ఈ కథలో చాలా మంచి మెసేజి పెట్టాను, ఒకసారి చూడండి అని ఒక రచయిత మిత్రుడి మెయిలు. తరవాతెప్పుడో ఆ కథని ఒక జాలపత్రికలో ప్రకటించారు. అక్కడ “మెసేజి ఇవ్వాలని కథలు రాస్తూ ఉంటే ఇలాంటి కథలే వస్తాయి,” అని మరో రచయిత మిత్రుడి పుల్ల విరుపు వ్యాఖ్య. తరవాత ఆయనతో జరిపిన పరస్పర సంభాషణలో “మెసేజి ఇవ్వాలనుకుంటే వ్యాసం రాసుకోవాలి గానీ కథ రాయడం ఎందుకు?” అన్నారాయన. అంతే కాదు, “మంచి కథ జీవితాన్ని ప్రతిబింబించాలి.” అని కూడా చాలా ఘట్టిగా అభిప్రాయ పడ్డారాయన.తెలుగు కథా రచయితల్లో చాలా మందికి కథలో ఏదో ఒక సందేశం ఉండాలి అనే ఉద్దేశం ఉన్నది. ఊరికే ఉండడం కాదు, చాలా బలంగా ఉన్నది. నా మాట నమ్మనక్కర్లేదు. ఏ పత్రికనైనా, కథల సంకలనాన్నైనా మచ్చుకి చూడండి. దాదాపు ఎనభై శాతం కథలు ఏదో ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాయి. సంఖ్యలో తక్కువేమో గానీ పట్టుదలలో తక్కువ కాని వారు ప్రత్యర్ధి వర్గం వారు. వీరి వాదన ప్రకారం కథకుడు కహలోకి జొరబడ కూడదు. అనవసరపు వ్యాఖ్యానాలు చెయ్య కూడదు. ఇక సందేశాలా? శుద్ధ అనవసరం. వీరికి కథ అంటే, నిత్య స్రవంతిలా సాగుతున్న జీవితానికి పక్కన ఒక విడియో కేమెరా పెట్టి కొద్ది సేపు రికార్డు చేసిన ఒక షార్టు ఫిల్ము.ఈ రెండు వాదనలని గురించీ ఆలోచిస్తూ ఉంటే శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారివి ఓ రెండు కథలు గుర్తొచ్చాయి నాకు.
మొదటిది ‘మార్గదర్శి’. కేవలం “ఉద్యోగంలో చేరి చెడిపోకు, వ్యాపారం చేసి బాగు పడు” అనే ఒకే ఒక్క సందేశం ఇవ్వడం కోసం రాయబడిన కథ. 1928లో భారతి పత్రికలో తొలిసారి అచ్చయినప్పుడు ఎంత పొడుగుందో కానీ శ్రీపాదవారి కథల సంపుటిలో నేను చదివిన వెర్షను 55 పేజీల పొడుగుంది. దానికి తోడు ఒక పాత్ర ఏకధాటిగా చెప్పినట్లు ఒకే గొంతులో రాసుకొచ్చిన కథ. ఇలా ఈ కథ బాహ్య లక్షణాలన్నీ ఇక్కడ ఏకరువు పెడుతుంటే ఈ కథ అంటే భయమేస్తుంది. ముట్టుకో బుద్ధి కాదు.
నాకు గుర్తొచ్చిన రెండో కథ పేరు ‘గూడు మారిన కొత్తరికం’. తీరా చూస్తే ఇందులో ఏమీ కథ లేదు. అంటే, ప్లాటూ, ట్విస్టులూ, సస్పెన్సూ .. ఇలాంటివి. అసలు నిజానికి జరిగే పెద్ద సంఘటనా ఏవ్హీ లేదు. పైన చెప్పినట్టు ఏ మాత్రం వ్యాఖ్యానం లేని నిజజీవిత చిత్రణ అన్నమాట. అట్లాంటి దాన్ని 50 పేజీల కథ రాశారా? అయితే పరమ బోరు కొడ్తుందన్న మాట. టీవీలో డెయిలీ తెలుగు సీరియల్లాగా సాగదీసి వొదిలి పెట్టుంటారు – అనుకుంటామా, అనుకోమా?
