దృశ్యంలోనే నిబద్ధం చేస్తే, కాళిదాసు శ్లోకంలో నిమంత్రించి అందమైనశ్లోకాన్ని కూర్చాడు. కాళిదాసు శ్లోకానికి భాసుడే ప్రేరణ యేమో!</p>
<p>ఆ పైన భీముడు బ్రాహ్మణుడైన కేశవదాసును &#8211; అక్కడ ఏం జరుగుతోంది? మీకొచ్చిన భయమేమిటి? అని అడుగుతాడు.</p>
<p>అప్పుడా బ్రాహ్మడు తన కథ చెప్పుకొచ్చాడు. &#8216;అయ్యా! నేను ధర్మరాజు పరిపాలించిన రాజ్యంలోని యూప గ్రామవాసిని. మాది కల్పశాఖ, మాఠరస గోత్రం. పక్కన ఉన్న ఉద్యాన గ్రామానికి, మా మాతులుని ఇంట ఉపనయనం జరుగుతుంటే వెళుతున్నాను. ఇంతలో -</p>
<blockquote><p>సజలజలదగాత్రః పద్మపత్రాయతాక్షః మృగపతిగతిలీలః రాక్షసో ప్రోగ్రదంష్ట్రః |<br />
జగతివిగతశంకస్త్వద్విదానాం సమక్షం ససుతపరిజనం భోః! హన్తుకామోభ్యుపైతి ||</p></blockquote>
<p>తాత్పర్యం: కారుమేఘం లాంటి శరీరం, తామరరేకులవంటి కనులూ, సింహపు నడక, పైకి వచ్చిన కోరలతో ఆ రాక్షసుడు, ప్రపంచాన్ని పట్టించుకోక మీ వంటి గొప్పవారి సమక్షంలోనే అయ్యా! నా కుటుంబాన్ని చంపడానికి మీదకు వస్తున్నాడు.’</p>
<p>ఇక్కడ, ‘ధర్మరాజు పరిపాలించిన రాజ్యంలోని యూప గ్రామవాసిని’, ’మీవంటి గొప్పవారి సమక్షం లోనే మీదకొస్తున్నాడు చూడండి’ &#8211; అని బ్రాహ్మడు చెప్పిన మాటలు అత్యంత సహజంగా ఉన్నవి. ఇవి బ్రాహ్మణుని బుద్ధిని, భయాన్ని కూడా సూచిస్తున్నాయి. భీముణ్ణి పొగిడి తద్వారా తన కుటుంబానికి అభయం సంపాదించుకోవాలన్న తెలివి కూడా ఇందులో ఉంది.</p>
<p>ఇక్కడ భాసకవి కూర్చిన సూక్ష్మమైన చమత్కారం మరొకటి ఉంది. నాటకారంభంలోనే బ్రాహ్మడు ఘటోత్కచుని రూపాన్ని వర్ణించాడు. ఆపై తిరిగి భీముడు ఎదురయిన తర్వాత తిరిగి ఘటోత్కచుని రూపాన్ని గురించి చెప్పాడు.</p>
<p>ఆ రెండున్నూ వరుసగా చూడండి.</p>
<p>(1)</p>
<blockquote><p>తరుణరవికరప్రకీర్ణకేశః భృకుటిపుటోజ్జ్వలపింగలాయతాక్షః|<br />
సతడిదివ ఘనః సకంఠసూత్రః యుగనిధనే ప్రతిమాకృతిః హరస్య ||</p></blockquote>
<p>(2)</p>
<blockquote><p>సజలజలదగాత్రః పద్మపత్రాయతాక్షః మృగపతిగతిలీలః రాక్షసో ప్రోగ్రదంష్ట్రః |<br />
జగతివిగతశంకస్త్వద్విదానాం సమక్షం ససుతపరిజనం భోః! హన్తుకామోభ్యుపైతి ||</p></blockquote>
<p>మొదటిది పుష్పితాగ్రం. అది అర్ధసమవృత్తం. 50 మాత్రలు. రెండవది &#8211; మాలినీ వృత్తం. పరిమాణంలో పుష్పితాగ్రం కన్నా పెద్దది. భీముని ఎదురుగా ఘటోత్కచుని గురించి చెబుతున్నప్పుడు &#8211; కాస్త ’చిలవలు, పలవలు’ కల్పించి చెప్పినట్టుగా సూచించిన చమత్కారం ఇది. ఈ రెండు వృత్తాల గురించి <a href="http://eemaata.com/em/issues/200707/1127.html">మోహన గారి వ్యాసం</a> లో వివరంగా చదువుకోవచ్చు</p>
<p>ఈ ఏకాంకిక లో ఎనిమిది మంది పాత్రలు. రెండు కుటుంబాలు. ఇద్దరు మధ్యములు. రెండు స్త్రీపాత్రలు.  స్త్రీపాత్రల నిడిచి చాలా తక్కువ. అయినప్పటికీ ఆ పాత్రలను మరిచిపోని విధంగా తీర్చిదిద్దాడు భాసుడు. సంస్కృతనాటకాల గురించి చెబుతూ తదజ్ఞులు ఓ మాట చెబుతారు.</p>
<blockquote><p>కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకున్తలా |<br />
తత్రాపి చతుర్ధోంక: తత్ర శ్లోక చతుష్టయమ్ ||</p></blockquote>
<p>సంస్కృతకావ్యాలలో దృశ్యనాటకాలు గొప్పవి. అందులో అభిజ్ఞాన శాకుంతలం, ఆ నాటకంలో నాలుగవ ఆశ్వాసము, అందులోని నాలుగు శ్లోకాలు చాలా గొప్పవి. తన కూతురు కాకపోయినా ఎంతో ముద్దుగా పెంచుకున్న శకుంతలను అత్తవారింటికి పంపుతూ కణ్వుడనే మహర్షి చెప్పే శ్లోకాలు ఆ నాలుగున్నూ.</p>
<p>కాళిదాసు చెప్పిన ఆ శ్లోకాలకు గొప్ప కావ్యగౌరవం ఉంది. సన్నివేశంలో ఎంతో ఆర్తి, అభిమానం ఉన్నవి. మహర్షిసత్తముడే అధిగమించలేని మానవజీవితపు అనుకంప అందులో ఉన్నది. అవి ’చదువుకోవలసిన’ చక్కని నాలుగు శ్లోకాలు. అయితే శాకున్తలం దృశ్యనాటకం. శాకున్తలంలోని ఘట్టంలో కలిగే రసస్ఫూర్తి ప్రేక్షకుడిది కాదు, పాఠకుడిది.</p>
<p>జాగ్రత్తగా అనుశీలిస్తే, మధ్యమవ్యాయోగంలో &#8211; పుత్రుణ్ణి కోల్పోతున్న పిచ్చితల్లి &#8220;చిరంజీవ&#8221; అని అతణ్ణి ఆశీర్వదించటం మరింత ముగ్ధంగా, స్పష్టంగా, అందరికీ అర్థం అయ్యేలా, ఓ దృశ్యనాటకానికి అనుగుణంగా ఉందని తెలుస్తుంది. వ్యక్తిగతంగా ఈ వ్యాసకర్తకు సంస్కృతనాటకాలలో మధ్యమవ్యాయోగంలోని ఈ ఘట్టం దృశ్యనాటకసంవిధానరీత్యా శాకున్తలం కంటే ఉత్తమమైనదనిపిస్తుంది.</p>
<p>అలాగే నాటకం చివరలో &#8220;హిడింబ&#8221; పాత్ర వస్తుంది. ఆమె కొడుకు తన ’ఆహారా’నికై తోడుకొని వచ్చిన మానవుడిని చూస్తుంది. చూసి ఘటోత్కచుని మందలిస్తుంది. ఆపై, భీముడామెను &#8220;ఏమిటే ఇదంతా?&#8221; అని అడుగుతాడు అచ్చంగా తెలుగు కుటుంబీకుడిలా.  ఆమె చెవిలో మొగుడితో ఏదో చెబుతుంది. చిరకాలం తర్వాత ఇంటికి వచ్చిన భర్తతో భార్య చెవిలో గుసగుసలాడుతో ఏదో చెప్పటం &#8211; చాలా అందమైన, సుకుమారమైన ప్రణయఘట్టం. దీన్ని దృశ్యనిబద్ధం చేశాడు భాసుడు!</p>
<p><strong><span style="text-decoration: underline;">భరతవాక్యం</span></strong><strong><span style="text-decoration: underline;"> :</span></strong></p>
<p>రూపకం చివర ప్రజాక్షేమం, అభ్యుదయాన్ని కాంక్షిస్తూ ఓ శ్లోకం ఉండటం అన్ని విధాలయిన రూపకాలకు సంబంధించిన ఒక నియమం. దీనిని భరతవాక్యం అంటారు. దీనిని నటులు తెరపై నుంచుని వల్లిస్తారు. మధ్యమంలో భరతవాక్యం యిది.</p>
<blockquote><p>యథా నదీనాం ప్రభవః సముద్రో యథాహుతీనాం ప్రభవో హుతాశనః |<br />
యథేన్ద్రియాణాం ప్రభవం మనోऽపి తథా ప్రభుర్నో భగవానుపేంద్రః ||</p></blockquote>
<p>తాత్పర్యం: ఎలాగైతే నదులకు సముద్రం మూలమో, ఎలా యజ్ఞానికి అగ్ని మూలమో, ఎలా ఇంద్రియాలకు మనస్సు మూలమో అదే విధంగా మనకు ప్రభువు భగవంతుడైన ఉపేంద్రుడే.</p>
<p>ఇదివరకు ఒకట్రెండు వ్యాసాలలో చెప్పుకున్నట్టు &#8211; భాసునిది నాటకకళ అయితే కాళిదాస మహాకవిది కావ్యకళ. అయితే భాసుడు కూడా అప్పుడప్పుడూ గొప్ప పాండిత్యస్పర్శ, వ్యుత్పత్తిసహితమైన శ్లోకాలు రచించకపోలేదు. అలాంటి రచనల్లో ఈ మధ్యమవ్యాయోగపు భరతవాక్యం ఒకటి. చాలా విస్తృతమైన వ్యాఖ్యానం చేయదగిన శ్లోకం ఇది.</p>
<p>(ప్రభవత్యస్మాదితి ప్రభవః) నదులకు మూలం సముద్రమని ప్రాచీనమైన విశ్వాసం. ఎలా అంటే సూర్యుడు సముద్రం నుంచి నీటిని పీల్చి మేఘాలకు ఇస్తాడు. ఆ మేఘాలు భూమిపై నీటిని వర్షిస్తాయి. ఆ నీటితో వాగులు పారి, ఆ వాగులద్వారా నదులు ఏర్పడతాయి. అలా నదులకు సముద్రం మూలం. ఈ భావననే కాళిదాసు రఘువంశంలో దిలీపవర్ణనలో చెబుతాడు. &#8220;సహస్రగుణముసృష్టుమాదత్తే హి రసం రవిః&#8221; &#8211; అంటే వేయి రెట్లు వర్షించడానికి రవి &#8211; సముద్రపు నీటిని కొంత తీసుకుంటాడు. (అలాగే దిలీపుడూ కొంత పన్ను ప్రజలపై మోపి ఎక్కువ మేలు చేస్తాడని ఆయన ఉపమ).</p>
<p>అదే విధంగా &#8220;హుతం అశ్నాతీతి హుతాశనః’ &#8211; (యజ్ఞమున) సమర్పించిన దానిని భుజించువాడు హుతాశనుడు (అగ్ని).</p>
<p>ఇంద్రియాలకు మూలము మనస్సు. (మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః &#8211; భగవద్గీత).</p>
<p>ఉపేంద్రుడు &#8211; ఇంద్రుని సహోదరుడు. విష్ణువు అవతారం. భగవాన్ &#8211; భగః అస్య అస్తీతి భగవాన్.</p>
<p>భగః అంటే -</p>
<blockquote><p>ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః|<br />
జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా ||</p></blockquote>
<p>ఐశ్వర్యము,వీర్యము, యశస్సు, శ్రేయస్సు, జ్ఞానము, వైరాగ్యము &#8211; ఈ ఆరుగుణముల యొక్క సమగ్రత్వాన్ని ’భగః’ అంటారు. వీటిని కలిగిన వాడు భగవంతుడు అని వ్యుత్పత్తి.</p>
<p>అంతే కాదు. భగవాన్ అంటే -</p>
<blockquote><p>ఉత్పత్తిం చ వినాశం చ భూతానామాగతిం గతిమ్ |<br />
వేత్తి విద్యామవిద్యాం చ స వాచ్యో భగవానితి ||</p></blockquote>
<p>ప్రాణుల పుట్టుకనూ, మరణాన్ని, భూఅభవిష్యత్కాల గతులను, వారి సంస్కారాలను తెలిసిన వాడు భగవంతుడు &#8211; అని ఒక నిర్వచనం. ఇప్పుడు ఆ శ్లోకార్థం మళ్ళీ ఒకసారి.</p>
<p>‘ఎలాగైతే నదులకు సముద్రం మూలమో, ఎలా యజ్ఞానికి అగ్ని మూలమో, ఎలా ఇంద్రియాలకు మనస్సు మూలమో అదే విధంగా మనకు ప్రభువు భగవంతుడైన ఉపేంద్రుడే.’</p>
<p>ఈ విధంగా చాలా విస్తృతమైన వ్యాఖ్య పై శ్లోకానికి చెప్పదగింది.</p>
<p style="text-align: center;">***</p>
<p>మధ్యమ వ్యాయోగం గురించిన కొన్ని అంశాలు ఇవి.  ఈ నాటకాన్ని గురించి చెప్పుకుంటూ వెళితే అంతూ పొంతూ తెలియదు. మధ్యమవ్యాయోగం పుస్తకం వివిధప్రచురణకర్తలు ప్రచురించారు. గణపతిశాస్త్రి గారి Trivendrum Sanskrit Series జాలంలో దొరుకుతుంది. ఈ నాటకాన్ని చిలకమర్తి లక్ష్మీనరసింహ గారూ, వేటూరి ప్రభాకరశాస్త్రి గారున్నూ తెనిగించారు. చిలకమర్తి వారి తెనిగింపు గ్రాంథిక ఛాయల్లో ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ తెనుగుసేత ను ప్రచురించారు.  వాద్యార్ అండ్ సన్స్ వారి ఒద్దికైన అందమైన ఆంగ్ల వ్యాఖ్యానం ఒకటి ఉన్నది.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/09/3.jpg"><img class="aligncenter size-full wp-image-12252" title="3" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/09/3.jpg" alt="" width="450" height="662" /></a></p>
<p>ఆ మధ్య అంతర్జాలంలో వెతుకుతూ ఉంటే &#8211; ఈ ఏకాంకిక ను JNU వాగ్వర్ధినీపరిషత్తు వారు, థియేటర్ లో ఈ నాటకాన్ని ప్రదర్శించిన <a href="https://www.youtube.com/watch?v=9uH8UJQQD88">లంకె</a> కనిపించింది. ఇది యథాతథంగా సంస్కృతంలో ఉంది. మొదటి నాంది పదినిముషాలబాటూ దీర్ఘంగా ఉంది. ఆ భాగాన్ని వదిలి మిగతా చూడవచ్చు. సంస్కృతానికి అలవాటు పడటం కాస్త కష్టమైనా, ఓ మారు అలవాటు పడితే చివరికంటా చూడవచ్చు. ఘటోత్కచ పాత్రధారి అదరగొట్టేడు. ఈ కాలంలోనూ ఈ నాటకప్రదర్శనకు కాస్త మంచి స్పందన ఉన్నట్టు వీడియోలో అగుపిస్తుంది.  వీలైతే తప్పక చూడండి.</p>
<p style="text-align: center;">***</p>
<blockquote><p>న తజ్జ్ఞానం న తచ్ఛిల్పం న సా విద్యా న సా కలా|<br />
న తత్ కర్మ న వా యోగో నాట్యేऽస్మిన్న దృశ్యతే || (నాట్యశాస్త్రం -19.143)</p></blockquote>
<p>నాట్యశాస్త్రంలో కనిపించని జ్ఞానము, శిల్పము, విద్య, కర్మ, యోగము ఏదియునూ లేదు.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=12243</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>మరీచిక</title>
		<link>http://vaakili.com/patrika/?p=12086</link>
		<comments>http://vaakili.com/patrika/?p=12086#comments</comments>
		<pubDate>Wed, 31 Aug 2016 21:28:52 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[డైరీ]]></category>
		<category><![CDATA[రవి E.N.V]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=12086</guid>
		<description><![CDATA[ఆటో అబ్బాయి కొంతసేపయిన తర్వాత మాటలు కలిపేడు. ఆ తర్వాత నేను కూర్చుని ఉన్న సీటు పక్కనా, వెనుకా చూడమన్నాడు. అక్కడ కొన్ని సినిమా తారల ఫుటోలు, కొన్ని కవితలూ రాసి ఉన్నాయి. అన్నిటిలోనూ ఆ ఆటో అబ్బాయి ఉన్నాడు. సినిమా తారలతో ఫుటో దిగటం చవకబారు హాబీయే కదా అనుకున్నాను. ఆ తర్వాత కాసేపటికి ఆ అబ్బాయి 'కథ' చెప్పాడు. అతని కుటుంబం చిన్నది. అయితే అతడు కుటుంబ బాధ్యతకన్నా మరొక గొప్ప సామాజిక బాధ్యత ఒకటి తీసుకున్నాడు. అతడు తీరిక వేళల్లో సినిమాలలో ఫైట్లలో పాల్గొంటాడు. ]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">నా</span>కొక కథ రాయాలని ఉంది. సువిశాల కథాజగత్తులో, వంద యేళ్లకు పైబడిన ఒక మహత్తరమైన సాంప్రదాయంలో, ఎందరెందరో మహానుభావులు కాలుపెట్టి పునీతం చేసిన ఆ దివ్యమందిరంలో వారి సరసన నిలబడకపోయినా, కనీసం వారి పాదధూళి సోకగలిగేలాగా, ఆ మందిరంలో ఏదో మూల ఒక అనామకుడిగా, విస్మృతకథకుడిగానైనా ఓ స్థానం కావాలని దురాశపడుతున్నాను.</p>
<p>అయితే కథలు రాయడానికి పనికి వచ్చే తెలివి, జ్ఞానము నాకు లేవు. నేనొక సామాన్యుణ్ణి. అనుభవాల అంతఃకుహరాలలో వస్తువును వెతికి చూసి, ఆ వస్తువుకు మెరుగులు దిద్ది, కథకు కావలసిన హంగులు జోడించి, మలుపులు తిప్పి, అందమైన ముగింపుకు చేరవేసే మెళకువ నాలో లేదు. ఎందుకంటే చూసిన, అనునిత్యం చూసిన చూస్తున్న సంఘటనల సారాంశానికి, కలుస్తున్న మనుషుల జీవితాలలో జరుగుతున్న ఒక మెలో డ్రామాకు ఒక అర్థం, అంతరార్థం, ముగింపు కనిపెట్టడంలో వైఫల్యమే తప్ప సాఫల్యం ఎన్నడూ నా దరికి చేరలేదు. నిత్యజీవితంలో కళ్ళెదుట కనిపిస్తున్న ఎన్నో విషయాలు అసంతృప్తికారకాలుగా, నిర్వేదభరితాలుగా అలాగే ఎందుకు జరుగుతున్నాయో, మరొకలా ఎందుకు జరుగవో, అవి తృప్తికరమైన తీరాలకు ఎందుకు చేరవో నాకు అర్థం కావటం లేదు. పోనీ ఏదో అలా జరిగాయి కాబట్టి జరిగే సంఘటనల వెనుక పరమార్థమూ, ఫార్ములా కనిబెట్టి వెలికితీసే చాతుర్యమూ, ఆ చాతుర్యాన్ని కథలో ఇమిడ్చే తెలివిడీ నాస్తి. ముగింపు లేని వాస్తవాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి, వాటిని ’కథ’ గా మలిచి ఆయా వాస్తవాలలో అంతర్లీనంగా కనిపించే ఒక బలీయమైన జీవితపు ’తపన’కు అన్యాయం చేయలేను.</p>
<p>చాలా మంది జీవితంలో అద్భుతాలు చూస్తారు. గొప్పమనుషులను కలుసుకుంటారు. గొప్ప అనుభవాలు పోగు చేసుకుంటారు, జ్ఞాపకాలను మిగుల్చుకుంటారు, అందమైన అనుభూతులను దాచుకుంటారు, వాటి సారాన్ని పదిమందికి పంచగలుగుతారు. అదేం చిత్రమో కానీ, నేనెప్పుడూ గొప్పవారిని కలుసుకోలేదు. వారితో తగినంత సమయం గడపలేదు. కానీ ’గొప్పతనం’ మాత్రం నేను నడిచే దారుల్లో ఫుట్ పాత్ ల పక్కన, మురికి వీథుల్లో, చాలామంది పట్టించుకోని చోట్ల, అనేక విషయాలలో కనిపిస్తూనే ఉంటుంది. ఈ మహానగరంలో అడిగిన వెంటనే వచ్చే ఆటో వాలా, ఆంగ్లంలో కాక తెలుగులో పరిచయం చేసుకొనే తెలుగువాడు, సౌమ్యంగా మాట్లాడి చిల్లర వెంటనే ఇచ్చేసే సిటీబస్సు కండక్టరూ, కాయగూరల బేరంలో ఎదుటివాళ్ళ స్టేటస్ గురించిన అంచనా లేక, పదిరూపాయలు బేరం తగ్గించుకునే కూరగాయలావిడ, సిటీబస్సులో ఎక్కిన వెంటనే దొరికే సీటు &#8211; ఇలాంటివి నాకు అద్భుతాలు. ఇంత చవకబారు స్పందనలు ఉన్న వ్యక్తికి కథలు రాసే అర్హత ఎంతమాత్రం ఉంటుంది? వీటన్నిటినీ ఉదారంగా ఆమోదించి, ’సింప్లిసిటీ’ అని మెచ్చుకున్న వాళ్ళు &#8211; నాతో బాటు షేర్ ఆటో ఎక్కటానికీ, ప్రభుత్వం సరఫరా చేసే ఐదురూపాయల భోజనాన్ని ఆస్వాదించడానికీ వెనకాడడం చూసి నవ్వుకునే ’సేడిజమ్’ ఒకింత లేకపోలేదు. అలాంటి సాడిస్టు లక్షణాలున్నవాడికి ఏమి ఉదాత్తత ఉంటుంది? తనకు లేని ఉదాత్తతను ఎలా ఎదుటివాడికి చెప్పగలడు?</p>
<p>నాలాంటి అమాం బాపతు గాళ్ళను పెంచి పోషించడానికి నవీన కాలంలో సామాజిక మాధ్యమాలు కొన్ని ఉదారంగా నడుం కట్టాయి. అబద్ధాలను నిజాలు చేయడానికి పనికి వచ్చే అవకాశాలిస్తూ. అలాంటి చిల్లర టిఫినీలు కాదు,మీల్స్ కావాలి నాకు. (ప్లేట్ మీల్స్ అయినా సరే).</p>
<p>&#8220;నీ జీవితంలో కథలు లేవా? అంటే, నీవు జీవించనేలేదా?&#8221; అని దోస్తొయెవ్ స్కీ లా ఎవరైనా అడిగితే &#8211; బుర్ర గోక్కోవాలి. ఎందుకంటే వాస్తవం కంటే సాహిత్యం ఒకమెట్టు పైనే ఉంది కాబట్టి, కథ ఒక ఉదాత్తమైనదని ఒప్పుకోవాలి. అలాంటి ఉదాత్తమైన అనుభవాలు నాకు లేవు. ఉన్నవి వాస్తవాలే. అయితే ఒక్కోసారి కొన్ని సంఘటనల, అనుభవాల వెనుక కారణాలను వెతుక్కుంటూ, ఆలోచనలను తవ్వుకుంటూ వెళితే నిర్వేదకరమైన ఊహలు నాకు ఎదురొస్తాయి. దీన్ని చెప్పడానికి ఓ చిన్న అనుభవం మీతో పంచుకుంటాను.</p>
<p>మామూలుగానే ఒకానొక సాయంత్రం ఆటో కోసం వేచి చూస్తూ నిలబడి ఉన్నాను. అప్పటికే పదిమంది ఆటోలవాళ్ళు నన్ను నిరాకరించారు. అప్పుడు ఒక ఆటో వాడు నన్ను ఎక్కించుకున్నాడు. బస్ స్టాండు వరకూ దింపుతానన్నాడు, అదీ మీటర్ ధరకే. ఆ రోజు నేనున్న పరిస్థితి ఎలాంటిదంటే &#8211; అతనికి మీటరుకు రెట్టింపు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాను. ఎలాగైనా బస్ స్టాండ్ చేరుకుని తొందరగా ఊరికి వెళ్ళాలి.</p>
<p>ఆటో అబ్బాయి కొంతసేపయిన తర్వాత మాటలు కలిపేడు. ఆ తర్వాత నేను కూర్చుని ఉన్న సీటు పక్కనా, వెనుకా చూడమన్నాడు. అక్కడ కొన్ని సినిమా తారల ఫుటోలు, కొన్ని కవితలూ రాసి ఉన్నాయి. అన్నిటిలోనూ ఆ ఆటో అబ్బాయి ఉన్నాడు. సినిమా తారలతో ఫుటో దిగటం చవకబారు హాబీయే కదా అనుకున్నాను. ఆ తర్వాత కాసేపటికి ఆ అబ్బాయి &#8216;కథ&#8217; చెప్పాడు. అతని కుటుంబం చిన్నది. అయితే అతడు కుటుంబ బాధ్యతకన్నా మరొక గొప్ప సామాజిక బాధ్యత ఒకటి తీసుకున్నాడు. అతడు తీరిక వేళల్లో సినిమాలలో ఫైట్లలో పాల్గొంటాడు. ఒక్కొక్కసారి మంచి ఆఫర్ (అంటే ఆ పూటకు బిరియానీ అన్నమాట) వస్తే ఎక్స్ట్రా గా కూడా. అంతే కాక, అతను ఒక సినిమా రచయితకు ఘోస్టు. ఈ విధంగా వచ్చిన డబ్బులతో అతను ఒక అనాథశరణాలయాన్ని నడుపుతున్నాడు. అతడు గొప్ప వ్యక్తా? కాదా? యేమో?</p>
<p>ఆటోలో దిగేప్పుడు అతనికి అదనంగా కొంత ఇవ్వాలని అనిపించింది. నిజానికి ఆ సమయంలో మిగిలిన ఆటోవాళ్ళు అడిగే ’ఎగస్ట్రా’ యే అది. అది ఇవ్వటం మూలాన నాకు ఏ ’లాస్’ కూడా లేదు. పైగా నా అహం తృప్తి చెందుతుంది కూడా. అయితే డబ్బు ఇస్తే అతణ్ణి అవమానించినట్లవుతుందని ఓ మూల సందేహం. ఇచ్చిన తర్వాత అతను &#8211; చెప్పిన కథ విని (అది అబద్ధం అయితే) నేను మోసపోయినట్లవుతుందన్న శంకా ఉంది. బస్సు కదిలిపోతూందన్న ’సాకు’ తో ఆటో దిగి త్వరగా, ఆ పైకం ఇవ్వకనే వెళ్ళిపోయాను చివరికి. ఆ రోజు ఆ అబ్బాయి నన్ను సమయానికి దిగబెట్టటం వలన సరైన సమయానికి బస్సు దొరికి ఓ ముఖ్యమైన ’ఘటన’కు సరిగ్గా అరగంట ముందే మా ఊరికి చేరుకోగలిగాను. ఈ ’ఘటన’ ను &#8211; ఘనంగా జరపడానికి పైన చెప్పిన ఆటో అబ్బాయికి ఇచ్చే పైకానికి పదింతలు వ్యర్థంగా ఖర్చు పెట్టి నన్ను నేను ఆత్మవంచన చేసుకున్నది నిజం. ఆ అబ్బాయికి చేయవలసిన ’సాయం’ చేయకపోవడంతో కలిగిన ’అనుభవం’ &#8211; కేవలం ఇదుగో ఇక్కడ ఇలా చెప్పుకోవడానికి పనికి వచ్చిన స్వార్థమై, వ్యర్థమయింది.</p>
<p>అనుభవాలే కథలకు ముడిసరుకయితే ఈ నా అనుభవశకలానికి ఓ కథానికగా మార్పు చెందటానికి కావలసిన వస్తువు ఉందనే నా అంచనా. అయితే అలాంటి కథ ఎలా రాయాలో నాకు తెలియదు. రాస్తే భేషజంగానో, కల్పనగానో, చవకబారుతనంగానో మారకుండా శిల్పంలా ఎలా మలచాలో తెలియదు. అలా మలిచే ప్రయత్నంలో ఆ కథ తాలూకు ఒరిజినాలిటీకు అన్యాయం చేయడం కూడా లోని కథకుడికి నచ్చట్లేదు. పైని అనుభవాన్ని ఉపయోగించుకుని కథ రాస్తే, అది ఆ అనుభవాన్ని స్వార్థానికి వాడుకున్నట్టవుతుంది. (ఆల్రెడీ అయిపోయిందా?). స్వార్థం &#8211; ఓ ఖచ్చితమైన అబద్ధం. కొందరు జీవితానుభవాలతో నాటకీయమైన ఒక ’కల్పన’ ను కథగా చెబుతారు. మనసులో పుట్టిన కథలు &#8211; ’గగన కుసుమాలు’ అనవచ్చా?</p>
<p>కథకొక శిల్పమూ, ఒరవడీ కావాలని కొందరు. అంటే ఒక నిర్దుష్టమైన స్ట్రక్చర్ అన్నమాట. నాకు శిల్పమూ, చిత్రలేఖనమూ వంటివి రావు. నిర్మించటమూ తెలీదు. తెలిసిందల్లా లోకాన్ని చూడటం. చూడటంలోనే వెతకటం అన్న అర్థమూ ఉంది. ఏం వెతుకుతున్నావని అడిగితే ఏమో తెలియదు అని కూడా చెప్పవలసి ఉంటుంది. మరి తెలియనప్పుడు ఎందుకు చూడాలి? ఏం వెతకాలి? ఏదో ఎక్కడో మినుకుమంటున్న ఒక ఆశ, ఒక ఆర్తి &#8211; దాహాన్ని తీర్చకపోయినా, దాహం తీరగలదన్న భరోసా ఇవ్వగలిగిన మరీచికగా నేను అవగలనన్న ఆకాంక్ష!</p>
<p>కథ రాయాలంటే &#8211; ఫ్రేం వర్క్ కావాలని కొందరు గొప్ప విమర్శకులు చెబుతారు. ఆ ఫ్రేం వర్క్ తెలుసుకోవాలంటే ఇజాలు తెలియాలి. నాకు యే ’ఇజమూ’ తెలియదు. మార్క్సిజమో, కేపిటలిజమో పట్ల అవగాహన అసలే లేదు. ప్రవాహంలో బడి కొట్టుకుని పోతూ ఉన్న నీటికణానికి, ఆ ప్రవాహం తాలూకు నది పేరు, లక్షణాలు తెలిసే అవకాశం లేదు. నేనా నీటిచుక్క లాంటి వాణ్ణి. ఆ నీటిచుక్కకు దాహం తీర్చడంలో భాగమూ ఉంది, కానీ ఒక్క చుక్కతో ఏ ఒక్క వ్యక్తి దాహమూ తీరడం అసాధ్యం అన్న భావనా ఉంది.</p>
<p>ఇదిగో, ఇదే&#8230;ఇలా ప్రతిచిన్న విషయానికి మెదడులో భాగాలు అరిగిపోయేట్టు ఆలోచించటమే వచ్చిన సమస్య. ఇంతకూ ఏమిటి అసలు విషయం?</p>
<p>మొదట చెప్పినట్టు &#8211; నేను కథకుడు కావాలి. కథాసాంప్రదాయంలో ఓ చిన్ని చోటు కావాలి.</p>
<p>కానీ ’కథ’ రాయకూడదు.<br />
అది ’అబద్ధం’ కనుక.<br />
నిజమే రాస్తే?<br />
అది ’కథ’, కథకు గల సారం, శిల్పం, డ్రమటైజేషన్ వంటి నిర్వచనాల దృష్ట్యా ఆ ’కథ’ అబద్ధమవుతుంది.</p>
<p>అంటే &#8211; కథకుడు కావాలని కథ కాకుండా రాసిన ఈ కథ &#8211; గాలిలో తేలిన ఓ ఊహ. Non-Existant.</p>
<p>ఇది ఒక స్వాప్నికుడి ’కల’. స్వాప్నికుడికి ’కల’ ఇచ్చిన ఆశ్వాసం మెలకువ ఇవ్వదు. ఇది రాయలేని కథ. రాయని కథ కూడా. ఇదొక మరీచిక.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=12086</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>ప్రబంధవిపంచిస్వరలహరి</title>
		<link>http://vaakili.com/patrika/?p=11751</link>
		<comments>http://vaakili.com/patrika/?p=11751#comments</comments>
		<pubDate>Sun, 31 Jul 2016 16:40:39 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[రవి E.N.V]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=11751</guid>
