కవిత్వం

విషమ పరిస్థితి… ఓరిక్ గ్లెండే జాన్స్

25-జనవరి-2013

కళ్ళు మిరిమిట్లు గొలిపేలా
చంద్రుడు ఆకాశంలో మెరిస్తే నేమిటి
ఆ చిట్టడవి చివర చెట్లగుబురులతో
చుక్కలు దోబూచులాడితే నేమిటి?

తుప్పలునరికి, చదునుచేసీ కలుపుతీసీ
మనిషి విత్తు నాటవలసిందే,
దానికి రక్షణగా దడికట్టినపుడు
హెచ్చరికగా తెల్లగీత గీయవలసిందే.
.
అందమైన వయిలెట్ పువ్వులగురించీ
మనుషులు చేసే పనులు చెప్పడానికీ
వానలా పెద్దచప్పుడు చేసుకుంటూ
దేముడు వస్తేనేమిటి?

నా మెదడుకి పదునుపెడుతూ
నా పాట్లు నే పడవలసిందే
నాకు తెలిసిన అన్న మాటల్లోంచి
ఒక సత్యాన్ని ఆవిష్కరించవలసిందే.

***
ఓరిక్ గ్లెండన్ జాన్స్
జూన్ 2, 1887 – జులై 8, 1946.
అమెరికను కవి, నాటక కర్తా

ఓరిక్ జాన్స్, టీ ఎస్. ఏలియట్, స్కాట్ ఫిజెరాల్డ్, ఎర్న్ స్ట్ హెమింగ్వే మొదలయిన హేమా హేమీల సాహిత్యవేత్తల కూటమిలో ఒకడు. అతను 5 కవిత్వ సంకలనాలు వెలువరించేడు. 1912 లో The Lyric Year అన్న పత్రిక నిర్వహించిన కవితల పోటీలో ఎడ్నా సెంట్. విన్సెంట్ మిలే పై గెలుపొందాడు. కాని తర్వాత విషయాలు తెలుసిన తర్వాత తనకి అనుకూలంగా వచ్చిన నిర్ణయం న్యాయబద్ధమైనది కాదు అని చెప్పిన ఔదార్యుడు.
ఇక్కడ కవి వ్యవసాయంలోంచి ఉపమానం ఇస్తున్నట్టు కనిపించినా, అది నిజమైన వ్యవసాయానికి సంబంధించినది కాదు. ఇక్కడ దేముని ఉనికితో సంబంధంలేకుండా,(ఉన్నా లేకపోయినా), మనిషికి ఉన్న పెద్ద సమస్య అల్లా “సత్యాన్ని” ఆవిష్కరించడం. దానిని నిర్వచించుకోడానికి సరియైన పదాలని, ఎంచుకోవడం. సరియైన పదం దొరకనపుడు కొత్తపదాలని సృష్టించుకోవడం. వాటి పరిమితులు నిర్ణయించుకోవడం. ఇక్కడ తుప్పలూ డొంకలూ నరకడం, మొట్టమొదటి తరం వారు జ్ఞానమనే రహదారి ఏర్పరచడానికి పడే పాట్లు. మాటలనీ, ఆలోచనలనీ ఒక గాడిలో పెట్టి, తమకి తెలిసిన విజ్ఞానమనే విత్తు నాటాలి. దానికి ఉన్న అర్థాల పరిమితులను దడిలా గీసి చెప్పాలి. కొంతకాలంపోయిన తర్వాత పాతమాటలకి కొత్త అర్థాలు వస్తాయి. గాని, పాత వాటిని అర్థం చేసుకుందికి, పాత అర్థంలోనే వాటిని గ్రహించాలి తప్ప కొత్త అర్థాలతో అన్వయించకూడదు. అదే దడి కట్టడం. దేముడు ఎన్ని సందేశాలు చెప్పినా, మనిషి, తనకున్న పదసంపద పరిథిలోనే సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి. ఇంకెవ్వరూ వచ్చి సత్యాన్ని ఆవిష్కరించరు.