సాహిత్యం కొన్ని ప్రశ్నలకి సమాధానం, ఇంకొన్ని ప్రశ్నలకి జన్మస్థానం. ఆ పుట్టినవాటికి జవాబులు ఆ పుస్తకంలోనే దొరకక పోవచ్చు, ఎక్కడ, ఎలాగ దొరుకుతాయో ఆ వెతుకులాటని మొదలుపెట్టించటమూ సాహిత్యపు ఒక సల్లక్షణం.
ఈ కథని రెండు విధాలుగా అర్థం, అపార్థం చేసుకోవచ్చు. ఒకటి స్త్రీవాదపరంగా, మరొకటి నైతికనిబంధనల పరంగా. ఈ రెండింటినీ కలిపినా సరిపోదు , అది మనిషితనం తోనే సాధ్యం. వ్యక్తి వ్యక్తికీ మారే స్వభావమూ అది మారటం కష్టమని తెలుసుకోవటమూ , అపరాధాలు జరగటమూ వాటిని అర్థం చేసుకోగలగటమూ ఇదంతా నేర్పుతుంది ఈ నవల. యుద్ధంలో సర్వతోభద్రవ్యూహం ఏదీ ఉండదు, కాని ఎడాపెడా తగలగల దెబ్బలని కళ్లు తెరిచి కాచుకోవటం ఒక మెలకువ. తగిలితే ఓర్చుకోవటం ఒక సత్తువ. అన్నిటినీ అవతల ఆపే కంచెకివతల విడిది చేయటం సాధన. ఇది ఎవరికి వారు చేసుకోవలసిన మేలు, ఈ పుస్తకం దానికి సహాయం చేస్తుంది.
ఈ నవలాకాలం అరవైల చివరలు, డెబ్భయిల మొదళ్లు. చదువుకుని ప్రేమించి ఇల్లాలయిన ఒక స్త్రీ, ఆమె భగ్నత, బండబారినతనం, దాని పర్యవసానం. ఈ పక్కనుంచి ఇంకొకరు,ఆమె దాటిన వైఫల్యాలు. వీరి చుట్టూరా యువతీయువకులు, వారి వలపులూ వాదనలు ,అప్పటి మధురమైన హిందీ పాటలు, చెదురుతున్న ఆదర్శాలూ, నక్సల్బరీ నీడలు …ఈ నాగరికవాతావరణాన్నంతా రికార్డ్ చేశారు రచయిత్రి. నాయికలలో ఒకరైన శారద తనకి తగిలిన అఘాతాన్ని మరచిపోదు, తప్పు చేసిన భర్తని క్షమించదు. ఇంకొక నాయిక లీల వివాహాన్ని పండితుడైన ఆమె తండ్రి అస్తవ్యస్తం చేస్తాడు. అతను సాధించలేని సెలిబసీ ని ఆమెకి ఆదర్శంగా నిలుపుతాడు. ఆమె నలుగుతుంది, నాశనమవదు. చివర అనదగిన ఒక స్థిమితంలో చాలామందికి కావలసినదవుతుంది.
స్త్రీ ప్రపంచాన్ని మార్చేసిన గొప్ప విజ్ఞానం కుటుంబాన్ని నియంత్రించుకోగలగటం. అది సార్వత్రికం అయ్యీ కాని రోజుల అయోమయం ఒకవైపున ఈ కథలో. ఇంకొక విషయం స్త్రీపురుషుల మధ్య ఉన్న దేహధర్మపు తేడాలు. బ్రహ్మచర్యం, నిగ్రహం స్వతహాగా మగవాడికి ఎక్కువ కష్టం అని లోగొంతులో చెబుతారు రచయిత్రి. ఈ దేశం ఏకపత్నీవ్రతం ఒక ఘనత అయే స్థితిలోనే అనాదిగా ఉంది. తన చేతిలో లేని గర్భధారణవలన స్త్రీకి తన భర్తతో ఎడం లేకుండా ఉండగలిగే పరిస్థితి లేదు . వివాహేతర సంబంధాలు, అందుకోసం కేటాయించబడిన కొందరు స్త్రీలు…ఇవి గడిచిన కాలపు చీకటిమూలలు. స్త్రీ తన భర్తని తప్పు పట్టగలగటమూ అప్పుడు ఊహాతీతం. కథాకాలం నాటికి విద్యావంతులూ కొంత సంపన్నులూ అయినవారిలో కొత్త నీతిసూత్రాలు ప్రవేశించాయి. 1955 లో వచ్చిన హిందూ వివాహ చట్టం సంఘం లో స్థిరపడింది. ఇప్పుడు స్త్రీ భర్తని తప్పు పట్టగలదు, అతను తలవంచుకోవలసిందే. అయితే ఈ తప్పు ఎందుకు జరిగింది?