		<description><![CDATA[<p>సందర్భం, నాంది:</p> <p>మధ్యాహ్నం. ఎండ ఉద్ధృతంగా లేదు కానీ, చురుక్కుమనే అంటూంది.  అయితే వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంది. కొండ దిగి లోయకువస్తే కనుచూపుమేరా ఆకుపచ్చని తివాచీ పరుచుకున్నట్టు రాజనాల వరిపైర్లు. కయ్యల గట్లకు పక్కనే చిన్న చిన్న పంటకాలువలు ప్రవహిస్తున్నాయి. కాలువలలోంచి అక్కడక్కడా ఉబికి వచ్చిన ఎర్రటి కలువపూలు. అవి తమ పక్కన &#8211; కాస్త వంగిన వరిపైరుతో ఊసులాడుతున్నై. చల్లని గాలితో బాటూ ఆ కలువల పరిమళం నింపాదిగా వీస్తోంది.</p> <p>తొందరగా ఈ ప్రదేశం నుంచి బయటపడాలి. అతని ఊరికి వెళ్ళాలి. కానీ అతడు ఊరికి వెళ్ళలేడు. ఆ త్రోవ కూడా తెలియదతనికి. జనావాసం కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చి చేరేడు. ఈ పచ్చని పైర్లకు కాస్త దూరంగా &#8211; ఏంటది? ఏదో మామిడితోపులా కనిపిస్తోంది. కాస్త దగ్గరగా వెళితే &#8211; అవును. మామిడితోపు. చుట్టూ అల్లిబిల్లిగా గోరంట తీగలు అల్లుకున్నాయి. ఓ చిన్నపాటి అడవిలా ఉంది. అడవి మధ్యలో ఏదో నల్లరాతి-కట్టడం. ఆ నల్లరాతి కంబాలతో కట్టిన కట్టడం చుట్టూ ద్రాక్షతీగలు అల్లుకొని ఉన్నాయి. ద్రాక్షలు గుత్తులు గుత్తులుగా ఆ మంటపాల చివర్లపైనుంచి వ్రేలాడుతున్నాయి. జాగ్రత్తగా చూస్తే ఆ కంబాలకు మధ్య అక్కడక్కడా గరుడపచ్చలు తాపించారన్నట్టు కనుక్కోవచ్చు. ఈ అడవి మధ్యలో భవంతి. అందులో పచ్చలు తాపిన కంబాలతో ఇల్లూ&#8230;ఇది మునివాటికా? ఉహూ.. కాదు. మునివాటిక ఇంత ఆడంబరంగా ఉండదు. ఎవరి నివాసమో అక్కడికే వెళ్ళి కనుక్కుంటే?</p> <p>ఆ నవయువకుడు &#8211; ఆ కట్టడాన్ని చూసిన అబ్బురపాటుతోనూ, కాస్త అనుమానంతోనూ మరింత దగ్గరగా వెళ్ళేడు.</p> <p>అప్పుడు తాకిందొక ఘాటైన పరిమళం. ఇందాకటి కలువపూలపరిమళాన్ని మరుగుపరుస్తూంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే &#8211; చిటికెడు కస్తూరి, దానికి రెట్టింపు కర్పూరము దట్టించి, సున్నమూ, వక్కా కలిపి వేసుకున్న తమలపాకు తాలూకు పరిమళం అది. ఎవ్వరో నిండు జవ్వని చిరునామాను చెబుతున్నట్టుగా ఉంది. ఇక్కడ ఎవ్వరో నివాసమున్నట్టు తెలిసిపోతూంది. అతడు మరింత దగ్గరగా అక్కడకు వెళ్ళేడు.</p> [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><strong><span style="text-decoration: underline;">సందర్భం</span></strong><strong><span style="text-decoration: underline;">, </span></strong><strong><span style="text-decoration: underline;">నాంది</span></strong><strong><span style="text-decoration: underline;">:</span></strong></p>
<p><span style="font-size: 30px;">మ</span>ధ్యాహ్నం. ఎండ ఉద్ధృతంగా లేదు కానీ, చురుక్కుమనే అంటూంది.  అయితే వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంది. కొండ దిగి లోయకువస్తే కనుచూపుమేరా ఆకుపచ్చని తివాచీ పరుచుకున్నట్టు రాజనాల వరిపైర్లు. కయ్యల గట్లకు పక్కనే చిన్న చిన్న పంటకాలువలు ప్రవహిస్తున్నాయి. కాలువలలోంచి అక్కడక్కడా ఉబికి వచ్చిన ఎర్రటి కలువపూలు. అవి తమ పక్కన &#8211; కాస్త వంగిన వరిపైరుతో ఊసులాడుతున్నై. చల్లని గాలితో బాటూ ఆ కలువల పరిమళం నింపాదిగా వీస్తోంది.</p>
<p>తొందరగా ఈ ప్రదేశం నుంచి బయటపడాలి. అతని ఊరికి వెళ్ళాలి. కానీ అతడు ఊరికి వెళ్ళలేడు. ఆ త్రోవ కూడా తెలియదతనికి. జనావాసం కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చి చేరేడు. ఈ పచ్చని పైర్లకు కాస్త దూరంగా &#8211; ఏంటది? ఏదో మామిడితోపులా కనిపిస్తోంది. కాస్త దగ్గరగా వెళితే &#8211; అవును. మామిడితోపు. చుట్టూ అల్లిబిల్లిగా గోరంట తీగలు అల్లుకున్నాయి. ఓ చిన్నపాటి అడవిలా ఉంది. అడవి మధ్యలో ఏదో నల్లరాతి-కట్టడం. ఆ నల్లరాతి కంబాలతో కట్టిన కట్టడం చుట్టూ ద్రాక్షతీగలు అల్లుకొని ఉన్నాయి. ద్రాక్షలు గుత్తులు గుత్తులుగా ఆ మంటపాల చివర్లపైనుంచి వ్రేలాడుతున్నాయి. జాగ్రత్తగా చూస్తే ఆ కంబాలకు మధ్య అక్కడక్కడా గరుడపచ్చలు తాపించారన్నట్టు కనుక్కోవచ్చు. ఈ అడవి మధ్యలో భవంతి. అందులో పచ్చలు తాపిన కంబాలతో ఇల్లూ&#8230;ఇది మునివాటికా? ఉహూ.. కాదు. మునివాటిక ఇంత ఆడంబరంగా ఉండదు. ఎవరి నివాసమో అక్కడికే వెళ్ళి కనుక్కుంటే?</p>
<p>ఆ నవయువకుడు &#8211; ఆ కట్టడాన్ని చూసిన అబ్బురపాటుతోనూ, కాస్త అనుమానంతోనూ మరింత దగ్గరగా వెళ్ళేడు.</p>
<p>అప్పుడు తాకిందొక ఘాటైన పరిమళం. ఇందాకటి కలువపూలపరిమళాన్ని మరుగుపరుస్తూంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే &#8211; చిటికెడు కస్తూరి, దానికి రెట్టింపు కర్పూరము దట్టించి, సున్నమూ, వక్కా కలిపి వేసుకున్న తమలపాకు తాలూకు పరిమళం అది. ఎవ్వరో నిండు జవ్వని చిరునామాను చెబుతున్నట్టుగా ఉంది. ఇక్కడ ఎవ్వరో నివాసమున్నట్టు తెలిసిపోతూంది. అతడు మరింత దగ్గరగా అక్కడకు వెళ్ళేడు.</p>
<p>అంతే! అతని కళ్ళముందు ఓ మెరుపుతీగ కదులాడింది. ఆ మెరుపు తీగ కళ్ళు తామరపూవుల్లా ఉన్నాయి. కురులు తుమ్మెదల రెక్కలు. ముఖం పౌర్ణమి చంద్రబింబం&#8230;.అంత అద్భుత సౌందర్యరాశిని అతడు చూసి ఉండలేదు. పైకి చెప్పలేదు కానీ మనసులో అనుకొని ఉంటాడు &#8211; &#8220;నా భార్య సోమిదమ్మ కూడా ఇంత సౌందర్యరాశి కాదే!&#8221;.</p>
<p><strong><span style="text-decoration: underline;">ప్రస్తావన</span></strong><span style="text-decoration: underline;">:</span></p>
<p>పైని కథనం &#8211; అల్లసాని పెద్దనామాత్యుని మనుచరిత్రలో ప్రవరాఖ్యోపాఖ్యానమని ఈ పాటికి విజ్ఞులైన చదువరులు గ్రహించి ఉంటారు. మనోహరమైన కవిత్వాన్ని వచనంలోకి పరివర్తించే ప్రయత్నం అది. ఓ సిద్ధుడిచ్చిన ఆకు పసరుతో హిమాలయాలకు వెళ్ళిన ప్రవరుడనే బ్రాహ్మడు ఆ పసరు కరిగిపోతే ఇంటికెలా వెళ్ళాలో తెలియక ఆ పర్వతసానువులలో ఓ అమ్మాయి వద్దకు వచ్చి పడ్దాడు.</p>
<p>సాధారణంగా ఓ వచనరచనకు వాక్యనిర్మాణంలో ఔచిత్యం కావాలి. అంటే వాక్యనిర్మాణాన్ని కూర్చుని కుదురుగా దిద్దాలి. ఒక్కొక్క వాక్యాన్ని సానబట్టాలి. ఈ క్రమంలో ఆవేశం పనికిరాదు. అక్షరాల వెంబడి పాఠకుని కళ్ళను పరుగులెత్తించాలి. కథ ఆ అక్షరాలలో కరిగిపోవాలి.</p>
<p>అదే పద్యమైతే &#8211; పద్యానికి ఔచిత్యం కావాలి కానీ, అది రసాభివ్యక్తికి పక్కవాయిద్యంగా అమరాలి. దీన్ని భావౌచిత్యం అనడం సబబు. దీనిని క్షేమేంద్రుడు అనే ఆలంకారికుడు విచారించిన ప్రబంధగత, గుణౌచిత్యాల సంగమం అనుకోవచ్చు. పద్యం నడతకు ఔచిత్యం కన్నా, రసావేశం ఎక్కువ మెరుగును చేకూరుస్తుంది. కవిత్వాన్ని మెరుపుతీగలా చేస్తుంది. వచన రచన అక్షరాలవెంబడి పరుగులెత్తిస్తే, పద్యరచన (తాలూకు భావావేశం) &#8211; సహృదయుడైన పాఠకుని (రస)చర్వణను బట్టి ఆస్వాద్యం అవుతూ వెళుతుంది.</p>
<p>పైని ఘట్టంలో, పర్వతసానువులలో త్రోవ తప్పిన ప్రవరుడికి వరూధిని అనే అప్సరస ఎదురైనప్పుడు ఆమె చర్యలను, మానసిక అవస్థను పెద్దన అపూర్వమైన భావావేశంతో వర్ణించాడు. అందులో ఆరంభశ్లోకం యిది.</p>
<blockquote><p>సీ||</p>
<p>తతనితంబాభోగ ధవళాంశుకము లోని | యంగదట్టపుఁ గావి రంగు వలన</p>
<p>శశికాంతమణిపీఠి జాజువారఁగఁ, గాయ | లుత్తుంగకుచపాళి నత్తమిల్లఁ,</p>
<p>దరుణాంగుళీధూత తంత్రీస్వనంబుతో | జిలిబిలిపాట ముద్దులు నటింప,</p>
<p>నాలాపగతిఁ జొక్కి యరమోడ్పుఁ గనుదోయి | రతిపారవశ్యవిభ్రమముఁ దెలుపఁ,</p>
<p>గీ||</p>
<p>బ్రౌఢిఁ బలికించు గీతప్రబంధములకుఁ</p>
<p>గమ్రకరపంకరుహరత్నకటకఝణఝ</p>
<p>ణధ్వనిస్ఫూర్తి తాళమానములు గొలుప,</p>
<p>నింపు దళుకొత్త వీణ వాయింపుచుండి.</p></blockquote>
<p>(స్వారోచిష మనుసంభవము &#8211; 2.27)</p>
<p>తత                                           = విశాలమైన</p>
<p>నితంబ ఆభోగ                             = జఘనపు పరిపూర్ణత గలిగిన</p>
<p>ధవళాంశుకములోని                     = తెల్లని చీరయందున్న</p>
<p>అంగదట్టపున్                              = పావడ యొక్క</p>
<p>కావిరంగు వలన                          = కెంపు రంగు (ప్రసారము) వలన</p>
<p>శశికాంత మణి పీఠి                      = చంద్రకాంతమణులు పొదిగిన అరుగు</p>
<p>జాజువారగన్                              = ఎరుపు రంగును సంతరించుకొనగా</p>
<p>కాయలు                                     = వీణ సొరకాయలు</p>
<p>ఉత్తుంగ కుచపాళిన్                       = ఉన్నతమైన స్తనభాగాలను</p>
<p>అత్తమిల్లన్                                  = ఒత్తుకొనగా</p>
<p>తరుణాంగుళీ                               = జవ్వని వ్రేళ్ళతో</p>
<p>ధూత                                         = కదిలించబడిన</p>
<p>తంత్రీస్వనంబుతోన్                       = తీగెల యొక్క నాదముతో</p>
<p>జిలిబిలి పాట                               = ముద్దులొలికే గానము</p>
<p>ముద్దులు నటింపన్                       = సొబగును కలిగింపగా</p>
<p>ఆలాపగతిన్                                = గానము నాలపించు రీతిచేత</p>
<p>చొక్కి                                         = పరవశించి</p>
<p>అరమోడ్పుఁగనుదోయి                  = సగము మూతబడిన కనులు</p>
<p>రతిపారవశ్యవిభ్రమమున్               = సురతమునందలి మైమరపాటును</p>
<p>తెలుపన్                                     = ఎఱిగింపగా</p>
<p>ప్రౌఢిన్                                       = నేర్పును</p>
<p>పలికించు                                   = వీణపై పలికించెడు</p>
<p>గీతప్రబంధములకున్                    = సంగీతరచనలకు</p>
<p>కమ్రకరపంకరుహ                       = మనోహరమైన హస్తపద్మముల తాలూకు</p>
<p>రత్న కటక                                  = రత్నములు పూన్చిన కడియముల యొక్క</p>
<p>ఝణఝణధ్వనిస్ఫూర్తి                   = ఝణఝణ మనే రవళి</p>
<p>తాళమానములు గొలుపన్              = తాళముల నియమములుగా నమరగా</p>
<p>ఇంపు                                        = హొయలు</p>
<p>తళుకొత్తన్                                  = మీరుచుండగా</p>
<p>వీణ వాయింపుచుండి.</p>
<p>తాత్పర్యం: వరూధిని అనే ఓ అప్సర స్త్రీ మణులు పొదిగిన చలువరాతి అరుగుమీద కూర్చుని వీణ వాయిస్తోంది. ఆ అమ్మాయి కావిరంగు పావడాపై తెల్లని చీర ధరించింది. ఆమె పావడా కెంజాయ రంగు కాంతులు తెల్లని చీరద్వారా చంద్రకాంతమణులు పొదిగిన అరుగుపైన ప్రసరిస్తున్నవి. వీణ సొరకాయలు ఆమె ఉన్నతమైన పయ్యెదను ఒత్తుకుంటున్నాయి. ఆ చిన్నది తన అందమైన వ్రేళ్ళతో వీణె తీగెను మీటుతూ, ఏదో జిలిబిలి పాటను ముద్దుగా పాడుకుంటోంది. ఆ తరుణి అరమూసిన కనులు రతి పారవశ్యముపు మైమరపాటును తెలుపుతున్నాయి. ఆ సుందరి తన చేతులతో వీణె తీగలు మీటినప్పుడు &#8211; చేతులకు ధరించిన రత్నాలకడియాల తాలూకు ’ఝణఝణ’ మనే నాదం ఆమె గానానికి తాళంగా అమరుతోంది. ఇన్ని హొయలతో ఆ చక్కనిది వీణ వాయిస్తోంది.</p>
<p>ఈ తాత్పర్యాన్ని చదివిన తర్వాత ఓ మారు సీసపద్యం మళ్ళీ చదువుకోవాలి. పెద్దపెద్ద బండరాల మధ్య ఒరుసుకుని ప్రవహించే తుంగభద్రానదీప్రవాహం లాంటి ఒరవడి కనిపిస్తుంది. చంద్రకాంతమణిపీఠిక &#8211; ఎఱుపు రంగు సంతరించుకోవడం, అరమోడ్పు కనుదోయి రతిపారవశ్య విభ్రమాన్ని తెలుపడం &#8211; ఇత్యాదులతో ఇది నిదర్శనాలంకారం.</p>
<p>ఈ సీసపద్యం తాలూకు విశేషాలను పద్యనిర్మాణ దృష్టితోనూ, ఇతరత్రా విశేషాల నేపథ్యాలతోనూ విహంగవీక్షణ చేయడం ఈ వ్యాసలక్ష్యం.</p>
<p style="text-align: center;">***</p>
<p><strong><span style="text-decoration: underline;">సీసపద్యము</span></strong><strong><span style="text-decoration: underline;">:</span></strong></p>
<p>సీసపద్యము &#8211; దేశీ ఛందస్సు. వస్తువును సావకాశంగా వర్ణించడానికి, సంస్కృతంలో ప్రౌఢరచనలను తెనుగులోనికి అనువదించడానికి, ప్రతిపాదంలోనూ దృష్టాంతాలను సంతరించడానికి, గేయంలా పాడుకోవటానికి, సంగీతపు రాగాలను సాహిత్యంలో నిమంత్రించడానికి, మహాసన్నివేశనిర్వహణకు, కథాగమనాన్ని నిర్మించడానికి,  గర్భ, బంధకవిత్వాది ఇతరత్రా మరెన్నో ప్రయోగాలకు అనువైన ఛందోలక్షణాలను అందంగా నిలుపుకున్నది సీసం. తెలుగు కవుల ప్రతిభావిలాసాలకు నిలువెత్తు నిదర్శనం. నన్నయ్య చేత నగిషీలు దిద్దుకుని. నాచన సోముని నవీన గుణాలను సంతరించుకుని, తిక్కన అర్థస్ఫూర్తికి నిదర్శనమై, శ్రీనాథుడి చేత సిరులద్దుకుని, పోతన చేతులలో పోతపోసుకుని, రామరాజ భూషణకవి సంగీతనాదానికి భూషణమై సీసం శిఖరాగ్రాన్ని పొందింది. నేడు లభిస్తున్న ఆధారాలను బట్టి &#8211; తెలుగులో మొట్టమొదటి సీసపద్యాన్ని ఒక శిథిలశాసనంలో లిఖించారు. ఇది 9 వ శతాబ్దపు శాసనం.</p>
<blockquote><p>సీ||</p>
<p>శ్రీనిరవద్యుండు చిత్తజాతసముండు | శివపదవరరాజ్యసేవితుండ</p>
<p>ఖిలుడు ననృతరిపుబలుడు నాహవరావ | దండమోద్య సిఘాసనుండగణిత</p>
<p>దానమాన్యుండు దయానిలయుండును | భండన నండన పండరంగు</p>
<p>&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;.కొలదిలేని | కొట్టము ల్వోడిచి గుణకనెల్ల</p>
<p>ఆ||</p>
<p>తాని పక్షపాతి&#8230;&#8230;&#8230;&#8230;&#8230;</p>
<p>&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;..</p>
<p>&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;..</p>
<p>&#8230;&#8230;&#8230;..విభవగౌరవేంద్ర.</p></blockquote>
<p>ఆ సీసపద్యం వచనంలా ఉంది. పాదానికి పాదానికి మధ్య విరుపు లేదు. దీనిని ’గునుగు సీసం’ అంటారు. దేశీకవిత మొదటి రోజులతీరు యిది. ఏ పాదానికి ఆ పాదం ప్రత్యేకంగా ఉండడం అంటే ప్రతిపాదాంతవిరామం &#8211; సంస్కృతకవిత లక్షణం. నన్నయ, మారన్న ఇత్యాది కవులు సంతరించిన సీసపద్యాలలో రెండు ధోరణులూ కనిపిస్తాయి. అయితే పూర్తిగా ఒక్కొక్క పాదం దేనికదే స్వతంత్రంగా ఉండటమే లక్షణంగా మారటం &#8211; బహుశా శ్రీనాథుని కాలంలో జరిగిన పెద్ద మార్పు. శ్రీనాథ కవిసార్వభౌముని &#8220;శృంగారనైషధం&#8221; (శ్రీహర్షుని నైషధీయచరితానికి తెనుగు సేత) లో 108 సీస పద్యాలు ఉన్నాయి. అందులో కేవలం ఒకే ఒక్క (గునుగు) సీసపద్యంలో మాత్రం రెండుపాదాలు కలిపికట్టుగా సాగడం కనిపిస్తుంది. (అవధారుదేవి! దివ్యకిరీటకోటి..3-120)  మిగిలిన అన్ని పద్యాలున్నూ పాదాంతవిరామచిహ్నాలతో కూడినవే. ఇలాంటివి హరవిలాసంలో ఒకటి (2-15), కాశీఖండంలో రెండు మాత్రమే కనిపిస్తాయి. అనువాద సౌలభ్యం కోసం, భావాన్ని మరింత చిక్కగా, అందంగా, మూలకావ్యానికి యథారూపాన నిలిపేందుకు కవిసార్వభౌముడు మార్గ పద్దతి అనుసరించి ఉంటాడనిపిస్తుంది. అలా శ్రీనాథుని తర్వాత దేశీఛందస్సు, పూర్తిగా మార్గఛందో లక్షణాన్ని సంతరించుకుంది. ఈ పరిణామానికే కాబోలు ఆధునికులు కొందరు శ్రీనాథుని విమర్శించారు. లక్షణం మార్పు చెందినా, శ్రీనాథుడు సీసపద్యానికి కొత్త ఒరవడి కల్పించాడు. శ్రీనాథుని సీసపద్యాల పాదాల మధ్య విరుపు &#8211; ఎవరో అప్సరస పారిజాతాన్ని తుంచినట్టు అలవోకగా ఉంటుంది. లలితమైన భావాలతో, అచ్చెరువు గొలిపే పదబంధాలతో కవిసార్వభౌముడు సీసపద్యాన్ని నవనవోన్మేషంగా తీర్చాడు. అయితే శ్రీనాథుని అనుసరించిన తదనంతర కాలపు కవులలో కొందరు పాదాంత విరామాన్ని సరిగ్గా ఉపయోగించలేదు.</p>
<p>నాటినుండి తెలుగులో ఎందరో కవుల, వేలాదిగా గల అందమైన సీసపద్యపు రాశులు పోగయ్యాయి. ఈ మహారాశిలో ఏ రత్నం మీకు ఇష్టమైనది? అని ఓ మారు అంతర్జాలంలో చర్చ వచ్చింది. దాదాపు పదేళ్ళ నాటి మాట యిది. చాలా చిక్కుప్రశ్న. తెలుగులో ఒక్క శ్రీనాథుడే 811 సీసపద్యాలను రచించాడట. ఇక ఊహించవచ్చు. అన్ని రత్నాలలో ఏ రత్నాన్ని ఎన్నుకున్నా, మరెన్నో రత్నాలకు అన్యాయం చేయవలసి వస్తుంది. అయినప్పటికీ మాన్యులు, రసికులూ మంచి మంచి పద్యాలను ఏరారు. ఆ చర్చను సావకాశంగా ఈ <a href="http://kottapali.blogspot.com/2007/04/blog-post.html">లంకెలో</a> చదువుకోవచ్చు కానీ ప్రస్తుతానికి వస్తే -</p>
<p><strong><span style="text-decoration: underline;">కొన్ని</span></strong><strong></strong><strong><span style="text-decoration: underline;">సీసపద్యాలు</span></strong><strong><span style="text-decoration: underline;">:</span></strong></p>
<p>సీస పద్యానికి ఛందో నియమాలు ఉన్నా, సాధారణంగా సీసపద్యపు నడతను గమనించడానికి కొన్ని పద్యాలను చూద్దాం.</p>
<p>పోతన ప్రహ్లాదచరిత్రలోని అపురూపమైన సీసపద్యం.</p>
<blockquote><p>సీ||</p>
<p>మందార మకరంద మాధుర్యమునఁ దేలు | మధుపంబు వోవునే <em>మదనములకు</em></p>
<p>నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు | రాయంచ సనునె <em>తరంగిణులకు</em></p>
<p>లలిత రసాల పల్లవ ఖాది యై చొక్కు | కోయిల సేరునె <em>కుటజములకు</em></p>
<p>పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక | మరుగునే సాంద్ర <em>నీహారములకు</em></p>
<p>గీ||</p>
<p>అంబుజోదర దివ్య పాదారవింద</p>
<p>చింతనామృత పాన విశేష మత్త</p>
<p>చిత్త మేరీతి నితరంబు చేర నేర్చు</p>
<p>వినుత గుణశీల! మాటలు వేయు నేల.</p></blockquote>
<p>&nbsp;</p>
<p>శ్రీనాథుని ప్రసిద్ధ చాటువు</p>
<p>&nbsp;</p>
<blockquote><p>సీ ||</p>
<p>చక్కని నీ ముఖ చంద్ర బింబమునకుఁ | గల్యాణ మస్తు ! <em>బంగారు</em><em> </em><em>బొమ్మ</em><em>!</em></p>
<p>నిద్దంపు నీ చెక్కు టద్దంపు రేకకు | నైశ్వర్య మస్తు! <em>నిద్దంపు</em><em> </em><em>దీవి</em><em>!</em></p>
<p>మీటినఁ బగులు నీ మెఱుఁగు బాలిండ్లకు | సౌభాగ్యమస్తు! <em>భద్రేభ</em><em> </em><em>యాన</em><em>!</em></p>
<p>వలపులు గులుకు నీ వాలుగన్నులకు న | త్యధిక భోగోస్తు! <em>పద్మాయతాక్షి</em><em>!</em></p>
<p>గీ ||</p>
<p>మధురిమము లొల్కు నీ ముద్దు మాటలకును</p>
<p>వైభవోన్నతిరస్తు! <em>లావణ్య</em><em> </em><em>సీమ</em><em> !</em></p>
<p>వన్నె చిన్నెలు గల్గు నీ మన్న నలకు</p>
<p>శాశ్వత స్థితి రస్తు! <em>యోషాలలామ</em><em>!</em></p></blockquote>
<p>&nbsp;</p>
<p>తెనాలి రాముని ఉద్భటారాధ్యచరిత్రలోని సీసపద్యం ఇది.</p>
<blockquote><p>సీ||</p>
<p>తరుణ శశాంక శేఖర మరాళమునకు | సార గంభీర <em>కాసారమగుచు</em></p>
<p>కైలాసగిరి నాథ కలకంఠ భర్తకు | కొమరారు లేమావి <em>కొమ్మయగుచు</em></p>
<p>సురలోక వాహినీ ధర షట్పదమునకు | ప్రాతరుద్బుద్ధ <em>కంజాతమగుచు</em></p>
<p>రాజ రాజ ప్రియ రాజకీరమునకు | మానిత <em>పంజరస్థానమగుచు</em></p>
<p>గీ||</p>
<p>ఉరగ వల్లభ హార మయూరమునకు</p>
<p>చెన్ను వీడిన భూధర శిఖరమగుచు</p>
<p>లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి</p>
<p>అద్రినందన బొల్చె విహారవేళ.</p></blockquote>
<p>&nbsp;</p>
<p>తిక్కన విరాటపర్వంలోని ప్రసిద్ధసీసం.</p>
<p>&nbsp;</p>
<blockquote><p>సీ ||</p>
<p>కాంచనమయ వేదికా కనత్కేతనో | జ్జ్వల విభ్రమమువాఁడు <em>కలశజుండు</em>;</p>
<p>సింహ లాంగూల భూషిత నభోభాగ కే | తు ప్రేంఖణమువాఁడు <em>ద్రోణసుతుఁడు</em>;</p>
<p>కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట | ధ్వజ సముల్లాసంబువాఁడు <em>కృపుఁడు</em>;</p>
<p>లలితకంబుప్రభాకలిత పతాకా వి | హారంబువాఁడు <em>రాధాత్మజుండు</em>;</p>
<p>తే ||</p>
<p>మణిమయోరగ రుచిజాల మహితమైన</p>
<p>పడగవాఁడు కురుక్షితిపతి; మహోగ్ర</p>
<p>శిఖరఘన తాళతరువగు సిడమువాఁడు</p>
<p>సురనదీసూనుఁ; డేర్పడఁ జూచికొనుము.</p></blockquote>
<p>పై సీసపద్యాలన్నిటిలో ఏ పాదానికి ఆ పాదం ప్రత్యేకంగా ఉన్నది. సాధారణంగా పాదంలోని పూర్వార్థం లక్షణాన్ని, ఉత్తరార్థం లక్ష్యాన్ని సూచిస్తూంది. (ఇది సీసపద్యపు బలమైన లక్షణం కాదు), లేదా పాదపు పూర్వ,పర అర్ధభాగాలు యత్తదర్థకంగా ఉన్నాయి. సీసపద్యపు పాదాంతాలు ప్రథమా/సంబోధన ప్రథమా విభక్తితోనో, ఇతర విభక్తి ప్రత్యయాల తోనో అంతమవుతున్నాయి. ఇటువంటివి సీసపద్యపు అతి-సాధారణ రీతులు. ఒక్క తిక్కన సీసపద్యంలో మాత్రం అర్ధపాదంలో శబ్దం విరుగుతున్నది. (ఉదా: కే| తు ప్రేంఖణము, వి | హారంబు వాడు)</p>
<p><strong><span style="text-decoration: underline;">తుంగభద్రప్రవాహం</span></strong><strong><span style="text-decoration: underline;">:</span></strong></p>
<p>పై లక్షణాలు లేని తెలుగు సీసపద్యాలు ఎన్నో ఉండవచ్చు. అయితే సాధారణంగా ఆంధ్ర కవులు సంతరించే సీసపద్యాలలో ఎక్కువభాగం పైని చెప్పిన పద్ధతులలోనే తీర్చబడి ఉన్నాయి. పైన ప్రస్తావించిన <a href="http://kottapali.blogspot.com/2007/04/blog-post.html">లంకెలో</a> యువకవులు పేర్కొన్న సీసపద్యాలలోనూ ఇవే లక్షణాలు గమనించవచ్చు.</p>
<p>ఈ నేపథ్యంతో ఇదివరకటి అల్లసాని పెద్దన పద్యానికి వస్తే &#8211; ఇందులో ఏ పాదానికి ఆ పాదం ప్రత్యేకార్థాన్ని నింపుకొని లేదు. వరూధిని వర్ణనలో నాలుగు అంశాలూ, ఆపైన ఎత్తుగీతి ఉన్నాయి. మొదటి భాగం అయిన</p>
<p>1. తతనితంబాభోగ ధవళాంశుకము లోని | యంగదట్టపుఁ గావి రంగు వలన</p>
<p>శశికాంతమణిపీఠి జాజువారఁగన్.</p>
<p>యొక్క భావం &#8211; ఒక్క పాదంలో ఇమిడిపోక, రెండవ పాదానికి చొచ్చుకు వచ్చింది.</p>
<p>&nbsp;</p>
<p>2. కాయ | లుత్తుంగకుచపాళి నత్తమిల్లఁ</p>
<p>&nbsp;</p>
<p>ఈ వర్ణన &#8211; పద్యనిర్మాణపరంగా కాస్త చిన్నదై పోయింది.</p>
<p>&nbsp;</p>
<p>3. దరుణాంగుళీధూత తంత్రీస్వనంబుతో | జిలిబిలిపాట ముద్దులు నటింప,</p>
<p>4. నాలాపగతిఁ జొక్కి యరమోడ్పుఁ గనుదోయి | రతిపారవశ్యవిభ్రమముఁ దెలుపన్,</p>
<p>పైని రెండు పాదాలు కుదురుగా ఉన్నాయి.</p>
<p>తిరిగి ఎత్తు గీతిలో మొదటి పాదం &#8220;బ్రౌఢిఁ బలికించు గీతప్రబంధములకుఁ&#8221; &#8211; కుదురుగా ఉండి, ఆపై</p>
<p>5.</p>
<p>కమ్రకరపంకరుహరత్నకటకఝణఝ</p>
<p>ణధ్వనిస్ఫూర్తి తాళమానములు గొలుప</p>
<p>&nbsp;</p>