ఈ రెండూ కూడా నాకు అమితంగా ఇష్టమైన కథలు. సంవత్సరానికి ఒకట్రెండు సార్లు ఈ కథలున్న సంపుటాల్ని బయటికి తీసి ఒక్కో కథా రెండు మూడు సార్లు చదువుకుంటాను. అంత ఇష్టం. అంటే, ఈ “సందేశం ఉండాలా వద్దా” అనే తక్కెడకి రెండు పళ్ళేల్లోనూ సమంగా తూగే రెండు కథల్నీ శ్రీపాదవారే రాసి చూపించారన్న మాట!
ఆయనే మార్గదర్శి కథలో, కథ చెబుతున్న శంభుశాస్త్రి నోట ఇలా పలికిస్తారొక చోట: “కథలంటే పైపైని ఉన్నాయనుకున్నావేమో? అవి కల్పించడానికి చాలా గొప్ప ప్రతిభ ఉండాలి. వాటి విలవ తెలుసుకోడాని కెంతా పరిజ్ఞానం ఉండాలి. అవి చెప్పడాని కెంతో నేర్పుండాలి. కథలు కళ్ళకి వెలుగిస్తాయి. బుద్ధికి పదును పెడతాయి మనస్సుకి ఉత్సాహమూ ఉల్లాసమూ కల్గిస్తాయి. జడునకున్నూ కల్పనా శక్తి ప్రతిపాదిస్తాయి.”
అట్లాంటి కథలున్నప్పుడు సందేశం ఉండాలా వద్దా అని వాదనెందుకు?
మనమూ కందాం అట్లాంటి కలల్ని, కథల్ని.
**** (*) ****
Credits:
1. ‘మార్గదర్శి’ కథ లింక్: కథానిలయం
కథకి సందేశమ్ ఉనా ఫరవాలేదు. లేకున్నా ఫరవాలేదు. కథ మాత్రం కథలాగే ఉండవలసిన అగత్యం ఎంతైనా ఉంది. మన తెలుగులో కథకుల సంగతి ఏమోకానీ.. పాఠకులకి మాత్రం కథలంటే కొన్ని దురభిప్రాయాలున్నట్లు నాకు చాలా సార్లు అనిపించింది. కథ సహజంగా లేదు. కథలో పాత్రల్ సహజంగా లేవు. కథ ముగుంపు సహజంగా లేదు. ఇలాంటి ఫిర్యాదులు మోత ఎత్తుతుంటాయి. కథ వాస్తవితకౌ అద్దం పట్టే విధంగా ఉండాలన్నదికూడా ఇంకొతమంది తప్పుడు అభిప్రాయం. కథ ప్రధాన లక్షణం కథనమే. అంశం ప్రస్తుతానికే చెంది ఉండనవసరంకూడా లేదు. సైన్సు ఫిక్షను కథలు అద్భితంగా ఉంటాయి.. కన్విన్సుంగా చెప్పగలిగితే. హాస్యం ప్రధానంగా పండించాలనుకొన్నప్పుడు అతిశయోక్తులు ఎలాగూ తప్పవు. ఇవన్నీ మంచి కథలు కాదంటే ఎలా! మంచి కథ కానిది ఏదంటే.. పనిగట్టుకొని సమాహానికి హితవుగాని.. చెరుపుచేసే అంశాలని ఉదాత్తంగా మలిచే ప్రయత్నంలొ రాసే కథ. ఇంకా చాలా విషయాలు ప్రస్తావనకు వస్తాయి.. ఈ కథల విషయంలో. పాతకలంనాటి కథలు చదువుతున్నా అందులొనూ కొన్ని అభ్యంతరకరమైన కథలు కనబడతాయి. మన దృష్టికి వచ్చేవి కొన్నే! కారణం .. ఆ రోజుల్లో సమాజంయుడల తమకోబాధ్యత ఉందని భావించే పత్రికలద్వారా మాత్రమే ఆ కథలు పాఠకులను చేరడడ్. ఇప్పుడు కథలకు.. పాఠకులకు మధ్య ఏ అడ్డుగోడా లేదు.. అంతర్జాలం మూలకంగా! అందుకే అన్ని రకాల లక్షణాలతో(అందులో మంచివీ ఉన్నాయి.. చెడ్డవీ ఉన్నాయి) సందడి చేస్తున్నాయి.