శారద మనసు ఇద్దరు పిల్లలు కలిగాక మరొక గర్భస్రావం జరగటంతో అలజడికి లోనవుతుంది. ‘ ఏమిటిదంతా? ‘ అనే వైరాగ్యం మొదలయి భర్తకి దైహికంగా దూరమవుతుంది. తాను వదిలేసిన చదువుని మళ్లీ మొదలుపెట్టి సంతృప్తిని వెతుక్కుంటుంది. సమాజానికి ఉపయోగపడాలని ప్రయత్నిస్తుంది . భర్త, పిల్లలు, సంసారం…ఇవి ఒక్కసారిగా చాలవనిపిస్తుంది. సరిగ్గా ఇక్కడ పెద్దవారి కౌన్సిలింగ్ కాపాడి ఉండవచ్చు. కాని ఈ చదువుకున్న స్త్రీ , తన మేధోస్థాయి తన తల్లికంటె వేరయిన స్త్రీ కామన్ సెన్స్ ని మర్చిపోతుంది. యథాలాపంగా తల్లినుంచి పిల్లకి అందుతూ వస్తున్న జ్ఞానం ఈ అంతరువు ని దాటలేకపోతుంది అరవింద గారు ఇంకా కొన్ని రచనలలోనూ ఈ అస్తిత్వపు ఊగిసలాటని రాస్తారు.
ఆ సంక్షోభాన్ని భర్త, ప్రభు గుర్తు పట్టలేకపోతాడు. అతని పెంపకం లో అది లేదు, భర్త అనే మూసలోనూ ఉండదు, అతని స్వభావం , పరిణతి తెలుసుకునేటంతటివి కావు. . కాని అనిపిస్తుంది చదువుతుంటే, అతనికి తెలిసేలాగ శారద చెప్పిఉంటే బాగుండేదని. ఏ బంధం లో అయినా ఎక్కువ వివేకం ఉన్న భాగస్వామికే బాధ్యత ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఏమయినా ఆ మాత్రం దూరాన్ని తట్టుకోగలిగే శక్తి తమ అనుబంధానికి ఉందనే అనుకుంటుంది ఆమె. కా ని అతను దుర్బలుడు, భార్యకి చెల్లెలి వరస అయిన అమ్మాయితో అనుచితంగా ప్రవర్తిస్తాడు. ఆలోచించి పరిష్కారం వెతికే వ్యవధి ఇవ్వకుండా ఆ చెల్లెలు ఆత్మహత్య చేసుకోవటం శారదని శాశ్వతంగా పగలగొడుతుంది.
శారదకి తెలిసిపోయాక ప్రభు అంటాడు ‘’అప్పుడు నువ్వు తలనొప్పిగా ఉందన్నావు ” అని. ఆమె కంపించిపోతుంది ” ఆ మాట అనకు, రాణి అంటే నాకు ప్రేమ, తను లేకుండా బతకలేను అని చెప్పు ” అంటుంది. ఈ ఒక్క సన్నివేశం తో వారిద్దరి స్వభావాల మధ్య ఉన్న తేడా ని స్పష్టం చేస్తారు రచయిత్రి. ఇలా భిన్నమైన మానసిక, నైతిక పరిధు లలో ఉన్న మనుషుల మధ్య అనుబంధం బతికి బట్ట కట్టాలంటే ఆ స్థాయీభేదాన్ని త్వరగా గుర్తు పట్టటం అవసరం.
లీల కి వేదాంతం, నిగ్రహం బోధిస్తూ ఉంటాడు తండ్రి . అతి సాధారణుడైన ఆమె భర్త మరొక పెళ్లి చేసుకుంటాడు. ఇటువైపున రాకూడని వయసులో వచ్చిన గర్భం వల్ల తల్లి మరణిస్తుంది.అంత భయంకరమైన వైరుధ్యాన్ని మింగటానికి చేసిన ప్రయత్నం లో లీల ఎదుగుతూ వస్తుంది. ఒక బదిలీ తో శారద , ప్రభు ల ఇంటిలో ప్రవేశిస్తుంది. ఆమె పుస్తకాలలో శారద చూసినవి గీత, హెరాల్డ్ రాబిన్స్, అమృతం కురిసిన రాత్రి. విలక్షణమైన మేళవింపు.