<p>ఇక్కడ &#8211; ఉత్తరపాదంలోనికి వర్ణన వ్యాపించింది. తిరిగి &#8220;ఇంపు తళుకొత్తు&#8221; చివరి పాదంతో ముచ్చటగా ముగుస్తున్నది.</p>
<p>ఇలా ఈ సీసపద్యం పోతనాదుల సీసపద్యపు నడకతో పోలిస్తే విభిన్నంగా తోస్తుంది. ఈ విధమైన పద్యపు అస్తవ్యస్తపు గతిని ఆధునికులు, శ్రీనాథాదుల మార్గకవిత్వ లక్షణాలతో పోల్చి, అంగీకరించకపోవడం ఉన్నది. ఇది విలక్షణం కాదు కానీ, విభిన్నం. ఎత్తైన కఠిన శిలలూ, బండరాలను ఒరుసుకుంటూ చక్రతీర్థం వద్ద నిండుగా ప్రవహిస్తూ, ఋష్యమూక పర్వతాన్ని దాటి సన్నటి పాయగా మారి నెమ్మదై, మలుపు తిరిగి రమణీయమై, ఆపై అల్లనల్లన కదులుతూ పలుహొయలు పోతున్న తుంగభద్ర నదీప్రవాహం లాంటి జీవంతమైన పద్యశిల్పం యిది. (పోలిక కోసం ఈ క్రింది ఛాయాచిత్రాలను గమనించండి.)</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/07/pic1.jpg"><img class="aligncenter size-large wp-image-11756" title="pic1" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/07/pic1-1024x679.jpg" alt="" width="745" height="493" /></a></p>
<p style="text-align: center;"><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/07/pic2.jpg"><img class="aligncenter  wp-image-11757" title="pic2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/07/pic2.jpg" alt="" width="761" height="507" /></a></p>
<p>కాలువలకు తప్ప నదీప్రవాహానికి కట్టడి ఉండదు. నదీ మార్గం &#8211; నది ప్రవాహస్వభావంతో, నేల యొక్క ఎత్తుపల్లాలతో స్వతః సిద్ధంగా ఏర్పడవలసిందే. రసప్రవిష్టమైన కవిత్వ మార్గం కూడా అంతే &#8211; వస్తువు యొక్క స్వస్వభావంతో, వశ్యవాక్కు అయిన కవి మనోవిశిఖల నుండి అప్రయత్నంగా వెలువడి తనంతట తనే ఒక రూపును సంతరించుకుంటుంది.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/07/pic3.jpg"><img class="aligncenter size-large wp-image-11759" title="pic3" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/07/pic3-1024x768.jpg" alt="" width="745" height="558" /></a></p>
<p>ఈ ఒరవడి, అస్తవ్యస్తపు నడక &#8211; పద్యంలో వస్తువైన అప్సరస భోగపరాయణత్వాన్ని, ఆమె చంచలమైన మనస్సు స్థితినీ, అద్భుతమైన రీతిలో ఉద్యోతిస్తున్నది. ఇక్కడ మరొకపార్శ్వం గమనించదగినది. పద్యం ఒరవడి &#8211; వాగు పారే తీరులా, ఉద్ధృతంగా ఉంది. కానీ అందుకు ఉపకరించిన శబ్దసంచయం సీసపద్యపు పాద ప్రథమార్థాలు, మిగిలిన చోటల్లా, ఎక్కువభాగం &#8211; మాధుర్యభరితంగా, సంయోగాక్షరాలు లేకుండా, నిర్మల సలిలవాహినిలా ఎంత తీయందనాలు చిందుతున్నాయో ఈ క్రింది పదబంధాలలో చూడండి.</p>
<p>తతనితంబాభోగ ధవళాంశుకము లోని&#8230;</p>
<p>శశికాంతమణిపీఠి జాజువారఁగఁ గాయ&#8230;</p>
<p>దరుణాంగుళీధూత తంత్రీస్వనంబుతో జిలిబిలిపాట&#8230;</p>
<p>నాలాపగతిఁ జొక్కి &#8230;.</p>
<p>బ్రౌఢిఁ బలికించు గీతప్రబంధములకుఁ&#8230;</p>
<p>ప్రవరుని కంటికెదురైన అప్సర స్త్రీ వరూధినిని ఇంత భావావేశంతో వర్ణించిన పెద్దన అదే ఘట్టంలో తొమ్మిది పద్యాల తర్వాత తిరిగి వరూధిని కళ్ళతో ప్రవరుని చూచి వర్ణించిన తీరు యిదీ.</p>
<p>&nbsp;</p>
<p>ప్రవరుని వర్ణన.</p>
<blockquote><p>సీ||</p>
<p>వదన ప్రభూత లావణ్యాంబు సంభూత | కమలంబులన వీని కన్నులమరు</p>
<p>నిక్కి వీనులతోడ నెక్కసెక్కములాడు | కరణి నున్నవి వీని ఘనభుజములు</p>
<p>సంకల్పసంభవాస్థానపీఠికవోలె | వెడదయై కనుపట్టు వీనియురము</p>
<p>ప్రతిఘటించు చివుళ్ళపై నెఱ్ఱవాఱిన | రీతి నున్నవి వీని మృదుపదములు</p>
<p>తే||</p>
<p>నెరటేటి యసల్ తెచ్చి నీరజాప్తు</p>
<p>సానఁబట్టిన రాపొడి చల్లి మెదిపి</p>
<p>పదను సుధనిడి చేసెనో పద్మభవుఁడు</p>
<p>వీని గాకున్నఁ గలదె ఈ మేనికాంతి.</p></blockquote>
<p>(స్వా.మ -2.36)</p>
<p>తాత్పర్యం: ఈ సుందరుని కనులు, ముఖకాంతి అన్ని నీట జన్మించిన పద్మముల లాగా ఉన్నాయి. వీని ఎత్తైన భుజములు &#8211; పైకి నిక్కి కళ్ళతో ఎకసెక్కములాడుతున్నట్టు ఉన్నాయి. వీని వక్షస్థలం విశాలమై, మన్మథుని ఆస్థాన పీఠికలా ఉంది. వీని అరిపాదాలు, చివురుటాకుల ఎర్రదనాన్ని ధిక్కరిస్తున్నాయి. జంబూనది ఒడ్డున ఉన్న ఒండ్రుమట్టి (జంబూ నది ఒక పౌరాణిక నది. జంబూద్వీపంలో ప్రవహిస్తుంది. జంబూనది ఒడ్డున ఒండ్రుమట్టి బంగారమని పురాణకథనం) ని తెచ్చి, సూర్యచక్రాన్ని సానబట్టి, రాలిన పొడిని ఆ బంగరు రంగు ఒండ్రుమట్టిలో చల్లి మెదిపి బ్రహ్మ ఈతని శరీరాన్ని పోతపోసి తయారు చేసినట్టుగా ఈతని మేనికాంతి. (సూర్యుని వేడిమి తగ్గించడానికి త్వష్టప్రజాపతి ఆ సూర్యబింబపు చివర్లను వజ్రాయుధంతో అరగదీశాడని పురాణ కథ)</p>
<p>ఈ సీసం ఇందాక చెప్పిన తిక్కన, పోతన సీస పద్యాల లక్షణాన్ని పోలి ఉంది.  ప్రవరుని కన్నులు, ఘనభుజములు, ఉరము, పదములు వేటికవి ఒక్కొక్క పాదానికి నిమంత్రించి కుదురుగా తీర్చిదిద్దినాడు కవి. ఒక స్త్రీ సౌందర్యాన్ని, మానసికావస్థను, ఆమె చేస్తున్న వీణావాదనా క్రియను చిత్రించేప్పుడు పద్యాన్ని ఒకరకంగా, యువకుని రూపాన్ని వర్ణించినప్పుడు తద్భిన్నంగా వర్ణించటం బహుశా పెద్దన &#8211; అపురూపమైన, విచిత్రమైన పద్యశిల్పం. ఇది విచిత్రమైన విషయం కూడా. ఎందుకంటే ప్రకృతిలో స్త్రీ సౌందర్యం &#8211; సౌష్ఠవమూ,లలితమూ, సుకుమారమూ. పురుష సౌందర్యం &#8211; కఠినమూ, ధీరగంభీరమూ. అయితే పెద్దన కవితలో ఇవి తారుమారు! ఆ తారుమారును కనిపించనివ్వక పద్యాన్ని నడపడం పెద్దన ప్రతిభ!</p>
<p>&nbsp;</p>
<p>అల్లసాని పెద్దన స్వారోచిషమనుసంభవం &#8211; మార్కండేయపురాణంలోని ఉపకథ. పెద్దనకంటే ముందు మారన మార్కండేయపురాణాన్ని తెనుగు చేశాడు. ఆయన కావ్యంలోనూ వరూధినిప్రవరాఖ్యోపాఖ్యానం ఉంది. మారన్న వరూధిని &#8211; ’లలితాంగజితకాంచనప్రభ’ &#8211; అంటే పసిడివెలుగులను ధిక్కరించే నెర మేని సోయగములు గలది. పెద్దన వరూధిని ’విద్యుల్లతవిగ్రహ’ (మెరుపు వంటి మేను గలది). పైగా పాలనురగ వంటి చీరెను కట్టుకుంది. ఈవిడ మెరుపుకు ’కాంట్రాస్టు’ గా పెద్దన గారి ప్రవరుడు బంగరుకాంతితో ఒండ్రుమట్టిని, సూర్యరజమునూ కలుపగా తయారయ్యాడు.</p>
<p>మారనకవి మార్కండేయపురాణ ఘట్టంలో వరూధినియే ప్రవరాఖ్యుని మొదట చూస్తుంది. ఆపై కథ అంతా సూటిగా నడిచిపోతుంది. వరూధిని తాలూకు తాంబూలపు ఘుమఘుమ, వల్లకీస్వర మధురిమ &#8211; అల్లసాని పెద్దన కూర్పు.</p>
<p>పెద్దన ప్రవరాఖ్యుని పురుష సౌందర్యాన్ని &#8211; వరూధిని చూచినట్టు, ఆమె కన్నులతో వర్ణించాడు. అయితే మన ’తతనితంబాభోగ..’ సీసపద్యాన్ని, ప్రవరుని కళ్ళతో కాక, అక్కడ ఉన్న మూడవ వ్యక్తి అయిన కవి కన్నులతో చిత్రించాడు. దీనివెనక ఔచిత్యం ఉంది. ప్రవరాఖ్యుడు ధర్మమెఱిగిన వాడు, వివాహితుడు, గేస్తు. ఆతడు వరూధిని యొక్క ఉన్మత్త అవస్థనూ అరమోడ్పు కనుదోయిలో కదిలే రతిపారవశ్య విభ్రమాన్ని చూడడం ఉండదు. అందుచేత అక్కడ సందర్భవశాత్తూ నాయికను పెద్దనే తన కన్నులతో చూచాడు. ఈ కవిత్త్వం &#8211; ఒకొక్క శబ్దాన్ని పేర్చుకుంటూనో, ఒక్కో పదాన్ని చెక్కుకుంటూనో నిర్మింపబడలేదని,  తనంతట తనే అలా వెల్లువలా, ఉరకలెత్తి ప్రవాహంలా పారిందని ఇందాకే ప్రతిపాదించబడింది. అల్లసాని పెద్దనకు ఆ రసాభివ్యక్తిని కలిగించిన పరిసరాలను, నేటి హంపి పరిసరాలలో కొంత ఊహించవచ్చు.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/07/pic4.jpg"><img class="aligncenter size-large wp-image-11760" title="pic4" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/07/pic4-1024x576.jpg" alt="" width="745" height="419" /></a></p>
<p>హంపి &#8211; విరూపాక్షస్వామి కోవెల కు వెళ్ళే త్రోవలో ఒకచోట త్రోవకు ఎడమ వైపున, అరటి, మామిడి కొబ్బరి తోపుల మధ్య, వరిచేల దాపున ఒక మనోహరమైన ప్రాంతం ఉంది. శ్రీకృష్ణదేవరాయలవారు అక్కడ ఉగ్రనరసింహ మూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. పక్కనే తుంగభద్ర కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కాలువ సరిగ్గా ఓ మంటపం మధ్య నుంచి ప్రవహిస్తూ ఉండడం గమనార్హం. శిథిలమైన ఆ మంటపం ఆనవాళ్ళు ఈనాడు మనకు కనిపిస్తాయి. విజయనగరం వైభవంగా వర్ధిల్లిన రోజులలో అక్కడ కంబాలపై మణులు పొదిగారేమో. చలువరాయి అరుగు క్రింద కాలువ నీరు పారేలా కట్టి ఉన్నారేమో. నాటి కాలంలో ఏ విద్యానగరసుందరియో ఆ తిన్నెపై కూర్చుని అలవోకగా మంజీరశోభితమైన పాదాలను నీటిపై కదిలిస్తూ హొయలు పోయిందేమో! అల్లసాని పెద్దన తీర్చిన వరూధిని, అక్కడే, ఆయన అపురూపమైన ఘంటం నుంచి అక్షరరూపంలో జాలువారి అ-క్షరమై నిలిచిందా? ఏమో.</p>
<p>నేటి ఒకానొక శిథిలమంటపం &#8211; నాడు కవికి ప్రేరణగా నిలిచిందా? అని తేల్చివేయడానికి ఆస్కారం ఉన్నది కానీ మనుచరిత్రలో సూక్ష్మంగా చూస్తే అటువంటి ఆనవాళ్ళు ఇంకా కనిపిస్తాయి. నాలుగవ ఆశ్వాసంలో స్వరోచి తన మిత్రులతో కలిసి &#8211; ఒక శిఖరంపైన మంటపంలో మిత్రులతో కలిసి ముచ్చటిస్తుంటాడు. పైన తుంగభద్రానది బొమ్మలలో అటువంటివి కనిపిస్తాయి. అలా మనుచరిత్రలో పెద్దన వర్ణించిన హిమాలయ సానువుల రూపాలు హంపి పరిసరాలలో (యథాతథంగా కాకపోయినా, ఛాయామాత్రంగా) కనిపిస్తాయి. పుట్టపర్తి నారాయణాచార్యుల వారు &#8211; వరూధిని పెనుగొండ ఆడబడుచని, జటిల ద్రాక్షాగుళుచ్ఛములు, కలువలూ, మందారాల ఆనవాళ్ళు అక్కడివనీ అంటారు. విరూపమైన ఈ నాటి పెనుగొండకు విరుద్ధంగా నాడు సస్యసంపద అంత వైభోగంగా ఉండేదేమో, వరూధిని అక్కడి ఆడపడుచే అయి ఉండవచ్చును కూడా. కానీ హంపి అదృష్టవశాత్తూ అవే పోలికలతో నేటికీ నిలిచి ఉంది. తన  నివాసస్థానమైన విద్యానగరపు పరిసరాలలోని ఈ మనోహరమైన సానువులు పెద్దనకు ప్రేరణ కావడంలో అత్యుక్తి లేదు.</p>
<p style="text-align: center;">***</p>
<p><strong><span style="text-decoration: underline;">ఇతర</span></strong><strong></strong><strong><span style="text-decoration: underline;">విశేషాలు</span></strong><strong><span style="text-decoration: underline;">:</span></strong></p>
<p>మనుచరిత్రలోని ఇదే ఘట్టాన్ని అనుసరిస్తూ రామరాజభూషణుడు వసుచరిత్రలో నాయికాగమన సన్నివేశాన్ని తీర్చిదిద్దాడు. ఆ ఘట్టంలో గిరిక వర్ణన <a href="http://vaakili.com/patrika/?p=11174">ఈ లంకె</a> లో చూడవచ్చు. ఆ వర్ణన &#8220;తరువుల పొంతఁ బొంచి వసుధావరమిత్రుఁడు&#8230;.&#8221; అన్న పద్యంలోనిది.</p>
<p>రామరాజభూషణుడు వర్ణించిన నాయిక తాలూకు సన్నివేశము, పెద్దన మనుచరిత్రలోని సన్నివేశమూ ఒకే విధమైనవే. భూషణకవి నాయికను వర్ణిస్తే, పెద్దన నాయిక యొక్క ’వీణావాదన క్రియ’ ను వర్ణిస్తూ, ఆమె సౌందర్యాన్ని ఉద్యోతించాడు. సాధారణంగా సీసపద్యపు వస్తువుకు ఇది అరుదు. పెద్దన పద్యంలో అభినయప్రధానమైన దృశ్యనాటకపు తీరు కనిపించడం విశేషం.</p>
<p>అభినయము &#8211; ’ణీఙ్’ ప్రాపణే అన్న ధాతువుకు &#8220;అభి&#8221; ఉపసర్గతో ’అభినయము’ అన్న శబ్దం సిద్ధిస్తుంది. ప్రయోగమును ప్రాపింపజేయునది &#8211; ప్రాపణము లేదా నయము. అభినయము &#8211; అంటే రూపక అర్థాన్ని సామాజికులకు చేరవేసే ప్రక్రియ.(Act of communication) ఈ అభినయము &#8211; నాట్యశాస్త్రం ప్రకారం నాలుగు విధాలు.</p>
<p>౧. ఆంగికము</p>
<p>౨. వాచికము</p>
<p>౩. సాత్వికము</p>
<p>౪. ఆహార్యము</p>
<p>&nbsp;</p>
<p>వరూధిని వీణ వాయిస్తున్నప్పుడు ఆమె కంకణాల ఝణఝణస్ఫూర్తితో కదులాడే హస్తాలకదలిక ఆంగికాన్ని, ముద్దులు నటించే జిలిబిలిపాట &#8211; వాచికాన్ని, రతిపారవశ్యపు అరమోడ్పు కనుదోయి &#8211; సాత్వికాభినయాన్ని, ధరించిన చీర, కావిరంగు అంగదట్టమూ ఆహార్యాన్ని &#8211; సూచిస్తున్నాయి.  వరూధిని చేత పలికించిన వల్లకీస్వరనాదం, ఆమె పారవశ్యవిభ్రమం ఇత్యాది అభినయాలన్నీ కలిపి జాలువారిన ఈ పద్యం ఆ ఘట్టాన్ని మొత్తం కాంతిమంతం చేస్తోంది.</p>
<p>శ్రీకృష్ణరాయలు ఓ మారు కొలువులో సంస్కృతాంధ్రాలలో కవిత్వం చెప్పి గండపెండెరం కొమ్మంటే, పెద్దన లేచి సుదీర్ఘమైన ఉత్పలమాలిక చెప్పాడని ఒక ఉదంతం. ఆ ఉత్పల మాలిక ఇలా సాగుతుంది.</p>
<p>పూఁత మెఱుంగులుం బసరుపూఁప బెడంగులుఁ జూపునట్టివా</p>
<p>కైతలు? జగ్గు నిగ్గు, నెనగావలెఁ గమ్మన గమ్మనన్వలెన్</p>
<p>&#8230;</p>
<p>&nbsp;</p>
<p>అలవోకగా నిండు పేరోలగంలో ధారాసదృశంగా, రసరమ్యంగా కవిత చెప్పిన పెద్దన వరూధిని ఘట్టంలోనూ సద్యః స్ఫూర్తిగా, గమ్ము, గమ్మను సువాసనలీనుతూ ఈ సీసపద్యాన్ని పలికించాడనుకోవడంలో అనౌచిత్యం ఉండరాదు.</p>
<p style="text-align: center;">***</p>
<p>పెద్దన పద్యాన్ని గురించి కొందరికి ఒక అనుమానం రావచ్చు. ఇందులో ఏమున్నది. ప్రబంధస్థాయి అంగాంగ వర్ణన కదా అని. ఇక్కడ ఉన్నది అంగాంగ వర్ణన కాదని, కథలో భాగమైన ఓ అప్సర, మహాభోగిని మానసిక అవస్థకు దర్పణమని మనవి. స్త్రీ శారీరక సౌందర్యాన్ని సూచించినా అది రసికతను తప్ప కాముకత్వాన్ని సూచించడం లేదని గమనించాలి. ఈ విషయసంబంధంగా క్షేమేంద్రాచార్యుని ఔచిత్యవిచారచర్చలో ఆచార్యుడు పరిహార్యమని సూచించిన ఒక శ్లోకాన్ని గమనించాలి.</p>
<p>&nbsp;</p>
<p>ఊరుమూలనఖమార్గపఙ్క్తిభిస్తత్ క్షణం హృతవిలోచనో హరః |</p>
<p>వాససః ప్రశిథిలస్య సంయమం కుర్వతీం ప్రియతమామవారయత్ ||</p>
<p>(కుమారసంభవం &#8211; ౮.౮౭)</p>
<p>&nbsp;</p>
<p>కాళిదాసు చేసిన ఈ వర్ణన మిక్కిలి అశ్లీలంగా ఉందని క్షేమేంద్రుడు ఉటంకించాడు. ఆది దంపతుల శృంగారాన్ని ఇలా వర్ణించిన నేపథ్యంలో, ఓ భోగిని, అప్సరస మానసికావస్థకు దర్పణమైన పెద్దన కవిత, ఔచిత్యవంతంగానూ, ఎంతో హుందాగా ఉన్నదనాలి. అల్లసాని పెద్దన గారి ఈ పద్యం గురించి పుట్టపర్తి నారాయణాచార్యుల వారు రెండు భిన్న వ్యాసాలలో ప్రస్తావించారు. వారి వివరణలో రెండు వాక్యాలు.</p>
<p>&#8220;తరుణాంగుళి, తతనితంబము, రతిపారవశ్యవిభ్రమము, ప్రౌఢి, జిలిబిలిపాట, ఇంపుతళుకొత్తు &#8211; వంటి శబ్దములు ధ్వనిపుష్టిచే వానాకాలమునందలి మయూరములవలె మదించియున్నవి. ఆంధ్రభాషయందు అరుదుగా గానఁబడు నతి మనోహరములగు పద్యములలో నిదియొకటి యనుటకేమాత్రము సందేహమును లేదు&#8230;.&#8221;</p>
<p>పుట్టపర్తి వారికే కాదు, సహృదయులకెవరినైనా ఝల్లుమనిపించి, మనసు మురిపించే ప్రబంధ కవిత యిది. కవి యొక్క భావావేశం కవిత్వం ద్వారా అంతే సాంద్రంగా పాఠకుడిని చేరడమే ఉత్తమకవిత లక్షణమని నిర్వచించుకుంటే, ఈ పద్యంలో ఆ లక్షణం జిగేలుమనే కాంతితో కనిపిస్తుంది.</p>
<p style="text-align: center;">***</p>
<p><strong><span style="text-decoration: underline;">ముగింపు</span></strong><strong><span style="text-decoration: underline;">:</span></strong></p>
<p>సా వై పశ్చాద్వరీయసీ స్యాత్ | మధ్యే సంహ్వరితా పునః పురస్తాద్ ఉర్వి ఏవమేవ హి యోషాం ప్రశంసన్తి పృథుశ్రోణీర్విమృష్టాన్తరాంసా మధ్యే సంగ్రాహ్యేతి జుష్టామేవైనామేతద్దేవేభ్యః కరోతి |</p>
<p>(శతపథ బ్రాహ్మణం &#8211; ౧.౨.౫.౧౬)</p>
<p>ఆ యజ్ఞవేదిక పడమర (దిగువ) వైపు విశాలంగా ఉండాలి. ఆపై మధ్యన సన్నదై, తూరుపుకు వెళ్ళే కొద్దీ విశాలమవుతూ సాగాలి. ఎలాగంటే జఘన భాగాన విశాలంగా,భుజాలకు మధ్య కుంచించుకుని, మధ్యభాగాన సన్నగా ఉండే స్త్రీ ఆకారంలా. దేవుళ్ళకు ప్రీతికరంగా యజ్ఞకుండాన్ని నిర్మించాలి.</p>
<p>అల్లసాని పెద్దన &#8211; కవిత్వయజ్ఞానికై వరూధిని అన్న దేవతాస్త్రీ తతనితంబ ప్రస్తావనతో చేసిన కమనీయకల్పన కాబోలు మనుచరిత్రలోని ఆ పద్యం.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=11751</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
		</item>
		<item>
		<title>రూపు</title>
		<link>http://vaakili.com/patrika/?p=11174</link>
		<comments>http://vaakili.com/patrika/?p=11174#comments</comments>
		<pubDate>Tue, 31 May 2016 21:58:36 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[రవి E.N.V]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=11174</guid>
		<description><![CDATA[అనగనగా - గిరిక అనే ఓ అందమైన తెనుగు ప్రబంధనాయిక. ’అందమైన’ అంటే సాదా సీదా అందం కాదు. వెన్నెల వెలుగుకే తట్టుకోలేక ఎలుగెత్తి శోకాలు పెట్టేంత సుకుమారి. జ్యోతిష్య,వ్యాకరణాది శాస్త్రాలను ఔపోసన పట్టిన మహా పండితుని కలం నుంచి జాలువారిన ముగ్ధ. సంస్కృతంలో అయితే ’తన్వి’. ఆ అమ్మాయి కోనలమధ్యన కేళీమందిరంలో కూర్చుని వీణ వాయిస్తూంది. ఆ వీణానాదాన్ని అధిష్టానపురపు రాజు విన్నాడు. ఆ అమ్మాయి ఆనవాళ్ళు కనుక్కుని రమ్మని తన అనుంగుమిత్రుణ్ణి పంపినాడు. ఆ నర్మసచివుడు వచ్చి, ఆ అమ్మాయిని కాస్తా చూశాడు. చూసి వచ్చి తన మిత్రుడు, యజమాని అయిన మహారాజుకు ఆమె అందం గురించి సుదీర్ఘంగా చెప్పాడు. ]]></description>
			<content:encoded><![CDATA[<p><span style="text-decoration: underline;"><strong>ప్రస్తావన</strong></span></p>
<p>అనగనగా &#8211; గిరిక అనే ఓ అందమైన తెనుగు ప్రబంధనాయిక. ’అందమైన’ అంటే సాదా సీదా అందం కాదు. వెన్నెల వెలుగుకే తట్టుకోలేక ఎలుగెత్తి శోకాలు పెట్టేంత సుకుమారి. జ్యోతిష్య,వ్యాకరణాది శాస్త్రాలను ఔపోసన పట్టిన మహా పండితుని కలం నుంచి జాలువారిన ముగ్ధ. సంస్కృతంలో అయితే ’తన్వి’. ఆ అమ్మాయి కోనలమధ్యన కేళీమందిరంలో కూర్చుని వీణ వాయిస్తూంది. ఆ వీణానాదాన్ని అధిష్టానపురపు రాజు విన్నాడు. ఆ అమ్మాయి ఆనవాళ్ళు కనుక్కుని రమ్మని తన అనుంగుమిత్రుణ్ణి పంపినాడు. ఆ నర్మసచివుడు వచ్చి, ఆ అమ్మాయిని కాస్తా చూశాడు. చూసి వచ్చి తన మిత్రుడు, యజమాని అయిన మహారాజుకు ఆమె అందం గురించి సుదీర్ఘంగా చెప్పాడు. అందులో భాగంగా ఆ అమ్మాయిని నఖశిఖపర్యంతమూ వర్ణించినాడు. అలా చెప్పి కడకు ఇలా అన్నాడు</p>
<p>ఉ||<br />
స్వైరవిహారధీరలగు సారసలోచనలున్నచోటికిన్<br />
భోరున లాతివారు చొరఁబూనినచో రసభంగమంచు నేఁ<br />
జేరక పువ్వుఁదీవియల చెంతనె నిల్చి లతాంగిరూపు క<br />
న్నారఁగఁ జూచివచ్చితి నవాంబురుహాంబక నీకుఁ దెల్పగాన్.<br />
(వసుచరిత్రము &#8211; 2.55)</p>
<p>నవ అంబురుహ అంబక = క్రొందామరల వంటి కనులు కలిగిన ఓ మహారాజా!<br />
స్వైరవిహారధీరలగు = స్వేచ్ఛావిహారంలో ప్రౌఢలయిన<br />
సారసలోచనలు = పంకజాక్షులు<br />
ఉన్నచోటికిన్ = నివాసం ఉన్న స్థలానికి<br />
భోరున = హఠాత్తుగా<br />
లాతివారు = అన్యులు<br />
చొరన్ పూనినచో = చొచ్చికొని పోవడానికి ప్రయత్నించినప్పుడు<br />
’రస’ భంగము అంచున్ = స్వారస్యము చెడుతుందని<br />
నేన్ చేరక = నేనక్కడికి వెళ్ళక<br />
పువ్వున్, తీవియల = పూలు మరియూ తీగల యొక్క<br />
చెంతనె = సమీపాన<br />
నిల్చి = నిల్చి<br />
లతాంగిరూపు = ఆ తీవవంటి శరీరముగల చిన్నదాని రూపు<br />
కన్నారఁగన్ చూచి = నేత్రములకు తృప్తికరమగునట్టు చూచి<br />
నీకున్ తెల్పగాన్ = నీకు వివరించుటకు<br />
వచ్చితి = వచ్చినాను.</p>
<p>ఓ వెల్లతామర వంటికనులు గలిగిన మహారాజా! తమ నెలవులో స్వేచ్ఛావిహారంలో మునిగిన సారసలోచనలు ఉన్న చోటికి అన్యులు చొరబడరాదు. అలా వెళితే రసభంగమవుతుంది. అందుకని నేను ఆమె సమీపానికి వెళ్ళి ఆమె క్రీడలకు భంగం చేయక, దాపుల నున్న పూలతీవెల మాటున నిలబడి కనులనిండుగా ఆ అమ్మాయి&#8221;రూపు&#8221;ను నీకు తెలుపడానికి చూచి వచ్చినాను.</p>
<p>భట్టుమూర్తి లేదా రామరాజభూషణుడు రచించిన వసుచరిత్రమహాప్రబంధం లోని ద్వితీయాశ్వాసపు ఘట్టం ఇది. అల్లసాని పెద్దనాదుల సమక్షంలో సాహిత్యపు విద్యలను నేర్చి, సంగీత, జ్యోతిష్య శాస్త్రాది విద్యలను కరతలామలకం చేసుకుని మహాప్రతిభతో, అసమాన వ్యుత్పత్తితో రచించిన గ్రంథం వసుచరిత్రము. దాదాపు ప్రతిపద్యంలోనూ ఏదో ఒక విధమైన చమత్కారాన్ని, లేదా శ్లేషనూ నిర్వహించిన కవితాగరిమకు సాక్షి ఈ కావ్యం. ఒక్కో పద్యంలో &#8211; అర్థమవుతున్న కొద్దీ పొరలుపొరలుగా విడివడే అనేక భావాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈ సంవిధానం సంస్కృతంలో బాణభట్టు కాదంబరి కావ్యంలోనూ, కాళిదాసు కావ్యాదులలోనూ కనిపిస్తుంది కానీ తెనుగు కావ్యంలో అప్పటికి బహుశా రాలేదు. వసుచరిత్ర ఈ విషయంలో సంస్కృతకావ్యాలను ఎకసెక్కం గలదు &#8211; అంటే అతిశయోక్తి కాదు.</p>
<p>తిరిగి పై పద్యాన్ని చూస్తే- వ్యాఖ్యాతలు చెప్పిన విశేషాలు ఇవి.</p>
<p>1.’సారసలోచనలు’ &#8211; ఇది సాభిప్రాయపూర్వకమైన ప్రయోగం. &#8220;సారసలోచన&#8221; లను అన్యులు చూస్తే &#8220;రస&#8221; భంగమవుతుంది. అంటే సా&#8221;రస&#8221;లోచన &#8211; సాలోచన అవుతుంది. బొమముడితో కినుకవహిస్తుంది. ఇది ఒక అందమైన శబ్దచిత్రం.</p>
<p>2. సారసలోచనలు = సార + సలోచనలు కూడాను.</p>
<p>3. రాజుగారి నర్మసచివుడు ’సారసలోచన’ను &#8211; ’నవాంబురుహ అంబకు’డైన తన ప్రభువుకు కట్టబెడుతున్నాడు. అంటే పద్మాలవంటి కన్నులు కలిగిన అమ్మాయి గురించి కొంగ్రొత్తతామరల కనులున్న తన ప్రభువుకు వివరిస్తూ, ఈడూ-జోడు కుదిరిందని పాఠకులకు సూచిస్తున్నాడు.</p>
<p>4.’లతాంగి’ అనడమూ సాభిప్రాయమే. ఎందుకంటే చెబుతున్న ఆ కథానాయిక తండ్రి కోలాహలుడనే ఒక కొండ. ఆ అమ్మాయి తల్లి శుక్తిమతి అనే వాగు. వాగుతల్లికి, కోన తండ్రికి పుట్టినది కాబట్టి ’లతాంగి’ అయింది.</p>
<p>5. ’పువ్వుఁదీవియల’ చెంత నర్మసచివుడు నిలబడి ’లతాంగి’రూపు చూడటం &#8211; ఇది మరొక చమత్కారం.</p>
<p>6. లతాంగి అన్నది ఒక రాగం పేరు కూడాను.సంగీతమర్మజ్ఞుడైన రామరాజభూషణుడు ఆ రాగపు పేరు అమ్మాయికి పెట్టటం వెనుక కూడా సాభిప్రాయం ఉండే ఉంటుంది. ఇది సంగీతజ్ఞులైన వ్యాఖ్యాతలు చెప్పాలి.</p>
<p>7. చాటుగా చూచిన కార్యానికి &#8216;రసభంగమ&#8217;న్న కారణం చూపబడింది కనుక కావ్యలింగాలంకారము.</p>