http://karlapalem-hanumantha-rao.blogspot.com/2015/08/blog-post_10.html
సాహిత్యసృజన ఎక్కడయినా జీవితానికి వ్యాఖ్యానం అని నా అభిప్రాయం … అది జరిగినవిషయాలగురించయితే చరిత్ర అవుతోంది. జరిగినట్టనిపిస్తే (Seeming)కథ అవుతోంది. అసలు కిటుకల్లా ఈ seeming లోనే ఉంది. కవిత్వంతో ఇలా నమ్మబలుకుతారనే ప్లేటో కవుల్ని తన రాజ్యంలోంచి బహిష్కరిస్తానన్నది. పురాణ కథనంగా ప్రారంభమైన కథ కవిత్వంతో తెగతెంపులు చేసుకుని తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంది గానీ, కవిత్వానికున్న అవలక్షణాలనయితే పోగొట్టుకోలేకపోయింది. బహుశా పోగొట్టుకోలేదేమో కూడా. దానికి బహుశా అంతర్లీనంగా మనకి మనిషి నైతిక ప్రవర్తన పట్ల ఉన్న Polarized view (If you so choose you may call it hypocritical view) కారణం కావొచ్చు. వ్యాఖ్యానం అని ఎప్పుడయితే అనుకున్నామో, వ్యాఖ్యాత తన దృష్టికోణంలోంచే ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తాడు. అది కవిత్వమైనా, కథ అయినా సిద్ధాంతమైనా. కవి / కథకుడు నమ్మిన సిద్ధాంతాన్ని/ సత్యాన్ని ఋజువుచెయ్యడానికి చూపించే ఉదాహరణలవంటివి. అయితే సత్యం ఉదాహరణలలో లేదు. కావ్యపరిధిలోగానీ, సిద్ధాంతాల పరిధిలోగాని జీవితసత్యం ఉండదు. కనుక స్థూలదృష్టితో చూసినపుడు కథకి (ఆ మాటకొస్తే సాహిత్యానికి) ఒక సందేశం ఉండడం అన్నది అవిభాజ్యం అయినప్పటికీ, దాన్ని ఎలా తీసుకోవాలన్నది, పాఠకుడికి కథకుడి ఆలోచనలతో ఉండే సామీప్యతనుబట్టి ఉంటుంది. మనకి నచ్చని సిద్ధాంతమైనా, చెప్పినతీరులో సబబు ఉన్నట్టు అనిపిస్తే, దాన్ని సూత్రప్రాయంగానైనా ఆమోదించడానికి ఇష్టపడడం పాఠకుడి పరిణతికి నిదర్శనం.
నాసి గారు,
మీరు ఎంచుకున్న కధలన్నిటినీ, రాయదల్చుకున్న వాళ్ళందరూ చదవాల్సిన సంకలనాలు తయారు చేసి పెట్టండి! Trio లాగా!
Uma
I do intend to write a book like that for Telugu short stories.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రెండు కథలను – ఒకదానికొకటి భిన్నంగా ఉన్నవాటిని – ప్రస్తావిస్తూ సందర్భోచితంగా మంచి గెస్ట్ ఎడిటోరియల్ రాసినందుకు అభినందనలు నారాయణ స్వామి గారూ. అందరూ అన్ని కథలను చదివి ఉండకపోవచ్చు కనుక, మంచి కథల పేర్లను ఇట్లా సూచించడం ఉపకారాన్నే చేస్తుంది. శ్రీపాద వారి ‘కలుపు మొక్కలు’ కథను చదివినప్పుడు కళ్లలో నీళ్లు నిండనివారుండరని నా అభిప్రాయం. అటువంటి మరెన్నో మంచి కథలు శ్రీపాద వారివి ఉన్నావాటిని మీరు సూచించకపోవడం ఇక్కడ సబబే. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన అంశాన్ని చర్చిస్తున్నప్పుడు దానికి సరిపడే విధంగానే references ను ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా చేయకపోతే అది పరిధిని అతిక్రమించడం కిందికి వస్తుంది.
నమస్కారం ఎలనాగ గారు. నా ఉద్దేశాన్ని గ్రహించారు. ధన్యుణ్ణి.