తాను కాలేని దేన్నో శారద ఆమెలో గుర్తు పడుతుంది. లీల నిబ్బరించుకోగలదు, క్షమించగలదు, ప్రేమించటం మానేయకుండా ఉండగలదు
ఈ నవలలో శారదకి కాన్సర్ రావటం ఒకటే నాటకీయం అనిపిస్తుంది. అంతకాలం గడిచాక తన కాలం తీరిపోబోతుంటే, శారద భర్తని మన్నించి దగ్గరికి తీసుకుంటుంది.ఆమె మరణించాక ప్రభు విదేశం వెళ్లిపోతాడు, తన పిల్లలనీ, ఇంటినీ లీలకి అప్పజెప్పి.
లీల భర్త కి మరొక పెళ్లివల్ల కలిగిన పాపనీ తెచ్చుకుంటుంది , ఆ పాప తల్లీ పోయాక. తనపిల్లలు కాని ముగ్గురిని పెంచుతూ నిలిచిపోతుంది. అందులో ప్రత్యేకమయిన త్యాగాన్ని దేన్నీ రచయిత్రి స్ఫురింపజేయరు, అది ఆమెకి సహజం. ఆ ముగ్గురు పిల్లలూ ఆడుకుంటూ ఉండటాన్ని కిటికీ లోంచి లీల చూస్తూ ఉండటం తో నవల మొదలయి వెనక్కి వెళ్లివచ్చి తిరిగి అక్కడ ఆగుతుంది.
ఆ కాలాని కంటె ఎన్నో వెసులుబాటులున్న ఇప్పటి రోజులలోనూ స్త్రీపురుష సంబంధాలు చాలా సందర్భాలలో గందరగోళంగా ఎందుకు ఉంటున్నాయి? సహజీవనం కోసం ఎవరి వంతు ఎంత? స్త్రీకి కుటుంబానికి అవతలి జీవితం ఉండితీరాలా? నియమించుకోగలిగినవాటికి నిర్లక్ష్యపు స్వేఛ్చ ఇస్తే ? ప్రేమ కోసం ఏవో వదిలేసుకున్నాక , ఎంత వ్యాకులత లోనయినా ” ఇన్ని చేశాను ” అనుకోవచ్చునా? ఒకరికే కట్టుబడి ఉండటం సంక్లిష్టతలని తగ్గిస్తుందా? ఇన్ని ప్రశ్నలకీ ఇంకా చాలావాటికీ జవాబులు ఈ నవలలో, దానినుంచి చేసిన ప్రయాణం లో నాకు దొరికాయి . గడిచిన ముప్ఫయియేళ్లుగా వేర్వేరు స్థితులలో చదివాను, ప్రతిసారీ ఒక్కొక్క ఆవిష్కారం నావరకు.
[విజయవాడ ఎమెస్కో వారు మళ్లీ వేసిన నవల ఇప్పుడు దొరుకుతోంది.]
మైథిలి గారు! చాల గొప్ప విశ్లేషణ చేసారు.
ఈ నవల గురుంచి FB లో నేను రాసిన పోస్ట్ “ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న ఈ నవలకోసం…పేరాండి ఇదిగో చెప్పేస్తున్నా!” అవతలిగట్టు …అరవింద గారిది”1973 లో ఆంధ్రప్రభలో సీరియల్గా చిన్నప్పడు చదివాను. తర్వాత నవలగా వచ్చినా అది నాకు అంది అందకుండాపోయింది.ఈవాళ’ఎన్టీఆర్ స్టేడియం లో ఒక అద్భుతప్రపంచం లోకి వెళ్ళాను. ఎక్కడచూసిన బుక్ స్టాల్స్ కళ్ళనిండుగా చూసుకొంటూ తిరిగాను.ఉపవాసం అయిన్గాని నాకు నీరసంరాలేదుఅసలు ఆ సంగతే మరచి పోయాను. ఇంతలోమా అమ్మాయి “అమ్మ ఇదిగో నువ్వు వెతుకుతున్న పుస్తకం” అని అప్పటికప్పుడు నాకు కొని ఇచ్చింది. ఇదిగో చదవడం మొదలుపెట్టాను…..మిగతాది చదివినతరువాత. చాలామంది చదివేవుంటారు. కాని కొన్ని ఎప్పటికీ అప్పుడే మొదటసారి చదువుతున్నట్లే అనిపిస్తుంది”
మీరు చెప్పినట్లుగా ఆ నవల చదివిన వెంటనే చెప్పకుండా నేను నా స్పందన ను దాచుకొన్నాను. ఇది గో మీ ఆర్టికల్ చదివి ఇప్పుడు. చెబుతున్నాను. శారద కూడా అతి సాధరణ స్త్రీ యే! కాని కొన్ని సంఘటనలు తన జీవితం లో ఎదురైనప్పుడు తను పడే సంఘర్షణ తట్టుకో లేక తనకు తనే ఆహుతైపోతుంది ,శారద అంతరంగాన్ని,ఆమె లోలోపల మనసుని చాల బాగా ఆవిష్కరించారు అరవింద గారు. ప్రతిసారీ ఒక్కొక్క ఆవిష్కారం నావరకు ఈ మాట నిజం. నాకు కూడా అలాగే అనిపించింది.