<p>8. నవాంబురుహ అంబక &#8211; అంటే &#8211; క్రొందామరల వంటి కన్నులుగల మహారాజా అన్న అర్థమే కాక మరి రెండు అర్థాలు ఉన్నాయి.<br />
అంబురుట్ = నీటియందు పుట్టినది. (తామర పువ్వు, అగ్ని)<br />
అంబకము = కన్ను, బాణము</p>
<p>అంబురుహ-అంబక అంటే తామరను బాణముగా కలిగిన వాడు &#8211; మన్మథుడు (నవాంబురుహాంబక = నవమన్మథుడు)<br />
అంబురుహాంబక = నీటియందు పుట్టిన అగ్నిని కన్నుగా గలిగిన వాడు (నవాంబురుహాంబక = వెలిగే అగ్నియే నేత్రముగా గలిగినవాడు)<br />
వసురాజును చిచ్చరకంటిగా ఉద్యోతించి భట్టుమూర్తి చేసిన ప్రయోగం సాభిప్రాయమని, ఆ ప్రయోగం వెనుక గల స్వారస్యాన్ని నారాయణాచార్యులవారు అద్భుతంగా వివరించారు. వారి విమర్శను విమర్శతరంగిణి పుస్తకంలో చదువుకోవచ్చు.</p>
<p>9. &#8216;సారసలోచన &#8216; లను లాతివారు &#8211; అనగా అన్యులు చూస్తే రసభంగమవుతుంది. స్వజాతి కి చెందిన నవాంబురుహాంబకుడు మాత్రము సమీపమునకు పోవచ్చుననుట.</p>
<p>పద్యంలోని మిగతా విశేషాలు అటుంచితే &#8211; ’లతాంగిరూపు’ అనే సమాసంలోని &#8220;రూపు&#8221; గురించి, ఆ శబ్దం తాలూకు నేపథ్యానికి నాటి చారిత్రక, రాజకీయ, సాంఘిక వాతావరణాన్ని అన్వయించడానికి చేసిన ప్రయత్నం ఈ వ్యాసం.</p>
<p>లతాంగిరూపు = అంటే లతాంగి యొక్క ఆకారవిశేషము, లేదా లతాంగి యొక్క సౌందర్యము అని సాధారణంగా స్ఫురించే అర్థం. వసుచరిత్రకు అద్భుతమైన విమర్శ వ్రాసిన వజ్ఝల చినసీతారామశాస్త్రి గారు, ఈ కావ్యానికి అద్భుతమైన టీక కూర్చిన శేషాద్రి రమణ కవులున్నూ &#8220;లతాంగిరూపు&#8221; అంటే &#8220;ఆ యువతి యొక్క సౌందర్యము&#8221; అనే అర్థం చెప్పారు. వసుచరిత్ర కావ్యాన్ని అద్భుతంగా విమర్శించిన పుట్టపర్తి నారాయణాచార్యుల వారూ, రవ్వా శ్రీహరి గారూ, రాజన్న కవి గారు తదితరులు మాత్రం ఇక్కడ ఒక విచిత్రమైన, విశేషమైన అర్థాన్ని చెప్పారు.<br />
ఆ వ్యాఖానాల్ని ఇక్కడ పరిశీలిద్దాము.</p>
<p>1. గిరికాదేవి వృత్తాంతమును చెప్పినంతనే వసురాజామెను వివాహమాడనెంచెను. ఆమె యవివాహితయా? కాదా? అన్న ప్రశ్న యేల తట్టలేదు? దీనినిఁగూడ నర్మసఖుడే పరిహరించినాఁడు. అతఁడామె ’రూపు’ ను జూచినాఁడు. అవివాహితలైన స్త్రీలు మెడలో ’రూపు’ అనునొక ఆభరణమును గట్టికొనుచుండిరట. &#8211; ఇది పుట్టపర్తి వారి విశ్లేషణ. (ఆచార్యుల వారి విశ్లేషణ ప్రకారం &#8211; లతాంగి &#8216;రూపు &#8216; అనే విశేషాన్ని సాభిప్రాయంగా చెప్పిన కారణాన ఇక్కడ పరికరాలంకారం.)</p>
<p>2. రూపు అన్నది ఒక ఆభరణం పేరు. మద్దెల ఆకారములో అర అంగుళము నిడివిగల బంగారముతో చేసిన పూస. పెండ్లి కానున్న కన్యలు దీనిని మెడలో ధరించెదరు. &#8211; ఆచార్య రవ్వా శ్రీహరి (వీరి ఊహకు మూలం పుట్టపర్తి నారాయణాచార్యుల వారి వ్యాసమట).<br />
<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/05/roopu.jpg"><img class="aligncenter size-full wp-image-11176" title="roopu" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/05/roopu.jpg" alt="" width="168" height="174" /></a></p>
<p>3. ’రూపు’ శబ్దముపైన ఒక లక్షణామూలకమైన వ్యంగ్యము నిర్వచింపవచ్చును.బొడ్డు లేని డాలరుగల సువర్ణహారమునకు &#8220;రూపు&#8221; అని పేరు. దీనిని కన్య రజస్వల అయిన తొమ్మిదవ రోజున మెడలో వేయుదురు. డాలరుపైన సరస్వతీవిగ్రహముండును. వివాహ సమయమున ఈ &#8220;రూపు&#8221; ఆభరణమును తీసి తాళి కట్టింతురు. రాయలకాలములో, ప్రత్యేకించి పెనుగొండ ప్రాంతములోని సంప్రదాయమిది. &#8211; రాజన్న కవి.</p>
<p>4. రూపు శబ్ద ప్రయోగముచే గిరిక యవివాహిత యని సూచింపబడెననియు, రూపన యవివాహితలు ధరించు ఆభరణవిశేషమనియు దెలియవచ్చుచున్నది. రూపులను నాణెములను బాలికలు పూసలతో ధరించుట మనకు తెలిసిన విషయమే. &#8211; కిళాంబి రాఘవాచార్యులు గారు గారు (1931)</p>
<p><span style="text-decoration: underline;"><strong>రూపు- తీగె</strong></span></p>
<p>మెడచుట్టూ వేసుకునే ఆభరణాన్ని సంస్కృతంలో కంఠిక లేదా గ్రైవేయకం అన్నారు. కంఠిక అనకుండా, గళాభరణము (మెడలో వేసుకునే నగ) ను పోతన &#8211; ఆంధ్ర భాగవతంలో వామనావతార ఘట్టంలోని ప్రముఖపద్యంలో ప్రస్తావించాడు.</p>
<p>మ||<br />
రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రంబై, శిరోరత్నమై,<br />
శ్రవణాలంకృతియై, గళాభరణమై, సౌవర్ణకేయూరమై,<br />
ఛవిమత్కంకణమై, కటిస్థలి నుదంచద్ఘంటయై, నూపుర<br />
ప్రవరంబై, పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.<br />
(8-623)</p>
<p>కంఠిక తెలుగులో ’కంటె’ లేదా ’కంటు’ గా మారింది. కంటె అంటే &#8211; గట్టినగ. కంటె ను మగవాళ్ళు కూడా ధరిస్తారు. ఈ కంటె &#8211; జానపదుల వ్యవహారంలో కుత్తికకంటు, లేదా కుత్తికంటు . అంటే వదులుగా ఉన్న గొలుసు కాకుండా, గొంతుకు చుట్టూతా కాస్త బిగుతుగా వేసుకునే నగ. గొంతు క్రింద ఉన్న చిన్న ’గుంత’ కు హిక్కాసూత్రమని పేరు. దానికి పైభాగానే ఈ కంటె అనే నగ అమరి ఉంటుంది.</p>
<p>ఆముక్తమాల్యదలో మాలదాసరి &#8211; తులసిమాలలు తొడిగిన కంటెను మెడలో వేసుకుంటాడు.</p>
<p>&#8230;<br />
..<br />
గీ||<br />
వలుద వనమాలకంటె యు, మలిన తనువుఁ<br />
బట్టె తిరుమన్ను, బెదరుఁ గెంబుట్టుఁ జూపుఁ<br />
బసుపుఁబొడి తోలు వల్వంబు నెసకమెసఁగ<br />
వచ్చు సేవింప సురియాళు వైష్ణవుండు. (ఆముక్తమాల్యద 6-6)</p>
<p>మెడలో తులసిపూసలు కూర్చిన ఇత్తడి నగ, మురికి శరీరం, బెదురుచూపులు, పసుపు రంగు సెల్లా (ఉత్తరీయం).ఇదీ మాలదాసరి వర్ణన.</p>
<p>రామప్ప గుడిలో కుడ్యసుందరి మెడలో కూడా &#8220;కంటె&#8221; కనిపిస్తుంది. గమనించండి.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/05/kante.jpg"><img class="aligncenter size-full wp-image-11177" title="kante" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/05/kante.jpg" alt="" width="744" height="615" /></a></p>
<p>ఈ &#8220;కంటె&#8221; అనే ఆభరణం గుండ్రంగా ఉంటే రూపు. సాఫుగా (చదునుగా) ఉంటే తీగ. రూపు ను పెళ్ళికాని అమ్మాయిలు ధరిస్తే, తీగెను పెళ్ళయిన స్త్రీలు ధరిస్తారు.</p>
<p>&#8220;రూపు&#8221; శబ్దానికి &#8220;ఆభరణం&#8221; అని అనుమానాస్పదమైన అర్థం వచ్చే సందర్భం అన్నమయ్య కీర్తనలో ఒకచోట కనిపిస్తుంది.</p>
<p>॥పల్లవి॥<br />
పరతత్త్వం బగు బాలుఁడు<br />
పరిపరి విధముల బాలుఁడు<br />
॥చ॥<br />
వెన్నలు దాఁకఁగ వేట్లాడుచును<br />
సన్నపు బడుచుల సంగడిని<br />
కన్నెలు దూరఁగఁ గలకల నవ్విన<br />
పన్నిన మాయల బాలుండు<br />
॥చ॥<br />
బచ్చన రూపు ల పాయపుఁ బడుచులు<br />
నిచ్చలుఁ గొలువఁగ నెమ్మదిని<br />
నచ్చిన వేంకట నగమున నాడెడి<br />
పచ్చిల పదకపు బాలుండు</p>
<p>పెనుగొండ ప్రాంతంలో అమ్మాయిల మెడలో &#8220;రూపు&#8221; తొడగటం ఆ అమ్మాయి &#8211; కన్య, అవివాహిత అని సూచించటానికి గుర్తు. ఆ &#8220;రూపు&#8221; ను ధరించడానికి సామాజిక కారణం ఉన్నది. ఇప్పటి ఒక తరం మునుపు వరకూ, (కొంతవరకూ ఇప్పుడూనూ) అక్కడక్కడా ధనవంతుల ఇళ్ళలో పెళ్ళి సంబంధాలు కుదుర్చడానికి కొందరు బ్రాహ్మలు ఉండేవారు. వీరిని పెళ్ళిళ్ళ పేరయ్యలు అనేవారని విజ్ఞులైన పాఠకులకు తెలిసిన విషయమే. సమాజంలో ధనవంతులు కాక సామాన్యులూ ఉన్నారు. వాళ్ళ ఇళ్ళలో పెళ్ళిళ్ళు జరగడానికి, వెనకటికి &#8211; కొంత తతంగం ఉండేది. అమ్మాయి రజస్వల అయిన తర్వాత మెడలో ’రూపు’ అనే నగను అలంకరించేవారు. రూపు &#8211; అన్న పేరు కూడా అమ్మాయి రూపలావణ్యాలను చూడమనే సంకేతానికి గుర్తు. ఏదైనా జాతర/మెరవణి లో, పెళ్ళిళ్ళలో, ఈ పెళ్ళికాని అమ్మాయిల మెడలో ’రూపు’ ను ఎవరైనా యోగ్యుడైన యువకుడు, లేదా యువకుని పెద్దలు చూడడం జరిగితే, ఆ యువకుని తల్లిదండ్రులు, ఈ అమ్మాయిని కన్య అని నిర్ధారించుకుని, అమ్మాయి తల్లితండ్రులను తమ పుత్రుని వివాహార్థమై సంప్రదించే అవకాశం ఉండేది. అంటే &#8211; జాతరలలో ఎవరైనా ఈ నగ ఉన్న అమ్మాయిని చూసినప్పుడు పరోక్షంగా పెళ్ళిచూపులు చూసి, ఆ తర్వాత ఆ అమ్మాయి పెద్దలను సంప్రదించేలా ’రూపు’ అనే నగను అలంకరింపజేయడం ఒక ఏర్పాటు. పెళ్ళయిన తర్వాత ’రూపు’ అన్న నగను తీసి వేసి, ’తీగె’ అన్న మరొక్క నగను వేస్తారు. ఇది పుట్టింటి వాళ్ళు వేస్తారు. తీగె ధరించటం తప్పనిసరి. మాంగల్యం పరులకు కనిపించరాదు కాబట్టి, తీగె ద్వారా అమ్మాయికి పెళ్ళయిందని సూచించడం ’తీగె’కు ప్రధానమైన ఉపయోగం. &#8220;మెడలో తీగె లేకపోతే, వంశం తీగ సాగద&#8221; ని ఒక పలుకుబడి. ఈ రెండు ఆచారాలు ఆనాడు పెనుగొండ ప్రాంతంలో, ప్రధానంగా కాపుల ఇళ్ళల్లో లేదా ద్విజేతరుల ఇళ్ళల్లో ఉన్నవని గ్రహించాలి. ఇతర వర్ణాలలోనూ ఈ ఆచారం ఉన్నది కానీ నిర్బంధంగా ఉన్నట్టు ఆధారాలు వ్యాసకర్తకు దొరకలేదు.</p>
<p>తీగెకు నానుతీగ, నాను అన్న నామాంతరాలు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్నవి. మెరుగుపెట్టిన తీగెకు మొగపుతీగ అని వ్యవహారనామం.<br />
&#8230;..<br />
&#8230;..<br />
విటుల మన్మథు డేయు &#8211; విరి మొగ్గ తూపు<br />
నటన గుమ్మడి గింజ &#8211; నావమ్ము తీర్చె<br />
బసిడి ముత్యాల నొ &#8211; ప్పగ పూర్ణ చంద్రు<br />
తవమించు చెవుల తే &#8211; టంకాలు చేర్చె<br />
మొగపు తీగె కు చెంత &#8211; ముత్యంపు కొలికి<br />
జగిమణుల్ మిగులు మం &#8211; జిడి తాళి జేసె<br />
పుంజాల దండ దా &#8211; పున నేవళమ్ము<br />
రంజిల్లు భన్నవ &#8211; రమ్ము క్రీడించ<br />
యిన్ని సిమ్ములకును &#8211; వన్నె బెట్టినటు<br />
మూడు వేల్ వెలసేయు &#8211; ముక్కఱ బెట్టె<br />
(సుభద్రాకల్యాణం &#8211; 27)</p>
<p>తాళ్ళపాక తిమ్మక్క ’సుభద్రాపరిణయం’లో సుభద్రకు తొడిగిన ఆభరణాల్లో &#8220;మొగపు తీగె&#8221; ఒకటి. (కవయిత్రి ఈ సందర్భంలో &#8211; &#8220;మొగపు తీగె&#8221; ను పెళ్ళయిన స్త్రీకి కాక పెళ్ళికాని కన్య &#8211; సుభద్రకు తొడగటం గమనార్హం. ఇది పొఱబాటు కావచ్చు. లేదా వివాహితకు మాత్రమే వర్తించే ఆచారం కవయిత్రి కాలానికి/ప్రాంతానికి ఉండకపోవచ్చును)</p>
<p>కూచిమంచి తిమ్మకవి మాత్రం మొగపు తీగెను పెళ్ళయిన స్త్రీకి కట్టబెట్టి ఔచిత్యం పాటించాడు.</p>
<p>కం||<br />
పడతుక యొక్కతె యపుడా<br />
యొడయని బొడగనగ వచ్చె యొడ్డాణమునే<br />
మెడనిడి మొగపుల తీగియ<br />
నడుమున నిడి యలతి వలపు నాటుకొనంగన్. (రసికజన మనోభిరామం &#8211; 89)</p>
<p>రహదారిలో యువరాజు వెళుతున్నాడు. అతణ్ణి చూసే తత్తరపాటులో మొగపు తీగెను నడుముకు వడ్డాణంలా చుట్టుకుంది. మొగపు తీగె, వడ్డాణం ఒకే విధమైన ఆకారంలో ఉంటాయని ఈ పద్యం ద్వారా తెలుస్తుంది. ఇది సంస్కృత భాగవతంలో శ్రీకృష్ణుని మధురానగరవిహారఘట్టంలోనూ, మాఘుని శిశుపాలవధం లోనూ ఉన్న శ్లోకాలకు అనుకరణ.</p>
<p style="text-align: center;">***</p>
<p>ఈ నేపథ్యంతో తిరిగి మన &#8220;స్వైరవిహార ధీరలగు&#8230;&#8221; పద్యానికి వద్దాం. ’రూపు’ అన్న శబ్దానికి అర్థం అవివాహిత అలంకరించుకున్న ఆభరణమే అని అనుకుంటే &#8211; పద్యానికి భావం ఇలా పరిణమిస్తుంది.</p>
<p>నర్మసచివుడు అమ్మాయిని కనులారా ఎందుకు చూశాడు? &#8220;అమ్మాయి మెడలో అలంకరించుకున్న నగ &#8211; తీగె యా లేక రూపా?&#8221; అని తెలుసుకునేందుకు, కనులారా చూశాడు. పైగా నర్మసచివుడు ఆమెకు కాస్త దూరంగా పువ్వుఁదీవియల మధ్య ఉన్నాడు కాబట్టి, సాధారణంగా జాతరలలో ప్రదర్శించే ఆభరణాన్ని ఇప్పుడు పరులెవ్వరూ లేని చోట ఆమె వేసుకుంది కాబట్టి, తన రాజుకు కట్టబెట్టడానికి ఆ యువతి అవివాహితయే అని ’డబుల్ కన్ఫర్మ్’ చేసుకుందుకు అలా చూసి ఉంటాడని అనుకోవాలి. ఈ రూపు/తీగె (కుత్తుక కంటె) &#8211; బంగారే కానవసరం లేదు. కంటె &#8211; ఇత్తడి, పంచలోహంతోనూ చేసుకుని ఉపయోగించడం ఉండేది. (రాజన్న కవి గారు ’రూపు’ అంటే సరస్వతి బొమ్మ గల సువర్ణహారమని స్పష్టంగా చెబుతున్నారు. ఇది ఆసక్తికరం. దురదృష్టవశాత్తూ కవి గారు చెప్పిన వివరాల ఆనవాళ్ళు వ్యాసకర్తకు దొరకలేదు.)</p>
<p style="text-align: center;">***</p>
<p>కానీ జాగ్రత్తగా చదువుకుంటూ వస్తే &#8211; ఆ ఘట్టంలో అంతకు మునుపే కవి రామరాజభూషణుడు &#8211; నర్మసచివుడు గమనించిన స్త్రీ (గిరిక) &#8211; కన్యయే అని చెప్పి, కన్య, తరుణి అన్న శబ్దాలు పద్యాలలో ప్రయోగించినాడు.</p>
<p>సీ|| కన్నెపాదము లజుఁ గన్న మేటికి నైన బాలజంఘలు వరశాలి కైనఁ &#8211; (2-51)</p>
<p>చం||<br />
తరువుల పొంతఁ బొంచి వసుధావరమిత్రుఁడు గాంచె నచ్చటం<br />
దరుణిఁ దమోవినీలకచఁ దామరసోదరసోదరప్రభం<br />
దరళవిలోచనం దతనితంబఁ దటిన్నిభగాత్రవల్లరిం<br />
దరుణశశాంకఫాల నొకతన్విఁ దరంగవళిం దలోదరిన్. (2-25)</p>
<p>చెట్లచాటున పొంచి, వసురాజు మిత్రుడు ఆ మణిమందిరాన</p>
<p>తరుణిని = యుక్తవయసులో ఉన్న కన్యను<br />
తమోవినీలకచను = చీకటివలే నల్లని కురులు గలదానిని<br />
తామరస ఉదర సోదరప్రభన్ = పుప్పొడి సమానమైన కాంతిగలదానిని<br />
తరళవిలోచనన్ = చంచలమైన కనులదానిని<br />
తతనితంబన్ = విశాలమైన కటిస్థలము గలిగిన దానిని<br />
తటిన్నిభగాత్రవల్లరిన్ = మెరుపుతో సమానమైన కాంతి గలదానిని<br />
తరుణశశాంకఫాలన్ = నెలవంక వంటి ఫాలభాగము గలిగినదానిని<br />
తరంగవళిన్ = నడుమున అలలవంటి మడతలు గలిగినట్టి దానిని<br />
తలోదరిన్ = చదునైన పొత్తికడుపుగలదానిని<br />
తన్విన్ = అందమైన తనువు గలదానిని గాంచినాడు.</p>
<p>(పైని పద్యంలో విశేషం కనిపిస్తూనే ఉంది. ’తన్వి’ కి గల విశేషణాలన్నిటిని ’త’కారాదిగా గల పదబంధాలచేత కవి కూర్చినాడు. ఎందుకు? తన్వి &#8211; అంటే &#8220;అందమైన తనువు&#8221; గలది. ఇది సాధారణ వ్యుత్పత్తి. తన్వి &#8211; అంటే &#8211; &#8220;త్&#8221; + &#8220;అను&#8221; + యస్యాః సా &#8211; అని విగ్రహవాక్యం సాధ్యమట. అంటే &#8220;త&#8221;కారాన్ని అనుసరించిన విశేషణములు కలిగినది కాబట్టి తన్వి అయినది. అందుకనే &#8220;తన్వి&#8221; కి గల విశేషణాలన్నిటిని &#8220;త&#8221; తో మొదలయ్యే పదబంధాలతో తయారు చేశాడు మూర్తికవి.)</p>
<p>ఇలా కన్య, తరుణి అని చెప్పటమే కాక ఇంకా -</p>
<p>మ||<br />
కమనీయాకృతియోగ్యకీర్తనములం గన్పట్టు నా శ్యామ యా<br />
సుమబాణాంబక యాయమూల్యమణి యా చొక్కంపుఁబూబంతి యా<br />
సుమనోవల్లరి యా సుధాసరసి యా సొంపొందుడాల్దీవి యా<br />
కొమరుంబ్రాయపురంభ యా చిగురుటాకుంబోఁడి నీకే తగున్.<br />
(2- 52)</p>
<p>ఆ అమ్మాయిని నఖశిఖపర్యంతం వర్ణించి చివరన నర్మసచివుడు తన ప్రభువుతో &#8211; ఆ అమ్మాయి &#8220;నీకే తగును&#8221; అని అంటాడు. ఇంత స్పష్టంగా &#8220;నీకే తగు&#8221; నని నర్మసచివుడు తేల్చి చెప్పిన తర్వాత &#8211; తిరిగి ఆ అమ్మాయి అవివాహితయే అని నొక్కి చెప్పడానికి &#8220;రూపు&#8221; అన్న శబ్దానికి కన్యలు ధరించే ఆభరణం అనే భావాన్ని వివక్షించి, మరో రెండు పద్యాల తర్వాత కవి ’రూపు’ శబ్దాన్ని ప్రయోగించాడా? అని అనుమానం వస్తుంది.</p>
<p>అలా అని పై భావానికి విరుద్ధంగా &#8211; రూపు అంటే కేవలం చూచిన స్త్రీ యొక్క ఆకారవిశేషాన్ని మాత్రమే కవి ఉద్దేశించినాడా? అదీ అదివరకే అమ్మాయిని నఖశిఖపర్యంతము శృంగారరసం చిప్పిల్లేట్టు వర్ణించిన పిదప కూడా తిరిగి పునరుక్తిగా ఆమె సౌందర్యాన్ని ప్రస్తావిస్తూ ’రూపు’ శబ్దాన్ని ప్రయోగించాడా? నారాయణాచార్యులు గారు పొఱబడ్డారా? ఇలా అనుకునీ తృప్తి పడడానికి వీల్లేదు. ఇంతకూ మూర్తి కవి ఉద్దేశించిన భావం ఏది?</p>
<p style="text-align: center;">***</p>
<p><span style="text-decoration: underline;"><strong>చరిత్ర &#8211; రాజకీయం</strong></span></p>
<p>వసుచరిత్రలో ’రూపు’ ను ధరించింది గిరిక అనబడే నాయిక. సాధారణంగా ప్రధాన నాయిక సుక్షత్రియ, దైవకన్య, అప్సరస లేదా, రాచకన్నె కావడం నాటి ప్రబంధన్యాయం. గిరిక కోలాహలుని కుమార్తె. కోలాహలుడు హిమవంతుని సుతుడు. అయితే &#8211; ’రూపు’ అన్న నగను ధరించే సాంప్రదాయం &#8211; స్థానికమైనది, సామాజికంగా ఉన్నతవర్గాలకు చెందనిదీ, నిమ్నవర్గాలలో ఉన్నదీని. గిరిక కోలాహలుని కుమార్తె. కోలాహలుడు &#8211; హిమవంతుని సుతుడు. హిమవంతుని పుత్రిక &#8211; పార్వతి అజ్ఞాత గోత్ర అని కవి ఒకచోట సూచించాడు. (అజ్ఞాతగోత్ర యనాది శక్తి సుగోత్ర&#8230;5.34). హిమవంతుని సుతుడు కోలాహలుడూ, ఆతని కుమార్తె గిరికా అజ్ఞాతగోత్రలే. మరి అటువంటి కన్యను రామరాజభూషణుడు ఎందుకు నాయికగా చేశాడు? ఈ ప్రశ్న నేటికి అసంబద్ధమేమో కానీ, ఆనాటి సాంఘికపరిస్థితుల్లో చర్చనీయమైన విషయం. వసుచరిత్రలో నాయకుడు వసురాజు &#8211; సాక్షాత్తూ ఆరవీటి రామరాయలు. వసుచరిత్ర &#8211; మనుచరిత్రకు ధీటుగా, ఆ కావ్యాన్ని అధిగమించే ప్రయత్నంతో వ్రాసిన కావ్యమని ఇప్పటికి అనేక విశ్లేషకులు తేల్చిచెప్పిన విషయమే. వసుచరిత్రలో వసురాజు, మనుచరిత్ర నాయకుడైన స్వరోచి ఇద్దరూ సమానంగా ధీరులైనప్పటికీ, కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. ఒక్క నాయకుని విషయమే కాక వసుచరిత్రలో ఇతరత్రా విషయాలకూ, మనుచరిత్రాది ప్రబంధాలకూ మధ్య వ్యత్యాసాలను గుర్తించాలంటే ఆ కాలపు చారిత్రక, రాజకీయ నేపథ్యాన్ని పరిశీలించాల్సి ఉంటుంది.</p>
<p>తెలుగు కావ్యప్రస్థానంలో ప్రబంధయుగానికి స్వర్ణయుగం శ్రీకృష్ణరాయల వారి కాలం. మనుచరిత్ర, పారిజాతాపహరణం, ఆముక్తమాల్యద, పాండురంగమహత్మ్యము వంటి అద్భుత ప్రబంధాలను రాయల వారి కాలానికి కొంత అటునిటుగా ప్రబంధకవులు మహాప్రతిభతో తీర్చినారు. ఈ ప్రబంధాలన్నీ ఏ దానికి అదే సాటి. మనోజ్ఞమైన వర్ణనలకు, అద్భుతమైన వ్యుత్పత్తికి ప్రబంధాలు ప్రసిద్ధం. దాదాపు ఈ ప్రబంధాలన్నిటిలో కథాభాగం పురాణసంబంధమైనది (ఒక్క కళాపూర్ణోదయము తక్క). ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు బ్రాహ్మణ, సుక్షత్రియుల సాంప్రదాయాలకు దగ్గరగా ఉన్నవి. ఆముక్తమాల్యద వంటి కావ్యాలలో అక్కడక్కడా వేదాంతపరమైన శాస్త్రచర్చలూ కద్దు. ఇక తిరుమల తాతాచార్యుల వంటి శాస్త్రపండితుల ప్రభావమూ నాటి సమాజంలో, సమాజరూపాలైన కావ్యాలలో తప్పలేదు. ఇతర ప్రబంధాలతో పోల్చి చూస్తే వసుచరిత్రలో ’వేదాంత, పురాణ స్పర్శ’ ఒకింత తక్కువ. వసుచరిత్రకు మహాభారతంలోని ఉపరిచరవసువు కథ ఆధారమైనా, తన కథ పురాణాన్ని, కల్పనను సమ్మేళనం చేసిన మిశ్రమ కథయని కృత్యాదిలో కవి చెప్పాడు.</p>
<p>ఉ||<br />
కేవలకల్పనాకథలు కృత్రిమరత్నము లాద్యసత్కథ<br />
ల్వావిరి పుట్టురత్నముల వారితసత్కవికల్పనావిభూ<br />
షావహపూర్వవృత్తములు సానలఁ దీరిన జాతిరత్నముల్<br />
గావున నిట్టిమిశ్రకథగా నొనరింపుము నేర్పు పెంపునన్. (1.19)</p>
<p>(పురాణాల నుండి గ్రహింపకుండా, సొంత కల్పనతో రచించిన కథావస్తుకావ్యాలు పచ్చలు, గాజురాళ్ళవంటి కృత్రిమరత్నాలు. కావున పురాణములను ఆసరాగా గొని, వాటిని సానబట్టి మిశ్రమమైన కథ రచింపమని కృతిభర్త తిరుమలరాయడు ఆనతిచ్చాడు.)</p>
<p>వసుచరిత్ర సంగీత, జ్యోతిష్య, అలంకారశాస్త్ర ప్రసంగాలకు పెట్టనిగని. శ్లేష, చమత్కారాలు, సమాసోక్తి, పర్యాయోక్తులు అనేకం. కృష్ణరాయలవారి కాలంలో అల్లసాని పెద్దన, పింగళి సూరన, నంది తిమ్మన, తెనాలి రామకృష్ణుడు, మాదయగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, ధూర్జటి &#8211; ఇత్యాది కవిదిగ్గజాలందరూ బ్రాహ్మణులు. ఇక రాయల వారిది శ్రీవైష్ణవం. వీరందరి కంటే వయసులో చిన్నవాడు, కాపు కవి అయిన భట్టుమూర్తి &#8211; ప్రతిభావంతుడు, పండితుడూ అయినప్పటికీ కృష్ణరాయలవారి కాలానికి బ్రాహ్మణకవులతో పోటీపడి తన ప్రతిభను ప్రదర్శించడానికి సరైన అవకాశాలు బహుశా దొరికి ఉండవు. దొరికినా పెద్దన, తిమ్మన గార్లను కవిత్వస్పర్ధలో ధిక్కరించే అవకాశం ఉండి ఉండదు. అలా మూర్తి కవి తన ప్రతిభను పూర్తిస్థాయిలో ఆవిష్కరింపజేసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.</p>
<p>కృష్ణరాయలు క్రీ.శ || 1530 లో గతించిన తర్వాత, ఆయన సవతి తమ్ముడైన తుళువ అచ్యుతరాయలకు సింహాసనం దక్కింది. క్రీ.శ 1530 నుంచి క్రీ.శ. 1542 వరకూ &#8211; పన్నెండేళ్ళపాటూ రాజ్యం చేసిన అచ్యుతరాయల వారి కాలంలో &#8211; ఎందుచేతనో తెలుగులో కవిత్వ వ్యాసంగాలు, శాస్త్రచర్చలూ జరిగినట్టు కనబడదు. బహుశా కృష్ణరాయల వంటి మహారాజు, తనయుణ్ణి కోల్పోయి గొప్ప పరితాపంతో గతించిన తర్వాత, తిమ్మరుసు వంటి మహాసత్త్వుడు జైలుపాలయిన తర్వాత, పెద్దన, అరణపుకవి వంటి పెద్దలు తిరుగుముఖం పట్టిన తర్వాత, తాతాచార్యులు మొదలైన న్యాయాధీశులు వయోవృద్ధులైన పిదప &#8211; ఒక తీవ్రమైన స్తబ్ధత ఏర్పడి ఉంటుంది. (అచ్యుతరాయలు పరమదుర్మార్గుడని ’ఫెరిస్తా’ అనే చారిత్రకుడు వ్రాశాడు. బహుశా కృష్ణరాయల తర్వాత ’పోర్చుగీసు’ వారికి ప్రాబల్యం తగ్గటం వల్ల ఈ విధంగా వ్రాసి ఉంటారని &#8220;హెరాస్&#8221; అనే మరొక చారిత్రక రచయిత అభిమతం.)</p>
<p>అచ్యుతరాయలు దుర్మార్గుడని కొందరు చారిత్రకులు తీర్మానించటానికి ఆతని బావ సలకము తిమ్మరాజు మరొక కారణం. సలకము తిమ్మడు కోశాధిపతి, మంత్రీ కూడాను. అచ్యుతరాయలు గతించిన తర్వాత, రాజకీయాలు ఈతని చుట్టూ సాగినవి. ఈ సలకము తిమ్మరాజు దుర్మార్గుడని చెప్పటానికి మార్కాపురంలో చెన్నకేశవస్వామి దేవాలయంలోని గరుడమంటపంపైని శిథిలశాసనం ఒకటి ఆకరం. (Page 7, The Aravidu dynasty of Vijayanagara Vol .1 – Rev. Henry Heras) ఈతడు రామరాయ, తిర్మలరాయ సోదరులను బంధించడమే కాక, విజయనగరాన్ని దోచుకోవటానికి ఆదిల్ శాహ్ ను ఆహ్వానించాడని కథనం. రామరాయ సోదరులు తప్పించుకుని గుత్తి, ఆదవాని ప్రదేశాలకు వెళ్ళి, తగిన సైన్యం సమకూర్చుకుని సలకము తిమ్మని సంహరించారని ఒక కథ. వసుచరిత్రకారుడు రామరాయ, తిర్మలులకు ఆంతరంగికుడు కాబట్టి ఈతని మతమూ ఇదే.</p>