మీ విశ్లేషణ ఎప్పటిలానే అద్బుతంగా ఉంది అండి. మీ రివ్యూ చదువుతుంటే …మాలతి చందూర్ గారు గుర్తోచారు. ఈ లీల పాత్ర ఇంటరెస్టింగ్ గా ఉంది చదువుతుంటే. అమృతం కురిసిన రాత్రి అండ్ హారొల్ద్ రోబ్బిన్స్ ..నిజంగా (తమాషా) విలక్షణమైన మేలవిమ్పే. ఇంత మంచి కథని, ఇంత మంచి విశ్లేషణతో ..ఈ కాలమ్ ద్వారా పరిచయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు.
మైథిలి గారూ,
విజయవాడ బుక్ ఫేర్ కి వెళుతున్నాను. తప్పకుండా కొనుక్కుని చదువుతాను. యుగయుగాలనుండీ స్త్రీ నలుగుతూనే ఉంది. ‘నలిగితే నలిగిందిలే నాశనం అవకుండా’ అని మనమూ సరిపెట్టుకుంటున్నాం. స్త్రీ ఆత్మవిశ్వాసం, వివేకం, విచక్షణ కలిగి ఉంటే ఈ నలగడాలు నాశనమవడాలు ఉండవు కదా అనిపిస్తుంది నాకు. మీరేమంటారు?
చాలా ప్రశ్నలకి జవాబు ఇచ్చే నవలే – తెలుస్తుంది మీ విశ్లేషణలోనే.
మీకు నా హృదయపూర్వక అభినందనలు & నూతన సంవత్సర శుభాకాంక్షలు
రాధ
నేను కూడా చదివాను. ఆలోచనల్లో వైశాల్యాన్ని పెంచేనవల. మీరు ఈ నవలను ఎంచుకుని రాయడం చాల సంతోషంగా ఉంది. మంచి రివ్యూ!
మైథిలి గారు నమస్కారములు. 60 ,70, 80 లలో విపరీతముగా అన్ని చదివీవాడిని. తప్పక చదివి వుంటాను. కాని మీ వర్ణాన్, విశ్లీషణ అమూగము, అద్వితీయము. పూర్థ్య్గా నవల చదివిన అనుభూథిని కలగించారు. తప్పక కొని చదువుతాను.మరో సారి మీకు ధన్యవాదాలు.
బాగుంది. కొన్ని నవలలలు మంచి మనసున్న మనుషులు. మీరన్నట్టు ఎన్ని సార్లు చదివినా, మరెన్నో ఎన్నో అర్ధం కావలసిన విషాలు మిగిలే వుంటాయి. ఈ పుస్తకాన్ని దొరకబుచ్చుకుని నేనూ చdaవాలి. మీ విశ్లేషణ గురించి ఎం చెప్పినా తక్కువే. అంత బావుంది మైథిలి గారు!