<p>మరొక కథ ప్రకారం సలకము తిమ్మడు దేశభక్తుడు. సదాశివరాయలను సింహాసనంపై నిలబెట్టడానికి ప్రయత్నించి, రామరాయ, తిర్మలులతో గొడవపడి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదేమైనా, సలకము తిమ్మని కథ సందేహాస్పదమైనది.</p>
<p>అచ్యుతరాయలు &#8211; నాటి విద్యానగరంలో రెండు అద్భుతమైన ఆలయాలు కట్టించినాడు. (హంపి శాసనం) అంతే కాక శ్రీశైలము, శ్రీకాళహస్తి క్షేత్రాలకు అచ్యుతరాయలు భూరిదానాలు చేశాడని అక్కడి శాసనాల ద్వారా తెలుస్తూంది. అంతే కాదు అచ్యుతరాయలు సవరము చెన్నప్పనాయకుని వంటి దళవాయిని చేరదీసి పైకి తెచ్చాడు. తదనంతరకాలంలో తంజావూరిలో తెలుగువైభవం ప్రబలడానికి ఈ చర్య నాంది. అచ్యుతరాయల వారి కాలంలో పరిపాలనా సంస్కరణలు, గ్రామవ్యవస్థలో చక్కని మార్పులు జరిగినట్టు మోపూరు (కడప జిల్లా), గౌనివారిపల్లె (అనంతపురం) ఇత్యాది అనేక శాసనాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి అచ్యుతరాయలు పరమ దుర్మార్గుడని ఖచ్చితంగా నిర్ధారించడానికి వీలు లేదు.</p>
<p>అచ్యుతరాయల తర్వాత చాలా కొద్ది కాలం వెంకటదేవరాయల వారు సింహాసనానికి వచ్చి గతించారు. రాజ్యంలో అంతఃకలహాలు, కుట్రలూ మొదలైన కాలం అది. కృష్ణరాయల వారి తుళువ వంశ వారసుడు సదాశివరాయలను నామమాత్రంగా సింహాసనంలో కూర్చోబెట్టి &#8211; రాయలవారి అళియడు (అల్లుడు) ఆరవీటి రామరాయలు పరిపాలన సాగించినాడు.</p>
<p>రాజ్యంలో అంతఃపురరాజకీయాలతో సంబంధం లేని సామాన్య ప్రజలకు ధర్మబద్ధంగా సింహాసనం దక్కవలసిన తుళువ వంశంపై గురి. కొత్తగా వచ్చిన అళియనిపై విశ్వాసం పాదుకొనలేదు. అరమనె లో మాత్రం అల్లుడైన ఆరవీటి వానికి మద్దతు బాగా ఉన్నది. ఓ వైపు బహమనీ సుల్తానుల గొడవ. ఎప్పుడెప్పుడు కల్యాణదుర్గాన్ని ఆక్రమించాలా అన్న దురుద్దేశ్యంతో గోలకొండ నిజాము.</p>
<p>ఈ సంధియుగంలో, శాస్త్రచర్చలకు పేరుపడిన బ్రాహ్మల అవసరం కాక, వీరులైన ప్రజావర్గాల ’పురుషకారం’ రాజ్యానికి ఎక్కువగా అవసరమైన నేపథ్యంలో, ఆరవీటి రామరాయలపై ప్రజలకు విశ్వాసాన్ని కలిగించే అవసరాన్ని కూడా పురస్కరించుకుని &#8211; రామరాజు, తిర్మలులకు ఆంతరంగికుడైన మూర్తికవి ’వసుచరిత్ర’ రచనను మొదలుపెట్టి ఉండవచ్చు. వసుచరిత్రలో వసురాజు &#8211; అళియరామరాజే. భట్టుమూర్తి &#8211; అళియని చాళుక్య వంశజునిగానూ, సాక్షాత్తు కోదండరాముని గానూ కూడా ఉద్యోతించి వర్ణించాడు. కళ్యాణదుర్గం, తదితరప్రాంతాలలో బోయల ప్రాభవం ఎక్కువ. బోయలు లేదా బోయర్లు (వ్యాధులు) &#8211; విలువిద్యానిపుణులు. మహాశూరులు. కృష్ణరాయల కాలంలో అప్పాజీతో కలిసి రాయలు బోయలను సైన్యంలో చేర్చుకున్నాడు. తదనంతర కాలంలో ఈ బోయలు కళ్యాణదుర్గం పాళేగార్లుగా స్థిరపడినారు. బహుశా స్థానికులైన వీరి సహాయంతో, ఏబదివేల సైన్యంతో ఆరవీటి రామరాయలు &#8211; గోల్కొండనవాబును తరిమి, కల్యాణదుర్గాన్ని జయించినాడు. తిర్మలరాయలు చేరదీసిన మరొక స్థానిక నాయకుడు సొన్నలాపురం &#8211; హండే హనుమప్ప నాయకుడు. ఇతడు కల్యాణదుర్గం యుద్ధంలో గోలకొండ నవాబును సోదరులకు పట్టి కానుకనిస్తే, తిర్మలుడు అతనికి బహుమతిగా నందేల,బుక్కరాయసముద్రం, ధర్మవరం,కణేకల్లు, కారుగోడు ప్రాంతాలను రాసిచ్చాడని అనంతపురం కైఫీయత్తులో ఉంది. ఈ హనుమప్ప నాయకుని వంశం వారే అటుపై అనంతపురం/బుక్కరాయసముద్రం పాళేగార్లు అయినారు. (The Annals of Hande Anantapuram – GV Appa Row &#8211; వావిళ్ళ వారి ప్రతి)</p>
<p>కళ్యాణదుర్గంపై విజయాన్ని పురస్కరించుకుని భట్టుమూర్తి వసుచరిత్రలో చెప్పిన పద్యం ఇది.</p>
<p>శా||<br />
విశ్వామిత్రునిఁ గొల్చి రాముఁడతఁ డుర్విం జెందెఁ గళ్యాణము<br />
న్విశ్వామిత్రులు గొల్వ రాముఁడితఁ డుర్విం జెందెఁ గళ్యాణమున్<br />
శశ్వత్కీర్తులు రాములయ్యిరువురున్ సాధించు కళ్యాణ లా<br />
భైశ్వర్యంబులు ధర్మనిర్మథన ధర్మాలంబన వ్యక్తముల్. (వసుచరిత్ర &#8211; 1.47)</p>
<p>నాటి ఇక్ష్వాకుకులతిలకుడైన రాముడు విశ్వామిత్రుని సేవించి భూమిపై సీతతో వివాహాన్ని సాధిస్తే, నేటి ఆరవీటి రామరాయలు విశ్వానికి అమిత్రులు (నిజాం సేన) కొల్వగా కళ్యాణదుర్గాన్ని సాధించినాడు. ఆ రాముడు కళ్యాణలాభైశ్వర్యాల కోసం ధర్మమార్గాన్ని వీడితే (తాటకిని చంపుట, ధనుర్భంగం వగైరా), ఈ ఆరవీటి రామరాయలు ధర్మాన్ని అవలంబించాడు.</p>
<p>ఇక్కడ రెండవపాదంలో విశ్వామిత్రులు &#8211; అన్న శబ్దాన్ని విశ్వ+ అమిత్రులు అని వ్యాఖ్యాతలన్నారు. అలా అయిన పక్షాన &#8220;విశ్వాऽమిత్రులు&#8221; అని అవగ్రహసహితంగా (&#8220;ऽ&#8221; తో కలిపి) వ్రాయడం జరగాలి. అలా లేదు కాబట్టి &#8211; &#8220;విశ్వామిత్రులు కొల్వ&#8230;&#8221; &#8211; అంటే విశ్వామిత్ర గోత్రానికి కానీ, సంతతికి కానీ చెందిన కొన్ని వర్గాల వారు రామరాజును కొలువగా అని ఉద్దేశించి ప్రయోగించాడా? ఏమో!</p>
<p>భట్టుమూర్తి రామాలయాన్ని నిర్మించి ఒక తటాకాన్ని నిర్మించినట్టు ఈ కవి యొక్క ఇంకొక్క కావ్యము హరిశ్చంద్రనలోపాఖ్యానం లోని ఈ క్రింది పద్యం వల్ల తెలుస్తూంది.</p>
<p>సీ||<br />
సుతులఁ బెక్కండ్ర శాశ్వతరామనామ ధ<br />
న్యులఁ జేసి పిలుచు భాగ్యోదయంబు<br />
రచితాగ్రహారంబు రామచంద్రపురాంక<br />
పూతంబొనర్చిన పుణ్యరేఖ<br />
నవదివ్యభవనంబు సవరించి శ్రీరామ<br />
విభుఁ బ్రతిష్టించిన విపులమహిమ<br />
రామసరోనామరమణీయముగఁ దటా<br />
కము వినిర్మించిన ఘనయశంబు<br />
తే.గీ.<br />
సఫలతవహించు నీ హరిశ్చంద్ర నలక<br />
థా యుగ నిబంధ చిత్ర బంధ ప్రబంధ<br />
మంకిత మొనర్పు రఘుభర్త కఖిలభర్త<br />
కురుతరాభీప్సితము లెల్ల నొదవు నీకు. (హరిశ్చంద్రనలోపాఖ్యానం 14)</p>
<p>బహుశా కళ్యాణదుర్గవిజయాన్ని పురస్కరించుకుని భట్టుమూర్తి &#8211; కల్యాణదుర్గంలో అళియరాయలే రాముడు &#8211; అన్న ఉద్దేశ్యాన్ని వ్యాపింపజేయడానికి &#8211; కోదండరామాలయాన్ని కట్టించి లేదా పునరుద్ధరించి ఉండవచ్చు. (కల్యాణదుర్గంలో కోట ముంగిట చిన్న పట్టాభిరామాలయం ఒకటి ఉంది. దీనిని కట్టించిన వారెవరో తెలియదు. విజయనగరరాజులు కట్టించినట్టు స్థానిక చరిత్ర. విజయనగరశైలి ఈ దేవాలయంలో స్పష్టంగా కనబడుతుంది). ఈ కోవెలలో రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఈ రాముడు ఇక్కడికి నైరుతిదిశగా ఉన్న పెనుగొండ కు అభిముఖుడు. ఈ ప్రాంతాలలో ప్రముఖమైన నాటి రామాలయం బహుశా ఇదొక్కటే. భట్టుమూర్తి కట్టించిన దేవాలయం ఇదేనా? చారిత్రకులు తేల్చవలసిన సంగతి ఇది.</p>
<p>ఇక్కడ మరొక పార్శ్వం కూడా ఉంది. నేటి రాయలసీమ ప్రాంతంలో బయటపడిన శాసనాలలో ఆరవీటి రామరాయల శాసనాలు తక్కువ. తుళువ వంశ వారసుడైన సదాశివరాయలవారి శాసనాలు మాత్రం అనేకం. (తెలుగు శాసనాలే 150 కి పైగా ఉన్నాయి. కన్నడ శాసనాలు అదనం.)</p>
<p style="text-align: center;"><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/05/inscription.jpg"><img class="aligncenter size-full wp-image-11178" title="inscription" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/05/inscription.jpg" alt="" width="702" height="936" /></a><br />
(Kannada inscription of SadaSivaraya at Kambadur, near Kalyanadurgam)</p>
<p>ఆ కాలం లోనే పెన్న తీరంలో పెన్నహోబిళం దేవాలయనిర్మాణం జరిగింది. (ఈ ప్రాంతాలలో ఉన్న నారసింహులందరినీ కీర్తించిన &#8211; అన్నమయ్య పెన్నహోబిళాన్ని కీర్తించలేదు. ఆయన కాలానికి అక్కడ ప్రసిద్ధమైన కోవెల లేదు.) కృష్ణరాయల వంశపు తుళువ సదాశివరాయలు ప్రజలకు కనబడకపోయినా, ఆతణ్ణి గుత్తి దుర్గంలో బంధించినట్లు ప్రజలు చెప్పుకొంటున్నా &#8211; ఆయన పేరును శాసనాల్లో చెక్కించటం &#8211; అళియరామరాయలు స్థానిక ప్రజల విశ్వాసాన్ని చూరగొనటానికి చేసిన ప్రయత్నంలో భాగమని ఊహించవచ్చు.</p>
<p>రామరాజభూషణుని స్వస్థలం నేటి కడప జిల్లా &#8220;భట్టుపల్లె&#8221; అని వ్యాఖ్యాతలు చెబుతారు. అయితే &#8211; ఈయన తన జీవితచరమాంకంలో, బహుశా తిరుమలరాయల హయాంలో కల్యాణదుర్గాన్ని కార్యక్షేత్రంగా చేసుకొని ఉండవచ్చునేమో అని అనుమానం వస్తుంది. కల్యాణదుర్గం – మూణ్ణాలుగు తరాల క్రిందట, సంగీతానికి నెలవట. వసుచరిత్రలో చాలా పద్యాలు సంగీతజ్ఞులు బాణీలు కట్టి పాడవచ్చునన్నట్టు ఉంటాయి. అటువంటి పద్యాలను భట్టుమూర్తి వసుచరిత్రలో కోకొల్లలుగా నింపినాడు. అలాంటి అచ్చతెనుగు పద్యము/పాట కొక్క ఉదాహరణ ఇదీ.</p>
<p>సీ||<br />
మెఱుఁగొప్పు నెఱిగొప్పు నెఱగప్పు తఱిగప్పు<br />
జలదమాలిక చొప్పు దెలుపలేదొ<br />
బలువాలు గల నేలు తెలివాలు గనుడాలు<br />
కలువపూదెర మేలు దెలుప లేదొ<br />
నలువైన కళ లీనఁగల లేనగవు సోన<br />
కలశాబ్ధితెర మేన నిలుప లేదొ<br />
కనకంపు ననసొంపు కడ నుంపు రుచిపెంపు<br />
పసిఁడితీఁగల గుంపు మెసఁగ లేదొ<br />
తే||<br />
ప్రాణసఖులార నెయ్యంపుటలుకఁ బూని,<br />
యేల యీ బాల యీ వేళ నీ విశాల<br />
యవనికాభ్యంతరమ్మున కరిగె ననఁగ<br />
ననుఁగు నెచ్చెలి మఱియు నెయ్యమున జేరి.<br />
(3.69)</p>
<p>గిరికాదేవి కురులు వర్షాకాలపు మేఘాలగుంపులాగా, తెలిచూపులు కలువపూతెరలాగా, ఆమె లేనగవు పాలవెల్లి తరగల్లాగా, ఆమె మేను పసిడితీగె లాగా ఉంది కదా. అలా ఆమె మేను తెరలా ఉండగా, తిరిగి ఆమె తెరచాటుకెళ్ళడం ఎందుకు?</p>
<p>పైని సీస పద్యంలో, పద్యపు నడతలో, శబ్దాలలో ఛాయామాత్రంగా నేటి రాయలసీమ ’యాస’ ను ఔత్సాహికులు గుర్తించవచ్చు. నెఱి కొప్పు = గొప్పదైన జడతాలూకు ముడి, తఱి = అంటే వర్షాకాలం. తరీవ్యవసాయం &#8211; అంటే చెరువులసాయంతో చేసే సేద్యం. ఈ మాట ఇప్పటికీ వాడుకలో ఉంది. నెఱ కప్పు = అంటే చిక్కటినీలం లేదా నలుపు. (కప్పు &#8211; కన్నడలో నలుపు) కనకంపు నన = చామంతిపువ్వు.</p>
<p>పై నేపథ్యంలో భాగంగా &#8211; భట్టుమూర్తి అనబడే రామరాజభూషణుడు &#8211; స్వయానా కాపు. పైగా పెనుగొండ, కల్యాణదుర్గం చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న అన్ని జాతులను, సాంఘిక వర్గాలను వారి సాంప్రదాయాలనూ, అలవాట్లనూ, జీవనశైలిని సూక్ష్మంగా పరిశీలించి ఉంటాడు. అలా ఆ నేపథ్యంలో అలవోకగా ఈ ’రూపు’ అన్న శబ్దం దొరిలిందని భావించడానికి అవకాశం ఉంది. ఈ వ్యాసంగం అంతా ‘ఆకాశఖడ్గచాలనం’ లా అనిపించవచ్చు. అయితే చెప్పదల్చుకున్నదేమంటే &#8211; వసుచరిత్ర రచన వెనుక &#8211; విపరీతమైన శాస్త్రవైదుష్యం, సంగీతపు రుచితో బాటు సాంఘిక, రాజకీయ, చారిత్రక నేపథ్యం చిక్కగా అల్లుకుని ఉంది. అందులో అతిచిన్న పార్శ్వం ఈ &#8220;రూపు&#8221; గురించిన ఉదంతం. వడ్లగింజలో బియ్యపుగింజ!</p>
<p style="text-align: center;">***</p>
<p>వసుచరిత్ర కథ కూడా క్లుప్తంగా చెప్పుకోవాలి. కోలాహలుడు హిమవంతుని పుత్రుడైన పర్వతరాజు. ఆతడు శుక్తిమతి అనే నదీకాంతను అడ్డగించి బలాత్కరించాడు. ఆ నది జనపదాలపై పడి ప్రవహిస్తే, అధిష్టానరాజు ఆ కోలాహలుణ్ణి కాలితో ఎగదోశాడు. ఈ చర్యకు ఇంద్రుడు సంతోషించి అధిష్టానరాజుకు ఒక విమానాన్ని బహూకరించాడు. శుక్తిమతికి కాలక్రమంలో గిరిక జన్మించింది. ఈ గిరికను వసురాజు కేళీవనంలో చూసి అటుపై వివాహం చేసుకున్నాడు. మహాభారతంలో ఉపరిచరవసువు కథ ఈ కావ్యానికి ప్రేరణ.</p>
<p>వసుచరిత్రలో కోలాహలపర్వతమే ఘనగిరి (పెనుగొండ) అని, శుక్తిమతి అన్న నది &#8211; ముత్యాలవంక అనే చిన్ని చెఱువు అని ఆరవీటి రామరాయలు &#8211; వసురాజు అని, పెన్నను దారి మళ్ళించి పెనుగొండకు చేర్చే అవసరమే వసుచరిత్ర కావ్యకథకు ప్రేరణ అయి ఉండవచ్చునని, ఇలా ఈ రచన వెనక రాజకీయ నేపథ్యం ఉండవచ్చునని పుట్టపర్తి వారు చాలా విపులంగానూ, అద్భుతంగానూ విమర్శించారు. (విమర్శ తరంగిణి, వసుచరిత్ర సాహితీసౌరభము)</p>
<p>పుట్టపర్తి వారు పేర్కొన్న ’పెన్న దారి మార్పు’ ఘట్టం కాక నది మార్గాన్ని మళ్ళించే మరొక చారిత్రక ఘట్టం శ్రీకృష్ణరాయల వారి కాలంలోనూ జరిగింది. నాగలాపురం దగ్గర, కొండల మధ్యా పల్లంలోకి నీరు పారేలాగున, రాయల వారు ’జోయోడి లాపాంటె&#8221; అనే పోర్చుగీసు నిపుణుని నేతృత్వంలో, ఇరవై వేల మంది పనివారితో కలిసి ఒక చెరువును నిర్మించసాగాడు. ఆ తటాకనిర్మాణంలో భాగంగా ఓ కొండను చీల్పించాడు. దాపులనున్న తుంగభద్ర (లేదా మరొక చెఱువు) నుంచి ఈ చెఱువుకు నీరు పారడానికి విడివిడిగా మూడు తూములు పెట్టించాడు. అంతే కాక, మూడుతడవలు విఘ్నం ఏర్పడితే, జలదేవతకు బలిగా కారాగారంలో మరణశిక్ష అనుభవిస్తున్న కొంతమంది ఖైదీల తలలను తెగగొట్టించాడు. ఇంకా జంతుబలులు కూడా విస్తృతంగా చేశాడు. ఈ ఉదంతాన్ని &#8220;పెరెస్&#8221; అనే పాశ్చాత్య యాత్రికుడు వ్రాశాడు. ఈ చెఱువు &#8211; నేడు హొస్పేట దగ్గర తుంగభద్ర ఆనకట్ట సమీపంలో ఉన్న ’డన్నాయకన-కెరె’ అని కొన్ని ఆధారాలద్వారా తెలుస్తుంది . (విద్యానగర చరిత్ర &#8211; శీరిపి ఆంజనేయులు గారు) ఈ నేపథ్యం నుంచి వసుచరిత్ర కారుడు కథాభాగాన్ని గిల్లుకొని, భారతంలో ఉపరిచర వసువు ఉపాఖ్యానానికి సమన్వయించాడా? ఏమో!</p>
<p style="text-align: center;">***</p>
<p>ఇప్పుడు ప్రశ్న మళ్ళీ మొదటికి. ఇంతకూ రూపు అంటె ఆభరణమా లేక ఆకారవిశేషమా?</p>
<p>ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం దొరకదు. బహుశా ఉండదేమో కూడానూ. రెండు విధాల ఆలోచనలనూ రేకెత్తించి పాఠకులను తికమకపెట్టటానికే కవి ఈ ప్రయోగం చేసి ఉంటాడని అనుకొని తృప్తిపడవలసి ఉంది. శ్లేష చక్రవర్తి &#8211; రామరాజభూషణుడి వసుచరిత్రలో అలా పాఠకుడిని తికమకపెట్టే పద్యాలు కోకొల్లలు.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
<p><em>(ఈ వ్యాసానికి మూలం &#8211; సురేష్ కొలిచాల గారితో రూపు &#8211; ఆభరణమా? ఆకారవిశేషమా? అన్న విషయంపై జరిగిన సంభాషణ. సురేష్ గారికి కృతజ్ఞత.)</em></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=11174</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
		</item>
		<item>
		<title>కృష్ణమిశ్రుని ప్రబోధచంద్రోదయము &#8211; మొదటి ప్రతీకాత్మక భారతీయ నాటకం.</title>
		<link>http://vaakili.com/patrika/?p=11038</link>
		<comments>http://vaakili.com/patrika/?p=11038#comments</comments>
		<pubDate>Sat, 30 Apr 2016 20:03:20 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[రవి E.N.V]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=11038</guid>
		<description><![CDATA[<p>ఒక గహనమైన సిద్ధాంతాన్ని కానీ, క్లిష్టమైన సందేశాన్ని కానీ చెప్పాలనుకున్నప్పుడు ప్రతీకను (Allegory) ఉపయోగించటం- భారతదేశంలో వేదకాలమంత పురాతనమైనది. దీనికి దృష్టాంతంగా ప్రాచీన ఉపనిషత్సాహిత్యంలో, ముండకోపనిషత్తులోని ప్రముఖమైన శ్లోకం ఇది.</p> <p>ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే &#124;<br /> తయోరన్యః పిప్పలం స్వాదత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి &#124;&#124;</p> <p>ఒక చెట్టుపైన రెండు పక్షులు ఉన్నాయి. క్రింద కొమ్మ మీద ఉన్న పక్షి పళ్ళను తింటున్నది. అది మధురమైన పళ్ళను తిన్నప్పుడు సుఖాన్ని, చేదు పళ్ళను తిన్నప్పుడు దుఃఖాన్ని పొందుతున్నది. రెండవ పక్షి ఏమీ తినకుండా ప్రశాంతంగా కూర్చొని చూస్తూ, సుఖదుఃఖాలకు అతీతమైన ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంది.</p> <p>వృక్షం &#8211; జీవునికి, మొదటిపక్షి జీవాత్మకు, రెండవ పక్షిని పరమాత్మకూ ప్రతీకలుగా నిలిపి కూర్చిన అందమైన శ్లోకం ఇది. కాలక్రమంలో మత సంబంధమైన చర్చలలోనూ, ఆధ్యాత్మిక సంబంధమైన సిద్ధాంతాలలోనూ, తత్త్వప్రతిపాదనల విషయాలలోనూ ప్రతీకలను ఉపయోగించటం దాదాపు ప్రతిమతంలోనూ, వివిధ దర్శనాదులలోనూ అనివార్యమైన విషయంగా మారింది. ఈ Allegory అనేది బౌద్ధంలోనూ, బౌద్ధాన్ని పోలిన తావోయిజమ్ వంటి పాశ్చాత్య దర్శనాలలో ఎక్కువగా కనిపిస్తుంది. బౌద్ధసాహిత్యంలో మిళిందప్రశ్నలలో ప్రతీకలు మిక్కుటంగా కనిపిస్తాయి. జైన సాహిత్యంలోనూ ప్రతీకలు ఎక్కువే.</p> <p>మొత్తానికి ప్రతీకల ద్వారా వినిపించే ఆయా ఆధ్యాత్మిక, మత సంబంధమైన విషయాలే సాహిత్యంలోనూ ప్రవేశించాయి. మహాభాగవతంలో పురంజనుని వృత్తాంతం చక్కని ప్రతీకాత్మక ఉపకథ. నాటక సాహిత్యానికి వస్తే, అశ్వఘోషుని ప్రతీకాత్మకమైన నాటకం ఒకటి ఉన్నట్టు పరిశోధకులు భావించారు కానీ స్పష్టమైన ఆనవాళ్ళు దొరకలేదు.</p> <p>సంస్క్కృతసాహిత్యంలో రూపకసాహిత్యం చాలా పురాతనమైనది. భాసమహాకవి కాళిదాసుకంటే చాలాపురాతనమైన కవి. ఆ భాసమహాకవి రచించినట్టు చెప్పబడుతున్న బాలచరితమ్ అన్న నాటకంలోని ప్రతీకాత్మకమైన ఉదంతం ఇది.</p> <p>మధూకుడనే ఒకానొక మహర్షి కంసుని సర్వనాశనం కమ్మని శపిస్తాడు. ఆ శాపరూపుడు వజ్రబాహుడనే పేరుతో కంసుని అంతఃపురంలోకి అడుగుపెడతాడు. కంసుని రాజ్యశ్రీని విష్ణువు ఆజ్ఞప్రకారం అక్కడనుండి వైదొలగమని చెప్పి, తన మిత్రులైన ప్రసుప్త, అలక్ష్మి, ఖలతి, [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">ఒ</span>క గహనమైన సిద్ధాంతాన్ని కానీ, క్లిష్టమైన సందేశాన్ని కానీ చెప్పాలనుకున్నప్పుడు ప్రతీకను (Allegory) ఉపయోగించటం- భారతదేశంలో వేదకాలమంత పురాతనమైనది. దీనికి దృష్టాంతంగా ప్రాచీన ఉపనిషత్సాహిత్యంలో, ముండకోపనిషత్తులోని ప్రముఖమైన శ్లోకం ఇది.</p>
<blockquote><p>ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే |<br />
తయోరన్యః పిప్పలం స్వాదత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి ||</p></blockquote>
<p>ఒక చెట్టుపైన రెండు పక్షులు ఉన్నాయి. క్రింద కొమ్మ మీద ఉన్న పక్షి పళ్ళను తింటున్నది. అది మధురమైన పళ్ళను తిన్నప్పుడు సుఖాన్ని, చేదు పళ్ళను తిన్నప్పుడు దుఃఖాన్ని పొందుతున్నది. రెండవ పక్షి ఏమీ తినకుండా ప్రశాంతంగా కూర్చొని చూస్తూ, సుఖదుఃఖాలకు అతీతమైన ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంది.</p>
<p>వృక్షం &#8211; జీవునికి, మొదటిపక్షి జీవాత్మకు, రెండవ పక్షిని పరమాత్మకూ ప్రతీకలుగా నిలిపి కూర్చిన అందమైన శ్లోకం ఇది. కాలక్రమంలో మత సంబంధమైన చర్చలలోనూ, ఆధ్యాత్మిక సంబంధమైన సిద్ధాంతాలలోనూ, తత్త్వప్రతిపాదనల విషయాలలోనూ ప్రతీకలను ఉపయోగించటం దాదాపు ప్రతిమతంలోనూ, వివిధ దర్శనాదులలోనూ అనివార్యమైన విషయంగా మారింది. ఈ Allegory అనేది బౌద్ధంలోనూ, బౌద్ధాన్ని పోలిన తావోయిజమ్ వంటి పాశ్చాత్య దర్శనాలలో ఎక్కువగా కనిపిస్తుంది. బౌద్ధసాహిత్యంలో మిళిందప్రశ్నలలో ప్రతీకలు మిక్కుటంగా కనిపిస్తాయి. జైన సాహిత్యంలోనూ ప్రతీకలు ఎక్కువే.</p>
<p>మొత్తానికి ప్రతీకల ద్వారా వినిపించే ఆయా ఆధ్యాత్మిక, మత సంబంధమైన విషయాలే సాహిత్యంలోనూ ప్రవేశించాయి. మహాభాగవతంలో పురంజనుని వృత్తాంతం చక్కని ప్రతీకాత్మక ఉపకథ. నాటక సాహిత్యానికి వస్తే, అశ్వఘోషుని ప్రతీకాత్మకమైన నాటకం ఒకటి ఉన్నట్టు పరిశోధకులు భావించారు కానీ స్పష్టమైన ఆనవాళ్ళు దొరకలేదు.</p>
<p>సంస్క్కృతసాహిత్యంలో రూపకసాహిత్యం చాలా పురాతనమైనది. భాసమహాకవి కాళిదాసుకంటే చాలాపురాతనమైన కవి. ఆ భాసమహాకవి రచించినట్టు చెప్పబడుతున్న బాలచరితమ్ అన్న నాటకంలోని ప్రతీకాత్మకమైన ఉదంతం ఇది.</p>
<p>మధూకుడనే ఒకానొక మహర్షి కంసుని సర్వనాశనం కమ్మని శపిస్తాడు. ఆ శాపరూపుడు వజ్రబాహుడనే పేరుతో కంసుని అంతఃపురంలోకి అడుగుపెడతాడు. కంసుని రాజ్యశ్రీని విష్ణువు ఆజ్ఞప్రకారం అక్కడనుండి వైదొలగమని చెప్పి, తన మిత్రులైన ప్రసుప్త, అలక్ష్మి, ఖలతి, కాళరాత్రి, మహానిద్ర, పింగలాక్షులతో కలిసి కంసుని ఇంట నివాసం ఏర్పరచుకొంటాడు. &#8211; ఈ ఘట్టం లోని పాత్రలపేర్లను, ఆ పేర్ల స్వభావాలకు ప్రతీకలుగా నిలిపి, భాసుడు అందమైన నాటకీయత సృష్టిస్తాడు. ఈ ఘట్టం బహుశా &#8211; నేడు లభ్యమవుతున్న సంస్కృతనాటకసాహిత్యం ప్రకారం మొట్టమొదటి Allegory కావచ్చు.</p>
<p>భాసనాటకంలోని శాప, రాజ్యశ్రీ తదితర పాత్రలు కేవలం ఒకఘట్టానికే పరిమితం. ఇతివృత్తాన్ని, పాత్రలను, రచన మొత్తాన్ని పరోక్షమైన ఒక సిద్ధాంతాన్ని చెప్పడానికి ఉద్దేశించిన మొదటి సమగ్రమైన ప్రతీకాత్మక రచన కృష్ణమిశ్రుని ప్రబోధచంద్రోదయము.</p>
<p>ఇక్కడ ఒక విషయం. సాహిత్యంలో ప్రతిప్రక్రియకూ కొన్ని పరిమితులూ, పరిధులూ,లక్ష్యాలూ ఉన్నాయి. నాట్యశాస్త్రంలో నాట్యస్వరూపాన్ని గురించి విరూపాక్షునికి బ్రహ్మ వివరిస్తూన్న సందర్భంలో ఇలా అంటాడు.</p>
<blockquote><p>క్వచిద్దర్మః క్వచిత్క్రీడా క్వచిదర్థః క్వచిచ్ఛమః |<br />
క్వచిద్ధాస్యం క్వచిద్యుద్ధం క్వచిత్కామః క్వచిద్వధః ||<br />
(1- 108)<br />
ధర్మ్యం యశస్యమాయుష్యం హితం బుద్ధివివర్ధనమ్ |<br />
లోకోపదేశజననం నాట్యమేతద్భవిష్యతి ||<br />
(1-115)<br />
వేదవిద్యేతిహాసానా మాఖ్యానపరికల్పనమ్ |<br />
వినోదకరణం లోకే నాట్యమేతద్భవిష్యతి ||<br />
శ్రుతిస్మృతి సదాచార పరిశేషార్థకల్పనమ్ |<br />
వినోదజననం లోకే నాట్యమేతద్భవిష్యతి ||<br />
(1- 119,120 అధికపాఠము)</p></blockquote>
<p>నాట్యశాస్త్రంలో కొంత ధర్మము, కొంత క్రీడ, కొంత అర్థము, కొంత శాంతి, కొంత హాస్యము, కొంత యుద్ధము, కొంత కామము, ఒకింత వధయునూ కలసి యుండును. ఇది ధర్మమును బోధించును. ఇది యశస్కరము, ఆయుష్షును కలుగజేయునదియునూ. ఇది హితమును గూర్చి బుద్ధికుశలతను పెంపొందించును. లోకులకు ఉపదేశకారకమై ఈ విధముగా నాట్యము ఉద్భవించును. వేదవిద్య, ఇతిహాసాదుల కథలను, వేదపురాణాదుల సదాచారముల యొక్క మూలభావములను పరికల్పించి లోకమును వినోదింపజేయుట నాట్యమగును.</p>
<p>నాట్యశాస్త్రంలో నాట్యస్వరూపం చాలా సమగ్రంగా వివరించినప్పటికి, సంస్కృత సాహిత్యప్రస్థానంలో నాట్యశాస్త్రపు మూలభావం మాత్రం &#8220;రసాస్వాదన&#8221; గా పరిణమించింది.నాటకం అన్న సాహిత్య ప్రక్రియ &#8211; ప్రధానంగా రసప్రతీతికి, తాపోపశమనానికి, ప్రేక్షకుడిని ఆనందింపజేయడానికి లక్ష్యమై కొనసాగింది. ఆపై, అనేక వత్సరాల తర్వాత, సంస్కృతనాటకాలు అనేకం వెలువడిన నేపథ్యంలో నాట్యశాస్త్రాన్ని కాలానుగుణంగా సంస్కరించిన దశరూపకకర్త మరింత సూటిగా ఒకమాట అంటాడు.</p>
<blockquote><p>ఆనందనిష్యందిషు రూపకేషు వ్యుత్పత్తిమాత్రం ఫలమల్పబుద్ధిః |<br />
యోऽపాతిహాసాదివదాహ సాధుస్తస్మై నమః స్వాదుపరాన్ముఖాయ ||</p></blockquote>
<p>ఆనందం చిందే నాటకసాహిత్యాన్ని ధర్మార్థకామాదుల ప్రాప్తికోసమని ఎంచే అల్పబుద్ధులకూ, రసాస్వాదనావిముఖులకొక నమస్కారం.</p>
<p>ఈ మూలసూత్రానికి విభిన్నంగా, నాటకప్రక్రియను కేవలం రసాస్వాదనకు కాకుండా, మొట్టమొదటి సారి వైష్ణవాద్వైతసిద్ధాంత తత్త్వబోధకు ఉపయోగించిన నాటకం &#8211; ప్రబోధచంద్రోదయము. సూక్ష్మంగా గమనిస్తే &#8211; ఈ మార్పు మూలసూత్రానికి విభిన్నమే కానీ విరోధం కాదు. అటు నాటకసూత్రాలను, సంధి సంధ్యంగాలనూ, రసపోషణనూ పాటిస్తూనే ఇటు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధకంగా, ప్రతీకాత్మకపాత్రలతో కృష్ణమిశ్రుడు ఒక క్లిష్టమైన ప్రయోగం సఫలంగా చేశాడు.</p>
<p>ప్రబోధచంద్రోదయమ్ -<br />
ప్రసిద్ధమైన బోధ &#8211; ప్రబోధ.<br />
ప్రబోధము అనే చంద్రుని యొక్క పుట్టుక &#8211; ప్రబోధచంద్రోదయము.</p>
<p>ప్రబోధచంద్రోదయనాటకపు ప్రధానరసం శాంతము. కొంతపాలు హాస్యాన్ని, వీరరసాన్ని కూడా అక్కడక్కడా పోషిస్తాడు కవి.</p>
<p><strong>కవి &#8211; కాలము:</strong></p>
<p>విశ్వవిఖ్యాతమైన ఖజురహో దేవాలయాలను నిర్మించినది చండేలా రాజులు. ఆ రాజులలో కీర్తివర్మ ముఖ్యుడు. కీర్తివర్మ ఆస్థానకవి కృష్ణమిశ్రుడు. ఆ కీర్తివర్మ చేది రాజైన కర్ణుని జయించాడు. కీర్తివర్మ కర్ణుడిని జయించినప్పటికీ, యుద్ధంలో రక్తపాతాన్ని చూసి దుఃఖపడ్డాడుట. ఆతని దుఃఖాన్ని ఉపశమింపజేయటానికి, గోపాలకుడనే మంత్రిని ఆనందింపజేయడానికీ కృష్ణమిశ్రుడు ప్రబోధచంద్రోదయాన్ని రచించాడని అంటారు. కీర్తివర్మ ఎదుట నాటకాన్ని ప్రదర్శించినట్లు ఈ నాటకపు నాంది చెబుతున్నది.</p>
<p>ఆధారాలను బట్టి చూస్తే &#8211; పద్దెనిమిదవ శతాబ్దంలో పురాతత్త్వ శాస్త్రజ్ఞులు కనుగొన్న శాసనాన్ని క్రీ. శ. 1028 నాటిదిగాను, అది చేదిరాజైన కర్ణుడిదిగాను గుర్తించారు. అదే విధంగా కీర్తివర్మ తాలూకు క్రీ.శ &#8211; 1098 నాటి శాసనాన్ని చారిత్రకులు కనుగొన్నారు. వీరికి సమకాలికుడు కాబట్టి &#8211; కృష్ణమిశ్రుని కాలం 11 వ శతాబ్దపు ద్వితీయార్ధం అని అంచనా.</p>
<p><strong>సంగ్రహంగా ఇతివృత్తం:</strong></p>
<p>ఈ నాటక పరమార్థం అద్వైతసిద్ధాంత ప్రతిపాదన. అంటే పురుషుడికి &#8211; తాను దైవం తాలూకు మానవ రూపం అన్న జ్జానోదయం, వివేకం ద్వారా కలుగటం &#8211; ఈ కథకు పరమార్థం. ఈ జ్ఞానోదయాన్నే ప్రబోధ చంద్రోదయము అని అంటాడు కవి. అయితే ప్రాపంచిక జీవనంలో నిమగ్నమైన పురుషునికి స్వతఃసిద్ధంగా వివేకం కలుగదు. అలా కలుగాలంటే కామ క్రోధ లోభమోహాది అరిషడ్వర్గాలు నశించాలి. (తనలో ఉన్న) వివేకాన్ని మేల్కొలపాలి. వివేకానికి ఉపనిషత్తుల సారమూ, దైవ(విష్ణు)భక్తీ దోహదపడాలి. అప్పుడు వైరాగ్యం, వైరాగ్యం నుండి శాంతి జనించి, ధ్యానంతో ప్రబోధచంద్రోదయం కలుగుతుంది. ఈ ఆధ్యాత్మిక శబ్దజాలాన్ని నిజజీవిత పాత్రలుగా మలిచి &#8211; వివేకం, మహామోహము అనే ఇరు వర్గాల మధ్య యుద్ధాన్ని నేపథ్యంగా చిత్రీకరించిన నాటకం ఇది.</p>
<p>అనగనగా పురుషుడు, పురుషుని భార్య మోహము. వీరి సంతానం మనస్సు.<br />
మనస్సు నకు ఇద్దరు భార్యలు. ప్రవృత్తి, నివృత్తి.</p>
<p>నివృత్తి పుత్రుడు వివేకుడు &#8211; నాయకుడు. ప్రవృత్తి పుత్రుడు మహామోహుడు &#8211; ప్రతినాయకుడు</p>
<p>వివేకుడి భార్య ఉపనిషద్దేవి. మరొక భార్య మతి. వస్తువిచారుడు, సంతోషుడు, క్షమ &#8211; వివేకుని సైన్యం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులనే వారు &#8211; ఈయన పక్షంలోని అష్ట మంత్రివర్గం. విష్ణుభక్తి వివేకుని ఇష్టదైవం. శాంతి, కరుణ,మైత్రి పరిచారికలు.</p>
<p>మహామోహుని సైన్యంలో &#8211; కాముడు, అతని భార్య రతి, అహంకారి, అతని పుత్రుడు లోభుడు, లోభుని భార్య తృష్ణ, దంభుడనే కొడుకు, క్రోధుడు &#8211; క్రోధుని భార్య హింస మొదలైన వారు.ఇంకా చార్వాకుడు, దిగంబరసిద్ధాంతి, బుద్ధాగముడు, సోమసిద్ధాంతుడు &#8211; ఇతని పరివారం.</p>
<p>వివేకునికి, మహామోహునికి మధ్య యుద్ధం జరుగుతుంది. మహామోహుని పరివారం నశిస్తుంది. అతడు కనుమరుగవుతాడు. అటుపై, వివేకునికీ, ఉపనిషద్దేవికీ ప్రబోధచంద్రుడు ఉదయించడం నాటకపరిసమాప్తి.</p>
<p style="text-align: center;">***</p>
<p><strong>విశేషాలు:</strong></p>
<p>సాధారణంగా కావ్యం నాంది లో ఇతివృత్తాన్ని చెప్పడం కద్దు. ఈ నాటకం అష్టపదనాంది. ఇందులో మొదటి శ్లోకం ఇది.</p>
<blockquote><p>మధ్యాహ్నార్క మరీచికాస్వివ పయఃపూరో యదజ్ఞానతః<br />
ఖం వాయుర్జ్వలనో జలం క్షితిరితి త్రైలోక్యమున్మీలతి |<br />
యత్తత్వం విదుషాం నిమీలతి పునః స్రగ్భోగిభోగోపమమ్<br />
సాంద్రానందముపాస్మహే తదమలం స్వాత్మావబోధం మహః ||</p></blockquote>
<p>దేని అజ్ఞానము వలన ముల్లోకాలూ ఎండమావి వలే పంచభూతాలుగా ప్రాపిస్తాయో, తిరిగి దేని తత్త్వం వివేకులను (సర్పపు భ్రాంతిని తొలగించిన) పూలదండవలే మేల్కొలుపుతుందో, ఏది గొప్ప ఆనందానికి నిలయమై భాసిస్తుందో, అట్టి ఆత్మావబోధమైన నిర్మలమైన తేజస్సును ఉపాసిస్తున్నాను.</p>
<p><strong>శైలి:</strong><br />
కృష్ణమిశ్రుని కవిత్త్వం ధారాశుద్ధి గలది. అర్థవ్యక్తి భరితమైనది. అర్థవ్యక్తి &#8211; అంటే చదువుతూ (లేదా వింటూ) ఉన్నప్పుడే సద్యఃస్ఫూర్తిగా అర్థం అవగతం అవడం. ఉదాహరణకు ఈ క్రింది శ్లోకాన్ని చూడండి.</p>
<blockquote><p>ఏకామిషప్రభావమేవ సహోదరాణాం<br />
ఉజ్జృంభతే జగతి వైరమివ ప్రసిద్ధమ్ |<br />
పృథ్వీనిమిత్తమభవత్ కురుపాండవానాం<br />
తీవ్రస్తథా హి భువనక్షయకృద్విరోధః ||</p></blockquote>
<p>(కాముడు, వివేకమూ ఒకే తండ్రి (మనస్సు) బిడ్డలైనా వారిద్దరికీ మధ్య జ్ఞాతివైరమెందుకు ఉదయించిందని రతి కాముణ్ణి ఒక సందర్భంలో ప్రశ్నిస్తుంది. దానికి సమాధానంగా కాముడు ఈ శ్లోకాన్ని చెబుతాడు.&#8221;ప్రపంచంలో జ్ఞాతుల మధ్య వైరం ఒకే కారణాన్ని ఆపేక్షించడం వలన కలుగుతుంది. కాసింత భూమి కోసం కురుపాండవుల వైరం మొదలై, మొత్తం భూమిని నశింపజేసింది కదా!&#8221;)</p>
<p>తత్వ సిద్ధాంతాలను ఒక దృశ్యనాటకంలో నిక్షేపించటం చాలా కష్టం. అందుకు కృష్ణమిశ్రుడు అర్థవ్యక్తిని బాగా ఉపయోగించుకున్నాడు. కవిత్వాన్ని సాధ్యమైనంత సరళంగా మార్చాడు. ఈ క్రింది శ్లోకం చూడండి.</p>
<blockquote><p>యస్మాత్ విశ్వముదేతి యత్ర రమతే యస్మిన్ పునర్లీయతే<br />
భాసా యస్య జగద్విభాతి సహజానందోజ్జ్వలం యన్మహః |<br />
శాన్తం శాశ్వతమక్రియం యం పునర్భావాయ భూతేశ్వరం<br />
ద్వైతధ్వాన్తమపాస్య యాన్తి కృతినః ప్రస్తౌమి తం పూరుషమ్ ||</p></blockquote>
<p>ఎవ్వని నుంచి విశ్వం పుడుతుందో, ఎక్కడ సంగమిస్తుందో, ఎక్కడ తిరిగి లీనమవుతుందో, ఎవని కాంతి జగత్తును వెలిగిస్తుందో, సహజమైన ఆనందంతో ఉజ్జ్వలంగా ఉంటుందో, శుద్ధుడు, శాశ్వతుడు, క్రియారహితుడైన ఎవ్వని పవిత్రులు, అద్వైతసిద్ధులూ చేరుకొని, తిరిగి రారో, అట్టి పురుషుని స్తుతిస్తున్నాను.</p>
<p>పోతన భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోని ఒక ప్రముఖమైన పద్యం ఈ ఛాయలతో ఉంటుంది.</p>
<blockquote><p>ఉ||<br />
ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపల నుండు లీనమై<br />
ఎవ్వని యందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం<br />
బెవ్వడనాది మధ్యలయు డెవ్వడు సర్వము దానయైనవా<br />
డెవ్వడు వాని నాత్మ భవు నీశ్వరునే శరణంబు వేడెదన్.</p></blockquote>
<p>ఆముక్తమాల్యదలోని మాలదాసరి ఉపాఖ్యానంలోని శ్లోకమూ అలాగే మొదలవుతుంది.</p>
<blockquote><p>ఉ||<br />
ఎవ్వని చూడ్కి జేసి జనియించు జగంబు వసించు నిజ్జగం<br />
బెవ్వని యందు డిందు మరి యెవ్వనియం దిది యట్టి విష్ణుతో<br />
నివ్వల నొక్క వేల్పు గణియించిన పాతకి నౌదు నేడ నే<br />
నెవ్విధినైన నిన్ గదియనేని యనన్విని బంధ మూడ్చినన్.</p></blockquote>
<p><strong>అనువాదాలు, అనుసరణలు:</strong></p>
<p>ప్రబోధచంద్రోదయ నాటకం సంస్కృతసాహిత్యంలో ఒక ఒరవడి సృష్టించింది. ఘనశ్యాముడన్న కవి ఈ నాటకానికి వ్యాఖ్యానాన్ని రచించాడు. మరొక వ్యాఖ్యానాన్ని రాయల వారి కాలంలో నాదెండ్ల గోపమంత్రి వ్రాశాడుట. తదనంతరం పలు నాటకాలు ప్రబోధచంద్రోదయాన్ని అనుసరించి సాగాయి. వీటిలో వేదాంతదేశికుల వారి పది అంకాల ’సంకల్ప సూర్యోదయము’ ప్రముఖమైనది. ఇది విశిష్టాద్వైతపరమైన ప్రకరణము. మిగిలినవి కూడా కొన్ని-</p>
<p>మోహపరాజయము &#8211; యశపాలుడు<br />
చైతన్యచంద్రోదయము &#8211; కవికర్ణపూరుడు (చైతన్య ప్రభుపాదుని తత్త్వస్థాపన)<br />
పూర్ణపురుషార్థచంద్రోదయము &#8211; జాతవేదుడు. ఇంకా భావనాపురుషోత్తమము, ధర్మవిజయము, విద్యాపరిణయము, వేదాంతవిలాసము, అమృతోదయము, ఇత్యాది పెక్కు రచనలకు ప్రబోధచంద్రోదయం మూలము.</p>
<p><strong>ముగింపు:</strong><br />
రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ఫ్రాన్సు దేశంలో Absurd Art అన్న ఒక సామాజిక చలనం మొదలయిన విషయం విజ్ఞులైన పాఠకులకు తెలుసు. అంతకు చాలాకాలం ముందు ద్వైతాద్వైత విశిష్టాద్వైత మతాల నేపథ్యంలో బౌద్ధమతం ప్రాభవం కోలుపోయిన దశలో, భక్తియుగం ఊపునందుకుంటున్న కాలంలో, ప్రాకృత భాషాభేదాలు నెమ్మదిగా దేశ్యభాషలలో పరిణామం చెంది, భరతఖండం మరింత భిన్నత్వాన్ని సంతరించుకుంటున్న సంధియుగంలో ప్రతీకాత్మక నాటకాల వెల్లువ మొదలయినట్టు తెలుస్తూంది. ఈ వెల్లువకు నాంది ఈ ప్రబోధచంద్రోదయము. ప్రబోధచంద్రోదయాన్ని తెలుగు పద్యకావ్యంగా నంది మల్లయ్య అనే ప్రబంధకవి రచించాడు. ఆధునిక కాలంలో చక్కటి తెనుగుసేత &#8211; కందుకూరి వీరేశలింగం గారు చేశారు. ప్రబోధచంద్రోదయనాటకంపై ఓ చిన్న సూచన ఈ వ్యాసోద్దేశ్యం.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=11038</wfw:commentRss>
		<slash:comments>12</slash:comments>
		</item>
		<item>
		<title>లజ్జాగౌరి</title>
		<link>http://vaakili.com/patrika/?p=9781</link>
		<comments>http://vaakili.com/patrika/?p=9781#comments</comments>
		<pubDate>Thu, 31 Dec 2015 21:12:06 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[రవి E.N.V]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=9781</guid>
		<description><![CDATA[<p>కర్ణాటక రాష్ట్రంలోని బాగల్ కోట జిల్లా, చరిత్రకూ, సుందరమైన మలప్రభా నదీపరీవాహక ప్రాంతానికి, కస్తూరి కన్నడ భాషా సౌరభాలకు ప్రసిద్ధి. ఒకప్పటి చాళుక్యుల రాజధాని అయిన బాదామి (వాతాపి) ఆ జిల్లాలోనే ఉంది. నాడు ఆ రాజులు కట్టించిన గుహాలయాలు, చుట్టుపక్క ప్రాంతాలలోని దేవాలయాలు నాటి ప్రాభవానికి సజీవ సాక్ష్యాలుగా నేడు నిలిచి ఉన్నాయి. ఇక్కడి పట్టదకల్లు దేవాలయప్రాంగణాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.</p> <p>చాళుక్యుల కాలం నాటి కొన్ని అవశేషాలను బాదామిలో ఒక సంగ్రహాలయంలో భద్రపరిచారు. ఆ మ్యూజియమ్ లోనికి ప్రవేశిస్తూనే ఒక వింత స్త్రీమూర్తి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం పేరు &#8220;లజ్జాగౌరి&#8221;. ఇదే విగ్రహాన్ని తెలంగాణాలో అలంపురం మ్యూజియమ్ లో చూడవచ్చు.</p> <p>లజ్జాగౌరి &#8211; ఒక నగ్న స్త్రీమూర్తి. ఈ మూర్తి తన ఊరువులను పైకెత్తి, కాళ్ళను పైకి మడుచుకుని కూర్చున్నట్టుగా ఉంటుంది. ఎత్తైన చనుకట్టుతో ఈ మూర్తి, ప్రసవిస్తున్న స్త్రీ భంగిమను పోలి ఉండటం గమనించవచ్చు. ఈ విగ్రహానికి శిరస్సు లేదు. శిరస్సు స్థానంలో ఒక తామరపువ్వు, రెండు చేతులలో రెండు పద్మాలు కనిపిస్తాయి. కాలివ్రేళ్ళు కుంభాకారంలో కనిపిస్తాయి. నడుముపై ముడుతలు కూడా చూడవచ్చు. ఆధునికులకు కాస్త ఎబ్బెట్టుగా తోచగల ఈ స్త్రీమూర్తి ఒకానొక కాలంలో గ్రామీణ భారతంలో పలుప్రాంతాలలో పూజలందుకున్న దేవతామూర్తి!</p> <p>లజ్జాగౌరి విగ్రహాలు బాదామిలోనే కాదు, కర్ణాటకలోని సిద్దనకొళ్ళ, మహాకూట, హొసపేట దగ్గరి వ్యాఘ్రేశ్వరి, నేటి తెలంగాణా-మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపురం, ఆంధ్రప్రదేశ్ దగ్గర నాగార్జునకొండ, తమిళనాడులో దశాసురమ్, మహారాష్ట్ర సతారా జిల్లలో వడగామ్, అజంతా గుహలలో ఒకానొక గుహలో, ఉస్మానాబాదులో తర అన్న గ్రామంలో, మాహోర్ఝరి, ఔరంగాబాదు దగ్గర భోగరదన్, ఉత్తరప్రదేశ్ లోని భీటా, ఒడిస్సాలో న్యువపద, ఇంకా దేశంలోని పలుప్రాంతాల్లో ఈ విగ్రహాలను గుర్తించారు. తద్వారా ఈ మూర్తి అర్చన భారతదేశంలోని పలుప్రాంతాల్లో కొనసాగినట్టు తెలుస్తూంది.</p> <p>బాదామిలో మ్యూజియమ్ పక్కగా మెట్లదారి వెంబడి పైకెక్కితే, కొండపై ఒక పాడుబడిన దేవాలయం కనిపిస్తుంది. [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">క</span>ర్ణాటక రాష్ట్రంలోని బాగల్ కోట జిల్లా, చరిత్రకూ, సుందరమైన మలప్రభా నదీపరీవాహక ప్రాంతానికి, కస్తూరి కన్నడ భాషా సౌరభాలకు ప్రసిద్ధి. ఒకప్పటి చాళుక్యుల రాజధాని అయిన బాదామి (వాతాపి) ఆ జిల్లాలోనే ఉంది. నాడు ఆ రాజులు కట్టించిన గుహాలయాలు, చుట్టుపక్క ప్రాంతాలలోని దేవాలయాలు నాటి ప్రాభవానికి సజీవ సాక్ష్యాలుగా నేడు నిలిచి ఉన్నాయి. ఇక్కడి పట్టదకల్లు దేవాలయప్రాంగణాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.</p>
<p>చాళుక్యుల కాలం నాటి కొన్ని అవశేషాలను బాదామిలో ఒక సంగ్రహాలయంలో భద్రపరిచారు. ఆ మ్యూజియమ్ లోనికి ప్రవేశిస్తూనే ఒక వింత స్త్రీమూర్తి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం పేరు &#8220;లజ్జాగౌరి&#8221;. ఇదే విగ్రహాన్ని తెలంగాణాలో అలంపురం మ్యూజియమ్ లో చూడవచ్చు.</p>
<p>లజ్జాగౌరి &#8211; ఒక నగ్న స్త్రీమూర్తి. ఈ మూర్తి తన ఊరువులను పైకెత్తి, కాళ్ళను పైకి మడుచుకుని కూర్చున్నట్టుగా ఉంటుంది. ఎత్తైన చనుకట్టుతో ఈ మూర్తి, ప్రసవిస్తున్న స్త్రీ భంగిమను పోలి ఉండటం గమనించవచ్చు. ఈ విగ్రహానికి శిరస్సు లేదు. శిరస్సు స్థానంలో ఒక తామరపువ్వు, రెండు చేతులలో రెండు పద్మాలు కనిపిస్తాయి. కాలివ్రేళ్ళు కుంభాకారంలో కనిపిస్తాయి. నడుముపై ముడుతలు కూడా చూడవచ్చు. ఆధునికులకు కాస్త ఎబ్బెట్టుగా తోచగల ఈ స్త్రీమూర్తి ఒకానొక కాలంలో గ్రామీణ భారతంలో పలుప్రాంతాలలో పూజలందుకున్న దేవతామూర్తి!</p>
<p>లజ్జాగౌరి విగ్రహాలు బాదామిలోనే కాదు, కర్ణాటకలోని సిద్దనకొళ్ళ, మహాకూట, హొసపేట దగ్గరి వ్యాఘ్రేశ్వరి, నేటి తెలంగాణా-మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపురం, ఆంధ్రప్రదేశ్ దగ్గర నాగార్జునకొండ, తమిళనాడులో దశాసురమ్, మహారాష్ట్ర సతారా జిల్లలో వడగామ్, అజంతా గుహలలో ఒకానొక గుహలో, ఉస్మానాబాదులో తర అన్న గ్రామంలో, మాహోర్ఝరి, ఔరంగాబాదు దగ్గర భోగరదన్, ఉత్తరప్రదేశ్ లోని భీటా, ఒడిస్సాలో న్యువపద, ఇంకా దేశంలోని పలుప్రాంతాల్లో ఈ విగ్రహాలను గుర్తించారు. తద్వారా ఈ మూర్తి అర్చన భారతదేశంలోని పలుప్రాంతాల్లో కొనసాగినట్టు తెలుస్తూంది.</p>
<p>బాదామిలో మ్యూజియమ్ పక్కగా మెట్లదారి వెంబడి పైకెక్కితే, కొండపై ఒక పాడుబడిన దేవాలయం కనిపిస్తుంది. ఆ దేవాలయం లజ్జాగౌరి దేవాలయమట.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/12/l1.jpg"><img class="aligncenter size-full wp-image-9786" title="l1" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/12/l1.jpg" alt="" width="907" height="677" /></a></p>
<p>ఈ దేవాలయంలోని గర్భగృహం ఖాళీగా కనిపిస్తుంది. అంతే కాదు, బాదామిలో అగస్త్యతీర్థం ఒడ్డున రాష్ట్రకూటులు నిర్మించిన భూతనాథ దేవాలయం వెనుకవైపున ఉన్న ఒకానొక మందిరంలోనూ ఒకానొక నగ్నస్త్రీమూర్తి విగ్రహం గర్భగృహంలో కనిపిస్తుంది. ఈ మూర్తికి శిరస్సు కనిపిస్తుంది. కానీ ఈ విగ్రహం దేవాలయంలో స్థాపించి ఉండటం వలన &#8211; శక్తి ప్రతిరూపమైన స్త్రీమూర్తుల ఆరాధనలు ఆ కాలంలో విరివిగా కొనసాగేవని అర్థమవుతుంది.</p>
<p><img class="size-medium wp-image-9788 aligncenter" title="l2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/12/l2.jpg" alt="" height="600" /></p>
<p>లజ్జాగౌరి ఆరాధన ఖచ్చితంగా భారతదేశంలో ఏర్పడిందో చెప్పగలిగే స్పష్టమైన ఆనవాళ్ళు లేవు.మౌఖిక సాహిత్యంలో తప్ప కావ్య సాహిత్యంలో స్పష్టంగా, విస్తృతంగా లజ్జాగౌరి ప్రస్తావనలు లేకపోవటమూ ఒక విచిత్రమైన విషయం. క్రీ.శ. పండ్రెండవ శతాబ్దం తర్వాత, అంటే రాష్ట్రకూటుల పాలన తర్వాత ఈ విగ్రహాలు మృగ్యమవటం వింతలో వింత. విజయనగరకాలపు శిల్పాలలో ఎక్కడా ఈ విగ్రహాలు కనిపించిన ఆనవాళ్ళు లేవు. సమాంతరమైన మేక ముఖం, స్త్రీ దేహంతో కనిపించే రేణుకాదేవి శిల్పాలు, శిరస్సు కలిగిన నగ్న స్త్రీమూర్తి యల్లమ్మ విగ్రహాలు చోళుక కాలంలోనూ, విజయనగర రాజుల దేవాలయాలలో అక్కడక్కడా ఉన్నాయి.</p>
<p><img class="size-medium wp-image-9788 aligncenter" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/12/l3.jpg" alt="" height="200" border="1" /><br />
<img class="size-medium wp-image-9788 aligncenter" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/12/l4.jpg" alt="" height="200" border="1" /></p>
<p>అనంతపురం జిల్లా కంబదూరులోని మల్లేశ్వర దేవాలయంలో శిల్పాలు ఇవి. ఈ దేవాలయాన్ని చోళులు నిర్మిస్తే, విజయనగర రాజులు పునరుద్ధరించారు.</p>
<p>బహుశా మహమ్మదీయ, క్రైస్తవ మత ప్రభావం వల్లనో, శాక్తేయ ఆరాధన తగ్గుముఖం పట్టటం వల్లనో, లేక నగ్నరూపమైన విగ్రహారాధన &#8220;తప్పు&#8221; అన్న భావం వ్యాపించటం వల్లనో, లేక పట్టణ ప్రభావం ప్రాంతాలపై ప్రసరించటం వలననో, శైవ వైష్ణవ మతాల ప్రాబల్యం, భక్తి ఉద్యమాల ఫలితంగానో సభ్య దేవతామూర్తులకు విభిన్నమైన లజ్జాగౌరి వంటి దేవతల ఉపాసన కనుమరుగై ఉండవచ్చు.</p>
<p>ఇంతకూ ఈ లజ్జాగౌరి ఎవరు?</p>
<p>లజ్జాగౌరిని సంతాన సాఫల్యాన్ని ప్రసాదించే దేవతగా గ్రామీణులు పూజించేవారు. ఈశ్వరుని భార్య గౌరికి ఈమె ప్రతిరూపం. ఈమెయే భూదేవి అవతారమైన పరశురాముని తల్లి రేణుకాదేవి. పంటలను కాపాడి, సస్యాన్ని ప్రసాదించే శాకంబరీదేవి (బనశంకరీ దేవి). ఈ తల్లి యే ఎల్లమ్మ. అంటే ఎల్లరకూ అమ్మ.</p>
<p>భారతదేశంలో త్రిమూర్తుల భార్యలలో సరస్వతి జ్ఞానరూపిణి. లక్ష్మి సంపదలకు ప్రతిరూపం. గౌరీదేవి శక్తికి నెలవు. ఈ గౌరీదేవి భూదేవికి ప్రతిరూపంగా శాకంబరీదేవి లేదా బనశంకరిగా గ్రామీణులు భావించుకున్నారు. తన దేహంపై పంటలను పండించి, సకల జీవరాశులకూ, దేవతలకూ, దేవుళ్ళకూ కూడా ఆకలి తీర్చే శక్తి రూపిణి ఈమె. బాదామికి గ్రామ శివార్లలో శాకంబరీదేవి దేవాలయం కూడా ఉన్నది. గౌరీదేవి దేహమే సంతానాన్ని ప్రసాదించగల శక్తికి ప్రతిరూపంగా లజ్జాగౌరి మూర్తిగా భావించారు.</p>
<p>లజ్జాగౌరి విగ్రహాలన్నీ నదీ తటాక తీరాలలో దొరకడం గమనార్హం. ఇది యాదృచ్ఛికమో లేక సంతాన సంబంధమైన ఉపాసనలో నీటికి సంబంధించిన విషయమేదైనా ఉన్నదో స్పష్టంగా చెప్పగలిగే ఆనవాళ్ళు నేడు మనకు లేవు.</p>
<p>ఈ స్త్రీ మూర్తి దేనికి ప్రతీక? ప్రకృతి కార్యమైన శృంగారానికా? లేదా సంతాన సాఫల్యతకా? అన్న విషయం మీద చారిత్రక పరిశోధకులు తర్జనభర్జన పడ్డారు. ముఖ్యంగా పాశ్చాత్య పరిశోధకులు. భారతీయ దేవాలయ కళారూపాలలో గోపుర కుడ్యాల మీద శృంగార భంగిమలు ఉండటం కద్దు. అయితే గర్భగుడిలో మూర్తిగా ఆరాధించే దేవతలను శృంగార దృష్టితో నిర్మించడం, అర్చించటం కానరాదు. లజ్జాగౌరి మూర్తి భంగిమ శృంగారపరమైనది కాదు, సృష్టిపరమైనది. ఈ మూర్తి సంతాన సాఫల్యాన్ని ప్రసాదించే మూర్తిగానే ఒప్పుకోవలసి వస్తుంది.</p>
<p>బాదామికి కొంతదూరంలో, మలప్రభ నది ఒడ్డున &#8220;మహాకూటేశ్వర&#8221; క్షేత్రం ఉంది. స్కాందపురాణంలోని &#8220;శాకంబరీ మహాత్మ్యం&#8221; లో ఈ దేవాలయం గురించిన ఉటంకింపు ఇది.</p>
<blockquote><p>తటే మలాపహారిణ్యాః సంతి లింగాని కోటిశః|<br />
తాని సర్వాణి గదింతుం నాలం వర్షశతాన్యపి ||<br />
బిల్వరాజీవనం చాత్ర విద్యతే సుమనోహరమ్ |<br />
శివయా సహితః శంభుర్విశ్ర్యామతి సుఖంత్విహ ||<br />
విష్ణుపుష్కరిణీ తీరే మల్లికార్జున సన్నిధౌ |<br />
పాతాలేశం పినాకీశం లజ్జాగౌర్యాహ్వయం తథా ||<br />
కోటిలింగ వైష్ణవేశం వీరభద్రేశ్వరం తథా |<br />
నారసింహం వామనాఖ్యం శృగాలేశ్వరమేవ చ||<br />
ఏతాని నవలింగాని దురతఘ్నాని తాపసాః |<br />
పర్వతే కోటిలింగాని బిల్వచందన రాజితే ||</p>
<p>(శాకంబరీ మాహాత్మ్యం, 8.19 &#8211; 23)</p></blockquote>
<p>(మలప్రభా నదీ తీరంలో కోటానుకోట్ల లింగాలున్నాయి. వాటిని లెక్కపెట్టటానికి వందల యేళ్ళయినా సరిపోవు. అక్కడ అందమైన మారేడు తోపు కూడా ఉన్నది. శక్తితో కూడిన శివుడక్కడ సుఖంగా కొలువై ఉన్నాడు. విష్ణుపుష్కరిణి తటాన, మల్లికార్జున సన్నిధిలో పాతాలేశ, పినాకీశ, లజ్జాగౌరీశ, కోటిలింగ, వైష్ణవేశ, వీరభద్రేశ, నారసింహ, వామన, మరియు శృగాలేశ్వర నామాలతో నవలింగాలు పాపాలను బాపుతూ ఉన్నాయి. మారేడు, చందన వృక్షాలతో కూడిన పర్వతంపై కోటిలింగాలున్నవి.)</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/12/l5.jpg"><img class="aligncenter size-full wp-image-9791" title="l5" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/12/l5.jpg" alt="" width="778" height="584" /></a></p>