శుభాభినంద నలతో
నేను ఈ పుస్తకం చదవలేదు.. కానీ అర్జెంటు గా చదవాలి అనేట్టు ఉంది రివ్యూ ..ఆ కాలాని కంటె ఎన్నో వెసులుబాటులున్న ఇప్పటి రోజులలోనూ స్త్రీపురుష సంబంధాలు చాలా సందర్భాలలో గందరగోళంగా ఎందుకు ఉంటున్నాయి? సహజీవనం కోసం ఎవరి వంతు ఎంత? స్త్రీకి కుటుంబానికి అవతలి జీవితం ఉండితీరాలా? నియమించుకోగలిగినవాటికి నిర్లక్ష్యపు స్వేఛ్చ ఇస్తే ? ప్రేమ కోసం ఏవో వదిలేసుకున్నాక , ఎంత వ్యాకులత లోనయినా ” ఇన్ని చేశాను ” అనుకోవచ్చునా? ఒకరికే కట్టుబడి ఉండటం సంక్లిష్టతలని తగ్గిస్తుందా?– ఈ ప్రశ్నలకి , సంతృప్తి కరమైన సమాధానం ఏ ఒక్క పుస్తకం అయినా ఇస్తుందని నేను అనుకోను గానీ.. కొన్నితికన్నా ముఖ్యంగా గందరగోళం లో ఎవరి పాత్ర ఎంత అనేది .. తెలుసుకోవటానికి అయినా చదవాలి తప్పకుండా .. థేంక్ యు మైథిలి గారూ
అతి తక్కువ రాసి ఎక్కువ పేరు తెచ్చుకున్న రచయిత్రి అరవింద గారు. అవతలి గట్టు నవల మీద మీ విశ్లెషణ బాగుంది.
13 ఏళ్ళ క్రితం అనుకోకుండా జమ్షెడ్ పూర్ వెళ్ళినప్పుడు అరవిందగారిని కలిసే భాగ్యం కలిగింది నాకు. వారి జలసూర్య నవలకూడా నాకు చాలా చాలా ఇష్టం. – గొరుసు
మేడం, మీకు వీలయితే కకుభ గారి జీవితం ఏమిటి?, చివుకుల పురుషోత్తం గారి ఏది పాపం? నవలలు కూడా అన్వేషించి పరిచయం చేయండి. ఈ రెండూ అవతలి గట్టు తర్వాత 1975 – 76 ప్రాంతాల్లో అంధ్రప్రభ లో వచ్చిన సీరియల్ నవలలే – గొరుసు
ధన్యవాదాలు మణి వడ్లమాని గారూ, సురేష్ వెంకట్. రాధ గారూ, అవును నిజమే. అపర్ణ గారూ, భూప్ రాయల్ గారూ దమయంతి గారూ ధన్యవాదాలు. సాయి పద్మ గారూ అన్ని జవాబులూ నవలలోనే కాదు, దానిలోంచి చేసిన ప్రయాణం లో కూడా. గొరుసు గారూ థాంక్ యూ అండీ. అవతలిగట్టు 1983 లో పుస్తకరూపం లో చదివాను. జీవితం ఏమిటి సీరియల్ ని బైండ్ చేసిన పుస్తకం చదివాను మా ఇంట్లోనే. చాలా వరకు బావుంటుంది, కాని మలుపులు, ముగింపు నాకు మరీ డార్క్ గా అనిపిస్తాయి. ఏది పాపం విషయం లో రాసేందుకు చాలానే ఇబ్బంది ఉంది నాకు.
మైథిలి గారూ ఏదిపాపం నవల విషయం లో మీ ఇబ్బంది అర్థం చేసుకోగలను. వీలయితే తాత్విక కోణం నుంచి రాసే ప్రయత్నం చేయండి. మరీ ఇబ్బంది అనుకుంటే వద్దు. జీవితం ఏమిటి భిన్నమయిన నవలే . సినీ జనారణ్యం , పాక్డురాళ్ళు, మహానటి లాంటి సినిమా నవలలు వచ్చినా అవన్నీ కథానాయిక వైపు నుండి రాసినవి. ఈ నవల హీరో భార్య వైపునుండి రాసింది అనుకుంటా . చదివి 40 ఏళ్ళు కావస్తోంది .. ఎందుకో అప్పటి నా వయసుకు బాగా హత్తుకున్న నవల. అదే క్రమంలో జి. ఎన్.సూరి సిస్టర్ సుజాత నవల కూడా నాకు ఇష్టం.
మీ ప్రత్యుత్తరానికి ధన్యవాదాలు మేడం . – గొరుసు
ఇది ఆంధ్రప్రభలో సీరియల్ గా వచ్చిందాండీ?
మీ విశ్లేషణ బాగున్నది.
థాంక్ యూ అండీ. అవును, వచ్చిందట