<p>శక్తితో కూడిన శివుడు, లజ్జాగౌరితో కూడిన ఈశ్వరుడు అన్న పేర్లు గమనార్హం. లజ్జాగౌరి ఈ క్షేత్రపాలిక. ఆ దేవి విగ్రహం కూడా చాలా కాలం క్రితం ఇక్కడ ఉండేదట. ఇక్కడ ఈశ్వరుని తొమ్మిది రూపాలలో అర్చిస్తారని స్థలపురాణం. లజ్జాగౌరి ఉపాసన కొనసాగిన తెలంగాణాలోని అలంపురంలోనూ బాదామి చాళుక్యులు కట్టించిన నవబ్రహ్మేశ్వర దేవాలయాలు ఉండటం ఆసక్తికరమైన విషయం. అయితే అలంపురంలోని నవబ్రహ్మేశ్వరులు వరుసగా &#8211; తారక, స్వర్గ, పద్మ, బాల,విశ్వ, గరుడ, కుమార, అర్క, వీర నామధారులు.</p>
<p>మహాకూట క్షేత్రపాలకుని పేరు మహాకూటేశ్వరుడు. ఈయననే ముకుటేశ్వరుడన్నారు. కూట శబ్దానికి &#8220;గూఢము&#8221;, &#8220;అబద్ధము&#8221; అన్న అర్థాలున్నాయి. లజ్జ అంటే సిగ్గు. లజ్జాగౌరి అంటే సిగ్గుతో కూడిన గౌరి. కర్ణాటకలో జానపదులు చెప్పుకునే మౌఖిక సాహిత్యపు కథలు రెండు ఉన్నవి.</p>
<p>మొదటిది:<br />
ఒకానొకప్పుడు ఈశ్వరుడు, గౌరీదేవి భూలోకంలో విహరిస్తూ, శృంగారక్రీడలో మునిగి తేలుతూ ఉన్నారు. ఆ సమయంలో సప్తర్షులు పరమేశ్వర దర్శనార్థం విచ్చేశారు. తమలోకంలో ఉన్న ఆదిదంపతులు పరవశాన్ని వీడి సప్తర్షులను గమనించి సిగ్గుతో నీరైపోయారు. తమను గమనించనందుకు సప్తర్షులు కినిసి, శంకరుని లింగరూపంలో మాత్రమే పూజలు అందుకొంటాడని శపించారు.</p>
<p>రెండవకథ:<br />
గౌరీశంకరులు ఒకానొక కొలనులో జలక్రీడలు సల్పుతున్నారు. ఆ సమయంలో ఒక భక్తుడు వారిని చూడటానికి వచ్చాడు. భక్తుని చూడగానే దంపతులకు సిగ్గు ముంచుకొచ్చింది. పరమేశ్వరుడు పరుగెత్తి గర్భగుడిలో లింగం వెనుక దాగాడు. గౌరీదేవి నీట మునిగి కనుమరుగయింది. చాలా ఎక్కువగా సిగ్గుపడ్డ కారణాన గౌరీదేవి &#8220;లజ్జాదేవి&#8221; గా పరిణమించింది.</p>
<p><span style="text-decoration: underline;">లజ్జ &#8211; లంజ</span></p>
<p>తెలుగులో, సంస్కృతంలో ఇతరత్రా భారతదేశ భాషల్లో వేశ్య, దేవదాసి అన్న అర్థాలలో &#8220;లంజ&#8221; అన్న శబ్దం ఉన్నది. ఇది నేడు ఒక తిట్టు. అశ్లీలమూ, అసభ్యమూ అయిన శబ్దం. కానీ ప్రాచీనకాలంలో, ముఖ్యంగా జనపదాలలో ఈ శబ్దానికి &#8211; నేటి కాలంలో ఉన్న క్షుద్రమైన అర్థం లేదని చూచాయగా తెలుసుకోవచ్చు. ఈ నాటికీ రాయలసీమలో కొన్ని ప్రాంతాలలో ఈ మాటను సాధారణ రూపంలో ఉపయోగించటం ఉంది. ఈ అశ్లీలమైన శబ్దానికి మూల రూపం ఏమిటో తెలియదు. ద్రవిడ శబ్దాలు &#8220;ర&#8221;, &#8220;ల&#8221; తో మొదలవవు కాబట్టి ఇది ద్రవిడభాషాశబ్దం కాదు. (Information Courtesy: సురేష్ కొలిచాల గారు) సంస్కృతనాటకాలలో &#8220;హంజే, హంజికే&#8221; అన్న ప్రయోగాలు కనిపిస్తాయి. నాయిక చెలికత్తెలను సంబోధించే తీరు అది. &#8220;లంజ&#8221; శబ్దానికి అది పూర్వరూపమేమో తెలియదు.</p>
<p>అలాగే &#8211; లజ్జా శబ్దానికి లంజ శబ్దానికి కొంత పోలిక, నేపథ్యమూ కనిపించటం విశేషం. పైన చెప్పుకున్న మహాకూట క్షేత్రానికి &#8220;నందికేశ్వరం&#8221; అన్న మరొక పేరు ఉంది. ఈ పేరు ఇప్పటికీ ఉంది. నందికేశ్వరం &#8211; ఇది అసలైన పేరు కాదు. ఈ పదబంధానికి మూలరూపం &#8220;లంజికేశ్వరం&#8221; లేదా &#8220;లంజిగేసరం&#8221;. దీనికి నిదర్శనాలు ఉన్నాయి.</p>
<p>బాదామి చాళుక్యుల వంశంలో మూడవ రాజు మంగలేశుడు (క్రీ.శ 597 &#8211; 609) అక్కడి రెండవ గుహాలయంలో (విష్ణువు గుహ) రెండు దాన శాసనాలు చెక్కించాడు. ఆ రెండు శాసనాలలో &#8220;లంజిగేసరం&#8221; అన్న ఊరిని దానమిస్తున్నట్టుగా ఉంది.<br />
అందులో ఒక శాసనం ఇది.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/12/l6.jpg"><img class="aligncenter size-full wp-image-9792" title="l6" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/12/l6.jpg" alt="" width="909" height="614" /></a></p>
<p>క్రీ.శ. 598 లో చెక్కించిన ఆ కన్నడ శాసన పాఠం ఇది.</p>
<p>&#8220;స్వస్తి శ్రీమత్ ప్రిథివి వల్లభ మంగలేసనా కల్మనె గె ఇత్తొదు లంజిగేసరం దేవక్కె పూనిఱువ మాలకారన్గె అర్దవిసది ఇత్తొదానఱెవోన్ పఞ్చ మహాపాతకనక్కుం ఏఱినెయా నరకదా పుఱుఅకుమ్&#8221;</p>
<p>ఇదే గుహలో రెండవ శాసనంలోనూ &#8220;లంజికేశ్వరం&#8221; గ్రామాన్ని పదహారు మంది బ్రాహ్మణులకు నిత్యభోజనాల సంతర్పణ కోసం వ్రాసి ఇస్తున్నట్టుగా ఉంది.</p>
<p>మహాకూట &#8211; అన్న క్షేత్రానికి అదివరకే అధిష్టాన దేవుడైన మహాకూటేశ్వరుని నామం ఉండగా, తిరిగి నందికేశ్వర నామం సంశయాత్మకమైనందునా, పైగా చాళుక్యప్రభువు మంగలేశుని దానశాసనంలో లంజికేసరం అన్న శబ్దం ప్రస్తావింపబడి ఉండటం మూలానా, ఆ క్షేత్రానికి లంజికేశ్వరమని పేరున్నట్టు అర్థమవుతుంది. అంటే లజ్జాగౌరి &#8211; లంజికేశ్వరి అన్న శబ్దాలు సమానార్థకాలని స్ఫురిస్తున్నది. దీని సంస్కార రూపమే నేటి నందికేశ్వరమయింది.</p>
<p>లంజికేశ్వరంలోని లంజిక &#8211; అన్న శబ్దమే సంస్కృతీకరింపబడి లజ్జాగౌరి అన్న పేరుగా ఏర్పడిందని కన్నడ భాషాపండితుల ఉవాచ. అంటే గౌరీదేవి పేరే &#8220;లంజిక&#8221;. స్త్రీ మూర్తి విగ్రహం &#8211; నిర్లజ్జతకు నిదర్శనంగా ఉండటం మూలాన ఆ మూర్తికి శోభనమైన పేరు కూర్చవలసిన అవసరం ఏర్పడి &#8211; లంజిక అన్న శబ్దం లజ్జాగౌరిగా మార్చి ఉంటారని కొందరు దూరాన్వయాలు చేశారు. లజ్జాగౌరి &#8211; లజ్జ విడిచిన గౌరి లేదా లజ్జాహీనమైన గౌరి అని ఆంగ్లంలో కొందరు వ్యుత్పత్తి చేసి Shamelss Goddess అన్నారు. ఈ శబ్దం అంత ఒప్పుకోదగింది కాదు.</p>
<p>లజ్జా అంటే అమ్మవారి పేరు అని చెప్పడానికి మరొక నిదర్శనం బ్రహ్మాండపురాణంలో, లలితాసహస్రనామంలోని 142 వ శ్లోకం.</p>
<blockquote><p>&#8220;మిథ్యాజగదధిష్టానా ముక్తిదా ముక్తిరూపిణీ |<br />
లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాదివందితా ||&#8221;</p></blockquote>
<p>లజ్జా అన్నది లలితాదేవి సహస్రనామాలలో ఒకటి. లలితాసహస్రనామాలలో మరొక శ్లోకం (35) లజ్జాగౌరి మూర్తికి దగ్గరగా ఉన్నది. &#8220;కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణీ&#8221; &#8211; కంఠం క్రిందు నుంచి కటి పర్యంతమూ కూటరూపంలో ఉన్న మూర్తి. ఇది లజ్జాగౌరి మూర్తితో పోలుతుంది.</p>
<p>ఈ తథ్యామిథ్య అంతా క్రీ.శ. ఆరవ దశాబ్దం నేపథ్యంలో జరుగుతున్నదని గమనించగలరు. అప్పటికి కన్నడ/తెలుగు భాషల స్వరూపం వేరు. ఈ రోజు మనకు &#8220;లంజ&#8221; అన్న శబ్దం వినిగానే ఆ శబ్దం కలిగించే ఉలికిపాటు, అశ్లీలధ్వని, అమంగళమూ నాడు ఉండవలసిన అవసరం లేదని మనం తెలుసుకోగలగాలి. బహుశా లజ్జాగౌరి (లంజిక) విగ్రహ రూపం, నగ్నత్వం, తర్వాతి కాలంలో పట్టణ ప్రభావంతో లంజిక అన్న శబ్దం నీచత్వానికి ప్రతిరూపంగా మారి ఉండవచ్చు.</p>
<p><span style="text-decoration: underline;">అదితి ఉత్తానపద</span></p>
<p>లజ్జాగౌరి ఉపాసన ఖచ్చితంగా ఏ కాలంలో ప్రారంభమయినది తెలియకుండా ఉన్నది కానీ నగ్న స్త్రీ ఉపాసన సింధునాగరికత, మెసపొటేమియా, గ్రీకు నాగరికతల లోనూ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. స్త్రీ మూర్తులలో లజ్జాగౌరిని పోలిన ప్రాచీనమైన మూర్తిని గురించి ఋగ్వేదంలో ఉటంకింపులు కనిపిస్తాయి. ఆ ఋగ్వేద మాత పేరు అదితి ఉత్తానపద.</p>
<p>అదితి ఉత్తానపద: ఋగ్వేదంలోని అనేక ఋక్కులలో ఉటంకింపబడిన ఒకానొక దేవత పేరు అదితి. ఆమెనే &#8220;అదితి ఉత్తానపద&#8221; అన్నారు. ఈ దేవత జగత్తుకంతటికీ మాత. ఈ అదితియే జనయిత్రి, పృథ్వి, మహామాత కూడా.</p>
<blockquote><p>అదితిర్ ద్యౌరదితిర్ అన్తరిక్షమ్ అదితిర్ మాతా స పితా స పుత్రః |<br />
విశ్వే దేవా అదితిః పఞ్చ జనా అదితిర్ జాతమ్ అదితిర్ జనిత్వమ్ ||<br />
(1-089-10)</p></blockquote>
<p>అదితియే ఆకాశము, అదితియే అంతరిక్షము, అదితియే తల్లి, తండ్రీ, పుత్రుడూ కూడాను. అదితియే పంచజనులైన విశ్వే దేవులు, పుట్టినది, పుట్టబోయేది కూడా అదితియే.</p>
<blockquote><p>దేవానాం యుగే ప్రథమే ऽసతః సద్ అజాయత |<br />
తద్ ఆశా అన్వ్ అజాయన్త తద్ ఉత్తానపదస్ పరి ||</p>
<p>10-072-03</p></blockquote>
<p>దేవతల మొదటి యుగంలో అసత్తు నుంచి సత్ అన్నది పుట్టింది. ఆపై ఆకాశపు అంచులు ఉత్తానపదం నుంచి పుట్టాయి.</p>
<blockquote><p>భూర్ జజ్ఞ ఉత్తానపదో భువ ఆశా అజాయన్త |<br />
అదితేర్ దక్షో అజాయత దక్షాద్ వ్ అదితిః పరి ||</p>
<p>10-072-04</p></blockquote>
<p>పాదాలను విడదీసిన ఆ మూర్తి నుంచి భూమి, భూమి నుంచి ఆకాశము పుట్టాయి.</p>
<blockquote><p>అదితిర్ హ్య్ అజనిష్ట దక్ష యా దుహితా తవ |<br />
తాం దేవా అన్వ్ అజాయన్త భద్రా అమృతబన్ధవః ||</p>
<p>10-072-05</p></blockquote>
<p>దక్ష! ఆ అదితియే నీ కూతురిగా పుట్టినది. అమృత బంధువులు, భద్రులైన దేవతలు ఆమె నుంచి ప్రభవించారు.</p>
<p>దక్షప్రజాపతికి పదముగ్గురు కుమార్తెలు. వారిలో అదితి ఒకత్తె. వారందరినీ కశ్యప మహర్షి వివాహం చేసుకున్నాడు. ఆ పదముగ్గురి సంతానమే చరాచర జీవరాశులు. కశ్యప మహర్షికి అదితికి పుట్టిన వారు ఆదిత్యులు. వారే దేవతలు.</p>
<p>ఈ అదితియే లజ్జాగౌరి, లేదా లజ్జాగౌరికి పూర్వరూపమని చారిత్రకులు, ఇండాలజిస్టులు భావిస్తున్నారు. హరప్పా నాగరికతలో తల దించుకున్న స్త్రీ మూర్తి, ఆమె యోని నుండీ ఒక తీవె వెలువడుతున్నట్టుగా చిహ్నాలున్న విగ్రహమొకటి బయటపడిందట. ఈమెయే ఆ అదితి అన్న మాతృదేవత గా భావించబడుతున్నది.</p>
<p><span style="text-decoration: underline;">స్త్రీ మూర్తి &#8211; మార్మికత</span></p>
<p>లజ్జాగౌరి విగ్రహంలో మరొక చిత్రమైన విషయం గమనించదగినది. ఈ స్త్రీ మూర్తికి శిరోరహిత మూర్తి. తల స్థానంలో పద్మం ఉండటం ఒక చిత్రం. ఇది ఒక మార్మికమైన విషయం.</p>
<blockquote><p>స్త్రీమూర్తి ప్రకృతికి నిదర్శనం. పురుష మూర్తి మేధకు చిహ్నం.<br />
స్త్రీ హృదయమైతే &#8211; పురుషుడు ఆలోచన.<br />
స్త్రీ వామార్ధమైతే &#8211; పురుషుడు దక్షిణభాగం.<br />
స్త్రీ శరీరమైతే &#8211; పురుషుడు శిరస్సు.<br />
స్త్రీ క్షేత్రం &#8211; పురుషుడు బీజం.</p>
<p>క్షేత్రభూతా స్మృతా నారీ, బీజభూతః స్మృతః పుమాన్ |<br />
క్షేత్రబీజసమాయోగాత్ సంభవః సర్వదేహినామ్ ||<br />
(మనుస్మృతి 9 -33)</p></blockquote>
<p>ప్రకృతి-పురుషుల సమగ్రరూపమే సృష్టి. అదే అర్ధనారీశ్వర తత్త్వం. వామభాగం (హృదయం ఉన్న భాగం) పార్వతిదైతే, దక్షిణభాగం ఈశ్వరునిది. మేధకు పరిమితి ఉంది. మేధ ఆలోచిస్తుంది కట్టడి చేయడానికి, నియమసహితమైన జీవనానికి మార్గాలు అన్వేషిస్తుంది. స్త్రీ శక్తికి పరిమితులూ, బాహ్యనియమాలు లేవు. ఆ శక్తి విలయానికి, జన్మకూ కూడా ఆదిభూతమైనది. విలయానికి మూలమైన శక్తి కాళీదేవి అయితే, సృజనకు మూలమైన శక్తి గౌరీదేవి.</p>
<p>శిరోరహిత శరీరం స్వచ్ఛమైన స్త్రీత్వానికి, ప్రకృతికి, శక్తి రూపానికి నిదర్శనం. తామరపువ్వు సృజనకు సంకేతం. మహావిష్ణువు పద్మనాభుడు. పద్మం ద్వారా ఆయన సృష్ట్యాదిలో బ్రహ్మను పద్మంలో నిలిపినట్టు విష్ణుపురాణం.</p>
<p>లజ్జాగౌరి శిరస్సు లుప్తమైనందున, శిరస్సు స్థానంలో పద్మం ఉండటం మూలానా, రెండు చేతులలో పద్మాలు ధరించటం మూలాన, ఈ మూర్తి సృజనకు మూలమైన ప్రకృతి శక్త్యాత్మకమైన గౌరీదేవికి ప్రతీక. కొన్ని ప్రాంతాలలో లభ్యమైన లజ్జాగౌరి విగ్రహాల పక్కన గోవు విగ్రహం కూడా కనిపిస్తుంది. గోవు &#8211; పృథివి స్వరూపం. భూమాతయే లజ్జాగౌరి.</p>
<p><span style="text-decoration: underline;">గ్రీకు బౌబో దేవత</span></p>
<p>ప్రాచీన రోమనులు &#8220;బౌబో&#8221; (Baubo) అన్న పేరుతో ఒక స్త్రీమూర్తిని కొలిచే వారు. ఆమె కూడా సంతాన సాఫల్యం ప్రసాదించే స్త్రీ దేవత. ఈ మూర్తి అర్చన క్రీ.పూ. రెండవ శతాబ్దం నుండి దాదాపు క్రీ.శ. రెండవ శతాబ్దపు మధ్య కాలంలో విరివిగా సాగేదట. &#8220;ఆర్యుల దందయాత్ర&#8221; సిద్ధాంతాన్ని నమ్మే కొందరి అంచనా ప్రకారం, భారతదేశంలో లజ్జాగౌరి &#8211; గ్రీకుదేవత బౌబోకు ప్రతిరూపం. గ్రీకు దేవత భారతదేశంలో అడుగిడిన తర్వాత ఇక్కడి తాత్విక ధోరణులకు, సిద్ధాంతాలకు అనుగుణంగా రూపు మార్చుకుని, శిరోరహిత మూర్తిగా నెలకొందట.</p>
<p>ఈ ఊహలకు సరైన కారణాలు కానీ, ఆధారాలు కానీ కనబడవు. పాశ్చాత్యులకు భారతీయమైనదేదీ ఇక్కడిది కాదు, మరెక్కడి నుంచో సంక్రమించినదన్న సంకుచితమైన దృష్టి మెండు. గ్రీకులో ఇటువంటి ఆనవాళ్ళు ఒకవేళ దొరికి ఉండకపోతే వాళ్ళే ఈ దేశంలో మూర్తి ఆరాధన అసహ్యకరమైనదని, ఆటవికమైనదని నిర్ధారించి ఉండేవారు. గ్రీకు దేశంలో బౌబో ఉపాసన ఉండేది కాదు కాబట్టి నగ్న స్త్రీ ఉపాసనను గుర్తించి భారతదేశానికి పాకిందని కల్పించారు. ప్రాచీన కాలం నుంచే Iconography లోనూ, శిల్పశాస్త్రంలోనూ అత్యున్నత ప్రమాణాలు సాధించిన భారతదేశం గ్రీకు దేవత విగ్రహాన్ని అరువు తెచ్చుకుని మార్చుకునే అవసరం కనబడదు. లజ్జా గౌరి &#8211; గ్రామదేవత. గ్రీసు దేశం ద్వారా వచ్చిన బౌబో అన్న దేవత గ్రామీణ భారతంలో ఎందుకు నెలకొన్నదని స్పష్టంగా వివరించగలిగే ఆధారాలు కూడా లేవు.</p>
<p>బహుశా వేదకాలంలోని అదితి ఉత్తానపద, రేణుక, లేదా మౌఖిక సాహిత్యపు గాథల్లోని స్త్రీ దేవతలకు గ్రామీణులు రూపం కల్పించుకుని ఉంటారు. భిన్న రూపాలలో, భిన్న నామాలతో ఈ స్త్రీమూర్తి ఉపాసన అనేక ప్రాంతాలకు పాకి ఉంటుంది. అందుకనే లజ్జాగౌరి అన్నపేరు అనేక నామాంతరాలతో కనిపిస్తుంది. అదితి, కోటవి, రేణుక, యల్లమ్మ, మాతంగి, నగ్నగాత్రి, ఆద్యశక్తి, శాకంబరి వంటి పేర్లు చాలా కనబడతాయి.</p>
<p><span style="text-decoration: underline;">రేణుక</span></p>
<p>ఈ స్త్రీమూర్తి తో ముడివడి ఉన్న రేణుక, రేణుక ఎల్లమ్మ, ఎల్లమ్మల ఉపాసన కూడా గ్రామ ప్రాంతాలలో ఉంది. రేణుకాదేవి జమదగ్ని భార్య. పరశురాముని తల్లి. రేణుక అంటే సూక్ష్మమైన ఇసుక కణం. మౌఖిక సాహిత్య కథ ప్రకారం ఈవిడ మలప్రభ నదీతీరంలో రోజూ ఇసుకతో కుండను తయారు చేసి ఆశ్రమానికి నీరు పట్టుకొచ్చేది. ఓ మారు గంధర్వ దంపతుల జలక్రీడను చూసి వివశురాలైన రేణుక నీరు తేలేకపోయింది. ఆమె పాతివ్రత్యం భంగమైనదని, జమదగ్ని ఆమెకు మరణదండన విధించాడు.ఐదుగురు కుమారులలో చివరి వాడైన పరశురాముడు తన తల్లిని, నలుగురు అన్నలను వధించాడు. ఆపై తండ్రి వరం కోరుకొమ్మంటే తల్లిని బ్రతికించాలన్నాడు. రేణుకను బ్రతికించే ప్రయత్నంలో పొరబాటున యల్లమ్మ అన్న ఒక అన్య వర్ణపు స్త్రీ తలను అతికించారు. పొరబాటు తెలుసుకుని యల్లమ్మకు రేణుక దేహాన్ని అతికించి ఆమెను కూడా బ్రతికించారు. అప్పటి నుంచి యల్లమ్మ, రేణుకాదేవి కూడా గ్రామదేవతలై పూజలందుకుంటున్నారు.</p>
<p>రేణుకాదేవి కథ, ఆమె ఉపాసన కూడా లజ్జాగౌరి దేవతకు చెందిన మలప్రభ నది పరివాహక ప్రాంతానికి చెంది ఉండటం గమనార్హం. చాళుక్యుల కాలం నాటి యల్లమ్మ దేవాలయం బాదామిలో కనిపిస్తుంది. (గుహాలయాలకు వెలుపల, అగస్త్యతటాకం తీరంలో). ఈ యల్లమ్మ విజయనగర కాలంలోనూ ఉంది. హంపిలో పట్టణద యల్లమ్మ దేవాలయం ఉంది. రేణుకాదేవియే కాకతీయులు పూజించిన ’ఏకవీర’ మాత కూడానూ.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/12/l7.jpg"><img class="aligncenter size-full wp-image-9793" title="l7" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/12/l7.jpg" alt="" width="1024" height="768" /></a></p>
<p>రేణుకాదేవి కూడా భూదేవి రూపమే. దీనికి నిదర్శనం స్కాందపురాణంలోని రేణుకా మహాత్మ్యంలో కనబడుతుంది. దేవదానవ యుద్ధంలో ఓడిన దేవతలు విష్ణువును ప్రార్థిస్తే, ఆయన ఇలా అభయమిచ్చాడు.</p>
<blockquote><p>అదితేః సంభవిష్యామి యదా గర్భే సురోత్తమాః|<br />
తదాహం ద్విజరూపేణ ఘాతయిష్యామి దానవాన్ ||<br />
త్రిసప్తకృతః పృథివీం కృత్వా నిఃక్షాత్రియామహమ్ |<br />
బ్రాహ్మణేభ్యః ప్రదాస్యామి దక్షిణార్థం మఖే శుభే ||<br />
ఏకవీరేతి విఖ్యాతా సర్వకామప్రదాయినీ |<br />
అదితిర్యాం మదంబా సా సంభవిష్యతి భూతలే ||<br />
(స్కాందపురాణం, సహ్యాద్రి ఖండము, రేణుకామహాత్మ్యం, 1.14-1.16)</p></blockquote>
<p>సురోత్తములు జన్మించిన అదితి (రేణుకాదేవి) గర్భంలో, బ్రాహ్మణుడిగా నేను జన్మిస్తాను. భూమిని పలుమార్లు చుట్టి క్షత్రియులను నిర్జిస్తాను. యజ్ఞం చేసి బ్రాహ్మణులకు భూదానం చేస్తాను. నా తల్లిగా ఏకవీర పేరుతో, అన్నికోర్కెల పంటగా అదితి భువిపై జన్మించి కీర్తిగడిస్తుంది.</p>
<p><span style="text-decoration: underline;">కూటవి</span></p>
<p>కూట్ట, కూటరా, కూటవి, కూటవై &#8211; ఇలా రకరకాల పేర్లు కలిగిన ఒక స్త్రీమూర్తి ప్రస్తావన ప్రాచీన తమిళ సాహిత్యంలోనూ, మౌఖిక సాహిత్యంలోనూ, ప్రాకృత సాహిత్యపు మూలల్లోనూ కనిపిస్తుంది. శ్రీమద్భాగవతంలో బాణాసురుని తల్లి పేరు కూటరా దేవి. వివస్త్ర అయిన ఈ స్త్రీమూర్తి బహుశా తాంత్రిక దేవత కావచ్చు. ఈ స్త్రీమూర్తి ఉపాసకులను కూడా ఆ పేరుతోను పిలిచేవారు. వారు అగుపడితే అరిష్టమని భావించేవారు.</p>
<p>లజ్జాగౌరి ఉపాసనతో ముడివడిన మరొక స్త్రీమూర్తి కూటవి.</p>
<p>తమిళనాడులోనూ, ఇతర ప్రాచీన దేవాలయాలలోనూ సప్తమాతృకల విగ్రహాలు అక్కడక్కడా కనిపిస్తాయి. అదేవిధంగా దశమహావిద్యలలో &#8220;ఛిన్నమస్త&#8221; అన్న రూపం శిరో రహితంగా కనిపిస్తుంది. లజ్జాగౌరి ఉపాసన బహుశా తాంత్రిక ఉపాసనతో కూడా ముడివడి ఉండవచ్చుననిపిస్తుంది.</p>
<p>భారతదేశం మహా విచిత్రమైన, మార్మికమైన, ఆధ్యాత్మికమైన భూమి. ఆధ్యాత్మికత, శిల్ప, చిత్రకళలూ, అనూచానమైన ఉపాసన, భక్తి విశ్వాసాలూ, సాహిత్యము, సాంప్రదాయము &#8211; ఇలా విభిన్నమైన విషయాలకు మధ్య ఒక అదృశ్యమైన తీవె యొక్క సమన్వయం కనిపిస్తుంది. లజ్జాగౌరి అన్న గ్రామదేవత మీద గత శతాబ్ద కాలంలో విస్తృతంగా పరిశోధన జరిగింది. ముఖ్యంగా పాశ్చాత్యులు ఈ మూర్తిని గురించి చాలా ఆసక్తి చూపారు. లజ్జాగౌరి మూర్తి విగ్రహాలను అమెరికాలో కొన్ని ప్రాంతాల మ్యూజియం లలోనూ నెలకొలిపినారు.</p>
<p>అయితే పూర్తిగా భారతీయ నేపథ్యంలో, చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా కొనసాగిన పరిశోధనలు అరుదనే చెప్పాలి. తెలుగులో లజ్జాగౌరి మీద వ్యాసాలు కానీ సమాచారం కానీ ఎందుచేతనో అస్సలు లేదు.. చాలా విస్తృతమైన అంశాన్ని గురించి రేఖామాత్రంగా పరిచయం చేయటానికి చేసిన ప్రయత్నం ఈ వ్యాసం.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
<p>(ఛాయాచిత్రాలు 5,6: వికీపీడియా సౌజన్యంతో.)</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=9781</wfw:commentRss>
		<slash:comments>7</slash:comments>
		</item>
		<item>
		<title>భాస కాళిదాసులు</title>
		<link>http://vaakili.com/patrika/?p=6834</link>
		<comments>http://vaakili.com/patrika/?p=6834#comments</comments>
		<pubDate>Sun, 30 Nov 2014 20:00:46 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[రవి E.N.V]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=6834</guid>
		<description><![CDATA[<p>ఆకాశంలో ఇద్దరు సూర్యులు ఉండటం అసంభవమేమో కానీ యే సాహిత్యవినీలాకాశంలోనైనా ఒకరిద్దరు కాదు అనేక సూర్యులు ఉండవచ్చు. నిజానికి సాహిత్యంలో ఒకరు గొప్ప, మరొకరు తక్కువ అని చెప్పే ప్రమాణాలేవీ కూడా కొరగావు. మరి ఆ శీర్షికకు అర్థం ఏమిటి? &#8211; అంటే అది ఆ కవుల మధ్య పోటీ కానీ పోలిక కానీ కాదు, అదొక అనుశీలనాపద్ధతి అని చెప్పవలసి వస్తుంది. అలా సంస్కృత సాహిత్యంలో ఇద్దరు కవుల ఒరవడిని, వారి కవిత్వ రీతులను, వారి కవిత్వపు లక్ష్యాలను కొంతవరకూ అర్థం చేసుకునే ప్రయత్నమే ఈ వ్యాసలక్ష్యం.</p> <p>ఆ ఇద్దరు కవులలో భాసకవి పూర్వుడు. కాళిదాసుది తరువాతి కాలం. కాళిదాసు భాసుని ప్రథితయశసుడని కీర్తించాడు.</p> <p>పై మాటను పొడిగిస్తూ కాళిదాసు &#8221; పాతదైనంత మాత్రాన గొప్ప కాదు. కొత్త అయినంతమాత్రాన విడవదగిందీ కాదు. తెలివైనవాళ్ళు బాగా అనుశీలించి తెలుసుకోగలరు. మూర్ఖులు మాత్రమే ఇతరుల మాటలు నమ్మగలరు&#8221; అని తన నాటకంలో సూచిస్తాడు.</p> <p>కాళిదాసుని, భాసుని కావ్యాలను పరిశీలిస్తే కావ్యధోరణుల్లో రెండు అద్భుతమైన, పూర్తిగా విభిన్నం కాకపోయినా, కాస్త విలక్షణమైన ధోరణులు కనిపిస్తాయి. భాసుడిది దృశ్యప్రాధాన్యత. కాళిదాసుది కవిత్త్వ ప్రాధాన్యత. భాసుడు మౌలికంగా నాటకకర్త. కాళిదాసు గొప్ప కవి. కాళిదాసు కవిత్త్వం లోతులకు వెళ్ళటానికి పాఠకునికి గొప్ప సంస్కారం అవసరం. శబ్దార్థ జ్ఞానంతో కవిత్త్వం అర్థమయినప్పటికీ చిక్కటి భావం, ఆ భావం తాలూకు పరిమళం, అర్థం చేసుకోవడానికి సామాజికుడి హెచ్చు స్థాయి సంస్కారం కావాలి. భాసుడి కవిత్వంలో ఈ అంశం అక్కడక్కడా లేకపోలేదు కానీ భాసుడు గూఢంగా సూచించేదంతా కవిత్త్వంలో కాక సంభాషణల్లో, సన్నివేశ కల్పనల్లో ఉంటుంది. కాళిదాసు పాఠకుడి మేధకు పదును పెడితే భాసుడు ప్రేక్షకుడి ఊహకు, భావనాబలానికి పదును పెడతాడు. ప్రతిభ తాలూకు రెండు విభిన్నమైన పార్శ్వాలు ఈ మహాకవుల రచనలు.</p> <p>ఈ ప్రత్యేకతను, వ్యత్యాసాల్నీ కొన్ని దృష్టాంతాల ద్వారా తెలుసుకోవచ్చు.</p> <p>కాళిదాసు రఘువంశం లో నాలుగవ సర్గ మొదటి శ్లోకం [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><span style="font-size: 30px;">ఆ</span>కాశంలో ఇద్దరు సూర్యులు ఉండటం అసంభవమేమో కానీ యే సాహిత్యవినీలాకాశంలోనైనా ఒకరిద్దరు కాదు అనేక సూర్యులు ఉండవచ్చు. నిజానికి సాహిత్యంలో ఒకరు గొప్ప, మరొకరు తక్కువ అని చెప్పే ప్రమాణాలేవీ కూడా కొరగావు. మరి ఆ శీర్షికకు అర్థం ఏమిటి? &#8211; అంటే అది ఆ కవుల మధ్య పోటీ కానీ పోలిక కానీ కాదు, అదొక అనుశీలనాపద్ధతి అని చెప్పవలసి వస్తుంది. అలా సంస్కృత సాహిత్యంలో ఇద్దరు కవుల ఒరవడిని, వారి కవిత్వ రీతులను, వారి కవిత్వపు లక్ష్యాలను కొంతవరకూ అర్థం చేసుకునే ప్రయత్నమే ఈ వ్యాసలక్ష్యం.</p>
<p>ఆ ఇద్దరు కవులలో భాసకవి పూర్వుడు. కాళిదాసుది తరువాతి కాలం. కాళిదాసు భాసుని ప్రథితయశసుడని కీర్తించాడు.</p>
<p>పై మాటను పొడిగిస్తూ కాళిదాసు &#8221; పాతదైనంత మాత్రాన గొప్ప కాదు. కొత్త అయినంతమాత్రాన విడవదగిందీ కాదు. తెలివైనవాళ్ళు బాగా అనుశీలించి తెలుసుకోగలరు. మూర్ఖులు మాత్రమే ఇతరుల మాటలు నమ్మగలరు&#8221; అని తన నాటకంలో సూచిస్తాడు.</p>
<p>కాళిదాసుని, భాసుని కావ్యాలను పరిశీలిస్తే కావ్యధోరణుల్లో రెండు అద్భుతమైన, పూర్తిగా విభిన్నం కాకపోయినా, కాస్త విలక్షణమైన ధోరణులు కనిపిస్తాయి. భాసుడిది దృశ్యప్రాధాన్యత. కాళిదాసుది కవిత్త్వ ప్రాధాన్యత. భాసుడు మౌలికంగా నాటకకర్త. కాళిదాసు గొప్ప కవి. కాళిదాసు కవిత్త్వం లోతులకు వెళ్ళటానికి పాఠకునికి గొప్ప సంస్కారం అవసరం. శబ్దార్థ జ్ఞానంతో కవిత్త్వం అర్థమయినప్పటికీ చిక్కటి భావం, ఆ భావం తాలూకు పరిమళం, అర్థం చేసుకోవడానికి సామాజికుడి హెచ్చు స్థాయి సంస్కారం కావాలి. భాసుడి కవిత్వంలో ఈ అంశం అక్కడక్కడా లేకపోలేదు కానీ భాసుడు గూఢంగా సూచించేదంతా కవిత్త్వంలో కాక సంభాషణల్లో, సన్నివేశ కల్పనల్లో ఉంటుంది. కాళిదాసు పాఠకుడి మేధకు పదును పెడితే భాసుడు ప్రేక్షకుడి ఊహకు, భావనాబలానికి పదును పెడతాడు. ప్రతిభ తాలూకు రెండు విభిన్నమైన పార్శ్వాలు ఈ మహాకవుల రచనలు.</p>
<p>ఈ ప్రత్యేకతను, వ్యత్యాసాల్నీ కొన్ని దృష్టాంతాల ద్వారా తెలుసుకోవచ్చు.</p>
<p>కాళిదాసు రఘువంశం లో నాలుగవ సర్గ మొదటి శ్లోకం ఇది.</p>
<blockquote><p><span style="color: #993300;">సరాజ్యం గురుణా దత్తం ప్రతి పద్యాధికం బభౌ|</span><br />
<span style="color: #993300;"> దినాన్తే నిహితం తేజ: సవిత్రేవ హుతాశన: ||</span></p></blockquote>
<p>తండ్రి దిలీపుని చేత రాజ్యమును బడసిన ఆ రఘుమహారాజు &#8211; సాయంసంధ్యలో సూర్యుని చేత ఉంచబడిన తేజస్సును స్వీకరించిన అగ్నిలాగా మిక్కిలి ప్రకాశిస్తున్నాడు. &#8211; ఇది మౌలికార్థం. సూర్యుడు &#8211; దిలీపుడిగా, అగ్ని &#8211; రఘుమహారాజుగా ఉపమించబడ్డారు. చక్కని ఉపమాలంకారం. రాజ్యనిర్వహణ భారాన్ని వారసునికి అప్పగిస్తున్న సూర్యవంశపు రాజును సూర్యునితో ఉపమించడం &#8211; మనోహరమైన సంవిధానం.<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/11/rama.jpg"><img class="alignright size-medium wp-image-6918" title="rama" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/11/rama-300x224.jpg" alt="" width="300" height="224" /></a></p>
<p>బాగానే ఉంది కానీ సూర్యుని తేజస్సును అగ్ని స్వీకరించడమేమిటి? &#8211; ఇది తెలియాలంటే మల్లినాథసూరి వంటి పండితుని వ్యాఖ్యానం కావాలి. ఆదిత్యో వా అస్తమయన్నగ్నిమనుప్రవిశతి &#8211; అగ్నిం వా ఆదిత్యస్సాయం ప్రవిశతి &#8211; అని ఋగ్వేదంలో ఉందట. (ఆదిత్యుడు అస్తమయం చెంది అగ్నిలోనికి ప్రవేశిస్తాడు, ఆదిత్యుడు అగ్నిని సాయం సమయమున ప్రవేశిస్తాడు) ఈ ప్రమాణం ఆధారంగా కవి మనోహరమైన కల్పన చేశాడు. ఈ విధమైన గూఢార్థ ప్రతిపాదకమైన కల్పన శ్రవ్యకావ్యంలో చెల్లుతుంది. పాఠకుడికి సావకాశంగా చదువుకునే తీరుబడి ఉంది కనుక. పాఠకుడికి సంస్కారం పెంచుకుని మళ్ళీ మళ్ళీ చదువుకునే వెసులుబాటు ఉంది కనుక. ఇది శ్రవ్యకావ్యాలకు చక్కగా అన్వయించే అద్భుత సంవిధానం. అయితే దృశ్యకావ్యం, ఆ కావ్యలక్ష్యాలు వేరు.</p>
<p>దృశ్యకావ్యమైన నాటకపు ప్రధాన ప్రయోజనం భరతముని ఈ విధంగా పేర్కొన్నాడు.</p>
<blockquote><p><span style="color: #993300;">దుఃఖార్తానాం శ్రమార్థానాం తాపార్థానాం తపస్వినాం నాట్యమేతద్భవిష్యతి |</span></p></blockquote>
<p>నాటకప్రయోజనం &#8211; సామాన్యులను ఉద్దేశించినది. నాటకపు లక్ష్యంకూడా అన్ని వర్ణాల వారికి అందుబాటులో ఉండగల ఉత్తమ లక్ష్యసాధన కాబట్టి కాళిదాసుకన్నా అంతో ఇంతో భాసుని నాటకకళ నాట్యశాస్త్ర (దృశ్యకావ్య) లక్ష్యాలకు దగ్గరగా ఉంటుందని అనుకోవలసి వస్తుంది.</p>
<p>కాళిదాసు అభిజ్ఞాన శాకున్తలంలోని ఈ ఉదాహరణ చూద్దాం.</p>
<blockquote><p><span style="color: #993300;">తవాऽస్మి గీతరాగేణ హారిణా ప్రసభం హృతః |</span><br />
<span style="color: #993300;"> ఏష రాజేऽవ దుష్యన్తః సారంగేణాతిరంహసా||</span></p></blockquote>
<p>౧. &#8220;ఎలా అయితే వేగంగా పరిగెడుతున్న సారంగము (దుప్పి)చేత ఈ రాజు దుష్యంతుడు ఆకర్షింపబడెనో, అలాగే నీ గీతరాగాల చేత నన్ను నేను మిక్కిలి కోలుపోతిని.&#8221; &#8211; ఇది సాధారణమైన అర్థం.</p>
<p>౨. సారంగం అంటే ఒక రాగం పేరు. ఆ రాగాన్ని వీరరసప్రధానమైన ఘట్టంలో ఉపయోగిస్తారు. వీరరసానికి ఉత్సాహం స్థాయీభావం. దుష్యంతుడు మృగయావినోదంలో ఉన్నాడు. ఉత్సాహంతో జింకను వెంబడిస్తున్నాడు. ఈ నేపథ్యంలో &#8220;వీరరసప్రధానమైన రాగం (అనే దుప్పి) చేత తీవ్రంగా దుష్యంతుడు ఎలా ఆకర్షితుడైనాడో, అలా నేను నీ పాటలతో ఆకర్షింపబడితిని.&#8221;- ఈ అర్థం ఒకింత చమత్కారభరితం.</p>
<p>౩. సారంగ రాగాన్ని మధ్యాహ్నం పూట ఉపయోగిస్తారు. శాకుంతలంలో ఈ ఘట్టం సరిగ్గా మధ్యాహ్న వేళ జరుగుతుంది. &#8220;అపరాహ్ణసమయంలో ఆలాపన చేయదగిన ఒక రాగం చేత దుష్యంతుడు ఆకర్షితుడైనట్టు నేను నీ గానం చేత కోలుపోతిని.&#8221; ఇది ఇంకో కోణంలో స్ఫురించే అర్థం.</p>
<p>ఇంకా -</p>
<p>౪. శ్లోకంలో &#8220;గీతరాగేణ&#8221; అన్న సూత్రధారుని మాట సారంగరాగ ప్రస్తావనలో చమత్కారభరితమైన సూచననివ్వడం ఒక ఆకర్షణ &#8211; ఇది తెలిస్తే &#8211; ఔచిత్యం రసస్పర్శకు కలిగించే శోభ మరింతగా తెలుస్తుంది.</p>
<p>౫. సంస్కృతంలో పొల్లు అక్షరాలు &#8211; ఖ ఛ ఠ థ ఫ, ఘ ఝ ఢ ధ భ &#8211; వీటిని మహాప్రాణాలు అంటారు. అవి కాక మిగిలినవి అల్పప్రాణాలు. పైన శ్లోకం శ్రద్ధగా గమనిస్తే &#8211; ప్రసభంలో &#8211; &#8220;భ&#8221; అన్న ఒకే ఒక్క మహాప్రాణాక్షరం (పొల్లు అక్షరం) తప్ప, మిగిలినవన్నీ అల్పప్రాణాక్షరాలు. ఇలా పొల్లు అక్షరాలు లేకుండా ఉన్న కవిత్త్వపు శబ్దగుణాన్ని &#8211; సుకుమారత్వమని లాక్షణికులన్నారు. (అపరుషవర్ణఘటితత్వం సుకుమారత్వమ్ &#8211; రసగంగాధరః) కాళిదాసకవితలోని ఒకానొకపార్శ్వం సుకుమారత్వం. ఇది ఈ కవితలో అలా అలవోకగా తడుతోంది.</p>
<p>ఇలా ఒక్క శ్లోకాన్ని విభిన్న సాహిత్య దృక్కోణాల సహాయంతో శక్త్యానుసారం విప్పుకుంటూ పోతే పొరలుపొరలు(layers)గా భిన్నార్థాలు/భిన్న సౌరభాలు విడివడి అల్పాక్షర అనల్పార్థ రమణీయమై శోభించేది కాళిదాసు రచన. సంగీతం, సాహిత్యం, ఔచిత్యం, గుణాలు ఇవన్నీ తెలిసిన పండితుడైన రసికునికి ఈ శ్లోకం ’చదవ’గానే ఆ భిన్న భావాల తాలూకు సాంద్రమైన పరిమళం ఒక గొప్ప అనుభూతిగా ఘుప్పుమని తాకుతుంది. అంటే ఈ శ్లోకపరిమళం పాఠకుడు/ప్రేక్షకుడి పాండిత్యానికి అనులోమమై ఉందన్న మాట. మరొక విధంగా చెప్పాలంటే ఇన్ని విభిన్నార్థాల కవిత్వపు సారాన్ని చిక్కగా పూర్తిగా తెలుసుకోవాలంటే పాఠకునికి హెచ్చు స్థాయి సంస్కారం తప్పనిసరి!</p>
<p>ఇక్కడ ఒక విషయం శ్రద్ధగా గమనించాలి. అభిజ్ఞాన శాకుంతలం ఒక నాటకం. నాటకమన్నది ఒక దృశ్యపరమైన సంవిధానం. దీనిని సామాజికులు &#8220;చూస్తారు&#8221;. చూసే ప్రేక్షకుడికి &#8211; చదివే పాఠకుడికి ఉన్నంత తీరిక, వెసులుబాటు లేవు, చూస్తున్న దృశ్యం అలా ఛప్పున కరిగిపోతుంది కనుక. కాబట్టి &#8220;ప్రేక్షకుడి&#8221;ని గాఢమైన అనుభూతికి గురి చేయగలగాలంటే &#8211; ఒక &#8220;భావం&#8221; ద్వారా చెప్పగలిగిన మనోహరమైన అర్థాన్ని &#8220;దృశ్యం&#8221; ద్వారా చెప్పగలగాలి. పైగా నాట్యశాస్త్రపు లక్ష్యం పండితులు మాత్రమే కాదు. సాధారణప్రకృతులు కూడానూ.</p>
<p>శాకుంతలంలో తర్వాతి శ్లోకం ఇది.</p>
<blockquote><p><span style="color: #993300;">గ్రీవాభంగాభిరామం ముహురనుపతతి స్యన్దనే దత్తదృష్టిః</span><br />
<span style="color: #993300;"> పశ్చార్ధేన ప్రవిష్టః శరపతనభియా భూయసా పూర్వకాయమ్ |</span><br />
<span style="color: #993300;"> దర్భైరర్ధావలీఢైః శ్రమవివృతముఖభ్రంశిభిః కీర్ణవర్త్మా</span><br />
<span style="color: #993300;"> పశ్యోదగ్రప్లుతత్వాద్వియతి బహుతరం స్తోకముర్వ్యాం ప్రయాతి ||</span></p></blockquote>
<p>రాజా అదుగో చూడు! మెడను కాస్త వంచి క్రీగంట మన రథం మీద దృష్టిపెట్టి తిరిగి చూస్తూ, బాణం పడుతుందేమోనని ముడుచుకుంటూ, శ్రమవల్ల వచ్చిన ఆయాసంతో నోరు తెరిచి, గడ్డిపోచలు జారవిడుస్తూ, భూమిపైన కంటే, గాల్లోనే ఎక్కువభాగం ఉండేట్లుగా జింక వేగంగా పరిగెత్తుతూంది.</p>
<p>(గ్రీవమంటే మెడ. గ్రీవాభంగమంటే మెడను తిప్పడం, గ్రీవాభంగ అభిరామం అంటే అందంగా మెడను తిప్పడం. స్యన్దనమంటే రథం)</p>
<p>మమ్మటభట్టారకుని కావ్యప్రకాశంలో ఈ శ్లోకం భయానకరసానికి ఉదాహరణగా చూపబడింది. చక్కని చిత్తరువు లాంటి దృశ్యం ఈ శ్లోకం కళ్ళకు కట్టిస్తుంది.</p>
<p>అయితే ఇక్కడానూ &#8211; ఈ శ్లోకాన్ని కావ్యనాయకుడైన దుష్యంతుని రథసారథి మాతలి &#8220;చదువుతాడు&#8221; లేదా గానం చేస్తాడు. తెరపై గ్రీవాభంగాభిరామం చేసే జింక కనిపించే అవకాశం లేదు కాబట్టి రసస్పర్శ పాఠకనిష్టమే తప్ప దృశ్యబద్ధం కాదని చెప్పుకోవలసి వస్తుంది. మరొక విధంగా చెప్పాలంటే &#8211; ఈ శ్లోకం ద్వారా ప్రేక్షకుడికి &#8220;రాజు మృగయావినోదం&#8221; లో ఉన్నాడన్న informative value తప్ప సన్నివేశం పరిపుష్టం కావడమో, లేక పాత్రధారి స్వభావంలో అరుదైన పార్శ్వం బయటకు తెలియడమో వంటి అదనపు ప్రయోజనం లేదు. అయితే ఇదే శ్లోకాన్ని &#8220;పాఠకుడు చదువుకుంటే&#8221; దొరికే ఆనందం అంతు లేనిది.</p>
<p>ఇలాంటి సందర్భాలలో భాసుడు విషయానికి దృశ్యపరమైన ప్రాధాన్యత ఇచ్చి, తన కవితాసామర్థ్యాన్ని సంయమనంతో కట్టడి చేసుకున్నట్టు అనిపిస్తుంది. ప్రతిమానాటకంలోని శ్లోకం ఇది.</p>
<blockquote><p><span style="color: #993300;">సమం భాష్పేణ పతతా తస్యోऽపరి మమాప్యధః |</span><br />
<span style="color: #993300;"> పితుర్మే క్లేదితౌ పాదౌ మమాపి క్లేదితం శిరః ||</span></p></blockquote>
<p>నాపైనా, ఆయనపైనా కూడా అశ్రువులు పడుతున్నాయి. తండ్రి పాదాలు తడుస్తుంటే, నా శిరస్సు తడిచింది.</p>
<p>రాముణ్ణి దశరథుడు పిలిపించి పట్టాభిషేకం జరిపించదలిచి ఆవిషయం రామునితో చెప్పాడు. ఆ సందర్భాన్ని తదనంతరం జానకి దగ్గర రాముడు చెపుతూ ఉటంకించిన శ్లోకం ఇది. ఆ సందర్భంలో రాముడు దశరథుని పాదాలపైన పడి ఏడుస్తున్నాడు. రాముని అశ్రువులు దశరథుని పాదాలను అభిషేకిస్తున్నాయి. దశరథుడూ ఉద్వేగం ఆపుకోలేక ఏడుస్తున్నాడు. ఆయన అశ్రువులు రాముని శిరస్సును తడుపుతున్నాయి. భావశబలత అంటే &#8211; ఒకే సమయంలో భిన్నభావాలు చుట్టుముట్టడం. పై శ్లోకం తండ్రీకొడుకులిద్దరి భావశబలతలనూ వివరించడానికి చిత్రించడానికి భాసుడు ఎన్నుకున్న అతి క్లుప్తమైన విధానం. రాముని దుఃఖానికి కారణమేమిటి? &#8211; తనకు పట్టాభిషేకం జరిగితే తనకు దూరమై వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాడేమోనని దిగులు, కొత్త పదవిని స్వీకరించబోయేప్పుడు వచ్చే ఉద్విగ్నత, తండ్రి ఎందుచేతనో కన్నీరు కారుస్తున్నాడు కాబట్టి కారణం తెలియక ఉబికిన మనస్తాపం, వగైరా వగైరా. ఇవే విధమైన కారణాలు దశరథుని పక్షాన కూడా ఊహించవచ్చు. ఈ విషయాలను వ్యాఖ్యానిస్తే స్వారస్యం చెడుతుంది.</p>
<p>ఈ శ్లోకం చదువగానే/వినగానే పాఠకునిలో/శ్రోతలో దాగున్న ప్రేక్షకుడు నిదుర లేస్తాడు.పొరలు పొరలుగా విడివడే పాండిత్యపు అంశాలకన్నా ఛప్పున ’ప్రేక్షకుని’ ఊహలో మెదిలిన దృశ్యానికి పదును ఇక్కడ. అంటే పైని శ్లోకం చదివినప్పుడు కన్నా శ్లోకం ద్వారా ఆవిష్కృతమయ్యే దృశ్యాన్ని ఊహించడం వల్ల కలిగే ఆనందం ఎక్కువ. ఇది భాసకవిత తత్వం.</p>
<p>రామాయణం ప్రసక్తి వచ్చింది కాబట్టి చిన్న పిడకలవేట.</p>
<p>(పైని పదచిత్రాన్ని పోలిన పదచిత్రం గాథాసప్తశతిలోనూ కనబడుతుంది. ఆ గాథ భావం ఇది.</p>
<p>జోరుగా వర్షం. తడిచిన పాక. ఒక పల్లెయువతి పాక చూరుపైనుండి పడుతున్న వర్షానికి అడ్డంగా గొడుగులా తన తల పెట్టింది. సమయానికి భర్త ఇంట్లో లేడు. ఇంట్లో చిన్న పిల్లవాడున్నాడు. వర్షంనుండీ కొడుకును కాపాడుకున్న ఆ పిచ్చితల్లి తన కన్నీరుతో కొడుకు తడిచిపోతున్నాడని తెలుసుకోలేకపోయింది.</p>
<p>ఇక్కడ తల్లి తలపైనా, బిడ్డ తలపైనా కూడా నీరు!)</p>
<p>పైన భయానక రసానికి కాళిదాసు ఉదాహరణకు మల్లే వియోగ శృంగారానికి ఉదాహరణగా భవభూతి ఉత్తర రామచరితమ్ అనే నాటకం లో ప్రసిద్ధి కెక్కిన శ్లోకం ఒకటి ఉంది.</p>
<p>&#8220;కిమపి కిమపి మందం&#8230;&#8221; (ఈ శ్లోకం కథాకమామీషు ఇక్కడ (<a title="http://indrachaapam.blogspot.in/2013/11/9.html" href="http://indrachaapam.blogspot.in/2013/11/9.html" target="_blank">http://indrachaapam.blogspot.in/2013/11/9.html</a>) వివరంగా చదువుకోండి)</p>
<p>వందమాటల్లో చెప్పలేనిది ఒక్క చిన్న దృశ్యంలో చెప్పగలం. భాసుడు ప్రతిమానాటకం మొదటి అంకం లో సీతారాముల మధ్య సున్నితమైన శృంగారాన్ని దృశ్యబద్ధం చేసిన తీరు ఇది.</p>
<p>సభ నుంచి రాముడు అప్పుడే అంతఃపురానికి వచ్చేడు. సీత అప్పుడే ఏదో కారణం చేత తన ఆభరణాలన్నీ తీసి నారబట్టలు వేసుకుంటే తనెలా ఉంటానోనని చూచుకోవాలని ముచ్చటపడుతున్నది. (అప్పటికి రాముడు వనవాసానికి వెళ్ళాలని తీర్మానం కాలేదు)</p>
<p>&#8220;మైథిలీ, నారబట్టలు నువ్వు కట్టుకో, నేను అద్దం పట్టుకుంటాను&#8221;</p>
<p>అద్దంలో తనూ, మైథిలీ ఇద్దరు కనబడేలా అద్దంపట్టుకున్నాడు రాముడు. సీత నారబట్టలు ధరించింది. అప్పుడు రాముడన్నాడు.</p>
<blockquote><p><span style="color: #993300;">ఆదర్శే వల్కలానీవ కిమేతే సూర్యరశ్మయః |</span><br />
<span style="color: #993300;"> హసితేన పరిజ్ఞాతం క్రీడేన నియమస్పృహా ||</span></p></blockquote>
<p>&#8220;అద్దంలో నారబట్టలు కావు సూర్యకిరణాలని నీ చిరునవ్వు వల్ల తెలుస్తూంది. ఇవి ఊరికే అలా వేసుకున్నావా? లేదా ఏదైనా వ్రతమా?&#8221;</p>
<p>ఆపైన రాముడు మాటమార్చాడు. (సీత అందంగా సిగ్గుపడి ఉంటుందని అన్యాపదేశంగా గడుసువాడైన భాసమహాకవి ఇచ్చిన సూచన అన్నమాట)</p>
<p>పైన దృశ్యంలో చమత్కారం ఒకటుంది. అద్దంలో ఒకే సమయంలో భార్యాభర్తలు అయిన వారు మాత్రమే ఒకరి ప్రతిబింబాన్ని మరొకరు చూసుకోవాలి. (ఒకవేళ అలా పెళ్ళికాని యువతీయువకులు చూచుకోవడం అకస్మాత్తుగా జరిగితే వారికి భవిష్యత్తులో పెళ్ళి జరుగుతుందని ఒకప్పటి నమ్మకం). ఈ నేపథ్యంలో నవదంపతుల మధ్య ఈ దృశ్యం చాలా అందమైన, సున్నితమైన ప్రణయాన్ని ఉద్యోతిస్తుంది.</p>
<p>సూర్యవంశపు రాజు అయిన రామునిచేత &#8220;అద్దంలో సూర్యకిరణాలా&#8221; అని అనిపించటం మరొక గడుసుతనం.</p>
<p>ఈ విధంగా కవిత్త్వంతో దృశ్యాన్ని ముడిపెట్టటం వల్లనేమో కాబోలు భాసుని దృశ్యాలు గుర్తున్నంతగా శ్లోకాలు గుర్తురావు. కాళిదాసాదుల కవిత్త్వంలో కవిత్త్వం అలవోకగా మనసులో మెదలిపోతుంది.<br />
తెలుగులో కవిబ్రహ్మ తిక్కన కవిత్వంలో ఈ తత్త్వం కనిపిస్తుందని తదజ్ఞులంటారు. తిక్కన పద్యాన్ని దృశ్యంతో, పలికే విధానంతో విడదీయడం కష్టం. మరో విధంగా చెప్పుకోవాలంటే తిక్కన పలుకును రక్తికట్టించడానికి గొప్ప వ్యాఖ్యాత కన్నా మంచి నటుడు కావాలి. నర్తనశాలలో ఎన్టీవోడు చేతులు తిప్పుతూ, &#8220;జూదమిక్కడ నాడంగ రాదు సుమ్మో&#8221; అన్న దృశ్యం చూచిన తర్వాత ఎవ్వరికీనూ &#8220;ఏనుంగునెక్కి&#8221; అన్న విరాటపర్వపు తిక్కన పద్యాన్ని ఆ దృశ్యం గుర్తుకు రాని విధంగా చదువుకోవడం సాధ్యం కాదేమో బహుశా!</p>
<p>పైన చెప్పిన విధంగా ఉన్న దృశ్యపరమైన కూర్పులు ఎన్నో కనిపిస్తాయి భాసమహాకవి కవితలో. సంధ్యాసమయాన్ని ఈ ఇద్దరు కవులూ వర్ణిస్తే ఎలా ఉంటుందో చూస్తే, ఈ ఇద్దరు కవుల రీతులలో విభిన్నత మరింత స్పష్టంగా తెలుస్తుంది.</p>
<p>భాసమహాకవి స్వప్నవాసవదత్తంలో &#8211; వాసవదత్త మరణించిందని కల్పించారు. ఆమె భర్త ఉదయనుడు ఉన్మత్తుడయినాడు. అజ్ఞాతంలో ఉన్న వాసవదత్త శూన్యహృదయ. మునివాటికకు వచ్చిన పద్మావతి ఆశ్రమం నుండి వెనుకకు మరలుతూంది. ఈ నేపథ్యంలో -</p>
<p>మొదటి అంకం చివర సంధ్యావర్ణన:-</p>
<blockquote><p><span style="color: #993300;">ఖగా వాసోపేతాః సలిలమవగాఢో మునిజనాః</span><br />
<span style="color: #993300;"> ప్రదీప్తోऽగ్నిర్భాతి ప్రవిచరతి ధూమో మునివనమ్ |</span><br />
<span style="color: #993300;"> పరిభ్రష్టో దూరాద్రవిరపి సంక్షిప్తకిరణః</span><br />
<span style="color: #993300;"> రథం వ్యావర్త్యాऽసౌ ప్రవిశతి శనైరస్తశిఖరమ్ ||</span></p></blockquote>
<p>పక్షులు గూళ్ళకు చేరుతున్నాయి. మునిజనులు నీటిని తెచ్చుకుంటున్నారు. (సాయంకాల నిత్యకర్మల కోసం). అగ్నిహోత్రం ప్రకాశిస్తూంది. దూరంగా జారిన ఉదయనుడు (సూర్యుడు) సంక్షిప్తకిరణాలతో రథాన్ని మరల్చి మెల్లగా అస్తాచలాన్ని చేరుకుంటున్నాడు.</p>
<p>ఇక్కడ చెప్పుకోవలసిన అంశం ఏమంటే &#8211; క్రుంగిపోయిన సూర్యుని వర్ణన &#8211; ఉదయనుని పరిస్థితిని కూడా ప్రతిబింబిస్తున్నది. అంటే వర్ణనను &#8220;ఉదయనుడి&#8221; మనస్సులో శూన్యాన్ని వర్ణించడానికి కవి ఉపయోగించుకున్నాడు. పాత్ర స్వభావం ఉద్యోతమవడమన్న అదనపు అంశం ఇక్కడ గమనించదగ్గది.</p>
<p>కాళిదాసు సంధ్యావర్ణన ఇది.</p>
<p>విక్రమోర్వశీయంలో ఊర్వశి విరహతప్తుడైనాడు పురూరవసుడు. ఆ సందర్భంలో రెండవ అంకం చివర మధ్యాహ్న వర్ణన</p>
<blockquote><p><span style="color: #993300;">ఉష్ణాలుః శిశిరే నిషీదతి తరోల్మూలాల వాలే శిఖీ</span><br />
<span style="color: #993300;"> నిర్భోద్యోऽపరి కర్ణికారముకుళా న్యాలీయతే షట్పదః |</span><br />
<span style="color: #993300;"> తప్తం వారి విహాయతీరనళినీం కారండవః సేవతే</span><br />
<span style="color: #993300;"> క్రీడావేశ్మని చైష పఞ్జరశుకః క్లాన్తో జలం యాచతే ||</span></p></blockquote>
<p>నెమలి ఎండవేడిమికి పొదల మొదల్లో దాగింది. తుమ్మెద గోగుపూవు లోపలకు చొచ్చుకుని వెళ్ళి కూర్చుంది. కారండవపక్షి నీటిని విడిచి ఒడ్డున తామరచెట్టు నీడన సేదతీరుతూంది. క్రీడాగృహంలోని పంజరపు చిలుక దప్పితో నీటిని అడుగుతోంది.</p>
<p>ఇక్కడ నాయకుని ప్రస్తావన లేదు. నాయకుని విరహం కవిత్వంలో అంతర్భాగం కాలేదు. స్వభావోక్తి లో వర్ణనకు మాత్రమే &#8220;తావు&#8221; నిచ్చిన చిక్కని &#8220;కవిత్త్వరీతి&#8221; ఇది.</p>
<p>తెరపై కనిపించే పాత్రను లేదా దృశ్యాన్ని వర్ణించి, ఆ వర్ణన కూడా వర్ణన కోసం కాక, సన్నివేశం కోసమే ఉపయోగించుకున్న గడుసైన పని భాసమహాకవి మధ్యమవ్యాయోగం అనే ఏకాంకిక లో కనబడుతుంది. ఒక బ్రాహ్మణుడు, బ్రాహ్మణి, ముగ్గురు పిల్లలు ఒక అడవిలో వెళుతున్నారు. ఉన్నట్టుండి ఒక భయంకరాకారం వారి ముందు ప్రత్యక్షమయ్యింది. ఆ ఆకారం ఘటోత్కచుడన్న రాక్షసుడిది. అతణ్ణి చూసి ఆ బ్రాహ్మణ కుటుంబంలో అందరూ ఎవడు వీడిలా ఉన్నాడు అని అతని ఆకారాన్ని చూచి అబ్బురపడుతూ, భీతిల్లుతూ ఒక్కొక్కరుగా వర్ణించారు.</p>
<blockquote><p><span style="color: #993300;">తరుణరవికరప్రకీర్ణకేశః భృకుటిపుటోజ్జ్వలపింగలాయతాక్షః |</span><br />
<span style="color: #993300;"> సతడిదివ ఘనః సకణ్ఠసూత్రః యుగనిధనే ప్రతిమాకృతిర్హరస్య ||</span></p></blockquote>
<p>(బాలభానుని కిరణాల్లా ఎర్రటి వెడల్పైన కేశాలు, బంగారపు రంగు కనుబొమలు, కారుమేఘంపై మెరుపులా కంఠసూత్రంతో ప్రళయకాలంలో రుద్రునిలా ఉన్నాడు)</p>
<blockquote><p><span style="color: #993300;">గ్రహయుగళనిభాక్షః పీనవిస్తీర్ణవక్షః కనకకపిలకేశః పీతకౌశేయవాసః |</span></p></blockquote>
<p>(కళ్ళు రెండూ గ్రహాల్లా, విశాలమైన వక్షంతో, బంగరు రంగు జుత్తుతో, పచ్చటి బట్టలతో&#8230;&#8230;)</p>
<p>ఈ వర్ణనలు ఇలా సాగుతాయి. ఇక్కడ గమనించవలసింది ఏమంటే &#8211; ఆ విచిత్రమైన జీవి తెరపై కనిపిస్తాడు. కాబట్టి ఆ పాత్రధారి వస్త్రధారణా, అలంకారాలు తీర్చిదిద్ది, ఆంగికాభినయాన్ని ప్రజ్జ్వలంగా భాసింపజేసే నటుడిని తగిన వాణ్ణి ఎంచుకుని, సన్నివేశాన్ని ఎంతవరకైనా రక్తికట్టించడానికి అవకాశం ఉంది. ఈ వర్ణనలన్నీ దృశ్యప్రాధాన్యమైనవి, పైగా ఆ వర్ణనా, ఆ వర్ణనకు తగిన నటుడు తెరపై స్పష్టంగా కనిపిస్తున్నారు, కాబట్టి శ్రవణ, చక్షురింద్రియాల సంఘటితమైన సద్యఃపరనిర్వృతి అన్నది ప్రేక్షకునికి చేరుతోంది. పైన మరొక విషయం ఉంది. మొదటి శ్లోకంలోని తరుణ-రవి-కర-ప్రకీర్ణ-కేశః, రెండవ శ్లోకంలోనొ కనక-కపిల-కేశః ఈ రెండు సమాసాలు పునరుక్తులుగా కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఘట్టాన్ని బట్టి చూస్తే భీతిల్లిన బ్రాహ్మణకుటుంబ పాత్రల పరంగా ఆలోచిస్తే, ఈ పునరుక్తి భయానక రసానికి పోషకమవుతుంది కనుక దోషం కాదు, గుణమని భావించాలి.</p>
<p>ఇది స్థూలంగా ఇద్దరు మహాకవుల కవిత్త్వపు తీరు. వీటికి మినహాయింపులు లేకపోలేదు.</p>
<p>చివరగా &#8211; ఈ చిన్ని వ్యాసంలో అనుశీలన లక్ష్యమంతా ఇద్దరు కవుల రచనలనూ సరైన పద్ధతిలో అర్థం చేసుకునేందుకు మాత్రమే ఉపయోగపడాలని వ్యాసకర్త ఆకాంక్ష.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
<p>&nbsp;</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=6834</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
		</item>
	</channel>
</rss>
